5, ఏప్రిల్ 2026, ఆదివారం

అర్థమనర్థం



అర్థమనర్థం భావయ నిత్యం
నాస్తితతః సుఖలేశస్సత్యమ్ ।
పుత్రాదపి ధనభాజాం భీతిః
సర్వత్రైషా విహితా రీతిః 

    డబ్బు యొక్క విలువ ఏమిటో ఈ భజగోవింద శ్లోకంలో జగద్గురువులు వివరిస్తున్నారు. మనందరం మన జీవితాలలో డబ్బుకి చాలా ప్రాముఖ్యత ఇస్తాం. డబ్బు ఉంటే మనం కోరుకున్న అన్ని సుఖాలూ యధేచ్చగా పొందవచ్చు అనుకుంటాం. తగినంత డబ్బు దగ్గర లేకపోతే భయపడతాం. కానీ ఇక్కడ స్వామివారు డబ్బు వలన ఏమీ ప్రయోజనం లేదని చెబుతున్నారు. అలాగే దానివలన లేశమాత్రమైనా సుఖం లేదని కూడా చెబుతున్నారు. ఇంకా డబ్బులున్నవాడు తన సొంత పుత్రునికే భయపడతాడు అని కూడా చెబుతున్నారు. అదెలాగో చూద్దాం.

    డబ్బు బహు చంచలమైనది. లక్ష్మీదేవి నామాలలో కూడా ఓం చంచలాయై నమః అని, ఓం చపలాయై నమః అని నామాలు ఉంటాయి. ఈనాడు నీ చేతిలో ఉన్న డబ్బు మర్నాడు ఎవరి చేతిలోకి వెళ్లిపోతుందో ఎవరూ చెప్పలేరు. ప్రతిరోజూ మన షేర్ మార్కెట్ ఉత్థాన పతనాలు చూస్తూనే ఉన్నాం కదా. క్షణాలలో లక్షల కోట్ల సంపద ఆవిరైపోతోంది. అలాగే డబ్బు వలన కలిగే సుఖం కూడా మన భ్రమే. శ్రీ బాబూజీ మహరాజ్ వారు చెప్పేవారు - విమానంలో ఫస్ట్‌క్లాస్‌లో  ప్రయాణిస్తున్న ధనవంతుడికి ఉన్నట్టుండి విపరీతమైన కడుపునొప్పి వస్తే ఆ విలాసవంతమైన సీటు అతనికి ఏమైనా సుఖంగా అనిపిస్తుందా?

    అలాగే డబ్బు లేనివాడు నడిరోడ్డు మీద అయినా సుఖంగా నిద్రపోతాడు. అవసరానికి మించిన డబ్బు దగ్గర పెట్టుకున్నవాడికి నిద్ర ఎక్కడిది. అనుక్షణం ఎవరు ఎటునుంచి వచ్చి తన డబ్బు కొట్టేస్తారో అని భయపడుతూనే ఉంటాడు. శ్రీ బాబూజీ మహరాజ్ వారు ఒక సంఘటన చెప్పేవారు. ఒక వ్యాపారస్తునికి తన ధోవతి లోపల గుడ్డ సంచీ కుట్టించుకొని అందులో డబ్బు పెట్టుకోవడం అలవాటు. ఒకసారి రైల్వే ప్లాట్‌ఫారం మీద పడుకోవలసి వచ్చింది. ఇంక అతనికి నిద్ర ఏమి పడుతుంది? రాత్రంతా బిక్కుబిక్కుమంటూ కూర్చొని అలసటకి రెప్పవాల్చగానే అప్పటిదాకా గమనిస్తూనే ఉన్న దొంగవాడు బ్లేడుతో అతని పంచెను కోయడం, అది తగలరాని చోట తగిలి ఇతను ఆస్పత్రిపాలు కావడం జరిగిపోయాయి.  

    అంతెందుకు 'ఈ డబ్బు నాది, నాది' అనుకునే వాడు సొంత కొడుకుని చూసినా భయపడుతూనే ఉంటాడు. తాను మధ్యవయసులో ఉన్నపుడు యవ్వనుడైన కొడుకు తన డబ్బును ఎక్కడ విలాసాలకు ఖర్చు పెట్టేస్తాడో అని భయం! తాను వృద్ధుడు అయిన తరువాత ఆస్తంతా కొడుకు చేతిలో పెడితే ఎక్కడ తనను కట్టుబట్టలతో బయటకు వెళ్ళగొడతాడో అని భయం! ప్రశాంతంగా రామా కృష్ణా అనుకోవలసిన వయసులో ఇంకా దస్తావేజులు, ఇన్కమ్‌ట్యాక్స్‌లు అనుకుంటూ శ్రమపడుతూ నిరంతరం చింతిస్తూ ఉంటాడు. వృద్ధస్తావచ్చింతాసక్తః అని మళ్ళీ జగద్గురువులే ఇక్కడ చెబుతున్నారు.

    అంతేకాదు మనలో సరైన జన్మజన్మాంతర సంస్కారం లేకపోతే ఈ డబ్బు మనలో దాగివున్న  దుష్ట గుణాలన్నింటినీ బయటకు తెస్తుంది. ఏనెలకానెల చాలీచాలని జీతంతో బ్రతికినన్నాళ్ళు మనిషి 'అందరూ నావాళ్ళే, మనకున్నది అందరితో పంచుకోవాలి' అనుకుంటాడు. ప్రేమ, అప్యాయతలు కురిపిస్తాడు. తాను వండుకున్న కాస్త అన్నమే మహాప్రసాదంగా మరునాటికి దాచుకొని మరీ తింటాడు. అదే వ్యక్తికి అనుకోకుండా ధనం వచ్చిపడితే ఇక తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ శత్రువులుగానే కనిపించడం మొదలుపెడతారు. ప్రపంచమంతా తనను దోచుకోవడానికే కాచుకొని కూర్చున్నట్లు అనిపిస్తుంది. గొప్పలకోసమో, పుణ్యంకోసమో లక్షలు, కోట్లు అవలీలగా దానం ఇచ్చేసేవాడు కూడా తన ఇంట్లో ఒక చిన్న చెంచానో, ఒక గుడ్డముక్కో కనపడకుండా పోతే సతమతమైపోతాడు. పనిమనుషుల దగ్గరనుంచి కొడుకు, కోడలు వరకు ఎవరినైనా దొంగలని నిందించడానికి వెనుకాడడు.

    సొంత మనుషులంటే కూడా ఎందుకు ఇంత భయం వస్తోంది? అని విచారిస్తే తనలో జవసత్వాలు ఉన్నంతకాలం 'ఇది మనది' అనే భావన ఏమాత్రం లేకుండా 'ఇదంతా నాదే! నా ఇష్టం వచ్చినట్లు నేను వాడుకుంటాను' అని విచ్చలవిడిగా ప్రవర్తించి చివరికి భార్య, పిల్లలను కూడా సంప్రదించకుండా అహంకారంతో పెత్తనం చలాయిస్తాడు. తీరా వృద్ధాప్యంలో జవసత్వాలు ఉడిగి, జ్ఞాపకశక్తి నశించే సమయంలో తన బిడ్డలు కూడా తనలాగే 'ఇదంతా నాది' అని ఎక్కడ లాక్కుంటారో, తన అధికారం ఎక్కడ పోతుందో అన్న భయం వెంటాడటం మొదలవుతుంది. అదే ముందునుంచి 'ఇది నాకు భగవంతుడు ఇచ్చిన ప్రసాదం. అలాగే ఈ కుటుంబం కూడా నాకు ఆయన ప్రసాదమే' అని భావిస్తూ 'ఇదంతా మనది' అనే భావన చూపిస్తూ, ప్రతి విషయం భార్య, పిల్లలతో సంప్రదించి చేసే అలవాటు ఉన్నవాడు వాడి పిల్లలలో కూడా అటువంటి సంస్కారాన్నే కలిగిస్తాడు. అప్పుడు వారు తననుంచి లాక్కుంటారనే భయం కలగదు కదా! 'ఇది నాది, దీనిమీద సర్వ హక్కులు నాకే కావాలి' అనుకున్న దుర్యోధనుడు రాజభవనంలో ఉన్నా నిరంతర చింతలోనే బ్రతికాడు. 'ఇది మనది, అందరూ మనవాళ్ళే' అనుకున్న పాండవులు అడవులలో ఉన్నా ప్రశాంతంగా జీవించారు.

    అందుకే జగద్గురువులు మళ్ళీ మూఢ జహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణామ్। యల్లభసే నిజకర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తమ్॥ అని ధనాన్ని ఎలా చూడాలో నేర్పిస్తున్నారు. ఓ మూఢుడా 'నాకు ఇంకా ఇంకా ధనం కావాలి' అనే దాహాన్ని విడిచిపెట్టు. సద్బుద్ధి కలవాడివై ధనదాహాన్ని వదిలి నీ కర్మ ఫలితంగా ఎంత ధనమైతే వస్తోందో దానితోనే నీ సంసారాన్ని గడుపుకుంటూ హాయిగా, ప్రశాంతంగా జీవించు అని బోధిస్తున్నారు. మరి  ఇక్కడ మనిషికి ఇంకా ఎదగాలి అని ఆశయం ఉండటం తప్పు ఎలా అవుతుంది? అనే ప్రశ్న వస్తుంది. అయితే మనం ఎదుగుదలని డబ్బుతోనే కొలవడం అలవాటు చేసుకున్నాం. ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అని పేరు తెచ్చుకున్నవాడు రేపు కూడా అలాగే ఉంటాడని భరోసా ఎక్కడిది? వీడిని చూసి ఇంకొకడు వీడికన్నా ఎక్కువగా ఎదుగుతాడు. ఇది ఒక అంతులేని పరుగుపందెం. మళ్ళీ ఇక్కడ జగద్గురువులు ఈ పరుగుపందెం గురించి యావద్విత్తోపార్జనసక్తః తావన్నిజపరివారో రక్తః। పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాం కోఽపి న పృచ్ఛతి గేహే।। అని చెప్తున్నారు. పైన చెప్పినట్లుగా కుటుంబంలో అప్యాయతలను, సమష్టి భావనను వదిలివేసి 'నా చేతిలో డబ్బు ఉన్నంతకాలం నేనే రాజుని' అని విర్రవీగుతూ డబ్బు వెనుక పరుగెట్టేవాడిని కుటుంబసభ్యులు కూడా అంతవరకే గౌరవిస్తారు. ఒక్కసారి సంపాదన ఆగిపోయిందంటే కనీసం 'బాగున్నావా? తిన్నావా?' అని అడిగేవాడు కూడా ఉండడు. ఇంక వాడు ఏమి సాధించినట్లు?

    ఈ పరుగులలో పడి అసలు మన లక్ష్యం ఏమిటి, మన జీవితం ఎందుకు వచ్చింది అనే విషయాన్నే మర్చిపోతున్నాం. ఎంత సంపాదించినా చివరికి వట్టి చేతులతో మట్టిపాలు కావలసిందే కానీ ఇక్కడినుండి పరలోకానికి ఒక్కపైసా తీసుకెళ్ళినవాడు ఎవడూ లేడు. ఒకవేళ తీసుకెళ్ళినా అది అక్కడ చెల్లదు. అందుకే జగద్గురువులు మళ్ళీ మా కురు ధన-జన-యౌవన-గర్వం హరతి నిమేషాత్కాలః సర్వమ్। మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా॥ అని చెబుతున్నారు. 'నాకు ఇంత ధనం ఉంది. నా వెనకాల ఇంత బలగం ఉంది. నాకు యవ్వనం ఉంది. ఏదైనా అవలీలగా చేసేయగలను' అని విర్రవీగకు. ఇవన్నీ ఒక్కనిమిషంలో కాలం హరించివేస్తుంది. ఇదంతా మాయ అని తెలుసుకొని నీ స్వస్వరూప స్థితి అయిన బ్రహ్మపదాన్ని చేరుకోవడానికి ప్రయత్నించమని బోధిస్తున్నారు. 

    ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథమ్| ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్|| నేడు నాకు ఇంతటి సంపద లభించింది, నా కోరికలన్నీ ఈరోజే తీర్చుకుంటాను. నా దగ్గర ఈ ధనముంది, అలాగే, భవిష్యత్తులో ఇంకా చాలా ధనం నాకే వస్తుంది అనే ఆలోచనలన్నీ అసుర స్వభావం వలన కలిగేవే అని భగవద్గీతలో 16వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు. అంతే కాదు ఇలాంటివారు 'ఈ శత్రువు నా చేతిలో చచ్చాడు, మిగిలిన వారిని కూడా చంపుతాను, నేను ప్రభువును, భోగిని, సిద్ధుడిని, బలవంతుణ్ణి, సుఖవంతుణ్ణి, నేను గొప్పవాడిని, నా కులం గొప్పది, నా వెనుక ఇంత బలగం ఉంది, నాకు సముడెవ్వడు? యజ్ఞం చేస్తాను, దానం ఇస్తాను, ఆనందిస్తాను' ఇలాంటి భావనలతో అవివేకంలో, మోహంలో పడి చివరికి నరకం పాలవుతున్నారు అని కూడా చెప్పారు.

    మరి మన ధనాన్ని ఎలా చూడాలి? ఎలా అనుభవించాలి? అని ప్రశ్న వస్తుంది. దీనికి శ్రీ బాబూజీ మహరాజ్ వారు 'ఒక బ్యాంకు ఉద్యోగి చేతులమీదుగా రోజూ అనేక లక్షల రూపాయల వ్యవహారం జరుగుతూ ఉంటుంది. కానీ అతనికి ఆ రూపాయలపై ఎటువంటి మమకారం ఉండదు. ఒకవేళ అలాంటి మమకారం ఏర్పడిన మరుక్షణం అతను జైలు పాలవుతాడు. అలాగే భక్తుడు తన సంసారం పట్ల శ్రద్ధ, ప్రేమ, బాధ్యతలతో వ్యవహరించాలి కానీ మమకారం పెంచుకోకూడదు. అది బంధనానికి దారి తీస్తుంది' అని, 'నీ ధనానికి నిన్ను నువ్వు ఒక ధర్మకర్తగా భావించుకో కానీ ఒక యజమానిగా కాదు' అని బోధించారు. ధనానికి మూడు గతులు ఉంటాయని భర్తృహరి దానం భోగో నాశస్తిస్రో గతయో భవంతి విత్తస్య। యో న దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి॥ దానము, భోగము, నాశము అని ధనానికి మూడు గతులు ఉంటాయి. ఎవరైతే దానమివ్వకుండా, తాము అనుభవించకుండా దాచిపెట్టుకుంటారో అట్టి ధనానికి మూడవదైన నాశం కలుగుతుంది అని చెప్పాడు. ఇందులో ఉత్తమ గతి మనకు ఉన్నంతలో ఎదుటివారికి దానం చేయడం. అది కూడా గొప్పలకోసం, పుణ్యంకోసం, ప్రతిఫలం కోసం కాకుండా దేశ కాల పాత్రతలను ఎరిగి దానం చేయాలని భగవద్గీత బోధిస్తోంది. ఇక తనకు ఉన్నదానిని కనీసం తానైనా అనుభవించడం మధ్యమ గతి. ఈ రెండు చేయనివారి ధనం దొంగలపాలో, రాజులపాలో, అగ్నిపాలో అయిపోతుందని శాస్త్రం చెబుతోంది.   

    మన సంస్కృతి విత్తం కంటే విద్యకే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుడున్ విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లే దిలన్ విద్య నృపాల పూజితము విద్య నెరుంగనివాడు మర్త్యుడే అన్నాడు భర్తృహరి. డబ్బులున్నవాడు తన ఊరిలోనే గౌరవించబడతాడు. అది కూడా తన అవసరం ఉన్న కొందరిచేతనే! ఎప్పుడైతే వాడితో అవసరం తీరిపోతుందో, లేదా వీడు పిసినారివాడు, ఎలాగూ మనకు సహాయం చేయడు అనుకుంటారో అప్పుడే వాడిని గౌరవించడం మానేస్తారు. కానీ విద్య ఉన్నవాడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా గౌరవింపబడతాడు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం - మన రూపాయలు వేరే దేశానికి తీసుకెళ్తే ఎందుకూ పనికిరావు. అక్కడి ధనం రూపంలోకి మార్చుకున్నా వాటి విలువ చాలా తగ్గిపోతుంది. అయితే సరైన విద్య ఎక్కడైనా ఒకేరకంగా పనికివస్తుంది.

    మరి నిజమైన ధనం ఏమిటి? దేనిని సంపాదిస్తే అది మనదగ్గర శాశ్వతంగా ఉంటుంది? అని ఆలోచిస్తే శ్రీగురుదేవులు 'నామస్మరణ ధనమే నీ ధనము' అని అందించారు. 'నామ్ ధన్ కా ఖజానా బఢాతే చలో' అని కూడా అందించారు. 'భగవత్స్మరణలో, సత్సంగంలో గడిపిన కాలమంతా నీ నిత్యకాలంలో జమ అవుతుంది' అని కూడా బోధించారు. కలియుగంలో మనం సంపాదించుకోవలసిన, జమ చేసుకోవలసిన ధనం నామస్మరణ ధనం ఒక్కటే. ఈ కలియుగంలో సంసార బంధనాల నుంచి ముక్తిని పొందడానికి అంతకంటే వేరొక ఉపాయం ఏదీ లేదని కలిసంతరణ ఉపనిషత్తు బోధిస్తోంది. నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే।

19, మార్చి 2026, గురువారం

పరాభవ



ఉగాది వచ్చేస్తోంది. తొందరగా ఒక పంచాంగం కొనుక్కొని నా రాశిఫలాలు చూసుకోవాలి. 

బాబూ! ఒక పంచాంగం ఇవ్వమ్మా!

    అయ్యో! సరిపోయింది! అసలే నా రాశికి ప్రతి సంవత్సరం రాజయోగం తక్కువ, అవమానం ఎక్కువ అని ఏడుస్తూ ఉంటే ఈసారి ఏకంగా సంవత్సరం పేరే 'పరాభవ'నా? భగవంతుడా! ఇక నా జీవితం తెల్లారినట్లే. 

    అయినా నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను? ఒకసారి ఈ పేరుని విడదీసి అసలు అర్థం ఏమిటో విచారిస్తాను. భవము అంటే పుట్టుక. మరి పరా అంటే? మనకన్నా వేరుగా ఉన్నది, గొప్పది అని అర్థం వస్తుంది కదా! భగవద్గీతలో స్వామి 'ఇంద్రియాణి పరాణ్యాహుః ఇన్ద్రియేభ్యః పరం మనః| మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః || 3-42||' అని చెప్పారు కదా! అంటే ఇంద్రియాలు గొప్పవి. వాటికంటే మనస్సు గొప్పది. దానికంటే బుద్ధి గొప్పది. అయితే ఆ బుద్ధి కంటే గొప్పదై వీటన్నింటినీ ప్రకాశింపజేసేది ఆత్మవస్తువు. ఆ ఆత్మవస్తువే 'పరా'. దానినుంచి ఉద్భవించిన మనం పరాభవులం. ఆత్మనుంచి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృధ్వి, ఓషధులు, అన్నము, పురుషుడు ఇలా ఒక క్రమంలో ఉద్భవించాయని ఉపనిషద్వాక్యం కదా!

    అలాగే మన వాక్కును కూడా నాలుగు రకాలుగా చెప్పారు కదా! పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరీ - మనలో నిరంతరం కలిగే సంకల్పాలకు బీజరూపం పరా. అంటే సంకల్పం కంటే ముందు స్థితి. దీనికి భాష, రూపము ఉండవు. నీలో సంకల్పం కలగడానికి ఆరు నెలల ముందే నాకు తెలుస్తుంది అని శ్రీ బాబూజీ మహరాజ్ వారు చెప్పేవారు కదా! ఆ మునుపటి స్థితే పరా. ఆ తరువాత అది మెల్లగా ఒక రూపాన్ని సంతరించుకొని ఆలోచనగా పరివర్తన చెందుతుంది. అదే పశ్యంతి. ఆ ఆలోచన ఒక భాషను ఆధారం చేసుకొని వృద్ధి పొంది పదాలుగా, వాక్యాలుగా విస్తృతం అవుతుంది. అయినా ఇంకా మనస్సులోనే ఉంటుంది. అది మధ్యమా వాక్కు. ఎప్పుడైతే అది మన ముఖస్తుగా వెలువడి బయటి వారికి వినిపించే రూపాన్ని పొందుతుందో అప్పుడది వైఖరీ అని పిలువబడుతుంది.

    మనం రోజూ చదివే నారాయణోపనిషత్తులో చూస్తే నారాయణుని బీజరూపమైన సంకల్పం నుండి ముందుగా ప్రాణము, మనస్సు, ఇంద్రియములు, పంచభూతములు, బ్రహ్మాది దేవతలు, ఈ సకల చరాచర సృష్టి ఉద్భవించిందని చెబుతోంది కదా! అంటే మనందరము ఆ పరవస్తువైన నారాయణుని నుంచే ఉద్భవించాము కదా! అందుకే శ్రీ గురుదేవులు ఎప్పుడూ 'పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ' అనే శ్లోకాన్ని ఇష్టపడేవారు కారు. "నువ్వు పాప సంభవుడవు కావు. ఆత్మ సంభవుడవు. అది గుర్తించక నేను పాపిని అనుకొని బంధానికి లోనవుతున్నావు. నువ్వు మేకల మధ్యలో పెరిగిన సింహానివే కానీ మేకవు కావు. నీ నిజస్వరూపాన్ని నువ్వు దర్శిస్తే నువ్వు ఎప్పుడూ ముక్తపురుషుడవే" అని చెప్పేవారు. కాబట్టి మనమే పరాభవులం.

    ఇంకొక రకంగా ఆలోచిస్తే పరులనుంచి మనకు కలిగేది పరాభవం. ఎవరో ఏదో అన్నారని, లేదా అంటారని నిత్యం మనని మనం మార్చుకుంటూ, వాళ్ళ మెప్పు పొందాలని తహతహలాడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మన మనస్సు బైటినుంచి వచ్చే తన్మాత్రలకు ప్రతిస్పందించడం మానేసి పరమైన ఆత్మలో లీనమై ఉంటుందో అప్పుడు మనకు పరాభవమే ఉండదు కదా! స్థితప్రజ్ఞ లక్షణం అదే కదా! తనను తాను గుర్తించి సదా స్వస్వరూప స్థితిలో ఓలలాడే మహాత్ముని ఎవరు పరాభవించగలరు? అటువంటి వ్యక్తికి రాజపూజ్యం అవమానం మధ్య తేడా ఏమి తెలుస్తుంది? అవి వారిని చలింపజేయలేవు కదా!

    కాబట్టి ఈ అల్పమైన రాశిఫలాలను వదిలేసి అత్యుత్తమమైన మన పరాస్థితిని తెలుసుకోమని ఈ పరాభవ నామ సంవత్సరం మనకు సందేశం ఇస్తోంది. చూశావా! నిరాశా నిస్పృహల నుంచి కూడా శ్రీ గురుదేవులు ఎటువంటి విచారణను కలిగించి దివ్య సందేశాన్ని అందించారో. దేశకాలాలు ఏవైనా నిరంతరం ఇటువంటి సద్విచారణ మాలో నిలబడాలని ఆశీర్వదించండి గురుదేవా!

15, ఫిబ్రవరి 2026, ఆదివారం

ఓం పూష దంతభిదే నమః



    శ్రీ శివ అష్టోత్తర శతనామావళిలో ఒక నామం ఓం పూష దంతభిదే నమః. పూష అనేది సూర్యభగవానుని నామం. లోకానికంతటికీ పోషణనిచ్చేది సూర్యుడే కదా. మరి అటువంటి సూర్యుడికే పోషణకు అవసరమైన దంతాలు లేకుండా పరమేశ్వరుడు ఎందుకు వాటిని భేదనం చేయవలసి వచ్చింది? దక్షయజ్ఞంలో సతీదేవి ఆత్మాహుతి చేసుకొన్నప్పుడు పరమేశ్వరుడు ఉగ్రరూపంలో వీరభద్రుడై ఆ యాగాన్ని ధ్వంసం చేసి దక్షుడి శిరస్సును ఖండించిన చరిత్ర మనందరికీ తెలుసు కదా. ఆ సందర్భంలోనే అక్కడ ఉన్న దేవతలందరినీ కూడా వీరభద్రుడు శిక్షిస్తాడు. తమ కళ్ళముందు అధర్మం, అన్యాయం జరుగుతూ ఉంటే 'పెద్దవాళ్ళు, వాళ్ళతో మనకెందుకు' అని మోహమాటానికి పోయినందుకు వారు కూడా శిక్ష అనుభవించవలసి వచ్చింది. ఆ శిక్షలో భాగంగానే సూర్యుడికి పళ్ళు ఊడగొట్టబడ్డాయి. అందుకే రథసప్తమి నాడు, లేదా ఇతర మాఘ అదివారాలలో కూడా సూర్యునికి నైవేద్యం పెట్టడానికి పరమాన్నం వండితే అందులో గట్టి పదార్థాలు (కనీసం జీడిపప్పులు కూడా) లేకుండా వండుతారు.

    కర్తా కారయితా చైవ ప్రేరకశ్చ అనుమోదకః సుకృతం దుష్కృతం చైవ చత్వారః సమభాగినః అని శాస్త్రం చెబుతోంది. ఒక మంచిపని కానీ చెడ్డపని కానీ జరుగుతున్నప్పుడు ఆ పని చేసినవాడు, చేయించినవాడు, దానికి ప్రేరణ కలిగించినవాడు, చూసి ఆనందించిన వాడు ఈ నలుగురూ ఆ పనియొక్క ఫలితాన్ని సమానంగా అనుభవిస్తారు. అందుకే ఏదైనా పుణ్యకార్యం జరుగుతున్నప్పుడు మనం ఆ కార్యానికి ఏవిధంగానూ సహకరించలేక పోయినా కనీసం చూసి ఆనందించినా ఆ పుణ్యఫలం మన ఖాతాలో జమ అవుతుంది. అలాగే ఏదైనా పాపకార్యం జరుగుతున్నప్పుడు దానిని ఆపే సామర్థ్యం మనలో లేనప్పుడు ఆ సామర్థ్యం ఉన్నవారిని పిలవాలి, లేదా కనీసం అక్కడినుంచి దూరంగా అయినా వెళ్ళిపోవాలి. అలా కాకుండా అక్కడే ఉండి చూస్తూ ఉంటే ఆ శిక్షలో మనం కూడా భాగస్వాములం అవుతాం.

సారపు ధర్మమున్ విమలసత్యముఁ బాపముచేత బొంకుచేఁ
బారముఁ బొందలేక చెడఁబాఱినదైన యవస్థదక్షు లె
వ్వార లుపేక్షచేసి రది వారలచేటగుఁ గాని ధర్మ ని
స్తారకమయ్యు సత్య శుభదాయక మయ్యును దైవ ముండెడున్ 

    అని మహాభారతంలో శ్రీకృష్ణ రాయబార ఘట్టంలో పరమాత్మ భీష్మ ద్రోణాదులను హెచ్చరిస్తాడు. ధర్మానికి, సత్యానికి హాని కలిగినప్పుడు దానిని నివారించగల సమర్థులై ఉండి కూడా ఉపేక్ష చేస్తే, మాట్లాడకుండా ఉండిపోతే, అది వారికే చేటు కలిగిస్తుంది కానీ ఆ సత్య ధర్మాలను కాపాడటానికి పరమాత్మ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అని చెప్పాడు. మరి కౌరవులు చేసేది అధర్మం అని తెలిసి కూడా వారి పక్షాన నిలబడినందుకు ఆ పెద్దలందరూ శిక్ష అనుభవించారు కదా! ఇక్కడ వారు కేవలం వారి స్వధర్మాన్ని పట్టుకొని విశేష ధర్మమైన లోకహితాన్ని వదిలిపెట్టారు కాబట్టి వారు శిక్షను అనుభవించవలసి వచ్చింది. అదే శ్రీకృష్ణుడు ఆ విశేష ధర్మాన్ని నిలబెట్టడానికి 'ఆయుధం చేబట్టన'ని తాను చేసిన వ్యక్తిగత ప్రతిజ్ఞను ప్రక్కనబెట్టి మరీ భీష్ముని మీద చక్ర ప్రయోగం చేయబోయాడు.

    సత్యం ఎప్పటికీ మారనిది. కానీ ధర్మం మాత్రం దేశకాలాలను బట్టి మారిపోతూ ఉంటుంది. అలాగే ఎవరి ప్రాణాలని, కుటుంబాన్ని కాపాడుకోవడం వారి ధర్మమయినా దేశంహితం కోసం ఒక గ్రామాన్ని, గ్రామహితం కోసం ఒక కుటుంబాన్ని, కుటుంబ హితంకోసం ఒక వ్యక్తిని కూడా వదిలివేయడం  ధర్మసూక్ష్మం. అంతే కానీ మన కళ్ళెదుటే అన్యాయం, అధర్మం జరుగుతూ ఉంటే ఆ చేసేవాడు నా కుటుంబం, నా కులం, నా మతం, నా భాష, లేదా నా రాష్ట్రానికి చెందిన వాడని వాడిని సమర్థించడమో, లేదా కనీసం ఖండించకుండా ఉండిపోవడమో చేస్తే దానికి శిక్షను మనం కూడా అనుభవించవలసి వస్తుంది. ఏ కలి ప్రభావమో కానీ ఈనాడు దేశంలో ఈ సంకుచిత భావనలు పెరిగిపోయి చివరికి మన భావజాలానికి అనుగుణంగా లేని వెనుకటి తరం మహాత్ములను కూడా దూషించే స్థితికి ఈ సమాజం చేరిపోయింది. పులి-మేక కథలో 'నువ్వు కాకపోతే మీ నాన్నో, తాతో నా నీళ్ళు ఎంగిలి చేశారు' అని వంకపెట్టి పులి ఆ మేకపిల్లను తినేసినట్లు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం నీ మతానికి చెందినవాడో, నీ కులానికి చెందినవాడో నా మతానికి, కులానికి చెందిన వారిపై దౌర్జన్యాలు చేశారని వంకపెట్టి ఆ చేసినవారితో ఏ బీరకాయపీచు సంబంధం లేనివారిని కూడా శిక్షించే, వంచించే స్థితికి చేరుకున్నాం.

    అయితే ధర్మానికి ఈ పైకి కనిపించే ఏ భేదాలతోనూ సంబంధం లేదు. మళ్ళీ మనం మహాభారతాన్నే తీసుకుంటే అక్కడ కౌరవ పాండవులు ఇద్దరూ ఒకే దేశానికి, ఒకే మతానికి, ఒకే కులానికి, చివరికి ఒకే కుటుంబానికి చెందినవారే కదా! కానీ ఒకరు ధర్మానికి ప్రతిరూపం అయితే మరొకరు అధర్మానికి ప్రతిరూపమయ్యారు. ఈ సందర్భంలో 'దుర్జనుడి క్రూరత్వం కంటే సజ్జనుడి మౌనం మరింత ప్రమాదకరం' అన్న Martin Luther King Jr. మాటలు మనం గుర్తు చేసుకోవాలి. మన చుట్టూ జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను చూస్తూ కనీసం మాటమాత్రంగానైనా ఖండించలేకపోతే దానికి ఫలితం మనం కూడా అనుభవించవలసి వస్తుంది. అయితే ఇక్కడ ధర్మం అంటే ఏమిటి అన్న ప్రశ్న వస్తుంది. హిందీలో అయితే మతం అన్న అర్థంలో కూడా ధర్మం అనే పదాన్ని వాడుతారు. అయితే నిజమైన ధర్మం ఏమిటి అన్న దానికి ఆ మహాభారతమే సమాధానం చెబుతోంది.

ఒరులేయని యొనరించిన 
నరవర! యప్రియము దన మనంబున కగు దా 
నొరులకు నవి సేయకునికి 
పరాయణము పరమ ధర్మపథముల కెల్లన్. 

    ఇతరులు ఏమి చేస్తే నీ మనస్సుకు బాధ కలుగుతోందో అది నువ్వు ఇతరులకు చేయకుండా ఉండటమే అన్ని ధర్మాలలోకి ఉత్తమమైన ధర్మం అని మహాభారతం చెబుతోంది. చివరికి తన భార్యను అపహరించిన రావణునికి శ్రీరాముడు, తమ రాజ్యాన్ని అపహరించి, భార్యను అవమానించిన కౌరవులకు పాండవులు కూడా సంధికి అనేక అవకాశాలు ఇచ్చి గతిలేని పరిస్థితిలోనే యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో కూడా తమ పక్షానికి వస్తానన్న శత్రువులను సాదరంగా ఆహ్వానించారు. అలాగే యుద్ధంలో మరణించిన తరువాత శత్రువులను కూడా గౌరవించారు, వారికి ఉత్తమగతులు కల్పించే క్రతువులను నిర్వహించారు.

    అంతేకానీ కులమత సంకుచిత భావనలతో ఎదుటివారిని నిష్కారణంగా హింసిస్తూ, మహాత్ములను అవమానిస్తూ ఉండేవారికి సర్వజీవ సమభావనకు ఉత్కృష్ట ప్రతీక అయిన పరమేశ్వరుని చేతిలో శిక్ష తప్పదు. అలాగే వారిని ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ప్రోత్సహించేవారికి, చూసీ చూడనట్లు ఊరుకొనే వారికి కూడా పళ్ళు రాలడం తప్పదు. అధర్మాన్ని ఖండించని మౌనం కూడా అధర్మంలో భాగస్వామే.