15, ఫిబ్రవరి 2026, ఆదివారం

ఓం పూష దంతభిదే నమః



    శ్రీ శివ అష్టోత్తర శతనామావళిలో ఒక నామం ఓం పూష దంతభిదే నమః. పూష అనేది సూర్యభగవానుని నామం. లోకానికంతటికీ పోషణనిచ్చేది సూర్యుడే కదా. మరి అటువంటి సూర్యుడికే పోషణకు అవసరమైన దంతాలు లేకుండా పరమేశ్వరుడు ఎందుకు వాటిని భేదనం చేయవలసి వచ్చింది? దక్షయజ్ఞంలో సతీదేవి ఆత్మాహుతి చేసుకొన్నప్పుడు పరమేశ్వరుడు ఉగ్రరూపంలో వీరభద్రుడై ఆ యాగాన్ని ధ్వంసం చేసి దక్షుడి శిరస్సును ఖండించిన చరిత్ర మనందరికీ తెలుసు కదా. ఆ సందర్భంలోనే అక్కడ ఉన్న దేవతలందరినీ కూడా వీరభద్రుడు శిక్షిస్తాడు. తమ కళ్ళముందు అధర్మం, అన్యాయం జరుగుతూ ఉంటే 'పెద్దవాళ్ళు, వాళ్ళతో మనకెందుకు' అని మోహమాటానికి పోయినందుకు వారు కూడా శిక్ష అనుభవించవలసి వచ్చింది. ఆ శిక్షలో భాగంగానే సూర్యుడికి పళ్ళు ఊడగొట్టబడ్డాయి. అందుకే రథసప్తమి నాడు, లేదా ఇతర మాఘ అదివారాలలో కూడా సూర్యునికి నైవేద్యం పెట్టడానికి పరమాన్నం వండితే అందులో గట్టి పదార్థాలు (కనీసం జీడిపప్పులు కూడా) లేకుండా వండుతారు.

    కర్తా కారయితా చైవ ప్రేరకశ్చ అనుమోదకః సుకృతం దుష్కృతం చైవ చత్వారః సమభాగినః అని శాస్త్రం చెబుతోంది. ఒక మంచిపని కానీ చెడ్డపని కానీ జరుగుతున్నప్పుడు ఆ పని చేసినవాడు, చేయించినవాడు, దానికి ప్రేరణ కలిగించినవాడు, చూసి ఆనందించిన వాడు ఈ నలుగురూ ఆ పనియొక్క ఫలితాన్ని సమానంగా అనుభవిస్తారు. అందుకే ఏదైనా పుణ్యకార్యం జరుగుతున్నప్పుడు మనం ఆ కార్యానికి ఏవిధంగానూ సహకరించలేక పోయినా కనీసం చూసి ఆనందించినా ఆ పుణ్యఫలం మన ఖాతాలో జమ అవుతుంది. అలాగే ఏదైనా పాపకార్యం జరుగుతున్నప్పుడు దానిని ఆపే సామర్థ్యం మనలో లేనప్పుడు ఆ సామర్థ్యం ఉన్నవారిని పిలవాలి, లేదా కనీసం అక్కడినుంచి దూరంగా అయినా వెళ్ళిపోవాలి. అలా కాకుండా అక్కడే ఉండి చూస్తూ ఉంటే ఆ శిక్షలో మనం కూడా భాగస్వాములం అవుతాం.

సారపు ధర్మమున్ విమలసత్యముఁ బాపముచేత బొంకుచేఁ
బారముఁ బొందలేక చెడఁబాఱినదైన యవస్థదక్షు లె
వ్వార లుపేక్షచేసి రది వారలచేటగుఁ గాని ధర్మ ని
స్తారకమయ్యు సత్య శుభదాయక మయ్యును దైవ ముండెడున్ 

    అని మహాభారతంలో శ్రీకృష్ణ రాయబార ఘట్టంలో పరమాత్మ భీష్మ ద్రోణాదులను హెచ్చరిస్తాడు. ధర్మానికి, సత్యానికి హాని కలిగినప్పుడు దానిని నివారించగల సమర్థులై ఉండి కూడా ఉపేక్ష చేస్తే, మాట్లాడకుండా ఉండిపోతే, అది వారికే చేటు కలిగిస్తుంది కానీ ఆ సత్య ధర్మాలను కాపాడటానికి పరమాత్మ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అని చెప్పాడు. మరి కౌరవులు చేసేది అధర్మం అని తెలిసి కూడా వారి పక్షాన నిలబడినందుకు ఆ పెద్దలందరూ శిక్ష అనుభవించారు కదా! ఇక్కడ వారు కేవలం వారి స్వధర్మాన్ని పట్టుకొని విశేష ధర్మమైన లోకహితాన్ని వదిలిపెట్టారు కాబట్టి వారు శిక్షను అనుభవించవలసి వచ్చింది. అదే శ్రీకృష్ణుడు ఆ విశేష ధర్మాన్ని నిలబెట్టడానికి 'ఆయుధం చేబట్టన'ని తాను చేసిన వ్యక్తిగత ప్రతిజ్ఞను ప్రక్కనబెట్టి మరీ భీష్ముని మీద చక్ర ప్రయోగం చేయబోయాడు.

    సత్యం ఎప్పటికీ మారనిది. కానీ ధర్మం మాత్రం దేశకాలాలను బట్టి మారిపోతూ ఉంటుంది. అలాగే ఎవరి ప్రాణాలని, కుటుంబాన్ని కాపాడుకోవడం వారి ధర్మమయినా దేశంహితం కోసం ఒక గ్రామాన్ని, గ్రామహితం కోసం ఒక కుటుంబాన్ని, కుటుంబ హితంకోసం ఒక వ్యక్తిని కూడా వదిలివేయడం  ధర్మసూక్ష్మం. అంతే కానీ మన కళ్ళెదుటే అన్యాయం, అధర్మం జరుగుతూ ఉంటే ఆ చేసేవాడు నా కుటుంబం, నా కులం, నా మతం, నా భాష, లేదా నా రాష్ట్రానికి చెందిన వాడని వాడిని సమర్థించడమో, లేదా కనీసం ఖండించకుండా ఉండిపోవడమో చేస్తే దానికి శిక్షను మనం కూడా అనుభవించవలసి వస్తుంది. ఏ కలి ప్రభావమో కానీ ఈనాడు దేశంలో ఈ సంకుచిత భావనలు పెరిగిపోయి చివరికి మన భావజాలానికి అనుగుణంగా లేని వెనుకటి తరం మహాత్ములను కూడా దూషించే స్థితికి ఈ సమాజం చేరిపోయింది. పులి-మేక కథలో 'నువ్వు కాకపోతే మీ నాన్నో, తాతో నా నీళ్ళు ఎంగిలి చేశారు' అని వంకపెట్టి పులి ఆ మేకపిల్లను తినేసినట్లు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం నీ మతానికి చెందినవాడో, నీ కులానికి చెందినవాడో నా మతానికి, కులానికి చెందిన వారిపై దౌర్జన్యాలు చేశారని వంకపెట్టి ఆ చేసినవారితో ఏ బీరకాయపీచు సంబంధం లేనివారిని కూడా శిక్షించే, వంచించే స్థితికి చేరుకున్నాం.

    అయితే ధర్మానికి ఈ పైకి కనిపించే ఏ భేదాలతోనూ సంబంధం లేదు. మళ్ళీ మనం మహాభారతాన్నే తీసుకుంటే అక్కడ కౌరవ పాండవులు ఇద్దరూ ఒకే దేశానికి, ఒకే మతానికి, ఒకే కులానికి, చివరికి ఒకే కుటుంబానికి చెందినవారే కదా! కానీ ఒకరు ధర్మానికి ప్రతిరూపం అయితే మరొకరు అధర్మానికి ప్రతిరూపమయ్యారు. ఈ సందర్భంలో 'దుర్జనుడి క్రూరత్వం కంటే సజ్జనుడి మౌనం మరింత ప్రమాదకరం' అన్న Martin Luther King Jr. మాటలు మనం గుర్తు చేసుకోవాలి. మన చుట్టూ జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను చూస్తూ కనీసం మాటమాత్రంగానైనా ఖండించలేకపోతే దానికి ఫలితం మనం కూడా అనుభవించవలసి వస్తుంది. అయితే ఇక్కడ ధర్మం అంటే ఏమిటి అన్న ప్రశ్న వస్తుంది. హిందీలో అయితే మతం అన్న అర్థంలో కూడా ధర్మం అనే పదాన్ని వాడుతారు. అయితే నిజమైన ధర్మం ఏమిటి అన్న దానికి ఆ మహాభారతమే సమాధానం చెబుతోంది.

ఒరులేయని యొనరించిన 
నరవర! యప్రియము దన మనంబున కగు దా 
నొరులకు నవి సేయకునికి 
పరాయణము పరమ ధర్మపథముల కెల్లన్. 

    ఇతరులు ఏమి చేస్తే నీ మనస్సుకు బాధ కలుగుతోందో అది నువ్వు ఇతరులకు చేయకుండా ఉండటమే అన్ని ధర్మాలలోకి ఉత్తమమైన ధర్మం అని మహాభారతం చెబుతోంది. చివరికి తన భార్యను అపహరించిన రావణునికి శ్రీరాముడు, తమ రాజ్యాన్ని అపహరించి, భార్యను అవమానించిన కౌరవులకు పాండవులు కూడా సంధికి అనేక అవకాశాలు ఇచ్చి గతిలేని పరిస్థితిలోనే యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో కూడా తమ పక్షానికి వస్తానన్న శత్రువులను సాదరంగా ఆహ్వానించారు. అలాగే యుద్ధంలో మరణించిన తరువాత శత్రువులను కూడా గౌరవించారు, వారికి ఉత్తమగతులు కల్పించే క్రతువులను నిర్వహించారు.

    అంతేకానీ కులమత సంకుచిత భావనలతో ఎదుటివారిని నిష్కారణంగా హింసిస్తూ, మహాత్ములను అవమానిస్తూ ఉండేవారికి సర్వజీవ సమభావనకు ఉత్కృష్ట ప్రతీక అయిన పరమేశ్వరుని చేతిలో శిక్ష తప్పదు. అలాగే వారిని ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ప్రోత్సహించేవారికి, చూసీ చూడనట్లు ఊరుకొనే వారికి కూడా పళ్ళు రాలడం తప్పదు. అధర్మాన్ని ఖండించని మౌనం కూడా అధర్మంలో భాగస్వామే.

15, జనవరి 2026, గురువారం

మకర సంక్రాంతి



నరేష్: సంక్రాంతి శుభాకాంక్షలు అన్నా!

సురేష్: నీకు కూడా నరేష్! అసలు ప్రతినెలా సంక్రాంతి వస్తుంది తెలుసా? ఇవాళ వచ్చింది, మనం ప్రముఖంగా జరుపుకునేది మకర సంక్రాంతి. 

న: అసలు సంక్రాంతి అంటే ఏంటన్నా?

సు: సూర్యుడు కానీ, నవగ్రహాలలో మరేదైనా గ్రహం కానీ ఒక రాశి నుండి మరొక రాశికి మారడాన్ని సంక్రాంతి అని, క్రాంతి అని, కార్తె అని అంటారు. ఇందులో సూర్యుడు మనకు అతి ముఖ్యుడు కదా! ఆయన మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అందుకే మనం ఈ మకర సంక్రాంతిని పెద్ద పండుగ అని గొప్ప ఉత్సవంగా జరుపుకుంటాం. అసలు మన పురాణాలలో మకరం ఎక్కడ కనిపిస్తుంది చెప్పు నరేష్.

న: నాకు గుర్తుంది అన్నా! గజేంద్ర మోక్షంలో ఏనుగును పట్టుకొన్నది మొసలే కదా.

సు: అవును. నిజానికి మనం గజేంద్ర మోక్షం అంటాం కానీ, విష్ణుమూర్తి గజేంద్రునికి కేవలం మొసలి బారినుండి విముక్తి కలిగించాడు కానీ, ఆ మొసలికి మాత్రం ఆయన చేతిలో, సుదర్శన చక్రంతో మరణించడంతో ఏకంగా ఈ సంసారం నుండే మోక్షం లభించింది కదా!

న: అవును, ఆలోచిస్తుంటే నాకు ఒకటి అనిపిస్తోంది. విష్ణుమూర్తికి ఏనుగు కన్నా మొసలి అంటేనే పక్షపాతం అని. ఎంతైనా ఏనుగు జరాయుజం(తల్లి గర్భంలో ఉండి, మావి నుండి పుట్టినది), మొసలి అండజం(గుడ్డు నుండి పుట్టినది) కదా!

సు: అయితే!?

న: అదే అన్నా! ఆయన అండజ(గరుడ) వాహనుడు, అండజ(ఆదిశేష) శయనుడు కదా! పైగా మకరకుండలధారి కూడానూ!

సు: అదేం లేదు. ఆయనకు సర్వ జీవులు సమానమే. సమోహం సర్వ భూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః - నేను సర్వ భూతములయందు సమదృష్టి కలిగి ఉంటాను. నేను ద్వేషించే వారుకాని, ప్రేమించే వారుకాని ప్రత్యేకంగా ఎవరూ లేరు, అని భగవద్గీతలో ఆ స్వామే చెప్పారు కదా!

న: అవుననుకో కానీ మళ్ళీ ఆయనే భక్తియోగంలో యో మద్భక్త స్స మే ప్రియః అని రెండుసార్లు, ఇంకా స చ మే ప్రియః,  భక్తిమాన్యః స మే ప్రియః, భక్తిమాన్మే ప్రియో నరః, భక్తాస్తేతీవ మే ప్రియాః అని నా భక్తుడు నాకు అత్యంత ప్రియమైన వాడు అని ఇన్నిసార్లు చెప్పాడు కదా!

సు: అదే ఇక్కడ కిటుకు. గాలి మన చుట్టూ అంతటా వ్యాపించి ఉన్నా ఫ్యాను కిందనే మనకు బాగా అనుభవంలోకి వచ్చినట్లు, పరమాత్మ అంతటా సమానంగానే ప్రకాశిస్తున్నా భక్తానాం హృదయాంబోజే విశేషేణ ప్రకాశతే - భక్తుల హృదయ కమలాలలో విశేషంగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయనను పట్టుకోవాలంటే ముందు భాగవతులను పట్టుకోవాలి. అక్కడ ఆ మొసలి చేసినది అదే. అందుకే దానికి మోక్షం లభించింది.

న: అదేంటి అది భాగవతుడిని హింసించింది కదా?

సు: ఒక్కసారి ఆలోచించు. నారాయణమూర్తి వచ్చేముందు ఆ మొసలి, ఏనుగు వెయ్యి సంవత్సరాలు పోరాడాయి. ఏనుగుకు అయితే అది జీవన్మరణ సమస్య కాబట్టి విడవకుండా పోరాడింది. మరి మొసలికి ఏమవసరం? ఈ ఏనుగు కాకపోతే ఇంకో పీనుగు, తన కడుపు నింపుకోవడానికి ఏదో ఒక జంతువు దొరక్కపోదు.  ఈ ఏనుగుకు ఉన్నట్లుగానే ఆ మొసలికి కూడా భార్య, పిల్లలు ఉండి ఉంటారు కదా! వాళ్ళందరూ ఈ వెయ్యి సంవత్సరాలో ఎన్నోసార్లు వచ్చి "ఎందుకండీ మీకు ఇంత మొండిపట్టు? నిద్రాహారాలు మాని ఇన్నేళ్ళనుంచి ఆ ఏనుగు పాదాన్ని పట్టుకొని ఉండకపోతే వదిలేసి ఇంకొక వేట ఏదైనా చూసుకోవచ్చు కదా!" అని ఎన్నిసార్లు నచ్చచెప్పి ఉంటారు? అయినా ఆ మొసలి తన పట్టుదలను వదిలిపెట్టలేదు. "బలమైన పట్టుదలే వైరాగ్యం" అని శ్రీ బాబూజీ మహరాజ్ వారు ఎన్నోసార్లు చెప్పారు కదా! భక్తి, జ్ఞానము కలగాలంటే ముందు మనకు ఈ వైరాగ్యం ఉండాలి. మనందరినీ అటువంటి మొసలిపట్టు లాంటి అంతటి బలమైన వైరాగ్యాన్ని పెంపొందించుకోమని ఈ మకర సంక్రాంతి సూచిస్తోంది.

న: నిజమే అన్నా! మరి విష్ణుమూర్తి మకర కుండలాలు ధరించడంలో రహస్యం ఏమిటో కాస్త చెప్పరాదూ. 

సు: విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణం. అది మకర రాశిలో ఉంటుంది కాబట్టి ఆ రెండింటినీ గుర్తుచేస్తూ ఆయన శ్రవణేంద్రియాలకు మకర కుండలాలు ధరిస్తాడని పైపై అర్థం చెబుతారు. కానీ, సన్న్యస్య శ్రవణం కుర్యాత్ అని ఋషి వాక్యం. శ్రవణం చేసేటప్పుడు ఇతర విషయాలన్నింటినీ సన్యసించి శ్రవణం చెయ్యాలి. అటువంటి వైరాగ్యంతో, పట్టుదలతో శ్రవణం చేసినప్పుడే అది మళ్ళీ మననానికి వచ్చి నిదిధ్యాసకు నిన్ను తీసుకెళ్తుంది కానీ సత్సంగంలో కూర్చున్నంత సేపు వచ్చిపోయే వాళ్ళను చూస్తూ, గోళ్ళు కొరుక్కుంటూ, మరేదో చేస్తూ వింటే అది నీ చెవికెక్కదు, మనసుకు అసలే పట్టదు. ఈ విషయాన్ని మనకు తెలియజెప్పడానికే నారాయణుడు తన చెవులకు మకర కుండలాలను ధరిస్తాడు.

న: ధన్యవాదాలు అన్నా! భక్తి జ్ఞానాలు కలగాలన్నా, విన్న ఆధ్యాత్మిక విషయాలు వంటబట్టాలన్నా మకరం లాంటి పట్టుదల, వైరాగ్యం ఎంత అవసరమో చక్కగా వివరించావు. నీకు మీ కుటుంబ సభ్యులకు మరొక్కసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు! ఈ సందర్భంగా ఇటువంటి వైరాగ్యాన్ని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించాలని ప్రార్థిద్దాం.

31, డిసెంబర్ 2025, బుధవారం

అనుభూతికి రాని సాన్నిధ్యం

 

    కొంతమంది శిష్యులు తాము గురుదేవులకు ఎంతో సన్నిహితులమని, నిత్యం వారి దర్శన, స్పర్శన, సంభాషణాది భాగ్యాలు పొందుతూ ఉంటామని, గర్వంతో విర్రవీగుతూ ఉంటారు. అయితే శ్రీ గురుదేవులు చెప్పినట్లు ఒక గ్లాసులో నీరు, మరొక గ్లాసులో చక్కెర వేసి ఎన్నిరోజులు ప్రక్కప్రక్కన ఉంచినా ఆ చెక్కెర మాధుర్యం ఈ నీటికి అబ్బదు కదా! అలాగే గురువుల బోధను ఆకళింపు చేసుకొని, వారు చూపిన మార్గంలో సాధన చేసి ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించకపోతే, ఎంతకాలం గురువుల అంతేవాసిగా గడిపినా మనలోని దుర్గుణాలు, బలహీనతలు పోవు కదా! పైగా గురువులంటే భవరోగ వైద్యులు. బాగా జబ్బు పడినవాడినే వైద్యుడు తన వైద్యశాలలో ఎక్కువకాలం ఉంచుకొని, అవసరమైతే ఐసీయూలో నిరంతర పర్యవేక్షణలో జాగ్రత్తగా చూసుకొంటాడు. అదే ఏదో చిన్న రోగం వచ్చినవాడిని ఐదు నిమిషాలు మాట్లాడి, మందిచ్చి ఇంటికి పంపేస్తాడు. అలాగే బాగా మురికి పట్టిన బట్టే రజకుడి చేతిలో ఎక్కువసేపు ఉండవలసి వస్తుంది.

    కేవలం భగవంతుడికి సన్నిహితంగా ఉండటమే కాక సాలోక్య, సామీప్య, సారూప్యాలు పొందిన వారు కూడా ఆత్మజ్ఞానం సాధించకపోతే తమ వెనుకటి గుణాలకు లోనై దూరమైపోయిన సంఘటన మనకు తెలుసు కదా. జయవిజయులు కేవలం వైకుంఠవాసులే కాక, స్వామి ఆంతరంగిక మందిరానికి ద్వారపాలకులుగా సామీప్యాన్ని, స్వామిలాగే నాలుగు చేతులు, వాటిలో శంఖ చక్ర గదాది ఆయుధములు కలిగి సారూప్యాన్ని పొందినా అహంకారం పోగొట్టుకోలేక శాపానికి గురి కావలసి వచ్చింది. ఆ శాపవశాత్తు వారెత్తిన మూడు జన్మలలో వారిలో అంతర్లీనంగా దాగి ఉన్న దుష్ట గుణాలన్నీ బయటపడి, మురికి అంతా బయటకు వచ్చి, శుభ్రమైన వస్త్రంలాగా తయారైతే తప్ప తిరిగి స్వామి సన్నిధి లభించలేదు.

    మొదటి జన్మలో హిరణ్యాక్షుణ్ణి తీసుకొంటే ఆయనకు వివాహం అయినట్లు గానీ, భార్యా పిల్లలు ఉన్నట్లు గానీ ఎక్కడా వినలేదు. అయినా ఈ భూమంతా నాకే కావాలని ఆత్రం! ఏం చేసుకుంటాడు? ఎవరికి పెడతాడు? నిష్కారణమైన లోభం తప్ప! అలాగే హిరణ్యకశిపుడు నాలుగు వరాలు పొంది నలుగురు దేవతలను జయించగానే ఇక నేనే భగవంతుడిని అనేంత మదం వచ్చింది. ఈ మదం ఎంత దూరం తీసుకు వెళ్తుందంటే చివరికి తన అభిప్రాయానికి కట్టుబడని కన్న కొడుకుని కూడా చంపేటంత వివేక హీనతను కలిగిస్తుంది. ఈ జన్మలో వరాహ, నారసింహ అవతారాలు ధరించి స్వామి వారిలోని ఈ లోభాన్ని, మదాన్ని క్షాళన చేయవలసి వచ్చింది.

    అలాగే రెండవ జన్మలో రావణుడు. ఎంతమంది భార్యలు ఉన్నా తీరని కామం. ఇంకా కనబడిన స్త్రీమూర్తినల్లా అనుభవించాలనే కామం. ఎన్ని లక్షల సంవత్సరాలు జీవించినా, కుమారులు, మనుమలు పుట్టుకువచ్చినా తీరని కామం. అది చివరికి జగన్మాతను కూడా వదలలేనంత తీవ్ర స్థితికి తీసుకెళ్ళింది. అలాగే కుంభకర్ణుడికి ధర్మం తెలిసినా తన సోదరుని విడలేని మోహం. ఒక విషయం గమనిస్తే ఈ రాక్షసులందరూ ధర్మం చక్కగా తెలిసినవారే. ఏదో ఒక రూపంలో భగవంతుని ఆరాధించిన భక్తులే. కానీ వారిలో ఉన్న ఒక్కొక్క బలహీనతను అధిగమించే ఆధ్యాత్మిక శక్తి లేకపోవడంతో లోక వినాశనానికి కారణులై, చివరికి తాము కూడా అంతరించిపోయారు. వీరిద్దరిలో ఈ కామ మోహాలను క్షాళన చేసి తన వద్దకు చేర్చుకోవడానికి ఆ లక్ష్మీనారాయణులిద్దరూ మానవ రూపాలను ధరించి ఎంత కష్టపడవలసి వచ్చింది!

    ఇక మూడవ జన్మలో శిశుపాలుడికి అకారణ మాత్సర్యం. తనకు దక్కనిది ఇంకెవరికీ దక్కకూడదు. తనకంటే తాను శత్రువుగా భావించేవాడు ఎక్కువ గౌరవం పొందకూడదు. అలాగే దంతవక్త్రుడిది అకారణ క్రోధం. తన మిత్రులందరినీ శ్రీకృష్ణుడు సంహరించాడనే క్రోధంలో తన శక్తి సామర్థ్యాలు ఎంతో తెలుసుకోకుండానే యుద్ధానికి బయలుదేరాడు. మిగిలిన దుర్గుణాలతో పోలిస్తే ఈ రెండు గుణాలు క్షాళన చేయడం స్వామికి సుళువుగానే సాధ్యమైంది.

    ఇలా ఒక్కొక్క గుణాన్ని పోగొట్టుకోవడానికి వారికి ఒక్కొక్క జన్మ ఎత్తి వందలు, వేలు, లక్షల సంవత్సరాలు కూడా ఆ శాపగ్రస్త జీవితాలను గడపవలసి వచ్చింది. మరి అన్ని గుణాలను మనలో ఉంచుకొని, ఏమాత్రం మారడానికి ప్రయత్నించకుండా కేవలం గురుదేవుల సాన్నిధ్యం లభించడమే మన గొప్పతనమన్నట్లుగా విర్రవీగితే ఎవరికి నష్టం? అయితే వీళ్ళవల్ల పాపం గురువులకు కూడా ప్రపంచంతో అనేక మాటలు పడవలసి వస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తి వైద్యుశాలలో ఎక్కువ కాలం గడిపినా, లేక ఐసీయూలో ఉన్నా మనం వారిని చూసి జాలి పడతామే కానీ, ఈర్ష్యపడము కదా! కానీ ఇటువంటి దుర్గుణాలతో బాధపడే రోగిని సంస్కరించే నిమిత్తం భవరోగ వైద్యులయిన గురుదేవులు తమ సన్నిధిలో ఎక్కువగా ఉంచుకుంటే లోకం ఈ గుణాలను గురువులకు కూడా అంటగట్టి వారిని నిందిస్తుంది. అంతెందుకు, ఆ గురువుల శిష్యులే "ఇదేమి అన్యాయం? సత్పురుషులు దూరమైపోతున్నా లెక్కపెట్టక గురువుగారు ఈ దుర్మార్గుడిని ఇంతగా చేరదీస్తున్నారే?" అనుకుంటారు.

    అయితే దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు ధరించే భగవంతుడి అవతారానికి, అందరినీ సమానంగా సంస్కరించడానికి గురురూపంలో వచ్చే అవతారానికి చాలా తేడా ఉంటుంది. గురురూపంలో కేవలం సంస్కరణే కానీ సంహారం ఉండదు. దానికి చాలా నేర్పు, సహనం, ఓపిక అవసరం. ఒక నేరస్తుడిని విచారించి కఠినమైన శిక్ష విధించేయడం చాలా తేలిక, కానీ వానిని నిరంతర పర్యవేక్షణలో ఉంచి, పూర్తిగా సంస్కరించి, మంచివ్యక్తిగా తయారుచేసి పంపడం ఎంత కష్టం? తమ నిర్హేతుక జాయమాన కరుణా కటాక్షంతో గురుదేవులు సాధించే అతి కష్టమైన కార్యం ఇదే. "ఒక్క వ్యక్తి నేను చెప్పిన బోధను విని, సంస్కరింపబడి, నేను నిరంతరంగా పొందుతూ ఉండే బ్రహ్మానందాన్ని అందుకున్నా నా ఈ అవతారం సఫలమైనట్లే" అని శ్రీ గురుదేవులు చెప్పేవారు. 

    అయితే వారు ఒక్కరితో ఈ అవతార ప్రయోజనాన్ని వదిలిపెట్టరు. "నేను కామరపుకోట జీడిని. ఒక్కసారి పట్టుకొంటే వదిలిపెట్టను" అనేవారు కదా! అలా వారి సంసర్గంలోకి వచ్చిన జీవులందరూ సంస్కరింపబడి, ఉద్ధరింపబడే వరకు వదిలిపెట్టలేరు. అయితే మనం మాత్రం ఈ సత్యాన్ని గ్రహించి, మనవంతుగా మనలోని దోషాలను, దుర్గుణాలను గ్రహించి, అధిగమించే ప్రయత్నం చేస్తే అదే మనం గురుదేవులకు చేసే అత్యుత్తమ సేవ. అంతే కానీ కేవలం గురుదేవులకు దగ్గరగా మసలి, వారి భౌతిక వ్యవహారాలను చక్కబెట్టడం అనేది నిజమైన సేవ అనిపించుకోదు. వారు నిరంతరం ఏ బ్రహ్మమృతాన్ని అనుభవిస్తున్నారో, దానిని మన అనుభూతికి తెచ్చుకోవడమే సాన్నిధ్యానికి పరమార్థం.