పూర్ణిమ నాడు చంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉంటే దానిని వైశాఖమాసం అంటారు. శాఖలు అంటే చెట్టు కొమ్మలు అని మనకు తెలుసు కదా. మరి విశాఖ అంటే కొమ్మలు లేని చెట్టు. అసలు ఏమిటీ చెట్టు అంటే భగవద్గీతలో స్వామి చెప్పాడు.
ఊర్ధ్వమూలమధః శాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ ।
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ।।
సంసారమనే అశ్వత్థ వృక్షానికి మూలం పైన ఉంటుందిట కొమ్మలు క్రిందకి విస్తరించి ఉంటాయిట. దీని గురించి కొంచెం ఆలోచిస్తే అసలు సంసారానికి మూలం నువ్వే. 'నేను' అంటూ ఉన్నప్పుడే 'నాది' అనే ఈ సంసారం అంతా ఉంటోంది. నేనే లేకపోతే సంసారం ఎక్కడిది? అయితే అసలు 'నేను' అయిన ఆత్మను వదిలివేసి మనం ఈ శరీరమే నేను అనుకుంటున్నాం. ఇక ఈ శరీరానికి సంబంధించిన వస్తువులు, వ్యక్తుల మీదకి మన ఆలోచనలు శాఖోపశాఖలుగా విస్తరించి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే సంసారం మనని బంధిస్తోంది.
మనం ఎప్పుడైతే క్రిందికి (ప్రపంచం వైపుకి) చూడడం మానేసి పైన ఉన్న మూలాన్ని పట్టుకుంటామో అప్పుడు ఈ శాఖలన్నీ వాటంతట అవే రాలిపోతాయి. అయితే దీనికి ఏకాగ్ర బుద్ధి అవసరం. అదే భగవద్గీతలో స్వామి చెబుతూ
వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన |
బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయోஉ వ్యవసాయినామ్ ||
నీ కృషి ద్వారా ఆధ్యాత్మిక సాధన ద్వారా బుద్ధిని ఆత్మయందు ఏకాగ్రం చెయ్యి అర్జునా! సాధన లేని బుద్ధి అనేక శాఖలుగా విస్తరించి అనంతంగా ప్రపంచంలో వ్యాపిస్తుంది అని చెబుతున్నాడు. మనకు నిరంతరం మనస్సులో అనేక సంకల్పాలు వస్తూనే ఉంటాయి కదా! అయితే ఆ సంకల్పించిన పని మంచిదా, కాదా? ఇది చేయవచ్చా, చేయకూడదా? అని విచారించి నిర్ణయించేది బుద్ధి. ఎప్పుడైతే ఈ బుద్ధిని మూలపదార్థమైన ఆత్మయందు నిలుపుతామో అప్పుడది ఈ అనిత్యమైన ప్రాపంచిక విషయాలను దానంతటదే వదిలివేస్తుంది. జీవితంలో ప్రతి అడుగులోనూ సరైన నిర్ణయాలు తీసుకొని మనను ఆధ్యాత్మిక పథంలో నడిపిస్తుంది. నిజమైన వైరాగ్యం అంటే ఇదే కదా. అందుకే స్వామి ఈ సంసార వృక్షాన్ని 'అసంగ శస్త్రేణ దృఢేన ఛిత్వా' దృఢమైన వైరాగ్యమనే ఆయుధంతో నరకాలని సూచిస్తున్నారు.
పరమేశ్వరుని నామాలలో 'ఓం స్థాణవే నమః' అనే నామం ఒకటి. స్థాణువు అంటే ఏ కొమ్మలూ లేని చెట్టు మొదలు. బుద్ధి ప్రపంచంలోకి శాఖోపశాఖలుగా విస్తరించకుండా నిరంతరం తనలో తాను రమిస్తూ సమాధి స్థితిలో ఉంటాడు కాబట్టి ఆయన స్థాణువు. ఈ వృక్షానికి కొమ్మలు లేకపోవడం అనే గుణమే 'విశాఖ'. అది కుమారస్వామి నామం. కొమ్మలే లేకపోతే ఇక ఆకులు ఎక్కడినుంచి వస్తాయి. అలా ఆకులు లేకపోవడం అనే గుణమే 'అపర్ణ'. ఇది పార్వతీదేవి నామం కదా! ఇలా బుద్ధి ప్రపంచంలోకి విస్తరించకుండా ఆత్మయందు లగ్నమయినప్పుడు ఆ ఆత్మ సర్వవ్యాపకమయినది కనుక 'నీవు చూచునదెల్ల నీవే' అనే విశ్వవ్యాపక అనుభూతి కలుగుతుంది. అదే 'విష్ణు'. ఇది గణేశుని నామం. ఇలా సంసారంలోనే ఉంటూ దేనికీ అంటకుండా నిరంతర ఆత్మానందాన్ని ఎలా అనుభవించవచ్చో ఆది కుటుంబమైన పరమేశ్వరుని కుటుంబం మనకు సూచిస్తోంది.
అలాగే మనోసంసారాన్ని విడిచిపెట్టి ఏకాగ్రబుద్ధితో సాధన చేస్తే ఈ సంసార వృక్షమే బోధివృక్షమై నీలో జ్ఞాన ప్రబోధం కలుగుతుందని నిరూపించిన బుద్ధభగవానుని జయంతి కూడా ఈ వైశాఖ పూర్ణిమ రోజనే. శత్రువు జాడ పొడసూపగానే తాబేలు తన ఇంద్రియాలను లోపలికి లాక్కొని ఎలా రాయిలా మారిపోతుందో ప్రజ్ఞావంతుడయిన మానవుడు తన ఇంద్రియాలను అలా విషయాలనుండి లోపలికి లాక్కొని తనను తాను రక్షించుకోవాలని గీతలో స్వామి చెబుతాడు. అటువంటి కూర్మావతారం వచ్చినది కూడా ఈరోజే. అలాగే సంసారంలో ఉన్న మానవుడు ఎలా భక్తి జ్ఞాన వైరాగ్యములను పెంపొందించుకొని ఆత్మానంద ఫలాన్ని అందుకోవాలో మనందరికీ ప్రత్యక్షంగా నిరూపిస్తూ శృంగార, భక్తి, జ్ఞాన, వైరాగ్య పూరితమైన 32 వేల సంకీర్తనలు తెలుగువారి ఇలవేలుపైన ఆ వేంకటేశ్వరునిపై రచించిన అన్నమాచార్యుల వారి జయంతి కూడా ఈరోజే.
కాబట్టి ఈ వైశాఖ పూర్ణిమ మనందరికీ అటువంటి వైరాగ్యాన్ని, ఏకాగ్ర బుద్ధిని ప్రసాదించి మన సాధనను పురోగమింపజేయాలని శ్రీ సద్గురుమూర్తిని ప్రార్థిద్దాం.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి