25, సెప్టెంబర్ 2022, ఆదివారం

అపూర్వం - అద్వితీయం

    పురాణ కాలంలో వశిష్టాది మహర్షులు బ్రహ్మజ్ఞానులైనప్పటికీ, సంసారులై బహు సంతానంతోనే ఆశ్రమవాసం చేసేవారు. అంతే కాదు, వారి ఆశ్రమాలలో అనేక పశుపక్ష్యాదులు కూడా ఆశ్రయం పొందేవి. అయితే ఈ కలియుగంలో ఎప్పుడు మొదలైందో కానీ ఆధ్యాత్మిక సాధన చేయాలన్నా, గురువులను ఆశ్రయించాలన్నా సంసారాన్ని వదిలేసి సన్యాసులు కావాలని ఒక అపోహ బయలుదేరింది. ఈ అపోహను పటాపంచలు చేస్తూ, గృహస్తాశ్రమమే ఆధ్యాత్మిక సాధనకు అత్యంత సురక్షితమైనదని బోధించడమే కాక, ఆచరణలో నిరూపించడానికి సమర్థ సద్గురు శ్రీ శ్రీ శ్రీ హనుమత్ కాళీ వరప్రసాద బాబూజీ మహరాజ్ వారు "శ్రీ కాళీ గార్డెన్స్" అనే ఆశ్రమాన్ని 1972 మే 31వ తేదీన స్థాపించి ఇక్కడ ఎందరో గృహస్థులతో వారి వారి ప్రాపంచిక ధర్మాలను ఒకప్రక్క నిర్వహింపజేస్తూనే, ఆధ్యాత్మిక మార్గంలో పురోగతిని అందిస్తూ మోక్షపథగాములను చేసి, ముక్తిని ప్రసాదించారు, ఇప్పటికీ ఎప్పటికీ ప్రసాదిస్తూనే ఉన్నారు. "కేవలం నీ ఆధ్యాత్మిక జీవితంతోనే నాకు సంబంధం కానీ ప్రాపంచిక జీవితంతో నాకు సంబంధం లేదు" అని శ్రీగురుదేవులు ఏ శిష్యునితోనూ ఎన్నడూ అనలేదు. వారి దృష్టిలో ప్రపంచం ఆధ్యాత్మికానికి భిన్నం కాదు. ఉన్నదంతా ఆత్మయే అయినప్పుడు దానికి భిన్నంగా ఏముంటుంది? అందుకే వారు తమ వద్దకు ఎవరు ఎటువంటి సమస్యలతో వచ్చినా, వారి సమస్యలకు పరిష్కారం చూపుతూ, మెల్లగా వారి మనస్సును భగవంతునివైపు మళ్ళిస్తూ, వారికి ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రసాదించారు.

    అలాగే పూర్వకాలంలో గార్గి, మైత్రేయి వంటి ఎందరో విదుషీమణులు వేద శాస్త్రాలను అభ్యసించడమే కాక అందులో అపార పాండిత్యాన్ని గడించి వినుతికెక్కారు. అయితే మధ్యలో ఎప్పుడో స్త్రీలకు వేదాలు నేర్పరాదని, వారు దేవాలయాలలో పూజాదికాలకు పనికిరారని ఒక అపోహ బయలుదేరింది. అలాగే కేవలం బ్రాహ్మణులు మాత్రమే అర్చకులుగా ఉండాలనే నియమం కూడా వచ్చింది. అయితే ఇటువంటి అపోహలను తొలగిస్తూ శ్రీగురుదేవులు ఆశ్రమంలో స్త్రీలకు కూడా సకల విద్యలు నేర్పే ఏర్పాటు చేసి, ఇక్కడి అన్ని ఆలయాలలోనూ స్త్రీలనే(అది కూడా కులంతో సంబంధం లేకుండా) ప్రధాన అర్చకులుగా, సహాయకులుగా నియమించి ఒక క్రొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. అది ఇప్పటికీ, ఎప్పటికీ అలాగే కొనసాగుతుంది.

    సన్యాసాశ్రమాలకు ఏ పెద్ద కార్యక్రమాన్ని తలపెట్టినా, ఆశ్రమం వెలుపలి గృహస్తులపై ఆధారపడవలసిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ అలా కాక అందరూ గృహస్తులే ఆశ్రమవాసం చేస్తూ ఉండటంతో ఈ ఆశ్రమం స్వయం సమృద్ధిని సాధించి ఎంతటి బృహత్తర కార్యక్రమాన్ని అయినా అలవోకగా నిర్వహించగల సామర్థ్యాన్ని సంతరించుకొంది. అంతేకాక, కేవలం ఇక్కడి గృహస్తుల అవసరాలకే కాక ఈ చుట్టుప్రక్కల గ్రామాలలోని ప్రజలందరికీ ఉపయోగపడేలా అత్యంత తక్కువ ఖర్చుతో, అర్హులైనవారికి ఉచితంగానే విద్యను, వైద్యాన్ని అందించడానికి గురుకులాన్ని, వైద్యశాలను ఏర్పాటు చేశారు శ్రీగురుదేవులు. ప్రతి సంవత్సరం కులమతాలకతీతంగా ఎన్నో వేలమంది ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. శ్రీగురుదేవుల బోధామృతం, అలాగే ఈ ఆశ్రమంలో విలసిల్లే వినూత్న భావజాలం దేశం నలుమూలలా వ్యాప్తిచెంది సమాజంలో మార్పు రావడంకోసం "సమర్ధసద్గురు" ఆధ్యాత్మిక మాసపత్రిక కూడా విశేష కృషి సలుపుతోంది. అలాగే గోమాతల సంరక్షణార్థమై విశాలమైన గోశాల, అతిథుల కోసం అన్నదానం, జీవన మలిసంధ్యలో సత్తువ క్షీణించి స్వయంగా పనులు చేసుకోలేక, ఆధ్యాత్మిక జిజ్ఞాసతో ఆశ్రమ నివాసం కోరుకునే వృద్ధులకు ఆశ్రిత ఆశ్రయం నిర్వహించబడుతున్నాయి.

    ఇక ప్రశాంతతకు నిలయమైన ఈ ఆశ్రమాన్ని మొదటిసారి సందర్శించిన చాలామంది అనే మాట ఇది మరో తిరుమలలాగా ఉందని. నిజమే. శ్రీగురుదేవులు వేంకటేశ్వర స్వామిని "మా బ్రదర్" అనేవారు. తిరుమలలాగానే ఈ ఆశ్రమం కూడా నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, వార్షికోత్సవాలతో నిత్యకల్యాణం పచ్చతోరణంగా ఎల్లప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. అయితే తిరుమలలో స్వామివారిని తనివితీరా దర్శించుకోవాలన్నా, విశేషంగా సేవించుకోవాలన్నా అంత సులభంగా అందరికీ ఆ అవకాశం లభ్యం కాదు. అందుకే "అహం దూరదస్తే పదాంభోజ యుగ్మ ప్రణామేచ్చయాగత్య సేవాం కరోమి! సకృత్సేవయా నిత్యసేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వేంకటేశ||" - "స్వామీ! వేంకటేశా! నేను ఎంతో దూరంనుంచి ఎన్నో ప్రయాసలకోర్చి నీ పాదారవిందాలకు ప్రణామం చేయాలనే కోరికతో వచ్చాను. ఈ చిన్న సేవకే నీవు సంతోషించి నీకు నిత్యసేవ చేసుకున్న ఫలితాన్ని నాకు అనుగ్రహించు" అని వేడుకొని అక్కడితో సంతృప్తి పడవలసి వస్తుంది. కానీ ఆశ్రమంలో ఎవరి ఆవేదనననుసరించి వారు ఎంతసేపైనా సాక్షాత్తు భగవదవతారస్వరూపులైన శ్రీగురుదేవుల దర్శన, స్పర్శన, వందన, సంభాషణాది భాగ్యాలను పొంది తమ శక్తికొలది ఆశ్రమసేవ చేసుకొనే అవకాశం అందరికీ లభిస్తుంది. అంతేకాదు, తిరుపతి వేంకటేశ్వర స్వామికి ఏదైనా మ్రొక్కుకుని, అక్కడికి వెళ్ళే అవకాశం లేనివారు కూడా ఈ ఆశ్రమంలో ఆ మ్రొక్కును తీర్చుకుని, సంతృప్తిని చెందిన సందర్భాలు అనేకం.

    ఇక కాశీ క్షేత్రాన్ని మోక్షధామమని, ఎవరైనా అక్కడ మరణిస్తే, కనీసం బయట మరణించినవారికి అక్కడ అంతిమ సంస్కారం జరిపితే, లేదా వారి అస్థికలైనా అక్కడి గంగలో నిమజ్జనం చేస్తే ఆ మరణించిన జీవునికి మోక్షం కలుగుతుందని హిందువులందరి విశ్వాసం. అలాగే కాశీలోని శ్మశానాలలో పరమేశ్వరుడు సంచరిస్తూ ఉంటాడని, చితికి నిప్పంటించి, అయినవారందరూ వదలి వెళ్లిపోతే, విలపిస్తున్న ఆ జీవుడికి 'నేనున్నాన'ని ధైర్యం చెప్పి, నారాయణ మంత్రాన్ని ఉపదేశించి తరింపజేస్తాడని కూడా చెబుతారు. అలాగే శ్రీగురుదేవులు కూడా ఈ కాళీవనాశ్రమాన్ని నమ్ముకొని ఇక్కడ జీవనం సాగించిన మానవులకే కాక, పశుపక్ష్యాది సమస్త జీవరాశికి ముక్తిని ప్రసాదిస్తానని అభయం ఇచ్చారు. అందుకే ఇక్కడి భక్తులందరూ ఈ మోక్షధామంలోనే ప్రాణాలు విడవాలని బలంగా కోరుకుంటారు. ఒకవేళ విధివశాత్తు బయట ప్రాణాలు విడిచినా, వారి కుటుంబసభ్యులు వారి భౌతికదేహాన్ని ఇక్కడికే తరలించి అంత్యక్రియలను ఇక్కడనే నిర్వహిస్తారు. అంతేకాక, ఇక్కడి రుద్రభూమిలో అంత్యక్రియలకు సహకరించే సేవకులకు పరమేశ్వర దర్శనం ఎన్నోసార్లు జరిగిన నిదర్శనాలు ఉన్నాయి.

    ఎందరో మహర్షులు పూర్వకాలంలో తపస్సులు, యజ్ఞయాగాదులు నిర్వహించిన పవిత్ర క్షేత్రమైన ఈ కాళీవనాశ్రమం ఆధునిక కాలంలో శ్రీగురుదేవుల పవిత్ర పాదస్పర్శతో అణువణువూ పునీతమై, పుట్టినది మొదలు శ్రీగురుసాయుజ్య ముక్తిని పొందేవరకు మానవుని సరైన మార్గంలో నడిపిస్తూ, అడుగడుగునా ఆదుకొంటూ, కులమతాలు, ఆర్థిక వ్యత్యాసాలతో సంబంధం లేకుండా అందరూ ఒక్క కుటుంబంవలె మెలిగే ఆశ్రమవాసులతో విరాజిల్లుతూ ఆచంద్రతారార్కం ఇలాగే వర్ధిల్లుతూ ఉంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీకాళీవనాశ్రమ స్వర్ణోత్సవాలు 11 నవంబర్ 2022 నుండి 21 నవంబర్ 2022 వరకు అత్యంత వైభవంగా జరుగబోతున్నాయి. ఈ ఉత్సవాలకు భగవద్భక్తి, ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగినవారందరూ ఆహ్వానితులే.
మరిన్ని వివరాలకు ఈ క్రింది లింకును వీక్షించండి:
తెలుగు:
English:

20, ఆగస్టు 2022, శనివారం

గురువు

 మన భారతీయ సంప్రదాయంలో గురువును త్రిమూర్త్యాత్మక స్వరూపుడిగానే కాక సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడిగా భావించి పూజిస్తారు. కేవలం భావించడమే కాదు, సత్యగురువు నిజంగా పరబ్రహ్మ స్వరూపుడే. అయితే నేటి సమాజంలో రకరకాల వ్యక్తులను గురు శబ్దంతో సంబోధించడం అలవాటుగా మారింది. టీచర్స్ డేని ఒకప్పుడు ఉపాధ్యాయ దినోత్సవం అనేవారు. ఇప్పుడు ఎక్కువగా గురుపూజోత్సవం అంటున్నారు. అలాగే ప్రవచనాలు చెప్పేవారిని, జాతకాలు, పంచాంగాలు చెప్పేవారిని, పురోహితులను ఇలా ఒకరేమిటి కాస్త శాస్త్రజ్ఞానం ఉన్నట్లు కనబడిన ప్రతివారిని గురువులుగా సంబోధిస్తున్నారు. ఇంకొంతమందికి తమ స్నేహితులను, ఇంకా అపరిచితులను కూడా గురూ అని పిలవటం ఒక అలవాటు. అయితే గురుశబ్దం చాలా లోతైనది. మానవుని హృదయాంతరాళంలో కరడుగట్టిన అజ్ఞానాంధకారాన్ని తన జ్ఞానభాస్కర కిరణ ప్రసారంతో రూపుమాపి మానవుని మాధవునిగా పరివర్తనం చెందించే సమర్ధత ఒక్క గురువుకే సొంతం.


పాఠశాలలో అధ్యయనం చేసేవాడు విద్యార్థి. అతనితో పాటుగా కలిసి చదువుకొనేవారు సహాధ్యాయులు. అలాగే వీరి అధ్యయనానికి ఉపకరిస్తూ, వారికి నేర్పే క్రమంలో ప్రతిరోజూ తాము కూడా క్రొత్త క్రొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండేవారు ఉపాధ్యాయులు. ఒక ఉపాధ్యాయుడికి తన పాఠ్య విషయంలోనే పట్టు ఉంటుంది. అది కూడా వందశాతం కాదు. తాను అంతవరకు చదవని విషయంమీద ఏ విద్యార్థో ప్రశ్నిస్తే, మర్నాడు తెలుసుకొని వచ్చి సమాధానం చెప్పవలసిందే. కానీ గురువు సర్వజ్ఞుడు. ఈ అనంత విశ్వంలో భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలో ఆయనకు తెలియని విషయం అంటూ ఏదీ ఉండదు. పైకి కనబడే విషయాలే కాక ప్రతి జీవి మనస్సు పొరలలో కప్పబడి ఉన్న సంకల్పాలు, వాసనలు అన్నీ వారికి ఎఱుకే. కొందరు ఉపాధ్యాయుల మధ్య పోటీ ఉంటుంది. ఒకరు చెప్పిన దాన్ని మరొకరు అంగీకరించడానికి అహంకారం అడ్డు వస్తుంది. కానీ నిజమైన గురువులు అలా కాదు. వారి దృష్టిలో అసలు ఈ భేదాలే ఉండవు. ఉన్నదంతా తమ స్వరూపమే.


గురువు ముందుగా తాను భవబంధాల నుండి ముక్తుడై ఉండాలి. అయితే అది మాత్రమే సరిపోదు. తనను ఆశ్రయించిన వారిని ప్రేమతో చేరదీసి, తాను పొందుతున్న బ్రహ్మానందాన్ని వారికి కొద్దికొద్దిగా రుచి చూపిస్తూ, ఎప్పటికప్పుడు వారికి సాధనలో మార్గదర్శనం చేస్తూ, సాధనలో ఎదురయ్యే ఆటంకాలను, వెనక్కిలాగే నీచ భావాలను కనిపెట్టి కాచుకుంటూ, వారి ప్రతి సందేహాన్ని తీరుస్తూ సాధన పూర్తి చేయించి ముక్తిఫలాన్ని అందించగలిగిన సమర్థుడై ఉండాలి. కొంతమంది "విజ్ఞానం అంతా వేదాలలో, ఉపనిషత్తులలో నిక్షిప్తమై ఉంది కదా! అవి చదువుకుంటే సరిపోదా? ఇంకా గురువు ఎందుకు?" అని వాదిస్తారు. "గురువు లేని విద్య గుడ్డి విద్య" అన్నారు పెద్దలు. ఉదాహరణకి ఒక పెద్దమనిషి ఎక్కడో పురాణంలో "పరీక్షిత్తు మహారాజు నిమ్మకాయ వాసన చూస్తుంటే అందులోనుండి తక్షకుడు వచ్చి కాటువేయగా మరణించాడు" అని విని ఇక ప్రపంచంలో ఎవరూ నిమ్మకాయలు వాసన చూడకూడదని శాసిస్తాడు. "ఇదేమి చాదస్తం నాయనా?" అంటే "పురాణాలను చూసి ఏమీ నేర్చుకోరా? అంటే పురాణాలన్నీ వ్యర్థమేనా?" అని మొండిగా వాదిస్తాడు. పరీక్షిత్తు చరిత్ర నుంచి నేర్చుకోవలసింది ఇలాంటి మూఢనమ్మకాలనా? తనకు మరణం అసన్నమైనదని తెలియగానే ఒంటిస్తంభం మేడెక్కి తలుపులన్నీ మూసుకున్న పరీక్షిత్తు శుకబ్రహ్మ ముఖతః భాగవత ప్రవచాన్ని శ్రద్ధగా శ్రవణం చేసి, ఎప్పటికైనా మృత్యువు తప్పదనే సత్యాన్ని గ్రహించి మృత్యువును తానే ఆనందంగా స్వాగతించి భగవదనుభూతిలోనే దేహాన్ని విడిచిపెట్టి ముక్తిధామాన్ని చేరుకున్నాడు. కానీ గురువును ఆశ్రయించనివాడు, ఆశ్రయించినా శ్రద్ధగా గురుబోధను శ్రవణం చేసి, ఆకళింపు చేసుకొని అనుభవంలోకి తెచ్చుకోలేని వాడు ఇలాగే ప్రతిదానిలోనుండి తప్పుడు అర్థాలు తీస్తూ మూఢ నమ్మకాలు పెంచుకుంటూ ఏం చేస్తే ఏం నష్టం కలుగుతుందో అని అనుక్షణం భయంతో చస్తూ బ్రతుకుతాడు. 


గురుదేవులు శ్రీ బాబూజీ మహరాజ్ వారు ఎందరినో ఇటువంటి మూఢనమ్మకాలు, అనవసరపు ఆచారాలు, జాతకాలు వాస్తు మొదలైన నమ్మకాల నుండి బయట పడవేసి సరైన ఆధ్యాత్మిక సాధన అంటే ఏమిటో నేర్పించి తరింపజేశారు. అయితే మళ్ళీ ఇప్పుడు వారి సంతానం అవే నమ్మకాలను కొనసాగిస్తే ఇక ఉపయోగం ఏముంటుంది? కొందరు తెలివిగా "బాబుగారు ఆరోజు గ్రహణం సమయంలో భోజనాలు పెట్టించారు, లేదా వాస్తుకు విరుద్ధంగా ఇల్లు కట్టించారు, ముహూర్తం చూడకుండా పెళ్ళో గృహాప్రవేశమో చేయించారు, నక్షత్రం చూడకుండా పేరు పెట్టారు అంటే అది ఆ సందర్భానికే, ఆయా వ్యక్తులకే పరిమితమైనది. అందులో ఏ దోషం ఉన్నా బాబుగారు చూసుకున్నారు. కానీ ఇప్పుడు మనం అలా ఎలా చేయగలుగుతాం?" అని వాదిస్తారు. గురుదేవులను ఒక రూపానికి, సమయానికి పరిమితం చేసి మాట్లాడే ఇటువంటి వారు గురుతత్వాన్ని ఏమి అర్థం చేసుకున్నట్లు? ఆకాశంలాగే బాబుకు కూడా దేశకాలాలు లేవని ఆయనే స్వయంగా చెప్పినా మనం ఎంతవరకు గ్రహించగలుగుతున్నాం? గురుబోధ అంటే కేవలం వేదికమీద సింహాసనాశీనులై వెలువరించేదే కాదు. గురుదేవులు ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో వాక్కుద్వారా కానీ, సంజ్ఞలద్వారా కానీ, దృష్టిద్వారా కానీ ఏ సూచన ఇచ్చినా అదంతా గురుబోధే. మనం నిత్యం ఆచరణలో పెట్టుకోవలసిందే.


మనుష్యులలో అనేక రకాలు ఉన్నట్లుగానే శిష్యులలో కూడా అనేక మనస్తత్వాల వాళ్ళు, సాధనలో వివిధ స్థాయిలలో ఉన్నవారు ఉంటారు. కేవలం 70% పైన మార్కులు వచ్చిన వారిని మాత్రమే చేర్చుకొని, వారిని బాగా రుబ్బి, 95% మార్కులతో పాస్ చేయించి అది తమ సమర్థతగా ఈనాడు కొన్ని పాఠశాలలు, కళాశాలలు ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ సమర్థ సద్గురువులు అప్పటికే ఎంతో పుస్తక జ్ఞానాన్ని సముపార్జించి చాలావరకు సాధన పూర్తిచేసిన వారినుంచి, అసలు భగవంతుడు ఉన్నాడనే ఊహే లేక, అక్షరజ్ఞానం కానీ, సాధన అంటే ఏమిటో అవగాహన కూడా లేనివారి వరకు అన్ని స్థాయిల వారిని అన్ని మనస్తత్వాల వారిని తామే స్వయంగా వారివద్దకు తరలివచ్చి, శిష్యులుగా స్వీకరించి, ఎవరి మనోవికాస స్థాయిని బట్టి వారి వారికి అర్థమయ్యేలా బోధ చేసి, తమ దృక్కుతోనో, వాక్కుతోనో, స్పర్శతోనో, లేక కేవల సంకల్పంతోనో తమ శక్తిని వారియందు ప్రవేశపెట్టి,  వారు తేలికగా చేయగలిగిన సాధన మార్గంలోనే వారిని ముందుకు నడిపించి, వారికి కలిగే ఆటంకాలను ముందుగానే గ్రహించి వారికి తెలియకుండానే తొలగిస్తూ, ఒకవేళ వారి సాధన పూర్తి కాకుండా అంత్యకాలం సమీపించిన సందర్భాలలో అవసరమైతే వారి జీవితకాలాన్ని కూడా పొడిగిస్తూ, సాధన పూర్తిచేయించి ఈ జన్మలోనే తమలో లీనం చేసుకుంటారు.


18, జులై 2022, సోమవారం

నిరాడంబరత

ఆగస్టు నెల వచ్చిందంటే చిన్న పిల్లలనుండి వృద్ధులవరకు ప్రతి వారికి ఇష్టమైన ఇద్దరు దేవుళ్ళ పండుగలు వస్తాయి. అవే కృష్ణాష్టమి, వినాయక చవితి. శ్రీకృష్ణుడు, వినాయకుడు ఈ ఇద్దరినీ ఇష్టపడని వారు ఉండరు. దాదాపుగా మిగిలిన పండుగలు అన్నింటికీ ఏ దేవాలయానికో వెళ్ళి దర్శనం చేసుకోవటంతో సరిపెడతారు కానీ ఈ రెండు పండుగలు మాత్రం ప్రతివారు తమ ఇంట్లో చేసుకుంటారు. వయస్సుతో, హోదాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ తమ స్వంతమైన దేవుళ్ళు వీరిద్దరూ.

అవతరించిన నాటినుండి వరుసగా ఎన్నెన్నో హత్యా యత్నాలను ఎదుర్కొని, చివరికి జగద్గురువుగా ఎదిగినవాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే ప్రాణం పోసుకొన్న కొద్ది సేపటికే శిరస్సును కోల్పోయి విగతజీవుడైనా తిరిగి మరొక శిరస్సును పొంది, ప్రధమపూజ్యుడయిన వాడు, విఘ్నాధిపతి  అయినవాడు వినాయకుడు. పత్రమైనా, పుష్పమైనా, ఫలమైనా, చివరికి ఇన్ని నీళ్లయినా భక్తితో సమర్పిస్తే ప్రీతితో స్వీకరిస్తానని ప్రకటించాడు శ్రీకృష్ణుడు. ఇదే విషయాన్ని ప్రతి సంవత్సరం మనకు ప్రత్యక్ష నిదర్శనంగా చూపిస్తున్నాడు వినాయకుడు.

నిజానికి ఒకప్పుడు వినాయక చవితి పూజలు ఎవరింట్లో వారు వారి వారి స్తోమతకు తగినట్లుగా చేసుకొనేవారు. వ్రతకథలో కూడా "తమ తమ విభవము కొలది గణేశుని పూజించార"ని ఉంటుంది. అయితే స్వాతంత్రోద్యమ కాలంలో పరాయి పాలకుల న్యాయ సూత్రాలను ఉల్లంఘించకుండానే, ప్రజలందరిని ఒకచోట సంఘటిత పరచి స్వాతంత్ర్య స్ఫూర్తి రగుల్కొల్పటానికై తిలక్ మహాశయులు సామూహిక గణపతి పూజలను ఒక సాధనంగా ఎంచుకొన్నారు. అయితే ఇటీవలి కాలంలో ఈ భక్తి గతి తప్పి ఒకరికంటే ఇంకొకరు భారీగా పూజ చేయాలనే పోటీతో బలవంతంగా చందాలు వసూలు చేయటం, ప్రజలకు అసౌకర్యం కలిగిస్తూ రోడ్లమీద పూజలు చేయటం, విపరీతమైన ధ్వని కాలుష్యం, ఇంకా పూజ పందిళ్ళలో, ఊరేగింపులో అశ్లీల పాటలు, నృత్యాల వంటివి ఎక్కువయ్యాయి.

భక్తి వేరు, ఆడంబరం వేరు. రెండిటికి పొసగదు. తాము మహారాజులమని అహంకారంతో పెద్దపెద్ద దేవాలయాలను నిర్మించి ఆర్భాటంగా ప్రతిష్టాది కార్యక్రమాలను నిర్వహించ తలపెట్టిన వారిని నిరాకరించి, తమ చిన్న కుటీరంలో మనసునే ఆలయంగా మలచుకొని మట్టి పూలతోనే పూజించిన భక్తులను అనుగ్రహించిన ఉదంతాలు ప్రతి దేవుని చరిత్రలోనూ మనకు కనిపిస్తాయి. భక్తిలో నిరాడంబరత మాత్రమే కాదు, నిస్వార్థత కూడా ఉండాలి. 'భగవంతుడు అందరివాడు. ఆ అందరిలో నేను కూడా ఒకడిని' అని భావించేవాడు ఆయన అనుగ్రహాన్ని పొందుతాడు. ఆయన నాకు మాత్రమే స్వంతం అనుకునేవాడు ఆయనను దక్కించుకోలేడు. సత్యభామ శ్రీకృష్ణుడు నాకు మాత్రమే దక్కాలి అని పట్టుబట్టి చివరికి ఎంతటి కష్టాలకు, అవమానాలకు గురైందో మనకు తెలిసినదే కదా! అలాగే వినాయకోత్పత్తికి, ఆయన గజముఖానికి మూల కారకుడయిన గజాసురుడు పరమేశ్వరుడు నాకు మాత్రమే స్వంతం కావాలనుకొని చివరికి అకాల మరణం పాలయ్యాడు. అయితే తరువాత వీరిద్దరూ, వారి అచంచల భక్తి ద్వారా ఉద్ధరింపబడ్డారు.

ఇక గజాసుర సంహారం తరువాత ఒక విచిత్ర విషయం జరిగింది. "దుష్టాత్ములకు ఇట్టి వరములు ఈయరాదు. ఇచ్చినచో పాముకు పాలు పోసినట్లగును" అని రోజంతా పాము మీద పడుకొనే ఒక దేవుడు తన ఒళ్ళంతా పాములను ధరించే మరొక దేవునికి హితబోధ చేస్తాడు. ఇది చూడటానికి విచిత్రంగానే అనిపించినా, భగవంతుని నిష్పాక్షికతకు ఒక నిదర్శనం. "ఎటువంటి భయము, పక్షపాతము లేకుండా ప్రజలందరిని సమానంగా సేవించుకుంటానని" ఉత్తుత్తి ప్రమాణాలు చేసే నాయకులను ఎందరినో మనం చూసి ఉన్నాం. కానీ ఏ ప్రమాణమూ చేయకపోయినా సృష్టిలోని ప్రతి ప్రాణిని సమభావనతో చూస్తూ, అది తమకు కష్టకారకమని తెలిసినా కూడా వారి వారి కర్మలను అనుసరించి వారికి ఫలాలను అందించే ఉదాత్తమైన స్వభావం పరమాత్మునిది. ఇది మనందరికీ కూడా అనుసరణీయం.

ఇక ఈ మాసంలో ప్రతి ఇంట్లో జరుపుకొనే మరొక ముఖ్యమైన పండుగ వరలక్ష్మీ వ్రతం. వరలక్ష్మీ అమ్మవారు చారుమతీదేవిని, ఆమె స్నేహితులను ధన కనక వస్తు వాహనాలతో అనుగ్రహించిందని, వాటి మీద ఆశతో పూజ చేసేవారు కొందరు ఉంటారు. అయితే ఆ వ్రతకథ మొదట్లోనే వారు నివసిస్తున్న కుండిన నగరం అప్పటికే స్వర్ణమయమైన గృహాలతో సుసంపన్నంగా ఉండేదనే విషయాన్ని మరచిపోతారు. కర్మానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయాః అనే ఆర్యోక్తిని అనుసరించి, ఎంత పరమాత్ముడు అనుగ్రహించినా, మన కర్మఫలంలో లేనిది మనకు దక్కదనే విషయాన్ని గ్రహించి దక్కినదంతా పరమాత్మ ప్రసాదంగా స్వీకరించే స్వభావాన్ని అలవరచుకోవాలి. అలాగే స్వయంగా వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై పూజా విధానాన్ని బోధించడానికి చారుమతిదేవి అర్హత ఎలా సంపాదించిందో ఆ వ్రతకథలోనే తెలుపబడింది. అట్టి సత్ప్రవర్తనను అలవర్చుకొన్ననాడు, పరమాత్మ అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఆ అనుగ్రహాన్ని అనుభవించగలిగే యోగ్యత కూడా ఆ సత్కర్మ వలన లభిస్తుంది.

14, జూన్ 2022, మంగళవారం

కర్మభూమి-భోగభూమి

    మన భారతదేశం కర్మభూమి అని, దేవతలు సైతం మోక్షం పొందాలంటే ఇక్కడ పుట్టాలని తపిస్తూ ఉంటారని గురుదేవులు శ్రీ బాబూజీ మహరాజ్ వారు తరచుగా చెబుతూ ఉండేవారు. అలాగే భగవద్గీతలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అంతమంది మహాత్ములు ఈ పవిత్ర భూమిలో అవతరించారని, అందుకే దీనిని రత్నగర్భ అంటారని కూడా చెప్పేవారు. అలాగే అమెరికా భోగభూమి అని, అక్కడకు అందరూ భోగాలు అనుభవించడానికి వెళతారని మనం మామూలుగా అనుకుంటూ ఉంటాం. అయితే శ్రీగురుదేవులు ఒకసారి అమెరికాలో ఉన్నప్పుడు ఇండియాలోని భక్తుడు ఫోన్ చేసి "మీరు అక్కడా, మేము అందరం ఇక్కడా ఉండిపోయామని" బాధ పడితే అప్పుడు శ్రీగురుదేవులు "అక్కడ ఇండియా ఇక్కడ అమెరికా తీసివేస్తే ఉన్నదంతా ఒక్కటే" అని బదులిచ్చారు.

    నిజానికి గురుశక్తి సర్వవ్యాపకమైనది, దేశ కాలాలకు అతీతమైనది. గురుదేవులు ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఏ కార్యం చేయిస్తారో, ఎవరిని ఎలా రక్షిస్తారో ఎవరూ చెప్పలేరు. నేను కాలేజీలో ఉండగానే శ్రీగురు సహస్రనామావళికి అర్థాలు వ్రాయటం మొదలుపెట్టాను. కానీ అది చాలా మెల్లగా సాగేది. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు ఉద్యోగరీత్యా అమెరికా వెళ్ళడం జరిగింది. మొదట్లో 'ఇది భోగభూమి కదా! ఇక్కడ ఎందుకు వ్రాయటం? త్వరలోనే మళ్ళీ మన పవిత్ర భారతదేశానికి వెళ్లిపోతాం కదా. అక్కడ వ్రాయవచ్చులే!' అనుకొని కొన్నాళ్ళు తాత్సారం చేశాను. అయితే ఒకసారి శ్రీమాతాజీ అమెరికా వచ్చినప్పుడు అప్పటివరకూ వ్రాసినవి చూపిస్తే 'బాగుంది, త్వరగా పూర్తి చేయ'మని ప్రోత్సహించారు. అలాగే మరి కొన్ని సంవత్సరాలు అక్కడే ఉండమని కూడా సూచించారు. దానితో ఈ దేశకాల విషయాలు పట్టించుకోకుండా మళ్ళీ వ్రాయటం ప్రారంభించాను. చాలావరకు ఆఫీసుకి వెళ్ళివచ్చే సమయంలో బస్సులోనే వ్రాయటం జరిగింది. 'నువ్వు ఏ క్షేత్రంలో ఉన్నావన్నది ముఖ్యం కాదు, నీ హృదయ క్షేత్రంలో ఏమున్నదనేదే ముఖ్యం' అని శ్రీగురుదేవులు నిరూపించిన దివ్యలీల!

    అలాగే శ్రీగురుదేవులు దేశకాలాతీతులు అనడానికి నిదర్శనంగా అమెరికాలో ఉన్నన్నాళ్ళూ మాకు ఎప్పుడు ఏ చిన్న కష్టం వచ్చినా, మనసుకు అశాంతి కలిగినా వెంటనే శ్రీమాతాజీ వారినుండి వీడియో కాల్ వచ్చేది. అమ్మను దర్శించుకొని, సంభాషించగానే మనశ్శాంతి, బాధానివారణ జరిగిపోయేవి. ఒకసారి మా ఇంటిముందు నుంచి కారు తీస్తూ ఉండగా వేరే కారు నడుపుతున్న యువతి వేగంగా కారు వెనుకకు నడిపి నా కారును గుద్దింది. తప్పు ఆమెదే అయినా, తొందరగా రిపేరు అవ్వాలని, ఇన్స్యూరెన్సు కంపెనీ వారి సలహాపై వెయ్యి డాలర్లు నా జేబులోనుండి కట్టి రిపేరు చేయించుకున్నాను. అయితే నెలలు గడుస్తున్నా మళ్ళీ ఆ డబ్బులు వెనక్కి ఇవ్వడంపై ఇన్స్యూరెన్సు కంపెనీ నుండి ఎటువంటి సమాచారం లేదు. ఒకరోజు ఆఫీసులో ఖాళీ దొరికినప్పుడు ఇన్స్యూరెన్సు వారికి ఫోను చేస్తే అవతలి పార్టీ వాళ్ళ ఇన్స్యూరెన్సు కంపెనీ వాళ్ళు సరిగా స్పందించడం లేదనీ, తాము కోర్టుకు వెళ్ళి తేల్చుకుంటామని, తమకు ఎప్పుడు డబ్బులు వస్తే అప్పుడే నాకు ఇస్తామనీ, పూర్తిగా వస్తాయని నమ్మకం లేదనీ చెప్పారు.

    వెయ్యి డాలర్లు అంటే చిన్న మొత్తం కాదు. శ్రీగురుదేవుల పాదుకల వద్ద నమస్కరించి వేడుకుందామంటే నేను ఆఫీసులో ఉన్నాను. అందుకని మనస్సులోనే శ్రీగురుదేవులను ప్రార్థించుకున్నాను. సరిగ్గా అరగంటలో ఇన్స్యూరెన్సు కంపెనీ నుండి ఫోను చేసి, తమకు రావలసిన మొత్తం వచ్చేసిందని, ఇప్పుడే మీకు వెయ్యి డాలర్ల చెక్కు పంపిస్తున్నామని చెప్పారు. గురుశక్తి యొక్క సర్వ వ్యాపకత్వానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. మనం కేవలం భోగభూమిగా భావించే అమెరికాలో ఉన్న 11-12 సంవత్సరాలలో వారివద్ద ఎన్నో మంచి విషయాలు, అలవాట్లు నేర్చుకోవటం జరిగింది. ముఖ్యంగా జాతి, నీతి, కుల, మత భేదాలు పాటించకుండా ప్రతి ఒక్కరినీ సమానంగా గౌరవించడం అందరూ నేర్చుకోదగిన మంచి లక్షణం. 

    మేము మొదటి ఆరు నెలలు ఉన్న ప్రదేశంలో ఒకప్పుడు (1975-1993 మధ్య కాలంలో) ఎవరైనా బొట్టు పెట్టుకున్న వ్యక్తి కనిపిస్తే వారిమీద దాడులు జరిగేవి. అలాంటిది మేము ఉన్నన్నాళ్ళూ ప్రతిరోజూ బొట్టు పెట్టుకునే బయట తిరగటం, ఆఫీసుకు వెళ్ళటం చేసేవాడిని. మొదట్లో మొహమాటానికి చాలా చిన్న బొట్టు పెట్టుకునేవాడిని. ఒకసారి శ్రీమాతాజీవారు అమెరికా వచ్చినప్పుడు నేను ఆఫీసుకి బయలుదేరుతూ ఉంటే, "ఒరే! నువ్వు బొట్టు పెట్టుకోలేదు నాన్నా!" అన్నారు. "నేను పెట్టుకున్నానమ్మా" అన్నా కూడా మళ్ళీ మళ్ళీ "లేదు నాన్నా! నువ్వు పెట్టుకోలేదు" అన్నారు. విషయం అర్థమై అప్పటినుండి తగినంత పెద్ద బొట్టు పెట్టుకోవటం అలవాటు చేసుకున్నాను.

    ఇక అమెరికా వాసులనుండి నేర్చుకోవలసిన రెండవ గొప్ప విషయం 'ఇది పెద్ద పని, ఇది చిన్న పని' అనే భేదాలు లేకుండా ప్రతి పని గౌరవప్రదమైనదిగానే చూడటం. ఈ రెండు మంచి గుణాలు మనమందరం అలవాటు చేసుకోగలిగితే అటు సోషలిష్టులయినా, ఇటు ఆధ్యాత్మిక వాదులైనా ప్రవచించే సమ సమాజ స్థాపన జరుగుతుంది. అప్పుడు అది కర్మభూమి అయినా భోగభూమి అయినా దానిని మనం యోగభూమిగానే పరిగణించగలుగుతాం. 

సమత్వం యోగ ఉచ్యతే

15, మే 2022, ఆదివారం

సులభ మార్గం

 ఘటోవా మృత్పిండోఽ ప్యణురపిచ ధూమోఽగ్ని రచలః
పటోవా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం|
వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా
పదాంభోజం శంభోర్బజ పరమసౌఖ్యం వ్రజ సుధీః||

ఎంత గొప్ప చదువులు చదువుకున్నా, ఎంత పెద్ద గ్రంధాలు తల్లక్రిందులుగా అప్పజెప్పగలిగినా అవి నీ నిజ జీవిత గమనానికి ఉపయోగపడనప్పుడు అవన్నీ వ్యర్థమే కదా! అలాగే సకల వేదాలను, తర్క మీమాంసాది శాస్త్రాలను ఔపోసన పట్టినా కేవలం వాటిని కంఠస్థం చేయడంతోనే ఆగిపోతే అది వ్యర్థం. విద్యయొక్క పరమార్థం ఆత్మజ్ఞాన ప్రాప్తి, తద్వారా మోక్షఫలాన్ని అందుకోవటం. అది వదిలేసి శాస్త్ర చర్చలలో కాలం గడపడం వృధా కంఠక్షోభ అని జగద్గురువులు శ్రీ ఆది శంకర భగవత్పాదాచార్యుల వారు పైన ఉదహరించిన శివానంద లహరిలోని ఆరవ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు.

రకరకాల ఆకారాలలో కుండలు కనిపిస్తున్నా అవన్నీ మట్టితో చేసినవే. రకరకాల నగలు కనిపిస్తున్నా అవన్నీ బంగారంతో చేసినవే. వివిధ వర్ణాలలో అందమైన వస్త్రాలు కనిపిస్తున్నా అవన్నీ దారంతో చేసినవే. అదే విధంగా ఈ చరాచర ప్రకృతి విభిన్న అకృతులలో కనిపిస్తున్నా దానిని ప్రకాశింపజేసే ఆత్మ ఒక్కటే అని, దానిని గుర్తించమని వేదాంతం చెబుతున్నది. అది గుర్తించినవాడు సర్వత్రా ఆ సర్వేశ్వరునే దర్శిస్తూ, ఏ జీవికి ఎటువంటి హానిని కలుగజేయకుండా, అందరియెడ నిష్కారణమైన ప్రేమను కురిపిస్తూ ఉంటాడు. అయితే అది గుర్తించి అనుభవంలోనికి తెచ్చుకోకుండా కేవలం ఆయా శ్లోకాలను వల్లెవేస్తూనో, లేదా ఈ శాస్త్రంలో ఇలా చెప్పబడింది, మరి ఆ శాస్త్రంలో అలా ఎందుకు చెప్పారని వాదించుకుంటూనో జీవితం గడిపేస్తే మరి ఆ జీవితం వ్యర్థమే కదా.

నదిని దాటడానికి అనేక మార్గాలు ఉంటాయి. అయితే నదిని దాటడం మానివేసి, నీవు పట్టుకున్న మార్గం, లేదా సాధనం మీద మోహం పెంచుకొని, దానినే పట్టుకొని వ్రేళ్ళాడితే నీవు గమ్యం చేరేదెప్పుడు? మా మార్గం గొప్పదంటే, కాదు మా మార్గమే గొప్పదని, అలాగే అందరు దేవుళ్ళ కంటే మా దేవుడే గొప్పవాడని - ఇలా వాదించుకునే వారు సాధించేదేముంది? అలా కాక సద్బుద్ధి కలిగిన వారు తాము ఆశ్రయించిన, విశ్వసించిన పరమాత్ముని పాదపద్మాలపై మనస్సును లగ్నం చేసి చాలా సుఖంగా ఈ సంసార జలధిని దాటిపోతారు.

భక్తిలేని జ్ఞానం శిరస్సులేని మొండెంలాంటిది. దానివలన సాధించేది ఏమీ లేదు. అసలు భక్తి అంటూ ఉంటే అది ఎప్పటికైనా పరాకాష్ట స్థితిని చేరి జ్ఞానంగా పరిణమిస్తుంది. ఇది సహజ జ్ఞానం. భక్తిలేని జ్ఞానం పుస్తక జ్ఞానంగానే మిగిలిపోతుంది. ఒక బంగారం కొట్టు యజమాని సహజంగానే తన కొట్టులోని బంగారు నగలన్నింటిలో వాటి వాటి ఆకార వికారాలను కాక బంగారాన్నే చూస్తాడు. అది ఏ పుస్తకంలోనూ చదువుకొని సంపాదించిన జ్ఞానం కాదు కదా. పైకి కొనుగోలుదారులతో ఎన్ని విధాలుగా ఆ నగల గురించి చర్చిస్తున్నా లోపల అతని మనస్సు సదా వీలైనంత ఎక్కువ బంగారాన్ని అమ్మి ఎక్కువ లాభం పొందాలనే ఉంటుంది. అలా కాక ఉన్నది నగలు కాదు, బంగారమే అని ఎన్నిమార్లు వల్లెవేస్తే మాత్రం ఆ దృష్టి వస్తుందా?

పరమానందయ్య శిష్యుల కథలలో ఒకదానిలో వారు ఒక పాత్రలో నెయ్యి పోయించుకొని 'పాత్రకు ఘృతం ఆధారమా? ఘృతానికి పాత్ర ఆధారమా?' అనే వాదనలో పడి చివరికి తమ చేతిలోని నేతిని మొత్తం నేలపాలు చేసుకుంటారు. అలా కాక వారు ఆ నేతిని ఉపయోగించుకొని ఉంటే ఎంత ఆనందాన్ని అనుభవించేవారు? అలాగే ఆత్మ వస్తువు తనలోనే ఉండగా దానిని అనుభవంలోనికి తెచ్చుకోకుండా ఆ ఆత్మ గురించి ఏ శాస్త్రంలో ఎలా చెప్పబడింది అనే తర్క చర్చలలో మునిగి తేలుతూ కాలం వృధా చేసుకుని చివరికి మట్టిపాలైపోతే ఏమి ప్రయోజనం?

అందుకే శ్రీగురుదేవులు "శ్లోకం లోకంలో పడితే శోకమే" అనేవారు. ఆత్మతత్వాన్ని ప్రత్యక్షంగా తెలుకోవటం కష్టమని వేదాంతంలో అనేక ప్రమాణాలు చూపించారు. అందులో ఏదో ఒక దానిని పట్టుకొని, తద్వారా ఆత్మ ఉన్నదని, అదే తన నిజస్వరూపమని గుర్తెరిగి, దానిని అనుభవంలోనికి తెచ్చుకోవటం మానేసి, ఫలానా విషయం ప్రత్యక్ష ప్రమాణమా, లేక అనుమాన ప్రమాణమా, దీనికి ఉపాదాన కారణం ఏమిటి, నిమిత్త కారణం ఏమిటి? అనుకుంటూ వృధాగా కంఠక్షోభను పొందటం ఎంతవరకు సమంజసం అని జగద్గురువులు మనలను ప్రశ్నిస్తున్నారు. ఈ కలియుగంలో మోక్షం పొందడానికి ఒకేఒక్క మార్గం, అతి సులువైన మార్గం భగవన్నామ స్మరణం. ఇంత తేలిక మార్గాన్ని వదలివేసి అనవసరమైన తర్క వ్యాకరణాది శాస్త్ర చర్చలలో, కంఠోపాఠాలలో పడి జీవితం వ్యర్ధం చేసుకోవద్దని ఇటు శివానంద లహరిలో, అటు భజగోవింద శ్లోకాలలో కూడా వారు హెచ్చరిస్తున్నారు.

15, ఏప్రిల్ 2022, శుక్రవారం

భక్తి జ్ఞాన వైరాగ్యాలు

 మోక్షం రావాలంటే జ్ఞానం కలగాల్సిందే అంటారు కొందరు. కాదు, భక్తియే మోక్షసాధనం అంటారు మరికొందరు. అసలు ఈ రెండిటికన్నా ముందు వైరాగ్యం కలగాలి కదా అంటారు ఇంకొందరు. అయితే జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యులవారు వివేక చూడామణిలో "మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ" - మోక్షం సాధించడానికి కావలసిన ఉపకరణాలన్నింటిలో భక్తియే అత్యుత్తమమైనదని నొక్కి వక్కాణించారు. మామూలుగా మనం భక్తి అంటే పూజలు చేయటమో, ఉపవాసాలు ఉండటమో ఇటువంటి బయటి ఆర్భాటాలనే అనుకుంటాం కదా! అయితే ఇదే శ్లోకం రెండవ పాదంలో భక్తి అంటే ఏమిటో వారు నిర్వచిస్తున్నారు. "స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే" - నీయొక్క అసలు స్వరూపంతో నిత్యమూ అనుసంధానం కలిగి ఉండటమే భక్తి అనబడుతుంది.

అయితే నీ అసలు స్వరూపం ఏది? దానినే మనం "నేను" అంటున్నాం. ఈ నేనుకే సంస్కృతంలో "ఆత్మ" అని పేరు. అయితే ఇది మూడు రూపాలలో ఉంటుందని దక్షిణామూర్తి స్తోత్రం తెలియజేస్తోంది. "ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః" ఈశ్వరుడు, గురువు, ఆత్మ - ఈ మూడూ రూపంలో భేదమే కానీ అసలు వస్తువులో భేదం లేదనీ, ఆకాశంవలె సర్వత్రా వ్యాపించి ఉంటాయని తెలియజేస్తోంది. అంటే ఈ మూడూ మన స్వస్వరూపాలే అన్నమాట.

నిరంతరం ఈశ్వరుడితో మనస్సు అనుసంధానమై ఉండి సదా భగవధ్యానంలో ఉంటూ ఆయన సేవ తప్ప మరో విషయం మీదికి మనస్సు పోకుండా ఉంటే అదే భక్తి. అలాగే మనస్సు సదా ఆత్మతో అనుసంధానమై సర్వత్రా నిండియున్న ఆ ఆత్మనే ఎల్లప్పుడూ దర్శిస్తూ సర్వత్ర సమదృష్టి కలిగి ఉండటమే జ్ఞానం కదా! మరి గురువునే సర్వస్వంగా భావించి మానసికంగా సదా వారి సాన్నిధ్యంలోనే ఉంటూ గురుబోధను నిరంతరం మననం చేసుకుంటూ ఆచరణలో పెట్టే సాధకునికి ఇతర విషయాలపై వైరాగ్యం దానంతటదే కలుగుతుంది కదా! అంటే ఆత్మయొక్క మూడు భిన్న రూపాలలో ఒక్కొక్క దానితో అనుసంధానం వలన మనకు భక్తి జ్ఞాన వైరాగ్యాలలో ఒక్కొక్కటి సహజంగానే కలుగుతున్నాయి.

ఆత్మయొక్క మూడు రూపాలకు రూపంలో తప్ప తత్వంలో భేదం లేనట్లే, ఆ ఆత్మతో అనుసంధానానికి రూపాలైన భక్తి జ్ఞాన వైరాగ్యాలలో కూడా భేదం లేదన్నమాట. శ్రీగురుదేవులు తరచుగా "గాఢమైన విశ్వాసమే భక్తి. భక్తియొక్క పరాకాష్టయే జ్ఞానం. జ్ఞానంయొక్క పరాకాష్టయే ముముక్షుత్వం" అని బోధించేవారు. ఇక్కడ ముముక్షుత్వం అంటే మోక్షం తప్ప మరేదీ అవసరం లేదనే వైరాగ్యమే కదా!

మనం ఒక బీజం నాటితే దానికి సంబంధించిన మొక్క మొలకెత్తి, వృక్షమై అటువంటి ఫలాన్నే ఇస్తుంది. మామిడి టెంక నాటితే మామిడికాయలే కాస్తాయి. మర్రి విత్తనం నాటితే మర్రి పళ్ళే కాస్తాయి. మరి శ్రీగురుదేవులు ప్రసాదించిన ఆశ్రమ నిత్యప్రార్థనలో "దీనబంధూ! దయానిధే! మా మనస్సు అచంచల విశ్వాసముతో నిరంతరము నీయందే నిలచియుండునట్లు అనుగ్రహింపుము. మాలో భక్తి జ్ఞాన వైరాగ్య బీజములు అంకురించి, పెంపొంది, ఆత్మానంద ఫలమును ఒసగులాగున ఆశీర్వదింపుము" అనే వాక్యాన్ని చేర్చారు. ఇక్కడ కూడా మనస్సు అచంచల విశ్వాసంతో నిరంతరము భగవంతునితో అనుసంధానమై ఉండాలని, అలా ఉన్నప్పుడు మనలో భక్తి జ్ఞాన వైరాగ్య బీజాలు నాటుకొని, మొలకెత్తి ఆత్మానందమనే ఫలాన్ని ఇస్తాయని వివరిస్తున్నారు. అయితే ఈ మూడు వేరు వేరు బీజాలు అయినట్లైతే అలా మొలకెత్తిన వృక్షాలు ఒకే ఫలాన్ని ఇవ్వటం ఎలా సాధ్యం? కాబట్టి ఈ మూడు వేరువేరు కాదని, ఒకే భావనకు భిన్న అభివ్యక్త రూపాలని, వాటి పరమార్థం ఆత్మానందమేనని మనకు అర్థం అవుతోంది. 

1, ఏప్రిల్ 2022, శుక్రవారం

శుభకృత్

    ప్లవనామ సంవత్సరాన్ని దాటి శుభకృత్ నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. శుభం అంటే మంచి. శుభం అంటే మంగళకరం. శుభం అంటే అందమైనది, ప్రకాశవంతమైనది. అటువంటి శుభాలను కలిగించే సంవత్సరం అన్నమాట. నిజానికి కాలం పరమాత్మ స్వరూపమే. కాలం కలయతామహం - కదిలే వాటిలో కాలాన్ని నేను అని గీతాచార్యుడు చెప్పాడు. కనుక సంవత్సరాలన్నీ శుభప్రదమైనవే. అందుకే కొన్ని సంవత్సరాల పేర్లు ఎంత భయంకరంగా ఉన్నా వాటిముందు మనం శ్రీ అని తప్పనిసరిగా చేరుస్తాము. 

    నిరంతరం కదులుతూ ఉండేది కాలం. నీటి ప్రవాహాన్ని అయినా ఆనకట్టతో ఆపవచ్చేమో కానీ కాల ప్రవాహాన్ని ఆపలేము. ప్రవహించకుండా స్థిరంగా ఉన్న నీరు త్వరగా పాడైపోతుంది. దానిలో అనేక సూక్ష్మక్రిములు, చెత్త చెదారం చేరి కలుషితం అయిపోతుంది. అదే నిరంతరం ప్రవహించే నీటిలో చెత్త వేసినా అది స్వచ్ఛంగానే ఉంటుంది. అలాగే మన జీవితం కూడా కాలంతో పాటు నిరంతరం మార్పు చెందుతూ ఉంటేనే అది ఎప్పటికప్పుడు తాజాగా, అందంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. చలనం లేక నిలిచిపోయిన జీవితం నిస్సారంగా ఉంటుంది.

    సాధారణంగా మన తెలుగు సినిమాల చివరిలో శుభమ్ అని చూపిస్తారు. అలాగే ఇంగ్లీషు వాళ్ళు కథలు చెప్పినప్పుడు చివరిలో They lived happily ever after అని చెబుతారు. కానీ మన జీవితంలో శుభాశుభాలు, సుఖదుఃఖాలు రెండూ శాశ్వతంగా ఉండవని, ఒకటి తర్వాత ఒకటిగా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయని మనందరికీ తెలిసిందే కదా! మరి శాశ్వతమైన శుభం ఏది? ఆత్మ ప్రకాశమే శాశ్వత ప్రకాశం. ఆత్మానందమే శాశ్వతానందం. ఆత్మ సుఖమే శాశ్వత సుఖం. అటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడే నిజమైన శుభం కలుగుతుంది. 

    మనలో ద్వైత భావన ఉన్నంతవరకు ఏదో కావాలనే, పొందాలనే ఆరాటం, అది దక్కలేదని ఆక్రోశం, ఉన్నదేదో పోతుందని ఆవేదన తప్పవు. అసలు నేను ఎవరో తెలుసుకుంటే ఈ కనిపించేదంతా నేనే అని కూడా తెలుసుకుంటావు. అంతా నీవే అయినప్పుడు పొందవలసినది కానీ, కోల్పోయేది కానీ ఏమీ ఉండదు. అప్పుడు ఇంక అక్కడ ఎటువంటి రాగద్వేషాలకు, సుఖదుఃఖాలకు తావు ఉండదు. అక్కడ అంతా శాంతి, ఆనందం, ప్రకాశం, శుభమే. 

    ఎందరో మహానుభావులు అటువంటి ఆత్మజ్ఞానాన్ని పొంది వారిలోని కామక్రోధాది దుర్గుణాల స్థానంలో అహింస, సత్యం, శాంతి, దయ, ప్రేమ, ఐకమత్యం, మానవత్వం, సమతా భావన, సమానత్వం మొదలైన ఉత్కృష్ట గుణాలను అలవరచుకొని, తమ అతి సాధారణమైన నిరాడంబర జీవితంలోనే ఆయా గుణాలను తమ ప్రబోధాల ద్వారా, అంతకంటే ముఖ్యంగా ఆచరణ ద్వారా సర్వ జనావళికి పంచిపెట్టారు. అయితే వారి ఆచరణ మార్గాన్ని అనుసరించి ఆత్మజ్ఞానాన్ని పొందకుండా కేవలం వారిని అనుకరించడం ద్వారానో, లేదా వేల కోట్లు ఖర్చు పెట్టి వారి భారీ ప్రతిమలు నెలకొల్పడం ద్వారానో ఆయా సద్గుణాలను సాధించాలనుకుంటే అది అసాధ్యం.

    అయితే మహాత్ములను అనుసరించడం కంటే వారిని అనుకరించడం, లేదా అర్చించటం చాలా తేలికైన పని. నిజానికి అహింసకు ప్రతిరూపమైన బుద్ధభగవానుడు విగ్రహారాధనను ఖండించాడు. కానీ ఈరోజు ప్రపంచంలో ఏమూలకు వెళ్ళినా ఆయన భారీ విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. అయితే ఆయన బోధనలను, నిర్దేశించిన మార్గాన్ని ఎంతమంది అనుసరిస్తున్నారు? ఆచరణలో పెడుతున్నారు? అలా పెడితే ఈనాడు ఇంతటి యుద్ధాలు, మారణహోమాలు, రక్తపాతం చూడవలసిన ఖర్మ ఎందుకు పడుతుంది.

    శ్రీగురుదేవులు చాలా కాలం ఎవరినీ తమ ఫోటో తీయనిచ్చేవారు కాదు. "నీకు నా ఫోటో కావాలా? నేను కావాలా? ఫోటోనే కావాలంటే అది ఏ గోడమీదో, గూట్లోనో, పర్సులోనో మాత్రమే ఉంటుంది. అదే నన్ను నీ హృదయంలో పెట్టుకుంటే ఇక నీకు నాకు భేదం కానీ, దూరం కానీ ఎక్కడ ఉంటుంది?" అనేవారు. అలా మహాత్ములను, గురువులను నిజంగా హృదయంలో ప్రతిష్టించుకుని వారు చూపిన మార్గంలో పయనిస్తే జీవితమంతా శుభాలమయమే. ప్రతి సంవత్సరమూ శుభకృత్ సంవత్సరమే. అటువంటి నిజమైన సాధకుడు తన జీవితాన్ని పండించుకోవటమే కాక సర్వ మానవాళికి శుభకరుడై వెలుగొందుతాడు.

11, ఫిబ్రవరి 2022, శుక్రవారం

నాదబిందుకళలు

నిరాకారుడైన పరబ్రహ్మ సృష్టి చేయాలని సంకల్పించాడు. అప్పుడు ఆయనలోనుండి ఓంకార నాదం ఉద్భవించింది. ఆ నాదమే ఘనీభవించి బిందువుగా రూపాంతరం చెందింది. ఆ బిందువు మూడుగా విభజించబడి అ, ఉ, మ అనే అక్షరాలుగా ఆవిర్భవించింది. వీటినే సృష్టి స్థితి లయ కారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులని, లేదా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులైన లక్ష్మీ, సరస్వతి, పార్వతి మాతలుగా కూడా అభివర్ణిస్తారు. వీరినుండి అనేక కళలతో విలసిల్లే ఈ సకల చరాచర సృష్టి అంతా ఆవిర్భవించింది.

అయితే ఒక కుమ్మరి కుండను తయారు చేయాలంటే మట్టి కావాలి. అలాగే ఒక కంసాలి నగలు చేయాలంటే బంగారం కావాలి. ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వాలంటే తండ్రినుండి బీజం కావాలి. ఇలా మనకు కనబడే ఏ వస్తువును తయారు చేయాలన్నా ఆ తయారుచేసే వ్యక్తికి ఒక ముడిపదార్థం అవసరం అవుతోంది కదా! మరి తాను తప్ప మరో వస్తువే లేని దశలో పరమాత్మ ఈ సృష్టిని ఏ ముడిపదార్థంతో తయారు చేశాడు? అనే ప్రశ్న సహజంగా వస్తుంది. 

దీనికి పెద్దలు ఊర్ణనాభి అని పిలువబడే సాలీడుని ఉదాహరణగా చూపిస్తారు. సాలీడు ఎలాగైతే తనలోనుండే దారాన్ని తీసి దానితో గూడు అల్లుతుందో అలాగే పరమాత్మ తనలోనుండే సృష్టిని నిర్మించాడు అని చెబుతారు. అంటే సృష్టిలోని అణువణువూ పరమాత్మ తత్వంతోనే నిండి ఉన్నదన్నమాట! అయితే సాలెపురుగు ఒకసారి తనలోనుండి దారాన్ని బయటకు తీసాక ఇక తాను వేరు, ఆ దారం వేరు. కానీ పరమాత్మ మాత్రం తనలోనుండి వచ్చిన సృష్టి అంతటా తానే నిండి ఉంటాడు. ఇక్కడ వేరు చేయడానికి వీలులేదు.

సైన్సు ప్రకారం శక్తిని కానీ పదార్థాన్ని కానీ సృష్టించడానికి కానీ, నాశనం చేయడానికి కానీ సాధ్యం కాదు. వాటిని కేవలం ఒక రూపం నుండి మరొక రూపానికి పరిణామం మాత్రమే చెందించగలం. అంటే సృష్టి ఎక్కడినుంచో క్రొత్తగా రాలేదన్నమాట. అనంతశక్తి స్వరూపుడైన పరమాత్మ శక్తిలోని కొంత భాగమే పదార్థ రూపంగా పరిణామం చెంది సృష్టిగా భాసిస్తోంది. అయితే అనంతంలోనుంచి ఎంత తీసివేసినా అది అనంతంగానే మిగులుతుంది కానీ దానికి కొరత రాదు. అలాగే తీసివేయబడిన భాగం కూడా అనంతమే అవుతుంది. ఇదే మనకు "పూర్ణమదః పూర్ణమిదం .." అనే శ్లోకం తెలియజేస్తోంది. 

శాస్త్రజ్ఞులు కూడా ఈ సృష్టి ప్రారంభాన్ని వివరిస్తూ ముందు ఒక చిన్న బిందువు ఉన్నదని, అది మహావిస్ఫోటనం చెంది నక్షత్ర మండలాలుగా, గ్రహాలుగా, జీవరాశిగా (వివిధ కళలుగా) ఏర్పడిందని చెబుతారు. అలాగే చివరికి మళ్ళీ ఈ సృష్టి అంతా ఆ బిందువులోనే లయమైపోతుందని కూడా చెబుతారు. అయితే ఇక్కడ నాదం ఎక్కడ ఉన్నదని మనకు సందేహం రావచ్చు. ఏ పదార్థము లేని శూన్యం అంతా ఓంకార నాదమే నిండి ఉంటుంది. మీరు ఒక ఖాళీ శంఖాన్నిగానీ, గ్లాసునుగానీ, మరేదైనా ఖాళీ వస్తువును చెవిదగ్గర పెట్టుకుంటే ఓంకారనాదం వినిపిస్తుంది. అసలు ప్రతి జీవి సృష్టి నాదంతోనే ప్రారంభమవుతుందని వివరిస్తూ సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారు "జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం, చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం" అన్నారు.

ఇక పైన చెప్పుకున్నట్లు ఈ నాదబిందుకళలనే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని కూడా చెబుతారు. శ్రీగురుదేవులు ఒక ఉదాహరణ చెప్పేవారు. ముందుగా ఒక ఇంజనీరు ఒక పెద్ద డామ్ కట్టాలని సంకల్పిస్తాడు. ఇదే ఇచ్ఛాశక్తి. అప్పుడు అతను తన జ్ఞానశక్తిని ఉపయోగించి ఆ డ్యామును ఒక ప్లాన్ రూపంలో కాగితం మీదకు తెస్తాడు. ఇక దానికి క్రియాశక్తి తోడైతే అది నిజమైన పెద్ద డ్యాము ఆకారాన్ని పొందుతుంది.

అయితే యద్దృశ్యం తన్నశ్యం అని చెబుతారు. అంటే మన కళ్ళకు కనబడే, జ్ఞానేంద్రియాలతో గ్రహింపబడేదంతా చివరికి నశించిపోవలసిందే. అలాగే మన ఇంద్రియాలకు గోచరమయ్యే ఈ నాదబిందుకళలు ఎప్పటికైనా నశించిపోయేవే. నిరాకారుడైన పరబ్రహ్మ ఇవి ఉన్నప్పుడూ, లేనప్పుడూ కూడా ప్రకాశించే సచ్చిదానంద స్వరూపుడు. అందుకే ఆయన నాదబిందు కళాతీతుడు. 

ఓం నాదబిందు కళాతీతాయ నమః

11, జనవరి 2022, మంగళవారం

రహస్యం

మన భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ వాటిలో చెప్పబడిన విషయం చాలా రహస్యం అని చెప్తూ ఉంటాయి. భగవద్గీతలో కూడా స్వామి 'ఇతి గుహ్యతమం శాస్త్రం' అని, 'రహస్యం హ్యేతదుత్తమం' అని ఇలా చాలా చోట్ల  చెప్తారు. అలాగే 'త్రిపురా రహస్యం', 'లలితా సహస్రనామ రహస్య స్తోత్రం' ఇలా అన్నీ రహస్యమనే చెప్పబడ్డాయి. అయితే ఇలా రహస్యం అని చెప్పడం, ఏదో ఇవన్నీ పండితుల కోసమేనని, సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉండకుండా చేయాలని కాదు. ఈ గ్రంథాలలో చర్చించిన విషయం చాలా లోతైనది. అందులో ప్రవేశం లేనివారు, సరైన మానసిక పరిపక్వత చెందనివారు దానిని తప్పుగా అర్థం చేసుకొనే అవకాశం ఉంది. 

తామసికమైన బుద్ధి అన్నింటికి విపరీతార్థాలు తీసి అధర్మాన్నే ధర్మంగా అర్థం చేసుకుంటుందని గీతాచార్యుడు వివరించాడు. అంతెందుకు, మన పురాణాలలోని ప్రముఖ రాక్షసులు అందరూ ధర్మ శాస్త్రాలను కూలంకషంగా అభ్యసించిన వారే. కానీ అందులోని ధర్మసూత్రాలనే తమ అధర్మ ప్రవర్తనకు అనుకూలంగా నిర్వచించుకొని తమ తప్పులను సమర్థించుకోవటం మనం రావణుని విషయంలో, దుర్యోధనుని విషయంలో కూడా చూస్తాం. అందుకే నిర్మలాంతఃకరణ లేనివారికి ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని బోధించకూడదు అని మన పెద్దలు దానిని రహస్యంగా నిర్వచించారు.

సంసార బంధాలలో చిక్కుకొని బయట పడలేక అలమటించే శిష్యుని చేరదీసిన గురువులు 'నువ్వు ఈ కనిపించే దేహానివి కాదురా! సర్వ జీవకోటిలో కూటస్థ చైతన్య పరబ్రహ్మగా ప్రకాశించేది నువ్వేరా!' అని చెబితే ఆ శిష్యుడు సాత్విక ప్రధానుడైతే శోకమోహాలను జయించి తన నిజస్థితిని అనుభవపూర్వకంగా గుర్తించే ప్రయత్నం చేస్తాడు. అదే రాక్షసులవంటి రాజసిక, తామసిక గుణ ప్రధానుడైతే నేనే ఈ లోకాలకన్నింటికీ ప్రభువునని విఱ్ఱవీగుతాడు. 

నా చిన్నప్పుడు ఎప్పుడైనా గుంటూరు రైలులో వెళితే సరిగ్గా గుంటూరు స్టేషన్ వచ్చే ముందు మూడు వంతెనలు ఉండేవి. ఆ వంతెనల పైనుండి రైలు వెళుతుంటే క్రింద రోడ్డుమీద వెళ్ళే సైకిళ్ళు, రిక్షాలు లాంటి వాహనాలన్నీ ఆ వంతెనకు అల్లంత దూరంలో ఆగిపోయి రైలు వెళ్ళేదాకా ఎదురుచూస్తూ ఉండేవి. చిన్న వయసులో ఉన్న నేను 'ఆహా! ఈ చిన్న చిన్న వాహనాలన్నింటికీ తమకన్నా పెద్ద వాహనమైన రైలు అంటే ఎంత గౌరవమో కదా! శ్రీగురుదేవులు పూజకో, సత్సంగానికో వస్తూవుంటే మనందరం గౌరవసూచకంగా దారికి ఇరువైపులా దూరంగా నిలబడినట్లు రైలు వస్తూవుంటే ఈ వాహనాలన్నీ దూరంగా నిలబడుతున్నాయి' అనుకునేవాడిని. అయితే అసలు విషయం తరువాత తెలిసింది. ఆ వంతెనలకు క్రింద స్లాబ్ లేదు. అందుకని ఆ రైలులో వెళ్ళేవారు వదిలే మలమూత్రాలు అన్నీ తమ నెత్తిన ఎక్కడ పడతాయో అని ఆ వాహనదారులందరూ దూరంగా నిలబడేవారు. అలాగే హిరణ్యకశిపుడి లాంటి రాక్షసుడితో పెట్టుకుంటే తమ నెత్తిమీదకి ఏ పెంట తెచ్చిపెడతాడో అని, దుష్టుడికి దణ్ణం పెట్టైనా దూరంగా ఉండాలని ప్రజలందరూ తనకు నమస్కరించి దూరం జరుగుతుంటే ఆ హిరణ్యకశిపుడు 'ఆహా! నేనే వీరందరికీ దేవుణ్ణి కదా! అహం బ్రహ్మాస్మి!' అనుకోవడం మొదలుపెట్టాడు.

ఇక ఆధ్యాత్మిక దృష్టి లేనివారితో ఆ విషయాలు చర్చించటం వలన ఇంకొక నష్టం కూడా ఉంది. ఆంధ్రప్రభలో పనిచేసిన శ్రీచిరంజీవిగారు, ఇండియన్ ఎక్సప్రెస్ లో పనిచేసిన శ్రీసంపత్ గారు ఒకసారి ఏదో సమావేశంలో ప్రముఖ నాస్తికుడైన డాక్టర్ సమరంగారిని కలవటం జరిగింది. అప్పుడు వారి మధ్య దేవుని ఉనికిపై కొంత వాదన జరిగింది. ఆ తరువాత వారిద్దరూ ఆశ్రమానికి వచ్చి శ్రీగురుదేవులను దర్శించుకొన్నప్పుడు వారు 'ఏమిటి, మొన్నేదో చర్చ జరిగినట్లుంది?' అని ప్రశ్నించారు. అప్పుడు వారిద్దరూ 'అవును బాబూ! దేవుడు ఉన్నాడని మేమూ, లేడని డాక్టర్ సమరంగారూ చాలాసేపు వాదించుకున్నాం' అన్నారు. అందుకు శ్రీగురుదేవులు 'ఇలాంటి అనవసరపు వాదనలు ఇంకెప్పుడూ పెట్టుకోకండి. మీరింకా సాధన దశలో ఉన్నారు కదా! ఇటువంటి స్థితిలో ఒక్క విషపు చుక్క కడివెడు పాలను నాశనం చేసినట్లు, అటువంటివారి మాటలలోని ఒక్క విషబీజం మీ మనసులో నాటుకుందంటే మీ సాధన అంతా వృథా అయిపోతుంది' అని హెచ్చరించారు.

ఇంకొందరు అనేక గ్రంధాలు చదివి వాచాజ్ఞానంతో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి ఇలాంటి ఒక వ్యక్తి శ్రీగురుదేవుల దర్శనార్థం వచ్చాడు. శ్రీగురుదేవులు మర్యాదపూర్వకంగా 'అయ్యా! తమ పేరు?' అనగానే అతగాడు 'అహం బ్రహ్మాస్మి!' అన్నాడు. శ్రీగురుదేవులు 'ఓహో! మీరు బ్రహ్మమని మీ నిజతత్వం తెలుసుకొన్నారన్నమాట. సంతోషం. మరి మీరు బ్రహ్మమైతే వీళ్ళంతా ఎవరు?' అని ప్రశ్నించారు. అతను నీళ్ళు నమిలాడు. శ్రీగురుదేవులు వివరిస్తూ 'నేను బ్రహ్మను అని తెసులుకొన్నవాని ప్రవర్తన ఇలా ఉండదు. బ్రహ్మమంటే అది కేవలం ఒక వ్యక్తికో, ప్రదేశానికో, కాలానికో పరిమితమైనది కాదు. అది దేశకాలాలకు, రూపనామాలకు అతీతమై సర్వేసర్వత్రా నిండి నిబిడీకృతమైన చైతన్యం. అదే తానని తెలుసుకొన్నవాడు సర్వత్రా తననే దర్శిస్తాడు. అటువంటి వానికి తాను వేరు, ఎదుటి వ్యక్తి వేరు అనే భావనే ఉండదు. అహం బ్రహ్మాస్మి అనేది అనుభవించవలసిందే కానీ నోటితో చెప్పే వాక్యం కాదు.  ఏ వేదాంతమైతే అహం బ్రహ్మాస్మి అని బోధిస్తోందో అదే వేదాంతం సర్వం ఖల్విదం బ్రహ్మ అని, ఏకమేవాద్వితీయం బ్రహ్మ నేహనానాస్తి కించన అని కూడా చెబుతోంది' అని బోధించి అతని అహాన్ని త్రుంచివేశారు.

ఆధ్యాత్మిక విషయాలను తోటి సాధకులతో కొంతవరకు చర్చించవచ్చు కానీ, మనకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో కనిపించిన ప్రతివారినీ భక్తులుగా, సాధకులుగా మార్చివేద్దామనుకోవడం అజ్ఞానమే. అలాగే లోకంలో కొందరు మూర్ఖులు కూడా ఉంటారు. ఏనుగును లేత తామర తూడులోని దారాలతో బంధించాలనుకోవడం ఎంత అవివేకమో, మరొక వజ్రంతోనే కోయగలిగిన వజ్రాన్ని కోమలమైన దిరిసినపువ్వు రేకుతో కొయ్యలనుకోవడం ఎంత అవివేకమో, ఉప్పునీటి సముద్రాన్ని ఒక తేనెచుక్కతో తియ్యగా మార్చివేయాలనుకోవటం ఎంత అవివేకమో మూర్ఖుణ్ణి అమృతబిందువులవంటి సూక్తులతో మార్చాలనుకోవటం అంతటి అవివేకమని భర్తృహరి సుభాషితం చెబుతోంది. అయితే ఎంతటి మూర్ఖుల చిత్తాన్నైనా హరించి క్షణంలో పరమ భక్తులుగా మార్చివేయగల సామర్ధ్యం ఒక్క సమర్థ సద్గురుదేవులకే ఉంటుంది.

లౌకిక విద్యలోనే ఎన్నో శాఖలు, మరెన్నో స్థాయిలు ఉంటాయి కదా! మరి ఈ విద్య నేర్చుకోవటానికే మనకు ఉపాధ్యాయులు అవసరం. మళ్ళీ ఆ ఉపాధ్యాయులు ఎవరెవరి స్థాయిని బట్టి వారికి విద్య బోధిస్తారు. అంతేకానీ నేనే పుస్తకం చదివి అంతా నేర్చేసుకుంటాను అంటే అలా నేర్చుకొన్న విద్యకు సమాజంలో ఎంతవరకు విలువ ఉంటుందో మనకు తెలిసిందే. మరి ఆధ్యాత్మిక విద్యను కేవలం గ్రంథాలు చదివి అర్థం చేసుకొందామనో, తోటి సాధకులతో చర్చించి అవగాహనకు వద్దామనో అనుకోవటం అవివేకమే అవుతుంది. అందుకే నిగూఢమైన, అతి రహస్యమైన ఆధ్యాత్మిక విద్యను గురువులనుండి మాత్రమే పొందగలం.