4, సెప్టెంబర్ 2026, శుక్రవారం

ఆధారం


 ఈ సమస్త సృష్టికి ఆధారం భగవంతుడే అని మనందరికీ తెలిసిందే కదా. దానినే గీతలో స్వామి మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ| మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ|| - నాకంటే వేరుగా ఏదీ లేదు. ఈ సృష్టి సమస్తం మణిమాలలోని దారానికి మణులు అల్లుకున్నట్లుగా నాతో అల్లుకుని ఉన్నది అని చెప్పారు. అయితే ఈ సృష్టి అనే మణిమాలకు ఆధారమైన దారం ఆ పరమాత్మే అయినా ఈ మాలలోని మణులన్నీ కూడా పరస్పరం ఆధారితమై ఉన్నాయి. చివరికి ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న దేవతలు కూడా మనం యజ్ఞాలలో ఇచ్చే హవిస్సులపై ఆధారపడి ఉన్నారు. 

సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః| 
అనేన ప్రసవిష్యధ్వమేష వోఽస్త్విష్టకామధుక్|| 

దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః|
పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ|| 

ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః| 
తైర్దత్తానప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః॥ 

మొదలైన భగవద్గీతా శ్లోకాలలో పరమాత్మ దీనినే వివరిస్తున్నాడు. "బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించినప్పుడే వారితోపాటు యజ్ఞాలను సృష్టించి ఇవి మీ కోరికలన్నీ తీరడానికి ఉపయోగపడతాయి. ఈ యజ్ఞాలతో మీరు దేవతలను తృప్తి పరిస్తే వారు మీరు కోరిన సంపదలన్నీ అనుగ్రహిస్తారు. ఇలా మీరు పరస్పరం ఆధారితులై పరమమైన శ్రేయస్సును పొందండి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి. దేవతలు మీకు అనుగ్రహించిన భోగాలను ఇతరులతో పంచుకొని అనుభవించండి. లేకపోతే మీరు దొంగలుగా పరిగణించబడతారు" అని చెబుతున్నాడు.

    అలాగే మంత్రపుష్పంలో నీటిని వస్తువుగా తీసుకొని సృష్టి అంతా పరస్పరం ఆధారితమై ఎలా ఉందో వివరించారు. అగ్ని, వాయువు, తపస్సు, చంద్రుడు, నక్షత్రాలు, మేఘాలు, ఋతువులు(సంవత్సరం) ఇవన్నీ జలానికి ఆధారమని, అలాగే జలం వీటికి ఆధారమని, ఇలా పరస్పర ఆధారమనే విషయాన్ని గ్రహించినవాడు నిజంగా ఆధారం కలవాడని వివరించారు. అయితే మనలో కొందరు ఈ విషయాన్ని గ్రహించలేక "నేను ఎవరిమీదా ఆధారపడను. నా పనులన్నీ నేనే చేసుకుంటున్నాను కదా. ఇంకెవరిమీద ఆధార పడవలసిన అవసరం నాకేంటి?" అనుకుంటారు. ఇంకొందరు ఇంకొక అడుగు ముందుకు వేసి "నా జేబు నిండా డబ్బులు ఉన్నాయి. ఏ పనైనా డబ్బులు పడేసి నేను చేయించుకోగలను. కాబట్టి నేను ఎవరిమీదా ఆధారపడటం లేదు" అని భావిస్తారు. ఇటువంటి దంభాన్ని, దర్పాన్ని, అజ్ఞానంతో కూడిన ఆభిజాత్యాన్ని పరమాత్మ గీతలో అసుర సంపదగా నిర్వచించాడు.

    నిజానికి సృష్టిలోని ఏ ప్రాణికి ఎవరిమీదా ఆధారపడకుండా జీవించడం సాధ్యం కాదు. మన ఇల్లు అంతా మనం ఒక్కరమే మన చేతులతో నిర్మించుకొని, మన బట్టలు మనమే నేసుకొని, మన పంటలు మనమే పండించుకొని, వండుకొని తినడం సాధ్యమా? ఒకవేళ ఎవరైనా ఈ విద్యలన్నీ నేర్చుకున్నా అన్నీ తానే చేయాలంటే రోజు సరిపోదు, ఒక జీవితం సరిపోదు. ఒకవేళ కష్టపడి చేసుకున్నా, వీటన్నిటికీ కావలసిన ముడిసరుకులు, పనిముట్లు అనేకం ఉంటాయి కదా. వాటినయినా ఇతరుల వద్ద నుండి సేకరించవలసిందే కదా. అయితే మానవుని ఆలోచన ఎలా ఉంటుందంటే దీనిని ఇతరులమీద ఆధారపడటంగా భావించడు. కేవలం డబ్బులు ఇచ్చి సేవలు పొందటం అనే ఒక వ్యాపారంగా చూస్తాడు. ఇది అహంకారానికి దారితీసి సాటి మనిషిని కనీసం మనిషిలా చూసే సంస్కారాన్ని కూడా నశింపజేస్తుంది.

    మనిషికి ఆత్మాభిమానం ఉండటం, ఎవరిదగ్గరా ఏమీ తీసుకోకూడదు అనే అపరిగ్రహం ఉండటం మంచిదే. కానీ ఆత్మాభిమానానికి, అహంకారానికి మధ్యలో చాలా సన్నని గీత ఉంటుంది. దానిని గుర్తించడం కష్టం. కేవలం ఆత్మాభిమానం మాత్రమే ఉన్నవాడు తనకు ఎంత అభిమానం ఉంటుందో ఎదుటి వ్యక్తికి కూడా అంతే అభిమానం ఉంటుంది అని గుర్తిస్తాడు. అలాకాక అహంకారం ఉన్నవాడు ఎంతసేపూ "నేనే అందరికీ పెట్టాలి. నేనే అందరినీ పోషించాలి. నేను ఇచ్చినవన్నీ అందరూ నోరు మూసుకుని తీసుకోవాలి. కానీ నేను మాత్రం ఎవరి దగ్గరా ఏమీ తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోవలసి వస్తే వెంటనే అంతకన్నా విలువైనది వాళ్ళకి ఇచ్చేయాలి" ఇలా ఆలోచిస్తాడు.

    మనకి అనేక వ్రతాలు, నోములు, ఇతర పుణ్యకార్యాలు నిర్ణయించిన పెద్దలు వాటిలో భాగంగా సమాజంలోని ఇతరులను ఆహ్వానించి వారికి మన శక్తికొలది వాయనాలు, తాంబూలాలు, వస్త్రాలు ఇచ్చే ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఇచ్చేవారు, పుచ్చుకొనే వారిని తాము అప్పటిదాకా ఏ దేవతను ఆరాధించారో ఆ దేవతా స్వరూపంగా భావించి భక్తితో ఇవ్వాలి. అలాగే పుచ్చుకొనే వారు కూడా ఆ వస్తువును ఆ దేవత ప్రసాదంగా భావించి భక్తితో స్వీకరించాలి. అలా కాకుండా "ఫలానా వారు నాకు వాళ్ళ ఇంట్లో వ్రతానికి వెయ్యి రూపాయల చీర పెట్టారు. నేను వెంటనే మరొక వ్రతం చేసుకొని వారికి పదిహేను వందలదో రెండు వేలదో చీర పెట్టేయకపోతే నేను వారికి ఋణపడిపోతాను. ఇది నా ఆత్మాభిమానానికే కళంకం" అని భావిస్తే ఇక అక్కడ అహంకారం, వ్యాపారం తప్ప భక్తి ఎక్కడ ఉంది?

    చిన్న వయసులో పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడటం ఎంత సహజమో పెద్ద వయసులో అదే తల్లిదండ్రులు ఆ పిల్లలమీద ఆధారపడటం అంతే సహజం. అది ప్రకృతి న్యాయం కూడా. అయితే "నా దగ్గర ఇంత ఆస్తి, ఇన్ని డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏ వయసులో అయినా, అటు నా తల్లిదండ్రులయినా, ఇటు నా పిల్లలయినా నా మీదనే ఆధారపడాలి తప్ప నేను ఎవరి మీదా ఆధారపడను" అని అహంకరిస్తే ఎవరికి నష్టం? నిజానికి ఏ కుటుంబంలో సభ్యులు ఒకరిపై ఒకరు పరస్పరం ఆధారపడి ఉంటారో ఆ కుటుంబంలోనే ప్రేమ, ఆప్యాయతలు, సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. అలా కాకుండా ఏ ఒక్క కుటుంబ సభ్యుడయినా "నేను సర్వస్వతంత్రుడిని, ఎవరిమీదా ఆధారపడను, ఎవరితోనూ సంప్రదించను, ఎవరికీ సమాధానం చెప్పను" అని అహంకరించి ఒంటెత్తు పోకడలతో ప్రవర్తిస్తే ఆ కుటుంబంలో నిరంతరం అశాంతి, అల్లకల్లోలం చెలరేగి చివరికి విచ్ఛిన్నం అయిపోతుంది కదా!

    మళ్ళీ మనం మన మొదటి మణిమాల వద్దకే వెళితే అందులోని మణులన్నీ 'మాకందరికీ దారమే ఆధారమై ఉంది కనుక మేము పరస్పరం ఆధారపడం' అని అహంకరించి ఒకదానికొకటి దూరంగా ఉన్నాయనుకోండి ఆ మాల ఏమి అందంగా ఉంటుంది? అదే ఒకదానికొకటి దగ్గరగా అల్లుకొని అన్నీ కలసిమెలసి ఉంటే అది మణిమాల అయినా, పూలమాల అయినా ఎంతో అందంగా ఉంటుంది. నిజానికి భగవంతుడు మనందరికీ ఆధారం మాత్రమే కాదు. మనందరం ఆయన విరాట్ శరీరంలో భాగాలమే. ఒక శరీరంలో భాగాలన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి పరస్పర సహకారంతో ప్రవర్తిస్తే ఆ శరీరం ఆరోగ్యంగా ఉంటుందా? లేక దేనికదే అహంకరించి మిగిలిన వాటితో సంబంధం లేకుండా ప్రవర్తిస్తే ఆరోగ్యంగా ఉంటుందా? అది అనారోగ్యమే కదా!

    తమ శిష్యులు ఎవరైనా ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చి ఒకరిమీద ఒకరు నెపం మోపుతూ తమ వద్దకు వస్తే వారికి శ్రీగురుదేవులు ఇదే చెప్పేవారు. "నా రెండు చేతులు ఒకదానితో ఒకటి కలహించుకొని తీర్పుకి నా దగ్గరకు వస్తే నేను ఏమి చెయ్యాలి? ఏ చెయ్యి పక్షాన నిలవాలి?" అని ప్రశ్నించేవారు. కాబట్టి మనందరికీ భగవంతుడు ఆధారం అన్నది ఎంత నిజమో మనందరం పరస్పర ఆధారితులమన్నది కూడా అంతే నిజం. దీనిని గ్రహించిననాడు అహంకారం తలెత్తకుండా ప్రతి జీవిలోనూ పరమాత్మను దర్శించి గౌరవించే ఉత్తమ సంస్కారం అలవడుతుంది. ఇటువంటి మంచి సంస్కారాలను చిన్నవయసులోనే అలవరచుకోవాలి కానీ వయసు మళ్ళిన తరువాత సుదీర్ఘ జీవితంలో మనను అంటిపెట్టుకొని ఉన్న కుసంస్కారాలు వదుల్చుకోవాలంటే అంత సులభం కాదు.

2, జూన్ 2026, మంగళవారం

శ్రీ సద్గురు బాబూజీ పూరీ కామాఖ్య యాత్ర


    2026 ఏప్రిల్ 26 నుండి మే 12 వరకు శ్రీ కాళీవనాశ్రమ భక్తులనేకులతో కలిసి శ్రీ సద్గురు బాబూజీ పూరీ కామాఖ్య యాత్ర చేయడం జరిగింది. ఈ యాత్రలో భాగంగా కోణార్క్ సూర్య దేవాలయం, పూరీ జగన్నాధ దేవాలయం, సాక్షి గోపాలుడు, జాజిపూర్ గిరిజాదేవి, భువనేశ్వర్ లింగరాజ్, కలకత్తా కాళీమాత, దక్షిణేశ్వర్ కాళీమాత, బేలూరు మఠం, గంగాసాగర్‌, మాయాపూర్ లోని ఇస్కాన్ ప్రధాన దేవాలయం, శ్రీ చైతన్య మహాప్రభువు నడయాడిన నవద్వీపం, వైద్యనాథ్, తారకేశ్వర్, శృంఖలాదేవి, మా తారా, ఏకచక్రపురం, కామాఖ్య, ఉమానందాశ్రమం, వశిష్ఠాశ్రమం మొదలైన ఎన్నో దివ్య క్షేత్రాలను దర్శించడం జరిగింది. ఆయా క్షేత్రాలలో క్షేత్రాధిష్ఠాన దేవతల మాహాత్మ్యమే కాకుండా క్షేత్రజ్ఞులైన జగద్గురువులు శ్రీ ఆది శంకర భగవత్పాదాచార్యుల వారి దగ్గరనుండి గురుదేవులు శ్రీ హనుమత్కాళీ వర ప్రసాద బాబూజీ మహరాజ్ వరకు ఎందరో మహాత్ములు నడయాడిన ఫలితంగా అలముకొన్న పవిత్రత అనుభవైకవేద్యం.

    కోణార్క్ సూర్య దేవాలయం మన ప్రాచీన శిల్పకారుల ప్రతిభకు అద్దం పడుతుంది. అయితే అప్పటినుండి ఇప్పటివరకు పాలకులు ఆడంబరానికి ఇచ్చిన ప్రాముఖ్యత మానవతా విలువలకు ఇవ్వడంలేదని అక్కడి విషాద చరిత్ర మనకు గుర్తుచేస్తుంది. అయితే పరమాత్మకు కావలసింది ఆడంబరాలు కాదు కదా! అందుకే ఈ దేవాలయం పూజలకు నోచుకోలేకపోయింది. సరిగ్గా పన్నెండు సంవత్సరాలలో ఆలయ నిర్మాణం పూర్తి చేయకపోతే అక్కడ పనిచేస్తున్న పన్నెండు వేలమంది శిల్పులను వధిస్తానని అక్కడి రాజు శాసించాడు. అయితే ఆలయం అంతా నిర్మించిన వారికి శిఖరాన్ని స్థాపించడం మాత్రం సాధ్యపడలేదు. చివరి రోజున ప్రధాన శిల్పి పన్నెండేళ్ళ కుమారుడు వచ్చి దానిని స్థాపించడం, ఈ విషయం రాజుగారికి తెలిస్తే ఎక్కడ ఇంతమందిని పొట్టనపెట్టుకుంటాడో అని భయపడి ఆ శిఖరం మీదినుండే దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగిపోయింది. దానితో అపవిత్రమైన అంతటి భవ్యమైన ఆలయం పూజలకు నోచుకోలేకపోయింది.

    ఇక పూరీ జగన్నాధ ఆలయంలో ఆ స్వామి రెండు చేతులూ చాచి ఆప్యాయంగా మనలను ఆహ్వానిస్తున్నా, అక్కడి విపరీతమైన రద్దీలో ముందు మనం ఊపిరితో బయటపడితే చాలన్న భావన ముప్పిరిగొంటుంది. ఒక్క పూరీ అలయంలోనే కాదు, యాత్రలోని అన్ని ప్రముఖ దేవాలయాలలో దాదాపుగా ఇదే పరిస్థితి. దేవుడు దయతలచినా పూజారి దయ తలిస్తే కానీ సవ్యంగా దర్శనం జరుగదు. "కోటికి పడగెత్తిన ధనవంతుడు నీ గుడి ముంగిట సామాన్యుడు, కూటికోసం శ్రమపడే నిర్భాగ్యుడు నీ కృపకెప్పుడు సమపాత్రుడు" అని పాడుకుంటాం కానీ ఆచరణలో మాత్రం పైసాలోనే పరమాత్మ.

  మనవాళ్ళు దేవాలయ వ్యవస్థను ప్రభుత్వ ఆధ్వర్యం నుంచి తప్పించి ధర్మకర్తలకు అప్పజెప్పమని ఉద్యమిస్తూ ఉంటారు కానీ, పండాల ఆధ్వర్యంలో నడిచే ఉత్తరదేశ దేవాలయాల కంటే శుచి శుభ్రతల విషయంలో కానీ, నియమిత రూపంలో దర్శనాది సేవలను అందించడంలో కానీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మన దక్షిణాది దేవాలయాలే చాలా మెరుగు అనిపిస్తుంది. అక్కడ అంతా దైవాధీనం. నీకు సరైన పండా లభిస్తే చక్కగా దర్శనం అవుతుంది. లేకపోతే క్రొత్తవాళ్ళు, అమాయకులు తేలికగా మోసపోయే అవకాశం చాలా ఎక్కువ. బయట టిక్కెట్టు కొనుక్కుని వెళ్ళవలసి వచ్చినా ఒకసారి మూలవిరాట్టు ముందు నిలబడిన తరువాత అక్కడ ప్రశాంతత, భక్తిభావమే నిండిపోవాలి కానీ అక్కడ కూడా డబ్బులకోసం పీడిస్తూ ఉంటే ఇక భగవంతునిపై మనస్సు ఎలా నిలుస్తుంది? అయితే ఇక్కడ కాదనలేని సత్యం ఏమిటంటే శ్రీగురుదేవుల అనుగ్రహం వలన మాకు దొరికిన పండాలందరు అక్కడి క్షేత్రాల గూర్చిన వివరాలన్నీ చక్కగా తెలియజేసి మాకు తృప్తిగా దర్శనం కల్పింపజేశారు.

    అయితే ఈ పరిస్థితికి పూర్తి భిన్నంగా పరమ ప్రశాంతంగా ఉన్న క్షేత్రాలు మాత్రం మాయాపూర్ ఇస్కాన్ దేవాలయం, దక్షిణేశ్వర్ కాళీమాత దేవాలయం, బేలూరు మఠం. అక్కడ అంతా పరిశుభ్రత, చిత్త ప్రశాంతతే కానీ విత్తం గురించిన ఆరాటం లేదు. మీరు గమనిస్తే ఇవన్నీ గురువులతో ముడిపడిన క్షేత్రాలు. అందుకే దేవాలయంలో ఉన్న నిజమైన దేవుని దర్శించడం ఎలాగో, ఆరాధించడం ఎలాగో తెలియాలంటే కచ్చితంగా గురువు అవసరం అనేది. గురువు మార్గదర్శకత్వం లేనిచోట భగవంతుడు కూడా నీ ఉపాధికి తోడ్పడే వ్యాపార వస్తువే అవుతాడు. 

    ఇక మళ్ళీ పూరీ దేవాలయానికి వస్తే ప్రతిరోజూ సాయంకాలం ఎట్టి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనా అక్కడి పూజారులు అంత ఎత్తైన ఆలయశిఖరం మీదకు ఎక్కి పతాకాలను మార్చడం చూసి తీరవలసిన అద్భుత దృశ్యం. అలాగే మన కాళీప్రసాద దేవుడిలాగే ఆ స్వామి కూడా నిరతాన్నదానపరుడు. ఇక ఆ జగన్నాధుని దర్శించడానికి ఆ స్వామియొక్క మరో రూపమైన సాక్షిగోపాలుడు బృందావనం నుండి పాదరక్షలు కూడా లేకుండా కాలినడకన తరలిరావడం ఒళ్ళు గగుర్పొడిచే అద్భుత చరితం.

    జాజిపూర్ గిరిజాదేవి ఆలయం సతీదేవి నాభి పడిన శక్తిపీఠం. దీనినే నాభిగయ అని కూడా అంటారు. ఇక్కడి పూజారి శ్రీ మాతాజీ వారిని దర్శించడంతోనే తన ఉపాసన సార్థకం అయినట్లు భావించి ఉప్పొంగిపోయాడు. అమ్మను వదలలేక మేము ఆ ఊరు విడిచిపెట్టేదాకా ఆమె వెంటనే తిరిగాడు. ప్రపంచంలోనే అతిపెద్దదైన పానవట్టంలో శివలింగం, విష్ణు సాలగ్రామం ఒకే రూపంగా వెలసిన లింగరాజ్ క్షేత్రం కూడా మన శిల్పకారుల అద్భుత నైపుణ్యానికి ప్రతీకయే.

    శ్రీగురుదేవుల నిత్యపూజా మందిరంలో కొలువైఉన్న కలకత్తా కాళీమాతను దర్శించి ఆ తల్లి నాలుకను స్పృశించడం ఒక అనుభూతి అయితే శ్రీగురుదేవులు తమ సాధనకాలంలో ఎన్నో మార్లు, అలాగే ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాల అనంతరం క్రమం తప్పకుండా వెళ్ళి దర్శించుకొనే దక్షిణేశ్వర్‌లోని భవతారిణి కాళీమాతను దర్శించడం, అక్కడ శ్రీ రామకృష్ణ పరమహంస వారి నివాస మందిరం, వారు తాము పొందుతున్న బ్రహ్మానందాన్ని అందుకోవడానికి రాబోయే శిష్యుల గురించి ఆరాటపడుతూ ఎదురుచూసిన మెట్ల మార్గాన్ని, శ్రీ వివేకానందులవారికి మంత్రదీక్షను ప్రసాదించిన సోపానాలను స్పృశించడం ఒక దివ్యానుభూతి.

    ఇక శ్రీ పరమహంస వారు తమ అవతార పరిసమాప్తి చేయబోయేముందు కొద్ది మాసాలు నివసించిన కాసిపూర్ మఠంలో పొందిన అలౌకిక అనుభూతి మాటలలో చెప్పలేనిది. స్వామివారు, శారదా మాత, వారి సాంసారిక, సన్యాస శిష్యులు నివసించిన మందిరాలలో నెలకొన్న ప్రశాంతత వర్ణనాతీతం. ఇక ఆ మందిరానికి ముందు భాగంలో 1886 జనవరి 1న శ్రీ పరమహంస వారు "కల్పవృక్ష లీల" నెరపిన వృక్షం ఆ దివ్యలీలకు సాక్షిగా ఇప్పటికీ అక్కడ నిలచి ఉంది. ఆనాడు స్వామివారు 'నేనే భగవంతుడిని' అని నిర్ద్వంద్వంగా ప్రకటించి తమను ఆశ్రయించిన సాంసారిక శిష్యులను అందరినీ హృదయంపై స్పృశించి వారికి అలౌకికమైన సమాధి స్థితిని అనుభవింపజేశారు. ఆ మఠానికి సమీపంలోనే ఉన్న శ్మశానవాటికలో స్వామివారి బృందావనం దర్శనీయం.

    విశ్వవ్యాప్తమైన శ్రీ రామకృష్ణ మఠాలకు మూలస్థానమైన బేలూరు మఠం అత్యంత విశాలమై నయనానందకరంగా ఉంటుంది. అక్కడి ప్రధాన మందిరంలో శ్రీ రామకృష్ణ పరమహంస వారి దివ్యమంగళ మూర్తికి ఎదురుగా కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ స్వామే మనలను ఆప్యాయంగా స్పృశించి తమ ఒడిలోనికి చేర్చుకుంటున్నారా అన్న అనుభూతిని కలిగిస్తూ గంగానది పైనుంచి వీచే సాయంకాలపు మందమారుతం మనను సుతారంగా తాకుతూ ఉంటుంది.

    ఇక వైశాఖ పౌర్ణమి ముందునాటి సాయంకాల ఘడియలలో గంగాసాగర్‌లో పవిత్ర సముద్ర స్నానం అయితే మన భక్తులందరికీ ఎన్నెన్నో విశేష అనుభవాలను మిగిల్చింది. శ్రీ మాతాజీవారు శ్రీగురుపాదుకలను చేత ధరించి సముద్రంలోకి ప్రవేశిస్తే మేమందరం వారు మధ్యలో ఉండగా రెండు వరుసలలో V ఆకారంలో వారి ముందు నిలబడి స్నానానికి సిద్ధమయ్యాము. అయితే జగన్మాతను, శ్రీ గురుపాదుకలను అందుకోవాలనే ఉత్సాహంలో సముద్రుడు పెద్దపెద్ద కెరటాలతో ఎగసిపడుతూ అమ్మను సైతం రెండుసార్లు తూలిపాటుకు గురిచేశాడు. ఇక మూడవ పెద్ద కెరటం మమ్ములను సమీపిస్తూ ఉండగా క్షణంలో నాలుగవవంతు కాలం అమ్మ ఆ సముద్రుని వైపు తీక్షణంగా చూసిన చూపు ఎన్నటికీ మరువలేనిది. అంతే పులిలా వచ్చిన కెరటం పిల్లిలా మారిపోయి చిన్న అల అయి అమ్మ పాదాలకు నమస్కరించి వెనుదిరిగింది. మా అందరి స్నానాలు పూర్తి అయి, శ్రీ సద్గురు పాదుకలకు అభిషేకము, అర్చన పూర్తి అయ్యే వరకు మళ్ళీ ఒక్క పెద్ద కెరటం వస్తే ఒట్టు!

    ఇక దేశవిదేశాలలో శ్రీకృష్ణ చైతన్యాన్ని విస్తరింపజేస్తున్న మాయాపూర్ లోని ఇస్కాన్ ప్రధానకేంద్రంలో దర్శనం ఒక అద్భుత అనుభూతి. ఎన్ని వేలమంది భక్తులు ఉన్నా అక్కడ తాండవించే నిశ్శబ్దం, అంతమంది చక్కగా వరుసక్రమంలో దర్శనానికి వచ్చే క్రమశిక్షణ ముచ్చటగొలుపుతాయి. ఎటువంటి రోగాలనైనా నయం చేసే వైద్యనాథ్ జ్యోతిర్లింగం, తారకేశ్వర్, సతీదేవి మూడవకన్ను పడిన మా తారా క్షేత్రం మొదలైన చోట్ల రద్దీ ఎక్కువగా ఉన్నా దేనికదే చక్కని దర్శన అనుభూతిని కలిగించింది. శృంఖలాదేవిగా భావించబడుతున్న జగత్ గౌరీ మాత ఆ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలందరినీ సర్పబాధల నుండి రక్షిస్తూ ఉంటుంది.

    ఇక అత్యంత దుర్లభమైన కామాఖ్య అమ్మవారి దర్శనం శ్రీగురుదేవుల కృప వలన మా అందరికీ చక్కగా లభించింది. మనందరికీ మాతృస్థానమైన జగన్మాత యోని పడిన శక్తిపీఠం ఇది. అక్కడి అంతరాలయంలో పూజారి సంకల్పం చెబుతూ ఇక్కడ అమ్మ యోనిని స్పృశించిన వారికి ఇక పునర్జన్మ ఉండదు అని మంత్రాలు చదువుతూ ఉంటే "ఎన్ని జన్మములు ఎత్తితినో తల్లి, ఇంకెన్ని జన్మములు ఎత్తెదనో మళ్ళి, కన్నతల్లి మరి జన్మలనీయకు, కాత్యాయని నీ సన్నిధిలో చేర్చు" అనే కీర్తన మదిలో మెరిసింది. అంతలోనే "మనం జన్మించేది ఆ తల్లి గర్భంలో నుండి అయినప్పుడు, ఆ జగన్మాత బిడ్డగా ఎన్ని జన్మలు ఎత్తితే మటుకు తప్పేముంది?" అని కూడా అనిపించింది.

    శ్రీ గురుదేవులు పర్యటించిన ఈ దివ్య క్షేత్రాలు అన్నిటితో పాటు వారి పాదధూళికి నోచుకున్న షిల్లాంగ్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడి ప్రకృతి సౌందర్యం, ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే ప్రదర్శనశాల చూసి తీరవలసిందే. ఇక చిరపుంజిలోని నోహ్కలికై జలపాతం అయితే ఎంతసేపు చూసినా తనివి తీరలేదు. హిమాలయాలకు పాదపీఠమై, విరబోసుకున్న పరమేశ్వరుని జటాజూటం అని అర్థం కలిగిన శివాలిక్ కొండలలో నుండి క్రిందికి పడుతున్న దేశంలోనే ఎత్తైన జలపాతం ఆనాటి గంగావతరణాన్ని తలపింపజేసింది. అయితే ఆ జలపాతం వెనుక ఉన్న విషాదగాధ మాత్సర్యం ఎంతటి నీచమైనదో, శ్రీగురుదేవులు దానిని మళ్ళీ "ఈర్ష్య, అసూయత, అసహనం, ఓర్వలేనితనం" అని నాలుగుగా విభజించి ఎందుకు మాటిమాటికీ ప్రస్తావించేవారో అర్థమయ్యేలా చేసింది. కా లికాయి అనే స్త్రీ తన భర్త మరణించడంతో ద్వితీయ వివాహం చేసుకొంది. అయితే ఆ రెండవ భర్త తన భార్య తనకంటే తన సంతానమైన నెలల పాపను ఎక్కువగా ప్రేమిస్తోందనే అసూయతో ఆ పసికందును వధించి, వండి ఆ తల్లికి భోజనంగా వడ్డించాడు. తాను భుజించినది తన కన్నబిడ్డనే అని తెలుసుకొన్న ఆ తల్లి తల్లడిల్లిపోయి ఈ జలపాతంలోకి దూకి ఆత్మార్పణ చేసుకొంది.

    ఎన్నికల సమయంలో, ఫలితాల సమయంలో హింసకు ప్రసిద్ధిగాంచిన బెంగాల్ ప్రాంతంలో అదే సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదుర్కోకుండా ఈ యాత్ర జరిగిందంటే అది కేవలం శ్రీ గురుదేవుల పరమనుగ్రహం, శ్రీ మాతాజీవారు ఆదేశించి భక్తులందరితో జరిపించిన శ్రీ శివకవచ, శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణల మహాత్మ్యం అనే చెప్పాలి. భక్తజనులందరూ దిగ్విజయంగా యాత్ర ముగించుకొని, రైలు ప్రయాణంలో శ్రీగురుదేవులతో తమకు కలిగిన అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకొంటూ, శ్రీ కాళీవనాశ్రమం చేరుకొని శ్రీ రామలింగేశ్వర స్వామివారికి అభిషేకాలు, శ్రీ మహాకాళికా పరమేశ్వరీ మాతకు కుంకుమార్చనలు, హోమలు, శ్రీ సద్గురు పాదపూజతో యాత్రాఫలాన్ని శ్రీ గురుదేవుల శ్రీచరణాల సన్నిధిలో అర్పించి ధన్యులయ్యారు.

5, ఏప్రిల్ 2026, ఆదివారం

అర్థమనర్థం



అర్థమనర్థం భావయ నిత్యం
నాస్తితతః సుఖలేశస్సత్యమ్ ।
పుత్రాదపి ధనభాజాం భీతిః
సర్వత్రైషా విహితా రీతిః 

    డబ్బు యొక్క విలువ ఏమిటో ఈ భజగోవింద శ్లోకంలో జగద్గురువులు వివరిస్తున్నారు. మనందరం మన జీవితాలలో డబ్బుకి చాలా ప్రాముఖ్యత ఇస్తాం. డబ్బు ఉంటే మనం కోరుకున్న అన్ని సుఖాలూ యధేచ్చగా పొందవచ్చు అనుకుంటాం. తగినంత డబ్బు దగ్గర లేకపోతే భయపడతాం. కానీ ఇక్కడ స్వామివారు డబ్బు వలన ఏమీ ప్రయోజనం లేదని చెబుతున్నారు. అలాగే దానివలన లేశమాత్రమైనా సుఖం లేదని కూడా చెబుతున్నారు. ఇంకా డబ్బులున్నవాడు తన సొంత పుత్రునికే భయపడతాడు అని కూడా చెబుతున్నారు. అదెలాగో చూద్దాం.

    డబ్బు బహు చంచలమైనది. లక్ష్మీదేవి నామాలలో కూడా ఓం చంచలాయై నమః అని, ఓం చపలాయై నమః అని నామాలు ఉంటాయి. ఈనాడు నీ చేతిలో ఉన్న డబ్బు మర్నాడు ఎవరి చేతిలోకి వెళ్లిపోతుందో ఎవరూ చెప్పలేరు. ప్రతిరోజూ మన షేర్ మార్కెట్ ఉత్థాన పతనాలు చూస్తూనే ఉన్నాం కదా. క్షణాలలో లక్షల కోట్ల సంపద ఆవిరైపోతోంది. అలాగే డబ్బు వలన కలిగే సుఖం కూడా మన భ్రమే. శ్రీ బాబూజీ మహరాజ్ వారు చెప్పేవారు - విమానంలో ఫస్ట్‌క్లాస్‌లో  ప్రయాణిస్తున్న ధనవంతుడికి ఉన్నట్టుండి విపరీతమైన కడుపునొప్పి వస్తే ఆ విలాసవంతమైన సీటు అతనికి ఏమైనా సుఖంగా అనిపిస్తుందా?

    అలాగే డబ్బు లేనివాడు నడిరోడ్డు మీద అయినా సుఖంగా నిద్రపోతాడు. అవసరానికి మించిన డబ్బు దగ్గర పెట్టుకున్నవాడికి నిద్ర ఎక్కడిది. అనుక్షణం ఎవరు ఎటునుంచి వచ్చి తన డబ్బు కొట్టేస్తారో అని భయపడుతూనే ఉంటాడు. శ్రీ బాబూజీ మహరాజ్ వారు ఒక సంఘటన చెప్పేవారు. ఒక వ్యాపారస్తునికి తన ధోవతి లోపల గుడ్డ సంచీ కుట్టించుకొని అందులో డబ్బు పెట్టుకోవడం అలవాటు. ఒకసారి రైల్వే ప్లాట్‌ఫారం మీద పడుకోవలసి వచ్చింది. ఇంక అతనికి నిద్ర ఏమి పడుతుంది? రాత్రంతా బిక్కుబిక్కుమంటూ కూర్చొని అలసటకి రెప్పవాల్చగానే అప్పటిదాకా గమనిస్తూనే ఉన్న దొంగవాడు బ్లేడుతో అతని పంచెను కోయడం, అది తగలరాని చోట తగిలి ఇతను ఆస్పత్రిపాలు కావడం జరిగిపోయాయి.  

    అంతెందుకు 'ఈ డబ్బు నాది, నాది' అనుకునే వాడు సొంత కొడుకుని చూసినా భయపడుతూనే ఉంటాడు. తాను మధ్యవయసులో ఉన్నపుడు యవ్వనుడైన కొడుకు తన డబ్బును ఎక్కడ విలాసాలకు ఖర్చు పెట్టేస్తాడో అని భయం! తాను వృద్ధుడు అయిన తరువాత ఆస్తంతా కొడుకు చేతిలో పెడితే ఎక్కడ తనను కట్టుబట్టలతో బయటకు వెళ్ళగొడతాడో అని భయం! ప్రశాంతంగా రామా కృష్ణా అనుకోవలసిన వయసులో ఇంకా దస్తావేజులు, ఇన్కమ్‌ట్యాక్స్‌లు అనుకుంటూ శ్రమపడుతూ నిరంతరం చింతిస్తూ ఉంటాడు. వృద్ధస్తావచ్చింతాసక్తః అని మళ్ళీ జగద్గురువులే ఇక్కడ చెబుతున్నారు.

    అంతేకాదు మనలో సరైన జన్మజన్మాంతర సంస్కారం లేకపోతే ఈ డబ్బు మనలో దాగివున్న  దుష్ట గుణాలన్నింటినీ బయటకు తెస్తుంది. ఏనెలకానెల చాలీచాలని జీతంతో బ్రతికినన్నాళ్ళు మనిషి 'అందరూ నావాళ్ళే, మనకున్నది అందరితో పంచుకోవాలి' అనుకుంటాడు. ప్రేమ, అప్యాయతలు కురిపిస్తాడు. తాను వండుకున్న కాస్త అన్నమే మహాప్రసాదంగా మరునాటికి దాచుకొని మరీ తింటాడు. అదే వ్యక్తికి అనుకోకుండా ధనం వచ్చిపడితే ఇక తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ శత్రువులుగానే కనిపించడం మొదలుపెడతారు. ప్రపంచమంతా తనను దోచుకోవడానికే కాచుకొని కూర్చున్నట్లు అనిపిస్తుంది. గొప్పలకోసమో, పుణ్యంకోసమో లక్షలు, కోట్లు అవలీలగా దానం ఇచ్చేసేవాడు కూడా తన ఇంట్లో ఒక చిన్న చెంచానో, ఒక గుడ్డముక్కో కనపడకుండా పోతే సతమతమైపోతాడు. పనిమనుషుల దగ్గరనుంచి కొడుకు, కోడలు వరకు ఎవరినైనా దొంగలని నిందించడానికి వెనుకాడడు.

    సొంత మనుషులంటే కూడా ఎందుకు ఇంత భయం వస్తోంది? అని విచారిస్తే తనలో జవసత్వాలు ఉన్నంతకాలం 'ఇది మనది' అనే భావన ఏమాత్రం లేకుండా 'ఇదంతా నాదే! నా ఇష్టం వచ్చినట్లు నేను వాడుకుంటాను' అని విచ్చలవిడిగా ప్రవర్తించి చివరికి భార్య, పిల్లలను కూడా సంప్రదించకుండా అహంకారంతో పెత్తనం చలాయిస్తాడు. తీరా వృద్ధాప్యంలో జవసత్వాలు ఉడిగి, జ్ఞాపకశక్తి నశించే సమయంలో తన బిడ్డలు కూడా తనలాగే 'ఇదంతా నాది' అని ఎక్కడ లాక్కుంటారో, తన అధికారం ఎక్కడ పోతుందో అన్న భయం వెంటాడటం మొదలవుతుంది. అదే ముందునుంచి 'ఇది నాకు భగవంతుడు ఇచ్చిన ప్రసాదం. అలాగే ఈ కుటుంబం కూడా నాకు ఆయన ప్రసాదమే' అని భావిస్తూ 'ఇదంతా మనది' అనే భావన చూపిస్తూ, ప్రతి విషయం భార్య, పిల్లలతో సంప్రదించి చేసే అలవాటు ఉన్నవాడు వాడి పిల్లలలో కూడా అటువంటి సంస్కారాన్నే కలిగిస్తాడు. అప్పుడు వారు తననుంచి లాక్కుంటారనే భయం కలగదు కదా! 'ఇది నాది, దీనిమీద సర్వ హక్కులు నాకే కావాలి' అనుకున్న దుర్యోధనుడు రాజభవనంలో ఉన్నా నిరంతర చింతలోనే బ్రతికాడు. 'ఇది మనది, అందరూ మనవాళ్ళే' అనుకున్న పాండవులు అడవులలో ఉన్నా ప్రశాంతంగా జీవించారు.

    అందుకే జగద్గురువులు మళ్ళీ మూఢ జహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణామ్। యల్లభసే నిజకర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తమ్॥ అని ధనాన్ని ఎలా చూడాలో నేర్పిస్తున్నారు. ఓ మూఢుడా 'నాకు ఇంకా ఇంకా ధనం కావాలి' అనే దాహాన్ని విడిచిపెట్టు. సద్బుద్ధి కలవాడివై ధనదాహాన్ని వదిలి నీ కర్మ ఫలితంగా ఎంత ధనమైతే వస్తోందో దానితోనే నీ సంసారాన్ని గడుపుకుంటూ హాయిగా, ప్రశాంతంగా జీవించు అని బోధిస్తున్నారు. మరి  ఇక్కడ మనిషికి ఇంకా ఎదగాలి అని ఆశయం ఉండటం తప్పు ఎలా అవుతుంది? అనే ప్రశ్న వస్తుంది. అయితే మనం ఎదుగుదలని డబ్బుతోనే కొలవడం అలవాటు చేసుకున్నాం. ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అని పేరు తెచ్చుకున్నవాడు రేపు కూడా అలాగే ఉంటాడని భరోసా ఎక్కడిది? వీడిని చూసి ఇంకొకడు వీడికన్నా ఎక్కువగా ఎదుగుతాడు. ఇది ఒక అంతులేని పరుగుపందెం. మళ్ళీ ఇక్కడ జగద్గురువులు ఈ పరుగుపందెం గురించి యావద్విత్తోపార్జనసక్తః తావన్నిజపరివారో రక్తః। పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాం కోఽపి న పృచ్ఛతి గేహే।। అని చెప్తున్నారు. పైన చెప్పినట్లుగా కుటుంబంలో అప్యాయతలను, సమష్టి భావనను వదిలివేసి 'నా చేతిలో డబ్బు ఉన్నంతకాలం నేనే రాజుని' అని విర్రవీగుతూ డబ్బు వెనుక పరుగెట్టేవాడిని కుటుంబసభ్యులు కూడా అంతవరకే గౌరవిస్తారు. ఒక్కసారి సంపాదన ఆగిపోయిందంటే కనీసం 'బాగున్నావా? తిన్నావా?' అని అడిగేవాడు కూడా ఉండడు. ఇంక వాడు ఏమి సాధించినట్లు?

    ఈ పరుగులలో పడి అసలు మన లక్ష్యం ఏమిటి, మన జీవితం ఎందుకు వచ్చింది అనే విషయాన్నే మర్చిపోతున్నాం. ఎంత సంపాదించినా చివరికి వట్టి చేతులతో మట్టిపాలు కావలసిందే కానీ ఇక్కడినుండి పరలోకానికి ఒక్కపైసా తీసుకెళ్ళినవాడు ఎవడూ లేడు. ఒకవేళ తీసుకెళ్ళినా అది అక్కడ చెల్లదు. అందుకే జగద్గురువులు మళ్ళీ మా కురు ధన-జన-యౌవన-గర్వం హరతి నిమేషాత్కాలః సర్వమ్। మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా॥ అని చెబుతున్నారు. 'నాకు ఇంత ధనం ఉంది. నా వెనకాల ఇంత బలగం ఉంది. నాకు యవ్వనం ఉంది. ఏదైనా అవలీలగా చేసేయగలను' అని విర్రవీగకు. ఇవన్నీ ఒక్కనిమిషంలో కాలం హరించివేస్తుంది. ఇదంతా మాయ అని తెలుసుకొని నీ స్వస్వరూప స్థితి అయిన బ్రహ్మపదాన్ని చేరుకోవడానికి ప్రయత్నించమని బోధిస్తున్నారు. 

    ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథమ్| ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్|| నేడు నాకు ఇంతటి సంపద లభించింది, నా కోరికలన్నీ ఈరోజే తీర్చుకుంటాను. నా దగ్గర ఈ ధనముంది, అలాగే, భవిష్యత్తులో ఇంకా చాలా ధనం నాకే వస్తుంది అనే ఆలోచనలన్నీ అసుర స్వభావం వలన కలిగేవే అని భగవద్గీతలో 16వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు. అంతే కాదు ఇలాంటివారు 'ఈ శత్రువు నా చేతిలో చచ్చాడు, మిగిలిన వారిని కూడా చంపుతాను, నేను ప్రభువును, భోగిని, సిద్ధుడిని, బలవంతుణ్ణి, సుఖవంతుణ్ణి, నేను గొప్పవాడిని, నా కులం గొప్పది, నా వెనుక ఇంత బలగం ఉంది, నాకు సముడెవ్వడు? యజ్ఞం చేస్తాను, దానం ఇస్తాను, ఆనందిస్తాను' ఇలాంటి భావనలతో అవివేకంలో, మోహంలో పడి చివరికి నరకం పాలవుతున్నారు అని కూడా చెప్పారు.

    మరి మన ధనాన్ని ఎలా చూడాలి? ఎలా అనుభవించాలి? అని ప్రశ్న వస్తుంది. దీనికి శ్రీ బాబూజీ మహరాజ్ వారు 'ఒక బ్యాంకు ఉద్యోగి చేతులమీదుగా రోజూ అనేక లక్షల రూపాయల వ్యవహారం జరుగుతూ ఉంటుంది. కానీ అతనికి ఆ రూపాయలపై ఎటువంటి మమకారం ఉండదు. ఒకవేళ అలాంటి మమకారం ఏర్పడిన మరుక్షణం అతను జైలు పాలవుతాడు. అలాగే భక్తుడు తన సంసారం పట్ల శ్రద్ధ, ప్రేమ, బాధ్యతలతో వ్యవహరించాలి కానీ మమకారం పెంచుకోకూడదు. అది బంధనానికి దారి తీస్తుంది' అని, 'నీ ధనానికి నిన్ను నువ్వు ఒక ధర్మకర్తగా భావించుకో కానీ ఒక యజమానిగా కాదు' అని బోధించారు. ధనానికి మూడు గతులు ఉంటాయని భర్తృహరి దానం భోగో నాశస్తిస్రో గతయో భవంతి విత్తస్య। యో న దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి॥ దానము, భోగము, నాశము అని ధనానికి మూడు గతులు ఉంటాయి. ఎవరైతే దానమివ్వకుండా, తాము అనుభవించకుండా దాచిపెట్టుకుంటారో అట్టి ధనానికి మూడవదైన నాశం కలుగుతుంది అని చెప్పాడు. ఇందులో ఉత్తమ గతి మనకు ఉన్నంతలో ఎదుటివారికి దానం చేయడం. అది కూడా గొప్పలకోసం, పుణ్యంకోసం, ప్రతిఫలం కోసం కాకుండా దేశ కాల పాత్రతలను ఎరిగి దానం చేయాలని భగవద్గీత బోధిస్తోంది. ఇక తనకు ఉన్నదానిని కనీసం తానైనా అనుభవించడం మధ్యమ గతి. ఈ రెండు చేయనివారి ధనం దొంగలపాలో, రాజులపాలో, అగ్నిపాలో అయిపోతుందని శాస్త్రం చెబుతోంది.   

    మన సంస్కృతి విత్తం కంటే విద్యకే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుడున్ విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లే దిలన్ విద్య నృపాల పూజితము విద్య నెరుంగనివాడు మర్త్యుడే అన్నాడు భర్తృహరి. డబ్బులున్నవాడు తన ఊరిలోనే గౌరవించబడతాడు. అది కూడా తన అవసరం ఉన్న కొందరిచేతనే! ఎప్పుడైతే వాడితో అవసరం తీరిపోతుందో, లేదా వీడు పిసినారివాడు, ఎలాగూ మనకు సహాయం చేయడు అనుకుంటారో అప్పుడే వాడిని గౌరవించడం మానేస్తారు. కానీ విద్య ఉన్నవాడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా గౌరవింపబడతాడు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం - మన రూపాయలు వేరే దేశానికి తీసుకెళ్తే ఎందుకూ పనికిరావు. అక్కడి ధనం రూపంలోకి మార్చుకున్నా వాటి విలువ చాలా తగ్గిపోతుంది. అయితే సరైన విద్య ఎక్కడైనా ఒకేరకంగా పనికివస్తుంది.

    మరి నిజమైన ధనం ఏమిటి? దేనిని సంపాదిస్తే అది మనదగ్గర శాశ్వతంగా ఉంటుంది? అని ఆలోచిస్తే శ్రీగురుదేవులు 'నామస్మరణ ధనమే నీ ధనము' అని అందించారు. 'నామ్ ధన్ కా ఖజానా బఢాతే చలో' అని కూడా అందించారు. 'భగవత్స్మరణలో, సత్సంగంలో గడిపిన కాలమంతా నీ నిత్యకాలంలో జమ అవుతుంది' అని కూడా బోధించారు. కలియుగంలో మనం సంపాదించుకోవలసిన, జమ చేసుకోవలసిన ధనం నామస్మరణ ధనం ఒక్కటే. ఈ కలియుగంలో సంసార బంధనాల నుంచి ముక్తిని పొందడానికి అంతకంటే వేరొక ఉపాయం ఏదీ లేదని కలిసంతరణ ఉపనిషత్తు బోధిస్తోంది. నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే।