31, డిసెంబర్ 2019, మంగళవారం

పతిత పావనుడు


మనం తిరుపతి వెళితే ఎక్కడ చూసినా 'ధర్మో రక్షతి రక్షితః' అనే వాక్యం కనిపిస్తూ ఉంటుంది. ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మబద్ధంగా జీవించినవారిని ఆ ధర్మమే రక్షిస్తుంది అని దీని భావం కదా. కొంతమంది దీనినే కొద్దిగా మార్చి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశ్యంలో 'వృక్షో రక్షతి రక్షితః' అని కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇక్కడ ధర్మానికి వృక్షానికి మధ్య ఒక వ్యత్యాసం ఉంది. ధర్మం తనను ఆచరించినవాడిని, రక్షించినవాడిని మాత్రమే రక్షిస్తుందేమో కానీ వృక్షం తనకు రోజూ నీరుపోసి పోషించినవాడినే కాక తనను హింసించి నరికివేయాలని వచ్చినవాడిని కూడా ఆదరించి చల్లని నీడను, ఫలపుష్పాదులను అందిస్తుంది. అది తన వద్దకు వచ్చిన వారిపట్ల ఎటువంటి భేదభావాన్ని చూపించదు.

భగవంతుడు కూడా ఈ వృక్షంలాంటి వాడే. ఆయన పతితపావనుడు. చక్కగా తన ధర్మాన్ని ఆచరిస్తూ, లోకోపకారిగా ధార్మిక జీవనం గడిపేవాడిని ఎలా చేరదీసి ఉద్ధరిస్తాడో, ధర్మాధర్మ విచక్షణ లేక తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ పతితుడైపోయిన వాడిని కూడా అంతకంటే ఎక్కువ ప్రేమతో చేరదీసి ఉద్ధరిస్తాడు. నిజానికి ధర్మపరుడికంటే పతితుడే ఆయనయొక్క ప్రేమకు, సహచర్యానికి ఎక్కువగా నోచుకుంటాడేమో. తల్లికి తన పిల్లలందరిపైనా ఒకే రకమైన ప్రేమ ఉన్నా కూడా చక్కగా వృద్ధిలోకి వచ్చిన పిల్లవాడికంటే ఎందుకూ పనికిరాని పిల్లవాడి పట్ల  ఇంకా ఎక్కువ బాధ్యత, ఆసక్తి చూపిస్తుంది కదా!

సంపూర్ణంగా ఆరోగ్యంతో ఉన్నవాడు తన దగ్గరకు వస్తే వైద్యుడు ఊరికే రెండు నిముషాలు చూసి పంపించేస్తాడు. రోగి ఎంత ఎక్కువ అనారోగ్యంతో బాధపడే వాడైతే  వైద్యుడు ఆ రోగితో అంత ఎక్కువ సమయం గడుపుతాడు కదా. అలాగే ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలో బాగా చదువుతూ, చెప్పినవన్నీ చక్కగా అర్థం చేసుకుంటూ మంచి మార్కులు తెచ్చుకునే విద్యార్థిని చూసి సంతోషిస్తాడే కానీ రోజులో తన సమయాన్ని ఎక్కువగా ఎవరికి కేటాయిస్తాడు? మందబుద్ధియైన విద్యార్ధికే కదా. రజకుడు శుభ్రంగా ఉన్న వస్త్రాన్ని ఊరికే పిండి ఆరేస్తాడు, కానీ బాగా మురికిపట్టి ఉన్న వస్త్రాన్ని ఎంతోసేపు కష్టపడి ఉతుకుతాడు కదా. భగవంతుడి ముఖ్య కర్తవ్యం కూడా అదే. భక్తుడు, జ్ఞాని అయినవాడు ఎలాగైనా తన దగ్గరకే చేరుతాడు. కానీ తనను తెలుసుకోలేక, అసలు గుర్తించక అధోగతి పాలయ్యే వాడికోసమే ఆయన ఎక్కువ సమయం కేటాయిస్తాడు. 

అప్పటికే తనకు పెద్ద రోగం ఉందని పరీక్షల ద్వారా నిర్ధారించుకొని స్పెషలిష్టు డాక్టర్ దగ్గరకు వెళ్లిన రోగి ఆయన ఇచ్చిన మందులు చక్కగా వాడి, చెప్పిన పథ్యం పాటించి క్రమశిక్షణతో తన రోగాన్ని నయం చేసుకుంటాడు. కానీ తనకొక రోగం ఉందనే విషయం కూడా తెలియకుండా తన ఇంటిలో తాను స్వేఛ్చగా బ్రతికేస్తున్నవాడిపై ప్రేమతో ఆ ఇంటి ఫ్యామిలీ డాక్టర్ మాటిమాటికీ ఇంటికి వస్తూ, అతనికి పథ్యం చెబుతూ, తగిన మందులిస్తూ, అతను రోగం విషయం తెలియక తన వైద్యాన్ని శ్రద్ధతో పాటించకపోయినా, తన మాట వినకపోయినా ఏమాత్రం విసుగు లేకుండా అతనికి పూర్తి స్వస్థత చేకూరే వరకు తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు.

సరిగ్గా అటువంటి ప్రేమమూర్తే భగవంతుడు. తమకు భవమనే రోగం ఉన్నదని తెలుసుకోలేక, అసలు భగవంతుని గుర్తించక, ఒకవేళ గుర్తించినా శాస్త్ర, లోక వాసనలతో కొన్ని కొన్ని మూఢాచారాలకు అలవాటుపడి, వాటిని పాటించడమే భగవంతుని ఆరాధనగా పొరబడుతూ, కులమత దురహంకారాలతో సాటి మానవులలోని భగవంతుని చూడలేక, వారిపట్ల దారుణమైన వివక్షను చూపుతూ, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగలేక పతితులైపోతున్న మానవాళిని ఉద్ధరించడానికి మాటిమాటికి ఎందరో గురువుల, మహాత్ముల రూపంలో అవతరిస్తూ, ఆ పతితుల మధ్యలోనే నివసిస్తూ, వారి ఇండ్లలో తిరుగుతూ, తింటూ, వారిలో ఒకరిగా ఉంటూ మెల్లమెల్లగా వారిలో పరివర్తన కలిగించి నిజమైన ఆధ్యాత్మిక మనోవికాసాన్ని కలిగించి వారిని ఉద్ధరించడానికే తన అవతార కాలాన్నంతా ధారపోసే పతితపావనుడు భగవంతుడు. ఇందుకు ఉదాహరణలు సమర్థ సద్గురు శ్రీశ్రీశ్రీ హనుమత్ కాళీ వర ప్రసాద బాబూజీ మహారాజ్ వారి దివ్య చరిత్రలో కోకొల్లలుగా కనిపిస్తాయి. మన జీవిత సర్వస్వాన్ని వారి పాదాలచెంత ధారపోసినా వారి రుణంలో లక్షోవంతు కూడా తీర్చుకోవటం అసాధ్యం.

6, నవంబర్ 2019, బుధవారం

చిల్లుల కుండ

నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం
జ్ఞానం యస్య తు చక్షురాది కరణద్వారా బహిస్పన్దతే
జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ 
తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

ఒక చీకటి గదిలో ఒక కుండ ఉన్నదనుకోండి. దానిమీద రకరకాల జంతువుల, పక్షుల ఆకారాలలో చిల్లులు చెక్కబడి ఉన్నాయి. అందులో ఒక దీపం వెలిగించబడి ఉంది. ఇప్పుడు మీరు ఆ కుండని చూస్తే మీకు వెలుగుతున్న ఏనుగు, జింక, నెమలి ఇలా రకరకాల ఆకారాలు కనిపిస్తాయి. అయితే నిజానికి వెలుగుతున్నది లోపల ఉన్న దీపమే కానీ అక్కడ ఎటువంటి వెలిగే జంతువులూ లేవు. ఒక గదిలో దీపం వెలిగిస్తే  ఆ వెలుగు గది అంతా నిండిపోతుంది తప్ప ఆ దీపపు వెలుగుకు ఏ ఆకారం ఉండదు. కానీ ఇక్కడ మనకు అదే వెలుగు రకరకాల ఆకారాలతో కనిపిస్తోంది. నిరాకారమైన వెలుగు ఇలా వివిధ ఆకారాలలో కనిపించడానికి కారణం ఏమిటి? ఆ కారణం కుండలోని చిల్లులే. నిజానికి అక్కడ ఏ చిల్లులు లేని కుండ ఉంటే అసలు వెలుగే బయటకు రాదు.

మట్టితో చేయబడి నిండుగా ఉండవలసిన కుండలో ఏనుగు ఆకారంలో ఒక భాగం తీసివేయబడింది. అలాగే వివిధ ఇతర జంతువుల ఆకారాలలో కుండ భాగాలు తీసివేయబడ్డాయి. అలా ఏమీ లేని చోట్లనుండి మనకు ఆయా ఆకారాలలో కాంతి ఉన్నట్లుగా కనిపిస్తోంది. లేనిది ఉన్నట్లుగా కనిపించడాన్నే మాయ అంటాం కదా! ఇలాగే మన శరీరంలో కూడా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అనే చిల్లులు ఉండటంతో మనలోని జ్ఞాన దీపపు ప్రకాశం ఆ యా ఇంద్రియాల ద్వారా బయటకు వెలువడుతోంది. కుండలోని చిల్లులకు స్వయం ప్రకాశం లేనట్లే ఈ ఇంద్రియాలకు కూడా స్వయం సత్తా లేదు. లోపలి జ్యోతి ఆరిపోతే ఇవి ఎందుకూ పనికిరావు.

ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే గదిలో మనకు వెలుగుతున్న జంతువులు ఉన్నాయన్న భ్రమ కలగాలంటే మనం ఆ గదిలోకి వెళ్ళేసరికే అందులో చిల్లుల కుండ, దానిలో వెలిగే జ్యోతీ రెండూ ఉండాలి. ఇదే విషయాన్ని గీతాచార్యుడు ఇలా వివరిస్తున్నాడు:

ప్రకృతిం పురుషం చైవ విధ్యనాదీ ఉభావపి| 
వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్|| 

పురుషః ప్రకృతిస్థోహి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్|  
కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మసు|| 
(భ.గీ 13-20,21)

ప్రకృతీ, పురుషుడూ ఇద్దరూ అనాదిగా ఉన్నవారే. అయితే పురుషుడికి ఏ వికారాలూ లేవుగానీ మనకు కనిపించే ఈ ఆకారవికారాలన్నీ ప్రకృతిలోని గుణాలవల్ల ఏర్పడుతున్నాయి. అంటే పైన మనం చెప్పుకున్న ఉదాహరణలో కుండ, దీపము రెండూ మొదటినుంచీ ఆ గదిలో ఉన్నాయి. దీపపు కాంతికి ఎటువంటి ఆకారవికారాలు లేవుగాని ఆ కనిపించే వివిధ జంతువుల ఆకారాలన్నీ కుండలోని చిల్లులవలన ఏర్పడుతున్నాయి. ఇంకా ఈ పురుషుడు, ప్రకృతి విడివిడిగా ఉంటే ఎటువంటి ఆకారాలు కనపడవు. దీపం కుండలోపల లేకుండా విడిగా ఉంటే మనకు ఆ వెలుగుతున్న జంతువులు కనబడవు కదా! అలాగే ఆ దీపపు కాంతి కుండలోని చిల్లులగుండా ప్రసరించకపోతే ఆ కాంతికి కూడా ఏ ఆకారమూ ఉండదు. 

అంటే కాంతికి కుండలోని చిల్లులతో ఏర్పడిన సంగం వలన అది ఆకారవికారాలను పొందినట్లుగా కనిపిస్తోందన్నమాట. అదే పైన చెప్పిన రెండో శ్లోకంలో భగవానుడు వివరిస్తున్నాడు. పురుషుడు ప్రకృతిలోనే ఉన్నాడు. అలా ఉంటూ ఆ ప్రకృతియొక్క గుణాలను తనవిగా అనుభవిస్తున్నాడు. దీనికి కారణం అతనికి మంచి చెడు జన్మలయందు ఆ యా గుణాలతో ఏర్పడిన సంగమే.

మనం కుండను బయటినుంచి చూసినంతసేపూ మనకు ఈ వెలిగే ఆకారాలు కనిపిస్తూనే ఉంటాయి. అదే మనం ఆ కుండ లోపలికి వెళ్ళి అసలు జ్యోతిని దర్శించామంటే మనకు అంతటా నిండివున్న ఆ నిరాకారమైన వెలుగే కనిపిస్తుంది కానీ ఇక అక్కడ ఎటువంటి ఆకారవికారాలకు తావుండదు. అలాగే మనం ఈ ప్రకృతిని బయటనుండి చూడటం మాని మన లోపలికి మనం ధ్యానం ద్వారా ప్రయాణించి ఆ లోపలి జ్ఞానజ్యోతిని దర్శించామంటే ఇక మనకు ఈ ప్రకృతిలోని ఆకారవికారాల స్పృహే ఉండదు. అట్టి స్థితిని సాధించేవరకు మనం మన సాధనను దక్షిణామూర్తియైన ఆ గురుమూర్తి పర్యవేక్షణలో కొనసాగించవలసిందే.

27, ఆగస్టు 2019, మంగళవారం

అద్దాల గది

ఒకచోట ఒక అద్దాల గది ఉంది. ఆ గది గోడలన్నీ రకరకాల అద్దాలతో చేసినవే. ఒక అద్దం మనను పొడవుగా చూపిస్తే, ఇంకొకటి పొట్టిగా చూపిస్తుంది. ఒకటి లావుగా చూపిస్తే, ఇంకొకటి సన్నగా చూపిస్తుంది. ఒకటి వికృతంగా చూపిస్తే ఇంకొకటి తలక్రిందులుగా చూపిస్తుంది. ఇలాంటి గదిలోకి ఒక కుక్క ప్రవేశించింది. ఎటు చూసినా రకరకాల ఆకారాలలో అనేక కుక్కలు కనిపించాయి. భయమేసి గట్టిగా మొరిగింది. ప్రతిగా అవికూడా మొరిగాయి. తాను బయటకు తప్పించుకునే మార్గం కనపడలేదు. ఇక తెగించి ఆ కుక్కలపై దాడిచేసి ఆ అద్దాలన్నింటిని పగులగొట్టేస్తుంది.

అదే గదిలోకి ఒక చిన్న పిల్లవాడు ప్రవేశించాడనుకోండి. అందులో రకరకాలైన విచిత్ర ఆకృతులలో కనబడుతున్న తన రూపాన్నే చూసుకొని, ఒకసారి సంతోషానికి, ఒకసారి విషాదానికి, భయానికి, కోపానికి ఇలా రకరకాల భావోద్వేగాలకు గురవుతాడు. పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి తనను ఇక్కడినుండి తప్పిస్తే బాగుండును అని ఆరాటపడతాడు. అదే బుద్ధి వికసించిన ఒక పెద్దమనిషి ప్రవేశించాడనుకోండి. ఏంచేస్తాడు? ఎటువంటి మనోవికారానికి లోనుకాకుండా, తననే వివిధ రూపాలలో చూపిస్తున్న ఆ అద్దాల ప్రతిభను మెచ్చుకుంటూ, తన ఇష్టం ఉన్నంతసేపు అక్కడ ఆనందంగా గడిపి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తలుపు తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు.

మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం కూడా ఈ అద్దాల గదిలాంటిదే. అందులో మనకు మిత్రులుగా, శతృవులుగా, బంధువులుగా, తెలియనివారిగా, పక్షులుగా, జంతువులుగా, వృక్షాలుగా, వివిధ వస్తువులుగా కనిపించేవన్నీ మన ప్రతిబింబాలే. వాటికీ మనకూ ఎటువంటి తేడా లేదు. వస్తుతః చూసుకుంటే అవన్నీ మనలాగే పంచభూతాలతో నిర్మితమైనవే. కొంచెం లోపలికి వెళితే అన్నిట్లోనూ ఉండి అన్నింటినీ ప్రకాశింపచేసే ఆత్మవస్తువు కూడా ఒకటే. బంగారంతో వివిధ నగలు తయారు చేస్తారు. అది తలమీద పెట్టుకునే కిరీటం కావచ్చు, లేదా కాలికి పెట్టుకునే అందె కావచ్చు. కానీ అది నీకు కావాలంటే దానిలో ఎంత బంగారం ఉందో, ఈ రోజు బంగారం ధర ఎంత ఉందో దాని ప్రకారం లెక్కగట్టి అమ్ముతారు కానీ కేవలం కిరీటం అయినందువలన దానికి ఎక్కువ ధర, కాలి పట్టీ అయినందున దానికి తక్కువ ధర ఉంటాయా?

అయినా మనం ఈ అద్వైతాన్ని గుర్తించక ఆ అద్దాల గదిలోని బాలునివలె రకరకాల భావోద్వేగాలకు గురవుతున్నాం. రాక్షసులవంటి కొందరైతే ఆ కుక్కలాగా ఈ ప్రపంచాన్నే నాశనం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. నిజానికి మనకు ఒకరిని చూస్తే ప్రేమ, ఇంకొకరిని చూస్తే ద్వేషం ఇలాంటి భావాలు కలుగుతున్నాయి కానీ వాటికి కారణం మన మనస్సే తప్ప అవతలివారు కాదు కదా. కారణం అవతలివారే అయితే నువ్వు ప్రేమించే, గౌరవించే వారికి నీపట్ల ద్వేషభావం, చులకన భావం ఎలా కలుగుతున్నాయి? నువ్వు ఎంతో ద్వేషించేవారికి నిజానికి నీ పట్ల ఎంతో ప్రేమభావం ఉండి ఉండవచ్చు కదా. పోనీ మనుషులను ప్రక్కన పెట్టినా, నీకు ఎంతో ఇష్టమైన ఆహారపదార్థానికి నీ పట్ల ఎటువంటి భావం ఉండట్లేదు కదా. అంటే ఈ భావోద్వేగాలన్నింటికీ మన మనస్సే కారణం కానీ అవతలి వ్యక్తో లేక వస్తువో కారణం కాదన్నమాట.

ఇంకా ఒకే వస్తువును లేదా వ్యక్తిని వివిధ సందర్భాలలో చూసినప్పుడు నీకు విభిన్నమైన భావనలే కలుగుతున్నాయి కదా. మాములుగా తీపి అంటే ఎంతో ఇష్టమైనవాడు కూడా జ్వరం వచ్చినప్పుడు అదే తీపిని చూస్తే వాంతి చేసుకుంటాడు. అలాగే తాను ఆనందంగా ఉన్నప్పుడు తన పిల్లవాడిని ఒళ్ళో కుర్చోపెట్టుకున్నవాడే పని ఒత్తిడిలో ఉన్నప్పుడు అదే పిల్లవాడిని అవతలకి తోసేస్తాడు. అంటే ఇక్కడ వివిధ భావోద్వేగాలను కలిగించే ఆకారాలన్నీ నీ మనస్సనే అద్దంలో ఉన్న లోపాల కారణంగా వికృతాకారంలో కనిపించే నీ ప్రతిబింబాలేనన్నమాట. అందుకే శ్రీ పరిమి సుబ్రహ్మణ్య భాగవతార్ వారు "నీవు చూచునదెల్ల నీవయేయను తత్వమసి వాక్యమునకు అర్థమ్ము నిజము" అన్నారు. 

పై ఉదాహరణలో కుక్కకి, పిల్లవాడికి కనిపించినట్లే బుద్ధి వికసించిన పెద్దమనిషికి కూడా వివిధ వికారాలతో తన ప్రతిబింబాలు కనిపించాయి. అయితే అతడు ఇవన్నీ తన స్వరూపాలేనని, ఇందులో కనిపిస్తున్న వికృతులన్నీ నిజానికి అద్దాలు చేస్తున్న మాయేతప్ప అక్కడగాని, తనలోగాని  ఎలాంటి వికృతి లేదని గుర్తించి, ఆ గదిలో ఉన్నంతకాలం హాయిగా, ఆనందంగా ఉన్నాడు. అలాగే జ్ఞాని కూడా మనకు కనిపించినట్లే సృష్టిలోని వైవిధ్యం ఆయనకూ కనిపిస్తున్నా, ఇదంతా కేవలం ఉపాధి స్వభావాలలోని వ్యత్యాసం వల్ల వచ్చినది తప్ప అసలు తత్వంలో ఉన్నదంతా తానేననే జ్ఞానం కలిగి నిశ్చింతగా, ఆనందంగా ఉంటాడు.

23, ఆగస్టు 2019, శుక్రవారం

నిజమైన వైష్ణవుడు

మనం ఇన్నాళ్లూ 'మా దేవుని నమ్మకపోతే నరకానికి పోతావ్' అనే వాళ్ళను చూసాం. ఇప్పుడు క్రొత్తగా 'మా దేవుడికి జై కొట్టకపోతే నీకు ఇక్కడే నరకం చూపిస్తాం' అనేవాళ్ళు కూడా తయారవుతున్నారు. 'ప్రక్క దేశాన్ని తిట్టకపోతే నీకు దేశభక్తి లేదు, ప్రక్క మతాన్ని తిట్టకపోతే నీకు దైవభక్తి లేదు' అనే విపరీతవాదం పెరిగిపోతున్న ఈ రోజుల్లో అసలైన భక్తుడెవరో తెలుపుతూ పరమభక్తుడైన శ్రీ నర్సీ మెహతా వారు వ్రాసిన 'వైష్ణవ జన్ తో తేనే కహియెజ్' అనే గేయం అర్థం తెలుసుకొని ఆచరణలో పెట్టుకోవటం ఎంతైనా ఆవశ్యకం. శ్రీ నర్సీ మెహతా వారిని గురుదేవులు శ్రీ బాబూజీ మహారాజ్ 'నరసింహ మేధ' అని పిలిచేవారు. అది వారికి చక్కగా సరిపోయే పేరు. అపారమైన కారుణ్యానికి నిలువెత్తు నిదర్శనం శ్రీ నారసింహ మూర్తి. ఇప్పుడు పరమ శత్రువైనా ఒకప్పటి తన ద్వారపాలకుడైన హిరణ్యకశిపుని తిరిగి తన దగ్గరకు చేర్చుకోవాలనే కరుణ, తన పుత్రుడైన బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాన్ని నిలబెట్టాలనే కరుణ, తన పరమ భక్తుడైన ప్రహ్లాదుని మాట నిలబెట్టాలనే కరుణ ఇలా పూర్తి కరుణతో నిలువెల్లా నిండిన స్వామి, లోకాలన్నింటిని నిరంతరం నడిపిస్తూ ఉండే స్వామి ఏ కదలికా లేకుండా నిశ్చలంగా హిరణ్యకశిపుని మందిరమంతా నిండి నిలిచి ఉన్నాడు. అందుకే అన్నమయ్య 'చలనవిధి నిపుణ నిశ్చల నారసింహా' అంటాడు.

అటువంటి కరుణే నిండిన నర్సీమెహతా నిజమైన భక్తుని లక్షణాలు తెలుపుతూ వ్రాసిన ఆ గుజరాతీ గేయం అర్థం ఏమిటో చూద్దాం. ఇతరుల బాధను, కష్టాన్ని తన బాధగా, కష్టంగా అనుభూతి చెందగలిగినవాడే నిజమైన వైష్ణవుడు. కేవలం వారి బాధలు తనవిగా అనుభూతి చెందటమే కాక ఆ బాధా నివారణకు తనవంతు సహాయం చేసి కూడా ఎన్నడూ 'నేను చేశాను' అనే అహంకారాన్ని అతడు మనసులో రానివ్వడు. అతడు సమస్త జగత్తునూ విష్ణు స్వరూపంగానే భావించి గౌరవిస్తాడు. ఎన్నడూ ఎవరినీ కించపరచడు, దుర్భాషలాడడు. మనస్సు, వాక్కు, కర్మ ఈ మూడింటినీ సదా పరిశుద్ధంగా ఉంచుకుంటాడు. అటువంటి భక్తుని కన్న తల్లి ధన్యురాలు. ఒక్క తల్లేమిటి, అటువంటి భక్తుని వంశంలో అటు ఏడు తరాలు , ఇటు ఏడు తరాలు కూడా తరిస్తాయి. 

అతడు అందరినీ సమదృష్టితో చూస్తాడు. దేనినీ ఆశించడు. అన్య స్త్రీలందరినీ తన తల్లులుగా భావిస్తాడు. వారి నాలుక ఎన్నడూ అసత్యం పలుకదు. చేతులెన్నడూ పరుల విత్తాన్ని తాకవు. వారికి ప్రపంచంలోని ఏ వస్తువుతోనూ సంగం ఉండదు. సదా నిస్సంగులై ఉంటారు. వారికి ఉన్న అనురక్తి కేవలం రామనామం మీదే. సర్వ పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు ఆ సత్పురుషునిలోనే సదా విరాజిల్లుతూ ఉంటాయి. లోభం, కపటం అంటే ఏమిటో వారికి తెలియదు. కామక్రోధాలు వారి దరికి కూడా చేరలేవు. నర్సీ అంటున్నారు - తమ వంశాన్నంతటిని తరింపచేయగల అట్టి మహాత్ముని దర్శిస్తే నా జన్మ ధన్యమైనదిగా భావిస్తాను - అని. శ్రీ గురుదేవులు కూడా ఇలాగే 'అట్టి మహాత్ముడు కనిపిస్తే వారి పాదధూళి నా శిరస్సున ధరిస్తాను' అనేవారు. 

భక్తుని గురించి భక్తుడే వివరించిన ఈ పై లక్షణాలన్నీ భక్తుని గురించి భగవంతుడు వివరించిన భక్తియోగంలోని లక్షణాలతో సరిగ్గా సరిపోలుతున్నాయి. అవేమిటో ఒక్కసారి చూద్దాం. 'అద్వేష్టా సర్వభూతానాం'తో మొదలుపెట్టి పరమాత్మ తన భక్తునికి ఉండవలసిన లక్షణాలు ఏమిటో, ఎటువంటివాడు తనకు ప్రియుడో వివరిస్తున్నాడు. మొట్టమొదటి లక్షణం సృష్టిలో దేనినీ, ఎవరినీ  ద్వేషించకుండా ఉండటం. అలాగే అందరిపట్ల మిత్రభావం, కరుణ కలిగివుండటం. అహంకార మమకారాలు లేకపోవటం, సుఖదుఃఖాలను సమదృష్టితో స్వీకరిస్తూ ఓర్పు కలిగి ఉండటం. ఎల్లప్పుడూ లభించినదానితో తృప్తిగా ఉండటం, యోగియై ఉండటం, ఆత్మనిగ్రహం, దృఢనిశ్చయం కలిగివుండటం. తన మనోబుద్ధులను నాకే అర్పించి ఉండటం, లోకానికి తాను భయపడకుండా, లోకాన్ని తాను భయపెట్టకుండా ఉండటం, సంతోషం, విషాదం, భయం, ఉద్వేగం మొదలైన మానసిక లక్షణాలకు అతీతంగా ఉండగలగడం. దేనినీ ఆశించకుండా, శుచియై, చేసే ప్రతిపనిలో సమర్థుడై ఉండటం, ఎటువంటి చింతలు లేకుండా ఉదాసీనంగా ఉండటం.

తన స్వలాభంకోసం ఏ పనులూ చేయనివాడు, అతిగా సంతోషంగాని, బాధకాని, కోరికగాని, ద్వేషంగాని లేనివాడు, శుభాశుభములను శత్రుమిత్రులను, మానావమానములను, శీతోష్ణములను, సుఖదుఃఖములను సమదృష్టితో చూస్తూ దేనితోనూ సంగం ఏర్పరుచుకొననివాడు, నిందాస్తుతులను సమంగా స్వీకరిస్తూ, ఏకొంచెం దొరికినా దానితోనే సంతుష్టుడై, దేహం ఎక్కడ సంచరిస్తున్నా మనస్సు మాత్రం సదా పరమాత్మయందే నిలిపి ఉంచేవాడే నిజమైన భక్తుడని, అట్టివాడే తనకు ప్రియుడని పరమాత్మ మనకు గీతలో బోధించాడు. అటువంటి లక్షణాలు అలవరచుకోవటం మానేసి తుఛ్చమైన ప్రాపంచిక విభేదాలను సహించలేక వాటికోసం కొట్టుకు చావటం ఏమి వివేకం?

16, జులై 2019, మంగళవారం

చంద్రగ్రహణం

సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి అడ్డంగా వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుందని మనందరికీ తెలిసినదే కదా! అయితే మన వేదాంత పరిభాషలో సూర్యుడు బుద్ధికి అధిపతి. అందుకే 'ధియోయోనః ప్రచోదయాత్' అని మనం రోజూ ఆయనను ప్రార్థిస్తున్నాం. ఇక చంద్రుడు మనసుకు అధిపతి. అలాగే మన దేహం పంచభూతాలతో తయారయినా అందులో సింహభాగం పృథివీభూతానిదే. కొంచెం తాత్విక దృష్టితో ఆలోచిస్తే ఆత్మశక్తి వలన మన బుద్ధి ప్రకాశిస్తోంది. ఆ బుద్ధి ప్రకాశాన్ని ప్రతిఫలిస్తూ మనస్సు ప్రకాశించినంత కాలం మనలోని  జ్ఞానజ్యోతి మసకబారకుండా మనం వెన్నెలలోనే ఉంటాం. ఎప్పుడైతే బుద్ధికి, మనసుకు మధ్యలో దేహం అడ్డుగా వచ్చి ఈ దేహమే నేననే భావన మనసుకు గట్టిగా పట్టుతుందో అప్పుడే మనలో గ్రహణం అనే చీకటి ప్రారంభం అవుతుంది. మన సాధన అంతా ఈ దేహభావనను అడ్డు తొలగించుకొని మనస్సును బుద్ధికి, ఆ బుద్ధిని ఆత్మకు అధీనపరచి బ్రహ్మానందామృతం అనే వెన్నెలలో ఓలలాడాలనే.

ఇంద్రియాణి పరాణ్యాహుః ఇన్ద్రియేభ్యహః పరం మనః| 
మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః|| (భ.గీ. 3-42)

'ఇంద్రియాలు గొప్పవి. ఇంద్రియాలకంటే మనస్సు గొప్పది. మనస్సుకంటే బుద్ధి గొప్పది. ఆ బుద్ధికంటే గొప్పదై వీటన్నింటిని నడిపించేదే ఆత్మ' అని భగవానుడు స్వయంగా సెలవిచ్చారు కదా. అంటే సూర్యుని ప్రకాశాన్ని ప్రతిఫలించి చంద్రుడు ప్రకాశించినా ఆ సూర్యునికి కూడా ప్రకాశాన్ని ఇచ్చేది భగవంతుడే అయినట్లు (యదాదిత్య గతం తేజం జగద్భాసయతేఽఖిలం యశ్చన్ద్రమపి యశ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం - భ.గీ. 15-12) బుద్ధిని అనుసరించి మనస్సు, దానిని అనుసరించి ఇంద్రియాలు ప్రకాశిస్తున్నా, ఆ బుద్ధికి కూడా ప్రకాశాన్ని ఇచ్చేది ఆత్మవస్తువు అన్నమాట.

మనకు సాధారణంగా భగవద్గీతలోని శ్లోకాలనే ఉదహరించి ఉత్తరాయణంలో మరణించినవారు మోక్షాన్ని పొందుతారని, అదే దక్షిణాయణంలో మరణించినవారు తిరిగి జన్మిస్తారని చెబుతూ ఉంటారు. అయితే భగవానుడు ఏమి చెప్పాడో చూద్దాం. మానవునికి పునరావృత్తిని నివారించే మార్గమొకటి, పునరావృత్తిని కలిగించే మార్గమొకటి ఉన్నాయి. మొదటి మార్గానికి లక్షణం ఏమిటంటే 'అగ్నిర్జ్యోతిరహశ్శుక్లః షణ్మాసా ఉత్తరాయణం'. ఇందులో అగ్ని, జ్యోతి, పగలు ఈ మూడూ కూడా కాంతివంతమైనవి. ఇక శుక్లపక్షం, ఉత్తరాయణం చీకటినుండి వెలుగులోకి చేసే ప్రయాణానికి సూచనలు. శుక్లపక్షం మొదటిలో చంద్రుడు అసలు కనబడక పూర్తి చీకటిగా ఉంటుంది. అక్కడినుండి మెల్లమెల్లగా చంద్రబింబమూ, దాని కాంతి కూడా వృద్ధి పొందుతూ చివరికి పూర్ణిమ వస్తుంది. అలాగే ఉత్తరాయణం మొదటిలో పగలు తక్కువ, రాత్రి ఎక్కువగా ఉంటాయి. ఈ ఆరుమాసాలు గడిచేకొద్దీ పగలు పెరుగుతూ, రాత్రి తగ్గుతూ ఉంటుంది. అంటే జ్ఞానియై పూర్తిగా వెలుగులో ఉన్నవాడు, లేదా చీకటి నుండి వెలుగులోనికి, అంటే అజ్ఞానమునుండి జ్ఞానానికి ప్రయాణం చేస్తున్నవాడు పునరావృత్తి రాహిత్యాన్ని కలిగించే మార్గంలో ఉన్నాడన్నమాట.

ఇక రెండవ మార్గానికి లక్షణం ఏమిటంటే 'ధూమోరాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయణం'. ధూమం అంటే పొగ. ఇది వెలుగును కప్పివేస్తుంది. అలాగే రాత్రి కూడా చీకటికి సంకేతం. ఇక కృష్ణపక్షము, దక్షిణాయణం వెలుగునుండి చీకటిలోనికి ప్రయాణాన్ని సూచిస్తున్నాయి. అంటే పూర్తిగా చీకటిలో, లేదా అజ్ఞానంలో ఉన్నవాడు, అలాగే వెలుగునుండి చీకటిలోకి అంటే జ్ఞానమునుండి అజ్ఞానానికి ప్రయాణిస్తున్నవాడు పునరావృత్తిభరితమైన మార్గంలో ప్రయాణిస్తున్నాడన్నమాట. అయితే మనలో చాలామంది ప్రయాణం ఒక సరళరేఖలో ఉండదు. నాలుగడుగులు ముందుకి, రెండడుగులు వెనక్కి, మళ్ళీ రెండడుగులు ముందుకి, మూడడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు మనం వెలుగువైపు ఎంత ముందుకు వెళుతున్నాం అని సరిచూసుకుంటూ వీలైనంతగా వెనకడుగు వేయకుండా ఉంటే అదే పదివేలు. 

అలాగే ఒక మార్గంలో సైకిల్ త్రొక్కుతున్నవాడు మధ్యలో కొంత బద్ధకించి త్రొక్కడం ఆపివేసినా  సైకిల్  దానంతటదే కొంత ముందుకు పోవడం మనందరికీ అనుభవంలో ఉన్నదే. అదే తాను వెళ్ళవలసిన మార్గానికి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తుంటే మాత్రం ఎంతో శ్రమపడి మరీ తన ప్రయాణాన్ని ఆపి, దిశను మార్చుకొని ముందుకు సాగవలసి ఉంటుంది. అందువలన ఎప్పటికప్పుడు మనం వెళ్ళేది వెలుగు వైపుకా, లేక చీకటి వైపుకా? అని మనను మనం పరీక్షించుకుంటూ ముందుకు సాగాలి. అలా మన దిశను మార్చి వెలుగు వైపుకు నడిపించటానికే గురువులు మనను గ్రహణసమయంలో తప్పనిసరిగా ధ్యానం చెయ్యమని చెబుతారు. అంటే ఎప్పుడెప్పుడైతే మన మనస్సు బుద్ధిని అనుసరించకుండా దేహానికి లొంగిపోతూ ఉంటుందో అప్పుడప్పుడు మనం ధ్యానం చెయ్యాలన్నమాట. ఈ మాటను మాటిమాటికి గుర్తు చేయడానికే మన హిందూ సంప్రదాయంలో ఉత్తరాయణంలో కన్నా దక్షిణాయణంలోనే చాలా ఎక్కువ పండుగలు ఉంటాయి. అంతేగాని ఆ జ్ఞానాన్ని సంపాదించకుండా దేహాన్ని ఉత్తరాయణంలో విడిచిపెట్టినా, లేక దక్షిణాయణంలో విడిచిపెట్టినా పెద్ద తేడా ఏమీ ఉండదు.

11, జులై 2019, గురువారం

మార్పు

మనం ప్రతిరోజూ వింటూ ఉంటాం - లోకం అంతా మారిపోయింది. మా రోజుల్లోనే చాలా బాగుండేది. ఇప్పటివాళ్ళు అప్పటిలా దుస్తులు వేసుకోవట్లేదు, అప్పటి భాష మాట్లాడట్లేదు, అప్పటి తిండి తినట్లేదు, అప్పటిలా ఇంటిపట్టున ఉండట్లేదు, ఇలా రకరకాలుగా పాత కాలమంతా స్వర్ణయుగమని ఇప్పటివాళ్ళకి పోయేకాలమని అన్నట్లుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అయితే మనం ఇంకొకటి కూడా అప్పుడప్పుడూ వింటూ ఉంటాం - Change is the only constant thing in this world అని. అంటే ఈ ప్రపంచంలో మార్పు ఒక్కటే శాశ్వతమైనది అన్నమాట.

నిజానికి ఏ మార్పు లేకుండా ఉండేది సకల చరాచర సృష్టిలో కూటస్థ చైతన్య పరబ్రహ్మ రూపంలో ఉండే ఆ పరమాత్మ వస్తువు ఒక్కటే. ప్రపంచం అంతా నిత్యం మారిపోతూ ఉండేదే. యద్దృశ్యం తన్నశ్యం. ఏది కనబడుతుందో అది మాయమైపోతుంది. ఒకప్పుడు పెద్ద కుటుంబంలో అందరూ ఒకే ఇంట్లో జీవిస్తూ కనబడేవారు. అది మాయమై చిన్న కుటుంబాలు వచ్చాయి. కొన్నాళ్ళకు ఇవి కూడా మాయమైపోతాయి. ఒకప్పుడు ఎవరి ఊరిలో వారు ఉంటూ ఏ శుభకార్యాలకో, అశుభ కార్యాలకో ఒకసారి ప్రయాణాలు చేసేవారు. ఇప్పుడు అడుగు బయటపెడితే ఎక్కడ చూసినా ప్రయాణాలు చేసే జనమే విపరీతంగా కనిపిస్తున్నారు. కొన్నాళ్ళకి ఇది కూడా మారిపోతుంది, ఇంకొకటి వస్తుంది. ఒకప్పుడు ఉత్తరాలు వ్రాసుకొనేవారు. ఇప్పుడు SMSలు, WhatsApp messageలు వచ్చాయి. మరికొంత కాలానికి ఇది మారిపోయి ఇంకొకటి వస్తుంది. ఒకప్పుడు ఇంట్లో ఆడవాళ్లు అందరూ కలిసి ఇంటిపని, వంటపని చేసుకొనేవారు. ఇప్పుడు అందరూ తలకొక గదిలో కూర్చొని వారివారికి ఇష్టమైన సీరియళ్లు చూస్తున్నారు.

ఇలా ఒకటి మారి ఇంకొకటి రావడం లోకరీతి. చివరికి ఇందాక చెప్పుకున్న మార్పులేని పరబ్రహ్మమే అవతారం ధరించి వచ్చినప్పుడు ఆయన శరీరంలోనూ మార్పులొస్తున్నాయి, చివరికి కనిపించకుండా కూడా పోతోంది. అంతెందుకు? రామావతార సమయానికి, కృష్ణావతార సమయానికి వ్యవహార శైలిలో ఎంత మార్పు వచ్చింది? ఈ మార్పును స్వాగతిస్తూనే ఇలా నిత్యమూ మారిపోతూ ఉండే ప్రపంచం వెనుక మారకుండా ఉండి సమస్తాన్ని నడిపించే శక్తి ఒకటి ఉన్నదని గుర్తించడమే మనం చేయవలసింది. అప్పుడే మనం ఈ మార్పులను హుందాగా స్వీకరిస్తూ, వాటివలన ఉద్వేగానికి గురికాకుండా స్థితప్రజ్ఞతను చూపగలుగుతాం.

అసలు ఈ ప్రపంచంలోని నిరంతరం మారిపోయే స్వభావాన్ని అంగీకరించలేక పోతున్నామంటే సాధన చతుష్టయ సంపత్తిలో మొట్టమొదటిదైన నిత్యానిత్య వస్తు వివేకం మనకింకా అలవడలేదన్నమాట. ఈ ప్రపంచంలో మనం చూసే ఏ ఒక్కటీ నిత్యం కాదు, ప్రతిదీ మారిపోయేదే అని, పరమాత్మ ఒక్కడే మార్పులేని నిత్య సత్య స్వరూపుడని ముందుగా మనం రూఢిగా తెలుసుకుంటేనే ఇహలోకంలో, పరలోకంలో కనిపించే సుఖభోగాలన్నింటిపైనా వైరాగ్యం - ఇహాఽముత్రార్థ ఫలభోగ విరాగం - అనే రెండో సాధన సంపత్తి మనకు అలవడుతుంది. కాబట్టి కొత్తొక వింత పాతొక రోత అనడం ఎంత తప్పో, పాత అంతా మంచి, కొత్త అంతా చెడు అనుకోవడం కూడా అంటే తప్పు. మార్పులను హుందాగా స్వీకరిస్తూ, ప్రతిదానిలో మంచిని గ్రహిస్తూ, ఆచరిస్తూ, చెడును వదిలేస్తూ ముందుకు సాగినప్పుడే మన సాధన కూడా ముందుకు సాగుతుంది. మార్పును స్వీకరించలేనప్పుడు ప్రాపంచికంగా, ఆధ్యాత్మికంగా కూడా బావిలో కప్పల్లాగా ఎక్కడి వాళ్ళం అక్కడే ఉండిపోతాం.

8, జులై 2019, సోమవారం

అహంకారం

సామాన్య పరిభాషలో అహంకారం అంటే గర్వం, దర్పం అనుకుంటాం. కానీ వేదాంత పరిభాషలో అహంకారం అనే మాట రెండు వేరువేరు అర్థాలలో ఉపయోగించబడుతుంది. మొదటిది అహంకార మమకారాలలో ఉండే అహంకారం. 'నేను' అనే భావనే ఈ అహంకారం. ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. అవే కర్తృత్వాహంకారం, భోక్తృత్వాహంకారం. ఏదైనా ఒక పని చేయవలసి వచ్చినప్పుడు ఆ కర్తవ్యాన్ని తనమీద వేసుకోవటం కర్తృత్వాహంకారం. అంటే 'ఈ పని నేను చేస్తున్నాను' అనుకోవటం అన్నమాట. అయితే కేవలం 'నేను చేస్తున్నాను, లేదా చెయ్యగలను' అనుకోవటమే అహంకారం కాదు. 'ఈ పని నేను చేయలేను, లేదా నాకు చేతకాదు' అనుకోవటం కూడా కర్తృత్వాహంకారమే. అంటే బాధ్యతను భగవంతుని మీద వదిలిపెట్టకుండా తనమీద వేసుకోవటం అన్నమాట. నిజానికి మనమందరమూ ఆ భగవంతుని చేతిలో పనిముట్లమే. మనం కాకపోతే ఆ పని ఇంకొకరు చేస్తారు. ప్రపంచంలో ఏదీ ఎవరికోసమూ ఆగదు. మనం ఉన్నా లేకున్నా ఈ ప్రపంచం యథావిధిగా నడిచిపోతూనే ఉంటుంది. లేనిపోని కర్తృత్వాన్ని మీద వేసుకొని సతమతమయ్యేకంటే హాయిగా భారాన్ని భగవంతునిపై వేసి మన ధర్మాన్ని మనం ఆచరించడమే ఉత్తమం. అప్పుడు దాని ఫలితం మనకు కర్మ రూపంలో అంటదు. 

ఇక ఈ పనికి ఫలితం నేనే అనుభవించాలి అనుకోవటం భోక్తృత్వాహంకారం. చాలామందిని చూస్తుంటాం - 'ఈ పనిలో పుణ్యమంతా నాకే వచ్చెయ్యాలి, ఇంకెవరికీ ఇందులో భాగస్వామ్యం దక్కనివ్వను' అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే మన అంతిమ లక్ష్యం మోక్షం అయినప్పుడు మనం మధ్యలో వచ్చే ఈ పాపపుణ్యాలను పట్టించుకోకూడదు. మన కర్మ అకౌంటులో పాపం బ్యాలన్స్ ఉన్నా పుణ్యం బ్యాలన్స్ ఉన్నా మళ్ళీ జన్మకు రాక తప్పదు. కేవలం పాపపుణ్యాలే కాదు, మనం చేసే పనియొక్క ఫలితంపై ఏమాత్రం దృష్టి పెట్టినా అది భోక్తృత్వాహంకారమే. క్షణికానందం కోసం పాపకర్మల చేసి దీర్ఘకాలంలో దానివలన వచ్చే కష్టాలు, బాధలు మాత్రం తనకు వద్దు అనుకుంటూ ఉంటాడు మానవుడు. ఇది కూడా భోక్తృత్వాహంకారమే. మనం చేసే కర్మలన్నింటినీ భగవదాదేశంగా భావిస్తూ వాటి బాధ్యతను, ఫలాన్ని కూడా ఆయనకే వదలిపెట్టి శ్రద్ధతో చేస్తే అదే కర్మయోగం అవుతుంది. మోక్షానికి దారితీస్తుంది. 

ఇక పైన చెప్పుకున్నట్లు రెండవ అర్థంలో అహంకారం అనే మాట అంతఃకరణ చతుష్టయంలో భాగంగా వస్తుంది. అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అన్నమాట. వీటిలో మనస్సు సంకల్పిస్తే, చిత్తం రికార్డు చేస్తుంది. బుద్ధి నిర్ణయిస్తే అహంకారం ఆ నిర్ణయాన్ని అమలులో పెడుతుంది. దీనినే పురుషకారం లేదా పురుషప్రయత్నం అని కూడా అంటారు. మనస్సు, బుద్ధి, చిత్తము కంటికి కనపడవు కానీ వాటి నిర్ణయాలు అహంకారము ద్వారా వ్యక్తమై కర్మేంద్రియాల ద్వారా ఆ పని అమలులో పెట్టబడుతుంది. ఈ అహంకారమే లేకపోతే సృష్టిలో ఏ ప్రాణీ ఏ పనీ చేయలేదు. పైన చెప్పుకున్న మొదటిరకం అహంకారం మనకు మోక్షానికి అడ్డంకే కానీ ఈ రెండవ రకం అహంకారం మనకు ప్రతిబంధకం కాదు. మసస్సును బుద్ధికి ఆధీనం చేసి, ఆ బుద్ధిని పరమాత్మయందు నిలిపితే, అప్పుడు ఈ అహంకారం ద్వారా చేయబడే క్రియలన్నీ కూడా లోకహితార్థమే అవుతాయి.

గురుదేవులు శ్రీ బాబూజీ మహారాజ్ వారు ఈ రెండు రకాల అహంకారాలకు రెండు వేరువేరు చికిత్సలు చెప్పేవారు. మొదటిదైన అహంకార మమకారములను వడ్లగింజపై ఉన్న రెండు పొరలతో పోల్చేవారు. ఆ రెండు పొరలు ఉన్నంతకాలం ఆ వడ్లగింజ మొలకెత్తి మళ్ళీ మళ్ళీ అనేక జన్మ పరంపరకు కారణం అవుతుంది. అందుకే ఈ రెండు పొరలను, అంటే అహంకార మమకారములను పూర్తిగా తొలగించుకుంటే కానీ జన్మరాహిత్యం సాధ్యం కాదని చెప్పేవారు. పొరలు తీసివేస్తే వడ్లగింజ బియ్యపుగింజగా మారిపోతుంది కదా? ఎంత నానబెట్టినా బియ్యపుగింజ మళ్ళీ మొలకెత్తుతుందా?

ఇక రెండవ రకం అహంకారం భాగమైన అంతఃకరణ చతుష్టయం అంత చెడ్డదేమీ కాదు. దానిని పూర్తిగా తొలగించుకోవలసిన అవసరం లేదు. శరీరంతో ఉన్నంతకాలం అలా తొలగించుకోవటం సాధ్యం కాదు కూడా. అయితే ప్రపంచం వైపు తిరిగి ఉన్న ఈ నాలుగింటినీ పరమాత్మకు అభిముఖం చేస్తే అప్పుడు మనస్సు సత్యంగాను, దానికి సెక్రటరీ అయిన చిత్తం శాంతిగాను, బుద్ధి దయాస్వరూపంగాను, దానికి సెక్రెటరీ అయిన అహంకారం కళంకరహితమైన ప్రేమ స్వరూపంగాను మారిపోతాయని శ్రీగురుదేవులు వివరించేవారు. 

ఇలా మొదటి రకం అహంకారాన్ని నిర్ములించుకోవటానికి, రెండవ రకం అహంకారాన్ని పరివర్తన చెందించుకోవటానికి మనవంతు కృషిని మనం చేస్తూ ఫలితాన్ని భగవంతునికి వదిలిపెడదాం. ఎప్పుడు ఎవరితో ఏమి చేయించుకోవాలో, ఎప్పుడు ఎవరికి ఏమివ్వాలో ఆయనకే బాగా తెలుసు కదా. అయితే అహంకారాన్ని విడిచిపెట్టడమంటే సోమరితనం కాదు. అలాగే చెడ్డపనులు చేస్తూ 'ఇది నేను చెయ్యట్లేదు, భగవంతుడే నాతో ఇలా చేయిస్తున్నాడు. నేను కేవలం నిమిత్తమాత్రుణ్ణి' అని వంకలు చెప్పడం కాదు. 'నిజంగా భగవంతుడే నాతో అన్నీ చేయిస్తున్నాడు అనే భావన నిశ్చయంగా కలిగినవాడు ఎవ్వడూ చెడ్డపనులు చేయలేడు' అని శ్రీగురుదేవుల ఉవాచ.

26, మే 2019, ఆదివారం

చిత్తకుసుమం


గభీరే కాసారే విశతి విజనే ఘోరవిపినే
విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతిః ।
సమర్ప్యైకం చేతస్సరసిజం ఉమానాథ భవతే
సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో||

మనం ఈ మధ్యనే శ్రీ శంకర జయంతి జరుపుకున్నాం కదా. శ్రీ మాతాజీవారు తరచుగా శ్రీ శంకరాచార్య విరచితమైన శివానంద లహరిలోని ఈ శ్లోకాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. శంకరులవారు జనుల అవివేకాన్ని ప్రశ్నిస్తూ ఉమానాథుడైన పరమేశ్వరునితో ఇలా అంటున్నారు, "ఓ ఉమానాథా! జడమతులైన ఈ జనులు తమ చిత్తమనే కమలాన్ని నీకు సమర్పించి సుఖంగా కూర్చోవచ్చునని తెలియక బయటి పుష్పాలకోసం లోతైన తటాకాలలో, నిర్జనమైన ఘోరారణ్యాలలో, విశాలమైన పర్వతాలపైన వాటిని వెతుక్కుంటూ ఎంతో కష్టపడుతున్నారు. ఎంత ఆశ్చర్యం!"

అంతఃకరణ చతుష్టయంలో మనస్సు సంకల్పిస్తుంది, బుద్ధి నిర్ణయిస్తుంది, అహంకారం ఆ నిర్ణయాన్ని అమలులో పెడుతుంది. అయితే చిత్తం ఈ ప్రక్రియనంతటినీ రికార్డు చేస్తుంది. ఈ రికార్డులే తరువాత జన్మజన్మలకూ వాసనలై మనవెంట పడుతున్నాయి. మన చిత్తంలోని ఈ వాసనలనుండి పుట్టేవే కామక్రోధాది గుణాలు. ఈ వాసనలు కలిగివుండటం వలననే ఇక్కడ స్వామి మనఃపుష్పం అనకుండా చిత్తాన్ని కమలంతో పోల్చారేమో. ఈ వాసనలు మూడు రకాలు - శాస్త్రవాసన, లోకవాసన, దేహవాసన. శాస్త్రాలను ఎంత లోతుగా అధ్యయనం చేసినా ఈ శాస్త్రవాసన ఇంకా పెరుగుతుందే తప్ప తరగదు. అందుకే లోతైన తటాకాలలో వెదికి ఉపయోగం లేదు. అలాగే జనసంద్రాన్ని వదలివేసి ఎంత నిర్జనారణ్యంలో ముక్కు మూసుకొని కూర్చున్నా లోకవాసన వదలటం కష్టం. అందుకే నిర్జనారణ్యాలలో వెదకి ఉపయోగం లేదని స్వామి ఇక్కడ హెచ్చరిస్తున్నారు. ఇక దేహాన్ని పోషించుకొనే క్రమంలో తన వృత్తి ధర్మాచరణలో ఎంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించినా దేహవాసన ఇంకా పెరుగుతుందేకాని తరగదు. అందుకే విశాల శైలాలపై కూడా వెదకి ఉపయోగం లేదు అని స్వామి చెప్తున్నారు. 

ఇక ఇక్కడ పరమేశ్వరుని ఉమానాథ అని సంబోధించడంలో కూడా మనకొక సూచన ఉన్నదనిపిస్తోంది. పార్వతీదేవి పరమేశ్వరుని పతిగా పొందాలనే సంకల్పంతో తన చెలికత్తెలతో కలసి స్వామి తపస్సు చేసుకొనే ప్రదేశానికి చేరి, పైన చెప్పినట్లుగానే రోజూ అనేక పుష్పాలను సేకరించి స్వామిని పూజిస్తూ సపర్యలు చేస్తూ ఎంతోకాలం గడిపింది. అయినా స్వామి మనస్సును మెప్పించలేకపోయింది. చివరికి అమ్మను స్వామితో కలిపే ప్రయత్నంలో మన్మథుడు కూడా దహనం అయిపోయిన తరువాత ఆ తల్లి ఇక బయటి ప్రయత్నాలు వదలివేసి తనలోకి తాను వెళ్ళి ఆ తపస్సుద్వారా స్వామిని పొందాలని నిర్ణయించుకుంది. అయితే ఈ తపస్సును తల్లియైన మైనాదేవి, ఇతర చెలికత్తెలు వారించటంలో భాగంగా "ఆ పని వద్దు, వద్దు" అని చెప్పడంవల్ల ఆమెకు "ఉమ" అనే పేరు వచ్చిందని పెద్దలు చెబుతారు. అయితే ఈ వాసనాత్రయాన్ని జయించిన అమ్మ తనలో తాను లీనమై తపస్సు చేస్తూ ఉండగా ఆ స్వామి తానే స్వయంగా వచ్చి, అమ్మను పరీక్షించి మరీ తనదానిని చేసుకున్నారు.

ఇలాగే మనం కూడా మన ధర్మాన్ని ఆచరిస్తూనే, ఈ సంఘంలో ఉంటూనే చిత్తాన్ని భగవదాయత్తం చేసి మనలోపలి అసలు సత్యాన్ని కూర్చున్న చోటునే ఉండి హాయిగా గుర్తించి, అనుభవించి, ఆ శివానంద లహరిలో ఓలలాడమని జగద్గురువులైన శ్రీ శంకరాచార్య స్వామివారు మనకు ఈ రూపంగా బోధిస్తున్నారు. ఇక్కడ కమలం, వాసనలకు సంబంధించి ఇంకొక చరిత్ర కూడా ఉంది. ఇటీవలే మనం బుద్ధపూర్ణిమ కూడా జరుపుకున్నాం కదా. ఆ బుద్ధ భగవానుడు సిద్ధార్థుడిగా అవతరించే ముందు బోధిసత్వుడిగా అనేక జన్మలు ఎత్తాడనీ, ఆయా జన్మలలో సాధనకు అవసరమైన ఒక్కొక్క గొప్ప విషయాన్ని నేర్చుకున్నాడని జాతక కథలలో చెబుతారు. అటువంటి జన్మలలో ఒకసారి బోధిసత్వుడు ఒక సన్న్యాసిగా జన్మించాడు. ఆయన ఒక అడవిలో నడచి వెళుతూ ఉండగా ఒక ఆటవికుడు అక్కడి తటాకంలో దిగి హాయిగా ఈతకొడుతూ, అందులోని కమలాలని విచ్చలవిడిగా తుంపివేస్తూ ఆడుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఇది గమనించిన బోధిసత్వుడు ఆ తటాకంలోని ఒక కమలానికి ఆకర్షితుడై వంగి దాని సువాసనను ఆఘ్రాణించాడు.

ఇంతలో ఆ తటాకానికి రక్షకుడైన యక్షుడు భీకర స్వరంతో హెచ్చరించాడు, "ఓ సన్న్యాసీ! ఈ పుష్పముయొక్క సువాసనను దొంగిలించే అధికారం నీకు ఎవరిచ్చారు? ఎందుకు ఇంతటి అపరాధానికి ఒడిగట్టావు?" అని. అందుకు బోధిసత్వుడు ఆశ్చర్యంతో, "ఓ యక్షరాజా! నా కళ్ళముందే ఆ ఆటవికుడు అంతటి విధ్వంసం సృష్టించినా మాట్లాడని నీవు కేవలం పుష్పం వాసన చూసినందుకే నేనేదో పెద్ద నేరం చేసినట్లు మాట్లాడుతున్నావే? ఇదేం న్యాయం?" అని ప్రశ్నించాడు. దానికా యక్షుడు సమాధానమిస్తూ, "ఆ ఆటవికుడు అజ్ఞాని. అలా ప్రవర్తించడం అతని స్వభావం. కానీ సర్వసంగ పరిత్యాగం చేసి సన్న్యాసివైన నీవు మళ్ళీ ఒక పువ్వు వాసనకు లోబడిపోవడం ఎంతవరకు సమంజసం? అప్పటికే మురికిపట్టిన వస్త్రంమీద క్రొత్తగా ఎంత పెద్ద మరక అయినా కనిపించదు కదా? అదే స్వచ్ఛమైన తెల్లటి వస్త్రంపై ఏ చిన్న మరక పడినా స్పష్టంగా కనిపిస్తుంది. అలా ఏ చిన్న మరక లేకుండా ఉండగలిగిన నిర్మలాంతఃకరణను సాధించు" అని బోధించాడు.

30, ఏప్రిల్ 2019, మంగళవారం

అనుభవ జ్ఞానం

మనం సాధారణంగా పాఠశాలల్లో చూస్తూ ఉంటాం - సరిగ్గా చదువు రాని వాళ్ళని, చెప్పిన పాఠం అర్థంచేసుకోలేని వాళ్ళని, గుర్తు ఉంచుకోలేని వాళ్ళని, "శుద్ధ మొద్దు అవతారం! నువ్వు జీవితంలో ఎందుకు పనికి వస్తావు?" అంటూ తోటి విద్యార్థులు, ఒక్కొక్కసారి ఉపాధ్యాయులు కూడా అవమానిస్తూ, ఎత్తిపొడుస్తూ ఉంటారు. ఫస్ట్ ర్యాంకులు, స్టేట్ ఫస్టులు వచ్చిన వాళ్ళ ఫోటోలు పేపర్లో చూసి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని తిడుతూ ఉంటారు. అయితే చదువు జీవితంలో ఒక భాగమే కానీ అదే జీవితం కాదని మనందరికీ తెలిసిందే కదా! కేవలం పుస్తకంలో ఉన్నది బట్టీపట్టో, అర్థం చేసుకొనే అడగగానే సమాధానాలు చెప్పగలిగేవాడికంటే సమాజాన్ని చదివి, ఎలా జీవించాలో, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో, అవకాశాలు ఎలా అందిపుచ్చుకోవాలో, అవి లేనప్పుడు ఎలా వాటిని కల్పించుకోవాలో అనుభవం ద్వారా తెలుసుకున్నవాడే జీవితంలో ఎక్కువగా రాణించగలుగుతాడు. కేవలం పుస్తకాలే జీవితంగా బ్రతికినవాడి ఫోటో ఒకసారి పేపర్లో పడినా, ఆ తరువాత ఎలా జీవించాలో తెలియకపోతే వాడు చాలా అతి సామాన్యమైన జీవితాన్నే జీవించవచ్చు. చదువు వంటపట్టక పరీక్షలు తప్పినవాడు కూడా ఎలా జీవించాలో తెలిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. మనకు తెలిసిన ఎందరో కోటీశ్వరులు సరైన చదువు లేనివారే, కానీ జీవితాన్ని చదివినవారు.

ఇదే సూత్రం ఆథ్యాత్మికంలో కూడా వర్తిస్తుంది. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన శక్తిని ఇస్తాడు. మనందరమూ ఆయన చేతిలో పనిముట్లమే. ఏ పనిముట్టు ఎందుకు పనికివస్తుందో, దానిని ఎలా ఉపయోగించుకోవాలో ఆయనకు బాగా తెలుసు. ఒకరు చక్కగా పాడగలుగుతారు. మరొకరు చక్కగా వ్రాయటమో వేదికలెక్కి ఉపన్యాసాలు చెప్పడమో చేయగలుగుతారు. మరొకరు ఎంతటి లోతైన వేదాంత విషయాలనైనా సులభంగా అర్థం చేసుకొని, గుర్తు పెట్టుకొని, మళ్ళీ చెప్పగలుగుతారు. అంతమాత్రంచేత వారంతా ఏదో సాధించేశారనో, ఇవేవి చేతకానివారు ఎందుకూ పనికిరాని వారనో అర్థం కాదు. అనుభవ జ్ఞానం ముందు పుస్తక జ్ఞానం, పాండిత్యం ఎప్పటికీ దిగదుడుపే. పంచభూతాలు, దశేన్ద్రియాలు, పంచ తన్మాత్రలు, షట్చక్రాలు, గుణత్రయం, వాసనాత్రయం, ఈషణత్రయం, సాధన చతుష్టయం ఇలా టకాటకా అన్నీ అప్పచెప్పే వ్యక్తి తనలో ఏదైనా గుణం ప్రేరేపించినప్పుడు ఎంతవరకు తట్టుకుని నిలబడగలుగుతాడు? ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? అదే ఇవేమీ తెలియకపోయినా నిరంతరం భగవన్నామం చేసుకుంటూ తనకు జీవితంలో వచ్చే కష్టసుఖాలన్నింటినీ సమదృష్టితో భగవంతుని ప్రసాదంగా స్వీకరించే భక్తుడు తప్పక నిలబడగలుగుతాడు. ఇక్కడ శాస్త్రజ్ఞానం కన్నా అనుభవ జ్ఞానమే మిన్న కదా!

పుస్తక జ్ఞానం, లేదా శాస్త్రజ్ఞానం ఒక జన్మకే పరిమితమైనది. మరి మన ఆథ్యాత్మిక సాధన జన్మజన్మాంతరాల నుంచీ జరుగుతూనే ఉంది. "సాధనామార్గంలో ఉన్న మానవుడు కర్మవశం చేత మధ్యలోనే జన్మ చాలించవలసి వస్తే అతని సాధన అంతా వృథాయేనా?" అని భగవద్గీతలో అర్జునుడు వెలిబుచ్చిన సందేహానికి గీతాచార్యుడు "అటువంటి భయమేమీ అక్కర్లేదు. ఒక జన్మలో సాధన పూర్తికాక యోగభ్రష్టుడైన సాధకుడు ఎక్కడైతే తన సాధన ఆపాడో తరువాత జన్మలో అక్కడనుండి తన సాధనను కొనసాగించి చివరికి కృతకృత్యుడౌతాడు" అని భరోసా ఇచ్చాడు కదా! మరి ఇదే సూత్రం పుస్తక జ్ఞానానికి వర్తిస్తుందా? ఈ జన్మలో డిగ్రీ చదువుకున్న మానవుడు వచ్చే జన్మలో నేరుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తానంటే కుదురుతుందా? మళ్ళీ అతను ఆ జన్మలో నర్సరీనుంచి మొదలు పెట్టవలసిందే కదా! ఇంక ఈ పుస్తక జ్ఞానంతో ఉపయోగం ఏమిటి? "సింహం అడవికి రాజు. అది గర్జించును. దాని పంజా దెబ్బ చాలా గట్టిగా ఉండును" అని ఎన్నిసార్లు వల్లెవేసినా వీడు సింహం కాలేడు కదా! అదే ఇవేమీ చదవకపోయినా, అసలు తనని సింహం అంటారని తెలియకపోయినా ఒక సింహం ఇవన్నీ సహజంగానే చేస్తుంది కదా. అదే పుస్తక జ్ఞానికి, నిజమైన భక్తుడు, లేదా అనుభవ జ్ఞానికి ఉన్న తేడా.

మనం శాస్త్రాలను ఎంతగా వల్లెవేసినా ఆ విద్యతో భగవంతుని మెప్పించలేం. ఎవరైనా మనకు తెలియని విద్యని ప్రదర్శిస్తే 'అబ్బో!' అని ఆశ్యర్యపోతాం, మెచ్చుకుంటాం. అదే మనకు బాగా తెలిసిన విద్యనే ప్రదర్శిస్తే "ఆ! చేశాడులే" అని చప్పరించేస్తాం. మరి ఈ లోకంలోని పుస్తక జ్ఞానమంతా భగవంతుని నుంచి వచ్చిందే కదా. ఇందులో ఆయనకు తెలియనిది, ఆయనను అబ్బురపరిచేది ఏముంటుంది? మరి ఆయనను ఇంప్రెస్ చెయ్యడం ఎలా? అంటే ఆయనకు తెలియనిది, అనుభవంలో లేనిది ఒకటి ఉంది. అదే భక్తి. దానితోనే మనం అయన హృదయాన్ని గెలుచుకోగలం. "ఎందరో భక్తులు నామీద ఇంతటి ప్రేమను చూపిస్తున్నారు. నన్ను చూడకుండా, సేవించకుండా ఉండలేకపోతున్నారు. అసలు ఈ భక్తి, ప్రేమ ఎలా ఉంటాయో ఒకసారి తెలుసుకుందాం" అనే ఉత్సుకతతోనే శ్రీకృష్ణుడు తానే రాధ రూపాన్ని ధరించి భక్తిని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడని మనకు పెద్దలు చెబుతారు. అలాగే "అందరూ నా పాదాలను విడిచిపెట్టకుండా సేవిస్తూ ఉంటారు. అసలు ఈ పాదాలలో ఉన్న మాధుర్యం ఏమిటో చూద్దాం" అని ఆయన సృష్టి అంతా లయమైపోయిన తరువాత వటపత్రశాయియై తన కాలి బొటనవ్రేలుని తనే నోట్లో పెట్టుకొని ఆస్వాదిస్తూ ఉంటాడని కూడా చెబుతారు. కాబట్టి నిజంగా భగవంతుని మెప్పించేది భక్తి, అనుభవ జ్ఞానాలే కానీ పాండిత్యమూ, శాస్త్రజ్ఞానమూ కాదు.

3, ఏప్రిల్ 2019, బుధవారం

భ్రాంతి

ఒకసారి ఇద్దరు మిత్రులు సినిమాకు వెళ్లారు. సినిమాలో హీరో గుఱ్ఱం మీద వెళ్తున్నాడు. మొదటి మిత్రుడు, "ఇప్పుడు ఆ హీరో గుఱ్ఱం మీదనుంచి పడిపోతాడు. కావాలంటే వంద రూపాయలు పందెం" అన్నాడు. ఆ హీరో పడిపోడని రెండవ మిత్రుడూ పందెం కాసాడు. మరికొద్ది నిముషాలలో ఆ హీరో పడిపోవడం, రెండవ మిత్రుడు మొదటివానికి వంద రూపాయలు ఇవ్వడం జరిగిపోయాయి. అయితే ఆ మొదటి మిత్రుడు, "నేను ఈ డబ్బులు తీసుకోలేను. నేను నిన్ను మోసం చేశాను. నేను ఈ సినిమా ఇదివరకే చూసేసాను" అన్నాడు. అప్పుడా రెండవ మిత్రుడు, "నేను కూడా ఈ సినిమా ఇదివరకే చూసాను. అయినా ఆ హీరోకి ఏమాత్రం బుద్ధి ఉన్నా ఒకసారి గుఱ్ఱం మీదనుంచి పడ్డవాడు రెండవసారి జాగ్రత్తగా ఉంటాడులే అనుకొని నీతో పందెం కాసాను. కానీ ఆ బుద్ధిలేని హీరో మళ్ళీ అలాగే పడిపోయాడు" అన్నాడు.

ఇది వింటే ఆ రెండవవాడి అమాయకత్వాన్ని చూసి మనం నవ్వుకుంటాం. కానీ ప్రతిరోజూ మనం చేస్తున్నది కూడా అదే. మన జీవితంలో ప్రతిరోజూ ఇలాంటి భ్రమలకు, భ్రాంతులకు లోనవుతున్నాం. ఎలాగో చూద్దాం. మనకు ప్రధానంగా ఆరుగురు శత్రువులని పెద్దలు చెబుతారు కదా! అవే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇవి మన ప్రబల శత్రువులని చిన్నప్పటినుండి వింటూనే ఉన్నాం. అలాగే వీటి దాహం తీరనిదని, ఎంత సమర్పించుకున్నా ఇంకా ఇంకా అగ్నిలా ప్రజ్వరిల్లుతూనే ఉంటాయని సాక్షాత్తు భగవానుడే గీతలో చెప్పాడు కదా! అయినా మనం ప్రతిసారీ 'ఈ ఒక్కసారికి వాటి మాట విని వాటి ఆకలి తీరిస్తే మళ్ళీ  మన జోలికి రావులే' అనుకుంటూ మళ్ళీ మళ్ళీ వాటికి లొంగిపోతూనే ఉంటున్నాం.

ఒకరికి విపరీతమైన షుగర్ వ్యాధి ఉంటుంది. కానీ తీపి అంటే ఎంతో ఇష్టం. 'ఈ ఒక్కసారికి తినేస్తే ఆ కోరిక తీరిపోతుందిలే. ఆ తరువాత ఇంకెప్పుడూ తినద్దు' అనుకుంటూ తినేస్తాడు. అయితే ఆ కోరిక అక్కడితో ఆగుతుందా? మళ్ళీ మళ్ళీ తీపివైపుకు లాగుతూనే ఉంటుంది, వీడు మళ్ళీ మళ్ళీ దానికి లొంగుతునే ఉంటాడు. చివరికి వాడి ప్రాణం మీదకు తెచ్చుకుంటాడు. అలాగే ఒకడికి విపరీతమైన కోపం ఉందనుకోండి. అది తప్పు అని వాడి బుద్ధి మాటిమాటికి హెచ్చరిస్తూనే ఉంటుంది. అయినాసరే 'ఈ ఒక్కసారికి నా పిల్లవాడిమీద కోపం చూపిస్తే తరువాత వాడే నా మాట వింటాడులే' అనుకుంటూ ఉంటాడు. ఆ పిల్లవాడు మాట వినేదెప్పుడు? వీడి క్రోధం అణిగేదెప్పుడు? రెండూ కల్లలే. చివరికి ఆ పట్టరాని క్రోధంలోనే ఏదో జరగరాని అనర్థం జరుగుతుంది.

అలాగే లోభగుణం ఎక్కువగా ఉన్నవాడు ఎవరికైనా ధన సహాయం చేయవలసి వస్తే 'ఈ ఒక్కసారికి దాచుకుందాంలే. వచ్చేసారి నుంచి నా శక్తికొలది తప్పకుండా దానం చేస్తాను' అని ప్రతిసారి అనుకుంటూ కాలం గడిపేస్తూ ఉంటాడు. అలాగే మన కళ్ళముందే మనం మోహం పెంచుకున్న ఎందరో బంధువులు, స్నేహితులు వెళ్లిపోతున్నా మళ్ళీ మళ్ళీ 'ఈ ఒక్కసారికే' అనుకుంటూ క్రొత్త వారి(టి)పై మోహం పెంచుకుంటూనే ఉంటాం. ఇక ఎన్నిసార్లు 'నీ సత్తా ఇంతేరా!' అని భగవంతుడు మొట్టికాయలు వేస్తున్నా 'అమ్మో! వచ్చేసారి జాగ్రత్తగా ఉండాలి' అనుకుంటూనే ఉంటాం, అయినా మళ్ళీ మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు 'నా అంతవాడు లేడు' అనుకుంటూ మదాన్ని ప్రదర్శిస్తూనే ఉంటాం. ఇలాగే ఎప్పటికప్పుడు 'ఇది తప్పు. భగవంతుడు నాకు ఇవ్వాల్సింది బాగానే ఇచ్చాడు' అనుకుంటూనే మళ్ళీ ఈర్ష్య, అసూయ, అసహనం, ఓర్వలేనితనం రూపాల్లో మాటిమాటికి మాత్సర్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంటాం.

అయితే పైన చెప్పుకున్న కథలో మొదటివాడు ఎందుకు భ్రాంతిలో పడలేదు? రెండవవాడు ఎందుకు పడ్డాడు? అని విచారిస్తే మొదటివాడు 'ఇది సినిమా. ఎన్నిసార్లు చూసినా ఇందులో మార్పేమీ ఉండదు. అది ఎప్పటికీ నిజం కాబోదు' అనే జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. ఇక రెండవవాడు సత్యానికి, కల్పనకి భేదం తెలుసుకోలేక ఆ కల్పనే నిజమని భ్రమించి ఎప్పటికైనా అది మంచిగా మారకపోతుందా అనుకుంటూ అందులో లీనమై మళ్ళీ మళ్ళీ ఆత్రంగా చూస్తూనే ఉన్నాడు. ఇదే మనకీ, జ్ఞానులైన మహాత్ములకు ఉన్న తేడా. మనం ఈ చూసే ప్రపంచమంతా సత్యమేననే భ్రమలో పడి 'ఇందులో రమించడం మన ఆథ్యాత్మిక ఉన్నతికి అవరోధం' అని మన బుద్ధి మాటిమాటికి హెచ్చరిస్తూనే ఉన్నా 'ఎప్పటికైనా ఇందులోనే మనకు కావలసింది దొరక్కపోతుందా' అని మళ్ళీ మళ్ళీ లేనిచోటే మన ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్నాం.

మనం సినిమాకి వెళ్ళినప్పుడు అందులోని నవరసాలను మన జీవితంలోనే జరుగుతున్నట్లుగా తాదాత్మ్యం చెంది అనుభవిస్తూనే ఉంటాం కానీ అంతర్లీనంగా 'ఇది కేవలం సినిమా మాత్రమే. నిజం కాదు.' అనే జ్ఞానం మనకు సదా ఉంటుంది. అందుకే సినిమాలో బాంబు పేలితే మనం అక్కడినుంచి లేచి పారిపోము, హత్య జరిగితే పోలీసులకి ఫోన్ చెయ్యము. మహాత్ములకి నిజ జీవితంలో కూడా నిరంతరం ఈ జ్ఞానం ఆరూఢమై ఉంటుంది. అందుకే వారు మనందరి భిన్నత్వాన్ని గుర్తిస్తూ, ఎవరికి తగ్గ రీతిలో వారితో మాట్లాడుతూ, వారి వారి సమస్యలను, సంతోషాలను అన్నింటినీ వింటూ, పరిష్కారాలు సూచిస్తూ ఉన్నా, వారిలో అంతర్లీనంగా 'ఇదంతా ఒక సినిమాలాంటిదే. నిజం కాదు. ఉన్నది భగవంతుడు ఒక్కడే. నేను, నా ఎదురుగా ఉన్నవాడూ, వాడికి సమస్యను సృష్టించిన వాడూ అందరూ ఆ భగవంతుని రూపాలే' అనే జ్ఞానం సదా నిలిచి ఉంటుంది. మనం కూడా అటువంటి జ్ఞానాన్ని పొందేవరకు ఈ భ్రాంతులు తప్పవు.

4, మార్చి 2019, సోమవారం

అభ్యాసం

మనం ఈ ప్రపంచంలో ఏది నేర్చుకోవాలన్నా అభ్యాసం తప్పనిసరి. పుట్టిన పిల్లవాడు తల్లి దగ్గర పాలు త్రాగడం దగ్గరనుండి ముసలివాడైనాక మనవలతో ఆడుకోవడం వరకు ప్రతిరోజూ ఎన్నో విద్యలను అభ్యసిస్తూనే ఉంటాడు. అలాగే నీవెవరో, నీ అసలు స్వరూపం ఏమిటో, ఈ కనిపించే జగత్తు అంతా ఏమిటో తెలిపే ఆథ్యాత్మిక విద్యకు కూడా అభ్యాసం అవసరమే. ఈ అభ్యాసానికి మనకు గురువులు రెండు ఉపకరణాలను ఇచ్చారు. అవే శ్రవణం, మననం. బ్యాంకు లాకరుకు రెండు తాళాలు ఉన్నట్లుగా మన బుద్ధికి కూడా ఈ రెండూ తాళాలే. ఒకే తాళంచెవిని ఇటు త్రిప్పితే తాళం పడుతుంది, అటు త్రిప్పితే తాళం తెరుచుకుంటుంది. అలాగే ఈ శ్రవణ మననాలనే తాళం చెవులను ప్రపంచం వైపుకు త్రిప్పితే బంధానికి దారితీస్తాయి, గురుబోధ వైపుకు త్రిప్పితే మోక్షానికి దారి తీస్తాయి. తాళం పడితే అజ్ఞానం, తెరుచుకుంటే అదే జ్ఞానం.

మనందరం స్వతహాగా పరమాత్మ స్వరూపులమే అయినా ఆ జ్ఞానం మరుగున పడిపోయి "నేను ఫలానా, వీరు నా బంధువులు, ఇది నా కులం, గోత్రం, దేశం, ప్రాంతం" అనే బంధనాలు మనకు మనమే తగిలించుకుని సతమతమౌతున్నాం. మదాలసలాంటి తల్లి మనందరికీ దొరికి ఉంటే, పుట్టిన క్షణంనుండి "నువ్వు ఈ దేహానివి కావు. దీనికి కలిగే హాని వృద్దులు, సుఖదుఃఖాలు నీవి కావు. ఈ దేహానికి పేరు కోటేశ్వర రావు అయినా నీకు ఒరిగేదేమి లేదు, భిక్షపతి అయినా నీకు పోయేదేమీ లేదు. ఈ కనిపించేదంతా నశించిపోయేదే. నీవు శాశ్వతుడవు" అని నూరిపోసేది. కానీ మన తల్లిదండ్రులు మనం పుట్టిన క్షణంనుండి "నేను అమ్మను, నేను నాన్నను, ఇది నీపేరు, మేమంతా నీ బంధువులం, వారు పరాయివారు. ఇది నీ ఇల్లు, అది పరాయిది. ఇది నీ  బొమ్మ, ఎవరికీ ఇవ్వకు. నువ్వు బాగా చదివి మా పేర్లు నిలబెట్టాలి. బాగా సంపాదించాలి, కూడబెట్టాలి." ఇలాంటివే నూరిపోస్తున్నారు. 

నిజానికి చిన్నారి పాపలకు ఈ తరతమ భేదాలు ఏవీ తెలియవు. వారు ఎవరిని చూసినా నవ్వుతారు, చేతిలో ఉన్నది ఎవరడిగినా ఇచ్చేస్తారు. ఒక రుచికరమైన తినుబండారం ఇస్తే ఎలా తింటారో, అలాగే తాము విసర్జించిన మలాన్ని కూడా తీసి నోట్లో పెట్టుకుంటారు. కానీ పెద్దలు చేసే ఈ నిరంతర బోధవలన వారికి అదే శ్రవణ మననాలు కలిగి ప్రాపంచిక బంధాలలో ఇరుక్కుపోతున్నారు. అటువంటి మానవులు తమ నిజ తత్త్వాన్ని తెలుసుకోవటానికై సద్గురువులను ఆశ్రయించినప్పుడు ఆ గురుబోధ శ్రవణం ద్వారా అసలు తత్త్వం అర్థం అవుతుంది. అయితే నిరంతర మననం, అభ్యాసం లేనప్పుడు అది నిలబడదు.

ఒక ఉదాహరణ చూద్దాం. ఒక పిల్లవాడికి చిన్నప్పటినుండి 'రెండు రెళ్ళు ఆరు' అని నేర్పించామనుకోండి, వాడికి అదే శ్రవణం, మననం వలన ఆ తప్పు లెక్కే వాడి మనస్సులో స్థిరంగా నాటుకుపోతుంది. అలాంటి పిల్లవాడు బడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉపాధ్యాయుడు ముందుగా 'రెండు రెళ్ళు నాలుగు' అని చెప్పినా వీడు నమ్మడు. అప్పుడు ఆయన ఒక నాలుగు పెన్సిళ్ళనో, రూపాయి బిళ్ళలనో తీసుకొని ప్రాక్టికల్గా నిరూపిస్తారు. ఈ పిల్లవాడు ముందు ఆశ్చర్యానికి గురైనా తరువాత మెల్లగా అర్థం చేసుకుంటాడు. అయితే అంతకుముందు నరనరానా జీర్ణించుకుపోయిన తప్పుడు లెక్క అంత తేలికగా పోదు. హఠాత్తుగా ఎవరైనా 'రెండు రెళ్ళు ఎంత?' అనగానే ఠక్కున 'ఆరు' అంటాడు. అందుకే ఆ ఉపాధ్యాయుడు వీడికి అర్థం అయిన తరువాత కూడా అనేకసార్లు 'రెండు రెళ్ళు నాలుగు' అని నెమరువేయిస్తూ ఉంటాడు. అయితే పిల్లవాడు ఇంటికి రాగానే మళ్ళీ తల్లి 'రెండు రెళ్ళు ఆరు' అని చెబుతూ ఉందనుకోండి, ఇక వీడికి అసలైన లెక్క రావడానికి ఎంత కష్టం?

అలాగే మనం నిత్యం ఈ ప్రపంచంలో చూసేదంతా సత్యం అనే అందరి ద్వారా వింటున్నాం, దానినే మననం చేస్తున్నాం. ఎప్పుడో ఒకసారి గురువుల ద్వారా "ఇదంతా మిధ్య, నీ అసలు తత్త్వం వేరు" అని విన్నా అది పురాణ వైరాగ్యం లాగా అక్కడినుంచి లేచి ఇవతలకు రాగానే మళ్ళీ మరపునకు వచ్చేస్తోంది. ఎందుకంటే మన శ్రవణ మననాలనే తాళంచెవులు నిరంతరం ప్రపంచం వైపుకే త్రిప్పబడుతున్నాయి, బంధాన్ని కలిగిస్తున్నాయి. మనం పుట్టినప్పటినుండే కాక ఇంతకు ముందు ఎన్నో జన్మలనుండి కూడా ఇదే అభ్యాసం చేస్తూ వస్తున్నాం. ప్రపంచం వైపుకు తిరిగిన ఈ శ్రవణ మననాలు చివరికి అధ్యాస, లేదా భ్రాంతికి దారి తీస్తున్నాయి. ఈ భ్రాంతి తొలగి మనలో జ్ఞానకాంతి ప్రకాశించాలంటే ఇంతకంటే మరెన్నో రెట్లు ఎక్కువగా గురుబోధని శ్రవణం, మననం చేయాలి. అప్పుడు అది నిదిధ్యాసకు, లేదా ఆత్మానందానుభూతికి దారితీస్తుంది.

అంతటి తీవ్రమైన అభ్యాసం లేకపోతే 'రెండు రెళ్ళు నాలుగు' అని ప్రత్యక్షంగా నిరూపణ అయినా మళ్ళీ ఆ పిల్లవాడు హఠాత్తుగా అడిగితే ఏమరుపాటుగా 'ఆరు' అని చెప్పినట్లే, మనకు ఒకవేళ భగవద్దర్శనం కలిగినా కూడా మళ్ళీ మాయ ఆవరించి ఈ జగత్తే సత్యమనే భ్రమలో పడిపోతాం. ఎంతమంది రాక్షసులకు తపస్సుల వలన భగవద్దర్శనం కాలేదు? వారందరూ ఆ క్షణం గడవగానే తిరిగి మాయలో పడిపోలేదా? Practice doesn't make you perfect. Practice just makes it permanent. So, beware of what you practice and make sure you always practice the perfect thing. "అభ్యాసం మనలను పరిపూర్ణులుగా చేస్తుంది" అనే ఒక భ్రమ ప్రచారంలో ఉంది. కానీ పైన చెప్పుకున్నట్టు మనం తప్పు విషయాన్ని అభ్యాసం చేస్తే ఆ తప్పే మన మనస్సులో శాశ్వతంగా నాటుకుపోతుంది. ఎప్పటికీ పరిపూర్ణులం కాలేము. అభ్యాసం కేవలం మన మనస్సును అభ్యసించే విషయం మీద స్థిరంగా నిలుపుతుంది. కాబట్టి పరిపూర్ణుడు కావాలంటే పరిపూర్ణమైన విషయాన్నే అభ్యాసం చేయాలి.

మన మనస్సుకు పట్టిన అజ్ఞానానికి కారణమైన వాసనలను, కర్మలను గురుబోధా శ్రవణ మననాలు దగ్ధం చేసివేస్తాయి. శ్రవణం వలన భూతకాలంలోని కర్మలు, వాసనలు రహితం అవుతాయి. నిరంతర మననం వలన వర్తమాన కాలంలోని కర్మలు, వాసనలు రహితం అవుతాయి. ఇక అలా నిదిధ్యాసను పొందినవాడికి ఇక భవిష్యత్తులో కర్మలు, వాసనలు అంటుకొనే  ప్రశ్నే లేదు. అయితే నిజమైన శ్రద్ధ, వైరాగ్యం కలిగి శ్రవణం చేయాలి. అలా శ్రవణం చేసిన పరీక్షిత్తు మోక్షాన్ని పొందినట్లే మనమూ పొందగలం.

3, ఫిబ్రవరి 2019, ఆదివారం

పరిపూర్ణ జ్ఞానం

గురుదేవులు శ్రీ బాబూజీ మహారాజ్ వారు పరిపూర్ణ జ్ఞానానికి ప్రతీకగా చంద్రుణ్ణి చెప్పేవారు. "ఎలాగైతే పౌర్ణమికి ఒకరోజు కలిపినా, తీసివేసినా అది పౌర్ణమి అనిపించుకోదో అలాగే పరిపూర్ణమైన జ్ఞానానికి ఇక కలపడానికి కానీ తీసివేయటానికి కానీ ఏమీ ఉండదు" అని. అలాగే మనం "సర్వ విజ్ఞాన తేజమును చంద్రకళగ శిరమున గల మహేశ్వరివి నీవే" అని అమ్మవారి స్తోత్రంలో చదువుకుంటాం కదా. ఇంకా శ్రీ గురుదేవులు "ఎప్పటికీ ఈ నామాన్ని రూపాన్ని మాత్రమే ప్రేమిస్తూ ఇంతవరకే గురుదేవులు అనుకుంటే లాభంలేదు. కనిపించేవన్నీ ఎప్పటికైనా నశించిపోయేవే. ఈ నామరూపాలను దాటి సర్వే సర్వత్రా నిండి నిబిడీకృతమైన గురుదేవుల నిర్గుణ సౌందర్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అప్పుడే మీ ఆనందం శాశ్వతమౌతుంది" అని కూడా చెప్పేవారు. 

మనం ఈ రెండింటినీ కొద్దిగా సమన్వయం చేసి చూద్దాం. చంద్రుడనగానే మనకు పరమేశ్వరుడు గుర్తుకు వస్తాడు. ఆయన చంద్రమౌళి కదా. అయితే ఆయనను కేవలం కైలాసవాసిగానో, పార్వతీపతిగానో ఒక రూపానికి, నామానికి, ప్రాంతానికి మాత్రమే పరిమితమైనవాడిగా చూసినప్పుడు మనకు ఆయన శిరస్సుపై చవితి చంద్రుడు మాత్రమే కనిపిస్తాడు. అంటే అది పరిపూర్ణమైన జ్ఞానం కాదనడానికి ప్రతీక అన్నమాట. మరి పరిపూర్ణ జ్ఞానానికి ప్రతీక అయిన పూర్ణచంద్రుడు ఎక్కడ ఉంటాడో చూద్దాం. "ఆపాతాళ నభ స్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫురత్ జ్యోతిస్పాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేన్దు వాంతామృతైః" పాతాళం నుండి ఆకాశం వరకు ఉన్న అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నీ నిండిపోయి శుద్ధ స్ఫటిక జ్యోతిర్లింగంగా పరమేశ్వరుడు ప్రకాశిస్తున్నప్పుడు ఆయన శిరస్సుపై బ్రహ్మామృత వెన్నెలలు కురిపిస్తూ పూర్ణ చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అని ఈ పై శ్లోకభాగం చెబుతోంది.

అయితే అలా బ్రహ్మాండ వ్యాప్త దేహుడై పరమేశ్వరుడు ఉన్నప్పుడు ఇక ఆయనకు శిరస్సు ఎక్కడ? ఆ శిరస్సుపై ప్రకాశించడానికి చంద్రునికి చోటెక్కడ? అసలిదంతా చూసి వర్ణించే మనమెక్కడ? లోతుగా ఆలోచిస్తే ఆ చంద్రుడు, ఈ వర్ణించేవాడూ ఇద్దరూ ఆ పరమేశ్వరుని విశ్వరూపంలోనే ఉన్నారు కానీ వేరుగా లేరు. అంటే జ్ఞానం అనబడే తెలుసుకోవడం, జ్ఞాత అనబడే తెలుకునేవాడూ జ్ఞేయమనబడే తెలుసుకునే వస్తువైన పరమేశ్వరునిలోనే లీనమైపోయారన్నమాట. అక్కడ ఉన్నదంతా పరమేశ్వరుడే కానీ వేరే వస్తువేదీ లేదు. అదే పరిపూర్ణ జ్ఞానం. 

శ్రీ గురుదేవులు ఇంకా "భక్తియొక్క పరాకాష్టయే జ్ఞానం" అని చెప్పేవారు. మరి మనం ప్రపంచంలోని భక్తుల పేర్లను స్మరించుకుంటే అందులో మొట్టమొదటగా వచ్చే పేరు ప్రహ్లాదునిది. ఆయన బయటికి ఎంతటి పరమ భక్తుడో లోపల అంతటి జ్ఞాని. గురుదేవుడైన నారదునినుండి నారాయణ మంత్రం పొందినా ఆయన ఏనాడూ ఆ నారాయణుని రూపాన్ని భౌతికంగా చూడలేదని చెప్పవచ్చు. నారదుని ఆశ్రమంలో నారాయణుని ప్రతిమ ఉన్నదనుకున్నా ప్రహ్లాదునికి ఊహ తెలిసేలోగానే తండ్రి వచ్చి ఇంటికి తీసుకువెళ్లిపోవడం జరిగింది. ఇక నారాయణునికి బద్ధశత్రువైన ఆ రాక్షసుని గృహంలోగాని, రాక్షస గురువుల ఆశ్రమంలోగాని నారాయణుని ప్రతిమ ఉండే అవకాశమే లేదు కదా! మరి ప్రహ్లాదుడు ఆరాధించినది సర్వవ్యాపకమైన ఆ నారాయణుని నిర్గుణతత్వాన్నే కదా. అందుకే "ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు" అని నిర్భయంగా చెప్పగలిగాడు. అది అనుభవ జ్ఞానమే గానీ వాచాజ్ఞానం కాదు. 

అయితే "సగుణం కంటే నిర్గుణం గొప్పదంటావా?" అని మీకిక్కడ సందేహం రావచ్చు. ఇక్కడ మన చర్చ సగుణ నిర్గుణాల గొప్పతనాన్ని గురించి కాదు. కేవలం సగుణంలోనే ఆగిపోకుండా పరమాత్ముని నిర్గుణ సౌందర్యాన్ని కూడా దర్శించగలగాలి, అప్పుడే జ్ఞానం పరిపూర్ణమౌతుంది అని. తన ఉపాసనా కాలమంతా నారాయణుని నిర్గుణంగా దర్శించాడు కాబట్టే ఆయన సరిక్రొత్తదైన నరసింహాకృతిలో వచ్చినా ప్రహ్లాదుడు వెంటనే గుర్తించగలిగాడు. అదే కేవలం సగుణారాధన మాత్రమే చేసిన ఎందరో భక్తులు, దేవతలు సైతం పరమాత్ముడు వేరే రూపంలో దర్శనమిస్తే గుర్తించలేని సందర్భాలు మన పురాణాలలో అనేకం కనిపిస్తాయి. అయితే భావంలో ఎప్పుడూ అద్వైత దృష్టి కలిగి ఉండాలి కానీ అది క్రియలో పనికిరాదని కూడా పెద్దలు చెబుతారు. "అద్వైతం త్రిషులోకేషు, నాద్వైతం గురుసన్నిధౌ" - మూడు లోకాలలో ఎక్కడైనా అద్వైత భావన కలిగి ఉండు కానీ గురు సన్నిధిలో మాత్రం దాస్యభావనతోనే ఉండాలి. 

ఒకసారి కొందరు పండితుల మధ్యలో "సగుణం గొప్పదా? నిర్గుణం గొప్పదా?" అనే ఎడతెగని చర్చ జరుగుతున్నప్పుడు శ్రీగురుదేవులు అక్కడకు వెళ్లడం తటస్థించింది. తమ సమస్యను తీర్చమని వారు శ్రీగురుదేవులను ప్రార్ధించగా వారు "అసలు సమస్యంతా మీరు సగుణనిర్గుణాలను వేరు వేరుగా చూడటంలోనే ఉంది. ఈ రెండూ పరమాత్మయొక్క రెండు రకాల విభూతులే కానీ పరస్పరం విభిన్నమైనవి కావు. సగుణ రూపంలో పరమాత్ముని ఆరాధించకపోతే భక్తి కలుగదు. అలాగే ఆయన నిర్గుణ సౌందర్యాన్ని సర్వేసర్వత్రా దర్శించలేకపోతే జ్ఞానం పరిపూర్ణం కాదు. సగుణ నిర్గుణాలు రెండూ నాణానికి రెండు పార్శ్వాల వంటివి. రెండూ ఉంటేనే ఆ నాణానికి విలువ" అని వారి సందేహాన్ని నిర్మూలించడం జరిగింది. 

5, జనవరి 2019, శనివారం

సూక్ష్మంలో మోక్షం

మనం సాధారణంగా మోక్షమంటే అదేదో చాలా పెద్దది, దానిని సాధించాలంటే మనం ఎంతో ఎదగాలి అనుకుంటాం. కానీ ఈ సృష్టిలో చూస్తే పెద్ద పెద్ద ప్రాణులే త్వరగా బంధింపబడతాయి. ఒక పులినో, జింకనో బంధించినంత తేలికగా ఒక ఎలుకనో, చీమనో బంధించగలమా? అలాగే పెద్ద చేపలు తేలికగా వలలో పడతాయి కానీ ఎంత చిన్న చేప అయితే వలలోనుండి అంత తేలికగా తప్పించుకోగలుగుతుంది. అసలు "నేను చాలా పెద్దవాణ్ణి, లేదా గొప్పవాణ్ణి" అనుకోవడమే పెనుమాయ. అంతకు మించిన బంధనం ఏముంటుంది? నేను చాలా చిన్నవాడిని, భగవద్భక్తుల దాసానుదాసుడిని అనుకోవడమే మోక్షానికి దగ్గరి దారి. 

సురస పెద్ద నోటిలో చిక్కినపుడుగానీ, లంకలో రాక్షసులు త్రాళ్ళతో తనను బంధించినపుడుగానీ హనుమంతుడు సూక్ష్మరూపాన్ని ధరించే కదా ఆ బంధనములనుండి విడివడగలిగింది? "సర్వహీన స్వరూపోహం" అని పరమాత్మ తత్వాన్ని తేజోబిందూపనిషత్ నిర్వచిస్తోంది. "అణోరణీయాం" అయినవాడే "మహతోమహీయాం" కాగలడు. అయితే మానవుడు ఈ సత్యాన్ని గుర్తించలేక లేనిపోని అహంకారాన్ని తెచ్చిపెట్టుకొని "నా అంతటివాడు లేడు" అని విర్రవీగి చివరికి ఆ మాయకు బద్ధుడై అనేక జన్మలను ఎత్తుతున్నాడు. తన నిజస్థితియైన ఆత్మతత్వాన్ని గుర్తించిననాడు అదే ఆత్మతత్వం సర్వేసర్వత్రా వ్యాప్తమై ఉన్నదనే జ్ఞానం కూడా కలుగుతుంది. అప్పుడింక ఒకరు గొప్ప ఇంకొకరు తక్కువ అనే భావనే కలుగదు. 

ఈ చరాచర సృష్టి అంతా పంచభూతాలతోనే నిర్మించబడినప్పటికీ వివిధ నిష్పత్తులలో వాటి వాటి కలయికవల్ల మనకు స్థూలంలో ఇన్నిన్ని వస్తుభేదాలతో కనిపిస్తోంది. ఈ స్థూల దృష్టి ఉన్నంతకాలం ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అనే భేదభావన తొలగదు. అదే మనం సూక్ష్మదృష్టితో చూస్తే సృష్టిలోని ప్రతి వస్తువూ, ప్రాణీ అణువులతోనూ, పరమాణువులతోనూ నిర్మితమైనవే కదా. మరి ఈ పరమాణువులన్నీ ఒకే విధమైన ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లతో ఏర్పడినవే కదా! ఇలా సైన్సు ప్రకారం చూసుకున్నా సర్వసమానత్వం మనకు గోచరిస్తుంది. ఇక భక్తుడవై చూస్తే ఈ సమస్త సృష్టి పరమాత్మనుంచే వచ్చింది కదా? మరి అలాంటప్పుడు ఇక హెచ్చుతగ్గులకు తావెక్కడ? మరి జ్ఞాని దృష్టితో చూస్తే ఈ సర్వమూ తన(పరమాత్మ) స్వరూపమే. ఇలా ఏవిధంగా చూసినా సరైన పరిశీలన చేసినవాడికి హెచ్చుతగ్గులు లేవని అర్థమౌతుంది. 

మానవుడు ఈ సూక్ష్మదృష్టిని అలవరచుకోలేక కేవలం స్థూల దృష్టితో మాత్రమే చూసి అహంకార మమకారాలకు లోనై బంధనాలను కొనితెచ్చుకుంటున్నాడు. సూక్ష్మదృష్టి, లేదా సూక్ష్మ భావన అంటే దేనికి అంటకపోవటం. "యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే! సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే" అని భగవద్గీత చెబుతోంది. ఆకాశం సర్వవ్యాపమై ఉన్నా దాని సూక్ష్మత్వం చేత దేనికీ అంటకుండా ఉంటోంది. నిజానికి ఆకాశంకన్నా పెద్దది విశాలమైనది ఈ సృష్టిలో ఏదీ లేదు కదా. అంత పెద్దదైనా దాని గుణం సూక్ష్మత్వం. అందుకే అది దేనిచేతా బంధింపబడదు. అలాగే దేహమంతా వ్యాపించియున్నా తన సూక్ష్మత్వం చేత ఆత్మ కూడా దేనికీ అంటదు, దేనిచేతా బంధింపబడదు. 

ఇదే సూక్ష్మంలో మోక్షమంటే. బంధన లేకపోవడమే మోక్షం కదా! నిజానికి మన నిజస్థితి సదా మోక్షస్థితే. అయితే అట్టి సదాముక్తయైన ఆత్మను నేననే సూక్ష్మాన్ని గుర్తించలేక ఈ స్థూలదేహం నేననే భ్రమలోపడి మనం బంధితులం అయ్యామని తలపోస్తున్నాం, ముక్తిని కోరుకుంటున్నాం. శ్రీగురుదేవులు బోధించినట్లుగా "ముక్తి అనేది పొందేది కాదు. అది నీ స్వరూపమై/స్వభావమై  ఉన్నది. నువ్వు చేయవలసిందల్లా దానిని గుర్తించడమే." దానికోసం మనం ఈ సూక్ష్మదృష్టిని అలవరచుకోవాలి. ఆథ్యాత్మికంగా ఎదగడం అంటే సమానత్వ దృష్టి సాధించడమే. సమదృష్టి కలవాడే పండితుడని, జ్ఞానియని భగవద్గీతలో అనేకమార్లు చెప్పబడింది. 

నేలమీద ఉన్నవాడికి కొన్ని ఎత్తుగానూ, కొన్ని పల్లంగానూ కనిపిస్తాయి కానీ విమానంలో ఎంతో ఎత్తులో ఎగురుతున్నవాడికి ఈ భేదాలు తెలుస్తాయా? వాడికి క్రింద అంతా సమతలంగానే గోచరిస్తుంది. అలాగే ఆథ్యాత్మికంగా తక్కువ స్థాయిలో ఉన్నవాడే ఇంకా "నేను గొప్ప, నువ్వు తక్కువ" అని మాట్లాడుతాడు కానీ ఉన్నతిని సాధించినవాడు ఎన్నడూ ఈ తరతమ భేదాలు చూడడు.