16, నవంబర్ 2018, శుక్రవారం

సత్యభామ

సత్యభామ కథ ముందుగా హిరణ్యాక్షుడితో మొదలవుతుంది. హిరణ్యం అంటే బంగారం. హిరణ్యాక్షుడు అంటే బంగారం/సంపద  మీద దృష్టి. అదే భూదేవిని జలంలో అంటే జడత్వంలో/అజ్ఞానంలో ముంచేసింది. ఆవిడను ఉద్ధరించడానికి విష్ణుమూర్తి స్వయంగా వరాహావతారంలో వచ్చారు. వరాహం మనం విసర్జించిన వాటిని తాను స్వీకరించి మన పరిసరాలను పరిశుభ్రంగా చేస్తుంది. అలాగే గురుదేవులు మనకు సాధనకు అడ్డువచ్చే మనలోని దుర్గుణాలను, మన ప్రారబ్ధ కర్మలను, వాసనలను అన్నింటినీ వారు స్వీకరించి మన మనసులను శుద్ధ మనసులుగా చేస్తారు. అయితే ఈ ప్రక్షాళన పూర్తి కాకముందే తొందరపడి ఫలితాన్ని పొందాలనుకుంటే అది దుఃఖానికే దారి తీస్తుంది. అందుకే భూదేవికి నరకాసురుడు జన్మించాడు. నరకమంటే దుఃఖమే కదా! మన దుఃఖం బయటనుంచి రాదు. అది మన మనసులోనే పుడుతుంది. అలాగే బయటి ఉపకరణాలేవీ ఆ దుఃఖాన్ని పోగొట్టలేవు. మన దుఃఖాన్ని మనమే విచారణ ద్వారా పోగొట్టుకోవాలి. అందుకే నరకాసురుడికి కేవలం భూదేవి చేతిలోనే మరణం నిశ్చయించబడటం. 

మన మనస్సు పరిశుద్ధమై ఆత్మజ్ఞానం పొందేదాకా ఎన్ని జన్మలైనా గురుదేవులు మనలను వదిలిపెట్టరు. అలాగే భూదేవి సత్యభామగా వచ్చినా మళ్ళీ విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా రావడం జరిగింది. అయితే మనం గురువులను ఆశ్రయించినంత మాత్రాన, లేదా జన్మ చాలించి మరో జన్మ ఎత్తినంత మాత్రాన మనలోని వాసనాబీజాలు నశించవు. పైగా వాసన పృథ్వీతత్త్వం. "తత్ర గంధవతీ పృథివీ" అని ఉపనిషద్వాక్యం. అలాగే బంగారం మీది దృష్టి ఆవిడను ఈ జన్మలో కూడా వెంటాడింది. తన తండ్రి సంపాదించిన శ్యమంతకమణి దానికి మరింత ఆజ్యం పోసింది. ఇక భూమికి ఉన్న మరో లక్షణం ఆకర్షణ. ఆ భూమ్యాకర్షణే లేకపోతే మనకెవ్వరికీ మనుగడ లేదు. ఈ సహజసిద్ధమైన ఆకర్షణ శక్తితోనే సత్యభామ ఊరిలో అందరినీ ఆకర్షించినట్లుగానే పరమాత్మను కూడా ఆకర్షించి తన కొంగుకు కట్టేసుకోవాలని భావించింది. 

అయితే కేవలం భక్తికి తప్ప పరమాత్మ ఇక దేనికీ ఆకర్షింపబడేవాడు కాదు, లొంగేవాడు కాదు. అయితే సత్యభామలో ఉన్న అతిపెద్ద సుగుణం ఏమిటంటే నిష్కల్మషమైన మనస్సు. పరమాత్ముని దగ్గర ఎప్పుడూ మనస్సు దాచదు. తన మనస్సులో ఉన్న భావాలన్నీ నిస్సంకోచంగా ఆయనముందు వ్యక్తపరుస్తుంది. కనుకనే ఆవిడ శ్రీకృష్ణునికి అత్యంత ప్రీతిపాత్ర అయింది. ఇక గురుదేవులు ముందుగా తన శిష్యురాలి మనసులోని దుఃఖాన్ని ఆమెద్వారానే హరింపచేసి ఆ తరువాత ఈ భౌతిక సంపదమీద దృష్టి, ఆకర్షణ అనే వాసనలను సమూలంగా నాశనంచేసి ఆవిడను ఉద్ధరించడానికి సంకల్పించారు. ఇందాక చెప్పినట్లు, గురుదేవులు మార్గం చూపిస్తారేకాని ఎవరి దుఃఖాన్ని వారే విచారణద్వారా తొలగించుకోవాలి. అలాగే కృష్ణుడు మార్గం చూపించగా సత్యభామ నరకాసురుని వధించింది. 

అయితే ఇంకా తన వాసనలు పోకపోవడంతో సాక్షాత్తూ ఆశ్రితపారిజాతమైన పరమాత్ముడు తనవద్దనే ఉన్నా సత్యభామ స్వర్గంనుంచి పారిజాతవృక్షాన్ని పోరాడి మరీ తెచ్చుకుంది. కానీ అది కూడా ఆయనను పూర్తిగా తనకే సొంతం చేయలేకపోయింది. చివరికి సత్యభామ కృష్ణుని  తనవాడిగా చేసుకోవటంకోసం ఆ పారిజాతాన్నీ, తనకున్న సమస్త సంపదలను, బంగారం నిల్వలనూ వదులుకోవడానికి సిద్ధపడింది. అయితే ఈ భౌతిక సంపదలను ఎంత త్యాగం చేసినా పరమాత్ముని పొందటం అసాధ్యం. ఎందుకంటే ఆ సంపదలేవీ మనతో వచ్చినవీ కావు, తీసుకుపోగలిగేవీ కావు. మనం నిజంగా త్యాగం చేయవలసింది జన్మజన్మాంతర వాసనలను. భగవంతుని ప్రేమను పొందటానికి భక్తి ఒక్కటే సాధనమనీ, తనకున్న సంపదలు, ఆకర్షణశక్తీ ఆయనను బంధించలేవని జ్ఞానోదయమైన సత్యభామ చివరికి సంపదమీద తన దృష్టిని, తన ఆకర్షణశక్తిని ఈ రెండు వాసనలను వదిలించుకొని పరమాత్మకు సంపూర్ణ శరణాగతి పొందటంద్వారా ఆయనను తనవాడిని చేసుకుంది. ఇప్పుడావిడకి ఆయన కేవలం తనకుమాత్రమే చెందాలనే స్వార్థం లేదు. ఎందుకంటే ఆయన అందరివాడని, ఆ అందరూ కూడా తనవారేననే జ్ఞానం కలిగింది. 

అయితే ఇలాంటి చరిత్రలు చదివేటప్పుడు "దేవుళ్ళకి కూడా ఇలాంటి బలహీనతలు, మనోమాలిన్యాలు ఉంటాయా? అలా ఉంటే వారు మనకన్నా ఎందులో గొప్ప?" అనే సందేహం కలుగుతుంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఇది కేవలం మనకు పాఠం నేర్పడంకోసం వారు నడిపించిన జగన్నాటకమే కానీ దైవత్వంలో క్షుద్రత్వానికి ఆస్కారం లేదు. ఉదాహరణకు మనం పూజ చేసుకునే ముందు ఒక పువ్వు నేలమీద పడినా, మలినమైనా అది పూజకు పనికిరాదని తీసి ప్రక్కన పెట్టేస్తాం. కానీ అదే పువ్వు ఒకసారి భగవంతుని శిరస్సుపై అలంకరించిన తరువాత ఆ పువ్వు క్రిందపడినా చటుక్కున తీసి మళ్ళీ దేవుని శిరస్సుపైనే పెట్టేస్తాం.  ఒకసారి దేవుని చేరిన పువ్వుకే మళ్ళీ మాలిన్యం లేదంటే ఇక దేవుళ్ళకు ఎందుకు ఉంటుంది?

10, అక్టోబర్ 2018, బుధవారం

త్యాగం

శ్రీగురుదేవులు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. గీతను అటునుంచి ఇటు చదివితే తాగీ అవుతుందని, బెంగాలీలో తాగీ అంటే త్యాగమని, గీతాసారం అంతా త్యాగమేనని. కేవలం త్యాగం ద్వారా మాత్రమే అమృతత్వం సిద్ధిస్తుందని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. పూర్వం ఒక ఊరిలో ఒక సాధువుగారు ప్రవచనం పూర్తికాగానే అందరూ లేచి వెళ్లిపోయారట కానీ ఒక వ్యక్తి మాత్రం ఇంకా కూర్చునే ఉన్నాడు. ఆ సాధువు అతనిని "ఏం నాయనా! ఏమైనా కావాలా?" అని అడిగారు. అప్పుడతడు "స్వామీ! ఇందాకటినుండి మీరు చెప్పినదంతా బాగానే అర్థం అయ్యింది కానీ అదేదో త్యాగం అని మాటిమాటికీ చెప్పారు. అంటే ఏమిటి స్వామీ?" అని అడిగాడు. అతని వాలకం చూస్తే పశువులుకాసే వాడిలాగా ఉన్నాడని, ఆ సాధువు అతనికి అర్ధమయ్యే ఉదాహరణలతోనే విషయాన్ని వివరించాలని "నీ దగ్గర రెండు ఆవులు ఉన్నాయనుకో, ఒక ఆవును ఎవరికైనా ఇచ్చేస్తావా?" అని అడిగారు. దానికతడు "ఓ! తప్పకుండా ఇస్తాను స్వామీ!" అన్నాడు. కానీ అతని ముఖం చూస్తే ఇంకా పూర్తిగా విషయం అర్థం అయినట్లు అనిపించకపోవడంతో మళ్ళీ "నీ దగ్గర రెండు గేదెలు ఉన్నాయనుకో, ఒక గేదెను ఎవరికైనా ఇచ్చేయగలవా?" అని అడిగారు. దానికి కూడా అతడు "ఓ! తప్పకుండా ఇచ్చేస్తాను స్వామీ!" అన్నాడు. ఇక ఆ సాధువు మరింత ఉత్సాహంతో "అలాగే నీ దగ్గర రెండు మేకలు ఉన్నాయనుకో, ఒక మేకను ఎవరికైనా ఇచ్చేస్తావా?" అని అడిగారు. వెంటనే అతడు కంగారుగా "అలా ఎలా కుదురుతుంది స్వామీ? నేను ఇవ్వను" అన్నాడు. ఊహించని ఈ సమాధానంతో ఖంగుతిన్న ఆ సాధువు "ఏం నాయనా! ఆవుని, గేదెని ఇవ్వడానికి ఆనందంగా ఒపుకున్నవాడివి చిన్న మేకను ఇమ్మంటే కుదరదంటావే?" అని అడిగారు. అందుకతడు "మరి నా దగ్గర నిజంగానే రెండు మేకలున్నాయి స్వామీ! అందులో ఒకటి ఇచ్చేస్తే నేనేమైపోవాలి?" అని అడిగాడు. 

మన త్యాగం కూడా ఇలాగే ఉంటుంది. మన దగ్గర లేనివి, ఉన్నా మనవి కానివి త్యాగం చెయ్యడానికి మనం బాగానే ఉత్సాహం చూపిస్తాం. కానీ మనదైన ఏ చిన్న విషయాన్ని కూడా మనం త్యాగం చేయలేం. త్యాగం అనగానే చాలామంది "నా తనుమనధనాలను సర్వస్వాన్నీ త్యాగం చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే" అంటూ ఉంటారు. అయితే ఇందులో తనువు మన సొంతం కాదు కదా! మన తల్లిదండ్రుల దగ్గరనుండి చెరో కణాన్ని తీసుకొని ముందుగా తల్లి అందించిన ఆహారము ద్వారా, ఆ తరువాత ఎందరో రైతులు పండించి అందించిన ఆహారము ద్వారా మన శరీరం ఇంతగా ఎదిగింది. ఇక మనస్సు కూడా తనువుతోపాటుగా వచ్చినదే. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇంకా సంఘంలో మనకు పరిచయమైన ప్రతివ్యక్తి నుండి కొంత కొంతగా జ్ఞానాన్ని, అనుభవాలను గ్రహిస్తూ ఇంతగా ఎదిగింది. ఇక మనకున్న సంపద అంతా ఈ మనవి కాని తనువును, మనస్సును ఉపయోగించి సంపాదించుకున్నదే కదా. అయినా మనం పుట్టకముందు మనవి కానివి, పోయేటప్పుడు మనతో తీసుకుపోలేనివి అయిన ఈ తనుమనధనాలను త్యాగం చేస్తే మనకు అమృతత్వం ఎలా సిద్ధిస్తుంది?

మరి జన్మజన్మలనుండి మనతో వచ్చేదవి, మనకు మాత్రమే సొంతమైనదవి ఏవి? అవే విషయ వాసనలు, కర్మలు. కేవలం వాటిని త్యాగం చేయడం ద్వారా మాత్రమే అమృతత్వాన్ని పొందగలం. "అదేమిటండీ? విషయ వాసనలు అంటే అవి విషయాలకు సంబంధిచినవి కదా? మన సొంతం ఎలా అవుతాయి?" అని మనకు సందేహం రావచ్చు. అయితే మనం "రంపపు పొట్టు" అంటాం కదా! ఇది ఎక్కడనుంచి వచ్చింది? దేనికి చెందినది? రంపానికి చెందినదైతే కాదు. చెక్క రంపానికి తనను తాను వశపరచుకోవడం ద్వారా ఆ చెక్కనుండి వచ్చిన పొట్టునే మనం రంపంపొట్టు అంటున్నాం. అలాగే విషయ వాసనలు కూడా విషయాలనుండి వచ్చినవి కావు. ఆ విషయాలకు మనను మనం వశపరచుకోవడం ద్వారా మనలో కలిగే వాసనలే విషయ వాసనలు. ఇవి మనలను జన్మజన్మలకు వెంటాడుతాయి, మళ్ళీ మళ్ళీ జన్మలకు కారణమవుతాయి. అందుకే వీటిని త్యాగం చేయటమంటే మనం విషయాలకు లొంగిపోకుండా ఉండగలగటమే. అలాగే కర్మలను త్యాగం చేయటమంటే ఏ పనీ చేయకుండా కూర్చోవటం కాదు. అలా కూర్చోవటం కూడా ఒక పనే కదా! అసలు కర్మ చేయకుండా ఉండటం ఏ ప్రాణికీ సాధ్యం కాదు. మరి మనం ఇందులో త్యాగం చేయగలిగినది ఏమిటి? అంటే, మనం కర్మ ఫలాన్ని త్యాగం చేయాలి. ముందుగా "కర్మ చేసేది నేను కాదు, ఇది నాతో భగవంతుడు చేయిస్తున్నాడు" అనే విశ్వాసంతో కర్తృత్వ అహంకారం తొలగిపోతుంది. అలాగే "ఈ కర్మద్వారా నేను పొందగోరేది ఏదీ లేదు. నాకు ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు అది భగవంతుడే ప్రసాదిస్తాడు. నేను కేవలం ఆయన ఆజ్ణతోనే ఈ కర్మ చేస్తున్నాను" అనే సర్వసమర్పణ భావనతో భోక్తృత్వ అహంకారం తొలగిపోతుంది. ఈ రెండూ తొలగిపోతేనే కర్మఫలాన్ని, విషయవాసనలను త్యాగం చేయగలుగుతాం. అప్పుడే మనకు అమృతత్వం సిద్ధిస్తుంది. 

17, జులై 2018, మంగళవారం

చార్ధామ్ యాత్రనుండి నాలుగు పాఠాలు

ఇటీవల జరిగిన చార్ధామ్ యాత్రలో శ్రీ మాతాజీ మరియు ఇతర భక్తులతో కలిసి పాల్గొనే మహద్భాగ్యాన్ని శ్రీ గురుదేవులు నాకు కూడా అనుగ్రహహించారు. ఆ యాత్రలో మేము దర్శించిన వాటిలోనుండి నేను నేర్చుకొన్న నాలుగు పాఠాలను మీ అందరితో పంచుకోవాలనుకొంటున్నాను.

ఈ యాత్రలో మేము చూసిన వాటిలో మొదటిది మెట్టు వ్యవసాయం. హిమాలయాలన్నీ పర్వతాలు కదా. మరి ఆ పర్వతాలపై కురిసిన వర్షం అంతా క్రిందికి జారిపోతుంది. ఎందుకంటే వీలున్నంత లోతుకు ప్రవహించటం నీటియొక్క సహజ లక్షణం. ఇక ఆ పర్వతాలపై వ్యవసాయం చేసి పంటలు పండించటం ఎలా? అందుకే అక్కడివారు ఆ పర్వతాలపై కొంత భాగం చదునుగా చేసి గట్టు కడతారు. అందులో కొంత నీరు నిలిచి నేలను వ్యవసాయానికి అనువుగా చేస్తుంది. ఆ గట్టు దిగువనే మరికొంత స్థలం చదునుచేసి మరియొక గట్టు కడతారు. ఇలా పర్వతం అంతా మెట్లు మెట్లుగా తయారై దానిమీద పడిన నీరంతా అక్కడే నిలిచి వ్యవసాయం సాధ్యమవుతుంది. ఈ వర్షపు నీటిలాగే మన మనస్సు కూడా ఎప్పుడూ క్రిందికే పరుగులిడుతూ ఉంటుంది. మనం ధ్యానంలో మనస్సును అత్యున్నతమైన పరమాత్మ నిర్గుణతత్వంపై నిలపడానికి ప్రయత్నిస్తాం, కానీ అది అక్కడినుండి జారిపోయి ఎక్కడెక్కడికో ప్రాపంచిక విషయాలపైకి ప్రయాణిస్తూ ఉంటుంది. పోతనగారు కూడా గంగమ్మను ఉదాహరణగా తీసుకొని విష్ణుదేవుని పాదాలనుండి స్వర్గానికి, అక్కడినుండి శంభుని శిరస్సుకు, అక్కడనుండి హిమాలయాలకు, భూమిపైకి, సముద్రంలోకి, పాతాళానికి ఇలా దిగజారిపోయిందని, భగవంతుని పాదపద్మాలను విడిచిపెట్టిన వాని మనసు గతి ఇంతేనని తెలిపారు. కానీ శ్రీగురుదేవులు పరమానుగ్రహంతో మన మనస్సు ఇలా జారిపోకుండా ఎల్లప్పుడూ పరమాత్మ మీదనే నిలిచి ఉండటం కోసం ఇలాంటి యాత్రలని, దీక్షలని, హోమాలని, పూజలని, సత్సంగాలని ఇలా అనేక గట్లు కడుతున్నారు. ఇలా మెట్టు వ్యవసాయం చేస్తూ మన హృదయక్షేత్రాలలో ఆత్మానందమనే పంటను పండిస్తున్నారు. 

ఇక మేము చూసిన రెండవ విషయం నదీ ప్రవాహం. మేము గంగోత్రి, యమునోత్రి వంటి పుణ్య నదుల జన్మస్థలాలను సందర్శించాము. అక్కడ మేము గమనించినది ఏమిటంటే నది జన్మస్థలానికి దగ్గరలో నది నిండా ప్రవాహ వేగానికి కొట్టుకువచ్చిన పెద్ద పెద్ద రాళ్లు ఉంటాయి. ఇక్కడ నది చాలా  హోరుతో ఉరకలెత్తుకుంటూ ప్రవహిస్తూ ఉంటుంది. నది ముందుకు సాగినకొద్దీ ఈ రాళ్లు ఒకదానితో ఒకటి ఢీకొని ముందు చిన్న చిన్న రాళ్లుగా ఆ తరువాత ఇసుకగా, ధూళిగా మారిపోతాయి. అప్పటికి నది కూడా చాలా ప్రశాంతంగా మారిపోయి చివరికి ఆ ఇసుకను, ధూళిని అక్కడే వదిలేసి సముద్రంలో కలిసిపోతుంది. సముద్రమునుండి ఆవిరైన నీరే వర్షంగా పడి  నదిగా మారుతుంది కదా. మనం కూడా అలాగే మనం ఎక్కడినుండి వచ్చామో ఆ భగవంతుని చేరడానికి ఆథ్యాత్మిక సాధన మొదలుపెడతాం. మొదట్లో ఆ నదిలోని పెద్ద పెద్ద రాళ్ళలాగే మన మనస్సులో మంచి, చెడు  గుణాలు ఉంటాయి. వాటి మధ్య నిత్య సంఘర్షణ మహాభారత యుద్ధంలా నడుస్తూ ఉంటుంది. మనస్సు ఎంతో ఉద్వేగంతో ఉంటుంది. అయితే సాధన ముందుకు నడిచినకొద్దీ ఈ గుణాలు చిన్న చిన్న ఇసుకరేణువుల, ధూళికణాల  పరిమాణానికి కుంచించుకుపోతాయి. అప్పుడు మనస్సు కూడా స్థితప్రజ్ఞతను సాధించి ప్రశాంతంగా మారుతుంది. చివరికి మనం వీటన్నింటిని వదిలివేసి మన మూలస్థానాన్ని చేరుకుంటాము. 

ఈ యాత్రలో మేము గమనించిన మూడవ అంశం ఘాట్ రోడ్లు. మైదాన ప్రాంతాలలో ఉన్న రహదారులు ఎప్పుడూ ముందుకే సాగిపోతూ ఉంటాయి. ఈ దారివెంట ప్రయాణంలో మనకు ఒకసారి కనపడిన వ్యక్తులుగాని ప్రదేశాలుగాని మళ్ళీ కనపడవు. కానీ పర్వతాలపైకి వెళ్లే రహదారులు మెలికలు తిరుగుతూ వెళతాయి. ఒక మెలిక తిరిగినప్పుడల్లా మళ్ళీ మనకు క్రింద అవే ప్రదేశాలు, విశేషాలు మళ్ళీ మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి. మన ప్రయాణం సాగడం లేదేమోనని మనకు సందేహం కలిగినా, ప్రతి మలుపుతో మనం ఇంకా ఇంకా పైకి చేరుకుంటూనే ఉంటాము. ప్రాపంచిక విద్య కూడా మైదానంలోని రహదారి లాంటిదే. బడిలో ఒకసారి చెప్పిన అంశం ఏదీ మళ్ళీ  చెప్పరు. అలా చెబితే వారి విద్యావిధానం సరిగా లేనట్లే. దీనిని పునరుక్తి దోషం అని కూడా అన్నారు పెద్దలు. కానీ ఆథ్యాత్మిక విద్యలో మనం విన్న విషయాన్నే మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటాం. చేసిన పూజనే, యాత్రనే, దీక్షనే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి "ఆ! ఎన్నిసార్లు విన్నా ఉపయోగం కలగటం లేదు" అని కూడా అనిపిస్తుంది. కానీ మనం గమనించని విషయం ఏమిటంటే ప్రతిసారి మనం ఆథ్యాత్మికంగా మరింత ఉన్నత స్థితికి ఎదుగుతున్నామని. 

ఇక చివరిగా మేము గమనించినది కొండలలో రకాలు. కొండలలో ముఖ్యంగా రెండు రకాలు మేము చూశాము. అవి మెత్తటి మట్టితో, చిన్న చిన్న రాళ్లతో తయారైన కొండలు, ఇంకా గట్టి రాతి కొండలు. మెత్తటి కొండలపై మట్టి వదులుగా ఉంటుంది. అలాగే అనేక పెద్ద పెద్ద చెట్లు పెరుగుతాయి. ఈ కొండలపై మార్గాన్ని నిర్మించడం చాలా తేలిక. కానీ ఆ మార్గం ఎల్లప్పుడూ ప్రమాదాలతో నిండి ఉంటుంది. ఏ క్షణంలోనైనా చెట్లు విరిగి పడవచ్చు, లేదా మట్టిపెళ్ళలు విరిగిపడి దారిని మూసివేయవచ్చు. ఇక రాతి కొండలపై మార్గాన్ని నిర్మించడం ఎంతో కఠినమైన శ్రమతో కూడుకొన్న విషయం. అయితే ఒక్కసారి మార్గాన్ని నిర్మించిన తరువాత దానిపై ప్రయాణం సురక్షితం. పైన చెప్పుకొన్న ఏ అవాంతరాలు ఆ మార్గంలో ఉండవు. శ్రీబాబూజీ మహారాజ్ వంటి సద్గురువులు చిన్న వయసులోనే కఠోర శ్రమకోర్చి మనకు అటువంటి సురక్షితమైన మార్గాన్ని సిద్ధం చేసి పెట్టారు. ఆ మార్గాన్ని వదలి ఎవరో సులభంగా నాలుగు పుస్తకాలు చదివి ప్రవచించే మట్టి కొండల మార్గాన్ని ఎంచుకొంటే అడుగడుగునా ప్రమాదాలే మనను పలకరిస్తాయి. 

22, మార్చి 2018, గురువారం

అగర్తల

మన దేశానికి ఈశాన్య ప్రాంతంలో త్రిపుర అనే రాష్ట్రం ఉంది. దాని రాజధాని అగర్తల.  సువాసనలు వెదజల్లే అగరు వృక్షాలు ఎక్కువగా ఉండే స్థలం కాబట్టి దానికి అగర్తల అని పేరు. అలాగే అంతా ఈశ్వరునితో నిండియున్న ఈ జగత్తులో స్థూల, సూక్ష్మ, కారణ దేహాలనే త్రిపురాలతో కూడిన ఈ రాష్ట్రం (శరీరానికి రాష్ట్రం అని కూడా పేరు)  ఏర్పడింది . దీనికి రాజధాని వాసనలతో నిండియున్న కారణ శరీరం. దీనినే వాసనా దేహం అని కూడా అంటారు. జన్మజన్మాన్తరాలనుండి అనేక వాసనలను ఇది మోసుకొస్తూ ఉంది. మానవ దేహాలన్నీ ఒకేవిధంగా పంచభూతాలతో నిర్మితమైనా, ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలకు కూడా చిన్నప్పటినుండి వారివారి స్వభావాలలో, ప్రవర్తనలో స్పష్టమైన తేడాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కొందరు పైకి ఎటువంటి కారణమూ కనిపించకపోయినా శైశవదశ నుండి ఏదో ఒక రంగంలో విశేషమైన ప్రతిభ కనబరుస్తూ ఉంటారు. దీనికి కూడా కారణం పూర్వజన్మ వాసనలే. 

ఈ వాసనలు మళ్ళీ మూడు రకాలుగా ఉంటాయి. దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన. వాటి గురించిన వివరణ నా ఈ పోస్టులో చూడగలరు. వీటి వలననే మనం ఎంతసేపూ నేను, నాది అనుకుంటూ మనం చూస్తున్న విషయాలో చదివిన విషయాలో పరమ సత్యాలని నమ్ముతూ, మనుషుల అంతరంగాలు తెలుసుకోకుండానే వారి వేషభాషలను బట్టి వారికి గుణాలను అంటగడుతూ ఉంటాము. ఈ వాసనలు ఎంత బలవత్తరంగా ఉంటాయనే దానికి ఒక చిన్న ఉదాహరణ - సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్ముని విశ్వరూపాన్ని దర్శించి లోకమంతా ఉన్నది ఆయనే అనే సత్యాన్ని కనులారా దర్శించిన సమయంలో కూడా అర్జునుడు ఇంకా తన లోకవాసనను వదులుకోలేక కర్ణుణ్ణి సూతపుత్రుడని సంబోధిస్తాడు (భగవద్గీత 11-26). అదే సమయంలో వాసనా రహితుడైన వాసుదేవుడు మాత్రం కర్ణుడనే సంబోధిస్తాడు (భగవద్గీత 11-34).  ఈ బలవత్తరమైన వాసనలే మన త్రిపురాలని మనకు ఆవరణగా అడ్డుపెట్టి ఈశ్వరుని సర్వవ్యాపకత్వాన్ని గుర్తించనీకుండా చేస్తున్నాయి. 

మరి ఈ త్రిపురాలను హరించి జగత్తంతా ఈశ్వరమయంగా దర్శించటం ఎట్లా? దానికి త్రిపురాసుర సంహార ఘట్టం లోనే మనకు ఉపాయం కనిపిస్తుంది. పరమేశ్వరుడు సూర్యచంద్రులనే చక్రాలుగా గల భూమి రథాన్ని ఎక్కి మేరు పర్వతాన్ని ధనస్సుగానూ, వాసుకిని దాని నారిగానూ, నారాయణుని అస్త్రంగానూ చేసుకొని త్రిపురాలను ఒకే సరళరేఖలో నిలబెట్టి భస్మం చేసేసాడు. అలాగే మనం కూడా సూర్యచంద్రులు కలిసే రెండు సంధ్యలలోనూ  భూమిపై స్థిరాసనంలో కూర్చొని సాధన చేయాలి. ఇక మేరుపర్వతాన్ని ధీరత్వానికి ప్రతీకగా చెబుతారు. అలాగే మనం కూడా మన సాధనలో ధీరులమై ఉండాలి. మరి వాసుకి అనే సర్పం ఈశ్వరుని కంఠాభరణం, అంటే శంకరాభరణం. ఓంకార నాదానుసంధానమౌ గానమే శంకరాభరణం అని మనం పాడుకుంటూ ఉంటాం కదా.  అంటే ధ్యానంలో ముందుగా మన మనస్సు నిర్మలమయ్యే వరకూ  దీర్ఘంగా ఓంకారాన్ని నాభినుండి పూరించాలి. ఆ ఓంకార నాదానికి జాగృతమైన కుండలినీ శక్తియే మనలోని వాసుకి. అప్పుడు దానిపై గురు లక్ష్యార్థమనే నారాయణాస్త్రాన్ని సంధించి త్రిపురాలను ఒకే వరుసలో నిలబెట్టి, అంటే త్రికరణశుద్ధిగా ధ్యానం చేస్తే అప్పుడు ఈ త్రిపురాలయందుగల వాసనలు దగ్ధమై విశ్వమంతా ఈశ్వరమయమనే జ్ఞానజ్యోతి మనలో ప్రకాశిస్తుంది. 

20, మార్చి 2018, మంగళవారం

తితీక్ష

మన ఆధ్యాత్మిక సాధనకు తోడ్పడే సాధనాలలో వివేకము, వైరాగ్యము తరువాత ముఖ్యమైనవి శమాది షట్క సంపత్తి. శమము అంటే అంతరేంద్రియ నిగ్రహం. దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. ఉపరతి అంటే ఎల్లప్పుడూ ఆ పరమాత్మ వస్తువునందే మన మనస్సు రమిస్తూ ఉండటం. తితీక్ష అంటే మానావమానములను సమానముగా స్వీకరించగలగటం. శ్రద్ధ అంటే మన సాధనయందు ఆసక్తి కలిగి చక్కగా చేయగలగడం. ఇక సమాధానము అంటే అంతా భగవంతుని ఇఛ్చ ప్రకారమే జరుగుతోందని గ్రహించి ఎక్కడికక్కడ మనకు లభించిన దానితో తృప్తిపడటం. 

మనం ఎంతటి ఆధ్యాత్మిక సాధనలో ఉన్నా సంఘజీవులం కాబట్టి బయటి ప్రపంచంతో సంబంధం తప్పదు. మరి ఆ సంఘంలో అనేక రకాలైన మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఉంటారు. కొందరు అందరితో మంచిగా ఉంటూ తాము ఆనందిస్తూ చుట్టూ ఉన్నవారిని కూడా ఆనందింపచేస్తూ ఉంటారు. మరికొందరు వారికి ఏమాత్రం అవసరం లేకపోయినా ఎదుటివారి విషయాలలో కల్పించుకుంటూ లేనిపోని సలహాలు ఇస్తూ ఉంటారు. ఇంకొందరు మరికాస్త ముందుకు వెళ్లి తమకేదో చాలా బాధ్యత, ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ "ఏమ్మా! మీ అమ్మాయికి ఇంకా పెళ్లి చెయ్యరా?" "మీ అబ్బాయి మొన్ననే ఉద్యోగం మానేసి వచ్చేసాడుట కదా?" "అయ్యో ఉన్న డబ్బంతా అలా ఊర్లో వాళ్ళ కోసం ఖర్చు పెట్టేస్తే ఎలా బ్రతుకుతారు?" "మరీ ఇంత పీనాసితనం నీకు పనికిరాదు." ఇలా సూటిపోటి మాటలతో కాకులలా పొడుస్తూ ఉంటారు.

ఇలాంటి వారిని చూసినప్పుడు మనకి సహజంగా కోపం వస్తుంది. అదేదో సినిమాలో అన్నట్లు "ఏమిరా నీవల్ల దేశానికి ఉపయోగము?" అని అడగాలనిపిస్తుంది. కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే భగవంతుని సృష్టిలో వ్యర్థమైనది అంటూ ఏదీ లేదు. ప్రతిదానికీ ఎదో ఒక ప్రయోజనం ఉంటుంది. ఇలాంటి వారివలన ప్రయోజనం ఏమిటో చూద్దాం. పైన చెప్పిన శమాది షట్క సంపత్తిలో మిగిలిన అయిదు గుణాలను మనం ఎంతవరకు అలవరచుకొన్నామో తెలుసుకుంటూ ఆయా గుణాలను ఇంకా పెంపొందించుకోవడానికి మనను మనమే ఎప్పటికపుడు పరీక్షించుకొని అంచనా వేసుకోవటానికి వీలు పడుతుంది.  కానీ తితీక్షను మాత్రం మనకుగా మనం పరీక్షించుకోలేము. అందుకు బయటినుండి ఇలాంటి వ్యక్తుల సహాయ సహకారాలు మనకు ఎంతగానో అవసరమవుతాయి. 

ఇలాంటి వారు ఎదురైనప్పుడల్లా వారి మాటలను అవమానంగానో బాధాకరంగానో భావించక మన తితీక్షను పరీక్షించుకోవడానికి ఒక చక్కని అవకాశంగా స్వీకరించి ఎన్ని నదులు వచ్చి తనలో కలిసినా సముద్రం ఎలా తొణకక బెణకక నిశ్చలంగా ఉంటుందో అలాగే ఎన్ని అవమానాలు ఎదురైనా మన మనస్సుని నిశ్చలంగా ఉంచుకోగలగటం సాధన చేయాలి. అప్పుడే మనం పరమ శాంతిని పొందగలుగుతాం. 

ఒకసారి బుద్ధభగవానుడు భిక్షాటనకై వెళ్ళినప్పుడు ఒక ఇల్లాలు భిక్ష వేయకపోగా ఆయనను సోమరిపోతుగా భావించి నానా మాటలూ అంది. అయినా ఆయన చిరునవ్వుతోనే నిలబడి ఉన్నారు. కొంతసేపటికి విసుగెత్తిన ఆ ఇల్లాలు "ఇందాకటినుంచి ఇంతగా తిడుతున్నాను, నీకేమీ బాధే కలగటం లేదా?" అని ప్రశ్నించింది. అప్పుడు బుద్ధభగవానుడు "తల్లీ! ఒకవేళ నీవు వేసిన భిక్షను నేను స్వీకరించలేదనుకో అప్పుడు ఆ భిక్ష ఏమవుతుంది?" అని ప్రశ్నించారు. అందుకామె "అప్పుడది నా దగ్గరే ఉంటుంది." అని సమాధానం చెప్పింది. "అలాగే తమరు ఇంతసేపూ నన్ను అన్న మాటలేవీ నేను స్వీకరించలేదు" అని చెప్పి ఆయన ముందుకు సాగిపోయారు. 

ఒకసారి శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారు నదీ స్నానం చేసి తిరిగి వస్తుండగా ఒక పొగరుబోతు ఆయనపై ఉమ్మి వేశాడు. ఆయన మారు మాట్లాడక తిరిగి నదీ స్నానం చేసి వచ్చారు. ఆ పొగరుబోతు మళ్ళీ ఉమ్మి వేయడం, ఈయన మళ్ళీ స్నానం చేయడం ఇలా 108 సార్లు జరిగింది. చివరికి విసుగెత్తిన అతడు "నేను ఇన్నిసార్లు నీమీద ఉమ్మినా నీకు సిగ్గు అనిపించటం లేదా?" అని ప్రశ్నించాడు . అందుకు ఏకనాథ్ వారు "సోదరా! సిగ్గెందుకు. ఈరోజు ఏకాదశి. నా అంతట నేను అనుకోలేదు కానీ నీ దయవల్ల నేనివాళ 108 సార్లు నదీ స్నానం చేయగలిగాను. ఇంతకంటే మహద్భాగ్యం ఏముంటుంది?" అని నవ్వుతూ బదులిచ్చారు.