8, ఏప్రిల్ 2024, సోమవారం

క్రోధి


 క్రోధి అంటే క్రోధము కలవాడు. మనందరమూ క్రోధులమే కదా! అసలు క్రోధం ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తే, మనం కావాలని కోరుకున్నది ఏదో దక్కకపోతే వస్తుంది, ఎదుటివారు మనం కోరుకున్న విధంగా ప్రవర్తించకపోతే వస్తుంది. అంటే కోరికకి, కోపానికి చాలా దగ్గర సంబంధం ఉంది. నిజానికి గీతాచార్యుడు ఈ రెండూ ఒకటే అని చెబుతాడు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విధ్యేన మిహ వైరిణం - ఇదే కామం, ఇదే క్రోధం. ఇది రజోగుణం నుండి ఉద్భవిస్తుంది. దీని ఆకలి ఎప్పటికీ తీరదు. ఇది నీతో మహాపాపాలు చేయిస్తుంది. కాబట్టి దీనిని శత్రువుగా తెలుసుకో - అని శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తున్నాడు.


ఇంకొక విషయం మనం గమనిస్తే మనకు బయటివారు, ఎవరో అపరిచితుల కంటే మనకు బాగా దగ్గరైన వారు, మన కుటుంబ సభ్యులపైనే ఎక్కువగా కోపాన్ని చూపిస్తాం. పక్కింటి పిల్లవాడికి సున్నా మార్కులు వచ్చినా మనకేమీ పట్టదు. అదే మన పిల్లవాడికి కొద్దిగా మార్కులు తగ్గినా మనకి పట్టరాని కోపం వస్తుంది. అలాగే ఉద్యోగం విషయంలో, ప్రవర్తన విషయంలో, ఆరోగ్యం విషయంలో ఇలా ప్రతి దానిలోనూ మనవారు ఉన్నతస్థాయిలో ఉండాలని మనం కోరుకుంటాం. ఆ కోరిక తీరనప్పుడు అది కోపంగా పరిణమిస్తుంది.

ఎవరిపైనైనా క్రోధం తెచ్చుకోవడం అంటే వారు చేసిన తప్పుకి మనకి మనం శిక్ష వేసుకోవడమే. ఎందుకంటే క్రోధం, మనని లోలోపలనుండి తినేస్తుంది. దానివలన గుండెల్లో మంట, రక్తపోటు, గుండెజబ్బులు, మానసిక రోగాలు ఇలా అనేకం వస్తాయి తప్ప ఏమీ ఉపయోగం లేదు. అల్పుల కోపం రాతిమీద చెక్కిన గీతలాగా కలకాలం నిలిచి ఉండి పగలాగా మారుతుంది. అదే మహాత్ముల కోపం నీటిమీద గీతలాగా క్షణంలో మాయమవుతుంది. పైగా ఎవరిమీద కోపం తెచ్చుకున్నారో అది వారికి మంచినే చేస్తుంది. ఇలా మహాత్ముల కోపానికి, శాపానికి గురై ఆ కారణంగా శ్రీమన్నారాయణుని దర్శనం, స్పర్శనం పొంది తరించినవారు అనేకులు రామాయణ భాగవతాలలో మనకు కనిపిస్తారు.

అరిషడ్వర్గంలోని మిగిలిన నాలుగు దుర్గుణాలు, ఈ కామక్రోధాల వలన జనించేవే. అయితే గుణం అంటే త్రాడు అనే అర్థం కూడా ఉంది. మన చుట్టూ త్రాడును ఒక దిశలో త్రిప్పితే మనం దానిలో బంధించబడతాం. ఇప్పుడు అదే త్రాడును వ్యతిరేక దిశలో త్రిప్పితే ఆ బంధనం విడిపోతుంది కదా! అలాగే మన మనస్సు ప్రపంచం మీదికి పోయినప్పుడు ఇవే గుణాలు మనను బంధిస్తాయి. అదే మనస్సు భగవంతుని వైపు తిరిగినప్పుడు ఆ గుణాలే మన ముక్తికి కారణమవుతాయి. విషయ కామాన్ని మోక్షకామంగా మార్చుకోగలిగితే అప్పుడు క్రోధం మన ముక్తికి అడ్డు వచ్చే వాసనల మీదకి, వ్యసనాల మీదకి మళ్ళుతుంది. అప్పుడు అది మనకు సాధనకు ఉపయోగపడే మంగళప్రదమైన శ్రీక్రోధం అవుతుంది. అదే మనకు ఈ శ్రీ క్రోధి నామ సంవత్సరం తెలియజేస్తోంది.

అలా క్రోధాన్ని తన అదుపులో పెట్టుకొని ఎవరిపై ఎప్పుడు ఎంత కోపం చూపించాలో తెలిసిన, ఆచరణలో పెట్టిన నేర్పరి కాబట్టే శ్రీరాముడు పురుషోత్తముడు అయ్యాడు. ఇంద్రియాలను కానీ, గుణాలను కానీ బలవంతంగా అణచిపెడితే అవి ఒకానొక బలహీన క్షణంలో అంతకంటే మరిన్ని రెట్లు బలంగా ఎదురుతిరిగి మనను దెబ్బకొడతాయి. అందుకే వాటిని అణచిపెట్టడం కాకుండా ఎప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకు మితంగా వాడుకుంటూ ఉండాలి. భగవద్గీతలో కూడా స్వామి ఇంద్రియ నిగ్రహం కంటే ఇంద్రియ సంయమనాన్నే అలవరచుకోమని బోధిస్తాడు.

కామ క్రోధాది గుణాలు చిన్న చిన్న త్రాళ్ళు అయితే వాటికి మూలమైన సత్వరజస్తమో గుణాలు పెద్ద త్రాళ్ళు. అయితే పైన చెప్పుకున్నట్లు వీటిని అదుపులో ఉంచుకొని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుంటే అవి కూడా సాధనకు ఉపయోగపడతాయి. తమోగుణమే లేకపోతే నిద్ర రాక శరీరానికి అలసట తీరదు. మరి రజోగుణం లేకపోతే ఆ నిద్ర నుండి మెలకువ రాదు, మనం సాధన చేసుకోవాలి, మోక్షాన్ని పొందాలి అనే పట్టుదల రాదు. అలాగే సత్వగుణం సాధనకు ఎంతగానో అవసరమని మనందరికీ తెలిసినదే కదా! అయితే ఈ మూడు గుణాలను వేటి స్థాయిలో వాటిని ఉంచగలిగినప్పుడే అవి మనకు ఉపయోగపడతాయి.

మనస్సు ఈ మూడు గుణాల పెనవేతతో ఏర్పడినది. మూడు పేటల గొలుసు మన మెడలో వేసుకున్నామనుకోండి, అవి మూడు ఒకదానితో ఒకటి అల్లుకొనిపోయి ఏది పైనో ఏది క్రిందో తెలియకుండా పోతాయి. అదే భగవద్గీతలో కృష్ణపరమాత్మ - రజస్తమశ్చాభిభూయః సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తధా - ఒకసారి రజో తమో గుణాలను అణచివేసి సత్వగుణం పైచేయి సాధిస్తుంది. మరొకసారి సత్వ రజో గుణాలపై తమోగుణము, ఇంకొకసారి సత్వ తమో గుణాలపై రజోగుణము పైచేయి సాధిస్తాయి అని చెబుతున్నాడు. ఇలా ముప్పేట గొలుసులాగా ఈ మూడు గుణాలు ఒకదానికొకటి అల్లుకుపోయి మన జీవిత గమనాన్ని వక్రగతులు పట్టిస్తూ ఉంటాయి.

అలా కాకుండా తమోగుణాన్ని క్రింది స్థాయిలో, రజోగుణాన్ని మధ్య స్థాయిలో, సత్వగుణాన్ని పై స్థాయిలో నిలిపి ఉంచితే మన సాధన ఒక సక్రమమైన మార్గంలో ముందుకు సాగి మోక్షాన్ని పొందుతాము. మనస్సనే త్రిగుణాల గొలుసులోని ఈ మూడు వరసలని అలా వాటి వాటి స్థానాలలో పట్టి ఉంచాలంటే ఇక్కడ పొందుపరచిన చిత్రంలోని శ్రీ బాబూజీ మహరాజ్ వారి కంఠసీమను అలంకరించిన గొలుసులో వలె నాలుగు అడ్డ పట్టీలు కావాలి. అవే సత్యం, శాంతి, దయ, ప్రేమ. ఎప్పుడైతే మనం ఈ నాలుగు సాధనా పరికరాలను సమకూర్చుకొని వాటితో మూడు గుణాలను సరైన స్థాయిలో నిలుపుకోగలుగుతామో అప్పుడు మన సాధన తప్పక ఫలించి ముక్తిని పొందుతాము.

ఈ శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మనందరికీ అటువంటి సాధన సంపత్తిని, సంయమనాన్ని ప్రసాదించాలని శ్రీగురుదేవులను ప్రార్థిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
అలా కాకుండా తమోగుణాన్ని క్రింది స్థాయిలో, రజోగుణాన్ని మధ్య స్థాయిలో, సత్వగుణాన్ని పై స్థాయిలో నిలిపి ఉంచితే మన సాధన ఒక సక్రమమైన మార్గంలో ముందుకు సాగి మోక్షాన్ని పొందుతాము. మనస్సనే త్రిగుణాల గొలుసులోని ఈ మూడు వరసలని అలా వాటి వాటి స్థానాలలో పట్టి ఉంచాలంటే ఇక్కడ పొందుపరచిన చిత్రంలోని శ్రీ బాబూజీ మహరాజ్ వారి కంఠసీమను అలంకరించిన గొలుసులో వలె నాలుగు అడ్డ పట్టీలు కావాలి. అవే సత్యం, శాంతి, దయ, ప్రేమ. ఎప్పుడైతే మనం ఈ నాలుగు సాధనా పరికరాలను సమకూర్చుకొని వాటితో మూడు గుణాలను సరైన స్థాయిలో నిలుపుకోగలుగుతామో అప్పుడు మన సాధన తప్పక ఫలించి ముక్తిని పొందుతాము.

ఈ శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మనందరికీ అటువంటి సాధన సంపత్తిని, సంయమనాన్ని ప్రసాదించాలని శ్రీగురుదేవులను ప్రార్థిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి