16, జులై 2019, మంగళవారం

చంద్రగ్రహణం

సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి అడ్డంగా వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుందని మనందరికీ తెలిసినదే కదా! అయితే మన వేదాంత పరిభాషలో సూర్యుడు బుద్ధికి అధిపతి. అందుకే 'ధియోయోనః ప్రచోదయాత్' అని మనం రోజూ ఆయనను ప్రార్థిస్తున్నాం. ఇక చంద్రుడు మనసుకు అధిపతి. అలాగే మన దేహం పంచభూతాలతో తయారయినా అందులో సింహభాగం పృథివీభూతానిదే. కొంచెం తాత్విక దృష్టితో ఆలోచిస్తే ఆత్మశక్తి వలన మన బుద్ధి ప్రకాశిస్తోంది. ఆ బుద్ధి ప్రకాశాన్ని ప్రతిఫలిస్తూ మనస్సు ప్రకాశించినంత కాలం మనలోని  జ్ఞానజ్యోతి మసకబారకుండా మనం వెన్నెలలోనే ఉంటాం. ఎప్పుడైతే బుద్ధికి, మనసుకు మధ్యలో దేహం అడ్డుగా వచ్చి ఈ దేహమే నేననే భావన మనసుకు గట్టిగా పట్టుతుందో అప్పుడే మనలో గ్రహణం అనే చీకటి ప్రారంభం అవుతుంది. మన సాధన అంతా ఈ దేహభావనను అడ్డు తొలగించుకొని మనస్సును బుద్ధికి, ఆ బుద్ధిని ఆత్మకు అధీనపరచి బ్రహ్మానందామృతం అనే వెన్నెలలో ఓలలాడాలనే.

ఇంద్రియాణి పరాణ్యాహుః ఇన్ద్రియేభ్యహః పరం మనః| 
మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః|| (భ.గీ. 3-42)

'ఇంద్రియాలు గొప్పవి. ఇంద్రియాలకంటే మనస్సు గొప్పది. మనస్సుకంటే బుద్ధి గొప్పది. ఆ బుద్ధికంటే గొప్పదై వీటన్నింటిని నడిపించేదే ఆత్మ' అని భగవానుడు స్వయంగా సెలవిచ్చారు కదా. అంటే సూర్యుని ప్రకాశాన్ని ప్రతిఫలించి చంద్రుడు ప్రకాశించినా ఆ సూర్యునికి కూడా ప్రకాశాన్ని ఇచ్చేది భగవంతుడే అయినట్లు (యదాదిత్య గతం తేజం జగద్భాసయతేఽఖిలం యశ్చన్ద్రమపి యశ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం - భ.గీ. 15-12) బుద్ధిని అనుసరించి మనస్సు, దానిని అనుసరించి ఇంద్రియాలు ప్రకాశిస్తున్నా, ఆ బుద్ధికి కూడా ప్రకాశాన్ని ఇచ్చేది ఆత్మవస్తువు అన్నమాట.

మనకు సాధారణంగా భగవద్గీతలోని శ్లోకాలనే ఉదహరించి ఉత్తరాయణంలో మరణించినవారు మోక్షాన్ని పొందుతారని, అదే దక్షిణాయణంలో మరణించినవారు తిరిగి జన్మిస్తారని చెబుతూ ఉంటారు. అయితే భగవానుడు ఏమి చెప్పాడో చూద్దాం. మానవునికి పునరావృత్తిని నివారించే మార్గమొకటి, పునరావృత్తిని కలిగించే మార్గమొకటి ఉన్నాయి. మొదటి మార్గానికి లక్షణం ఏమిటంటే 'అగ్నిర్జ్యోతిరహశ్శుక్లః షణ్మాసా ఉత్తరాయణం'. ఇందులో అగ్ని, జ్యోతి, పగలు ఈ మూడూ కూడా కాంతివంతమైనవి. ఇక శుక్లపక్షం, ఉత్తరాయణం చీకటినుండి వెలుగులోకి చేసే ప్రయాణానికి సూచనలు. శుక్లపక్షం మొదటిలో చంద్రుడు అసలు కనబడక పూర్తి చీకటిగా ఉంటుంది. అక్కడినుండి మెల్లమెల్లగా చంద్రబింబమూ, దాని కాంతి కూడా వృద్ధి పొందుతూ చివరికి పూర్ణిమ వస్తుంది. అలాగే ఉత్తరాయణం మొదటిలో పగలు తక్కువ, రాత్రి ఎక్కువగా ఉంటాయి. ఈ ఆరుమాసాలు గడిచేకొద్దీ పగలు పెరుగుతూ, రాత్రి తగ్గుతూ ఉంటుంది. అంటే జ్ఞానియై పూర్తిగా వెలుగులో ఉన్నవాడు, లేదా చీకటి నుండి వెలుగులోనికి, అంటే అజ్ఞానమునుండి జ్ఞానానికి ప్రయాణం చేస్తున్నవాడు పునరావృత్తి రాహిత్యాన్ని కలిగించే మార్గంలో ఉన్నాడన్నమాట.

ఇక రెండవ మార్గానికి లక్షణం ఏమిటంటే 'ధూమోరాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయణం'. ధూమం అంటే పొగ. ఇది వెలుగును కప్పివేస్తుంది. అలాగే రాత్రి కూడా చీకటికి సంకేతం. ఇక కృష్ణపక్షము, దక్షిణాయణం వెలుగునుండి చీకటిలోనికి ప్రయాణాన్ని సూచిస్తున్నాయి. అంటే పూర్తిగా చీకటిలో, లేదా అజ్ఞానంలో ఉన్నవాడు, అలాగే వెలుగునుండి చీకటిలోకి అంటే జ్ఞానమునుండి అజ్ఞానానికి ప్రయాణిస్తున్నవాడు పునరావృత్తిభరితమైన మార్గంలో ప్రయాణిస్తున్నాడన్నమాట. అయితే మనలో చాలామంది ప్రయాణం ఒక సరళరేఖలో ఉండదు. నాలుగడుగులు ముందుకి, రెండడుగులు వెనక్కి, మళ్ళీ రెండడుగులు ముందుకి, మూడడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు మనం వెలుగువైపు ఎంత ముందుకు వెళుతున్నాం అని సరిచూసుకుంటూ వీలైనంతగా వెనకడుగు వేయకుండా ఉంటే అదే పదివేలు. 

అలాగే ఒక మార్గంలో సైకిల్ త్రొక్కుతున్నవాడు మధ్యలో కొంత బద్ధకించి త్రొక్కడం ఆపివేసినా  సైకిల్  దానంతటదే కొంత ముందుకు పోవడం మనందరికీ అనుభవంలో ఉన్నదే. అదే తాను వెళ్ళవలసిన మార్గానికి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తుంటే మాత్రం ఎంతో శ్రమపడి మరీ తన ప్రయాణాన్ని ఆపి, దిశను మార్చుకొని ముందుకు సాగవలసి ఉంటుంది. అందువలన ఎప్పటికప్పుడు మనం వెళ్ళేది వెలుగు వైపుకా, లేక చీకటి వైపుకా? అని మనను మనం పరీక్షించుకుంటూ ముందుకు సాగాలి. అలా మన దిశను మార్చి వెలుగు వైపుకు నడిపించటానికే గురువులు మనను గ్రహణసమయంలో తప్పనిసరిగా ధ్యానం చెయ్యమని చెబుతారు. అంటే ఎప్పుడెప్పుడైతే మన మనస్సు బుద్ధిని అనుసరించకుండా దేహానికి లొంగిపోతూ ఉంటుందో అప్పుడప్పుడు మనం ధ్యానం చెయ్యాలన్నమాట. ఈ మాటను మాటిమాటికి గుర్తు చేయడానికే మన హిందూ సంప్రదాయంలో ఉత్తరాయణంలో కన్నా దక్షిణాయణంలోనే చాలా ఎక్కువ పండుగలు ఉంటాయి. అంతేగాని ఆ జ్ఞానాన్ని సంపాదించకుండా దేహాన్ని ఉత్తరాయణంలో విడిచిపెట్టినా, లేక దక్షిణాయణంలో విడిచిపెట్టినా పెద్ద తేడా ఏమీ ఉండదు.

11, జులై 2019, గురువారం

మార్పు

మనం ప్రతిరోజూ వింటూ ఉంటాం - లోకం అంతా మారిపోయింది. మా రోజుల్లోనే చాలా బాగుండేది. ఇప్పటివాళ్ళు అప్పటిలా దుస్తులు వేసుకోవట్లేదు, అప్పటి భాష మాట్లాడట్లేదు, అప్పటి తిండి తినట్లేదు, అప్పటిలా ఇంటిపట్టున ఉండట్లేదు, ఇలా రకరకాలుగా పాత కాలమంతా స్వర్ణయుగమని ఇప్పటివాళ్ళకి పోయేకాలమని అన్నట్లుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అయితే మనం ఇంకొకటి కూడా అప్పుడప్పుడూ వింటూ ఉంటాం - Change is the only constant thing in this world అని. అంటే ఈ ప్రపంచంలో మార్పు ఒక్కటే శాశ్వతమైనది అన్నమాట.

నిజానికి ఏ మార్పు లేకుండా ఉండేది సకల చరాచర సృష్టిలో కూటస్థ చైతన్య పరబ్రహ్మ రూపంలో ఉండే ఆ పరమాత్మ వస్తువు ఒక్కటే. ప్రపంచం అంతా నిత్యం మారిపోతూ ఉండేదే. యద్దృశ్యం తన్నశ్యం. ఏది కనబడుతుందో అది మాయమైపోతుంది. ఒకప్పుడు పెద్ద కుటుంబంలో అందరూ ఒకే ఇంట్లో జీవిస్తూ కనబడేవారు. అది మాయమై చిన్న కుటుంబాలు వచ్చాయి. కొన్నాళ్ళకు ఇవి కూడా మాయమైపోతాయి. ఒకప్పుడు ఎవరి ఊరిలో వారు ఉంటూ ఏ శుభకార్యాలకో, అశుభ కార్యాలకో ఒకసారి ప్రయాణాలు చేసేవారు. ఇప్పుడు అడుగు బయటపెడితే ఎక్కడ చూసినా ప్రయాణాలు చేసే జనమే విపరీతంగా కనిపిస్తున్నారు. కొన్నాళ్ళకి ఇది కూడా మారిపోతుంది, ఇంకొకటి వస్తుంది. ఒకప్పుడు ఉత్తరాలు వ్రాసుకొనేవారు. ఇప్పుడు SMSలు, WhatsApp messageలు వచ్చాయి. మరికొంత కాలానికి ఇది మారిపోయి ఇంకొకటి వస్తుంది. ఒకప్పుడు ఇంట్లో ఆడవాళ్లు అందరూ కలిసి ఇంటిపని, వంటపని చేసుకొనేవారు. ఇప్పుడు అందరూ తలకొక గదిలో కూర్చొని వారివారికి ఇష్టమైన సీరియళ్లు చూస్తున్నారు.

ఇలా ఒకటి మారి ఇంకొకటి రావడం లోకరీతి. చివరికి ఇందాక చెప్పుకున్న మార్పులేని పరబ్రహ్మమే అవతారం ధరించి వచ్చినప్పుడు ఆయన శరీరంలోనూ మార్పులొస్తున్నాయి, చివరికి కనిపించకుండా కూడా పోతోంది. అంతెందుకు? రామావతార సమయానికి, కృష్ణావతార సమయానికి వ్యవహార శైలిలో ఎంత మార్పు వచ్చింది? ఈ మార్పును స్వాగతిస్తూనే ఇలా నిత్యమూ మారిపోతూ ఉండే ప్రపంచం వెనుక మారకుండా ఉండి సమస్తాన్ని నడిపించే శక్తి ఒకటి ఉన్నదని గుర్తించడమే మనం చేయవలసింది. అప్పుడే మనం ఈ మార్పులను హుందాగా స్వీకరిస్తూ, వాటివలన ఉద్వేగానికి గురికాకుండా స్థితప్రజ్ఞతను చూపగలుగుతాం.

అసలు ఈ ప్రపంచంలోని నిరంతరం మారిపోయే స్వభావాన్ని అంగీకరించలేక పోతున్నామంటే సాధన చతుష్టయ సంపత్తిలో మొట్టమొదటిదైన నిత్యానిత్య వస్తు వివేకం మనకింకా అలవడలేదన్నమాట. ఈ ప్రపంచంలో మనం చూసే ఏ ఒక్కటీ నిత్యం కాదు, ప్రతిదీ మారిపోయేదే అని, పరమాత్మ ఒక్కడే మార్పులేని నిత్య సత్య స్వరూపుడని ముందుగా మనం రూఢిగా తెలుసుకుంటేనే ఇహలోకంలో, పరలోకంలో కనిపించే సుఖభోగాలన్నింటిపైనా వైరాగ్యం - ఇహాఽముత్రార్థ ఫలభోగ విరాగం - అనే రెండో సాధన సంపత్తి మనకు అలవడుతుంది. కాబట్టి కొత్తొక వింత పాతొక రోత అనడం ఎంత తప్పో, పాత అంతా మంచి, కొత్త అంతా చెడు అనుకోవడం కూడా అంటే తప్పు. మార్పులను హుందాగా స్వీకరిస్తూ, ప్రతిదానిలో మంచిని గ్రహిస్తూ, ఆచరిస్తూ, చెడును వదిలేస్తూ ముందుకు సాగినప్పుడే మన సాధన కూడా ముందుకు సాగుతుంది. మార్పును స్వీకరించలేనప్పుడు ప్రాపంచికంగా, ఆధ్యాత్మికంగా కూడా బావిలో కప్పల్లాగా ఎక్కడి వాళ్ళం అక్కడే ఉండిపోతాం.

8, జులై 2019, సోమవారం

అహంకారం

సామాన్య పరిభాషలో అహంకారం అంటే గర్వం, దర్పం అనుకుంటాం. కానీ వేదాంత పరిభాషలో అహంకారం అనే మాట రెండు వేరువేరు అర్థాలలో ఉపయోగించబడుతుంది. మొదటిది అహంకార మమకారాలలో ఉండే అహంకారం. 'నేను' అనే భావనే ఈ అహంకారం. ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. అవే కర్తృత్వాహంకారం, భోక్తృత్వాహంకారం. ఏదైనా ఒక పని చేయవలసి వచ్చినప్పుడు ఆ కర్తవ్యాన్ని తనమీద వేసుకోవటం కర్తృత్వాహంకారం. అంటే 'ఈ పని నేను చేస్తున్నాను' అనుకోవటం అన్నమాట. అయితే కేవలం 'నేను చేస్తున్నాను, లేదా చెయ్యగలను' అనుకోవటమే అహంకారం కాదు. 'ఈ పని నేను చేయలేను, లేదా నాకు చేతకాదు' అనుకోవటం కూడా కర్తృత్వాహంకారమే. అంటే బాధ్యతను భగవంతుని మీద వదిలిపెట్టకుండా తనమీద వేసుకోవటం అన్నమాట. నిజానికి మనమందరమూ ఆ భగవంతుని చేతిలో పనిముట్లమే. మనం కాకపోతే ఆ పని ఇంకొకరు చేస్తారు. ప్రపంచంలో ఏదీ ఎవరికోసమూ ఆగదు. మనం ఉన్నా లేకున్నా ఈ ప్రపంచం యథావిధిగా నడిచిపోతూనే ఉంటుంది. లేనిపోని కర్తృత్వాన్ని మీద వేసుకొని సతమతమయ్యేకంటే హాయిగా భారాన్ని భగవంతునిపై వేసి మన ధర్మాన్ని మనం ఆచరించడమే ఉత్తమం. అప్పుడు దాని ఫలితం మనకు కర్మ రూపంలో అంటదు. 

ఇక ఈ పనికి ఫలితం నేనే అనుభవించాలి అనుకోవటం భోక్తృత్వాహంకారం. చాలామందిని చూస్తుంటాం - 'ఈ పనిలో పుణ్యమంతా నాకే వచ్చెయ్యాలి, ఇంకెవరికీ ఇందులో భాగస్వామ్యం దక్కనివ్వను' అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే మన అంతిమ లక్ష్యం మోక్షం అయినప్పుడు మనం మధ్యలో వచ్చే ఈ పాపపుణ్యాలను పట్టించుకోకూడదు. మన కర్మ అకౌంటులో పాపం బ్యాలన్స్ ఉన్నా పుణ్యం బ్యాలన్స్ ఉన్నా మళ్ళీ జన్మకు రాక తప్పదు. కేవలం పాపపుణ్యాలే కాదు, మనం చేసే పనియొక్క ఫలితంపై ఏమాత్రం దృష్టి పెట్టినా అది భోక్తృత్వాహంకారమే. క్షణికానందం కోసం పాపకర్మల చేసి దీర్ఘకాలంలో దానివలన వచ్చే కష్టాలు, బాధలు మాత్రం తనకు వద్దు అనుకుంటూ ఉంటాడు మానవుడు. ఇది కూడా భోక్తృత్వాహంకారమే. మనం చేసే కర్మలన్నింటినీ భగవదాదేశంగా భావిస్తూ వాటి బాధ్యతను, ఫలాన్ని కూడా ఆయనకే వదలిపెట్టి శ్రద్ధతో చేస్తే అదే కర్మయోగం అవుతుంది. మోక్షానికి దారితీస్తుంది. 

ఇక పైన చెప్పుకున్నట్లు రెండవ అర్థంలో అహంకారం అనే మాట అంతఃకరణ చతుష్టయంలో భాగంగా వస్తుంది. అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అన్నమాట. వీటిలో మనస్సు సంకల్పిస్తే, చిత్తం రికార్డు చేస్తుంది. బుద్ధి నిర్ణయిస్తే అహంకారం ఆ నిర్ణయాన్ని అమలులో పెడుతుంది. దీనినే పురుషకారం లేదా పురుషప్రయత్నం అని కూడా అంటారు. మనస్సు, బుద్ధి, చిత్తము కంటికి కనపడవు కానీ వాటి నిర్ణయాలు అహంకారము ద్వారా వ్యక్తమై కర్మేంద్రియాల ద్వారా ఆ పని అమలులో పెట్టబడుతుంది. ఈ అహంకారమే లేకపోతే సృష్టిలో ఏ ప్రాణీ ఏ పనీ చేయలేదు. పైన చెప్పుకున్న మొదటిరకం అహంకారం మనకు మోక్షానికి అడ్డంకే కానీ ఈ రెండవ రకం అహంకారం మనకు ప్రతిబంధకం కాదు. మసస్సును బుద్ధికి ఆధీనం చేసి, ఆ బుద్ధిని పరమాత్మయందు నిలిపితే, అప్పుడు ఈ అహంకారం ద్వారా చేయబడే క్రియలన్నీ కూడా లోకహితార్థమే అవుతాయి.

గురుదేవులు శ్రీ బాబూజీ మహారాజ్ వారు ఈ రెండు రకాల అహంకారాలకు రెండు వేరువేరు చికిత్సలు చెప్పేవారు. మొదటిదైన అహంకార మమకారములను వడ్లగింజపై ఉన్న రెండు పొరలతో పోల్చేవారు. ఆ రెండు పొరలు ఉన్నంతకాలం ఆ వడ్లగింజ మొలకెత్తి మళ్ళీ మళ్ళీ అనేక జన్మ పరంపరకు కారణం అవుతుంది. అందుకే ఈ రెండు పొరలను, అంటే అహంకార మమకారములను పూర్తిగా తొలగించుకుంటే కానీ జన్మరాహిత్యం సాధ్యం కాదని చెప్పేవారు. పొరలు తీసివేస్తే వడ్లగింజ బియ్యపుగింజగా మారిపోతుంది కదా? ఎంత నానబెట్టినా బియ్యపుగింజ మళ్ళీ మొలకెత్తుతుందా?

ఇక రెండవ రకం అహంకారం భాగమైన అంతఃకరణ చతుష్టయం అంత చెడ్డదేమీ కాదు. దానిని పూర్తిగా తొలగించుకోవలసిన అవసరం లేదు. శరీరంతో ఉన్నంతకాలం అలా తొలగించుకోవటం సాధ్యం కాదు కూడా. అయితే ప్రపంచం వైపు తిరిగి ఉన్న ఈ నాలుగింటినీ పరమాత్మకు అభిముఖం చేస్తే అప్పుడు మనస్సు సత్యంగాను, దానికి సెక్రటరీ అయిన చిత్తం శాంతిగాను, బుద్ధి దయాస్వరూపంగాను, దానికి సెక్రెటరీ అయిన అహంకారం కళంకరహితమైన ప్రేమ స్వరూపంగాను మారిపోతాయని శ్రీగురుదేవులు వివరించేవారు. 

ఇలా మొదటి రకం అహంకారాన్ని నిర్ములించుకోవటానికి, రెండవ రకం అహంకారాన్ని పరివర్తన చెందించుకోవటానికి మనవంతు కృషిని మనం చేస్తూ ఫలితాన్ని భగవంతునికి వదిలిపెడదాం. ఎప్పుడు ఎవరితో ఏమి చేయించుకోవాలో, ఎప్పుడు ఎవరికి ఏమివ్వాలో ఆయనకే బాగా తెలుసు కదా. అయితే అహంకారాన్ని విడిచిపెట్టడమంటే సోమరితనం కాదు. అలాగే చెడ్డపనులు చేస్తూ 'ఇది నేను చెయ్యట్లేదు, భగవంతుడే నాతో ఇలా చేయిస్తున్నాడు. నేను కేవలం నిమిత్తమాత్రుణ్ణి' అని వంకలు చెప్పడం కాదు. 'నిజంగా భగవంతుడే నాతో అన్నీ చేయిస్తున్నాడు అనే భావన నిశ్చయంగా కలిగినవాడు ఎవ్వడూ చెడ్డపనులు చేయలేడు' అని శ్రీగురుదేవుల ఉవాచ.