2, జూన్ 2026, మంగళవారం

శ్రీ సద్గురు బాబూజీ పూరీ కామాఖ్య యాత్ర


    2026 ఏప్రిల్ 26 నుండి మే 12 వరకు శ్రీ కాళీవనాశ్రమ భక్తులనేకులతో కలిసి శ్రీ సద్గురు బాబూజీ పూరీ కామాఖ్య యాత్ర చేయడం జరిగింది. ఈ యాత్రలో భాగంగా కోణార్క్ సూర్య దేవాలయం, పూరీ జగన్నాధ దేవాలయం, సాక్షి గోపాలుడు, జాజిపూర్ గిరిజాదేవి, భువనేశ్వర్ లింగరాజ్, కలకత్తా కాళీమాత, దక్షిణేశ్వర్ కాళీమాత, బేలూరు మఠం, గంగాసాగర్‌, మాయాపూర్ లోని ఇస్కాన్ ప్రధాన దేవాలయం, శ్రీ చైతన్య మహాప్రభువు నడయాడిన నవద్వీపం, వైద్యనాథ్, తారకేశ్వర్, శృంఖలాదేవి, మా తారా, ఏకచక్రపురం, కామాఖ్య, ఉమానందాశ్రమం, వశిష్ఠాశ్రమం మొదలైన ఎన్నో దివ్య క్షేత్రాలను దర్శించడం జరిగింది. ఆయా క్షేత్రాలలో క్షేత్రాధిష్ఠాన దేవతల మాహాత్మ్యమే కాకుండా క్షేత్రజ్ఞులైన జగద్గురువులు శ్రీ ఆది శంకర భగవత్పాదాచార్యుల వారి దగ్గరనుండి గురుదేవులు శ్రీ హనుమత్కాళీ వర ప్రసాద బాబూజీ మహరాజ్ వరకు ఎందరో మహాత్ములు నడయాడిన ఫలితంగా అలముకొన్న పవిత్రత అనుభవైకవేద్యం.

    కోణార్క్ సూర్య దేవాలయం మన ప్రాచీన శిల్పకారుల ప్రతిభకు అద్దం పడుతుంది. అయితే అప్పటినుండి ఇప్పటివరకు పాలకులు ఆడంబరానికి ఇచ్చిన ప్రాముఖ్యత మానవతా విలువలకు ఇవ్వడంలేదని అక్కడి విషాద చరిత్ర మనకు గుర్తుచేస్తుంది. అయితే పరమాత్మకు కావలసింది ఆడంబరాలు కాదు కదా! అందుకే ఈ దేవాలయం పూజలకు నోచుకోలేకపోయింది. సరిగ్గా పన్నెండు సంవత్సరాలలో ఆలయ నిర్మాణం పూర్తి చేయకపోతే అక్కడ పనిచేస్తున్న పన్నెండు వేలమంది శిల్పులను వధిస్తానని అక్కడి రాజు శాసించాడు. అయితే ఆలయం అంతా నిర్మించిన వారికి శిఖరాన్ని స్థాపించడం మాత్రం సాధ్యపడలేదు. చివరి రోజున ప్రధాన శిల్పి పన్నెండేళ్ళ కుమారుడు వచ్చి దానిని స్థాపించడం, ఈ విషయం రాజుగారికి తెలిస్తే ఎక్కడ ఇంతమందిని పొట్టనపెట్టుకుంటాడో అని భయపడి ఆ శిఖరం మీదినుండే దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగిపోయింది. దానితో అపవిత్రమైన అంతటి భవ్యమైన ఆలయం పూజలకు నోచుకోలేకపోయింది.

    ఇక పూరీ జగన్నాధ ఆలయంలో ఆ స్వామి రెండు చేతులూ చాచి ఆప్యాయంగా మనలను ఆహ్వానిస్తున్నా, అక్కడి విపరీతమైన రద్దీలో ముందు మనం ఊపిరితో బయటపడితే చాలన్న భావన ముప్పిరిగొంటుంది. ఒక్క పూరీ అలయంలోనే కాదు, యాత్రలోని అన్ని ప్రముఖ దేవాలయాలలో దాదాపుగా ఇదే పరిస్థితి. దేవుడు దయతలచినా పూజారి దయ తలిస్తే కానీ సవ్యంగా దర్శనం జరుగదు. "కోటికి పడగెత్తిన ధనవంతుడు నీ గుడి ముంగిట సామాన్యుడు, కూటికోసం శ్రమపడే నిర్భాగ్యుడు నీ కృపకెప్పుడు సమపాత్రుడు" అని పాడుకుంటాం కానీ ఆచరణలో మాత్రం పైసాలోనే పరమాత్మ.

  మనవాళ్ళు దేవాలయ వ్యవస్థను ప్రభుత్వ ఆధ్వర్యం నుంచి తప్పించి ధర్మకర్తలకు అప్పజెప్పమని ఉద్యమిస్తూ ఉంటారు కానీ, పండాల ఆధ్వర్యంలో నడిచే ఉత్తరదేశ దేవాలయాల కంటే శుచి శుభ్రతల విషయంలో కానీ, నియమిత రూపంలో దర్శనాది సేవలను అందించడంలో కానీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మన దక్షిణాది దేవాలయాలే చాలా మెరుగు అనిపిస్తుంది. అక్కడ అంతా దైవాధీనం. నీకు సరైన పండా లభిస్తే చక్కగా దర్శనం అవుతుంది. లేకపోతే క్రొత్తవాళ్ళు, అమాయకులు తేలికగా మోసపోయే అవకాశం చాలా ఎక్కువ. బయట టిక్కెట్టు కొనుక్కుని వెళ్ళవలసి వచ్చినా ఒకసారి మూలవిరాట్టు ముందు నిలబడిన తరువాత అక్కడ ప్రశాంతత, భక్తిభావమే నిండిపోవాలి కానీ అక్కడ కూడా డబ్బులకోసం పీడిస్తూ ఉంటే ఇక భగవంతునిపై మనస్సు ఎలా నిలుస్తుంది? అయితే ఇక్కడ కాదనలేని సత్యం ఏమిటంటే శ్రీగురుదేవుల అనుగ్రహం వలన మాకు దొరికిన పండాలందరు అక్కడి క్షేత్రాల గూర్చిన వివరాలన్నీ చక్కగా తెలియజేసి మాకు తృప్తిగా దర్శనం కల్పింపజేశారు.

    అయితే ఈ పరిస్థితికి పూర్తి భిన్నంగా పరమ ప్రశాంతంగా ఉన్న క్షేత్రాలు మాత్రం మాయాపూర్ ఇస్కాన్ దేవాలయం, దక్షిణేశ్వర్ కాళీమాత దేవాలయం, బేలూరు మఠం. అక్కడ అంతా పరిశుభ్రత, చిత్త ప్రశాంతతే కానీ విత్తం గురించిన ఆరాటం లేదు. మీరు గమనిస్తే ఇవన్నీ గురువులతో ముడిపడిన క్షేత్రాలు. అందుకే దేవాలయంలో ఉన్న నిజమైన దేవుని దర్శించడం ఎలాగో, ఆరాధించడం ఎలాగో తెలియాలంటే కచ్చితంగా గురువు అవసరం అనేది. గురువు మార్గదర్శకత్వం లేనిచోట భగవంతుడు కూడా నీ ఉపాధికి తోడ్పడే వ్యాపార వస్తువే అవుతాడు. 

    ఇక మళ్ళీ పూరీ దేవాలయానికి వస్తే ప్రతిరోజూ సాయంకాలం ఎట్టి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనా అక్కడి పూజారులు అంత ఎత్తైన ఆలయశిఖరం మీదకు ఎక్కి పతాకాలను మార్చడం చూసి తీరవలసిన అద్భుత దృశ్యం. అలాగే మన కాళీప్రసాద దేవుడిలాగే ఆ స్వామి కూడా నిరతాన్నదానపరుడు. ఇక ఆ జగన్నాధుని దర్శించడానికి ఆ స్వామియొక్క మరో రూపమైన సాక్షిగోపాలుడు బృందావనం నుండి పాదరక్షలు కూడా లేకుండా కాలినడకన తరలిరావడం ఒళ్ళు గగుర్పొడిచే అద్భుత చరితం.

    జాజిపూర్ గిరిజాదేవి ఆలయం సతీదేవి నాభి పడిన శక్తిపీఠం. దీనినే నాభిగయ అని కూడా అంటారు. ఇక్కడి పూజారి శ్రీ మాతాజీ వారిని దర్శించడంతోనే తన ఉపాసన సార్థకం అయినట్లు భావించి ఉప్పొంగిపోయాడు. అమ్మను వదలలేక మేము ఆ ఊరు విడిచిపెట్టేదాకా ఆమె వెంటనే తిరిగాడు. ప్రపంచంలోనే అతిపెద్దదైన పానవట్టంలో శివలింగం, విష్ణు సాలగ్రామం ఒకే రూపంగా వెలసిన లింగరాజ్ క్షేత్రం కూడా మన శిల్పకారుల అద్భుత నైపుణ్యానికి ప్రతీకయే.

    శ్రీగురుదేవుల నిత్యపూజా మందిరంలో కొలువైఉన్న కలకత్తా కాళీమాతను దర్శించి ఆ తల్లి నాలుకను స్పృశించడం ఒక అనుభూతి అయితే శ్రీగురుదేవులు తమ సాధనకాలంలో ఎన్నో మార్లు, అలాగే ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాల అనంతరం క్రమం తప్పకుండా వెళ్ళి దర్శించుకొనే దక్షిణేశ్వర్‌లోని భవతారిణి కాళీమాతను దర్శించడం, అక్కడ శ్రీ రామకృష్ణ పరమహంస వారి నివాస మందిరం, వారు తాము పొందుతున్న బ్రహ్మానందాన్ని అందుకోవడానికి రాబోయే శిష్యుల గురించి ఆరాటపడుతూ ఎదురుచూసిన మెట్ల మార్గాన్ని, శ్రీ వివేకానందులవారికి మంత్రదీక్షను ప్రసాదించిన సోపానాలను స్పృశించడం ఒక దివ్యానుభూతి.

    ఇక శ్రీ పరమహంస వారు తమ అవతార పరిసమాప్తి చేయబోయేముందు కొద్ది మాసాలు నివసించిన కాసిపూర్ మఠంలో పొందిన అలౌకిక అనుభూతి మాటలలో చెప్పలేనిది. స్వామివారు, శారదా మాత, వారి సాంసారిక, సన్యాస శిష్యులు నివసించిన మందిరాలలో నెలకొన్న ప్రశాంతత వర్ణనాతీతం. ఇక ఆ మందిరానికి ముందు భాగంలో 1886 జనవరి 1న శ్రీ పరమహంస వారు "కల్పవృక్ష లీల" నెరపిన వృక్షం ఆ దివ్యలీలకు సాక్షిగా ఇప్పటికీ అక్కడ నిలచి ఉంది. ఆనాడు స్వామివారు 'నేనే భగవంతుడిని' అని నిర్ద్వంద్వంగా ప్రకటించి తమను ఆశ్రయించిన సాంసారిక శిష్యులను అందరినీ హృదయంపై స్పృశించి వారికి అలౌకికమైన సమాధి స్థితిని అనుభవింపజేశారు. ఆ మఠానికి సమీపంలోనే ఉన్న శ్మశానవాటికలో స్వామివారి బృందావనం దర్శనీయం.

    విశ్వవ్యాప్తమైన శ్రీ రామకృష్ణ మఠాలకు మూలస్థానమైన బేలూరు మఠం అత్యంత విశాలమై నయనానందకరంగా ఉంటుంది. అక్కడి ప్రధాన మందిరంలో శ్రీ రామకృష్ణ పరమహంస వారి దివ్యమంగళ మూర్తికి ఎదురుగా కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ స్వామే మనలను ఆప్యాయంగా స్పృశించి తమ ఒడిలోనికి చేర్చుకుంటున్నారా అన్న అనుభూతిని కలిగిస్తూ గంగానది పైనుంచి వీచే సాయంకాలపు మందమారుతం మనను సుతారంగా తాకుతూ ఉంటుంది.

    ఇక వైశాఖ పౌర్ణమి ముందునాటి సాయంకాల ఘడియలలో గంగాసాగర్‌లో పవిత్ర సముద్ర స్నానం అయితే మన భక్తులందరికీ ఎన్నెన్నో విశేష అనుభవాలను మిగిల్చింది. శ్రీ మాతాజీవారు శ్రీగురుపాదుకలను చేత ధరించి సముద్రంలోకి ప్రవేశిస్తే మేమందరం వారు మధ్యలో ఉండగా రెండు వరుసలలో V ఆకారంలో వారి ముందు నిలబడి స్నానానికి సిద్ధమయ్యాము. అయితే జగన్మాతను, శ్రీ గురుపాదుకలను అందుకోవాలనే ఉత్సాహంలో సముద్రుడు పెద్దపెద్ద కెరటాలతో ఎగసిపడుతూ అమ్మను సైతం రెండుసార్లు తూలిపాటుకు గురిచేశాడు. ఇక మూడవ పెద్ద కెరటం మమ్ములను సమీపిస్తూ ఉండగా క్షణంలో నాలుగవవంతు కాలం అమ్మ ఆ సముద్రుని వైపు తీక్షణంగా చూసిన చూపు ఎన్నటికీ మరువలేనిది. అంతే పులిలా వచ్చిన కెరటం పిల్లిలా మారిపోయి చిన్న అల అయి అమ్మ పాదాలకు నమస్కరించి వెనుదిరిగింది. మా అందరి స్నానాలు పూర్తి అయి, శ్రీ సద్గురు పాదుకలకు అభిషేకము, అర్చన పూర్తి అయ్యే వరకు మళ్ళీ ఒక్క పెద్ద కెరటం వస్తే ఒట్టు!

    ఇక దేశవిదేశాలలో శ్రీకృష్ణ చైతన్యాన్ని విస్తరింపజేస్తున్న మాయాపూర్ లోని ఇస్కాన్ ప్రధానకేంద్రంలో దర్శనం ఒక అద్భుత అనుభూతి. ఎన్ని వేలమంది భక్తులు ఉన్నా అక్కడ తాండవించే నిశ్శబ్దం, అంతమంది చక్కగా వరుసక్రమంలో దర్శనానికి వచ్చే క్రమశిక్షణ ముచ్చటగొలుపుతాయి. ఎటువంటి రోగాలనైనా నయం చేసే వైద్యనాథ్ జ్యోతిర్లింగం, తారకేశ్వర్, సతీదేవి మూడవకన్ను పడిన మా తారా క్షేత్రం మొదలైన చోట్ల రద్దీ ఎక్కువగా ఉన్నా దేనికదే చక్కని దర్శన అనుభూతిని కలిగించింది. శృంఖలాదేవిగా భావించబడుతున్న జగత్ గౌరీ మాత ఆ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలందరినీ సర్పబాధల నుండి రక్షిస్తూ ఉంటుంది.

    ఇక అత్యంత దుర్లభమైన కామాఖ్య అమ్మవారి దర్శనం శ్రీగురుదేవుల కృప వలన మా అందరికీ చక్కగా లభించింది. మనందరికీ మాతృస్థానమైన జగన్మాత యోని పడిన శక్తిపీఠం ఇది. అక్కడి అంతరాలయంలో పూజారి సంకల్పం చెబుతూ ఇక్కడ అమ్మ యోనిని స్పృశించిన వారికి ఇక పునర్జన్మ ఉండదు అని మంత్రాలు చదువుతూ ఉంటే "ఎన్ని జన్మములు ఎత్తితినో తల్లి, ఇంకెన్ని జన్మములు ఎత్తెదనో మళ్ళి, కన్నతల్లి మరి జన్మలనీయకు, కాత్యాయని నీ సన్నిధిలో చేర్చు" అనే కీర్తన మదిలో మెరిసింది. అంతలోనే "మనం జన్మించేది ఆ తల్లి గర్భంలో నుండి అయినప్పుడు, ఆ జగన్మాత బిడ్డగా ఎన్ని జన్మలు ఎత్తితే మటుకు తప్పేముంది?" అని కూడా అనిపించింది.

    శ్రీ గురుదేవులు పర్యటించిన ఈ దివ్య క్షేత్రాలు అన్నిటితో పాటు వారి పాదధూళికి నోచుకున్న షిల్లాంగ్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడి ప్రకృతి సౌందర్యం, ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే ప్రదర్శనశాల చూసి తీరవలసిందే. ఇక చిరపుంజిలోని నోహ్కలికై జలపాతం అయితే ఎంతసేపు చూసినా తనివి తీరలేదు. హిమాలయాలకు పాదపీఠమై, విరబోసుకున్న పరమేశ్వరుని జటాజూటం అని అర్థం కలిగిన శివాలిక్ కొండలలో నుండి క్రిందికి పడుతున్న దేశంలోనే ఎత్తైన జలపాతం ఆనాటి గంగావతరణాన్ని తలపింపజేసింది. అయితే ఆ జలపాతం వెనుక ఉన్న విషాదగాధ మాత్సర్యం ఎంతటి నీచమైనదో, శ్రీగురుదేవులు దానిని మళ్ళీ "ఈర్ష్య, అసూయత, అసహనం, ఓర్వలేనితనం" అని నాలుగుగా విభజించి ఎందుకు మాటిమాటికీ ప్రస్తావించేవారో అర్థమయ్యేలా చేసింది. కా లికాయి అనే స్త్రీ తన భర్త మరణించడంతో ద్వితీయ వివాహం చేసుకొంది. అయితే ఆ రెండవ భర్త తన భార్య తనకంటే తన సంతానమైన నెలల పాపను ఎక్కువగా ప్రేమిస్తోందనే అసూయతో ఆ పసికందును వధించి, వండి ఆ తల్లికి భోజనంగా వడ్డించాడు. తాను భుజించినది తన కన్నబిడ్డనే అని తెలుసుకొన్న ఆ తల్లి తల్లడిల్లిపోయి ఈ జలపాతంలోకి దూకి ఆత్మార్పణ చేసుకొంది.

    ఎన్నికల సమయంలో, ఫలితాల సమయంలో హింసకు ప్రసిద్ధిగాంచిన బెంగాల్ ప్రాంతంలో అదే సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదుర్కోకుండా ఈ యాత్ర జరిగిందంటే అది కేవలం శ్రీ గురుదేవుల పరమనుగ్రహం, శ్రీ మాతాజీవారు ఆదేశించి భక్తులందరితో జరిపించిన శ్రీ శివకవచ, శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణల మహాత్మ్యం అనే చెప్పాలి. భక్తజనులందరూ దిగ్విజయంగా యాత్ర ముగించుకొని, రైలు ప్రయాణంలో శ్రీగురుదేవులతో తమకు కలిగిన అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకొంటూ, శ్రీ కాళీవనాశ్రమం చేరుకొని శ్రీ రామలింగేశ్వర స్వామివారికి అభిషేకాలు, శ్రీ మహాకాళికా పరమేశ్వరీ మాతకు కుంకుమార్చనలు, హోమలు, శ్రీ సద్గురు పాదపూజతో యాత్రాఫలాన్ని శ్రీ గురుదేవుల శ్రీచరణాల సన్నిధిలో అర్పించి ధన్యులయ్యారు.

5, ఏప్రిల్ 2026, ఆదివారం

అర్థమనర్థం



అర్థమనర్థం భావయ నిత్యం
నాస్తితతః సుఖలేశస్సత్యమ్ ।
పుత్రాదపి ధనభాజాం భీతిః
సర్వత్రైషా విహితా రీతిః 

    డబ్బు యొక్క విలువ ఏమిటో ఈ భజగోవింద శ్లోకంలో జగద్గురువులు వివరిస్తున్నారు. మనందరం మన జీవితాలలో డబ్బుకి చాలా ప్రాముఖ్యత ఇస్తాం. డబ్బు ఉంటే మనం కోరుకున్న అన్ని సుఖాలూ యధేచ్చగా పొందవచ్చు అనుకుంటాం. తగినంత డబ్బు దగ్గర లేకపోతే భయపడతాం. కానీ ఇక్కడ స్వామివారు డబ్బు వలన ఏమీ ప్రయోజనం లేదని చెబుతున్నారు. అలాగే దానివలన లేశమాత్రమైనా సుఖం లేదని కూడా చెబుతున్నారు. ఇంకా డబ్బులున్నవాడు తన సొంత పుత్రునికే భయపడతాడు అని కూడా చెబుతున్నారు. అదెలాగో చూద్దాం.

    డబ్బు బహు చంచలమైనది. లక్ష్మీదేవి నామాలలో కూడా ఓం చంచలాయై నమః అని, ఓం చపలాయై నమః అని నామాలు ఉంటాయి. ఈనాడు నీ చేతిలో ఉన్న డబ్బు మర్నాడు ఎవరి చేతిలోకి వెళ్లిపోతుందో ఎవరూ చెప్పలేరు. ప్రతిరోజూ మన షేర్ మార్కెట్ ఉత్థాన పతనాలు చూస్తూనే ఉన్నాం కదా. క్షణాలలో లక్షల కోట్ల సంపద ఆవిరైపోతోంది. అలాగే డబ్బు వలన కలిగే సుఖం కూడా మన భ్రమే. శ్రీ బాబూజీ మహరాజ్ వారు చెప్పేవారు - విమానంలో ఫస్ట్‌క్లాస్‌లో  ప్రయాణిస్తున్న ధనవంతుడికి ఉన్నట్టుండి విపరీతమైన కడుపునొప్పి వస్తే ఆ విలాసవంతమైన సీటు అతనికి ఏమైనా సుఖంగా అనిపిస్తుందా?

    అలాగే డబ్బు లేనివాడు నడిరోడ్డు మీద అయినా సుఖంగా నిద్రపోతాడు. అవసరానికి మించిన డబ్బు దగ్గర పెట్టుకున్నవాడికి నిద్ర ఎక్కడిది. అనుక్షణం ఎవరు ఎటునుంచి వచ్చి తన డబ్బు కొట్టేస్తారో అని భయపడుతూనే ఉంటాడు. శ్రీ బాబూజీ మహరాజ్ వారు ఒక సంఘటన చెప్పేవారు. ఒక వ్యాపారస్తునికి తన ధోవతి లోపల గుడ్డ సంచీ కుట్టించుకొని అందులో డబ్బు పెట్టుకోవడం అలవాటు. ఒకసారి రైల్వే ప్లాట్‌ఫారం మీద పడుకోవలసి వచ్చింది. ఇంక అతనికి నిద్ర ఏమి పడుతుంది? రాత్రంతా బిక్కుబిక్కుమంటూ కూర్చొని అలసటకి రెప్పవాల్చగానే అప్పటిదాకా గమనిస్తూనే ఉన్న దొంగవాడు బ్లేడుతో అతని పంచెను కోయడం, అది తగలరాని చోట తగిలి ఇతను ఆస్పత్రిపాలు కావడం జరిగిపోయాయి.  

    అంతెందుకు 'ఈ డబ్బు నాది, నాది' అనుకునే వాడు సొంత కొడుకుని చూసినా భయపడుతూనే ఉంటాడు. తాను మధ్యవయసులో ఉన్నపుడు యవ్వనుడైన కొడుకు తన డబ్బును ఎక్కడ విలాసాలకు ఖర్చు పెట్టేస్తాడో అని భయం! తాను వృద్ధుడు అయిన తరువాత ఆస్తంతా కొడుకు చేతిలో పెడితే ఎక్కడ తనను కట్టుబట్టలతో బయటకు వెళ్ళగొడతాడో అని భయం! ప్రశాంతంగా రామా కృష్ణా అనుకోవలసిన వయసులో ఇంకా దస్తావేజులు, ఇన్కమ్‌ట్యాక్స్‌లు అనుకుంటూ శ్రమపడుతూ నిరంతరం చింతిస్తూ ఉంటాడు. వృద్ధస్తావచ్చింతాసక్తః అని మళ్ళీ జగద్గురువులే ఇక్కడ చెబుతున్నారు.

    అంతేకాదు మనలో సరైన జన్మజన్మాంతర సంస్కారం లేకపోతే ఈ డబ్బు మనలో దాగివున్న  దుష్ట గుణాలన్నింటినీ బయటకు తెస్తుంది. ఏనెలకానెల చాలీచాలని జీతంతో బ్రతికినన్నాళ్ళు మనిషి 'అందరూ నావాళ్ళే, మనకున్నది అందరితో పంచుకోవాలి' అనుకుంటాడు. ప్రేమ, అప్యాయతలు కురిపిస్తాడు. తాను వండుకున్న కాస్త అన్నమే మహాప్రసాదంగా మరునాటికి దాచుకొని మరీ తింటాడు. అదే వ్యక్తికి అనుకోకుండా ధనం వచ్చిపడితే ఇక తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ శత్రువులుగానే కనిపించడం మొదలుపెడతారు. ప్రపంచమంతా తనను దోచుకోవడానికే కాచుకొని కూర్చున్నట్లు అనిపిస్తుంది. గొప్పలకోసమో, పుణ్యంకోసమో లక్షలు, కోట్లు అవలీలగా దానం ఇచ్చేసేవాడు కూడా తన ఇంట్లో ఒక చిన్న చెంచానో, ఒక గుడ్డముక్కో కనపడకుండా పోతే సతమతమైపోతాడు. పనిమనుషుల దగ్గరనుంచి కొడుకు, కోడలు వరకు ఎవరినైనా దొంగలని నిందించడానికి వెనుకాడడు.

    సొంత మనుషులంటే కూడా ఎందుకు ఇంత భయం వస్తోంది? అని విచారిస్తే తనలో జవసత్వాలు ఉన్నంతకాలం 'ఇది మనది' అనే భావన ఏమాత్రం లేకుండా 'ఇదంతా నాదే! నా ఇష్టం వచ్చినట్లు నేను వాడుకుంటాను' అని విచ్చలవిడిగా ప్రవర్తించి చివరికి భార్య, పిల్లలను కూడా సంప్రదించకుండా అహంకారంతో పెత్తనం చలాయిస్తాడు. తీరా వృద్ధాప్యంలో జవసత్వాలు ఉడిగి, జ్ఞాపకశక్తి నశించే సమయంలో తన బిడ్డలు కూడా తనలాగే 'ఇదంతా నాది' అని ఎక్కడ లాక్కుంటారో, తన అధికారం ఎక్కడ పోతుందో అన్న భయం వెంటాడటం మొదలవుతుంది. అదే ముందునుంచి 'ఇది నాకు భగవంతుడు ఇచ్చిన ప్రసాదం. అలాగే ఈ కుటుంబం కూడా నాకు ఆయన ప్రసాదమే' అని భావిస్తూ 'ఇదంతా మనది' అనే భావన చూపిస్తూ, ప్రతి విషయం భార్య, పిల్లలతో సంప్రదించి చేసే అలవాటు ఉన్నవాడు వాడి పిల్లలలో కూడా అటువంటి సంస్కారాన్నే కలిగిస్తాడు. అప్పుడు వారు తననుంచి లాక్కుంటారనే భయం కలగదు కదా! 'ఇది నాది, దీనిమీద సర్వ హక్కులు నాకే కావాలి' అనుకున్న దుర్యోధనుడు రాజభవనంలో ఉన్నా నిరంతర చింతలోనే బ్రతికాడు. 'ఇది మనది, అందరూ మనవాళ్ళే' అనుకున్న పాండవులు అడవులలో ఉన్నా ప్రశాంతంగా జీవించారు.

    అందుకే జగద్గురువులు మళ్ళీ మూఢ జహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణామ్। యల్లభసే నిజకర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తమ్॥ అని ధనాన్ని ఎలా చూడాలో నేర్పిస్తున్నారు. ఓ మూఢుడా 'నాకు ఇంకా ఇంకా ధనం కావాలి' అనే దాహాన్ని విడిచిపెట్టు. సద్బుద్ధి కలవాడివై ధనదాహాన్ని వదిలి నీ కర్మ ఫలితంగా ఎంత ధనమైతే వస్తోందో దానితోనే నీ సంసారాన్ని గడుపుకుంటూ హాయిగా, ప్రశాంతంగా జీవించు అని బోధిస్తున్నారు. మరి  ఇక్కడ మనిషికి ఇంకా ఎదగాలి అని ఆశయం ఉండటం తప్పు ఎలా అవుతుంది? అనే ప్రశ్న వస్తుంది. అయితే మనం ఎదుగుదలని డబ్బుతోనే కొలవడం అలవాటు చేసుకున్నాం. ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అని పేరు తెచ్చుకున్నవాడు రేపు కూడా అలాగే ఉంటాడని భరోసా ఎక్కడిది? వీడిని చూసి ఇంకొకడు వీడికన్నా ఎక్కువగా ఎదుగుతాడు. ఇది ఒక అంతులేని పరుగుపందెం. మళ్ళీ ఇక్కడ జగద్గురువులు ఈ పరుగుపందెం గురించి యావద్విత్తోపార్జనసక్తః తావన్నిజపరివారో రక్తః। పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాం కోఽపి న పృచ్ఛతి గేహే।। అని చెప్తున్నారు. పైన చెప్పినట్లుగా కుటుంబంలో అప్యాయతలను, సమష్టి భావనను వదిలివేసి 'నా చేతిలో డబ్బు ఉన్నంతకాలం నేనే రాజుని' అని విర్రవీగుతూ డబ్బు వెనుక పరుగెట్టేవాడిని కుటుంబసభ్యులు కూడా అంతవరకే గౌరవిస్తారు. ఒక్కసారి సంపాదన ఆగిపోయిందంటే కనీసం 'బాగున్నావా? తిన్నావా?' అని అడిగేవాడు కూడా ఉండడు. ఇంక వాడు ఏమి సాధించినట్లు?

    ఈ పరుగులలో పడి అసలు మన లక్ష్యం ఏమిటి, మన జీవితం ఎందుకు వచ్చింది అనే విషయాన్నే మర్చిపోతున్నాం. ఎంత సంపాదించినా చివరికి వట్టి చేతులతో మట్టిపాలు కావలసిందే కానీ ఇక్కడినుండి పరలోకానికి ఒక్కపైసా తీసుకెళ్ళినవాడు ఎవడూ లేడు. ఒకవేళ తీసుకెళ్ళినా అది అక్కడ చెల్లదు. అందుకే జగద్గురువులు మళ్ళీ మా కురు ధన-జన-యౌవన-గర్వం హరతి నిమేషాత్కాలః సర్వమ్। మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా॥ అని చెబుతున్నారు. 'నాకు ఇంత ధనం ఉంది. నా వెనకాల ఇంత బలగం ఉంది. నాకు యవ్వనం ఉంది. ఏదైనా అవలీలగా చేసేయగలను' అని విర్రవీగకు. ఇవన్నీ ఒక్కనిమిషంలో కాలం హరించివేస్తుంది. ఇదంతా మాయ అని తెలుసుకొని నీ స్వస్వరూప స్థితి అయిన బ్రహ్మపదాన్ని చేరుకోవడానికి ప్రయత్నించమని బోధిస్తున్నారు. 

    ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథమ్| ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్|| నేడు నాకు ఇంతటి సంపద లభించింది, నా కోరికలన్నీ ఈరోజే తీర్చుకుంటాను. నా దగ్గర ఈ ధనముంది, అలాగే, భవిష్యత్తులో ఇంకా చాలా ధనం నాకే వస్తుంది అనే ఆలోచనలన్నీ అసుర స్వభావం వలన కలిగేవే అని భగవద్గీతలో 16వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు. అంతే కాదు ఇలాంటివారు 'ఈ శత్రువు నా చేతిలో చచ్చాడు, మిగిలిన వారిని కూడా చంపుతాను, నేను ప్రభువును, భోగిని, సిద్ధుడిని, బలవంతుణ్ణి, సుఖవంతుణ్ణి, నేను గొప్పవాడిని, నా కులం గొప్పది, నా వెనుక ఇంత బలగం ఉంది, నాకు సముడెవ్వడు? యజ్ఞం చేస్తాను, దానం ఇస్తాను, ఆనందిస్తాను' ఇలాంటి భావనలతో అవివేకంలో, మోహంలో పడి చివరికి నరకం పాలవుతున్నారు అని కూడా చెప్పారు.

    మరి మన ధనాన్ని ఎలా చూడాలి? ఎలా అనుభవించాలి? అని ప్రశ్న వస్తుంది. దీనికి శ్రీ బాబూజీ మహరాజ్ వారు 'ఒక బ్యాంకు ఉద్యోగి చేతులమీదుగా రోజూ అనేక లక్షల రూపాయల వ్యవహారం జరుగుతూ ఉంటుంది. కానీ అతనికి ఆ రూపాయలపై ఎటువంటి మమకారం ఉండదు. ఒకవేళ అలాంటి మమకారం ఏర్పడిన మరుక్షణం అతను జైలు పాలవుతాడు. అలాగే భక్తుడు తన సంసారం పట్ల శ్రద్ధ, ప్రేమ, బాధ్యతలతో వ్యవహరించాలి కానీ మమకారం పెంచుకోకూడదు. అది బంధనానికి దారి తీస్తుంది' అని, 'నీ ధనానికి నిన్ను నువ్వు ఒక ధర్మకర్తగా భావించుకో కానీ ఒక యజమానిగా కాదు' అని బోధించారు. ధనానికి మూడు గతులు ఉంటాయని భర్తృహరి దానం భోగో నాశస్తిస్రో గతయో భవంతి విత్తస్య। యో న దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి॥ దానము, భోగము, నాశము అని ధనానికి మూడు గతులు ఉంటాయి. ఎవరైతే దానమివ్వకుండా, తాము అనుభవించకుండా దాచిపెట్టుకుంటారో అట్టి ధనానికి మూడవదైన నాశం కలుగుతుంది అని చెప్పాడు. ఇందులో ఉత్తమ గతి మనకు ఉన్నంతలో ఎదుటివారికి దానం చేయడం. అది కూడా గొప్పలకోసం, పుణ్యంకోసం, ప్రతిఫలం కోసం కాకుండా దేశ కాల పాత్రతలను ఎరిగి దానం చేయాలని భగవద్గీత బోధిస్తోంది. ఇక తనకు ఉన్నదానిని కనీసం తానైనా అనుభవించడం మధ్యమ గతి. ఈ రెండు చేయనివారి ధనం దొంగలపాలో, రాజులపాలో, అగ్నిపాలో అయిపోతుందని శాస్త్రం చెబుతోంది.   

    మన సంస్కృతి విత్తం కంటే విద్యకే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుడున్ విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లే దిలన్ విద్య నృపాల పూజితము విద్య నెరుంగనివాడు మర్త్యుడే అన్నాడు భర్తృహరి. డబ్బులున్నవాడు తన ఊరిలోనే గౌరవించబడతాడు. అది కూడా తన అవసరం ఉన్న కొందరిచేతనే! ఎప్పుడైతే వాడితో అవసరం తీరిపోతుందో, లేదా వీడు పిసినారివాడు, ఎలాగూ మనకు సహాయం చేయడు అనుకుంటారో అప్పుడే వాడిని గౌరవించడం మానేస్తారు. కానీ విద్య ఉన్నవాడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా గౌరవింపబడతాడు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం - మన రూపాయలు వేరే దేశానికి తీసుకెళ్తే ఎందుకూ పనికిరావు. అక్కడి ధనం రూపంలోకి మార్చుకున్నా వాటి విలువ చాలా తగ్గిపోతుంది. అయితే సరైన విద్య ఎక్కడైనా ఒకేరకంగా పనికివస్తుంది.

    మరి నిజమైన ధనం ఏమిటి? దేనిని సంపాదిస్తే అది మనదగ్గర శాశ్వతంగా ఉంటుంది? అని ఆలోచిస్తే శ్రీగురుదేవులు 'నామస్మరణ ధనమే నీ ధనము' అని అందించారు. 'నామ్ ధన్ కా ఖజానా బఢాతే చలో' అని కూడా అందించారు. 'భగవత్స్మరణలో, సత్సంగంలో గడిపిన కాలమంతా నీ నిత్యకాలంలో జమ అవుతుంది' అని కూడా బోధించారు. కలియుగంలో మనం సంపాదించుకోవలసిన, జమ చేసుకోవలసిన ధనం నామస్మరణ ధనం ఒక్కటే. ఈ కలియుగంలో సంసార బంధనాల నుంచి ముక్తిని పొందడానికి అంతకంటే వేరొక ఉపాయం ఏదీ లేదని కలిసంతరణ ఉపనిషత్తు బోధిస్తోంది. నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే।

19, మార్చి 2026, గురువారం

పరాభవ



ఉగాది వచ్చేస్తోంది. తొందరగా ఒక పంచాంగం కొనుక్కొని నా రాశిఫలాలు చూసుకోవాలి. 

బాబూ! ఒక పంచాంగం ఇవ్వమ్మా!

    అయ్యో! సరిపోయింది! అసలే నా రాశికి ప్రతి సంవత్సరం రాజయోగం తక్కువ, అవమానం ఎక్కువ అని ఏడుస్తూ ఉంటే ఈసారి ఏకంగా సంవత్సరం పేరే 'పరాభవ'నా? భగవంతుడా! ఇక నా జీవితం తెల్లారినట్లే. 

    అయినా నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను? ఒకసారి ఈ పేరుని విడదీసి అసలు అర్థం ఏమిటో విచారిస్తాను. భవము అంటే పుట్టుక. మరి పరా అంటే? మనకన్నా వేరుగా ఉన్నది, గొప్పది అని అర్థం వస్తుంది కదా! భగవద్గీతలో స్వామి 'ఇంద్రియాణి పరాణ్యాహుః ఇన్ద్రియేభ్యః పరం మనః| మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః || 3-42||' అని చెప్పారు కదా! అంటే ఇంద్రియాలు గొప్పవి. వాటికంటే మనస్సు గొప్పది. దానికంటే బుద్ధి గొప్పది. అయితే ఆ బుద్ధి కంటే గొప్పదై వీటన్నింటినీ ప్రకాశింపజేసేది ఆత్మవస్తువు. ఆ ఆత్మవస్తువే 'పరా'. దానినుంచి ఉద్భవించిన మనం పరాభవులం. ఆత్మనుంచి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృధ్వి, ఓషధులు, అన్నము, పురుషుడు ఇలా ఒక క్రమంలో ఉద్భవించాయని ఉపనిషద్వాక్యం కదా!

    అలాగే మన వాక్కును కూడా నాలుగు రకాలుగా చెప్పారు కదా! పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరీ - మనలో నిరంతరం కలిగే సంకల్పాలకు బీజరూపం పరా. అంటే సంకల్పం కంటే ముందు స్థితి. దీనికి భాష, రూపము ఉండవు. నీలో సంకల్పం కలగడానికి ఆరు నెలల ముందే నాకు తెలుస్తుంది అని శ్రీ బాబూజీ మహరాజ్ వారు చెప్పేవారు కదా! ఆ మునుపటి స్థితే పరా. ఆ తరువాత అది మెల్లగా ఒక రూపాన్ని సంతరించుకొని ఆలోచనగా పరివర్తన చెందుతుంది. అదే పశ్యంతి. ఆ ఆలోచన ఒక భాషను ఆధారం చేసుకొని వృద్ధి పొంది పదాలుగా, వాక్యాలుగా విస్తృతం అవుతుంది. అయినా ఇంకా మనస్సులోనే ఉంటుంది. అది మధ్యమా వాక్కు. ఎప్పుడైతే అది మన ముఖస్తుగా వెలువడి బయటి వారికి వినిపించే రూపాన్ని పొందుతుందో అప్పుడది వైఖరీ అని పిలువబడుతుంది.

    మనం రోజూ చదివే నారాయణోపనిషత్తులో చూస్తే నారాయణుని బీజరూపమైన సంకల్పం నుండి ముందుగా ప్రాణము, మనస్సు, ఇంద్రియములు, పంచభూతములు, బ్రహ్మాది దేవతలు, ఈ సకల చరాచర సృష్టి ఉద్భవించిందని చెబుతోంది కదా! అంటే మనందరము ఆ పరవస్తువైన నారాయణుని నుంచే ఉద్భవించాము కదా! అందుకే శ్రీ గురుదేవులు ఎప్పుడూ 'పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ' అనే శ్లోకాన్ని ఇష్టపడేవారు కారు. "నువ్వు పాప సంభవుడవు కావు. ఆత్మ సంభవుడవు. అది గుర్తించక నేను పాపిని అనుకొని బంధానికి లోనవుతున్నావు. నువ్వు మేకల మధ్యలో పెరిగిన సింహానివే కానీ మేకవు కావు. నీ నిజస్వరూపాన్ని నువ్వు దర్శిస్తే నువ్వు ఎప్పుడూ ముక్తపురుషుడవే" అని చెప్పేవారు. కాబట్టి మనమే పరాభవులం.

    ఇంకొక రకంగా ఆలోచిస్తే పరులనుంచి మనకు కలిగేది పరాభవం. ఎవరో ఏదో అన్నారని, లేదా అంటారని నిత్యం మనని మనం మార్చుకుంటూ, వాళ్ళ మెప్పు పొందాలని తహతహలాడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మన మనస్సు బైటినుంచి వచ్చే తన్మాత్రలకు ప్రతిస్పందించడం మానేసి పరమైన ఆత్మలో లీనమై ఉంటుందో అప్పుడు మనకు పరాభవమే ఉండదు కదా! స్థితప్రజ్ఞ లక్షణం అదే కదా! తనను తాను గుర్తించి సదా స్వస్వరూప స్థితిలో ఓలలాడే మహాత్ముని ఎవరు పరాభవించగలరు? అటువంటి వ్యక్తికి రాజపూజ్యం అవమానం మధ్య తేడా ఏమి తెలుస్తుంది? అవి వారిని చలింపజేయలేవు కదా!

    కాబట్టి ఈ అల్పమైన రాశిఫలాలను వదిలేసి అత్యుత్తమమైన మన పరాస్థితిని తెలుసుకోమని ఈ పరాభవ నామ సంవత్సరం మనకు సందేశం ఇస్తోంది. చూశావా! నిరాశా నిస్పృహల నుంచి కూడా శ్రీ గురుదేవులు ఎటువంటి విచారణను కలిగించి దివ్య సందేశాన్ని అందించారో. దేశకాలాలు ఏవైనా నిరంతరం ఇటువంటి సద్విచారణ మాలో నిలబడాలని ఆశీర్వదించండి గురుదేవా!