15, జనవరి 2026, గురువారం

మకర సంక్రాంతి



నరేష్: సంక్రాంతి శుభాకాంక్షలు అన్నా!

సురేష్: నీకు కూడా నరేష్! అసలు ప్రతినెలా సంక్రాంతి వస్తుంది తెలుసా? ఇవాళ వచ్చింది, మనం ప్రముఖంగా జరుపుకునేది మకర సంక్రాంతి. 

న: అసలు సంక్రాంతి అంటే ఏంటన్నా?

సు: సూర్యుడు కానీ, నవగ్రహాలలో మరేదైనా గ్రహం కానీ ఒక రాశి నుండి మరొక రాశికి మారడాన్ని సంక్రాంతి అని, క్రాంతి అని, కార్తె అని అంటారు. ఇందులో సూర్యుడు మనకు అతి ముఖ్యుడు కదా! ఆయన మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అందుకే మనం ఈ మకర సంక్రాంతిని పెద్ద పండుగ అని గొప్ప ఉత్సవంగా జరుపుకుంటాం. అసలు మన పురాణాలలో మకరం ఎక్కడ కనిపిస్తుంది చెప్పు నరేష్.

న: నాకు గుర్తుంది అన్నా! గజేంద్ర మోక్షంలో ఏనుగును పట్టుకొన్నది మొసలే కదా.

సు: అవును. నిజానికి మనం గజేంద్ర మోక్షం అంటాం కానీ, విష్ణుమూర్తి గజేంద్రునికి కేవలం మొసలి బారినుండి విముక్తి కలిగించాడు కానీ, ఆ మొసలికి మాత్రం ఆయన చేతిలో, సుదర్శన చక్రంతో మరణించడంతో ఏకంగా ఈ సంసారం నుండే మోక్షం లభించింది కదా!

న: అవును, ఆలోచిస్తుంటే నాకు ఒకటి అనిపిస్తోంది. విష్ణుమూర్తికి ఏనుగు కన్నా మొసలి అంటేనే పక్షపాతం అని. ఎంతైనా ఏనుగు జరాయుజం(తల్లి గర్భంలో ఉండి, మావి నుండి పుట్టినది), మొసలి అండజం(గుడ్డు నుండి పుట్టినది) కదా!

సు: అయితే!?

న: అదే అన్నా! ఆయన అండజ(గరుడ) వాహనుడు, అండజ(ఆదిశేష) శయనుడు కదా! పైగా మకరకుండలధారి కూడానూ!

సు: అదేం లేదు. ఆయనకు సర్వ జీవులు సమానమే. సమోహం సర్వ భూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః - నేను సర్వ భూతములయందు సమదృష్టి కలిగి ఉంటాను. నేను ద్వేషించే వారుకాని, ప్రేమించే వారుకాని ప్రత్యేకంగా ఎవరూ లేరు, అని భగవద్గీతలో ఆ స్వామే చెప్పారు కదా!

న: అవుననుకో కానీ మళ్ళీ ఆయనే భక్తియోగంలో యో మద్భక్త స్స మే ప్రియః అని రెండుసార్లు, ఇంకా స చ మే ప్రియః,  భక్తిమాన్యః స మే ప్రియః, భక్తిమాన్మే ప్రియో నరః, భక్తాస్తేతీవ మే ప్రియాః అని నా భక్తుడు నాకు అత్యంత ప్రియమైన వాడు అని ఇన్నిసార్లు చెప్పాడు కదా!

సు: అదే ఇక్కడ కిటుకు. గాలి మన చుట్టూ అంతటా వ్యాపించి ఉన్నా ఫ్యాను కిందనే మనకు బాగా అనుభవంలోకి వచ్చినట్లు, పరమాత్మ అంతటా సమానంగానే ప్రకాశిస్తున్నా భక్తానాం హృదయాంబోజే విశేషేణ ప్రకాశతే - భక్తుల హృదయ కమలాలలో విశేషంగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయనను పట్టుకోవాలంటే ముందు భాగవతులను పట్టుకోవాలి. అక్కడ ఆ మొసలి చేసినది అదే. అందుకే దానికి మోక్షం లభించింది.

న: అదేంటి అది భాగవతుడిని హింసించింది కదా?

సు: ఒక్కసారి ఆలోచించు. నారాయణమూర్తి వచ్చేముందు ఆ మొసలి, ఏనుగు వెయ్యి సంవత్సరాలు పోరాడాయి. ఏనుగుకు అయితే అది జీవన్మరణ సమస్య కాబట్టి విడవకుండా పోరాడింది. మరి మొసలికి ఏమవసరం? ఈ ఏనుగు కాకపోతే ఇంకో పీనుగు, తన కడుపు నింపుకోవడానికి ఏదో ఒక జంతువు దొరక్కపోదు.  ఈ ఏనుగుకు ఉన్నట్లుగానే ఆ మొసలికి కూడా భార్య, పిల్లలు ఉండి ఉంటారు కదా! వాళ్ళందరూ ఈ వెయ్యి సంవత్సరాలో ఎన్నోసార్లు వచ్చి "ఎందుకండీ మీకు ఇంత మొండిపట్టు? నిద్రాహారాలు మాని ఇన్నేళ్ళనుంచి ఆ ఏనుగు పాదాన్ని పట్టుకొని ఉండకపోతే వదిలేసి ఇంకొక వేట ఏదైనా చూసుకోవచ్చు కదా!" అని ఎన్నిసార్లు నచ్చచెప్పి ఉంటారు? అయినా ఆ మొసలి తన పట్టుదలను వదిలిపెట్టలేదు. "బలమైన పట్టుదలే వైరాగ్యం" అని శ్రీ బాబూజీ మహరాజ్ వారు ఎన్నోసార్లు చెప్పారు కదా! భక్తి, జ్ఞానము కలగాలంటే ముందు మనకు ఈ వైరాగ్యం ఉండాలి. మనందరినీ అటువంటి మొసలిపట్టు లాంటి అంతటి బలమైన వైరాగ్యాన్ని పెంపొందించుకోమని ఈ మకర సంక్రాంతి సూచిస్తోంది.

న: నిజమే అన్నా! మరి విష్ణుమూర్తి మకర కుండలాలు ధరించడంలో రహస్యం ఏమిటో కాస్త చెప్పరాదూ. 

సు: విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణం. అది మకర రాశిలో ఉంటుంది కాబట్టి ఆ రెండింటినీ గుర్తుచేస్తూ ఆయన శ్రవణేంద్రియాలకు మకర కుండలాలు ధరిస్తాడని పైపై అర్థం చెబుతారు. కానీ, సన్న్యస్య శ్రవణం కుర్యాత్ అని ఋషి వాక్యం. శ్రవణం చేసేటప్పుడు ఇతర విషయాలన్నింటినీ సన్యసించి శ్రవణం చెయ్యాలి. అటువంటి వైరాగ్యంతో, పట్టుదలతో శ్రవణం చేసినప్పుడే అది మళ్ళీ మననానికి వచ్చి నిదిధ్యాసకు నిన్ను తీసుకెళ్తుంది కానీ సత్సంగంలో కూర్చున్నంత సేపు వచ్చిపోయే వాళ్ళను చూస్తూ, గోళ్ళు కొరుక్కుంటూ, మరేదో చేస్తూ వింటే అది నీ చెవికెక్కదు, మనసుకు అసలే పట్టదు. ఈ విషయాన్ని మనకు తెలియజెప్పడానికే నారాయణుడు తన చెవులకు మకర కుండలాలను ధరిస్తాడు.

న: ధన్యవాదాలు అన్నా! భక్తి జ్ఞానాలు కలగాలన్నా, విన్న ఆధ్యాత్మిక విషయాలు వంటబట్టాలన్నా మకరం లాంటి పట్టుదల, వైరాగ్యం ఎంత అవసరమో చక్కగా వివరించావు. నీకు మీ కుటుంబ సభ్యులకు మరొక్కసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు! ఈ సందర్భంగా ఇటువంటి వైరాగ్యాన్ని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించాలని ప్రార్థిద్దాం.

31, డిసెంబర్ 2025, బుధవారం

అనుభూతికి రాని సాన్నిధ్యం

 

    కొంతమంది శిష్యులు తాము గురుదేవులకు ఎంతో సన్నిహితులమని, నిత్యం వారి దర్శన, స్పర్శన, సంభాషణాది భాగ్యాలు పొందుతూ ఉంటామని, గర్వంతో విర్రవీగుతూ ఉంటారు. అయితే శ్రీ గురుదేవులు చెప్పినట్లు ఒక గ్లాసులో నీరు, మరొక గ్లాసులో చక్కెర వేసి ఎన్నిరోజులు ప్రక్కప్రక్కన ఉంచినా ఆ చెక్కెర మాధుర్యం ఈ నీటికి అబ్బదు కదా! అలాగే గురువుల బోధను ఆకళింపు చేసుకొని, వారు చూపిన మార్గంలో సాధన చేసి ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించకపోతే, ఎంతకాలం గురువుల అంతేవాసిగా గడిపినా మనలోని దుర్గుణాలు, బలహీనతలు పోవు కదా! పైగా గురువులంటే భవరోగ వైద్యులు. బాగా జబ్బు పడినవాడినే వైద్యుడు తన వైద్యశాలలో ఎక్కువకాలం ఉంచుకొని, అవసరమైతే ఐసీయూలో నిరంతర పర్యవేక్షణలో జాగ్రత్తగా చూసుకొంటాడు. అదే ఏదో చిన్న రోగం వచ్చినవాడిని ఐదు నిమిషాలు మాట్లాడి, మందిచ్చి ఇంటికి పంపేస్తాడు. అలాగే బాగా మురికి పట్టిన బట్టే రజకుడి చేతిలో ఎక్కువసేపు ఉండవలసి వస్తుంది.

    కేవలం భగవంతుడికి సన్నిహితంగా ఉండటమే కాక సాలోక్య, సామీప్య, సారూప్యాలు పొందిన వారు కూడా ఆత్మజ్ఞానం సాధించకపోతే తమ వెనుకటి గుణాలకు లోనై దూరమైపోయిన సంఘటన మనకు తెలుసు కదా. జయవిజయులు కేవలం వైకుంఠవాసులే కాక, స్వామి ఆంతరంగిక మందిరానికి ద్వారపాలకులుగా సామీప్యాన్ని, స్వామిలాగే నాలుగు చేతులు, వాటిలో శంఖ చక్ర గదాది ఆయుధములు కలిగి సారూప్యాన్ని పొందినా అహంకారం పోగొట్టుకోలేక శాపానికి గురి కావలసి వచ్చింది. ఆ శాపవశాత్తు వారెత్తిన మూడు జన్మలలో వారిలో అంతర్లీనంగా దాగి ఉన్న దుష్ట గుణాలన్నీ బయటపడి, మురికి అంతా బయటకు వచ్చి, శుభ్రమైన వస్త్రంలాగా తయారైతే తప్ప తిరిగి స్వామి సన్నిధి లభించలేదు.

    మొదటి జన్మలో హిరణ్యాక్షుణ్ణి తీసుకొంటే ఆయనకు వివాహం అయినట్లు గానీ, భార్యా పిల్లలు ఉన్నట్లు గానీ ఎక్కడా వినలేదు. అయినా ఈ భూమంతా నాకే కావాలని ఆత్రం! ఏం చేసుకుంటాడు? ఎవరికి పెడతాడు? నిష్కారణమైన లోభం తప్ప! అలాగే హిరణ్యకశిపుడు నాలుగు వరాలు పొంది నలుగురు దేవతలను జయించగానే ఇక నేనే భగవంతుడిని అనేంత మదం వచ్చింది. ఈ మదం ఎంత దూరం తీసుకు వెళ్తుందంటే చివరికి తన అభిప్రాయానికి కట్టుబడని కన్న కొడుకుని కూడా చంపేటంత వివేక హీనతను కలిగిస్తుంది. ఈ జన్మలో వరాహ, నారసింహ అవతారాలు ధరించి స్వామి వారిలోని ఈ లోభాన్ని, మదాన్ని క్షాళన చేయవలసి వచ్చింది.

    అలాగే రెండవ జన్మలో రావణుడు. ఎంతమంది భార్యలు ఉన్నా తీరని కామం. ఇంకా కనబడిన స్త్రీమూర్తినల్లా అనుభవించాలనే కామం. ఎన్ని లక్షల సంవత్సరాలు జీవించినా, కుమారులు, మనుమలు పుట్టుకువచ్చినా తీరని కామం. అది చివరికి జగన్మాతను కూడా వదలలేనంత తీవ్ర స్థితికి తీసుకెళ్ళింది. అలాగే కుంభకర్ణుడికి ధర్మం తెలిసినా తన సోదరుని విడలేని మోహం. ఒక విషయం గమనిస్తే ఈ రాక్షసులందరూ ధర్మం చక్కగా తెలిసినవారే. ఏదో ఒక రూపంలో భగవంతుని ఆరాధించిన భక్తులే. కానీ వారిలో ఉన్న ఒక్కొక్క బలహీనతను అధిగమించే ఆధ్యాత్మిక శక్తి లేకపోవడంతో లోక వినాశనానికి కారణులై, చివరికి తాము కూడా అంతరించిపోయారు. వీరిద్దరిలో ఈ కామ మోహాలను క్షాళన చేసి తన వద్దకు చేర్చుకోవడానికి ఆ లక్ష్మీనారాయణులిద్దరూ మానవ రూపాలను ధరించి ఎంత కష్టపడవలసి వచ్చింది!

    ఇక మూడవ జన్మలో శిశుపాలుడికి అకారణ మాత్సర్యం. తనకు దక్కనిది ఇంకెవరికీ దక్కకూడదు. తనకంటే తాను శత్రువుగా భావించేవాడు ఎక్కువ గౌరవం పొందకూడదు. అలాగే దంతవక్త్రుడిది అకారణ క్రోధం. తన మిత్రులందరినీ శ్రీకృష్ణుడు సంహరించాడనే క్రోధంలో తన శక్తి సామర్థ్యాలు ఎంతో తెలుసుకోకుండానే యుద్ధానికి బయలుదేరాడు. మిగిలిన దుర్గుణాలతో పోలిస్తే ఈ రెండు గుణాలు క్షాళన చేయడం స్వామికి సుళువుగానే సాధ్యమైంది.

    ఇలా ఒక్కొక్క గుణాన్ని పోగొట్టుకోవడానికి వారికి ఒక్కొక్క జన్మ ఎత్తి వందలు, వేలు, లక్షల సంవత్సరాలు కూడా ఆ శాపగ్రస్త జీవితాలను గడపవలసి వచ్చింది. మరి అన్ని గుణాలను మనలో ఉంచుకొని, ఏమాత్రం మారడానికి ప్రయత్నించకుండా కేవలం గురుదేవుల సాన్నిధ్యం లభించడమే మన గొప్పతనమన్నట్లుగా విర్రవీగితే ఎవరికి నష్టం? అయితే వీళ్ళవల్ల పాపం గురువులకు కూడా ప్రపంచంతో అనేక మాటలు పడవలసి వస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తి వైద్యుశాలలో ఎక్కువ కాలం గడిపినా, లేక ఐసీయూలో ఉన్నా మనం వారిని చూసి జాలి పడతామే కానీ, ఈర్ష్యపడము కదా! కానీ ఇటువంటి దుర్గుణాలతో బాధపడే రోగిని సంస్కరించే నిమిత్తం భవరోగ వైద్యులయిన గురుదేవులు తమ సన్నిధిలో ఎక్కువగా ఉంచుకుంటే లోకం ఈ గుణాలను గురువులకు కూడా అంటగట్టి వారిని నిందిస్తుంది. అంతెందుకు, ఆ గురువుల శిష్యులే "ఇదేమి అన్యాయం? సత్పురుషులు దూరమైపోతున్నా లెక్కపెట్టక గురువుగారు ఈ దుర్మార్గుడిని ఇంతగా చేరదీస్తున్నారే?" అనుకుంటారు.

    అయితే దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు ధరించే భగవంతుడి అవతారానికి, అందరినీ సమానంగా సంస్కరించడానికి గురురూపంలో వచ్చే అవతారానికి చాలా తేడా ఉంటుంది. గురురూపంలో కేవలం సంస్కరణే కానీ సంహారం ఉండదు. దానికి చాలా నేర్పు, సహనం, ఓపిక అవసరం. ఒక నేరస్తుడిని విచారించి కఠినమైన శిక్ష విధించేయడం చాలా తేలిక, కానీ వానిని నిరంతర పర్యవేక్షణలో ఉంచి, పూర్తిగా సంస్కరించి, మంచివ్యక్తిగా తయారుచేసి పంపడం ఎంత కష్టం? తమ నిర్హేతుక జాయమాన కరుణా కటాక్షంతో గురుదేవులు సాధించే అతి కష్టమైన కార్యం ఇదే. "ఒక్క వ్యక్తి నేను చెప్పిన బోధను విని, సంస్కరింపబడి, నేను నిరంతరంగా పొందుతూ ఉండే బ్రహ్మానందాన్ని అందుకున్నా నా ఈ అవతారం సఫలమైనట్లే" అని శ్రీ గురుదేవులు చెప్పేవారు. 

    అయితే వారు ఒక్కరితో ఈ అవతార ప్రయోజనాన్ని వదిలిపెట్టరు. "నేను కామరపుకోట జీడిని. ఒక్కసారి పట్టుకొంటే వదిలిపెట్టను" అనేవారు కదా! అలా వారి సంసర్గంలోకి వచ్చిన జీవులందరూ సంస్కరింపబడి, ఉద్ధరింపబడే వరకు వదిలిపెట్టలేరు. అయితే మనం మాత్రం ఈ సత్యాన్ని గ్రహించి, మనవంతుగా మనలోని దోషాలను, దుర్గుణాలను గ్రహించి, అధిగమించే ప్రయత్నం చేస్తే అదే మనం గురుదేవులకు చేసే అత్యుత్తమ సేవ. అంతే కానీ కేవలం గురుదేవులకు దగ్గరగా మసలి, వారి భౌతిక వ్యవహారాలను చక్కబెట్టడం అనేది నిజమైన సేవ అనిపించుకోదు. వారు నిరంతరం ఏ బ్రహ్మమృతాన్ని అనుభవిస్తున్నారో, దానిని మన అనుభూతికి తెచ్చుకోవడమే సాన్నిధ్యానికి పరమార్థం.

25, సెప్టెంబర్ 2025, గురువారం

అమ్మ మందహాసం


    అమ్మ "మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా" తన చిరు దరహాస చంద్రికలతో పతిదేవుడైన కామేశ్వరుని మనస్సును ముంచివేస్తుంది. అసలు అలా ముంచివేసే ముందు అమ్మ ఎందుకు చిరునవ్వులు చిందిస్తోందో, ఆ చిరునవ్వుకు కారణమైన ఆ కామేశ్వరుని మనస్సులోని ఆలోచనలు ఏమిటో ఊహించడానికి ప్రయత్నిద్దాం.

    బహుశా తన తండ్రి అయిన దక్ష ప్రజాపతి శాపానికి గురియైన చంద్రుని చేరదీసి శిరస్సున ధరించానని కోపగించదు కదా! అనుకున్నాడేమో ఆ చంద్రశేఖరుడు!  మీకంటే ముందే నేను అష్టమీ చంద్రుని నా నుదుటిన ధరించాను(అష్టమీ చంద్ర విభ్రాజదళికస్థల శోభితా) స్వామీ! అలాగే సూర్యచంద్రులు ఇద్దరినీ నా చెవి కమ్మలుగా కూడా ధరించాను(తాటంక యుగళీభూత తపనోడుప మండలా) అని అమ్మ చిరునవ్వు నవ్వితే అయ్యవారి మనస్సు హమ్మయ్య! అని సమాధాన పడిందేమో!

    గంగను సవతిగా తెచ్చి నెత్తిన పెట్టుకున్నానని అలగదు కదా! అని ఆ గంగాధరుడు బిడియ పడుతుంటే బ్రహ్మాండ వ్యాప్తమైన మీ దేహంలో సగం నేనే అయినప్పుడు ఎక్కడో మీ జటాజూటంలో ఒక చిన్న పాయలో ఇమిడిపోయిన గంగ నాకు పోటీయా? అని అమ్మ చిరునవ్వు నవ్వితే స్వామి మనసు కుదుట పడిందేమో!

    తనని, నన్ను కలపడానికి ప్రయత్నిస్తున్న మన్మధుని భస్మం చేశానని కినుక వహించదు కదా! పైగా ఆతడు తనకి మేనల్లుడు కూడానూ, అని భయపడుతున్న ముక్కంటిని స్వస్థపరుస్తూ "వాడేదో వెర్రివాడు. తపస్సు ద్వారా ఏకమవ్వవలసిన మనలని వాడికి తెలిసిన కామం ద్వారా ఏకం చేయాలని చూసి పాపం మీ చూపులో భస్మం అయిపోయాడు. ఎవరో మనను కలిపేది ఏమిటి? మీరెప్పుడో నా వారు, ఎందుకంటే నేను స్వాధీన వల్లభను. అయినా ఏం భయం లేదులే. వాడి పాలిట నేను సంజీవనినై మళ్ళీ బ్రతికించాను(హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషాధిః)" అని ఊరడింపుగా నవ్విందేమో!

    తాను ముచ్చటపడి ఎంతో అందంగా తయారుచేసుకున్న కుమారుని శిరస్సును నా కోపంతో కత్తిరించి ఏనుగు తల పెట్టానని బాధపడుతోందేమో! అని విచారిస్తున్న ఆ తండ్రికి స్వాంతనగా తల ఎలా ఉన్నా ప్రతి తల్లికీ తన కన్నకొడుకే లోకంలోకెల్లా అందగాడు లెండి(అగజానన పద్మార్కం) అని అనునయింపుగా నవ్విందేమో!

    ఇంట్లో ఇంత అందమైన భార్యను పెట్టుకొని ఒక మగవాడు ఆడవేషం ధరిస్తే చూసి మోహంలో పడిపోయానని తనను వెక్కిరిస్తుందేమో అని సిగ్గుపడుతున్న విష్ణుప్రియుని సమాధాన పరుస్తూ ఆ అనంగ జనకుని లావణ్యం అంతా నా అపాంగ విలోకనం నుండి వచ్చిందే లెండి, మీరు మాత్రం మోహంలో పడిపోక ఏం చేస్తారు అని నవ్విందేమో!

    తాను సర్వాభరణ భూషితయై సాయంకాలం వేళ నాకోసం ఎదురు చూస్తూ ఉంటే నేను రోజంతా  శ్మశానంలో తిరిగి ఒంటినిండా బూడిద పూసుకొని వస్తున్నానని చీదరించుకుంటుందేమో అని సందేహిస్తున్న శంకరుని చూసి ఈ ప్రసూతిశాలలు, శ్మశానలు నాకేమీ కొత్త కాదు. నేను ఒకసారి కనురెప్ప వేసే సమయంలో భువనాలన్నీ పుట్టి, పెరిగి, లయమైపోతూ ఉంటాయి(ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి) అని ఆ లోకజనని స్వాంతనగా నవ్విందేమో!

    చెప్పాపెట్టకుండా మాయమైపోయి, తీరా ఇంత విషం తాగి, గొంతంతా నల్లగా చేసుకుని వచ్చానని నిలదీస్తుందేమో అని కంగారు పడుతున్న ఆ నీలకంఠుని ఓదారుస్తూ మీరేం తాగినా నాకేం భయం లేదు. ఎందుకంటే నేను సర్వమంగళని. పైగా మీకేమయినా అయితే దానికి వైద్యం చేయగల శక్తి కూడా నాకు ఉంది (శివా రుద్రస్య భేషజీ) అని ధైర్యంగా నవ్విందేమో అమ్మ!

 భస్మాసురునికి ఇవ్వకూడని వరమిచ్చి లయకారకుడనైన నేనే లయమైపోయే స్థితిని తెచ్చుకున్నానని మందలిస్తుందేమో అని మధనపడుతున్న బోళాశంకరుని ఓదారుస్తూ బావ బ్రతుకు కోరే బావమరది మీకుండగా ఇక ఎందుకు చింత అని తన అన్నగారిని తలుచుకుంటూ చిరునవ్వు నవ్విందేమో ఆ పద్మనాభ సహోదరి!

 పాపం ఈ నంది ఎప్పటినుండో నా సేవ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈవిడ కొత్తగా సింహ వాహనాన్ని తెచ్చింది. దానిని చూసి నంది ఎక్కడ భయపడతాడో అని సందేహిస్తున్న భర్తకు ధైర్యం చెబుతూ సృష్టిలో ఎంత విభిన్న తత్త్వాలు కలిగివుండి, పరస్పరం శత్రువులైనా ఒక కుటుంబంలోకి వచ్చాక అందరూ పరస్పరానురాగంతో మెలగాలని మన కుటుంబమే లోకానికి చాటుతుంది లెండి, ఏం భయం లేదని ఆ విశ్వమాత నవ్విందేమో!

 నాకేమో పులి చర్మం ధరించడం అలవాటు. ఈ దుర్గేమో ఆ పులినే వాహనంగా చేసుకుంది. ఇప్పుడెలా అనుకుంటున్న మృగచర్మాంబర ధారిని చూసి అసలు ఈ సృష్టిలోని చర్మాలన్నీ ధరిస్తూ, ఈ బొమ్మలన్నింటినీ లోపలుండి నడిపేది నేనేనయ్యా అని నవ్విందేమో ఆ క్షేత్ర స్వరూప, క్షేత్రేశి, క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని!

    నాకసలే కోపం ఎక్కువ. ఎప్పుడు ప్రళయ తాండవం చేసి ఈ విశ్వాన్నంతటినీ లయం చేసేస్తానో అని ఆందోళన పడుతున్న లయకారకుడికి ఆశ్వాసన కలిగిస్తూ మీ ప్రళయ తాండవాన్ని నియంత్రించి ఆనంద తాండవంగా మార్చడానికి నేను లాస్యనృత్యంతో సిద్ధంగా ఉన్నాను కదా అని నవ్విందేమో, తాను కూడా లయకరినన్న మాట మరచిపోయి! 

    నేనేమో శుద్ధ స్ఫటిక సంకాశుడనై తెల్లగా మెరిసిపోతుంటే నాకీ నల్లటి భార్య దొరికిందేమిటి అని ఆశ్చర్యపోతున్న కర్పూర గౌరునికి ప్రత్యుత్తరమిస్తూ ఒక్క నలుపేమిటి అన్నీ రంగులు నేనే. కాళిని నేనే, శ్యామలను నేనే, గౌరిని నేనే. త్రిగుణాత్మిక ప్రకృతినైన నానుండి మీ ధవళకాంతి ప్రసరించడం వలననే ఇన్ని రంగులు ఏర్పడుతున్నాయి కదా అని నవ్విందేమో!   

    నేనేమో ఒంటినిండా పాములు ధరించి ఉంటాను. అవి బుసలు కొడుతూ ఉంటాయి. కొంపదీసి నా భార్య వీటిని చూసి భయపడదు కదా అని కళవళపడుతున్న నాగభూషణుని సముదాయిస్తూ ఈ పాములు నాకు కొత్తేం కాదు. మా అన్నగారు కూడా ఎప్పటినుంచో పాము మీదే పడుకుంటున్నాడు అని నవ్విందేమో!

    ఈ కాళీవనాశ్రమంలో భక్తులేమిటి, నీ పేరుతో దేవి నవరాత్రులు అని చెప్పి రోజులో సగం సమయం ఆ రామాలయంలోనే సత్సంగంలో ఉంటారు అని వేళాకోళమాడబోయిన రామలింగేశ్వరునితో ఏ స్త్రీకయినా తన జీవితంలోని ముఖ్య వేడుకలు పుట్టింటివారి సమక్షంలో జరిగితే ఆనందమే కదండీ! అయినా నన్ను అంటున్నారు కానీ ప్రతి శ్రావణ శుక్రవారానికి మీ చెల్లెలు వరలక్ష్మీ దేవి పూజలు శివాలయంలో జరగట్లేదా ఏమిటి? పైగా ఈ సంవత్సరం ఒక శుక్రవారం ఎక్కువే వచ్చింది కూడానూ అని గారంగా నవ్వింది జగన్మాత. ఓ అందుకేనా ఈ సంవత్సరం నవరాత్రులలో కూడా ఒకరోజు ఎక్కువ తెచ్చుకున్నావు అంటూ నవ్వేశాడు పరమేశ్వరుడు. 

    ఇలా జగన్మాతా పితరులైన పార్వతీ పరమేశ్వరుల సరస సల్లాపాలతో వారి చిరు దరహాస కిరణాల వెన్నెలలో మన జీవితాలు గడిచిపోతే అంతకంటే కావలసింది ఏముంటుంది?


యూట్యూబులో చూడండి