23, డిసెంబర్ 2023, శనివారం

వైకుంఠ ఏకాదశి

 శ్రీమహావిష్ణువు శయనైకాదశి(ఆషాఢ శుద్ధ ఏకాదశి) నాడు యోగనిద్రలోకి వెళతాడని మన పెద్దలు చెబుతారు. అప్పటినుండి నాలుగు నెలలు మహాత్ములు అందరూ చాతుర్మాస్య వ్రతం చేస్తారు.  శయనైకాదశి అయిన రెండు నెలలకు విష్ణుమూర్తి నిద్రలోనే ఇటునుండి అటు తిరుగుతాడని, దానిని పరివర్తన ఏకాదశి(భాద్రపద శుద్ధ ఏకాదశి) అంటారు. మరో రెండు నెలల తరువాత ఆయన నిద్రనుండి లేచే ఉత్థాన ఏకాదశి(కార్తీక శుద్ధ ఏకాదశి) వస్తుంది. దీనినే క్షీరాబ్ధి ఏకాదశి అని, చిలుక(చిలుకు) ఏకాదశి అని కూడా పిలుస్తారు. సాగర మథనం (సముద్రాన్ని చిలకడం) ఆ రోజే ప్రారంభమైనదని చెబుతారు. ఆ తరువాత ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని(అది మార్గశిర మాసం కావచ్చు, లేదా పుష్య మాసం కావచ్చు) వైకుంఠ ఏకాదశి, లేదా ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటాం.

    ఈరోజు శ్రీమహావిష్ణువు వైకుంఠపు ఉత్తరద్వారాలు తెరచి దర్శనమిస్తారని, ముక్కోటి దేవతలు ఆ అరుదైన దర్శనానికి వైకుంఠానికి చేరుకుంటారని ప్రతీతి. అయితే మనం దేవతల కాలమానాన్ని కొద్దిగా గమనిస్తే, చద్రమండలంలో ఒక రోజు అంటే మనకి ఒక నెలతో సమానం. అలాగే సూర్య మండలంలో ఒక రోజు మనకు ఒక సంవత్సరం. అలా పైకి వెళ్ళినకొద్దీ కాలప్రమాణం పెరుగుతూ పోతుంది. బ్రహ్మదేవుడికి ఒక క్షణం అయితే మనకు ఒక సంవత్సరం అవుతుంది. మరి అంతకంటే పై స్థాయిలో ఉండే విష్ణుమూర్తికి మన ఒక సంవత్సరంలోనే నిద్ర, మెలకువలతో కూడిన రోజు పూర్తి అయిపోవడమంటే కొంచెం ఆశ్చర్యంగానే తోస్తుంది.

    కొంచెం లోతుగా ఆలోచిస్తే నిజానికి ఇవన్నీ మన సాధనలోని దశలని అనిపిస్తాయి. వ్యాపకత్వం విష్ణువు లక్షణం. ఆయన విశ్వమంతటా వ్యాపించి ఉంటాడు. అలాగే మన శరీరంలో అంతటా వ్యాపించి ఉండేది మనస్సు. ఉత్ అంటే ఎత్తు, లేదా పైన. మనం మ్యాపులో చూస్తే పైన ఉండే దిశను ఉత్తరం అంటాం కదా. ఉత్తరం అంటే నువ్వు చూస్తున్న వాటిలో మిగిలిన వాటికంటే పైన ఉండేది. ఉత్తర ద్వారం అంటే సహస్రార చక్రమే. అసలు అన్నిటికంటే పైన ఉండేది ఉత్తమం. సనకాది మహర్షులు జ్ఞానతృష్ణతో ఉత్తరదిశగా ప్రయాణిస్తుంటే అక్కడ దక్షిణాభిముఖుడై పరమేశ్వరుడు గురురూపంలో దక్షిణామూర్తిగా వారి ఎదుట ప్రత్యక్షమై తన మౌన వ్యాఖ్యతోనే పరబ్రహ్మ తత్వాన్ని ప్రకటితం చేస్తారు. అలా గురుమూర్తి ఉత్తర భాగంలో, అంటే తనకంటే పై స్థాయిలో ఉండి చేసిన బోధను అందుకొని సాధకుడు తన యోగసాధనను ప్రారంభిస్తాడు. అదే శయనైకాదశి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేన్ద్రియాలను నిగ్రహించి వాటికి అధిపతియైన పదకొండవది అయిన మనస్సుతో చేసేది సాధన. అందుకే ఇవన్నీ ఏకాదశులు.

    ఇలా సాధన మొదలు పెట్టిన సాధకుడి మనస్సు మెల్లగా పరివర్తన చెంది ప్రపంచాభిముఖంగా ఉండేది పరమాత్మకు అభిముఖంగా తిరుగుతుంది. అదే పరివర్తన ఏకాదశి. సాధన మరికొంత ముందుకు సాగుతున్న కొద్ది ఆ వ్యక్తి తాను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎగబ్రాకుతాడు. చివరికి బ్రహ్మజ్ఞానోదయం అవుతుంది. అలా బ్రహ్మజ్ఞానమునందు మేల్కొనడమే ఉత్థాన ఏకాదశి. అలాగే సాధనలో మన మనస్సును చిలికి అందులోని మంచి, చెడు విషయాలనన్నింటిని బయటకు తీసివేసినప్పుడు చివరికి బ్రహ్మామృతం లభిస్తుంది. అందుకే ఇది చిలుకు ఏకాదశి కూడా. ఇప్పుడు తాను బ్రహ్మమునని, ఈ జగత్తుకంటే ఉన్నతమైన స్థితిలో (దానికి ఉత్తరభాగంలో) ఉన్నానని అనుభూతిలోకి తెచ్చుకుంటాడు. అలా 'అహం బ్రహ్మాస్మి' అని అనుభవంలోకి తెచ్చుకున్న తరువాత మరి జగత్తు ఏమవుతుంది? తాను మాత్రమే బ్రహ్మ కాదు కదా! బ్రహ్మమంటేనే సర్వవ్యాపకమైనది. అంటే 'సర్వం ఖల్విదం బ్రహ్మ' అని గ్రహిస్తాడు.

    విష్ణు సహస్రనామాలలో మొట్టమొదటిది 'విశ్వం', రెండవది 'విష్ణుః'. అంటే ఈ విశ్వమంతా విష్ణువే. ఈ అనుభవాన్ని పొందడమే ఉత్తరద్వార దర్శనం. దీనిని ఉత్తరద్వారం అన్నారు కానీ ఉత్తమద్వారం అనలేదు. ఎందుకంటే అది పైన ఉంది కానీ, అన్నిటికంటే పైన కాదన్నమాట. ఎందుకంటే ద్వారం అంటేనే దానిలోనుంచి ఇటూ అటూ వెళ్ళే వీలు ఉంటుంది కదా. అంటే ఆ ద్వారానికి ఇంకా పైన (ఇంకా ఉత్తరంలో) ఏదో ఉంది అన్నమాట. సరిగ్గా అక్కడే ఈ ముక్కోటి దేవతలు విష్ణుదర్శనం కోసం నిరీక్షిస్తూ ఉంటే స్వామి సాక్షాత్కరిస్తారు. ఇప్పుడు చూస్తే దేవతలందరూ ఉత్తరభాగంలో దక్షిణం వైపు తిరిగి ఉన్నారు, విష్ణుమూర్తి దక్షిణభాగంలో ఉత్తరంవైపు తిరిగి ఉన్నారు. మొదట మనం చెప్పుకున్న దక్షిణామూర్తి ఉత్తరభాగంలో దక్షిణం వైపు తిరిగి ఉంటే ఋషులు దక్షిణభాగంలో ఉత్తరంవైపు తిరిగి ఉన్నారు.

    మళ్ళీ మన సాధన విషయానికి వస్తే, ప్రపంచానికంటే క్రింది స్థితిలో ఉండి, దానిచే నిత్యం బాధింపబడుచున్న సాధకుడు ఉన్నత స్థితిలో ఉన్న గురుదేవుల ఉపదేశంతో సాధన ప్రారంభించి, పరివర్తన చెంది, తనను ఈ ప్రపంచం బంధించలేదని, తాను దానికంటే ఉన్నతుడైన బ్రహ్మవస్తువునని తెలుసుకుని, ఇప్పుడు క్రిందికి(దక్షిణానికి) తిరిగి చూస్తే తనకు విశ్వం ఉండవలసిన స్థానంలో విష్ణుమూర్తి కనిపిస్తాడు. ఇదే ఉత్తరద్వార దర్శనం. ఇట్టి అత్యుత్తమ స్థితిలో స్థిరంగా కూర్చున్న వ్యక్తి (ఉత్ + ఆసీన = ఉదాసీన) సర్వాన్ని సమదృష్టితో చూస్తాడు. నేలమీద నడిచేవానికి ఒకరు లావుగా, ఒకరు సన్నగా, ఒకరు ఎత్తుగా, ఒకరు పొట్టిగా ఇలాంటి భేదాలన్నీ కనిపిస్తాయి కానీ ఎత్తైన పర్వతశిఖరం మీదనుంచో, విమానంలోనుంచో చూసేవాడికి ఏ భేదాలైనా కనిపిస్తాయా? అంతా ఏక స్వరూపంగానే కనిపిస్తుంది. అదే 'సర్వం ఖల్విదం బ్రహ్మ'.

    ఈ ఏకాదశులన్నీ ఒకదానికొకటి రెండేసి నెలల దూరంలో ఉండటం మనం గమనించవచ్చు. అలాగే సాధనలో కూడా మనస్సు నిలబడాలంటే రోజూ కనీసం రెండు గంటలైనా ధ్యానం చెయ్యాలని గురువులు చెబుతారు. అలా సాధన చేసిన సాధకుడికి చివరికి 'నీవె నేనై నేనె నీవై జగంబెల్ల ఏక స్వరూపమై నేనుగా భాసించే బ్రహ్మానందానుభూతిని' గురుదేవులు అనుగ్రహిస్తారు. అప్పుడు నిత్యం వైకుంఠ ఏకాదశే! తాను చూసేదంతా ఉత్తరద్వార దర్శనమే!

13, డిసెంబర్ 2023, బుధవారం

జీవేశ్వరుడు

  

వెంకట్రావుకి భక్తి మెండు. పైగా అతనికి ఎలాగైనా చనిపోయిన తరువాత వైకుంఠానికి చేరుకోవాలని కోరిక. భారతదేశంలో అతడు దర్శించని పుణ్యక్షేత్రం లేదు, నీరాడని తీర్థం లేదు. ఎవరు ఏమి చేస్తే పుణ్యం వస్తుందని చెప్పినా అవన్నీ చేసేవాడు. ప్రతి పుణ్యక్షేత్రంలో తన పేర అన్నదానానికి విరాళాలు ఇచ్చాడు. నలుగురిలో గొప్ప పుణ్యాత్ముడనే పేరు తెచ్చుకున్నాడు. ఇలా ఉండగా చివరికి అతనికి అంత్యకాలం సమీపించింది. అయితే తనను తీసుకుపోవడానికి విష్ణుదూతలు వస్తారని ఆశగా ఎదురుచూస్తున్న వెంకట్రావు ఆశ అడియాసే అయ్యింది. ఎదురుగా యమదూతలను చూసి బిక్కచచ్చిపోయాడు. 


చేసేదేమీ లేక వారితో బయలుదేరాడు. ఆ  ప్రయాణం సుదీర్ఘంగా సాగుతోంది. కొంత సమయం గడిచాక ఎలాగో మెల్లగా ధైర్యం కూడదీసుకొని ఆ యమదూతలతో మాట కలిపాడు. “అయ్యా! నేను నా జీవితమంతా ఎన్నో పుణ్యకార్యాలు చేశాను. గొప్ప పుణ్యాత్ముడిగా పేరు గడించాను. ‘సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్ఛతి’ అని నమ్మి కనబడిన దేవునికల్లా మ్రొక్కాను. ఈ చేసిన పుణ్యకార్యాలకు నారాయణుడు ఎంతగానో సంతోషించి నన్ను వైకుంఠానికి తీసుకెళతాడని నేను విష్ణుదూతలకోసం నిరీక్షిస్తుంటే తీరా మీరు వచ్చారు. దయచేసి నేను చేసిన తప్పేమిటో సెలవిస్తారా?” అని భయపడుతూనే ప్రశ్నించాడు.


దానికా యమదూతలు పెద్దగా నవ్వుతూ “చూడు నాయనా! నువ్వు చెప్పినదంతా నిజమే. నువ్వు చాలా పుణ్యకార్యాలు చేశావు. అయితే అంతకంటే ఎక్కువే పాపాలు చేశావు. అందుకే నిన్ను ముందుగా నరకానికి తీసుకువెళ్ళడం జరుగుతోంది. నువ్వు అనేక పుణ్యక్షేత్రాలు తిరిగావు.  అక్కడి విగ్రహాలలో, నదులలో భగవంతుని చూడటానికి ప్రయత్నించావు, కానీ ఏనాడైనా నీ చుట్టూ ఉన్న మనుష్యులలో, ఇతర ప్రాణులలో భగవంతుడు ఉన్నాడని గుర్తించావా? ఏ క్షేత్రానికి వెళ్ళినా నీ మనస్సు ఎంతసేపూ పూజల చుట్టూ, స్నానాల చుట్టూ తిరుగుతూ ఉండేది తప్ప, అక్కడ నీకు ఎదురైన దీనజనులకు నీ చేతనైన సహాయం చేయడానికి ఎప్పుడైనా ప్రయత్నించావా? పైగా ఎవరైనా సహాయం అర్థిస్తే వారిని అనుమానంతో చూడటమే కాక, చీదరించుకునే వాడివి, గుర్తుందా?


ఎన్నో క్షేత్రాలలో అన్నదానానికి విరాళాలు ఇచ్చావు కానీ, అవన్నీ కేవలం పుణ్యం సంపాదించుకోవడానికే తప్ప అన్నార్తుల మీద జాలితో కాదు. నీ ఇంటికి ఎవరైనా బిచ్చగాడు వచ్చినా వారిని అసహ్యించుకుంటూ, తప్పదని దూరంనుంచే ఎంతో కొంత విసిరివేసేవాడివి కానీ ఇస్తున్నది నారాయణుడికనే భక్తితో, వినయంతో ఎపుడైనా దానం చేశావా? నీ అవసరానికి చెప్పులు కుట్టించుకొని కనీసం అందుకు మూల్యాన్ని అతనికి మర్యాదగా చెల్లించకుండా, నేలమీద విసిరేసి వెళ్లిపోయేవాడివి. ఎందుకంటే అలాంటి వారిని ముట్టుకోవాలంటేనే నీకు అసహ్యం. దివ్య క్షేత్రాలకు వెళ్ళినా అక్కడ సహపంక్తి భోజనాలు చేయడానికి నీకు చిరాకు. నీ ఇంటిలోనే పనిచేసే పని మనుషులను ఏనాడూ మనుషులుగా చూడలేదు.


బంధువులకు, స్నేహితులకు గొప్పకోసం మళ్ళీ మళ్ళీ క్రొత్త బట్టలు పెడుతూ ఉండేవాడివి కానీ, ఎవరైనా లేనివారు వచ్చి ఒక పాత బట్ట ఇవ్వమంటే చీదరించుకునే వాడివి. పెద్ద ఇల్లైతే కట్టుకున్నావు కానీ వర్షానికి భయపడి నీ వసారాలోకి ఏ కుక్కో వస్తే దాని కాళ్ళు విరగగొట్టే వాడివి. ఇలా అనేక దీనజీవుల పట్ల అసహ్యాన్ని ప్రదర్శిస్తూ పాపాన్ని పోగేసుకున్నావు. ‘సర్వ దేవ నమస్కారం కేశవం ప్రతి గచ్ఛతి’ అని నమ్మావు కానీ ‘సర్వ జీవ తిరస్కారం కేశవం ప్రతి గచ్ఛతి’ అని తెలుసుకోలేకపోయావు. నువ్వు నమ్మిన ఆ నారాయణుడే స్వయంగా ‘సర్వస్య చాహం హృది సన్నివిష్టః’, ‘ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి’ అని చాటి చెప్పాడు కదా! భగవంతుడికి తనకు పూజలు చేసే వారికన్నా ఇతర జీవులకు సేవ చేసేవారు అంటేనే ఎక్కువ ఇష్టం. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి వచ్చే జన్మలోనైనా సర్వ జీవకోటిలో ప్రకాశిస్తున్న జీవేశ్వరుని దర్శించి సేవించే ప్రయత్నం చెయ్యి. అప్పుడు నువ్వెక్కడ ఉంటే అదే వైకుంఠం అవుతుంది” అని ప్రబోధించారు.

15, అక్టోబర్ 2023, ఆదివారం

వాచాజ్ఞానం

"పుట్టిన ప్రతివారు మరణించక తప్పదు", "ఈ శరీరం అశాశ్వతమైనది. దీనితో వచ్చే బంధాలన్నీ కూడా అశాశ్వతమే", "ఇక్కడ ఎంత సంపాదించినా, ఎంత దాచుకున్నా పోయేటప్పుడు పూచికపుల్ల కూడా తీసుకుపోలేం" ఇలాంటి జ్ఞానం మనలో ప్రతి ఒక్కరికీ ఉంది. కాస్త ఊహ తెలిసిన చిన్న పిల్లలు కూడా ఇందులో కొంతవరకైనా చెబుతారు. అయితే ఇది కేవలం వాచాజ్ఞానంగానే మిగిలిపోతోంది తప్పితే అనుభవంలోకి, ఆచరణలోకి రావడంలేదు. ఈ జ్ఞానం మనకు ఎలా వస్తోంది? అంటే పుస్తకాలు చదవటం వల్లనో, ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడం వల్లనో, లేదా మనకు బాగా కావలసిన వారు దూరమైన క్షణికావేశంలోనో వస్తోంది. అది పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం లాగా కొద్దిసేపే ఉంటోంది కానీ శాశ్వతంగా నిలవట్లేదు. కొంతమంది అదే పనిగా పుస్తకాలు చదవటమో, చర్చలలో పాల్గొనటమో చేసేవారు రోజూ ఇదే జ్ఞానాన్ని వల్లించవచ్చు. కానీ వారికి నిజంగా ఒక ఆపదో, కష్టమో వచ్చినప్పుడు ఈ వల్లించిన జ్ఞానం వారికి ఉపయోగపడుతోందా? వారి మనస్సును నియంత్రిస్తోందా? స్వాంతన కలిగిస్తోందా? అంటే సమాధానం చెప్పలేము.


పైకి ఎంత వేదాంతం వల్లించినా తన సంతానం స్థిరపడలేదనో, లేదా వారి బుద్ధి బాగోలేదనో, తనకు దక్కవలసిన ఆస్తి మరొకరికి పోయిందనో, లేదా తనకే ఏదో పెద్ద రోగం వచ్చినప్పుడో ఈ జ్ఞానం ఎంతవరకు నిలబడుతోంది? మనస్సు ఈ జ్ఞానానికి వ్యతిరేక దిశలో ఆలోచించకుండా ఉంటోందా? దీనికి కారణం ఏమిటి? ఆ జ్ఞానాన్ని కేవలం వల్లె వేయటమే తప్పితే ఆచరణలో చూపించలేకపోవటం, అభ్యాసం చేయకపోవటం, అనుభవంలోకి తెచ్చుకోకపోవటం. "కారు ఫలానా విధంగా నడపాలి. గేరు ఇలా వెయ్యాలి. స్టీరింగు ఇలా తిప్పాలి" ఇలా ఎన్నాళ్ళు పుస్తకంలో చదివినా, లేదా నలుగురితో చర్చించినా నీకు నిజంగా కారు నడపడం వస్తుందా? నీ మాటలు విన్న నలుగురూ "అమ్మో వీడికి కారు నడపడంలో ఎంత అనుభవం ఉందో" అని ఆశ్చర్యపోయి నిన్ను పొగడవచ్చు. కానీ నిజంగా కారు నడపవలసిన అవసరం పడినప్పుడు నువ్వు తెల్లమోహం వేస్తావు. ఇలాగే జీవితంలో ఏ విద్య అయినా కేవలం వల్లెవేయడం వలన అనుభవంలోకి రాదు కదా! ఒక గురువును ఆశ్రయించి, ఆయన చెప్పిన మెలకువలను పాటించి చక్కగా అభ్యాసం చేస్తేనే వస్తుంది.


ఆధ్యాత్మిక విద్య కూడా అంతే. అయితే గురువును ఆశ్రయించి కొంతకాలం సత్సంగాలలో పాల్గొని నాలుగు మంచి ముక్కలు గుర్తు పెట్టుకోగానే మనకేదో చాలా జ్ఞానం వచ్చేసిందని అనుకుంటాం. చివరికి దానిని గురువుల ముందు ప్రదర్శించడానికి కూడా వెనుకాడం. చిన్నప్పటి నుండి ఆశ్రమంలో పెరిగి "జీవితంలో ప్రతి అడుగులో గురుదేవుల సూచనలు పాటించాలి. గురుదేవులు ఏది చెబితే అది తప్పనిసరిగా ఆచరించాలి" అని వింటూ ఉన్న యువకులు పదవ తరగతి అయిన తరువాత శ్రీ బాబూజీ మహరాజ్ వారి వద్దకు వెళ్ళి "ఇంజనీరు కావాలా, డాక్టరు కావాలా ఏమి చదవమంటార"ని అడిగేవారు. శ్రీగురుదేవులు వారిని "నువ్వు ఏమనుకుంటున్నావు? నీకు ఏదంటే ఇష్టం?" అని ప్రశ్నిస్తే వీరు ఇంతకు ముందు విన్న వాచాజ్ఞానంతో "మీరు ఏం చెయ్యమంటే అది చేస్తాను బాబూ!" అనేవారు. 'శ్రీ బాబూ విజ్ఞానమందిర్' మూడవ అంతస్తులో వాకింగ్ చేస్తున్న శ్రీ బాబూజీ "అయితే ఇక్కడినుండి క్రిందకు దూకు!" అనేవారు. ఈ యువకులు తెల్లమోహం వేసేవారు. అనుభవం లోనికి రాని వాచాజ్ఞానం, వాచావేదాంతం ఇలాగే ఉంటాయి.


మళ్ళీ మన కారు ఉదాహరణకే వస్తే డ్రైవింగ్ నేర్చుకొనే కొత్తల్లో భయం భయంగా ఉంటుంది. ఎప్పుడు ఎటు చూడాలి, ఎప్పుడు క్లచ్ నొక్కాలి, ఎలా గేర్ మార్చాలి, ఎప్పుడు బ్రేక్ వెయ్యాలి ఇలా దృష్టి అంతా దాని మీదే ఉంటుంది. ప్రక్కన ఎవరైనా మాట్లాడించినా, లేదా రోడ్డుమీద ఇతర ఆకర్షణలు ఎన్ని ఉన్నా వీడి దృష్టి అటు పోదు. అలా జాగ్రత్తగా, ఏకాగ్రతతో కొంతకాలం అభ్యాసం చేసిన తరువాత పైన చెప్పిన పనులన్నీ వాడికి సహజంగా అలవాటు అయిపోతాయి. నడవడం, మాట్లాడటం, గాలి పీల్చడం ఎంత సహజంగా చేస్తాడో, కారు నడపడంలో చేయవలసిన వివిధ పనులన్నీ అంతే సహజంగా చేసేస్తాడు. అప్పుడు ప్రక్కవాళ్ళతో ఎంత చర్చలు జరుపుతున్నా, రోడ్డుమీద వచ్చే పోయేవారిని, ప్రక్కనున్న ప్రకటనలను ఎన్ని చూస్తున్నా అతి సహజంగా చేతులు, కాళ్ళు తమ పని తాము చేసుకుపోతూ ఉంటే కారు ముందుకు సాగిపోతూ ఉంటుంది. 


ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఈ జ్ఞానం, ఈ వేదాంతం మన నరనరాల్లో జీర్ణించుకొని అది మన సహజ స్థితిగా మారేవరకు నిరంతర అభ్యాసం, సాధన చేయవలసిందే. అది లేకుండా కేవలం మాటలలో భక్తి జ్ఞాన వైరాగ్యాలను ఒలకబోయడం వ్యర్థం. ఈ విశ్వమంతా నిజంగా పరమాత్మ సృష్టే, ఇందులో నాదంటూ ఏదీ లేదు అని నిజంగా విశ్వసించిన వాడు పైకి ఏమీ మాట్లాడకపోయినా అంతరంగంలో పరమ భక్తుడై నిరంతరం ఆ భగవచ్చింతన లోనే ఉంటూ, ఎప్పుడు ఏది లభిస్తే అది ప్రసాదంగా స్వీకరిస్తూ,  కర్తృత్వ భోక్తృత్వాలను తనమీద వేసుకోకుండా నిగర్విగా జీవనం సాగిస్తూ ఉంటాడు. అలాగే కనిపించే విశ్వమంతా భగవత్స్వరూపమే అన్న అవగాహన దృఢంగా ఉన్నవాడు జ్ఞానియై అంతటా భగవంతునే దర్శిస్తూ, దేని యెడల రాగద్వేషాలు లేక సహజ విరాగియై ఉంటాడు. ఇటువంటి విశ్వాసము, అవగాహన లేకుండా కేవలం వినడానికి, మాట్లాడడానికి అలవాటు పడిన మానవుడు పైకి ఎంత భక్తునిగా నటించి ఎన్ని భగవత్కైంకర్యాలు చేసినా, "నాదేమీ లేదు, అంతా భగవంతుడిదే. ఆయనదే ఆయనకు ఇచ్చాను" అని పైకి ఎన్ని మాటలు చెప్పినా గుడిలోకి వెళ్ళి దేవుని మూర్తిని చూడగానే "ఈరోజు నేనిచ్చిన నగలను వేశారా లేదా? నేను పెట్టిన బట్టలను కట్టారా లేదా?" అని ఇలాగే అతడి మనస్సు ఎంతసేపూ 'నేను, నేను' చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. పట్టుచీర అరువిచ్చి ఆ కట్టుకున్నావిడ ఎక్కడ మాపేస్తుందో అని వెనకాలే పీట పుచ్చుకుని తిరిగినట్టు 'నేనిచ్చాను' అనే భావన వదలనంత కాలం పైకి ఎన్ని మాటలు చెప్పినా ఉపయోగం లేదు.


అలాగే మరి కొంతమంది ఎవరైనా మర్యాదకి "బాగున్నారా!" అని పలకరించినా "ఈ శరీరం ఎప్పుడూ బాగోదు, ఆత్మ ఎప్పుడూ బాగానే ఉంటుంది. నువ్వు అడిగినది శరీరాన్నా, లేక ఆత్మనా?" అంటూ వారికి పెద్ద వేదాంత ఉపన్యాసం చెప్పి "వీడిని ఎందుకు పలకరించానురా దేవుడా!" అనుకొనేలా చేస్తారు. నిజంగా బ్రహ్మజ్ఞాన సంపన్నులయిన మహాత్ములు ఎవరూ ఇలా మాట్లాడరు. వాచావేదాంతులే ఇలా ప్రవర్తిస్తారు. మహాత్ములు ఆంతర్యంలో నిరంతరం పరబ్రహ్మ వస్తువుతో అనుసంధానులై ఆ బ్రహ్మామృతాన్ని గ్రోలుతూ ఉన్నా పైన వ్యవహారంలోకి వచ్చేసరికి సాధారణ మానవుల మాదిరిగానే ప్రవర్తిస్తారు. తరచి చూడగల హృదయం ఉన్నవారికి మాత్రమే వారి అసలు సత్తా కొంచెమైనా అంచనాకు వస్తుంది తప్పితే మామూలుగా వారిని మహాత్ములని పోల్చుకోవడం కష్టం.


కాబట్టి నిజమైన భక్తికానీ, జ్ఞానంకానీ, వైరాగ్యంకానీ సహజసిద్ధంగా ఉండాలి తప్పితే అవి తెచ్చి పెట్టుకొనేవి కావు, పైకి ప్రదర్శించేవి కావు. అలా పైకి ప్రదర్శించినంత కాలం వాటిలోని నిజమైన సారాన్ని అనుభవంలోకి తెచ్చుకోలేము. ఆ మూడిటి ఫలస్వరూపమైన ఆత్మానందాన్ని పొందలేము. ఎప్పుడైతే ఈ పైపై మాటలన్నీ కట్టిపెట్టి, నిరంతర భగవత్స్మరణలో, తత్వచింతనలో మనస్సును ఊరబెట్టి, ఆ పరమాత్మ తప్ప మరియొకటి మన మనస్సులో నిలువలేని స్థితికి చేరుకుంటామో అప్పుడే నిజమైన అనుభవ జ్ఞానం, అనుష్టాన వేదాంతం అలవడుతుంది. శ్రీ బాబూజీ మహరాజ్ వారు చెప్పినట్లుగా నీటిలో సగం మునిగిన చెంబు బుడబుడ శబ్దాలు చేస్తుంది కానీ, పూర్తిగా నీటితో నిండిన చెంబునుంచి ఏ శబ్దమూ రానట్లుగా అటువంటి అత్యున్నత స్థితికి చేరిన వ్యక్తినుంచి వాచాజ్ఞానం వెలువడదు. అతడు తన ఆచరణతోనే సర్వులకు ఆదర్శప్రాయుడై నిలుస్తాడు.


కేవలం గ్రంధాలు చదివి 'ఇది సత్తు, ఇది అసత్తు, ఇది చిత్తు' అని ఎంతసేపూ నీలో నువ్వుగానీ, లేదా ఇతరులతోగానీ వృధా చర్చలు పెట్టుకోకుండా నిరంతరం జగన్మాత స్మరణలో గడిపితే 'సదసద్రూప ధారిణి' అయిన ఆ జగన్మాత అనుగ్రహం, సాక్షాత్తు జగన్మాతృ స్వరూపులే అయి 'సదసద్రూప సంపన్ను'లయిన శ్రీ గురుదేవుల అనుగ్రహం కలిగిన నాడు నీవు దర్శించేదంతా సత్య వస్తువే కానీ అక్కడ ఇంక అసత్తుకు స్థానమే లేదు. 'నీవు చూచునదెల్ల నీవయే' అను 'తత్త్వమసి' వాక్యానికి అర్థమై నిలుస్తావు.

2, అక్టోబర్ 2023, సోమవారం

అహింస

అక్టోబర్ నెల వచ్చిందంటే ముందుగా గాంధీ జయంతి వస్తుంది. మన ఆధునిక కాలంలో అహింసకు మారుపేరుగా ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకొని ఎన్నో దేశాలలో ఎందరికో ఆదర్శంగా నిలిచారు మన జాతిపిత మహాత్మాగాంధీ. అలాగే ఇదే నెలలో అనేకమంది లోకకంటకులైన రాక్షసులను జగన్మాత సంహరించినందుకు గుర్తుగా మనం దసరా వేడుకలను జరుపుకుంటాం.


ఇక్కడే కొందరికి సందేహం కలుగుతుంది. అసలు మనం అహింసను పాటించాలా, లేక అవసరమైనపుడు హింసామార్గాన్ని అవలంబించాలా అని. మనకు ఈ మానవజన్మ లభించడంలో ముఖ్య ఉద్దేశ్యం, ఈ మానవ జన్మకు సార్థకత మనం మోక్షాన్ని పొందటం. మోక్షాన్ని పొందాలంటే దైవీ సంపదను పెంచుకోవాలని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు. ఈ దైవీ సంపద అంటే ఏమిటో 16వ అధ్యాయం మొదటి మూడు శ్లోకాలలో వివరించాడు. ఇందులో మొదటి శ్లోకం అభయం(భయం లేకపోవటం)తో మొదలైతే రెండవ శ్లోకం అహింసతో మొదలవుతుంది. అంటే జీవితంలో ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కోవడం ఎంత అవసరమో ఆ సమస్యా పరిష్కారంలో ఎవరినీ హింసించకుండా అహింసను పాటించడం కూడా అంతే ముఖ్యం.


ఏ దేశంలో చూసినా యుద్ధంలో ధైర్యంగా పోరాడి శత్రు సైనికులను మట్టుబెట్టిన వీరునికి అనేక సత్కారాలు చేయడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ సత్కారానికి ప్రాతిపదిక ఆ సైనికుడు తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఎంత ధైర్యంగా పోరాడాడు అనేదే కానీ ఎంతమందిని చంపాడు అనే లెక్క కాదు. అలాగే యుద్ధంలో శత్రువులను చంపి సత్కారాన్ని పొందిన ఆ సైనికుడే తన వ్యక్తిగత కక్షతో దేశంలో ఎవరినైనా చంపితే అతను శిక్షింపబడతాడు. అంటే రెండు సందర్భాలలోనూ చేసిన పని చంపడమే అయినా దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం అది సత్కారార్హమైనదా లేక శిక్షార్హమైనదా అని నిర్ణయిస్తుంది.


పైన మనం చెప్పుకున్న జగన్మాత చేసిన రాక్షస సంహారాన్ని గమనిస్తే అందులో వ్యక్తిగత కక్షగానీ, స్వార్థం కానీ లేదు. అది కేవలం లోకంలోని ఇతర జీవులను రక్షించడానికి చేసిన సంహారమే. అందులో ముఖ్య ఉద్దేశ్యం రక్షణే కానీ హింస కాదు. "శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుని యుద్ధం చేయమని ప్రోత్సహించాడు కదా, మరి మనం మన శత్రువులను సంహరిస్తే తప్పేమిటి?" అని కొందరు వాదిస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే అర్జునుడు క్షత్రియుడు, పైగా సైనికుడు. అంతకుమించి అతడు యుద్ధరంగంలో నిలిచి ఉన్నవాడు. 


అందుకే పరమాత్మ యుద్ధానికి ప్రోత్సహించాడు కానీ అంతకుముందు ఆయన శాంతికి ఎంతగా ప్రయత్నించలేదు? అంతెందుకు స్వయంగా తన భార్యను అపహరించిన రావణునితో కూడా యుద్ధం చేసేముందు శ్రీరాముడు అనేకమార్లు శాంతియత్నాలు చేశాడు. పైగా గీతాచార్యుడు ఎవరి ధర్మాన్ని వారు ఆచరించాలి కానీ, ఎంత గొప్పదైనా పరుల ధర్మం జోలికి పోకూడదని హెచ్చరించాడు. అందువలను యుద్ధం చేయడం, శత్రుసంహారం చేయడం సైనికుల ధర్మమే కానీ మనబోటి వాళ్ళది కాదు. ధర్మరక్షణ కోసం తప్పనిసరి పరిస్థితిలో తమవారితోనే యుద్ధం చేసినా, ఆ తరువాత పాండవులు జీవించినంత కాలం మనశ్శాంతి లేకుండా ఆ బాధలోనే బ్రతికారు.


తమ మతానికో, జాతికో చెందిన ప్రతి వ్యక్తీ ఆయుధాలు సమకూర్చుకొని పరాయి జాతి, మతం వారితో పోరాడటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చే నాయకులు దాని వలన కలిగే దుష్ప్రభావాలను గమనించడం లేదు. ప్రతివ్యక్తికి సులభంగా ఆయుధాలు దొరికే వ్యవస్థ ఉన్న అమెరికా వంటి దేశాలలో ఆ ఆయుధాలను దుర్వినియోగ పరుస్తూ విచక్షణారహితంగా పసిపిల్లలనుండి వృద్ధులవరకు ఎందరినో కాల్చి చంపుతున్న ఘటనలు మనం తరచుగా వింటూనే ఉన్నాం కదా!


విచ్చలవిడితనానికి నెలవైన ఆటవిక వ్యవస్థను వదలి మనకంటూ ఒక సమాజాన్ని, దానికి కొన్ని కట్టుబాట్లను, వ్యవస్థను ఏర్పరచుకొన్న మానవుడు మళ్ళీ మళ్ళీ ఆ ఆటవిక న్యాయం వైపుకే మొగ్గు చూపడం ఎంతవరకూ సమంజసం? అవతలివారిని హింసించడం ఎంత తేలికో ఆ హింసకు తట్టుకొని ధైర్యంగా నిలబడి, తనకు శక్తి ఉండి కూడా ధర్మానికి కట్టుబడి అహింసతో జీవించడం అంత కష్టం. అలా జీవించారు కనుకనే పాండవులు, శ్రీరాముడు మొదలైన వారి చరిత్రలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. 


అదే అహింసా ధర్మాన్ని ఆధునిక కాలంలో కూడా ఆచరించి చూపి "అసలు ఇలాంటి ఒక వ్యక్తి రక్తమాంసాలతో ఈ భూమి మీద నడయాడాడంటే ముందు తరాలవారు నమ్మలేరు" అని ఐన్‌స్టీన్ మహాశయుడంతటి గొప్ప శాస్త్రవేత్తతో కొనియాడబడిన గాంధీ మహాత్ముని ఆదర్శంగా తీసుకొని మన జీవితాలను తీర్చిదిద్దుకుందాం.

7, ఆగస్టు 2023, సోమవారం

మోక్షం

    రామారావు ఊరిలో పెద్దమనిషి. గొప్ప ధర్మాత్ముడని పేరు గడించాడు. గుళ్ళూ గోపురాలూ కట్టించాడు, చెరువులు తవ్వించాడు. అయితే ఏ ధర్మకార్యం చేసినా ఆ పుణ్యం అంతా తనకే దక్కాలని, దానితో తాను మరణించిన తరువాత మోక్షాన్ని పొందాలని అభిలషించేవాడు. ఇలా ఉండగా కొంత కాలానికి రామరావుకి మరణకాలం సమీపించింది. బాధగా తనవైపు చూస్తున్న కొడుకుని పిలిచి, "ఎందుకురా బాధ పడతావు? నేను పుట్టి బుద్ధెరిగిన తరువాత ఎన్నో పుణ్యాలు చేశాను. ఒక్క పాపకార్యమూ చెయ్యలేదు. మరణించిన తరువాత నాకు ఖచ్చితంగా మోక్షం ప్రాప్తిస్తుంది. అందుకు తగిన అపరకర్మలు అన్నీ నువ్వు సవ్యంగా నిర్వర్తించు. నాకదే చాలు" అని చెప్పి కన్నుమూశాడు.

    కొడుకు సుభాష్ ఆ చుట్టుప్రక్కల ప్రసిద్ధిగాంచిన పురోహితులను రప్పించి వారు చెప్పిన విధంగా అన్ని కర్మలూ శాస్త్రోక్తంగా నిర్వహించాడు. తండ్రి అస్థికలను అనేక పుణ్యనదులలో నిమజ్జనం చేశాడు. ప్రయాగ, బ్రహ్మకపాలం వెళ్ళి మరీ పిండాలు పెట్టాడు. అయినా సుభాష్ మనసులో ఏదో వెలితి. తన తండ్రి నిజంగా మోక్షాన్ని పొందాడా? ఎలాగైనా తెలుసుకోవాలి అనుకున్నాడు. అతని ఆరాటం ఫలించి ఒక మహాత్ముని దర్శనభాగ్యం కలిగింది. ఆ మహాత్ముని శ్రద్ధగా సేవించి మెల్లగా తన సందేహాన్ని తెలియజేశాడు.

    ఆ మహాత్ములు చిరునవ్వు నవ్వి, "నాయనా! ఇప్పుడు మీ తండ్రి స్వర్గంలో ఉన్నాడు. కావాలంటే పిలిపిస్తాను నువ్వే మాట్లాడు" అని తన తపశ్శక్తితో రామారావును పిలిపించారు. అన్నాళ్ళ తరువాత తండ్రిని చూడగానే సుభాష్ ఆనందంగా "నాన్నగారూ! ఎలా ఉన్నారు? మీ చిరకాల కోరిక తీరిందా? మీకు మోక్షం ప్రాప్తించిందా" అని ఆతృతగా ప్రశ్నించాడు. అందుకు రామారావు విచారంగా, "లేదు నాయనా! నేను పొరబడ్డాను. ధర్మంగా నడుచుకోవటం, అనేక పుణ్యకార్యాలు చేయడమే మోక్షానికి మార్గమని నమ్మాను. పైగా మోక్షం అంటే అదెక్కడో వేరే లోకంలో ఉంటుందని, మరణించిన తరువాత మాత్రమే పొందగలమని నమ్మాను. నేను చేసిన పుణ్యాలరాశికి ఫలితంగా నాకు స్వర్గం ప్రాప్తించింది.

    తీరా ఇక్కడకు వచ్చాక చూస్తే ఇది కూడా శాశ్వతం కాదని, కేవలం నా పుణ్యం ఖర్చు అయిపోయేదాకా మాత్రమే నన్ను ఇక్కడ ఉండనిస్తారని, ఆ పుణ్యఫలం కాస్తా అనుభవించేస్తే ఇక్కడినుండి మళ్ళీ భూమిమీదకు తోసేస్తారని తెలిసింది. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఉండే ఇంద్రాది దేవతలకు సైతం అమృతం త్రాగడం వలన మరణం అయితే లేదుగాని, వారి పదవులు, స్వర్గంలో వారి స్థానం సైతం అశాశ్వతమేనట! వారిలో వారు మాట్లాడుకుంటుండగా నేను విన్నదేమంటే జన్మరాహిత్యం పొంది మోక్షాన్ని అందుకోవాలంటే వారుసైతం భూమిపై మానవ రూపంలో జన్మించి ఆధ్యాత్మిక సాధన చేయవలసిందేనట.

    పైగా మనం చేసే పుణ్యకార్యాలు అన్నీ మన పాపరాశిని తగ్గించుకోవడానికి, అలాగే లోకహితం కోసమేగానీ అవి మనకు మోక్షాన్ని ఇవ్వలేవుట. 'ఇది నేను చేస్తున్నాను, దీని ఫలితం నాకే దక్కాలి' అనే భావనలు ఉన్నంతకాలం అవి మనకు బంధాన్నే కానీ మోక్షాన్ని ఇయ్యలేవని ఇప్పుడే గ్రహించాను. అంతేకాదు నేను మరణించిన తరువాత నువ్వు చేసిన శ్రాద్ధ కర్మలన్నీ ఆయా క్షేత్రాలలోని పండాల బ్రతుకుదెరువు కోసం తప్పితే వాటివలన నాకు కలిగిన ప్రయోజనం ఏమీ లేదు" అన్నాడు.

    ఇంతలో ఆ మహాత్ములు కల్పించుకొని "మోక్షం పొందాలంటే సద్గురువులను ఆశ్రయించి, వారు చూపిన మార్గంలో ఆధ్యాత్మిక సాధన చేసి, భక్తి జ్ఞాన వైరాగ్యాలను పెంపొందించుకొని, ముఖ్యంగా నేను, నాది అనే అహంకార మమకారాలను వదుల్చుకొని, ఉన్నదంతా ఒకటే అనే సత్యాన్ని గ్రహించాలి. అంతేకాదు నాకు మోక్షం కావాలి అనే కోరిక కూడా బంధమే అవుతుంది. అలా జీవుని బంధించే ఈ గుణాలు, సంకల్పాలు, వాసనలనన్నింటినీ వదుల్చుకుంటే ఏ బంధన లేని ఆ స్థితే మోక్షం. అది ఎక్కడో వేరే లోకంలోనో, లేదా బయట ఎవరినుంచో పొందేది కాదు. అది నీ సహజ స్థితి. దానిని కప్పివేసిన అజ్ఞానపు పొరలు తొలగించుకుంటే మోక్షం నీ స్వరూపమే. అది బ్రతికి ఉండగానే నీ శరీరం మీద జ్వరాన్ని ఎలా అనుభవిస్తావో అలా నీ అనుభూతిలోకి వస్తుంది. అంతేగానీ చచ్చాక వచ్చేదేమీ లేదు, ఎత్తిపోతలు తప్ప" అని విశదీకరించి వారిద్దరికీ స్వాంతన కలిగించారు.

చచ్చాకేమొచ్చు ఎత్తిపోతలు గాక
బొంది జీవముండగనె మోక్షంబు
బొందవలయు జ్వరము మాడ్కి
కాళీ ప్రసాదు మాట కాంతిబాట||

9, జులై 2023, ఆదివారం

తొందరపాటు

    సుబ్బారావు రిటైరై ఇంటిపట్టునే ఉంటున్నాడు. పిల్లలు పెద్దవారై తల్లిదండ్రులతోనే ఉంటున్నా ఎవరి సంసారాన్ని వారు గడుపుకుంటున్నారు. అయితే ఈ మధ్యన ఒక విషయం సుబ్బారావుని తొలిచేస్తోంది. ఉద్యోగం చేసి తాను కూడబెట్టింది పెద్దగా ఏమీ లేకపోయినా, ఉద్యోగం చేస్తున్నన్నాళ్ళూ తనకు ఇంట్లో ఎంతో గౌరవం దక్కేది. ఎవరు ఎన్ని మాట్లాడినా చివరికి తన మాటే నెగ్గేది. అలాంటిది ఈ మధ్య పిల్లలు తనను లక్ష్యపెట్టడం లేదు. కాలానికి తగ్గట్లు తాను మారలేడు. అలాగని తన మాట నెగ్గాలనే పంతాన్ని వదులుకోలేడు. దీంతో రోజూ ఇంట్లో తగవులే.

    'ఈ సంసారాన్ని నేను భరించలేను. ఇప్పుడే అన్నీ వదిలేస్తున్నా' అని రోజుకు నాలుగైదుసార్లు అంటూ ఉంటాడు కానీ దేనినీ అంత తేలికగా వదలలేడు. ఇంకా తన తాతలనాటి ఆస్తి తన చేతిలో ఉండటంవల్లే ఈమాత్రం మర్యాద అయినా దక్కుతోందని, అది కాస్తా పిల్లల పేరుమీద పెడితే తన బ్రతుకు బస్టాండేనని సుబ్బారావుకు గట్టి నమ్మకం. దాంతో రోజూ అన్నిసార్లు మాటల్లో వదిలేస్తున్నా మనసులో మాత్రం సన్యసించలేకపోతున్నాడు. ఇలా ఉండగా ఒకరోజు ఏదో కారణంమీద ఇంట్లో పెద్ద గొడవ అయ్యింది. అలిగిన సుబ్బారావు తట్టాబుట్టా సర్దుకుని రైలెక్కాడు. ఆ రైలు కొన్ని స్టేషన్లు దాటాక అనుకోకుండా తన బాల్యమిత్రుడు వెంకట్రావు తారసిల్లాడు.

    కుశలప్రశ్నల అనంతరం విషయం తెలుసుకున్న వెంకట్రావు పెద్దగా నవ్వుతూ 'ఒరేయ్ సుబ్బారావూ! ఇంత వయసొచ్చినా నీకింకా చిన్నతనం పోలేదురా. ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ చేటే చేస్తాయి కానీ మంచి చెయ్యవు. కొడుకో కోడలో తిట్టారనో, తనను సరిగా గౌరవించలేదనో వృద్ధాశ్రమాలలో చేరి అక్కడ రెండుమూడు రోజులు కూడా ఇమడలేక మళ్ళీ ఇంటికి తిరిగి వస్తున్నవాళ్ళని ఎంతమందిని చూడటం లేదు? అయినా తమకు పెళ్ళి అవగానే తల్లిదండ్రుల్ని బలవంతంగా వృద్ధాశ్రమాలలో చేర్పించే పిల్లలున్న ఈ కాలంలో మీకు ఇంత వయసొచ్చినా, వారివారి సంసారాలు, పిల్లలు వాళ్ళకి వచ్చినా నీ పిల్లలు ఇంకా మీ దగ్గరే ఉంటూ మిమ్మల్ని చూసుకుంటుంటే అది అదృష్టంగా భావించక ఇదేం పనిరా?

    అయినా నీకు సంపాదన లేదనో, ఆస్తి పంచి ఇవ్వలేదనో నీ పిల్లలు నీకు గౌరవం ఇవ్వడం లేదని ఎందుకనుకుంటున్నావు? నీకు జరిగే అవమానాలు ఎప్పటికీ నామాటే నెగ్గాలనే నీ మొండితనం వల్లనో, ఇంట్లో ఎవరినీ నమ్మక ప్రతి విషయం గోప్యంగా ఉంచుకొనే నీ అభద్రతా భావం వల్లనో, లేక కాలం నిత్యం మారుతూ ఉంటుందనే నిజాన్ని గుర్తించక ఎప్పటికీ మా కాలంలో జరిగినట్లే జరగాలనే నీ చాదస్తం వల్లనో అని ఎందుకు ఆలోచించవు? చిన్నప్పుడు మన ఆలోచనలు ఎలా ఉన్నా పెద్దల మాట విని తీరాలి. అలాగే కొంచెం పెద్దవాళ్ళమయి మన సంసారాలు మనకు వచ్చాక ఇంట్లో వాళ్ళందరూ మన మాట వింటారు. కానీ మనకు వయసుడిగిన తరువాత మళ్ళీ మనం పిల్లల మాట వినక తప్పదు. 

    అలసు ఎంతసేపూ మన సంప్రదాయం, సంస్కారం, ధర్మం అంటూ కబుర్లు చెబుతావు కానీ మన సనాతన ధర్మంలో కొడుకుకి వివాహమై ఒక సంతానం కలిగిన వెంటనే ఆ తండ్రి తన బాధ్యతలన్నీ కొడుకుకు అప్పగించి వానప్రస్థం స్వీకరించాలని చెప్పారు కదా! అలాగే కోడలు ఇంట్లో అడుగు పెట్టగానే అత్తగారు తన బాధ్యతలు కోడలికి అప్పగించాల్సిందే. లేకపోతే వారు ఎదిగేదెప్పుడు? వీరికి సంసార బంధం తీరేదెప్పుడు? "నేను చిన్నప్పుడే బాధ్యతలని స్వీకరించి ఎన్నో కష్టాలు పడ్డాను. నా పిల్లలు అలా కష్టపడకూడదు" అని అతిగా ఆలోచించి బాధ్యతలు అప్పజెప్పకపోతే ఆ పిల్లల పతనానికి నీవే బాధ్యుడవు అవుతావు.

    అయినా ఎంతసేపూ "నేనేదో కుటుంబం కోసం త్యాగం చేశాను. అయినా నాకు దక్కాల్సిన గౌరవం దక్కట్లేదు అనుకుంటున్నావు" కానీ నీకోసం నీ పిల్లలు ఎంత త్యాగం చేస్తున్నారో ఎప్పుడైనా ఆలోచించావా? ఇంట్లో ఒక పనికిరాని పాత వస్తువునే వదులుకోలేని నువ్వు, వాళ్ళు ఎన్ని వదులుకుంటే ఇవాళ ఇలా నీతో కలిసి ఉంటున్నారో ఎప్పుడైనా ఆలోచించావా? ఏ ఆలోచనా లేకుండా తొందరపడి ఇలా సన్యాసం తీసుకోవాలనే నిర్ణయం ఎంతటి అవివేకం? సన్యాసమనేది ఈ ప్రపంచంయొక్క అశాశ్వతత్వాన్ని, నిస్సారతను క్షుణ్ణంగా గ్రహించి ఒక పరిపక్వతతో కూడిన నిశ్చయ మనస్సుతో తీసుకోవలసిన నిర్ణయం. అంతేకానీ ఇలా ఆవేశంతో, అనాలోచితంగా తీసుకోవటం సరికాదు. 

    నేనేదో మన సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తున్నానని ప్రగల్భాలు పలుకుతావు కానీ అసలు మన సనాతన ధర్మంలో బ్రహ్మచారి అయినవాడు తల్లి అనుమతి లేకుండా, గృహస్తు అయినవాడు భార్య అనుమతి లేకుండా సన్యాసం తీసుకోవడం నిషేధం, తెలుసా? అయినా ఈ వైరాగ్యం పెళ్ళి చేసుకోకముందు ఉండాలి కానీ పెళ్ళయి ఒక కుటుంబం ఏర్పడ్డాక, చెప్పాపెట్టకుండా వదిలేసి పోయేవాడిని పిరికివాడు అంటారు కానీ సన్యాసి అనరు. వైరాగ్యం అంటే రాగద్వేషాలకతీతంగా అన్నిటినీ సమానంగా చూడటం, అంతేకానీ కుటుంబం మీద ద్వేషం పెంచుకొని వదిలేసి పోవడం కాదు. ఆ మధ్య నేనిలాగే సన్యాసం పుచ్చుకుందామని హృషీకేశ్ వెళ్లిపోయాను. 

    అక్కడ కనిపించిన ఒక మహాత్ముడు భార్య అనుమతి లేనందున నేను సన్యాసానికి పనికిరానని వివరించి వారి ఆశ్రమంలో కొంతకాలం ఉండటానికి మాత్రం అనుమతించారు. అయితే అక్కడ రోజుకి ఒక్కసారి మాత్రమే రొట్టెలు, పాలు అందించేవారు. మూడుపూటలా కడుపునిండా తినడం అలవాటు పడిన నా ప్రాణానికి అది సరిపోయేది కాదు. ఆకలి బాధను తట్టుకోలేక చివరికి ప్రక్క గదిలో రోజంతా ధ్యానం చేసుకుంటున్న మహాత్ముని ఆహారాన్ని దొంగిలించడానికి కూడా పూనుకున్నాను. అప్పుడు నాకు కనువిప్పు కలిగి ఆ మహాత్ముని పాదాలపై పడి మార్గదర్శనం చేయమని ప్రార్ధించాను. 

    ఆయన "నాయనా! సాధనకు సంసారం అడ్డు కాదు. పైగా అది నీకొక పెట్టని కోటవంటిది. నీకు ఎటువంటి కోరిక కలిగినా అది ధర్మబద్ధంగా తీర్చుకొని, ఆ తరువాత ఆ కోరిక వలన కలిగిన సుఖం ఎంత అశాశ్వతమో విచారణ ద్వారా గ్రహించి దానిని అధిగమించడానికి అవకాశం కల్పిస్తుంది. అదే సన్యాసి జీవితం బహు ప్రమాదకరమైనది. అది కోట బయట నిలిచి శత్రువుతో యుద్ధం చేయడంలాంటిది. ఎటువంటి రక్షణ లేకపోవడంతో ఏ క్షణంలోనైనా అంతఃశ్శత్రువుల చేతిలో పరాజయం పాలు కావచ్చు. సంసారులై కూడా ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగిన నీలాంటి వారికోసం మీ ఆంధ్రదేశంలోనే శ్రీ కాళీగార్డెన్స్ ఆశ్రమాన్ని శ్రీ బాబూజీ మహరాజ్ వారు స్థాపించారు. అక్కడకు వెళ్ళి చక్కగా సాధన చేసుకొని తరించు" అని మార్గదర్శనం చేసి నన్ను పంపించారు' అని సుబ్బారావుని సమాధానపరచి తిరిగి ఇంటికి పంపించాడు.


గయ్యాళి పెండ్లాము యల్లరి పిల్లలు
భరియించలేక సన్యాసమందువు
కోటలోనుండి పోరు మేటిది గాదె
కాళీ ప్రసాదు మాట కాంతిబాట||

4, జూన్ 2023, ఆదివారం

పండు

                పూర్వం ఒక అడవిలో ఒక గురువుగారు ఆశ్రమం నిర్మించుకొని నివసించేవారు. ఆయన వద్ద కుమార్, మోహన్, ఈశ్వర్ అని ముగ్గురు శిష్యులు ఉండేవారు. ముగ్గురికీ గురువుగారంటే ఎంతో భక్తిశ్రద్ధలు ఉండేవి. శ్రద్ధాతత్పరతలతో గురుసేవ, ఆశ్రమసేవ చేసుకొనేవారు. తన కర్తవ్యంలో భాగంగా కుమార్ గురువుగారితో కలిసి వారి కుటీరంలోనే నివసిస్తూ రోజంతా వారికి ఎప్పుడు ఏ సేవ అవసరమో కనిపెట్టుకొని నిర్వహించేవాడు. ఇక మోహన్, ఈశ్వర్ వేరే కుటీరంలో ఉంటూ ఆశ్రమ నిర్వహణకు కావలసిన పనులన్నీ చేస్తూ ఉండేవారు. 

                నిరంతరం గురువుగారి సమీపంలో ఉండటంతో తనంటే గురువుగారికి ఎంతో ఇష్టమని, తన మాట ఆయన తప్పక వింటారని కుమారుకి కొంచెం గర్వం కూడా ఉండేది. అలాగే ఇదే విషయంలో మిగిలిన ఇద్దరికీ అతనంటే అసూయగా ఉండేది. ఇప్పటిలాగా సెల్ఫోనులు లేకపోవడంతో వీరు ముగ్గురూ రోజూ రాత్రి భోజనానంతరం ఆశ్రమంలో అరుగుమీద కూర్చొని పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆ మాటల సందర్భంలో 'గురువుగారు ఈరోజు నన్ను నవ్వుతూ ఎంతో ప్రేమగా పలుకరించార'ని ఒకరు, 'నావైపు కోపంగా చూశార'ని ఒకరు, 'గురువుగారు నేను చేసిన వంకాయకూర ఇవాళ ఎంతో ఇష్టంగా తిన్నార'ని ఒకరు, ఇలా సంభాషణ సాగుతుండేది.

          ఆశ్రమవాసం చేస్తూ, తమ తమ సాధన పురోగతిని గూర్చి ఆలోచించకుండా శిష్యులు ఇటువంటి విషయాలను చర్చిస్తూ ఉండటం గురువుగారు గమనించారు. ఒకరోజు వారి ముగ్గురినీ తమ ఆశ్రమంలోని మామిడిచెట్టు వద్దకు పిలిచి, పచ్చిగా ఉన్న మామిడికాయ కోసి తినమన్నారు. తిన్న తరువాత 'మీరు ఏమి గమనించారు?' అని అడిగారు గురువుగారు. కుమార్ 'ఈ మామిడికాయ చాలా పుల్లగా ఉందండీ' అన్నాడు. మోహన్ 'లేదండీ, ఇది వగరుగా ఉంది' అన్నాడు. ఇక ఈశ్వర్ 'ఈ కాయ కోసినపుడు చాలా సొన కారిందండీ' అన్నాడు. 

    గురువుగారు మరొక పచ్చి కాయను చూపించి 'దానిని రోజూ గమనిస్తూ ఉండండి' అని ఆదేశించారు. ముగ్గురు శిష్యులూ ఆ కాయను రోజూ గమనిస్తున్నారు. కొన్నాళ్ళకి అది మెల్లిగా పండి బంగారు రంగులోకి మారి ఒకరోజు ముట్టుకోగానే చెట్టునుండి ఊడి చేతిలోకి వచ్చేసింది. వెంటనే శిష్యులు ముగ్గురూ దానిని తీసుకొని పరిగెత్తుకుంటూ గురువుగారి వద్దకు చేరారు. ఆ పండును చూసిన గురువుగారు 'ఏదీ, ఇప్పుడు దీనిని తిని చూడండి' అన్నారు. ముగ్గురూ దానిని తిని ఏకకంఠంతో 'ఇది ఎంతో తియ్యగా ఉంది గురువుగారూ!' అన్నారు. ఈశ్వర్ తాను ఇంతకు ముందు చెప్పిన మాటను గుర్తు తెచ్చుకుంటూ 'ఈ పండు చెట్టునుండి దానంతటదే విడిపోయిందండీ. పైగా సొన కూడా కారలేదు' అన్నాడు ఆశ్చర్యంగా.

        'చూశారా మరి! మానవుడు కూడా ఈ మామిడిపండులాంటి వాడే. పచ్చిగా ఉన్నప్పుడు కామ క్రోధాది గుణాలతో పుల్లగా, వగరుగా ఉన్న మామిడికాయలాగే ఉంటాడు. సంసార వృక్షాన్ని వదలాలంటే సొన కార్చినట్టుగా ఏడుస్తాడు. అదే ఆత్మజ్ఞానంతో ఒకసారి పండిన మానవుడు మధుర స్వరూపుడై సంసారం నుండి తనకు తానుగా విడిపోతాడు' అని వివరించిన గురువుగారు 'మరి మీలో ఎవరైనా ఈ పండుని మళ్ళీ కాయగా మార్చగలరా?' అని ప్రశ్నించారు. శిష్యులందరూ ఏకకంఠంతో 'అదెలా సాధ్యం గురువుగారూ? అది జరిగే పని కాదు' అన్నారు.

        'మరి మీరు నన్ను ఆత్మజ్ఞానం పొందిన పండునని అనుకుంటున్నారా, లేక ఇంకా పచ్చిగా ఉండి సంసారాన్ని విడువలేని సామాన్య మానవుడనని అనుకుంటున్నారా?' అని ప్రశ్నించారు గురువుగారు. ఊహించని ఈ ప్రశ్నకు ఖంగుతిన్న శిష్యులు 'మీరు ఆత్మజ్ఞాన సంపన్నులయిన సిద్ధ పురుషులనే మా అందరి నిశ్చితాభిప్రాయం స్వామీ!' అని సమాధానమిచ్చారు. 'మరి అటువంటి గురువుకు ఇంకా ఇష్టాయిష్టాలు, రాగద్వేషాలు, ఒకరంటే ప్రేమ, మరొకరంటే కోపం ఇలాంటి గుణాలు ఉంటాయని ఎందుకు అనుకుంటున్నారు? 

        గురువు స్వచ్ఛమైన అద్దంలాంటివాడు. మీ హృదయంలో ఏ భావన ఉంటుందో గురువునుంచి ఆ విధమైన ప్రతిస్పందనే వచ్చినట్లుగా మీకు కనిపిస్తుంది. మీలో ప్రేమ, భక్తి ఉప్పొంగితే గురువు కూడా మిమ్మల్ని ప్రేమించినట్లుగా, ఆదరించినట్లుగా కనిపిస్తారు. మీలో ఏదైనా తప్పు చేశాననే అపరాధ భావన దాగి ఉంటే గురువుగారు మిమ్మల్ని కోపగించుకున్నట్లుగానే కనిపిస్తారు. లోపం చూసే వ్యక్తిలోనిదే కానీ అద్దానిది కాదు.

      అంతే కాదు. మీరందరూ నాలోని భాగాలే. అలాగే నేను మీ అందరిలో ప్రకాశించే ఆత్మవస్తువునే కదా! మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ, మయి సర్వమిదం ప్రోతమ్ సూత్రే మణిగణాయివ అని గీతాచార్యుడు చెప్పినట్లు ఆత్మజ్ఞానియై, భగవత్స్వరూపుడైన గురువుకన్నా భిన్నమైనది ఈ ప్రపంచంలో ఏ ఒక్కటీ లేదు. మణిమాలలో మణులన్నీ దారంతో ఎలా అనుసంధానించబడి ఉన్నాయో ఈ ప్రపంచమంతా గురువు(భగవంతుని)తో అలా అనుసంధానించబడి ఉంది. మీ శరీరంలో ఒక అవయవాన్ని ఎక్కువగా ప్రేమించి మరొకదాన్ని ద్వేషించరు కదా! ఆ అవయవాలన్నీ మీకు సమానమే కదా. అలాగే మీరందరూ నాకు సమానులే. కాబట్టి మీలో మీరు ఎక్కువ తక్కువలు కల్పించుకొని, ఆ భేదభావాలను నాకు కూడా ఆపాదించి, మీ ఆశ్రమవాసాన్ని వ్యర్థం చేసుకోకుండా, సమదృష్టి కలిగి ఉండి, చక్కగా సాధన చేసుకొని తరించడానికి ప్రయత్నించండి' అని బోధించి వారికి కనువిప్పు కలిగించారు గురువుగారు.

గురువు నవ్వెనని గురువు తినెనని
నన్నె మిన్నగా ఇష్టపడునందువు
పండెన్నడైన మరల కాయౌనె
కాళీ ప్రసాదు మాట కాంతిబాట|| 

28, ఏప్రిల్ 2023, శుక్రవారం

మమకారం

పూర్వం ఒక అడవిలో ఒక కోతి నివసించేది. దానికి లేకలేక ఒక పిల్ల పుట్టింది. దానితో ఆ పిల్లని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకొనేది. ఒక్క క్షణం కూడా ఆ పిల్లని వదిలిపెట్టి ఉండేది కాదు. తను నిద్రలోనో, లేదా ఏదో వ్యాపకంలోనో ఉండగా ఏ చిన్న శబ్దమయినా 'అమ్మో! నా పిల్లకి ఏదో ఆపద కలిగింద'ని ఉలిక్కిపడుతూ ఉండేది.

పిల్ల పెరిగి పెద్దదవుతూ ఉంటే తననెక్కడ వదిలేసి వెళ్లిపోతుందో అని ఆ తల్లి బెంగపెట్టుకునేది. దానితో ఆ పిల్ల ఎంత అల్లరి చేసినా, చుట్టుప్రక్కల జంతువులతో తనకు ఎన్ని తలనొప్పులు తెచ్చిపెట్టినా ఏమీ అనేది కాదు. వాటి సంఘంలోని కోతులన్నీ మొదట్లో 'ఏదో చిన్న పిల్లలే' అని సహించినా తరువాత తల్లిని హెచ్చరించేవి. అయినా సరే ఆ తల్లి 'ఊర్లో అందరి కళ్ళూ నా పిల్లమీదే. దానికి దిష్టి పెడుతున్నారు. అది ఆనందంగా ఉంటే చూసి ఓర్చుకోలేక పోతున్నారు' అనుకొనేదే కానీ తన తప్పు తెలుసుకోలేకపోయింది.

తను ఎంత అల్లరి చేసినా తల్లి ముద్దు చేయడం, అలాగే తనని ఎప్పుడూ వదిలిపెట్టకుండా ఉండటంతో ఆ కోతిపిల్లకి సంఘంలో ఎలా బ్రతకాలో, మంచిచెడులు ఎలా గుర్తించాలో, ఎక్కడ ఎలా మెలగాలో తెలియకుండా పోయింది. ఒకనాడు ఆ అడవిలో కొంతభాగాన్ని నరికివేసి అక్కడ పెద్ద ఫాక్టరీ కట్టాలని కొంతమంది మనుషులు వచ్చారు. వారిని చూడగానే భయంతో జంతువులన్నీ పారిపోయాయి.

వారు పగలు కొంత పనిచేసి, మధ్యాహ్నం భోజనానికి వెళ్ళారు. సరిగ్గా అప్పుడు ఈ కోతిపిల్ల అటుగా వెళుతూ వారి పనిముట్లను చూసింది. అటు వెళ్ళవద్దని మిగిలిన కోతులన్నీ అరుస్తున్నా వినకుండా వెళ్ళి అక్కడ ఉన్న రంపంతో ఆడుకోవడం మొదలుపెట్టింది. ఈ అరుపులకు ఉలిక్కిపడి తన పిల్లకు ఏమైందోనని తల్లి పరుగు పరుగున వచ్చింది. కానీ అప్పటికే సమయం మించిపోయింది. రంపం మీదినుంచి అటుఇటు గంతులు వేస్తున్న కోతిపిల్ల పట్టుదప్పి రంపం మీద పడి ఒక కాలు తెగిపోయింది.

తన కళ్ళముందే అవిటిదయిపోయిన పిల్లను చూసుకొని ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. అటుగా వెళుతున్న ఒక పులి ఈ దృశ్యాన్ని చూసి ఏమయిందని ఆరా తీసింది. విషయం తెలుసుకున్న పులి ఆ కోతిని ఓదారుస్తూ 'చూడు మిత్రమా! మనందరం ప్రకృతి సహజంగా పిల్లల్ని కంటాము. వారి ఆలనా పాలనా చూసుకోవటం, వారిని ప్రేమగా పెంచడం మన బాధ్యత. అదే సమయంలో వారిని క్రమశిక్షణతో కూడా పెంచాలి. ఏది మంచో ఏది చెడో వారంతట వారు తెలుసుకొనేలా తీర్చిదిద్దాలి. వారికి అవసరానికి కావలసినవి సమకూరుస్తూ వారు తెలివిగా తమ కాళ్ళమీద తాము నిలబడగలిగేలా పెంచడం ప్రేమ అనిపించుకుంటుంది. అలా కాకుండా వారిని వదలలేక నిరంతరం వెంట ఉంటూ, అన్నీ నువ్వే చేస్తూ, వారికి స్వేచ్ఛను, స్వతంత్రంగా బ్రతికే తెలివిని ఇవ్వలేక పోవడం, వారు లేకుండా నేను జీవించలేను అనుకోవడం, నువ్వు లేకుండా వారు జీవించలేని స్థితి కల్పించడం మమకారం అవుతుంది. ప్రేమ స్వేచ్ఛకు, ఉన్నతికి దారితీస్తే మమకారం బంధానికి పతనానికి దారితీస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఒక కాలు పోయినా భగవంతుని దయవలన నీ బిడ్డ బ్రతికే ఉంది. కనుక నీ మమకారాన్ని విడిచిపెట్టి, ప్రేమతో దానికి కావలసిన సహకారాన్ని అందిస్తూ మంచిచెడుల విచక్షణ కలిగేలా పెంచు' అని బోధించింది.

నాయిల్లు నాయాస్తి నాభార్యయందువు
నా పిల్లలో యంచు మురిసిపోదువు
నాది నాదన్న వాడు బంధాల పాలౌను
కాళీ ప్రసాదు మాట కాంతిబాట|| 

2, ఏప్రిల్ 2023, ఆదివారం

మ్రొక్కు

     కృష్ణమూర్తి ఒక ప్రభుత్వ శాఖలో ఉన్నతస్థాయి ఉద్యోగి. తన సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో బాగానే సంపాదించాడు. ఆయన ఒక్కగానొక్క కుమార్తె పెళ్ళికి ఎదిగివచ్చింది. తనకున్న పరిచయాలు ఉపయోగించి మంచి స్థాయిలోని సంబంధం కుదుర్చుకున్నాడు. అనేకమంది మంత్రులను, ఇతర ఉన్నతోద్యోగులను, రాజకీయ నాయకులను వివాహానికి ఆహ్వానించాడు. ముహూర్తం దగ్గర పడుతున్నకొద్దీ పెళ్ళి ఎలా చేస్తానో, అంతమంది అతిథులకు మర్యాదలు సరిగ్గా చేయగలనో లేదో అనే ఆందోళన పెరిగిపోతోంది.

    కృష్ణమూర్తి ఆందోళన గమనించిన భార్య సుమతి, "ఏమండీ! మన కులదైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామికి మ్రొక్కుకోండి. ఆ స్వామి దయవలన అంతా సవ్యంగా జరుగుతుంది. కంగారు పడకండి" అని సలహా ఇచ్చింది. కృష్ణమూర్తి అలాగే అని తమ ఊరిలోని వేంకటేశ్వరస్వామి గుడికి వెళ్ళి, "స్వామీ! నీ దయవల్ల నా ఒక్కగానొక్క కూతురు వివాహం ఏ లోటూ లేకుండా సవ్యంగా జరిపించావంటే నీ కొండకు వచ్చి తలనీలాలు సమర్పించుకుంటాను. అలాగే నీకు కోటి రూపాయలు విరాళంగా కూడా సమర్పిస్తాను తండ్రీ!" అని మ్రొక్కుకున్నాడు.

    అనుకున్నట్టుగానే కూతురి పెళ్ళి ఏ లోటూ లేకుండా చక్కగా జరిగిపోయింది. వచ్చిన అతిథులందరూ కృష్ణమూర్తి చేసిన మర్యాదలకు ఎంతగానో మెచ్చుకొని, ఆయనను పొగిడి వెళ్ళారు. ఆ తరువాత కొన్నాళ్ళు ఆఫీసులో కూడా ఆ పెళ్ళిపైనే చర్చలు. ఇవన్నీ చూసి కృష్ణమూర్తి మనస్సు ఆనందంతో పొంగిపోయింది. ఇంతలో భార్య సుమతి తాను తీర్చవలసిన మ్రొక్కును గుర్తు చేసింది.

    వెంటనే కృష్ణమూర్తి రైలు టిక్కెట్లు, తిరుమలలో కాటేజీ, దర్శనం, కళ్యాణం తదితర టిక్కెట్లన్నీ సిద్ధం చేసుకొని కుటుంబ సమేతంగా బయలుదేరాడు. అతడు ఉన్నతోద్యోగి కావడంతో అన్నీ సులభంగా సమకూరాయి. కాటేజీలో దిగగానే క్షురకుణ్ణి పిలిపించుకొని, తలనీలాలు తీయించి, స్నానం చేసి, కుటుంబసమేతంగా స్వామివారిని దర్శించుకొని కళ్యాణోత్సవంలో కూడా పాలు పంచుకున్నాడు. తాను మ్రొక్కుకున్నట్టుగానే కోటి రూపాయల చెక్కును విరాళంగా అక్కడి అధికారులకు అందజేశాడు.

    ఆనందంగా తిరిగి ఇంటికి వచ్చి మళ్ళీ తన ఉద్యోగానికి వెళ్ళటం ప్రారంభించాడు. అయితే కృష్ణమూర్తి తల వెనుకభాగంలో వంకర తిరిగి చూడటానికి విచిత్రంగా ఉంటుంది. ఇన్నాళ్ళూ వత్తయిన జుట్టు ఉండటంతో అది ఎవరూ గమనించలేదు. ఇప్పుడు నున్నటి గుండులో అది స్పష్టంగా కనిపిస్తోంది. అతను పెద్ద ఆఫీసరు కావడంతో నేరుగా ఎవ్వరూ అనకపోయినా అతనితో మాట్లాడి, బయటకు వెళ్ళాక ముసిముసిగా నవ్వుకోవడం కృష్ణమూర్తి గమనించాడు.

    ఇక ఇలా లాభం లేదని టోపీ పెట్టుకొని ఆఫీసుకు వెళ్ళడం మొదలుపెట్టాడు. అయితే రోజులో ఎక్కువ భాగం తన పై ఆఫీసర్లతో మీటింగులు ఉండటంతో టోపీ తియ్యక తప్పడంలేదు. మెల్లమెల్లగా కృష్ణమూర్తిలో ఆత్మన్యూనతా భావం, అసహనం పెరిగిపోతున్నాయి. ఇంట్లోనూ, బయటా అందరిమీదా విసుక్కోవటం మొదలుపెట్టాడు. అసలే ఒక్కగానొక్క కూతురు అత్తవారింటికి వెళ్ళిపోయి పగలంతా ఒంటరితనాన్ని అనుభవిస్తున్న సుమతికి భర్తలో క్రొత్తగా మొదలైన  ఈ అసహనాన్ని భరించడం మరింత కష్టమైపోయింది.

    ఒకసారి కృష్ణమూర్తిని చూడటానికి అతని బాల్యస్నేహితుడు పరాంకుశం ఎంతో దూరంనుంచి వచ్చి కొన్నాళ్ళు వాళ్ళింట్లోనే ఉన్నాడు. సుమతిలోని నైరాశ్యాన్ని గమనించిన పరాంకుశం విషయమేమిటని ఆరా తీశాడు. ఆ సాయంత్రం ఇంటి బయట పెరట్లో విశ్రాంతిగా కూర్చొని టీ తాగుతున్న సమయంలో మెల్లగా కృష్ణమూర్తిని కదిపాడు - "ఒరేయ్ కృష్ణా! నీకేమైంది ఈ మధ్యన? నీ గారాల కూతురు దూరమైందని విచారంగా ఉన్నావా? ఎందుకు అందరిమీదా అలా అసహనాన్ని ప్రదర్శిస్తున్నావ్?" అని అడిగాడు.

    అన్నాళ్ళుగా తానొక్కడే మనస్సులో దాచుకొని కుమిలిపోతున్న విషయాన్ని ప్రాణస్నేహితుని ముందు కక్కేసాడు కృష్ణమూర్తి. పరాంకుశం పెద్దగా నవ్వుతూ, "చూడు కృష్ణా! ఆమాత్రం చిన్న అవమానాన్ని తట్టుకోలేనివాడివి తలనీలాలు ఇస్తానని ఎందుకు మ్రొక్కుకున్నావు? అయినా ఆ వేంకటేశ్వర స్వామికి నువ్విచ్చే జుట్టుతో ఏం పని? ఆ మాటకొస్తే నువ్విచ్చే డబ్బులతో మాత్రం ఆయనకు ఏం పని? ఏడేడు పధ్నాలుగు లోకాలను ఏలేవాడికి ఇదొక లెక్కా? అయినా జుట్టో, డబ్బులో ఇస్తే మళ్ళీ తిరిగి వస్తాయని వాటిని మ్రొక్కుతారు కానీ మళ్ళీ తిరిగిరాని చెవులో, ముక్కులో కోసిస్తామని ఎవరైనా మ్రొక్కుతారా? మరి మళ్ళీ తిరిగి తెచ్చుకొనేవి ఇచ్చి మాత్రం ఏమిటి ఉపయోగం? అలా అని మన ఆచారాలని నేను తప్పు పట్టడంలేదు. అసలు ఇలా తలనీలాలు దేవునికి సమర్పించాలని మన పెద్దలు ఎందుకు పెట్టారో తెలుసా? అలాగైనా మనిషి తన అహంకారాన్ని, ఈ దేహమే తాననే భావనని వదులుకొని, అంతా ఆ ఈశ్వర ప్రసాదంగా, ఈశ్వరమయంగా దర్శించడం అలవాటు చేసుకొంటాడని. ఆ పరమాత్మకు సమర్పించవలసినవి నీలోని దుర్గుణాలు, వాసనలు, అహంకార మమకారాలు. ఒకసారి సమర్పించాక మళ్ళీ వాటిజోలికి పోకూడదు. అదే మ్రొక్కుకు సార్థకత. అలా సమర్పించిన నాడు నిన్ను గురించి ఎవరు ఏమనుకొన్నా, ఎలా నవ్వుకున్నా నువ్వు దానిని అవమానంగా భావించవు" అని చెప్పి తన స్నేహితుని సమాధానపరిచాడు.

నెత్తిన జుట్టు గొరుగంగనేటికి
ముక్కుచెవులు గొరుగగలవె
గొరుగదగినవి గుణములు గదా
కాళీ ప్రసాదు మాట కాంతిబాట||

12, మార్చి 2023, ఆదివారం

క్షుద్ర దేవత

    సత్యం, సుందరం బాల్యంనుంచి ప్రాణ స్నేహితులు. ఇద్దరూ ప్రక్కప్రక్క ఇళ్ళలోనే పుట్టి పెరిగారు. కలిసి చదువుకున్నారు, ఒకే ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరికీ మంచి నడవడిక, దైవభక్తి ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయాన్నే స్నానాదికాలు ముగించుకొని దగ్గరలోని బాలా త్రిపుర సుందరి ఆలయానికి వెళ్ళి ఆ జగన్మాతను దర్శించుకొని కానీ ఉద్యోగానికి వెళ్ళరు.

    ఒకసారి వారిద్దరూ ఆఫీసు పనిమీద నెలరోజుల పాటు ఒక మారుమూల గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది. చాలా రోజుల తరువాత పల్లెటూరులో పచ్చని వాతావరణాన్ని చూడబోతున్నామనే ఉత్సాహంతో ఇద్దరూ పెట్టేబేడా సర్దుకొని బయల్దేరారు. ఆ ఊరు చేరేసరికి చీకటి పడిపోయింది. ఆఫీసువారు వసతి ఏర్పాటు చేసిన ఇంటిలో దిగి, ప్రయాణ బడలికతో మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. 

    తెల్లవారి నిద్ర లేచి స్నానాదికాలు ముగించుకొని తమ అలవాటు ప్రకారం దైవదర్శనం చేసుకుందామని ఊర్లోకి వెళ్ళారు. ఎంత వెదకినా వారికి ఆ ఊర్లో ఆలయమేదీ కనిపించలేదు. ఊర్లో వాళ్ళని అడుగగా ఊరి పొలిమేరలో పోలేరమ్మ ఆలయం ఉందని చెప్పారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక రావిచెట్టు క్రింద ఒక పెద్ద రాయి ఉంది. ఆ శిలకు పసుపుకుంకుమలు అద్ది ఉన్నాయి. ఆ ఊరి ప్రజలందరూ పొలం పనులకు వెళ్తూ అక్కడ ఆగి ఆ శిలారూపంలో ఉన్న పోలేరమ్మకు భక్తితో నమస్కరించి వెడుతున్నారు. వారిని చూసిన సత్యం కూడా ఆ తల్లికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అయితే అలా నమస్కరించడానికి సుందరానికి మనస్కరించలేదు.

    "ఒరేయ్ సత్యం! ఇదేమి దేవాలయం రా? ఇక్కడ ఒక ఆలయం లేదు, గోపురం లేదు, ఆగమశాస్త్రంలో చెప్పిన ఎటువంటి కట్టడాలూ లేవు. వేదాలు చదువుకున్న పూజారి లేడు, సరికదా అమ్మవారు అని నమస్కరించడానికి ఇక్కడ అసలు సరైన విగ్రహమే లేదు. ఏదో చదువురాని ఈ ఊరి జనులందరూ మూఢభక్తితో నమస్కరించినంత మాత్రాన ఈ రాయి నిత్యం మనం కొలిచే బాలా త్రిపుర సుందరి అయిపోతుందా? ఇటువంటి క్షుద్రదేవతలను నేను నమ్మను" అన్నాడు సుందరం.

    "అది కాదురా సుందరం! జగత్తులో ఆ జగన్మాత లేని ప్రదేశం అణువైనా లేదని మన ఆలయంలో ప్రవచనకారులు ఎంతమంది ఎన్నిసార్లు చెప్పగా మనం వినలేదు? మరి సర్వత్రా నిండి ఉన్న ఆ పరమాత్మ భక్తానాం హృదయాంభోజే విశేషేన ప్రకాశతే - భక్తుల హృదయాలలో ఇంకా విశేషంగా ప్రకాశిస్తాడు అని పెద్దలు చెబుతారు కదా! మరి ఈ ఊరిలో ఇంతమంది భక్తులు హృదయపూర్వకంగా ఇక్కడ ఈ శిలారూపంలో పోలేరమ్మగా జగన్మాత కొలువై ఉన్నదని విశ్వసిస్తున్నపుడు ఆ జగన్మాతను ఎలా కాదంటావు? ఇప్పుడంటే ఆ అలవాటు తగ్గిపోయింది కానీ పూర్వం మన అమ్మమ్మల కాలంలో వంట ఇంట్లోనే ఒక మూల గోడకి ఇంత పసుపు కుంకుమలు పూసి, అదే దైవస్థానమని నమ్మి, చేసిన వంట అంతా అక్కడే మహానివేదన చేస్తే మనం ప్రసాదంగా భావించి స్వీకరిచేవాళ్ళం కదా!" అన్నాడు సత్యం.

    "నువ్వు ఎన్నయినా చెప్పు సత్యం! నాకెందుకో ఇటువంటి క్షుద్రదేవతల మీద నమ్మకం కుదరటం లేదు" అని సుందరం అక్కడనుంచి వెళ్ళిపోయాడు. తరువాత వారిద్దరూ పనిలోపడి ఈ విషయాన్ని అక్కడితో వదిలేశారు. ప్రతిరోజూ స్నానం అవ్వగానే సత్యం ఊరి పొలిమేరకు వెళ్ళి ఆ పోలేరమ్మకు భక్తితో నమస్కరించి తన పనిలోకి వెడుతున్నాడు. సుందరానికి మాత్రం ఆ ఊరిలో సరైన దేవాలయం లేదు, తన భక్తిని చూపించడానికి ఒక ఆలంబన లేదనే లోటు మాత్రం అలాగే ఉండిపోయింది.

    ఇలా ఒక వారం గడిచేసరికి పట్నంలో ఫిల్టర్ నీళ్ళకి అలవాటుపడ్డ సుందరానికి ఆ పల్లెటూరి నీరు తేడా చేసి విరేచనాలు మొదలయ్యాయి. ఒకటి, రెండు కాస్తా పది, పదిహేను అయ్యేసరికి నీరసించి గుడ్లు తేలేశాడు. ఆ ఊరిలో వైద్యశాల లేదు. దగ్గరలోని వైద్యశాలకు చేరాలంటే కాలినడకన కనీసం ఒక రోజు పడుతుంది. పైగా సుందరానికి నడిచే శక్తి లేదు. అందకని సత్యం పరుగున వెళ్ళి ఆ ఊరిలోని నాటువైద్యుణ్ణి పిలుచుకు వచ్చాడు. ఆ వైద్యుడు తన దగ్గరున్న మూలికలేవో ఇచ్చాడు కానీ ఎంతసేపైనా విరేచనాలు ఆగటంలేదు. ఇక ఆ వైద్యుడు "ఇది నా చేత అయ్యేపని గాదు సామీ! మా ఊరి పోలేరమ్మ శానా మహిమగల తల్లి. తెల్లదొరల కాలంలో ఈ ప్రాంతమంతా మశూచికం వచ్చి ఎన్నో వేలమంది చనిపోయారు. అది మా ఊరిని కూడా కబళిస్తాదేమో అని మా పెద్దలు గుండెలు చిక్కబట్టుకొని ప్రార్థిస్తే ఆ లోకాలనేలే తల్లే ఈ ఊరి పొలిమేరలో పోలేరమ్మగా వెలసి ఆ మాయదారి రోగాన్ని మా ఊర్లోకి రాకుండా అడ్డుకుంది. మీరు ఆ తల్లికి మొక్కుకోండి. దయగల మాతల్లి తప్పక కరుణిస్తాది" అని చెప్పి వెళ్ళిపోయాడు.

    ఇక వేరే గత్యంతరం లేక సుందరం మనసులోనే ఆ పోలేరమ్మకు నమస్కరించి "అమ్మా! నువ్వు జగన్మాతవని ఇక్కడి ప్రజలంతా నమ్ముతున్నారు. నేను నిత్యం కొలిచే బాలా త్రిపుర సుందరే నీ రూపంలో ఇక్కడ ఉందని మా సత్యం కూడా చెబుతున్నాడు. నేనేనాడూ నీకు మొక్కకపోయినా కనీసం వారందరి విశ్వాసాన్ని చూసైనా నన్ను ఈ దురవస్థ నుండి తప్పించు తల్లీ!" అని వేడుకున్నాడు. మెల్లగా విరేచనాలు తగ్గుముఖం పట్టి మర్నాటికి కొంచెం కోలుకున్నాడు సుందరం. శక్తిని కూడదీసుకొని అతి కష్టంమీద తన స్నేహితుని సాయంతో నడుచుకుంటూ పోలేరమ్మ దగ్గరకు చేరి మనసారా నమస్కరించాడు. 

    అప్పుడు ఆశ్చర్యంగా ఆ పోలేరమ్మలోనే సుందరానికి తన ఇష్టదైవమైన బాలా త్రిపుర సుందరి అమ్మవారు ప్రత్యక్షమైంది. "నాయనా! నీ కళ్ళు తెరిపించడానికే నేను ఈ లీల చూపించవలసి వచ్చింది. నేను నా బిడ్డలందరినీ సమానంగా సృష్టించినా మీలో మీరే ఎక్కువ తక్కువలు కల్పించుకొని కొట్టుకుంటున్నారు. ఇది నాకెంత బాధను కలిగిస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అక్కడితో ఆగకుండా చివరికి నావే అయిన వివిధ రూపాలలో, వాటి ఆరాధనా పద్ధతులలో కూడా ఎక్కువ తక్కువలు కల్పించి ఎందుకిలా భ్రాంతిలో పడిపోతున్నారు? దైవం, లేదా దేవత అంటేనే స్వయంప్రకాశమైనది. మళ్ళీ అందులో ఎక్కువ తక్కువలకు తావెక్కడ? గూటిలోని చిన్న దీపమైనా సూర్యనికంటే వేలరెట్లు కాంతివంతమైన నక్షత్రమైనా చేసేపని చీకటిని పారద్రోలడమే కదా! అలాగే బదరీ, కేదార, శ్రీశైల, తిరుమలాది పుణ్యక్షేత్రాలలో కొలువైవున్న దేవతల నుంచి పల్లెటూరి పొలిమేరలో చెట్టుక్రింద ఉన్న పోలేరమ్మ వరకు దేవతలందరిలో ఉన్న శక్తి ఒక్కటే. కొలిచే భక్తుల భక్తిలో ఎక్కువ తక్కువలు ఉండవచ్చేమో కానీ దైవత్వంలో క్షుద్రత్వం ఉండదు" అని సుందరానికి కనువిప్పు కలిగించి ఆ జగన్మాత మాయమైపోయింది.

వెలుగున్న యెడ చీకటెక్కడ
దైవమున్న యెడ క్షుద్రమెక్కడ
గురువున్న యెడ యజ్ఞానమెక్కడ
కాళీ ప్రసాదు మాట కాంతిబాట||

1, ఫిబ్రవరి 2023, బుధవారం

శోభకృత్

    శ్రీ కాళీ వనాశ్రమ స్వర్ణోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడిన శ్రీ శుభకృత్ నామ సంవత్సరానికి వీడ్కోలు పలికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. సాధారణంగా ఉగాది అంటేనే ప్రకృతి అంతా ఉత్సాహంగా, శోభాయమానంగా ఉంటుంది. అప్పటి వరకు శిశిరంలో ఆకులు రాల్చి మోడులై పడి ఉన్న వృక్షాలన్నీ క్రొత్త చిగుర్లు వేసి, లేలేత ఆకులతో, రంగురంగుల పువ్వులతో ఎంతో ఆనందంగా తుళ్ళిపడుతూ ఉంటాయి. తమందరికి ఆధారమైన ఆ వృక్షాల ఆనందం చూసి భూమి మీద నివసించే సకల జంతుకోటికి ఆనందం, ఉత్సాహం కలుగుతాయి. ఇలా సృష్టిలోని ప్రతి జీవిని ఉత్సాహపరుస్తుంది వసంతశోభ. అది మన పెరట్లో ఉన్న ఒక్క చెట్టయినా, లేక ఎన్నో ఎకరాలలో విస్తరించిన మహోద్యాన వనమైనా ఈ వసంతం తెచ్చే ఆనందంలో ఏమైనా తేడా ఉంటుందా?

    అలాగే ఎంతోకాలం పాటు, నిజానికి ఎన్నెన్నో జన్మలుగా, ఈ సంసార చక్రంలో బంధించబడి ఆ బాధలు తట్టుకోలేక, బయటపడే దిక్కు తెలియక మోడులై జీవితాలను వెళ్ళదీస్తున్న ఆర్తులైన ఎందరో భక్తుల జీవితాలలో, వారి సామాజిక, ఆర్థిక, పారమార్థిక స్థాయిలలో భేదాలతో సంబంధం లేకుండా నేనున్నానని అభయమిచ్చి, దరిచేరే దారిచూపి వసంతశోభను నింపిన సద్గురుదేవుల మహిమను ఏమని వర్ణించగలం? అది మాటలకు అందేది కాదు. వారు భక్తులైనా, ఆర్తులైనా, జిజ్ఞాసువులైనా, అర్ధార్ధులైనా, జ్ఞానులైనా తమకు తాముగా వారి వద్దకు వెళ్ళి, వారిని అక్కున చేర్చుకొని, వారందరినీ ఒకచోట చేరదీసి ఈ కాళీ వనాశ్రమాన్ని సద్భక్తోద్యానవనంగా మార్చిన వసంతులు శ్రీగురుదేవులు. 'ఓం సద్భక్తోద్యానవన వసంతాయ నమః' అన్నది వారి సార్ధక నామధేయం.

    నిజానికి వృక్షాలు శిశిరంలో ఎంతగా బాధపడినా అవి మూగగా రోదించగలవు కానీ వసంతాన్ని వెదుక్కుంటూ వెళ్ళలేవు కదా! అలాగే మానవుడికి నడిచి వెళ్ళే శక్తి ఉన్నా తనను ఈ సంసార బాధలనుండి రక్షించే గురువును వెదుక్కుంటూ ఎక్కడికని వెడతాడు? ఫలానా వారు తనను ఉద్ధరించగల గురువులని ఎలా గుర్తు పడతాడు? అది అసాధ్యం. అందుకే ఆ మానవుడి ఆర్తి గాఢమైనపుడు ఆ గురువే అతనిని వెదుక్కుంటూ వస్తాడు. సమర్ధ సద్గురు శ్రీశ్రీశ్రీ హనుమత్ కాళీ వర ప్రసాద బాబూజీ మహరాజ్ వారిని ఆశ్రయించి తరించిన ఎందరో భక్తుల జీవితాలలో ఇది ప్రత్యక్ష నిదర్శనం.

    అప్పటికే సాధకులై కొంత ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించిన శ్రీ కందర్ప పరశురామయ్యగారు, నిండ్రకొలను డాక్టరు శ్రీ కొప్పెర్ల వెంకటరాజుగారు, శ్రీ లలితానంద సరస్వతీ స్వామినివారు, శ్రీ లంకా శేషగిరి రావుగారు మొదలైన ఉద్దండుల దగ్గరినుంచి అసలు దేవుడంటే ఎవరో, ఆయనను ఎలా కొలవాలో తెలియని, అసలు తాను సంసారమనే బంధనంలో ఉన్నానని కూడా గుర్తించలేని అతి పామరుని వరకు ప్రతి ఒక్కరికీ శ్రీ బాబు వారంతట వారిగా పరిచయమై వారి వారి జీవితాలలో పెనుమార్పును తీసుకువచ్చి, ఆధ్యాత్మిక పథంలో అగ్రగాములుగా నిలబెట్టి, అత్యున్నతమైన మోక్ష సామ్రాజ్యాన్ని వారికి అందించారు. ఇదంతా ఏదో పెద్ద శ్రమతో కూడిన బృహత్ కార్యక్రమంలాగా కాకుండా అసలు వారి జీవితాలలో వస్తున్న మార్పులు వారికే తెలియనంత సహజంగా, సరళంగా నడిపించారు.

    మోడులైన వృక్షాలు కాలగమనంలో తమలోనే అత్యంత సహజంగా మార్పును తెచ్చుకొని పుష్పించి, ఫలించినట్లుగా బద్ధుడైన మానవుడు ఎక్కడికీ వెళ్ళనవసరం లేకుండా ఉన్నచోటనే ఉండి, తనలో మార్పు తెచ్చుకొని, తన హృదయ క్షేత్రంలో భక్తి జ్ఞాన, వైరాగ్య బీజాలు నాటుకొని, అవి అంకురించి, పెంపొంది, తనకు ప్రసాదించే ఆత్మానందమనే ఫలాన్ని పొందవచ్చు. దానికి కావలసిన సాధనాలు రెండే - గురుదేవులయందు అచంచల విశ్వాసం, గురు ఆజ్ఞాపాలన. అయితే దీనికి ప్రతిగా ఆ గురుదేవులు కోరుకొనే గురుదక్షిణ ఏమిటి? ఆ ఆత్మానందాన్ని కేవలం తాను మాత్రమే అనుభవించకుండా, సంకుచిత భేదబుద్ధిని వదలి, సర్వజీవ సమభావనతో తనచుట్టూ ఉన్న సర్వ ప్రాణులకు పంచిపెట్టడమే ఈ గురు వసంతుడు కోరుకొనే ఏకైక కోరిక.

    అలా మనందరి జీవితాలలో వసంతశోభను నింపిన శ్రీగురుదేవులు చూపిన మార్గంలో నడుస్తూ, ఈ శోభకృత్ నామ సంవత్సరంలో మనందరం ఈర్ష్యా ద్వేషాలను వదలి, మానవులందరియందు, అలాగే సర్వ భూతములయందు నిష్కళంకమైన ప్రేమను పెంచుకొని, శాశ్వతానందమయమైన  ఒక క్రొత్త శకంలోకి అడుగు పెట్టాలని ఆశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

26, జనవరి 2023, గురువారం

లక్ష్మక్క

ఆశ్రమ భక్తులందరూ 'లక్ష్మక్క' అని ఆత్మీయంగా పిలుచుకొనే శ్రీ రామలక్ష్మీ ప్రసాద మాతాజీవారు శ్రీ గురుసాయుజ్యం చెందారు. విధివశాత్తు పిన్న వయసులోనే తమకు కలిగిన వైధవ్యాన్ని శాపంగా భావించక రామభక్తిలో లీనమై తద్వారా నిరంతర గురురామ సేవాభాగ్యమనే మహత్తర వరాన్ని పొందిన ధన్యజీవి లక్ష్మక్క. శ్రీగురుదేవులను ఆశ్రయించి తమ భక్తిప్రపత్తులతో వినయవిధేయతలతో వారిని మెప్పించి వారికి అంతేవాసిగా పరిచర్యలు చేసే అర్హతను, శ్రీవారి నిత్య అర్చామూర్తులను పూజించుకొనే భాగ్యాన్ని పొందారు. అంతేకాక భౌతిక బంధాలపై వైరాగ్యాన్ని సాధించి, తమ మాతృమూర్తి అంత్యకాలంలో తాము ఆమె చెంత ఉండి ఆమెకు భ్రాంతిని కలిగించడం కంటే గురుదేవుల సేవలో ఉండి తద్వారా తమకు, తల్లిగారికి కూడా జన్మరాహిత్యాన్ని సాధించడం ఉత్తమమనే వివేకాన్ని కూడా సాధించిన గొప్ప ఆధ్యాత్మిక సాధకురాలు లక్ష్మక్క.

నిజానికి తాము కోటీశ్వరురాలైనా ఆశ్రమ ప్రారంభోత్సవానికి కేవలం మూడు చీరలతో వచ్చిన లక్ష్మక్క శ్రీగురుదేవులు తనకు శ్రీ బాబూ విజ్ఞానమందిర సంరక్షణ భారాన్ని, ‘అమ్మగది’లో పూజాభాగ్యాన్ని ప్రసాదించడంతో అప్పటినుండి పూర్తి నిరాడంబర జీవితాన్ని అవలంబించి గత యాభై సంవత్సరాలుగా తమ బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు. విజ్ఞానమందిరం, ఆలయాల పరిధి దాటి ఎన్నడూ బయటకు రాకపోయినా, ప్రతిరోజూ ఏ అర్చామూర్తికి ఏ పూల మాలలు సిద్ధం చేయాలి, ఎటువంటి వస్త్రాలు, ఆభరణాలు అలంకరించాలి వంటి నిర్ణయాలతో పాటు పూజకు, అభిషేకాలకు కావలసిన సామగ్రి సమస్తం సిద్ధం చేయడం, ఏ సమయానికి అది అందించడం లక్ష్మక్కకే చెల్లు.

శ్రీ బాబూజీ మహరాజ్ వారు ఎప్పుడూ ‘ఆశ్రమ సేవయే గురుసేవ’ అని చెప్పేవారు. వారు ఎక్కడికైనా సత్సంగాలకు బయలుదేరినప్పుడు అవసరానికి మించిన భక్తులు వారితో ప్రయాణమైతే ‘సత్సంగానికి మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉండి ఆశ్రమాన్ని చూసుకుంటాను’ అనేవారు. ‘అందరూ బయటకు వెళ్ళిపోతే ఆశ్రమ సంరక్షణ ఎవరు చూసుకుంటారు?’ అని మందలించేవారు. శ్రీగురుదేవుల ఈ వాక్కులనే మహామంత్రంగా స్వీకరించిన లక్ష్మక్క ఎన్నడూ ఆశ్రమాన్ని విడిచి వెళ్ళలేదు. అలాగే తమను కలిసిన భక్తులను కూడా ఎక్కువగా ఆశ్రమంలోనే ఉండమని ప్రోత్సహించేవారు.

భక్తుల సేవయే భగవంతుని సేవ అని బలంగా నమ్మిన లక్ష్మక్క ఆశ్రమానికి బయటనుంచి వచ్చిన భక్తులకు పూజాదికాలకు సామగ్రిని సమకూర్చడం, తీర్థ ప్రసాదాలను, మంత్రపూతమైన కుంకుమ అక్షతలను అందించడం వంటి సేవలను ఎంతో ఉత్సాహంగా చేసేవారు. అలాగే ఏ చెట్టుకు కానీ, గోవుకు కానీ వ్యాధి సోకి క్షీణిస్తే వాటికి పెద్దమొత్తంలో జగన్మాత తీర్థం పోయించి వాటిని మళ్ళీ పూర్వస్థితికి తీసుకొచ్చేవరకు విడిచిపెట్టేవారు కాదు. అయితే ఏ సేవ చేస్తున్నా కర్తృత్వభావన లేక, సేవ చేసేది, చేయించేది, ఆ సేవను అందుకొనేది శ్రీగురుదేవులే అన్న దృఢవిశ్వాసాన్ని కలిగి ఉండటం విశేషం.

మా చిన్నప్పుడు దసరా వంటి ఉత్సవాలకు ముందు శ్రీ బాబూ విజ్ఞాన మందిరాన్ని శుభ్రపరచడానికి వెళితే అక్కడ అన్ని పనులూ లక్ష్మక్కే దగ్గరుండి చేయించేవారు. ఫ్యానుల్ని, లైట్లను సబ్బునీటితో శుభ్రపరచడం, బూజులు దులపడం ఇలా ఏ పని చేసినా మేము అంతా శుభ్రం అయిపోయింది అని తృప్తి పడిన తరువాత ఆవిడ ఏ మూలో బూజు చూపించడం, ఏ ఫ్యాను రెక్కమీదో ఇంకా దుమ్ము చూపించడం వంటివి చేసేవారు. పైగా ‘శ్రీ బాబూజీ మాతో ఇలాగే చేయించేవారు. మేము అంతా శుభ్రపరచిన తరువాత వారు ఎక్కడో ఒకచోట దుమ్మూ, బూజో చూపించేవారు’ అని చెప్పేవారు. అలాగే దసరా ఉత్సవాలు ముగిసిన తరువాత అంతవరకు ఉపయోగించిన షామియానాలు, కార్పెట్లు వంటివి దగ్గరుండి ఏ మడతలోనూ ఒక్క అంగుళం కూడా తేడా రాకుండా జాగ్రత్త పరచేవారు. ఇలా రోజు మొత్తంలో తాము ఏ పని చేస్తున్నా ‘ఇది ఇలా చేస్తేనే బాబూజీకి ఇష్టం, ఈ పని బాబూజీ ఇలా చేయించేవారు’ అనుకుంటూ నిరంతరం బాబు నామస్మరణలోనే గడిపేవారు. ఇంతకంటే భక్తియోగం, కర్మయోగం ఇంకొకటి లేదు కదా!

ఆశ్రమ సేవ విషయంలో అవతలివారు ఎంతటి ప్రముఖులైనా ఏమాత్రం భయపడకుండా సూటిగా, నిష్కర్షగా మాట్లాడటం లక్ష్మక్క ప్రత్యేకత. ‘ఈరోజు పొగిడి రేపు తిట్టే లోకుల మెప్పు పొందటానికి ప్రయత్నిస్తావా? లేక నిరంతరంగా, నిర్హేతుకంగా తన కృపారసాన్ని వర్షించే భగవంతుని మెప్పు పొందటానికి ప్రయత్నిస్తావా? ఇందులో ఏది ఉత్తమం?’ అని శ్రీగురుదేవులు తరచుగా చేసే హెచ్చరికను నరనరాల జీర్ణించుకోవడమే లక్ష్మక్కలోని ఈ నిర్భీతికి కారణం. లోకులు తమను తిట్టుకున్నా, తాము చేసే పని గురుదేవులు మెచ్చే విధంగా ఉంటే చాలనేది ఆమె సిద్ధాంతం. తమవద్ద పనిచేసే వారికి కూడా ఆమె ఇదే నూరి పోసేవారు. ‘ఈ మాట ఇలా చెబితే అవతలివారు ఏమైనా అనుకుంటారేమో, లేక తనను తిడతారేమో’ అని ఎవరైనా సంకోచించినప్పుడు లక్ష్మక్క వారిని అనునయిస్తూ, ‘ఈ పని నువ్వు నీకోసం చేయడం లేదు కదా. గురుదేవుల సేవగా భావించి చేసుకుంటున్నావు. మరి ఆ సేవలో ఎవరైనా నిన్ను నిందించినా గురుదేవుల సేవ కోసం ఒక చిన్న మాట పడితే నీకొచ్చిన నష్టమేమిటి?’ అని ప్రశ్నించి వారిలో కూడా ఈ వివేకాన్ని రగిలించేవారు.

ఆశ్రమ స్థాపన జరిగిన క్రొత్తలో అంతగా వసతులు ఉండేవి కావు. శ్రీగురుదేవుల సేవకై ఒక్కటే టేబల్ ఫ్యాన్ ఉండేది. శ్రీ బాబూజీ మహరాజ్ వారు క్రింద అమ్మగదిలో పూజ చేసుకొనేటప్పుడు లక్ష్మక్క ఆ ఫ్యాన్ క్రిందికి తెచ్చి, మళ్ళీ శ్రీవారు పూజ ముగించి పై అంతస్తుకు చేరుకునేలోగా మూడేసి మెట్లు ఒక్క అంగలో ఎక్కుతూ ఆ ఫ్యానును పైకి చేర్చేవారు. ఇలా దేహాన్ని మరచి నిరంతర తత్పరతతో గురుసేవ చేసుకొన్న శ్రీ లక్ష్మక్క సరిగ్గా వైకుంఠద్వారం తెరచి శ్రీగురునారాయణులు లోకాలకన్నింటికీ దర్శనభాగ్యాన్ని ప్రసాదించే సమయానికి కొద్ది ముందుగానే అందుకు తగిన ఏర్పాట్లు చేయడానికా అన్నట్లు ముక్కోటి ఏకాదశికి కొద్ది ఘడియలు ముందుగా తమ పాంచభౌతిక దేహాన్ని విడిచి సద్గురు సాయుజ్యాన్ని పొందారు.
ఇటువంటి మహాత్ములు చూపిన మార్గంలో నడిచి గురుసేవలో, ఆశ్రమసేవలో, భక్తులసేవలో మన జీవితాలను ధన్యం చేసుకోవటమే మనం వారికి అర్పించగలిగిన ఘన నివాళి.

మహాలక్ష్మి

 నిరాకార పరబ్రహ్మ స్వరూపిణి అయిన జగన్మాతను మనం ఈ నవరాత్రి ఉత్సవాలలో సాకారంగా వివిధ ఆకృతులలో పూజించుకుంటూ ఉంటాం కదా! అందులో ముఖ్యమైన మూడు ఆకృతులు ముగురమ్మలుగా పిలువబడే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఇందులో మహాకాళి రూపిణి అయిన పార్వతీ/దుర్గాదేవి గురించి మనం అనేక కథలు దేవీభాగవత రూపంలో ఈ పదిరోజులూ వింటూనే ఉన్నాం. అలాగే సరస్వతీదేవి గురించి కూడా మూలా నక్షత్రం రోజున మనం విశేషంగా చెప్పుకుంటాం. అయితే లక్ష్మీదేవి గురించి మాత్రం మనం అంతగా చెప్పుకోం. ఆధ్యాత్మిక సాధనలో ఉన్న మనకు ఐశ్వర్యంతో పెద్దగా పనిలేదని ఒక ఆలోచన కావచ్చు.


అయితే లక్ష్మీ కటాక్షం కేవలం సంపదకు మాత్రమే కాదు. మనం కడుపునిండా అన్నం తినగలుగుతున్నాం అంటే అది ధాన్యలక్ష్మి కటాక్షం. ఆ అన్నం సంపాదించుకోవడానికి కావలసిన చదువు అబ్బిందంటే అది విద్యాలక్ష్మి కటాక్షం. అలాగే ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి ఇలా ఈ సృష్టిలో మనకున్నవన్నీ ఆ తల్లి దయవలన కలిగినవే. వీటన్నిటికన్నా ఉత్కృష్టమైనది, మనం కాంక్షించవలసినది మోక్షలక్ష్మి అనుగ్రహం.

ఈశానాం జగతోస్య వేంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం
తద్వక్షస్థల నిత్యవాస రసికాం తత్ క్షాంతి సంవర్ధినీం
పద్మాలంకృత పాణి పల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం
వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వన్దే జగన్మాతరం||

ఈశానాం జగతోస్య వేంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం - ఈ జగత్తు అంతటికీ ఈశ్వరుడు, వేంకటపతి అయిన విష్ణువుకు అత్యంత ఇష్టురాలు ఆ తల్లి. ఎంతటి ప్రేయసి అంటే - వేదరూపంలో ఉన్న విద్యాలక్ష్మిని సోమకాసురుడు అపహరిస్తే స్వామి మత్స్యావతారం ఎత్తాడు. దూర్వాసుని శాపంతో ఇంద్రుని వద్దనున్న ధనలక్ష్మి అంతా సముద్రం పాలైపోతే తిరిగి ఆ తల్లిని పొందటం కోసం కూర్మావతారం ఎత్తాడు. భూమాత రూపంలో ఉన్న ధాన్యలక్ష్మిని హిరణ్యాక్షుడు బాధిస్తుంటే వరాహావతారం ఎత్తాడు. చెంచులక్ష్మి రూపంలో ఉన్న అమ్మను పొందటానికి నరసింహావతరం ఎత్తాడు. ముల్లోకాల సంపద రూపంలో ఉన్న ఐశ్వర్యలక్ష్మిని బలి చక్రవర్తి నుండి విడిపించటానికి వామనావతారం, త్రివిక్రమావతారం ఎత్తాడు. అందరికీ సమంగా చెందవలసిన లక్ష్మి అనుగ్రహాన్ని రాజులు తమవద్దనే బంధించి అహంకారులై ప్రవర్తిస్తుంటే పరశురామావతారం ఎత్తాడు. ఇక రామావతరంలో అయితే అమ్మతో కలిసే వచ్చి, ఆ అమ్మ దూరమైనందుకు ఎంత వేదన అనుభవించాడో చెప్పలేం. ఆ అమ్మను తిరిగి పొందటానికి ఎన్నో అసాధ్యమైన పనులు చేశాడు. కృష్ణావతారంలో ఎంతో మంది రాజులతో, చివరికి బావమరిదితో కూడా యుద్ధం చేసి మరీ అమ్మను దక్కించుకున్నాడు. మోక్షలక్ష్మి అనుగ్రహం పొందే ఆలోచన లేక ఇతర లక్ష్ముల కోసం ప్రాకులాడుతూ చివరికి కష్టాలతో మట్టిపాలైపోయే మనుష్యులకు మోక్షమార్గాన్ని అందించటానికై బుద్ధావతారం ఎత్తాడు. అధర్మం అతిగా ప్రబలిన చోట లక్ష్మి నిలువలేదని ఆ అధర్మాన్ని సమూలంగా రూపుమాపటానికి కల్కి అవతారం ఎత్తాడు. అమ్మకు దూరమై క్షణమైనా నిలువలేనని వైకుంఠాన్ని కూడా విడిచిపెట్టి వేంకటపతి అయ్యాడు.

స్వామికి అమ్మ అంటే ఎంత ప్రేమో, అమ్మకు స్వామి మీద అంతకంటే ఎక్కువ ప్రేమ. తద్వక్షస్థల నిత్యవాస రసికాం - ఎప్పుడూ ఆ స్వామి వక్షస్థలంలోనే నివసించడమే అమ్మకు అత్యంత ప్రీతికరం. తనను అడవులపాలు చేసినా, పదహారు వేలమంది సవతులను తెచ్చినా ఏనాడూ కోపించని అమ్మ తన స్వామికి అవమానం జరిగితే మాత్రం తట్టుకోలేకపోయింది. అది కూడా తన శాశ్వత నివాస స్థానమైన వక్షస్థలం మీద ఒక ఋషి తంతే భరించలేకపోయింది. అలిగి కొల్హాపురానికి వెళ్లిపోతే అంతటి స్వామి కూడా భూమిపైకి దిగివచ్చి ఎంతో తపస్సు చేసి మళ్ళీ ఆవిడను దక్కించుకోవలసి వచ్చింది.

తత్ క్షాంతి సంవర్ధినీం - స్వామిలో ఓర్పును వృద్ధి పొందించేది అమ్మ. ఇప్పుడైతే రోజులు మారిపోయాయి కానీ తరతరాలుగా, మన చిన్నప్పుడు కూడా అందరికీ నాన్న అంటే హడల్. ఒక తప్పు చేసినా, లేదా నాన్నను ఏదైనా అడగలన్నా అమ్మ కొంగు చాటున నిలుచోటమే తెలుసు. నాన్న కోపాన్ని చల్లబరిచి ఆయనలో ఓర్పును కలిగించి మనకు అనుకూలంగా మార్చేది అమ్మే కదా! అసలు 'స్త్రీ బుద్ధిః ప్రళయాంతకః' అని ఆడవాళ్ళ మాట వింటే ప్రళయాలు సృష్టిస్తారని తప్పుగా అర్థం చెబుతారు కానీ అక్కడ 'ప్రళయ కారకః' అనలేదు కదా, 'ప్రళయాంతకః' అన్నారు కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. భర్తో, కొడుకో అప్పో తప్పో చేస్తే కోపంగా ఇంటిమీదకు వచ్చిన వాడిని కూడా 'అన్నయ్యగారూ! ఈ గొడవలన్నీ ఎప్పుడూ ఉండేవే! ఇదిగో ఈ కాఫీ తీసుకోండి. వదినగారు, పిల్లలు బాగున్నారా?' అని ఆ ఇంటి గృహలక్ష్మి నాలుగు అనునయ మాటలు మాట్లాడేసరికి అంతటి ప్రళయం కూడా అంతం అయిపోతుంది.

పద్మాలంకృత పాణి పల్లవ యుగాం పద్మాసనస్థాం - అమ్మ తన రెండు నునులేత చేతులలో పద్మాలను పట్టుకొని ఉంటుంది. అలాగే ఆవిడ ఆసనం కూడా పద్మమే. అసలు దేవతలందరూ పద్మంలో కూర్చోవటమో, లేదా వారి ముఖాలను, నేత్రాలను, చేతులను, పాదాలను ఇలా ప్రతి అవయవాన్ని పద్మంతో పోల్చటం ఎందుకంటే అందులో ఏదో ఒక ముద్రమీద మన మనస్సు తుమ్మెదలా అతుక్కుపోవాలని.

శ్రియం - సరే, ఇక శ్రీ అంటే లక్ష్మీదేవే కదా!

వాత్సల్యాది గుణోజ్వలాం - అమ్మకు ఈ సృష్టిలోని ప్రతి జీవిపైన ఎంతటి వాత్సల్యమో! శక్తిస్వరూపిణియైన పార్వతీదేవి అనేక రూపాలలో ఎందరో రాక్షసులను సంహరించిన కథనాలు మనం ఎన్నో వింటూ ఉంటాం, కానీ లక్ష్మీదేవి ఎవరిమీదా ఆగ్రహం చూపించిన సందర్భం మనకు కనబడదు. లక్ష్మీ అష్టకంలో చాలామంది 'డోలాసుర భయంకరి' అని చదువుతారు కానీ నిజానికి డోలాసురుడు అనే రాక్షసుడు ఎవరూ లేరు. అది 'కోలాసుర భయంకరి'. కోల అంటే వరాహం. అడవిపంది రూపంలో ఉన్న ఆ రాక్షసుడు లోకాలను పీడిస్తుంటే, స్త్రీ చేతిలోనే సంహరింపబడాలని వాడికి ఉన్న వరం కారణంగా తప్పనిసరి పరిస్థితులలో మహాలక్ష్మి అమ్మ వాడి అశాశ్వతమైన దేహాన్ని సంహరించినా మళ్ళీ తన వాత్సల్యంతో ఆ బిడ్డ పేరును శాశ్వతం చేస్తూ ఆ ప్రదేశాన్ని కొల్హాపురంగా మార్చి తాను శాశ్వతంగా అక్కడ కొలువై ఉండిపోయింది.

భగవతీం - అమ్మ స్వయంప్రకాశ స్వరూపిణి. మనం త్రిమూర్తుల గురించి గొప్పగా చెప్పుకొని ముగ్గురమ్మలు ఏదో వారి భార్యలు అని తేలిగ్గా అనుకుంటాం కానీ ఆ త్రిమూర్తులకు శక్తినిచ్చేది, వారి వారి విధులను నిర్వర్తింపజేసేది ఆ తల్లులే. అటువంటి జగన్మాతయైన మహాలక్ష్మి తల్లికి నమస్కారం - వన్దే జగన్మాతరం.

సాధారణంగా ఎవరైనా స్త్రీ సంప్రదాయకమైన వేషభాషలలో కనిపిస్తే ఆవిడ ముఖంలో లక్ష్మీకళ ఉట్టిపడుతోంది అంటాం. ఉట్టిపడటం అంటే పొయ్యిమీద పెట్టిన పాలు పాత్రలోనుంచి కొద్దిగా బయటకు పొంగటంలాంటిది. అలాగే మానవుడు కూడా తనకున్న సంపదనంతా పంచిపెట్టేయడు. తన పాత్ర నిండిన తరువాత, లోపల ఇంకేదో చేయాలనే వేడిపుడితే, ఆ సంపదలో కొంత దానధర్మాల రూపంలో బయటకు పొంగుతుంది అంతే. కానీ జగన్మాత అలా కాదు. ఆవిడ 'వక్త్ర లక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచన' - అమ్మ ముఖంలో లక్ష్మీ ప్రవహిస్తూ ఉంటుంది. అంటే అక్కడ వచ్చినది వచ్చినట్లుగా ఇచ్చివెయ్యటమే కానీ దాచుకోవటం ఉండదు. అమ్మ వదనంలోని ఆ లక్ష్మీ ప్రవాహంలో రెండు చేపలు అటూ ఇటూ కదులుతూ ఉంటాయిట. ఆ చేపలే అమ్మ కళ్ళు. ఎప్పుడు ఏ బిడ్డకు ఈ సంపద అవసరమౌతుందో, ఆ క్షణంలోనే ఆదుకుందామని అమ్మ ఎప్పుడూ అటూ ఇటూ చూస్తూనే ఉంటుంది. మామూలుగా ఏదైనా ఆలయానికి ఒక గోపురం ఉంటుంది. గోపురం అంటే ఆలయానికి ప్రవేశద్వారం కదా. బయట అహంకారంతో విర్రవీగే జీవులందరూ ఈ ఎత్తైన గోపురం క్రిందకు వచ్చేసరికి తాము ఎంతటి అల్పులో అర్ధమైపోయి శిరస్సు దానంతటదే భగవంతుని ముందు వంగిపోతుంది. అయితే మధురైలోని మీనాక్షీ అమ్మ ఆలయానికి ఒకటి, రెండు కాదు, ఏకంగా పధ్నాలుగు గోపురాలు ఉన్నాయి. అంటే తన చేపలవంటి కళ్ళతో ఎప్పుడు ఏ బిడ్డ తన దగ్గరకు వస్తాడో అని ఆ అమ్మ నిరంతరం అటూ ఇటూ చూస్తూ ఏకంగా తనను చేరుకోవటానికి అన్నివైపులా పధ్నాలుగు ద్వారాలు పెట్టుకుంది.

ఇక ముగ్గురమ్మల దగ్గరకు వస్తే విద్యకు, జ్ఞానానికి అధినేత్రి అయిన సరస్వతీదేవి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి సేవ చేస్తున్నట్లు ఎక్కడా మనం చూడం. అంటే ఈ సృష్టికి పూర్వం నుంచి, సృష్టి ఉన్నా, లేకపోయినా ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది జ్ఞానమే కానీ, అది సృష్టికి లోబడి వచ్చిపోయేది కాదు. అలాగే శక్తిస్వరూపిణి అయిన పార్వతీదేవి కూడా లయకారకుడైన పరమేశ్వరుని ప్రక్కన కూర్చున్నట్లుగానో, లేక ఆయనతో కలిసి నృత్యం చేస్తున్నట్లుగానో కనిపిస్తుంది కానీ, ఆయనను పూజిస్తున్నట్లు చాలా అరుదుగా కనిపిస్తుంది. అంటే సృష్టి అంతా లయించిపోయినా కానీ శక్తికి నాశనం లేదు. అంతెందుకు మన కళ్ళముందే ఎందరో కవులు, రచయితలు, గాయకులు, శాస్త్రవేత్తలు ఇలా ఎంతో ప్రతిభ కలవారు కాలగర్భంలో కలిసిపోతున్నారు కానీ, అంతటితో ఆయా కళలు కానీ, శాస్త్రాలు కానీ నశించిపోతున్నాయా? ఆ ప్రతిభ, లేక శక్తిని పుణికిపుచ్చుకొని దానిని ముందుకు తీసుకెళ్ళడానికి మరొక వ్యక్తి తయారవుతాడు. కానీ సంపదకు అధినేత్రి అయిన లక్ష్మీదేవి మాత్రం ఎప్పుడు సృష్టిని నడిపించే నారాయణమూర్తితో కలిసి కనిపించినా ఆయనకు పాదసేవ చేస్తూనే కనిపిస్తుంది. అంటే సృష్టి, లేదా ఒకవ్యక్తి జీవితం నడవటానికి సంపద కావాలి కానీ, సంపద కోసమే జీవితం కాకూడదు అనే సందేశాన్ని అమ్మ మనకు అందిస్తోంది.

మనందరం ఎంతగా నారాయణ స్మరణ చేసుకుంటే అంతగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది.

ఆశ్రమ ప్రముఖులు

 శ్రీ కాళీగార్డెన్స్ ఆశ్రమ స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న ఈ శుభ తరుణంలో విశేషంగా ఆశ్రమసేవ చేసుకొని తమ జీవితాలను ధన్యం ఒనర్చుకొని శ్రీగురుసాయుజ్యం పొందిన ప్రముఖ భక్తులను సంస్మరించుకోవటం మన కర్తవ్యం.


శ్రీ బచ్చు పాండురంగ శ్రీశైలరావు ప్రసాద్ - వీరినే మనందరం పాండుగారు అని ఆప్యాయంగా పిలుచుకుంటాం. ఇంతటి ఆశ్రమం స్థాపించాలన్నా, దానిని నిరాటంకంగా నడిపించాలన్నా దానికి తగిన అంగబలం, అర్థబలం కావాలి కదా. ఈ రెండూ ఉండటమే కాక, వాటిని గురుచరణారవిందముల సన్నిధిలో పూర్తిగా అర్పించగల అనన్య భక్తి ఉన్నవారు పాండుగారు. ఆశ్రమానికి కావలసిన స్థలాన్ని సేకరించడం దగ్గరనుండి, దాని నిర్మాణానికి కావలసిన సకల సామగ్రిని, సదుపాయాలను సమకూర్చడమే కాక, ఆశ్రమంలోని ప్రతి భక్తుని సేవ, గురుదేవుల సేవగా భావించి నిష్టతో చేసుకున్నారు వారు. ఆశ్రమవాసులు ఎవరైనా పనిమీద గుంటూరు వెళ్ళి, అక్కడ ఏ అవసరం వచ్చినా, ఇబ్బంది కలిగినా ముందుగా గుర్తు వచ్చేది, వెళ్ళి ఆశ్రయం పొందేది పాండుగారి ఇంటికే. అలాగే ఆశ్రమంలోని దాదాపు అన్ని పెద్ద పండుగల నిర్వహణా భారం వారి కుంటుంబానిదే. శ్రీ సద్గురు యువసేవాసమితి ప్రధమ అధ్యక్షులుగా కూడా వీరు సేవలందించారు.

శ్రీ లలితానంద సరస్వతీ స్వామిని - ఆశ్రమం నడవటానికి భౌతిక వసతులు పాండుగారు కల్పిస్తే, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వసతులన్నీ గురువుగారు కల్పించారు. ఆమెకు రాని శాస్త్రం కానీ, పురాణం కానీ లేదు. ఆశ్రమంలో ఏఏ కార్యక్రమాలు ఎలా జరుపుకోవాలో, ఏ పూజ ఎలా చేయాలో దానికి కావలసిన విధివిధానాలను ఏర్పరచటమే కాక, భక్తులందరికీ అందులో శిక్షణనిచ్చారు. ఆధ్యాత్మిక వాఙ్మయంలో ఏ విషయం గురించైనా, ఎంత సేపైనా అనర్గళంగానే కాక, సరళంగానూ జనరంజకంగానూ ప్రసంగించగల విద్వత్తు ఆమె స్వంతం. అయితే ఎక్కడా నేను పండితురాలననే అహం చూపక భక్తులందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ, ఉత్సాహపరుస్తూ, శిక్షణనివ్వటమే కాకుండా, ఆశ్రమానికి క్రొత్తవారు ఎవరు ఏ సమయంలో వచ్చినా, వారికి రుచిగా వండి ప్రసాదాన్ని కూడా అందించిన అన్నపూర్ణ ఆ తల్లి. ఆశ్రమంలో ఆవిడ చేయని సేవ లేదంటే అతిశయోక్తి కాదు.

శ్రీ విజయేశ్వరానంద ప్రసాద్ - శ్రీ గూడూరి వెంకటరత్నంగారిగా సుపరిచితులైన వీరు ఆశ్రమ ప్రార్థనను రచించటమే కాక అనేక సంకీర్తనలను వ్రాసి పాడిన వాగ్గేయకారులు. అంతేకాక ప్రతి సంవత్సరం దసరా మహోత్సవాలలో శ్రీగురుదేవులు మెచ్చే విధంగా ఎన్నో భక్తుల మహాత్ముల చరిత్రలను నాటకలుగా రచించి, బాలబాలికలకు అందులో శిక్షణనిచ్చి ప్రదర్శింపజేసేవారు. సుదీర్ఘకాలం ఆశ్రమ గురుకుల నిర్వహణా బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించారు. అంతేకాక శ్రీ రామలింగేశ్వరాలయంలో, శ్రీ కాళికాలయంలో నిత్యపూజల బాధ్యతను వీరు, వీరి ధర్మపత్ని కళ్యాణమ్మగారు జీవితాంతం నిర్వహించారు. శ్రీగురుదేవుల దివ్య బోధలను గురువాణి అనే గ్రంధరూపంలో లోకానికి అందించడమే కాకుండా శ్రీగురు చరిత్రను సమగ్రంగా సేకరించి రెండు భాగాలుగా అందించారు.

శ్రీ సుగుణ ప్రసాద - అందరూ సుగుణక్కగా పిలుచుకొనే ఈ తల్లి నిరంతరం శ్రీబాబూజీ, శ్రీమాతాజీల వెన్నంటి ఉండి మౌనంగానే ఆశ్రమ నిర్వహణకు సంబంధించిన ఎన్నో బాధ్యతలను నిర్వర్తించేవారు. వారు శ్రీగురుసాయుజ్యం పొందిన తరువాత వారి బాధ్యతలను అనేకమందికి పంచవలసి వచ్చిందంటే వారి సామర్థ్యాన్ని అర్థం చేసుకోవచ్చు.

శ్రీ నడింపల్లి సత్య సూర్యనారాయణరాజు ప్రసాద్ - ఎండీగారుగా సుపరిచితులైన వీరు ఆశ్రమ నిర్మాణం ప్రారంభించిన నాటినుండి ఆశ్రమంలోనే ఉంటూ, వివిధ నిర్మాణ, నిర్వహణ బాధ్యతలను సేవగా స్వీకరించి ఆశ్రమంలోని యువకులను సమీకరించి వారిచే సమర్థంగా నిర్వహింపజేసేవారు. శ్రీ సద్గురు యువసేవాసమితి ప్రధమ కార్యదర్శిగా కూడా వీరు సేవలందించారు.

శ్రీ ఇందుకూరి సత్యనారాయణరాజు ప్రసాద్ - సత్తిరాజుగారిగా అందరికీ తెలిసిన వీరు కూడా ఆశ్రమ స్థాపన నాటినుండి బాధ్యతలు స్వీకరించి ఆశ్రమంలోని ఫలవృక్షాలు, పంటపొలాల నిర్వహణను సమర్థవంతంగా నడిపారు.

శ్రీమతి చంద్రాభొట్ల కామేశ్వరి ప్రసాద - కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందిన కామేశ్వరమ్మగారు తమ సుశ్రావ్య స్వరంతో ఆశ్రమ ప్రార్థనా గీతాలను, సంకీర్తనలను ప్రతిరోజూ గానం చేయటమే కాక, శ్రీ లలితానంద సరస్వతీ స్వామిని వద్ద శిక్షణ పొంది ముకుందమాల, భాగవతం, మహర్షుల చరిత్రలు మొదలగు ప్రవచనాలను కూడా నిర్వహించారు. అంతేకాక కంటిచూపును కోల్పోయిన అనంతరం కూడా శ్రీ బృందావనంలో, శివాలయంలో నిత్యపూజలను, అభిషేకాలను నిర్వహించేవారు.

శ్రీ దుగ్గిరాల జగన్మోహన బాలకృష్ణ లాల్ ప్రసాద్ - లాల్ గారిగా సుపరిచితులైన వీరు గుంటూరులో లెక్చరర్ ఉద్యోగం చేస్తూకూడా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం శ్రీగురుదేవుల దర్శనార్థమై ఆశ్రమానికి వచ్చి, వ్యాహ్యాళి సమయంలో, సత్సంగాల సమయంలో శ్రీగురుదేవుల దివ్య బోధనంతా శ్రద్ధగా విని, ఆకళింపు చేసుకొని, ఇంటికి వెళ్ళగానే మరల గ్రంధస్థం చేసేవారు. అలా శ్రీబాబూజీ దివ్య స్మృతులు అనే గ్రంథం అనేక భాగాలుగా మనకు అంది, ఇప్పటికీ జిజ్ఞాసువులకు ఆధ్యాత్మిక విజ్ఞానసర్వస్వంలాగా ఉపయోగపడుతోంది. అంతేకాక వీరు కూడా అనేక సంవత్సరాలు ఆశ్రమ పాఠశాల నిర్వహణా బాధ్యతలను, సమర్థ సద్గురు మాసపత్రిక సంపాదక బాధ్యతలను కూడా నిర్వర్తించారు.

శ్రీ చేబ్రోలు వెంకట నారాయణరావు ప్రసాద్ - భారతీయ రైల్వేలో ఉన్నత పదవులను నిర్వర్తించిన శ్రీ నారాయణ రావుగారు ఉద్యోగ విరమణానంతరం ఆశ్రమవాసులయి ట్రస్ట్ కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పనిచేసి, శ్రీ బృందావన నిర్మాణం, శ్రీ రామాలయ పునర్నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారు. అంతేకాక శ్రీగురుబోధను ప్రతి సాయంత్రం ప్రార్థనానంతరం విస్పష్టంగా, అందరికీ అర్థమయ్యే రీతిలో చదివి వినిపించేవారు.

శ్రీ సన్నిధానం రామతారక పరబ్రహ్మ శాస్త్రి ప్రసాద్ - భారతీయ రైల్వేలో ప్రధానాధ్యాపకునిగా పనిచేసిన శ్రీ తారకంగారు వేద, శాస్త్ర పురాణేతిహాసాలలో పండితులు. ఆశ్రమవాసులకు కలిగే అనేక సందేహాలను తీర్చడమేకాక, వారికి ఏ మంత్రం ఎలా ఉచ్ఛరించాలి ఏ పదానికి అర్థం ఏమిటి అనే విషయాలలో శిక్షణ ఇచ్చేవారు. వీరు ప్రతి సంవత్సరం దసరా మహోత్సవాలలో శ్రీ దేవీభాగవత పురాణ ప్రవచనం జనరంజకంగా చేసేవారు.

శ్రీ వేలమూరి వెంకటరమణ ప్రసాద్ - ప్రసాదరావు గారిగా సుపరిచితులైన వీరు వృత్తిరీత్యా ఆంగ్ల ఆచార్యులైనా సంస్కృతాంధ్ర భాషా కోవిదులు కూడా. వీరు ఎన్నో అష్టావధానాలను కూడా శ్రీగురుదేవుల సమక్షంలో నిర్వహించారు. అనేక సంవత్సరాలు ధనుర్మాసంలో పోతన భాగవతాన్ని కడు రమ్యంగా ప్రవచించి భక్తుల మనసులను చూరగొన్నారు. శ్రీ బాబూజీ చరిత్రలోని కొన్ని ఘట్టాలను హరికథగా రచించి స్వయంగా ప్రదర్శించారు. శ్రీగురుగీతకు చక్కని భాష్యం కూడా రచించారు.

శ్రీ గూడ శివరామ మూర్తి ప్రసాద్ - ఈసీఐఎల్‌లో ఉన్నత పదవిని నిర్వహించిన శ్రీ మూర్తిగారు ఆశ్రమవాసులందరికి పురాణం మూర్తిగారిగా పరిచితులు. ఎన్నో సంవత్సరాలు ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో శ్రీబృందావనంలో పురాణ ప్రవచనం నిర్వహించేవారు. శ్రీ భగవద్గీతకు సరళమైన భాష్యం రచించి, ఆశ్రమవాసులకు వినిపించారు. అంతేకాక శ్రీ రామలింగేశ్వరాలయంలో మహన్యాసం చెప్పే సేవ కూడా చేసుకున్నారు. దీర్ఘకాలం సమర్ధ సద్గురు మాసపత్రికకు సమర్థవంతమైన సంపాదకునిగా సేవలందించారు.

శ్రీ గరికపాటి శ్రీరామచంద్ర మూర్తి ప్రసాద్, కమలా ప్రసాద - అస్సాం మూర్తి దంపతులుగా ప్రసిద్ధులైన వీరిరువురు సుదీర్ఘ కాలం శ్రీ కోదండ రామాలయం, శ్రీ రాధాకృష్ణాలయములలో నిత్య పూజలను నిర్వహించారు.

శ్రీ వల్లభజోశ్యుల భగవాన్ దాస్ ప్రసాద్ - భగవద్దాసుగా శ్రీగురుదేవులు పిలుచుకొన్న వీరు శ్రీగురుదేవులకు అత్యంత ప్రియభక్తులు. సుదీర్ఘకాలం అమెరికాలో స్థిరనివాసం ఉన్నాకూడా ఎప్పుడూ శ్రీగురుదేవుల హృదయానికి దగ్గరగా ఉండేవారు. అక్కడ సమర్ధసద్గురు మాసపత్రికను వివిధ ప్రాంతాలలోని భక్తులకు చెరవేయటానికి విశేష కృషి చేశారు. జీవిత చరమాంకంలో ఆశ్రమవాసులయి శ్రీగురుదేవులయందే మనస్సును నిలిపి శ్రీగురుసాయుజ్యం పొందారు.

శ్రీ నూనె వెంకటస్వామి ప్రసాద్ - పాండుగారి బావగారైన శ్రీ వెంకటస్వామిగారు ఆశ్రమానికి పెద్దదిక్కు వంటివారు. శ్రీగురుదేవులు ఏ ఆలయాల నిర్మాణం, యజ్ఞయాగాదుల వంటి ఏ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినా ప్రధాన కర్తలుగా వీరి దంపతులే ఉండేవారు. అంతేకాక వారు హిందీలో శ్రీ రామచరితమానసను చదివి భక్తులందరికీ అర్థమయ్యే రీతిలో తెలుగులోకి అనువదించి ప్రవచించేవారు.

శ్రీ మద్ది నాగేశ్వరరావు ప్రసాద్ - శ్రీ నాగేశ్వర రావుగారు సమర్ధ సద్గురు మాసపత్రికకు ప్రధమ సంపాదకులు. మాసపత్రికకు ఒక రూపును అందించడంలో వీరు విశేష కృషి చేశారు. ఆ పత్రికను రాష్ట్రమంతటా విస్తరింపజేయటంలో వీరి అల్లుడుగారైన శ్రీ చరణదాసుగారు ప్రముఖ పాత్ర వహించారు. అంతేకాక సౌమ్యులు, నిరాడంబరులు, మృదుస్వభావి అయిన శ్రీ నాగేశ్వరరావుగారు వివేక విన్యాస్ మొదలైన అనేక ఆధ్యాత్మిక గ్రంధాలను రచించి, ప్రచురించి ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకు విశేష సేవలను అందించారు. శ్రీగురుదేవుల దివ్య సందేశాలను ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలలో ప్రచురించడానికి, గురువాణి అనే తెలుగు సంగ్రహం సమర్థ సద్గురు అనే ఆంగ్ల సంగ్రహం ప్రచురించడానికి శ్రీ నాగేశ్వరరావుగారు, శ్రీ చిరంజీవిగారు విశేష కృషి సలిపారు. శ్రీ బాబూజీ మహరాజ్ వారిచే 'జనక మహారాజు వలె రాజయోగి' అని పిలువబడిన శ్రీ నాగేశ్వరరావుగారు ఆదర్శమూర్తులు.

శ్రీమతి వీర రాఘవమ్మ ప్రసాద - శ్రీ మాతాజీవారి మాతృమూర్తి అయిన శ్రీమతి రాఘవమ్మగారు శ్రీగురుదేవులకు ఎన్నో సంవత్సరాల కాలం నైవేద్యం తయారు చేసి, వారికే కాక వారి దర్శనార్థం వచ్చిన అనేకమంది భక్తులకు కూడా ప్రేమతో వడ్డించేవారు. అలాగే శ్రీ మాతాజీ అతిథులుగా ఆశ్రమ దర్శనార్థం వచ్చే ఎందరో సాధు మహాత్ములకు కన్నతల్లి వలె అప్యాయతను కురిపించి వారి భోజన వసతులను స్వయంగా చూసుకొనేవారు.

నిజానికి ఆశ్రమానికి సేవలందించిన ప్రముఖుల జాబితా అనంతమైనా కొద్దిమందినే ఇక్కడ ప్రస్తావించడం సాధ్యమైంది. వీరేకాక ఇంజనీర్లుగా శ్రీ వీరయ్య చౌదరిగారు, శ్రీ వక్కలగడ్డ వెంకట సత్యనారాయణ మూర్తి ప్రసాద్ వారు, శ్రీ కొండా శేషంరాజుగారు, శ్రీ ఉనికిలి సుబ్బరాజుగారు, ప్రధానోపాధ్యాయులుగా శ్రీ దత్తుమాష్టారు, శ్రీ శ్రీనివాస అయ్యంగార్ వారు, ఉపాధ్యాయులుగా శ్రీ గండికోట వెంకటేశ్వర్లు గారు, శ్రీమతి శ్యామల, శ్రీమతి హిమగిరి కుమారి, శ్రీ ఉమామహేశ్వరరావు, ప్రథమ వైద్యులుగా శ్రీ ఏలూరుపాడు డాక్టరుగారు, వారి సతీమణి పాపమ్మగారు, గాయకులుగా శ్రీమతి మావులేటి ఈశ్వరమ్మగారు, శ్రీమతి జమ్మి సుశీలాదేవి గారు, ప్రథమ కాంటీన్ నిర్వాహకులుగా శ్రీ శ్రీహరిరావు గారు, ఆశ్రమ ఉద్యానవన నిర్వాహకులుగా శ్రీ కూనపరాజు నారాయణరాజుగారు, పురోహితులుగా శ్రీ వారణాసి కాశీ విశ్వనాథ శర్మగారు, శ్రీ రామారావు గారు, శ్రీ శేఖరంగారు, బృందావన పరిరక్షకురాలిగా శ్రీ జయక్క ఇలా ఎందరెందరో మహానుభావులు గత యాభై సంవత్సరాలుగా ఈ ఆశ్రమసేవ చేసుకొని శ్రీగురుసాయుజ్య ముక్తిని పొందటమే కాక, మనందరికీ ఆదర్శమూర్తులుగా, మార్గదర్శులుగా, ప్రాతఃస్మరణీయులుగా నిలిచారు. వారు చూపిన బాటలో నిస్వార్థ సేవతో మన జీవితాలను సఫలం చేసుకోవటమే వారికి మనం అందించగలిగిన నివాళి.