26, జనవరి 2023, గురువారం

లక్ష్మక్క

ఆశ్రమ భక్తులందరూ 'లక్ష్మక్క' అని ఆత్మీయంగా పిలుచుకొనే శ్రీ రామలక్ష్మీ ప్రసాద మాతాజీవారు శ్రీ గురుసాయుజ్యం చెందారు. విధివశాత్తు పిన్న వయసులోనే తమకు కలిగిన వైధవ్యాన్ని శాపంగా భావించక రామభక్తిలో లీనమై తద్వారా నిరంతర గురురామ సేవాభాగ్యమనే మహత్తర వరాన్ని పొందిన ధన్యజీవి లక్ష్మక్క. శ్రీగురుదేవులను ఆశ్రయించి తమ భక్తిప్రపత్తులతో వినయవిధేయతలతో వారిని మెప్పించి వారికి అంతేవాసిగా పరిచర్యలు చేసే అర్హతను, శ్రీవారి నిత్య అర్చామూర్తులను పూజించుకొనే భాగ్యాన్ని పొందారు. అంతేకాక భౌతిక బంధాలపై వైరాగ్యాన్ని సాధించి, తమ మాతృమూర్తి అంత్యకాలంలో తాము ఆమె చెంత ఉండి ఆమెకు భ్రాంతిని కలిగించడం కంటే గురుదేవుల సేవలో ఉండి తద్వారా తమకు, తల్లిగారికి కూడా జన్మరాహిత్యాన్ని సాధించడం ఉత్తమమనే వివేకాన్ని కూడా సాధించిన గొప్ప ఆధ్యాత్మిక సాధకురాలు లక్ష్మక్క.

నిజానికి తాము కోటీశ్వరురాలైనా ఆశ్రమ ప్రారంభోత్సవానికి కేవలం మూడు చీరలతో వచ్చిన లక్ష్మక్క శ్రీగురుదేవులు తనకు శ్రీ బాబూ విజ్ఞానమందిర సంరక్షణ భారాన్ని, ‘అమ్మగది’లో పూజాభాగ్యాన్ని ప్రసాదించడంతో అప్పటినుండి పూర్తి నిరాడంబర జీవితాన్ని అవలంబించి గత యాభై సంవత్సరాలుగా తమ బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు. విజ్ఞానమందిరం, ఆలయాల పరిధి దాటి ఎన్నడూ బయటకు రాకపోయినా, ప్రతిరోజూ ఏ అర్చామూర్తికి ఏ పూల మాలలు సిద్ధం చేయాలి, ఎటువంటి వస్త్రాలు, ఆభరణాలు అలంకరించాలి వంటి నిర్ణయాలతో పాటు పూజకు, అభిషేకాలకు కావలసిన సామగ్రి సమస్తం సిద్ధం చేయడం, ఏ సమయానికి అది అందించడం లక్ష్మక్కకే చెల్లు.

శ్రీ బాబూజీ మహరాజ్ వారు ఎప్పుడూ ‘ఆశ్రమ సేవయే గురుసేవ’ అని చెప్పేవారు. వారు ఎక్కడికైనా సత్సంగాలకు బయలుదేరినప్పుడు అవసరానికి మించిన భక్తులు వారితో ప్రయాణమైతే ‘సత్సంగానికి మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉండి ఆశ్రమాన్ని చూసుకుంటాను’ అనేవారు. ‘అందరూ బయటకు వెళ్ళిపోతే ఆశ్రమ సంరక్షణ ఎవరు చూసుకుంటారు?’ అని మందలించేవారు. శ్రీగురుదేవుల ఈ వాక్కులనే మహామంత్రంగా స్వీకరించిన లక్ష్మక్క ఎన్నడూ ఆశ్రమాన్ని విడిచి వెళ్ళలేదు. అలాగే తమను కలిసిన భక్తులను కూడా ఎక్కువగా ఆశ్రమంలోనే ఉండమని ప్రోత్సహించేవారు.

భక్తుల సేవయే భగవంతుని సేవ అని బలంగా నమ్మిన లక్ష్మక్క ఆశ్రమానికి బయటనుంచి వచ్చిన భక్తులకు పూజాదికాలకు సామగ్రిని సమకూర్చడం, తీర్థ ప్రసాదాలను, మంత్రపూతమైన కుంకుమ అక్షతలను అందించడం వంటి సేవలను ఎంతో ఉత్సాహంగా చేసేవారు. అలాగే ఏ చెట్టుకు కానీ, గోవుకు కానీ వ్యాధి సోకి క్షీణిస్తే వాటికి పెద్దమొత్తంలో జగన్మాత తీర్థం పోయించి వాటిని మళ్ళీ పూర్వస్థితికి తీసుకొచ్చేవరకు విడిచిపెట్టేవారు కాదు. అయితే ఏ సేవ చేస్తున్నా కర్తృత్వభావన లేక, సేవ చేసేది, చేయించేది, ఆ సేవను అందుకొనేది శ్రీగురుదేవులే అన్న దృఢవిశ్వాసాన్ని కలిగి ఉండటం విశేషం.

మా చిన్నప్పుడు దసరా వంటి ఉత్సవాలకు ముందు శ్రీ బాబూ విజ్ఞాన మందిరాన్ని శుభ్రపరచడానికి వెళితే అక్కడ అన్ని పనులూ లక్ష్మక్కే దగ్గరుండి చేయించేవారు. ఫ్యానుల్ని, లైట్లను సబ్బునీటితో శుభ్రపరచడం, బూజులు దులపడం ఇలా ఏ పని చేసినా మేము అంతా శుభ్రం అయిపోయింది అని తృప్తి పడిన తరువాత ఆవిడ ఏ మూలో బూజు చూపించడం, ఏ ఫ్యాను రెక్కమీదో ఇంకా దుమ్ము చూపించడం వంటివి చేసేవారు. పైగా ‘శ్రీ బాబూజీ మాతో ఇలాగే చేయించేవారు. మేము అంతా శుభ్రపరచిన తరువాత వారు ఎక్కడో ఒకచోట దుమ్మూ, బూజో చూపించేవారు’ అని చెప్పేవారు. అలాగే దసరా ఉత్సవాలు ముగిసిన తరువాత అంతవరకు ఉపయోగించిన షామియానాలు, కార్పెట్లు వంటివి దగ్గరుండి ఏ మడతలోనూ ఒక్క అంగుళం కూడా తేడా రాకుండా జాగ్రత్త పరచేవారు. ఇలా రోజు మొత్తంలో తాము ఏ పని చేస్తున్నా ‘ఇది ఇలా చేస్తేనే బాబూజీకి ఇష్టం, ఈ పని బాబూజీ ఇలా చేయించేవారు’ అనుకుంటూ నిరంతరం బాబు నామస్మరణలోనే గడిపేవారు. ఇంతకంటే భక్తియోగం, కర్మయోగం ఇంకొకటి లేదు కదా!

ఆశ్రమ సేవ విషయంలో అవతలివారు ఎంతటి ప్రముఖులైనా ఏమాత్రం భయపడకుండా సూటిగా, నిష్కర్షగా మాట్లాడటం లక్ష్మక్క ప్రత్యేకత. ‘ఈరోజు పొగిడి రేపు తిట్టే లోకుల మెప్పు పొందటానికి ప్రయత్నిస్తావా? లేక నిరంతరంగా, నిర్హేతుకంగా తన కృపారసాన్ని వర్షించే భగవంతుని మెప్పు పొందటానికి ప్రయత్నిస్తావా? ఇందులో ఏది ఉత్తమం?’ అని శ్రీగురుదేవులు తరచుగా చేసే హెచ్చరికను నరనరాల జీర్ణించుకోవడమే లక్ష్మక్కలోని ఈ నిర్భీతికి కారణం. లోకులు తమను తిట్టుకున్నా, తాము చేసే పని గురుదేవులు మెచ్చే విధంగా ఉంటే చాలనేది ఆమె సిద్ధాంతం. తమవద్ద పనిచేసే వారికి కూడా ఆమె ఇదే నూరి పోసేవారు. ‘ఈ మాట ఇలా చెబితే అవతలివారు ఏమైనా అనుకుంటారేమో, లేక తనను తిడతారేమో’ అని ఎవరైనా సంకోచించినప్పుడు లక్ష్మక్క వారిని అనునయిస్తూ, ‘ఈ పని నువ్వు నీకోసం చేయడం లేదు కదా. గురుదేవుల సేవగా భావించి చేసుకుంటున్నావు. మరి ఆ సేవలో ఎవరైనా నిన్ను నిందించినా గురుదేవుల సేవ కోసం ఒక చిన్న మాట పడితే నీకొచ్చిన నష్టమేమిటి?’ అని ప్రశ్నించి వారిలో కూడా ఈ వివేకాన్ని రగిలించేవారు.

ఆశ్రమ స్థాపన జరిగిన క్రొత్తలో అంతగా వసతులు ఉండేవి కావు. శ్రీగురుదేవుల సేవకై ఒక్కటే టేబల్ ఫ్యాన్ ఉండేది. శ్రీ బాబూజీ మహరాజ్ వారు క్రింద అమ్మగదిలో పూజ చేసుకొనేటప్పుడు లక్ష్మక్క ఆ ఫ్యాన్ క్రిందికి తెచ్చి, మళ్ళీ శ్రీవారు పూజ ముగించి పై అంతస్తుకు చేరుకునేలోగా మూడేసి మెట్లు ఒక్క అంగలో ఎక్కుతూ ఆ ఫ్యానును పైకి చేర్చేవారు. ఇలా దేహాన్ని మరచి నిరంతర తత్పరతతో గురుసేవ చేసుకొన్న శ్రీ లక్ష్మక్క సరిగ్గా వైకుంఠద్వారం తెరచి శ్రీగురునారాయణులు లోకాలకన్నింటికీ దర్శనభాగ్యాన్ని ప్రసాదించే సమయానికి కొద్ది ముందుగానే అందుకు తగిన ఏర్పాట్లు చేయడానికా అన్నట్లు ముక్కోటి ఏకాదశికి కొద్ది ఘడియలు ముందుగా తమ పాంచభౌతిక దేహాన్ని విడిచి సద్గురు సాయుజ్యాన్ని పొందారు.
ఇటువంటి మహాత్ములు చూపిన మార్గంలో నడిచి గురుసేవలో, ఆశ్రమసేవలో, భక్తులసేవలో మన జీవితాలను ధన్యం చేసుకోవటమే మనం వారికి అర్పించగలిగిన ఘన నివాళి.

మహాలక్ష్మి

 నిరాకార పరబ్రహ్మ స్వరూపిణి అయిన జగన్మాతను మనం ఈ నవరాత్రి ఉత్సవాలలో సాకారంగా వివిధ ఆకృతులలో పూజించుకుంటూ ఉంటాం కదా! అందులో ముఖ్యమైన మూడు ఆకృతులు ముగురమ్మలుగా పిలువబడే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఇందులో మహాకాళి రూపిణి అయిన పార్వతీ/దుర్గాదేవి గురించి మనం అనేక కథలు దేవీభాగవత రూపంలో ఈ పదిరోజులూ వింటూనే ఉన్నాం. అలాగే సరస్వతీదేవి గురించి కూడా మూలా నక్షత్రం రోజున మనం విశేషంగా చెప్పుకుంటాం. అయితే లక్ష్మీదేవి గురించి మాత్రం మనం అంతగా చెప్పుకోం. ఆధ్యాత్మిక సాధనలో ఉన్న మనకు ఐశ్వర్యంతో పెద్దగా పనిలేదని ఒక ఆలోచన కావచ్చు.


అయితే లక్ష్మీ కటాక్షం కేవలం సంపదకు మాత్రమే కాదు. మనం కడుపునిండా అన్నం తినగలుగుతున్నాం అంటే అది ధాన్యలక్ష్మి కటాక్షం. ఆ అన్నం సంపాదించుకోవడానికి కావలసిన చదువు అబ్బిందంటే అది విద్యాలక్ష్మి కటాక్షం. అలాగే ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి ఇలా ఈ సృష్టిలో మనకున్నవన్నీ ఆ తల్లి దయవలన కలిగినవే. వీటన్నిటికన్నా ఉత్కృష్టమైనది, మనం కాంక్షించవలసినది మోక్షలక్ష్మి అనుగ్రహం.

ఈశానాం జగతోస్య వేంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం
తద్వక్షస్థల నిత్యవాస రసికాం తత్ క్షాంతి సంవర్ధినీం
పద్మాలంకృత పాణి పల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం
వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వన్దే జగన్మాతరం||

ఈశానాం జగతోస్య వేంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం - ఈ జగత్తు అంతటికీ ఈశ్వరుడు, వేంకటపతి అయిన విష్ణువుకు అత్యంత ఇష్టురాలు ఆ తల్లి. ఎంతటి ప్రేయసి అంటే - వేదరూపంలో ఉన్న విద్యాలక్ష్మిని సోమకాసురుడు అపహరిస్తే స్వామి మత్స్యావతారం ఎత్తాడు. దూర్వాసుని శాపంతో ఇంద్రుని వద్దనున్న ధనలక్ష్మి అంతా సముద్రం పాలైపోతే తిరిగి ఆ తల్లిని పొందటం కోసం కూర్మావతారం ఎత్తాడు. భూమాత రూపంలో ఉన్న ధాన్యలక్ష్మిని హిరణ్యాక్షుడు బాధిస్తుంటే వరాహావతారం ఎత్తాడు. చెంచులక్ష్మి రూపంలో ఉన్న అమ్మను పొందటానికి నరసింహావతరం ఎత్తాడు. ముల్లోకాల సంపద రూపంలో ఉన్న ఐశ్వర్యలక్ష్మిని బలి చక్రవర్తి నుండి విడిపించటానికి వామనావతారం, త్రివిక్రమావతారం ఎత్తాడు. అందరికీ సమంగా చెందవలసిన లక్ష్మి అనుగ్రహాన్ని రాజులు తమవద్దనే బంధించి అహంకారులై ప్రవర్తిస్తుంటే పరశురామావతారం ఎత్తాడు. ఇక రామావతరంలో అయితే అమ్మతో కలిసే వచ్చి, ఆ అమ్మ దూరమైనందుకు ఎంత వేదన అనుభవించాడో చెప్పలేం. ఆ అమ్మను తిరిగి పొందటానికి ఎన్నో అసాధ్యమైన పనులు చేశాడు. కృష్ణావతారంలో ఎంతో మంది రాజులతో, చివరికి బావమరిదితో కూడా యుద్ధం చేసి మరీ అమ్మను దక్కించుకున్నాడు. మోక్షలక్ష్మి అనుగ్రహం పొందే ఆలోచన లేక ఇతర లక్ష్ముల కోసం ప్రాకులాడుతూ చివరికి కష్టాలతో మట్టిపాలైపోయే మనుష్యులకు మోక్షమార్గాన్ని అందించటానికై బుద్ధావతారం ఎత్తాడు. అధర్మం అతిగా ప్రబలిన చోట లక్ష్మి నిలువలేదని ఆ అధర్మాన్ని సమూలంగా రూపుమాపటానికి కల్కి అవతారం ఎత్తాడు. అమ్మకు దూరమై క్షణమైనా నిలువలేనని వైకుంఠాన్ని కూడా విడిచిపెట్టి వేంకటపతి అయ్యాడు.

స్వామికి అమ్మ అంటే ఎంత ప్రేమో, అమ్మకు స్వామి మీద అంతకంటే ఎక్కువ ప్రేమ. తద్వక్షస్థల నిత్యవాస రసికాం - ఎప్పుడూ ఆ స్వామి వక్షస్థలంలోనే నివసించడమే అమ్మకు అత్యంత ప్రీతికరం. తనను అడవులపాలు చేసినా, పదహారు వేలమంది సవతులను తెచ్చినా ఏనాడూ కోపించని అమ్మ తన స్వామికి అవమానం జరిగితే మాత్రం తట్టుకోలేకపోయింది. అది కూడా తన శాశ్వత నివాస స్థానమైన వక్షస్థలం మీద ఒక ఋషి తంతే భరించలేకపోయింది. అలిగి కొల్హాపురానికి వెళ్లిపోతే అంతటి స్వామి కూడా భూమిపైకి దిగివచ్చి ఎంతో తపస్సు చేసి మళ్ళీ ఆవిడను దక్కించుకోవలసి వచ్చింది.

తత్ క్షాంతి సంవర్ధినీం - స్వామిలో ఓర్పును వృద్ధి పొందించేది అమ్మ. ఇప్పుడైతే రోజులు మారిపోయాయి కానీ తరతరాలుగా, మన చిన్నప్పుడు కూడా అందరికీ నాన్న అంటే హడల్. ఒక తప్పు చేసినా, లేదా నాన్నను ఏదైనా అడగలన్నా అమ్మ కొంగు చాటున నిలుచోటమే తెలుసు. నాన్న కోపాన్ని చల్లబరిచి ఆయనలో ఓర్పును కలిగించి మనకు అనుకూలంగా మార్చేది అమ్మే కదా! అసలు 'స్త్రీ బుద్ధిః ప్రళయాంతకః' అని ఆడవాళ్ళ మాట వింటే ప్రళయాలు సృష్టిస్తారని తప్పుగా అర్థం చెబుతారు కానీ అక్కడ 'ప్రళయ కారకః' అనలేదు కదా, 'ప్రళయాంతకః' అన్నారు కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. భర్తో, కొడుకో అప్పో తప్పో చేస్తే కోపంగా ఇంటిమీదకు వచ్చిన వాడిని కూడా 'అన్నయ్యగారూ! ఈ గొడవలన్నీ ఎప్పుడూ ఉండేవే! ఇదిగో ఈ కాఫీ తీసుకోండి. వదినగారు, పిల్లలు బాగున్నారా?' అని ఆ ఇంటి గృహలక్ష్మి నాలుగు అనునయ మాటలు మాట్లాడేసరికి అంతటి ప్రళయం కూడా అంతం అయిపోతుంది.

పద్మాలంకృత పాణి పల్లవ యుగాం పద్మాసనస్థాం - అమ్మ తన రెండు నునులేత చేతులలో పద్మాలను పట్టుకొని ఉంటుంది. అలాగే ఆవిడ ఆసనం కూడా పద్మమే. అసలు దేవతలందరూ పద్మంలో కూర్చోవటమో, లేదా వారి ముఖాలను, నేత్రాలను, చేతులను, పాదాలను ఇలా ప్రతి అవయవాన్ని పద్మంతో పోల్చటం ఎందుకంటే అందులో ఏదో ఒక ముద్రమీద మన మనస్సు తుమ్మెదలా అతుక్కుపోవాలని.

శ్రియం - సరే, ఇక శ్రీ అంటే లక్ష్మీదేవే కదా!

వాత్సల్యాది గుణోజ్వలాం - అమ్మకు ఈ సృష్టిలోని ప్రతి జీవిపైన ఎంతటి వాత్సల్యమో! శక్తిస్వరూపిణియైన పార్వతీదేవి అనేక రూపాలలో ఎందరో రాక్షసులను సంహరించిన కథనాలు మనం ఎన్నో వింటూ ఉంటాం, కానీ లక్ష్మీదేవి ఎవరిమీదా ఆగ్రహం చూపించిన సందర్భం మనకు కనబడదు. లక్ష్మీ అష్టకంలో చాలామంది 'డోలాసుర భయంకరి' అని చదువుతారు కానీ నిజానికి డోలాసురుడు అనే రాక్షసుడు ఎవరూ లేరు. అది 'కోలాసుర భయంకరి'. కోల అంటే వరాహం. అడవిపంది రూపంలో ఉన్న ఆ రాక్షసుడు లోకాలను పీడిస్తుంటే, స్త్రీ చేతిలోనే సంహరింపబడాలని వాడికి ఉన్న వరం కారణంగా తప్పనిసరి పరిస్థితులలో మహాలక్ష్మి అమ్మ వాడి అశాశ్వతమైన దేహాన్ని సంహరించినా మళ్ళీ తన వాత్సల్యంతో ఆ బిడ్డ పేరును శాశ్వతం చేస్తూ ఆ ప్రదేశాన్ని కొల్హాపురంగా మార్చి తాను శాశ్వతంగా అక్కడ కొలువై ఉండిపోయింది.

భగవతీం - అమ్మ స్వయంప్రకాశ స్వరూపిణి. మనం త్రిమూర్తుల గురించి గొప్పగా చెప్పుకొని ముగ్గురమ్మలు ఏదో వారి భార్యలు అని తేలిగ్గా అనుకుంటాం కానీ ఆ త్రిమూర్తులకు శక్తినిచ్చేది, వారి వారి విధులను నిర్వర్తింపజేసేది ఆ తల్లులే. అటువంటి జగన్మాతయైన మహాలక్ష్మి తల్లికి నమస్కారం - వన్దే జగన్మాతరం.

సాధారణంగా ఎవరైనా స్త్రీ సంప్రదాయకమైన వేషభాషలలో కనిపిస్తే ఆవిడ ముఖంలో లక్ష్మీకళ ఉట్టిపడుతోంది అంటాం. ఉట్టిపడటం అంటే పొయ్యిమీద పెట్టిన పాలు పాత్రలోనుంచి కొద్దిగా బయటకు పొంగటంలాంటిది. అలాగే మానవుడు కూడా తనకున్న సంపదనంతా పంచిపెట్టేయడు. తన పాత్ర నిండిన తరువాత, లోపల ఇంకేదో చేయాలనే వేడిపుడితే, ఆ సంపదలో కొంత దానధర్మాల రూపంలో బయటకు పొంగుతుంది అంతే. కానీ జగన్మాత అలా కాదు. ఆవిడ 'వక్త్ర లక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచన' - అమ్మ ముఖంలో లక్ష్మీ ప్రవహిస్తూ ఉంటుంది. అంటే అక్కడ వచ్చినది వచ్చినట్లుగా ఇచ్చివెయ్యటమే కానీ దాచుకోవటం ఉండదు. అమ్మ వదనంలోని ఆ లక్ష్మీ ప్రవాహంలో రెండు చేపలు అటూ ఇటూ కదులుతూ ఉంటాయిట. ఆ చేపలే అమ్మ కళ్ళు. ఎప్పుడు ఏ బిడ్డకు ఈ సంపద అవసరమౌతుందో, ఆ క్షణంలోనే ఆదుకుందామని అమ్మ ఎప్పుడూ అటూ ఇటూ చూస్తూనే ఉంటుంది. మామూలుగా ఏదైనా ఆలయానికి ఒక గోపురం ఉంటుంది. గోపురం అంటే ఆలయానికి ప్రవేశద్వారం కదా. బయట అహంకారంతో విర్రవీగే జీవులందరూ ఈ ఎత్తైన గోపురం క్రిందకు వచ్చేసరికి తాము ఎంతటి అల్పులో అర్ధమైపోయి శిరస్సు దానంతటదే భగవంతుని ముందు వంగిపోతుంది. అయితే మధురైలోని మీనాక్షీ అమ్మ ఆలయానికి ఒకటి, రెండు కాదు, ఏకంగా పధ్నాలుగు గోపురాలు ఉన్నాయి. అంటే తన చేపలవంటి కళ్ళతో ఎప్పుడు ఏ బిడ్డ తన దగ్గరకు వస్తాడో అని ఆ అమ్మ నిరంతరం అటూ ఇటూ చూస్తూ ఏకంగా తనను చేరుకోవటానికి అన్నివైపులా పధ్నాలుగు ద్వారాలు పెట్టుకుంది.

ఇక ముగ్గురమ్మల దగ్గరకు వస్తే విద్యకు, జ్ఞానానికి అధినేత్రి అయిన సరస్వతీదేవి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి సేవ చేస్తున్నట్లు ఎక్కడా మనం చూడం. అంటే ఈ సృష్టికి పూర్వం నుంచి, సృష్టి ఉన్నా, లేకపోయినా ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది జ్ఞానమే కానీ, అది సృష్టికి లోబడి వచ్చిపోయేది కాదు. అలాగే శక్తిస్వరూపిణి అయిన పార్వతీదేవి కూడా లయకారకుడైన పరమేశ్వరుని ప్రక్కన కూర్చున్నట్లుగానో, లేక ఆయనతో కలిసి నృత్యం చేస్తున్నట్లుగానో కనిపిస్తుంది కానీ, ఆయనను పూజిస్తున్నట్లు చాలా అరుదుగా కనిపిస్తుంది. అంటే సృష్టి అంతా లయించిపోయినా కానీ శక్తికి నాశనం లేదు. అంతెందుకు మన కళ్ళముందే ఎందరో కవులు, రచయితలు, గాయకులు, శాస్త్రవేత్తలు ఇలా ఎంతో ప్రతిభ కలవారు కాలగర్భంలో కలిసిపోతున్నారు కానీ, అంతటితో ఆయా కళలు కానీ, శాస్త్రాలు కానీ నశించిపోతున్నాయా? ఆ ప్రతిభ, లేక శక్తిని పుణికిపుచ్చుకొని దానిని ముందుకు తీసుకెళ్ళడానికి మరొక వ్యక్తి తయారవుతాడు. కానీ సంపదకు అధినేత్రి అయిన లక్ష్మీదేవి మాత్రం ఎప్పుడు సృష్టిని నడిపించే నారాయణమూర్తితో కలిసి కనిపించినా ఆయనకు పాదసేవ చేస్తూనే కనిపిస్తుంది. అంటే సృష్టి, లేదా ఒకవ్యక్తి జీవితం నడవటానికి సంపద కావాలి కానీ, సంపద కోసమే జీవితం కాకూడదు అనే సందేశాన్ని అమ్మ మనకు అందిస్తోంది.

మనందరం ఎంతగా నారాయణ స్మరణ చేసుకుంటే అంతగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది.

ఆశ్రమ ప్రముఖులు

 శ్రీ కాళీగార్డెన్స్ ఆశ్రమ స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న ఈ శుభ తరుణంలో విశేషంగా ఆశ్రమసేవ చేసుకొని తమ జీవితాలను ధన్యం ఒనర్చుకొని శ్రీగురుసాయుజ్యం పొందిన ప్రముఖ భక్తులను సంస్మరించుకోవటం మన కర్తవ్యం.


శ్రీ బచ్చు పాండురంగ శ్రీశైలరావు ప్రసాద్ - వీరినే మనందరం పాండుగారు అని ఆప్యాయంగా పిలుచుకుంటాం. ఇంతటి ఆశ్రమం స్థాపించాలన్నా, దానిని నిరాటంకంగా నడిపించాలన్నా దానికి తగిన అంగబలం, అర్థబలం కావాలి కదా. ఈ రెండూ ఉండటమే కాక, వాటిని గురుచరణారవిందముల సన్నిధిలో పూర్తిగా అర్పించగల అనన్య భక్తి ఉన్నవారు పాండుగారు. ఆశ్రమానికి కావలసిన స్థలాన్ని సేకరించడం దగ్గరనుండి, దాని నిర్మాణానికి కావలసిన సకల సామగ్రిని, సదుపాయాలను సమకూర్చడమే కాక, ఆశ్రమంలోని ప్రతి భక్తుని సేవ, గురుదేవుల సేవగా భావించి నిష్టతో చేసుకున్నారు వారు. ఆశ్రమవాసులు ఎవరైనా పనిమీద గుంటూరు వెళ్ళి, అక్కడ ఏ అవసరం వచ్చినా, ఇబ్బంది కలిగినా ముందుగా గుర్తు వచ్చేది, వెళ్ళి ఆశ్రయం పొందేది పాండుగారి ఇంటికే. అలాగే ఆశ్రమంలోని దాదాపు అన్ని పెద్ద పండుగల నిర్వహణా భారం వారి కుంటుంబానిదే. శ్రీ సద్గురు యువసేవాసమితి ప్రధమ అధ్యక్షులుగా కూడా వీరు సేవలందించారు.

శ్రీ లలితానంద సరస్వతీ స్వామిని - ఆశ్రమం నడవటానికి భౌతిక వసతులు పాండుగారు కల్పిస్తే, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వసతులన్నీ గురువుగారు కల్పించారు. ఆమెకు రాని శాస్త్రం కానీ, పురాణం కానీ లేదు. ఆశ్రమంలో ఏఏ కార్యక్రమాలు ఎలా జరుపుకోవాలో, ఏ పూజ ఎలా చేయాలో దానికి కావలసిన విధివిధానాలను ఏర్పరచటమే కాక, భక్తులందరికీ అందులో శిక్షణనిచ్చారు. ఆధ్యాత్మిక వాఙ్మయంలో ఏ విషయం గురించైనా, ఎంత సేపైనా అనర్గళంగానే కాక, సరళంగానూ జనరంజకంగానూ ప్రసంగించగల విద్వత్తు ఆమె స్వంతం. అయితే ఎక్కడా నేను పండితురాలననే అహం చూపక భక్తులందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ, ఉత్సాహపరుస్తూ, శిక్షణనివ్వటమే కాకుండా, ఆశ్రమానికి క్రొత్తవారు ఎవరు ఏ సమయంలో వచ్చినా, వారికి రుచిగా వండి ప్రసాదాన్ని కూడా అందించిన అన్నపూర్ణ ఆ తల్లి. ఆశ్రమంలో ఆవిడ చేయని సేవ లేదంటే అతిశయోక్తి కాదు.

శ్రీ విజయేశ్వరానంద ప్రసాద్ - శ్రీ గూడూరి వెంకటరత్నంగారిగా సుపరిచితులైన వీరు ఆశ్రమ ప్రార్థనను రచించటమే కాక అనేక సంకీర్తనలను వ్రాసి పాడిన వాగ్గేయకారులు. అంతేకాక ప్రతి సంవత్సరం దసరా మహోత్సవాలలో శ్రీగురుదేవులు మెచ్చే విధంగా ఎన్నో భక్తుల మహాత్ముల చరిత్రలను నాటకలుగా రచించి, బాలబాలికలకు అందులో శిక్షణనిచ్చి ప్రదర్శింపజేసేవారు. సుదీర్ఘకాలం ఆశ్రమ గురుకుల నిర్వహణా బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించారు. అంతేకాక శ్రీ రామలింగేశ్వరాలయంలో, శ్రీ కాళికాలయంలో నిత్యపూజల బాధ్యతను వీరు, వీరి ధర్మపత్ని కళ్యాణమ్మగారు జీవితాంతం నిర్వహించారు. శ్రీగురుదేవుల దివ్య బోధలను గురువాణి అనే గ్రంధరూపంలో లోకానికి అందించడమే కాకుండా శ్రీగురు చరిత్రను సమగ్రంగా సేకరించి రెండు భాగాలుగా అందించారు.

శ్రీ సుగుణ ప్రసాద - అందరూ సుగుణక్కగా పిలుచుకొనే ఈ తల్లి నిరంతరం శ్రీబాబూజీ, శ్రీమాతాజీల వెన్నంటి ఉండి మౌనంగానే ఆశ్రమ నిర్వహణకు సంబంధించిన ఎన్నో బాధ్యతలను నిర్వర్తించేవారు. వారు శ్రీగురుసాయుజ్యం పొందిన తరువాత వారి బాధ్యతలను అనేకమందికి పంచవలసి వచ్చిందంటే వారి సామర్థ్యాన్ని అర్థం చేసుకోవచ్చు.

శ్రీ నడింపల్లి సత్య సూర్యనారాయణరాజు ప్రసాద్ - ఎండీగారుగా సుపరిచితులైన వీరు ఆశ్రమ నిర్మాణం ప్రారంభించిన నాటినుండి ఆశ్రమంలోనే ఉంటూ, వివిధ నిర్మాణ, నిర్వహణ బాధ్యతలను సేవగా స్వీకరించి ఆశ్రమంలోని యువకులను సమీకరించి వారిచే సమర్థంగా నిర్వహింపజేసేవారు. శ్రీ సద్గురు యువసేవాసమితి ప్రధమ కార్యదర్శిగా కూడా వీరు సేవలందించారు.

శ్రీ ఇందుకూరి సత్యనారాయణరాజు ప్రసాద్ - సత్తిరాజుగారిగా అందరికీ తెలిసిన వీరు కూడా ఆశ్రమ స్థాపన నాటినుండి బాధ్యతలు స్వీకరించి ఆశ్రమంలోని ఫలవృక్షాలు, పంటపొలాల నిర్వహణను సమర్థవంతంగా నడిపారు.

శ్రీమతి చంద్రాభొట్ల కామేశ్వరి ప్రసాద - కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందిన కామేశ్వరమ్మగారు తమ సుశ్రావ్య స్వరంతో ఆశ్రమ ప్రార్థనా గీతాలను, సంకీర్తనలను ప్రతిరోజూ గానం చేయటమే కాక, శ్రీ లలితానంద సరస్వతీ స్వామిని వద్ద శిక్షణ పొంది ముకుందమాల, భాగవతం, మహర్షుల చరిత్రలు మొదలగు ప్రవచనాలను కూడా నిర్వహించారు. అంతేకాక కంటిచూపును కోల్పోయిన అనంతరం కూడా శ్రీ బృందావనంలో, శివాలయంలో నిత్యపూజలను, అభిషేకాలను నిర్వహించేవారు.

శ్రీ దుగ్గిరాల జగన్మోహన బాలకృష్ణ లాల్ ప్రసాద్ - లాల్ గారిగా సుపరిచితులైన వీరు గుంటూరులో లెక్చరర్ ఉద్యోగం చేస్తూకూడా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం శ్రీగురుదేవుల దర్శనార్థమై ఆశ్రమానికి వచ్చి, వ్యాహ్యాళి సమయంలో, సత్సంగాల సమయంలో శ్రీగురుదేవుల దివ్య బోధనంతా శ్రద్ధగా విని, ఆకళింపు చేసుకొని, ఇంటికి వెళ్ళగానే మరల గ్రంధస్థం చేసేవారు. అలా శ్రీబాబూజీ దివ్య స్మృతులు అనే గ్రంథం అనేక భాగాలుగా మనకు అంది, ఇప్పటికీ జిజ్ఞాసువులకు ఆధ్యాత్మిక విజ్ఞానసర్వస్వంలాగా ఉపయోగపడుతోంది. అంతేకాక వీరు కూడా అనేక సంవత్సరాలు ఆశ్రమ పాఠశాల నిర్వహణా బాధ్యతలను, సమర్థ సద్గురు మాసపత్రిక సంపాదక బాధ్యతలను కూడా నిర్వర్తించారు.

శ్రీ చేబ్రోలు వెంకట నారాయణరావు ప్రసాద్ - భారతీయ రైల్వేలో ఉన్నత పదవులను నిర్వర్తించిన శ్రీ నారాయణ రావుగారు ఉద్యోగ విరమణానంతరం ఆశ్రమవాసులయి ట్రస్ట్ కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పనిచేసి, శ్రీ బృందావన నిర్మాణం, శ్రీ రామాలయ పునర్నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారు. అంతేకాక శ్రీగురుబోధను ప్రతి సాయంత్రం ప్రార్థనానంతరం విస్పష్టంగా, అందరికీ అర్థమయ్యే రీతిలో చదివి వినిపించేవారు.

శ్రీ సన్నిధానం రామతారక పరబ్రహ్మ శాస్త్రి ప్రసాద్ - భారతీయ రైల్వేలో ప్రధానాధ్యాపకునిగా పనిచేసిన శ్రీ తారకంగారు వేద, శాస్త్ర పురాణేతిహాసాలలో పండితులు. ఆశ్రమవాసులకు కలిగే అనేక సందేహాలను తీర్చడమేకాక, వారికి ఏ మంత్రం ఎలా ఉచ్ఛరించాలి ఏ పదానికి అర్థం ఏమిటి అనే విషయాలలో శిక్షణ ఇచ్చేవారు. వీరు ప్రతి సంవత్సరం దసరా మహోత్సవాలలో శ్రీ దేవీభాగవత పురాణ ప్రవచనం జనరంజకంగా చేసేవారు.

శ్రీ వేలమూరి వెంకటరమణ ప్రసాద్ - ప్రసాదరావు గారిగా సుపరిచితులైన వీరు వృత్తిరీత్యా ఆంగ్ల ఆచార్యులైనా సంస్కృతాంధ్ర భాషా కోవిదులు కూడా. వీరు ఎన్నో అష్టావధానాలను కూడా శ్రీగురుదేవుల సమక్షంలో నిర్వహించారు. అనేక సంవత్సరాలు ధనుర్మాసంలో పోతన భాగవతాన్ని కడు రమ్యంగా ప్రవచించి భక్తుల మనసులను చూరగొన్నారు. శ్రీ బాబూజీ చరిత్రలోని కొన్ని ఘట్టాలను హరికథగా రచించి స్వయంగా ప్రదర్శించారు. శ్రీగురుగీతకు చక్కని భాష్యం కూడా రచించారు.

శ్రీ గూడ శివరామ మూర్తి ప్రసాద్ - ఈసీఐఎల్‌లో ఉన్నత పదవిని నిర్వహించిన శ్రీ మూర్తిగారు ఆశ్రమవాసులందరికి పురాణం మూర్తిగారిగా పరిచితులు. ఎన్నో సంవత్సరాలు ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో శ్రీబృందావనంలో పురాణ ప్రవచనం నిర్వహించేవారు. శ్రీ భగవద్గీతకు సరళమైన భాష్యం రచించి, ఆశ్రమవాసులకు వినిపించారు. అంతేకాక శ్రీ రామలింగేశ్వరాలయంలో మహన్యాసం చెప్పే సేవ కూడా చేసుకున్నారు. దీర్ఘకాలం సమర్ధ సద్గురు మాసపత్రికకు సమర్థవంతమైన సంపాదకునిగా సేవలందించారు.

శ్రీ గరికపాటి శ్రీరామచంద్ర మూర్తి ప్రసాద్, కమలా ప్రసాద - అస్సాం మూర్తి దంపతులుగా ప్రసిద్ధులైన వీరిరువురు సుదీర్ఘ కాలం శ్రీ కోదండ రామాలయం, శ్రీ రాధాకృష్ణాలయములలో నిత్య పూజలను నిర్వహించారు.

శ్రీ వల్లభజోశ్యుల భగవాన్ దాస్ ప్రసాద్ - భగవద్దాసుగా శ్రీగురుదేవులు పిలుచుకొన్న వీరు శ్రీగురుదేవులకు అత్యంత ప్రియభక్తులు. సుదీర్ఘకాలం అమెరికాలో స్థిరనివాసం ఉన్నాకూడా ఎప్పుడూ శ్రీగురుదేవుల హృదయానికి దగ్గరగా ఉండేవారు. అక్కడ సమర్ధసద్గురు మాసపత్రికను వివిధ ప్రాంతాలలోని భక్తులకు చెరవేయటానికి విశేష కృషి చేశారు. జీవిత చరమాంకంలో ఆశ్రమవాసులయి శ్రీగురుదేవులయందే మనస్సును నిలిపి శ్రీగురుసాయుజ్యం పొందారు.

శ్రీ నూనె వెంకటస్వామి ప్రసాద్ - పాండుగారి బావగారైన శ్రీ వెంకటస్వామిగారు ఆశ్రమానికి పెద్దదిక్కు వంటివారు. శ్రీగురుదేవులు ఏ ఆలయాల నిర్మాణం, యజ్ఞయాగాదుల వంటి ఏ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినా ప్రధాన కర్తలుగా వీరి దంపతులే ఉండేవారు. అంతేకాక వారు హిందీలో శ్రీ రామచరితమానసను చదివి భక్తులందరికీ అర్థమయ్యే రీతిలో తెలుగులోకి అనువదించి ప్రవచించేవారు.

శ్రీ మద్ది నాగేశ్వరరావు ప్రసాద్ - శ్రీ నాగేశ్వర రావుగారు సమర్ధ సద్గురు మాసపత్రికకు ప్రధమ సంపాదకులు. మాసపత్రికకు ఒక రూపును అందించడంలో వీరు విశేష కృషి చేశారు. ఆ పత్రికను రాష్ట్రమంతటా విస్తరింపజేయటంలో వీరి అల్లుడుగారైన శ్రీ చరణదాసుగారు ప్రముఖ పాత్ర వహించారు. అంతేకాక సౌమ్యులు, నిరాడంబరులు, మృదుస్వభావి అయిన శ్రీ నాగేశ్వరరావుగారు వివేక విన్యాస్ మొదలైన అనేక ఆధ్యాత్మిక గ్రంధాలను రచించి, ప్రచురించి ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకు విశేష సేవలను అందించారు. శ్రీగురుదేవుల దివ్య సందేశాలను ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలలో ప్రచురించడానికి, గురువాణి అనే తెలుగు సంగ్రహం సమర్థ సద్గురు అనే ఆంగ్ల సంగ్రహం ప్రచురించడానికి శ్రీ నాగేశ్వరరావుగారు, శ్రీ చిరంజీవిగారు విశేష కృషి సలిపారు. శ్రీ బాబూజీ మహరాజ్ వారిచే 'జనక మహారాజు వలె రాజయోగి' అని పిలువబడిన శ్రీ నాగేశ్వరరావుగారు ఆదర్శమూర్తులు.

శ్రీమతి వీర రాఘవమ్మ ప్రసాద - శ్రీ మాతాజీవారి మాతృమూర్తి అయిన శ్రీమతి రాఘవమ్మగారు శ్రీగురుదేవులకు ఎన్నో సంవత్సరాల కాలం నైవేద్యం తయారు చేసి, వారికే కాక వారి దర్శనార్థం వచ్చిన అనేకమంది భక్తులకు కూడా ప్రేమతో వడ్డించేవారు. అలాగే శ్రీ మాతాజీ అతిథులుగా ఆశ్రమ దర్శనార్థం వచ్చే ఎందరో సాధు మహాత్ములకు కన్నతల్లి వలె అప్యాయతను కురిపించి వారి భోజన వసతులను స్వయంగా చూసుకొనేవారు.

నిజానికి ఆశ్రమానికి సేవలందించిన ప్రముఖుల జాబితా అనంతమైనా కొద్దిమందినే ఇక్కడ ప్రస్తావించడం సాధ్యమైంది. వీరేకాక ఇంజనీర్లుగా శ్రీ వీరయ్య చౌదరిగారు, శ్రీ వక్కలగడ్డ వెంకట సత్యనారాయణ మూర్తి ప్రసాద్ వారు, శ్రీ కొండా శేషంరాజుగారు, శ్రీ ఉనికిలి సుబ్బరాజుగారు, ప్రధానోపాధ్యాయులుగా శ్రీ దత్తుమాష్టారు, శ్రీ శ్రీనివాస అయ్యంగార్ వారు, ఉపాధ్యాయులుగా శ్రీ గండికోట వెంకటేశ్వర్లు గారు, శ్రీమతి శ్యామల, శ్రీమతి హిమగిరి కుమారి, శ్రీ ఉమామహేశ్వరరావు, ప్రథమ వైద్యులుగా శ్రీ ఏలూరుపాడు డాక్టరుగారు, వారి సతీమణి పాపమ్మగారు, గాయకులుగా శ్రీమతి మావులేటి ఈశ్వరమ్మగారు, శ్రీమతి జమ్మి సుశీలాదేవి గారు, ప్రథమ కాంటీన్ నిర్వాహకులుగా శ్రీ శ్రీహరిరావు గారు, ఆశ్రమ ఉద్యానవన నిర్వాహకులుగా శ్రీ కూనపరాజు నారాయణరాజుగారు, పురోహితులుగా శ్రీ వారణాసి కాశీ విశ్వనాథ శర్మగారు, శ్రీ రామారావు గారు, శ్రీ శేఖరంగారు, బృందావన పరిరక్షకురాలిగా శ్రీ జయక్క ఇలా ఎందరెందరో మహానుభావులు గత యాభై సంవత్సరాలుగా ఈ ఆశ్రమసేవ చేసుకొని శ్రీగురుసాయుజ్య ముక్తిని పొందటమే కాక, మనందరికీ ఆదర్శమూర్తులుగా, మార్గదర్శులుగా, ప్రాతఃస్మరణీయులుగా నిలిచారు. వారు చూపిన బాటలో నిస్వార్థ సేవతో మన జీవితాలను సఫలం చేసుకోవటమే వారికి మనం అందించగలిగిన నివాళి.

స్వర్ణోత్సవ కార్యక్రమ విశ్లేషణ

సమర్ధ సద్గురు శ్రీ శ్రీ శ్రీ హనుమత్ కాళీ వరప్రసాద బాబూజీ మహరాజ్ వారు అవ్యాజ కరుణతో మనందరికోసం స్థాపించిన శ్రీకాళీ గార్డెన్స్ ఆశ్రమ స్వర్ణోత్సవాలను ఎంతో వైభవంగా జరుపుకున్నాం. ఈ సందర్భంగా మనం జరుపుకున్న కార్యక్రమాలను ఒకసారి విశ్లేషించుకుందాం.


ఉదయం 3:30 కి సుప్రభాతంతో మన కార్యక్రమాలు ప్రారంభం అవుతున్నాయి. అయితే మనం "కాళీప్రసాద భగవన్ తవ సుప్రభాతం" అని పాడుకుంటున్నా ఇది నిత్యం నిజజాగ్రతలో ఉండే స్వామివారికి మేల్కొలుపు కాదు, మనకు మనం హెచ్చరిక చేసుకొని అజ్ఞాన నిద్రలోనుండి మేల్కొనే ప్రయత్నం.

అనంతరం మనం ఉదయకాల ప్రార్థన చేసుకొంటున్నాం. గాంధీ మహాత్ములు చెప్పినట్లు మన రోజును ఉదయాన్నే తెరచి, రాత్రికి మూసే తాళంచెవి ప్రార్థన. మనం ఆ రోజును ఎటువంటి భావనలతో, ఆచరణతో గడపాలో ఉదయాన్నే గుర్తుచేస్తుంది. అలాగే రాత్రి నిద్రలోకి జారుకునే ముందు మనం ఈ విషయాలను ఎంతవరకు పాటించామో బేరీజు వేసుకుని మరుసటి రోజు మరింత మెరుగ్గా గడపడానికి వేసుకొనే ప్రణాళిక సాయంకాల ప్రార్థన.

మన ఆశ్రమంలో అణువణువూ శ్రీగురుదేవుల పవిత్ర పాదస్పర్శతో పునీతమైనదే. అలాగే ఇక్కడి ప్రతి వృక్షము, గోవు, నెమలి ఇవన్నీ ఎన్నోసార్లు వారి ఆప్యాయమైన పలకరింపుకు నోచుకున్న ధన్యజీవులే. మళ్ళీ ఒకసారి మనందరం ఆ మధురానుభూతులను నెమరు వేసుకుంటూ శ్రీవారి పాదుకలతో ఆశ్రమ ప్రాంగణమంతా పాదుకా ప్రదక్షిణం జరుపుకుంటున్నాం. అనంతరం బ్రహ్మస్వరూపులైన బ్రాహ్మణులచే వేదఘోష ఆశ్రమ వాతావరణాన్ని మరింత పవిత్రమొనరుస్తూ ప్రతిధ్వనిస్తోంది.

నిర్గుణుడౌ ఆదియోగి తానె స్వయాన
సగుణుండై బాబుగా వచ్చె మనకై
సగుణ నిర్గుణ ఏకత్వమును చాట
తిరిగి లింగరూపుడాయె మహాలీలగా

నిర్గుణుడైన మహాదేవుడు మన భక్తిని సిద్ధింపజేయడానికై ఒక ఆకారాన్ని తీసుకొని బాబూజీ అనే నామంతో మనందరి మధ్యకు వచ్చి, మనలను మోక్ష మార్గంలో ముందుకు నడిపి, సగుణ నిర్గుణాల ఏకత్వాన్ని మనకు దృఢంగా నిరూపించడానికై ఆత్మలింగ స్వరూపంలో శ్రీరామలింగేశ్వర స్వామిగా మనకోసం సుప్రతిష్టితులయ్యారు. ఈ ఆలయ విశేషం ఏమిటంటే కులమతాలకు అతీతంగా, లింగభేదాలు లేకుండా శుచిర్భూతులైన ప్రతి ఒక్కరూ ఈ స్వామిని స్వయంగా తాకి అభిషేకం చేసుకోవచ్చు. అయితే ఇంతటి బృహత్కార్యక్రమంలో ఇన్ని వందలమందికి గర్భాలయంలో అభిషేక సేవ కల్పించడం అసాధ్యం కనుక మనందరం ఆ స్వామికి ప్రతిరూపమైన రుద్రాక్షకు అభిషేకం చేసుకొనే అవకాశం కల్పించారు. అయితే శ్రీగురుదశమి నాడు బ్రాహ్మీముహూర్తంలో మనందరం శ్రీ బృందావనంలో వేంచేసి ఉన్న స్వామికి స్వయంగా అభిషేకం చేసుకొనే మహద్భాగ్యం కల్పించబడింది.

రుద్రాక్ష అంటే ఈశ్వరుని వైభవానికి ప్రతీక. స్వయంగా స్వామి కంటినీటినుండి ఆవిర్భవించినది. ఒకసారి పార్వతీదేవి కుమారస్వామికి లక్ష్మీదేవి పుత్రిక అయిన వల్లీదేవిని ఇచ్చి వివాహం చేయమని ప్రస్తావన తీసుకొస్తే లక్ష్మీదేవి "ఇంత ఐశ్వర్యంలో పెరిగిన నా పుత్రికను చర్మాంబరాలు, రుద్రాక్ష మాలలు తప్ప మరేమీ లేని మీ ఇంటికి కోడలిగా ఎలా పంపను?" అని నిరాకరించింది. ఇది జరిగిన కొన్నాళ్ళకు శంకరుని ఆజ్ఞపై పార్వతీదేవి లక్ష్మీదేవి వద్దకు వెళ్ళి "నేను ఒక వ్రతం చేయ సంకల్పించాను. ఈ రుద్రాక్షకు సరితూగే ధనాన్ని నాకు ఇవ్వవలసిం"దని కోరగా లక్ష్మీదేవి తన ఐశ్వర్యాన్నంతటినీ త్రాసులో ఉంచినా ఆ రుద్రాక్షను తూచలేక తన తప్పును తెలుసుకొని శ్రీవల్లీ కుమారస్వామిల వివాహాన్ని జరిపించింది.

'నా రుద్రో రుద్రమర్చయేత్' రుద్రుడు కానివాడు రుద్రుని అర్చించడానికి అనర్హుడు. అందుకే ముందుగా మనం మహన్యాసంతో మనలోని సర్వాంగాలలో, అలాగే ప్రకృతిలోని సర్వదిక్కులలో నిండి ఉన్న ఈశ్వర తత్వాన్ని గుర్తించడం ద్వారా మన శరీరాన్ని పవిత్రమొనర్చుకొని పశుపతినాధుడు, మృత్యుంజయుడైన పరమేశ్వరుని ముక్తికాములమై పాశుపత, మృత్యుంజయ మహామంత్రాలతో సంపుటీకరించబడిన ఏకాదశ రుద్రపారాయణతో అభిషేకం జరుపుకుంటున్నాం.

అనంతరం గర్భాలయంలో స్వామి దర్శనం చేసుకుని ఉదయపు ప్రసాదం స్వీకరిస్తున్నాం. ఈ ప్రసాదం శరీరానికి కావలసిన శక్తినిస్తే తదనంతరం సత్సంగంలో లభించే శివపురాణ ప్రవచనం, సద్గురు బోధ మనకు చిత్తోపరతి సుఖాన్ని అందించి, సాధనకు తగిన శక్తిని ప్రసాదిస్తుంది. ఇది ఇక్కడ నిరంతరం జరిగే జ్ఞానయజ్ఞం.

అనంతరం మనం శ్రీగురుదేవులు కొలువై ఉన్న బృందావనంలో స్వామికి వివిధ రకాల పుష్పాలతో లక్షనామార్చన జరుపుకుంటున్నాం. నిజానికి ఈ సృష్టిలోని వివిధ రూపనామాలన్నీ శ్రీగురుదేవులవే. అలాగే వివిధ పుష్పాలతో పాటు పూజాద్రవ్యాలు, ఆ పూజ చేసుకొనే సంకల్పం, శక్తి కూడా వారి ప్రసాదమే. అయితే ఈ పూజా విధానంలో, లేదా ఇన్ని నామాలలో ఏదో ఒక చోట మన మనస్సు నిలిచిపోయి ఆ గురుపరమాత్మలో లీనమైతే అంతకంటే గురుపూజకు సార్ధకత లేదు.

పూజానంతరం మనం లోకసంరక్షణార్థం మళ్ళీ పాశుపత, మృత్యుంజయ సంపుటితమైన రుద్రాది మంత్రాలతో యజ్ఞం నిర్వహిస్తున్నాం. నిజానికి యజ్ఞంలో వ్రేల్చే సమిధలు, యజ్ఞకర్త, ఋత్విజులు, యజ్ఞకుండం‌, అగ్నిదేవుడు అంతా శివస్వరూపమే. అది గుర్తించి చేసిననాడు మనం నిజంగా మృత్యుంజయ స్థితిని పొందుతాం.

ఇక యజ్ఞం అనంతరం మనం ఆ విరాట్పురుషుని వైభవాన్ని స్తుతిస్తూ మహా మంత్రపుష్పం సమర్పించి స్వామికి వివిధ రకాల హారతులు సమర్పిస్తున్నాం. ఇందులో ముందుగా ఒక జ్యోతితో కూడిన కుంభహారతి - ఈ స్థూల శరీరమే కుంభం. దీనిని స్వామి సేవలో సమర్పిస్తూ, ఇందులో వెలుగుతున్న ఆత్మజ్యోతిని గుర్తిస్తూ హారతిస్తున్నాం. రెండవది కూడా ఒక జ్యోతితో కూడిన గజహారతి - ఏనుగు తమోగుణానికి ప్రతీక. మనలోని తమోగుణం పటాపంచలు అయితేకానీ లోపలి ఆత్మజ్యోతి కొద్దిగానైనా దర్శనం కాదని గుర్తిస్తూ ఆ తమోగుణాన్ని స్వామి పాదాలచెంత సమర్పించుకుంటున్నాం.

ఇక మూడవది రెండు జ్యోతులతో కూడిన ఉష్ట్రహారతి - ఒంటెను తమోగుణ సుఖానికి ప్రతీకగా శ్రీగురుదేవులు చెప్పేవారు. ఒంటె ముళ్ళకోరను నములుతూ ఉంటుంది. ఆ ముళ్ళు తన నోటిలో గ్రుచ్చుకొని తన రక్తమే కారుతూ ఉంటే, అదేదో ఆ ముళ్ళకోరనుండి వస్తున్న రసమని భ్రమపడుతూ ఆస్వాదిస్తూ ఉంటుంది. చివరికి నోరంతా గాయాలై కష్టపడుతుంది. తమోగుణంతో మనం ఈ లోకంలో అనుభవించే సుఖాలు ఇలాగే ఉంటాయి. వాటిలో ఎటువంటి సుఖమూ లేకపోగా, వాటివల్ల కలిగే కష్టాలనే సుఖాలుగా మనలను భ్రమింపజేస్తూ ఉంటాయి. అలాగే ఒక వ్యక్తి గుడారంలో కేవలం తల మాత్రం పెట్టుకోవడానికి చోటు అడిగిన ఒంటె చివరికి ఆ గుడారాన్ని పూర్తిగా ఆక్రమించి అతనిని బయటకు నెట్టివేసిన కథ మనందరం వినే ఉన్నాం కదా! అలాగే ఈ తమోగుణం మెల్లగా మన మనస్సులో చోటుకోసం ప్రయత్నిస్తుంది. ఏమాత్రం చోటు కల్పించినా, మనం మహాత్ముల చెంత ఉన్నామా, సత్సంగంలో ఉన్నామా అనే స్పృహ కూడా తెలియనీకుండా మెల్లగా నిద్రలోకి జార్చేస్తుంది. కాబట్టి మన తమోగుణం వదిలి ఏది సుఖమో, ఏది కష్టమో నిజంగా తెలియాలని, నిత్యానిత్య వస్తు వివేకం కలగాలని రెండు జ్యోతులతో కూడిన ఒంటెహారతిని శ్రీగురుదేవులకు సమర్పించుకుంటున్నాం.

నాల్గవది మూడు జ్యోతులతో కూడిన సింహ హారతి. సింహాన్ని రజోగుణానికి ప్రతీకగా చెప్తారు. తమోగుణాన్ని వదిలించుకున్న మనం రజోగుణాన్ని కూడా వదిలించుకుంటే ఇక సత్వగుణాన్ని వదిలించుకోవటం కాస్త తేలికగానే సాధ్యం అవుతుంది. ఆ విధంగా త్రిగుణాల మీద విజయాన్ని అనుగ్రహించమని శ్రీగురుదేవులను ప్రార్థిస్తూ ఈ హారతిని సమర్పించుకుంటున్నాం. ఇక అయిదవది అయిదు జ్యోతులున్న నాగహారతి. మనలో చుట్టలుగా చుట్టుకొని నిద్రాణమై ఉన్న కుండలినీ శక్తిని పాముతో పోల్చారు. ఇది అధోముఖమై పంచేంద్రియాల వైపుగా పరుగులు తీస్తూ ఉన్నంతకాలం మనం అజ్ఞానంలో మునిగి ఉంటాం. ఎప్పుడైతే ఈ కుండలిని మేలుకొని పరమాత్మ వైపుకి ఊర్ధ్వముఖ ప్రయాణం ప్రారంభిస్తుందో అప్పుడు మనం మెల్లగా పంచకోశాలను దాటి మన స్వస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాం. అటువంటి స్థితిని కల్పించమని శ్రీగురుదేవులకు ఈ పంచజ్యోతి పూర్వక నాగహారతిని సమర్పించుకుంటున్నాం.

తరువాత అయిదు జ్యోతులతో కూడిన మయూరహారతి. ఎప్పుడైతే మనం త్రిగుణాలను జయించి, కుండలినీ శక్తిద్వారా పంచకోశాలను దాటి ఆత్మజ్యోతిని అనుభవంలోకి తెచ్చుకుంటామో అప్పుడు మన మనస్సు మేఘాలను చూసిన నెమలివలె పరవశత్వంతో ఆనందనృత్యం చేస్తుంది. జగన్మాత నామాలలో 'భక్త చిత్త కేకి ఘనాఘనా' - 'భక్తుల చిత్తములనే నెమళ్ళకు పరవశాన్ని కలిగించే మేఘం వంటిది' అనే నామం ఉంది. అలాగే శ్రీగురుదేవుల నామాలలో 'కాళికా మేఘ సందర్శనానంద నటన్మయూరాయ' - 'కాళీమాత అనే మేఘాన్ని దర్శించి పారవశ్యంతో ఆనంద నాట్యం చేసే నెమలి వంటివారు' అనే నామం ఉంది. మన పంచేంద్రియాలకు కూడా శ్రీగురుదేవుల దర్శనంతో అటువంటి పరవశం కలగాలని, మన మనస్సు ఆనందనృత్యం చేయాలని ప్రార్థిస్తూ ఈ మయూర హారతిని సమర్పించుకుంటున్నాం. అయితే కేవలం ఆ ఆత్మానందాన్ని మనం ఒక్కరమే అనుభవిస్తే అది నిజంగా ఆత్మానందం అనిపించుకోదు. అందుకే 27 నక్షత్రాలలో జన్మించిన ఈ చరాచర ప్రాణికోటి అంతటికీ అటువంటి ఆనందాన్ని ప్రసాదించమని శ్రీగురుదేవులను ప్రార్థిస్తూ 27 జ్యోతులతో కూడిన నక్షత్ర హారతితో అర్చించుకుంటున్నాం.

ఇక మన దినచర్యలో చివరిభాగంగా, రోజంతా మనం సలిపిన అర్చనలకు ఫలితంగా శ్రీగురు సుప్రసాదాన్ని కడుపార భుజించి మరుసటిరోజు కార్యక్రమానికి శరీరాన్ని సిద్ధపరుస్తూ విశ్రాంతి తీసుకుంటున్నాం. ఇక శ్రీగురుదేవుల డోలోత్సవం, సంతానం లేని ఎందరికో సంతానాన్ని ప్రసాదించి, భక్తులందరికీ బాలకృష్ణుని రూపంలో అపురూపమైన సేవను అందిస్తుంది. అలాగే దీపోత్సవం, రథోత్సవం చూసి అనుభవించవలసినవే కానీ, మాటలలో వర్ణించనలవికాదు. అసంఖ్యాక ఆత్మజ్యోతులు అన్ని కలిసి పరంజ్యోతి స్వరూపులైన శ్రీగురుదేవులను సేవించడం నిజంగా నేత్రోత్సవమే. అలాగే ఈ దేహమనే రథంలో సృష్టికర్త అయిన బ్రహ్మ సారథికాగా, ప్రకృతి స్వరూపిణి అయిన జగన్మాత ముందుండి నడిపిస్తూ ఉండగా పరబ్రహ్మ స్వరూపులైన శ్రీగురుదేవులు ఆశ్రమం అంతా సంచరించడం నిజంగా ఒక దివ్యానుభూతి.

ఆశ్రమంలోని ప్రతి వృక్షమూ, ప్రతి మహాసర్పమూ ఒక సిద్ధపురుషుడని, ఎన్నో సంవత్సరాలుగా వారందరూ ఇక్కడ తపస్సు చేసుకుంటున్నారని శ్రీగురుదేవులు ఎన్నోసార్లు శెలవిచ్చారు. నిజంగా మనోవికాసం కలిగి ఉన్నత ఆధ్యాత్మిక స్థితిని అందుకున్న వారికి ఆశ్రమంలో ప్రతినిత్యం ఈ సిద్ధపురుషుల మధ్యలో సాధు సమ్మేళనమే, సత్సంగమే. కానీ ఇంకా ఆ స్థితిని చేరని వారికోసం ప్రత్యక్షంగా ఎందరో సాధు మహాత్ములు వారి దర్శనాన్ని, అనుగ్రహ భాషణాన్ని అనుగ్రహిస్తూ ఈ కార్యక్రమాలలో చివరి మూడురోజులు మనకు సాధు ధర్మ సమ్మేళనం ప్రసాదించారు.

ఈ కార్యక్రమలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకొని, మనలోని గుణాలను, సంకల్పాలను, జన్మజన్మాంతర వాసనలను జ్ఞానాగ్నిలో పూర్ణాహుతి చేసుకొంటే ఇక జరిగేది జీవాత్మ, పరమాత్మల అనుసంధానమైన శివ కళ్యాణమే.