30, ఏప్రిల్ 2019, మంగళవారం

అనుభవ జ్ఞానం

మనం సాధారణంగా పాఠశాలల్లో చూస్తూ ఉంటాం - సరిగ్గా చదువు రాని వాళ్ళని, చెప్పిన పాఠం అర్థంచేసుకోలేని వాళ్ళని, గుర్తు ఉంచుకోలేని వాళ్ళని, "శుద్ధ మొద్దు అవతారం! నువ్వు జీవితంలో ఎందుకు పనికి వస్తావు?" అంటూ తోటి విద్యార్థులు, ఒక్కొక్కసారి ఉపాధ్యాయులు కూడా అవమానిస్తూ, ఎత్తిపొడుస్తూ ఉంటారు. ఫస్ట్ ర్యాంకులు, స్టేట్ ఫస్టులు వచ్చిన వాళ్ళ ఫోటోలు పేపర్లో చూసి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని తిడుతూ ఉంటారు. అయితే చదువు జీవితంలో ఒక భాగమే కానీ అదే జీవితం కాదని మనందరికీ తెలిసిందే కదా! కేవలం పుస్తకంలో ఉన్నది బట్టీపట్టో, అర్థం చేసుకొనే అడగగానే సమాధానాలు చెప్పగలిగేవాడికంటే సమాజాన్ని చదివి, ఎలా జీవించాలో, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో, అవకాశాలు ఎలా అందిపుచ్చుకోవాలో, అవి లేనప్పుడు ఎలా వాటిని కల్పించుకోవాలో అనుభవం ద్వారా తెలుసుకున్నవాడే జీవితంలో ఎక్కువగా రాణించగలుగుతాడు. కేవలం పుస్తకాలే జీవితంగా బ్రతికినవాడి ఫోటో ఒకసారి పేపర్లో పడినా, ఆ తరువాత ఎలా జీవించాలో తెలియకపోతే వాడు చాలా అతి సామాన్యమైన జీవితాన్నే జీవించవచ్చు. చదువు వంటపట్టక పరీక్షలు తప్పినవాడు కూడా ఎలా జీవించాలో తెలిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. మనకు తెలిసిన ఎందరో కోటీశ్వరులు సరైన చదువు లేనివారే, కానీ జీవితాన్ని చదివినవారు.

ఇదే సూత్రం ఆథ్యాత్మికంలో కూడా వర్తిస్తుంది. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన శక్తిని ఇస్తాడు. మనందరమూ ఆయన చేతిలో పనిముట్లమే. ఏ పనిముట్టు ఎందుకు పనికివస్తుందో, దానిని ఎలా ఉపయోగించుకోవాలో ఆయనకు బాగా తెలుసు. ఒకరు చక్కగా పాడగలుగుతారు. మరొకరు చక్కగా వ్రాయటమో వేదికలెక్కి ఉపన్యాసాలు చెప్పడమో చేయగలుగుతారు. మరొకరు ఎంతటి లోతైన వేదాంత విషయాలనైనా సులభంగా అర్థం చేసుకొని, గుర్తు పెట్టుకొని, మళ్ళీ చెప్పగలుగుతారు. అంతమాత్రంచేత వారంతా ఏదో సాధించేశారనో, ఇవేవి చేతకానివారు ఎందుకూ పనికిరాని వారనో అర్థం కాదు. అనుభవ జ్ఞానం ముందు పుస్తక జ్ఞానం, పాండిత్యం ఎప్పటికీ దిగదుడుపే. పంచభూతాలు, దశేన్ద్రియాలు, పంచ తన్మాత్రలు, షట్చక్రాలు, గుణత్రయం, వాసనాత్రయం, ఈషణత్రయం, సాధన చతుష్టయం ఇలా టకాటకా అన్నీ అప్పచెప్పే వ్యక్తి తనలో ఏదైనా గుణం ప్రేరేపించినప్పుడు ఎంతవరకు తట్టుకుని నిలబడగలుగుతాడు? ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? అదే ఇవేమీ తెలియకపోయినా నిరంతరం భగవన్నామం చేసుకుంటూ తనకు జీవితంలో వచ్చే కష్టసుఖాలన్నింటినీ సమదృష్టితో భగవంతుని ప్రసాదంగా స్వీకరించే భక్తుడు తప్పక నిలబడగలుగుతాడు. ఇక్కడ శాస్త్రజ్ఞానం కన్నా అనుభవ జ్ఞానమే మిన్న కదా!

పుస్తక జ్ఞానం, లేదా శాస్త్రజ్ఞానం ఒక జన్మకే పరిమితమైనది. మరి మన ఆథ్యాత్మిక సాధన జన్మజన్మాంతరాల నుంచీ జరుగుతూనే ఉంది. "సాధనామార్గంలో ఉన్న మానవుడు కర్మవశం చేత మధ్యలోనే జన్మ చాలించవలసి వస్తే అతని సాధన అంతా వృథాయేనా?" అని భగవద్గీతలో అర్జునుడు వెలిబుచ్చిన సందేహానికి గీతాచార్యుడు "అటువంటి భయమేమీ అక్కర్లేదు. ఒక జన్మలో సాధన పూర్తికాక యోగభ్రష్టుడైన సాధకుడు ఎక్కడైతే తన సాధన ఆపాడో తరువాత జన్మలో అక్కడనుండి తన సాధనను కొనసాగించి చివరికి కృతకృత్యుడౌతాడు" అని భరోసా ఇచ్చాడు కదా! మరి ఇదే సూత్రం పుస్తక జ్ఞానానికి వర్తిస్తుందా? ఈ జన్మలో డిగ్రీ చదువుకున్న మానవుడు వచ్చే జన్మలో నేరుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తానంటే కుదురుతుందా? మళ్ళీ అతను ఆ జన్మలో నర్సరీనుంచి మొదలు పెట్టవలసిందే కదా! ఇంక ఈ పుస్తక జ్ఞానంతో ఉపయోగం ఏమిటి? "సింహం అడవికి రాజు. అది గర్జించును. దాని పంజా దెబ్బ చాలా గట్టిగా ఉండును" అని ఎన్నిసార్లు వల్లెవేసినా వీడు సింహం కాలేడు కదా! అదే ఇవేమీ చదవకపోయినా, అసలు తనని సింహం అంటారని తెలియకపోయినా ఒక సింహం ఇవన్నీ సహజంగానే చేస్తుంది కదా. అదే పుస్తక జ్ఞానికి, నిజమైన భక్తుడు, లేదా అనుభవ జ్ఞానికి ఉన్న తేడా.

మనం శాస్త్రాలను ఎంతగా వల్లెవేసినా ఆ విద్యతో భగవంతుని మెప్పించలేం. ఎవరైనా మనకు తెలియని విద్యని ప్రదర్శిస్తే 'అబ్బో!' అని ఆశ్యర్యపోతాం, మెచ్చుకుంటాం. అదే మనకు బాగా తెలిసిన విద్యనే ప్రదర్శిస్తే "ఆ! చేశాడులే" అని చప్పరించేస్తాం. మరి ఈ లోకంలోని పుస్తక జ్ఞానమంతా భగవంతుని నుంచి వచ్చిందే కదా. ఇందులో ఆయనకు తెలియనిది, ఆయనను అబ్బురపరిచేది ఏముంటుంది? మరి ఆయనను ఇంప్రెస్ చెయ్యడం ఎలా? అంటే ఆయనకు తెలియనిది, అనుభవంలో లేనిది ఒకటి ఉంది. అదే భక్తి. దానితోనే మనం అయన హృదయాన్ని గెలుచుకోగలం. "ఎందరో భక్తులు నామీద ఇంతటి ప్రేమను చూపిస్తున్నారు. నన్ను చూడకుండా, సేవించకుండా ఉండలేకపోతున్నారు. అసలు ఈ భక్తి, ప్రేమ ఎలా ఉంటాయో ఒకసారి తెలుసుకుందాం" అనే ఉత్సుకతతోనే శ్రీకృష్ణుడు తానే రాధ రూపాన్ని ధరించి భక్తిని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడని మనకు పెద్దలు చెబుతారు. అలాగే "అందరూ నా పాదాలను విడిచిపెట్టకుండా సేవిస్తూ ఉంటారు. అసలు ఈ పాదాలలో ఉన్న మాధుర్యం ఏమిటో చూద్దాం" అని ఆయన సృష్టి అంతా లయమైపోయిన తరువాత వటపత్రశాయియై తన కాలి బొటనవ్రేలుని తనే నోట్లో పెట్టుకొని ఆస్వాదిస్తూ ఉంటాడని కూడా చెబుతారు. కాబట్టి నిజంగా భగవంతుని మెప్పించేది భక్తి, అనుభవ జ్ఞానాలే కానీ పాండిత్యమూ, శాస్త్రజ్ఞానమూ కాదు.

3, ఏప్రిల్ 2019, బుధవారం

భ్రాంతి

ఒకసారి ఇద్దరు మిత్రులు సినిమాకు వెళ్లారు. సినిమాలో హీరో గుఱ్ఱం మీద వెళ్తున్నాడు. మొదటి మిత్రుడు, "ఇప్పుడు ఆ హీరో గుఱ్ఱం మీదనుంచి పడిపోతాడు. కావాలంటే వంద రూపాయలు పందెం" అన్నాడు. ఆ హీరో పడిపోడని రెండవ మిత్రుడూ పందెం కాసాడు. మరికొద్ది నిముషాలలో ఆ హీరో పడిపోవడం, రెండవ మిత్రుడు మొదటివానికి వంద రూపాయలు ఇవ్వడం జరిగిపోయాయి. అయితే ఆ మొదటి మిత్రుడు, "నేను ఈ డబ్బులు తీసుకోలేను. నేను నిన్ను మోసం చేశాను. నేను ఈ సినిమా ఇదివరకే చూసేసాను" అన్నాడు. అప్పుడా రెండవ మిత్రుడు, "నేను కూడా ఈ సినిమా ఇదివరకే చూసాను. అయినా ఆ హీరోకి ఏమాత్రం బుద్ధి ఉన్నా ఒకసారి గుఱ్ఱం మీదనుంచి పడ్డవాడు రెండవసారి జాగ్రత్తగా ఉంటాడులే అనుకొని నీతో పందెం కాసాను. కానీ ఆ బుద్ధిలేని హీరో మళ్ళీ అలాగే పడిపోయాడు" అన్నాడు.

ఇది వింటే ఆ రెండవవాడి అమాయకత్వాన్ని చూసి మనం నవ్వుకుంటాం. కానీ ప్రతిరోజూ మనం చేస్తున్నది కూడా అదే. మన జీవితంలో ప్రతిరోజూ ఇలాంటి భ్రమలకు, భ్రాంతులకు లోనవుతున్నాం. ఎలాగో చూద్దాం. మనకు ప్రధానంగా ఆరుగురు శత్రువులని పెద్దలు చెబుతారు కదా! అవే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇవి మన ప్రబల శత్రువులని చిన్నప్పటినుండి వింటూనే ఉన్నాం. అలాగే వీటి దాహం తీరనిదని, ఎంత సమర్పించుకున్నా ఇంకా ఇంకా అగ్నిలా ప్రజ్వరిల్లుతూనే ఉంటాయని సాక్షాత్తు భగవానుడే గీతలో చెప్పాడు కదా! అయినా మనం ప్రతిసారీ 'ఈ ఒక్కసారికి వాటి మాట విని వాటి ఆకలి తీరిస్తే మళ్ళీ  మన జోలికి రావులే' అనుకుంటూ మళ్ళీ మళ్ళీ వాటికి లొంగిపోతూనే ఉంటున్నాం.

ఒకరికి విపరీతమైన షుగర్ వ్యాధి ఉంటుంది. కానీ తీపి అంటే ఎంతో ఇష్టం. 'ఈ ఒక్కసారికి తినేస్తే ఆ కోరిక తీరిపోతుందిలే. ఆ తరువాత ఇంకెప్పుడూ తినద్దు' అనుకుంటూ తినేస్తాడు. అయితే ఆ కోరిక అక్కడితో ఆగుతుందా? మళ్ళీ మళ్ళీ తీపివైపుకు లాగుతూనే ఉంటుంది, వీడు మళ్ళీ మళ్ళీ దానికి లొంగుతునే ఉంటాడు. చివరికి వాడి ప్రాణం మీదకు తెచ్చుకుంటాడు. అలాగే ఒకడికి విపరీతమైన కోపం ఉందనుకోండి. అది తప్పు అని వాడి బుద్ధి మాటిమాటికి హెచ్చరిస్తూనే ఉంటుంది. అయినాసరే 'ఈ ఒక్కసారికి నా పిల్లవాడిమీద కోపం చూపిస్తే తరువాత వాడే నా మాట వింటాడులే' అనుకుంటూ ఉంటాడు. ఆ పిల్లవాడు మాట వినేదెప్పుడు? వీడి క్రోధం అణిగేదెప్పుడు? రెండూ కల్లలే. చివరికి ఆ పట్టరాని క్రోధంలోనే ఏదో జరగరాని అనర్థం జరుగుతుంది.

అలాగే లోభగుణం ఎక్కువగా ఉన్నవాడు ఎవరికైనా ధన సహాయం చేయవలసి వస్తే 'ఈ ఒక్కసారికి దాచుకుందాంలే. వచ్చేసారి నుంచి నా శక్తికొలది తప్పకుండా దానం చేస్తాను' అని ప్రతిసారి అనుకుంటూ కాలం గడిపేస్తూ ఉంటాడు. అలాగే మన కళ్ళముందే మనం మోహం పెంచుకున్న ఎందరో బంధువులు, స్నేహితులు వెళ్లిపోతున్నా మళ్ళీ మళ్ళీ 'ఈ ఒక్కసారికే' అనుకుంటూ క్రొత్త వారి(టి)పై మోహం పెంచుకుంటూనే ఉంటాం. ఇక ఎన్నిసార్లు 'నీ సత్తా ఇంతేరా!' అని భగవంతుడు మొట్టికాయలు వేస్తున్నా 'అమ్మో! వచ్చేసారి జాగ్రత్తగా ఉండాలి' అనుకుంటూనే ఉంటాం, అయినా మళ్ళీ మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు 'నా అంతవాడు లేడు' అనుకుంటూ మదాన్ని ప్రదర్శిస్తూనే ఉంటాం. ఇలాగే ఎప్పటికప్పుడు 'ఇది తప్పు. భగవంతుడు నాకు ఇవ్వాల్సింది బాగానే ఇచ్చాడు' అనుకుంటూనే మళ్ళీ ఈర్ష్య, అసూయ, అసహనం, ఓర్వలేనితనం రూపాల్లో మాటిమాటికి మాత్సర్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంటాం.

అయితే పైన చెప్పుకున్న కథలో మొదటివాడు ఎందుకు భ్రాంతిలో పడలేదు? రెండవవాడు ఎందుకు పడ్డాడు? అని విచారిస్తే మొదటివాడు 'ఇది సినిమా. ఎన్నిసార్లు చూసినా ఇందులో మార్పేమీ ఉండదు. అది ఎప్పటికీ నిజం కాబోదు' అనే జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. ఇక రెండవవాడు సత్యానికి, కల్పనకి భేదం తెలుసుకోలేక ఆ కల్పనే నిజమని భ్రమించి ఎప్పటికైనా అది మంచిగా మారకపోతుందా అనుకుంటూ అందులో లీనమై మళ్ళీ మళ్ళీ ఆత్రంగా చూస్తూనే ఉన్నాడు. ఇదే మనకీ, జ్ఞానులైన మహాత్ములకు ఉన్న తేడా. మనం ఈ చూసే ప్రపంచమంతా సత్యమేననే భ్రమలో పడి 'ఇందులో రమించడం మన ఆథ్యాత్మిక ఉన్నతికి అవరోధం' అని మన బుద్ధి మాటిమాటికి హెచ్చరిస్తూనే ఉన్నా 'ఎప్పటికైనా ఇందులోనే మనకు కావలసింది దొరక్కపోతుందా' అని మళ్ళీ మళ్ళీ లేనిచోటే మన ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్నాం.

మనం సినిమాకి వెళ్ళినప్పుడు అందులోని నవరసాలను మన జీవితంలోనే జరుగుతున్నట్లుగా తాదాత్మ్యం చెంది అనుభవిస్తూనే ఉంటాం కానీ అంతర్లీనంగా 'ఇది కేవలం సినిమా మాత్రమే. నిజం కాదు.' అనే జ్ఞానం మనకు సదా ఉంటుంది. అందుకే సినిమాలో బాంబు పేలితే మనం అక్కడినుంచి లేచి పారిపోము, హత్య జరిగితే పోలీసులకి ఫోన్ చెయ్యము. మహాత్ములకి నిజ జీవితంలో కూడా నిరంతరం ఈ జ్ఞానం ఆరూఢమై ఉంటుంది. అందుకే వారు మనందరి భిన్నత్వాన్ని గుర్తిస్తూ, ఎవరికి తగ్గ రీతిలో వారితో మాట్లాడుతూ, వారి వారి సమస్యలను, సంతోషాలను అన్నింటినీ వింటూ, పరిష్కారాలు సూచిస్తూ ఉన్నా, వారిలో అంతర్లీనంగా 'ఇదంతా ఒక సినిమాలాంటిదే. నిజం కాదు. ఉన్నది భగవంతుడు ఒక్కడే. నేను, నా ఎదురుగా ఉన్నవాడూ, వాడికి సమస్యను సృష్టించిన వాడూ అందరూ ఆ భగవంతుని రూపాలే' అనే జ్ఞానం సదా నిలిచి ఉంటుంది. మనం కూడా అటువంటి జ్ఞానాన్ని పొందేవరకు ఈ భ్రాంతులు తప్పవు.