1, ఏప్రిల్ 2022, శుక్రవారం

శుభకృత్

    ప్లవనామ సంవత్సరాన్ని దాటి శుభకృత్ నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. శుభం అంటే మంచి. శుభం అంటే మంగళకరం. శుభం అంటే అందమైనది, ప్రకాశవంతమైనది. అటువంటి శుభాలను కలిగించే సంవత్సరం అన్నమాట. నిజానికి కాలం పరమాత్మ స్వరూపమే. కాలం కలయతామహం - కదిలే వాటిలో కాలాన్ని నేను అని గీతాచార్యుడు చెప్పాడు. కనుక సంవత్సరాలన్నీ శుభప్రదమైనవే. అందుకే కొన్ని సంవత్సరాల పేర్లు ఎంత భయంకరంగా ఉన్నా వాటిముందు మనం శ్రీ అని తప్పనిసరిగా చేరుస్తాము. 

    నిరంతరం కదులుతూ ఉండేది కాలం. నీటి ప్రవాహాన్ని అయినా ఆనకట్టతో ఆపవచ్చేమో కానీ కాల ప్రవాహాన్ని ఆపలేము. ప్రవహించకుండా స్థిరంగా ఉన్న నీరు త్వరగా పాడైపోతుంది. దానిలో అనేక సూక్ష్మక్రిములు, చెత్త చెదారం చేరి కలుషితం అయిపోతుంది. అదే నిరంతరం ప్రవహించే నీటిలో చెత్త వేసినా అది స్వచ్ఛంగానే ఉంటుంది. అలాగే మన జీవితం కూడా కాలంతో పాటు నిరంతరం మార్పు చెందుతూ ఉంటేనే అది ఎప్పటికప్పుడు తాజాగా, అందంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. చలనం లేక నిలిచిపోయిన జీవితం నిస్సారంగా ఉంటుంది.

    సాధారణంగా మన తెలుగు సినిమాల చివరిలో శుభమ్ అని చూపిస్తారు. అలాగే ఇంగ్లీషు వాళ్ళు కథలు చెప్పినప్పుడు చివరిలో They lived happily ever after అని చెబుతారు. కానీ మన జీవితంలో శుభాశుభాలు, సుఖదుఃఖాలు రెండూ శాశ్వతంగా ఉండవని, ఒకటి తర్వాత ఒకటిగా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయని మనందరికీ తెలిసిందే కదా! మరి శాశ్వతమైన శుభం ఏది? ఆత్మ ప్రకాశమే శాశ్వత ప్రకాశం. ఆత్మానందమే శాశ్వతానందం. ఆత్మ సుఖమే శాశ్వత సుఖం. అటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడే నిజమైన శుభం కలుగుతుంది. 

    మనలో ద్వైత భావన ఉన్నంతవరకు ఏదో కావాలనే, పొందాలనే ఆరాటం, అది దక్కలేదని ఆక్రోశం, ఉన్నదేదో పోతుందని ఆవేదన తప్పవు. అసలు నేను ఎవరో తెలుసుకుంటే ఈ కనిపించేదంతా నేనే అని కూడా తెలుసుకుంటావు. అంతా నీవే అయినప్పుడు పొందవలసినది కానీ, కోల్పోయేది కానీ ఏమీ ఉండదు. అప్పుడు ఇంక అక్కడ ఎటువంటి రాగద్వేషాలకు, సుఖదుఃఖాలకు తావు ఉండదు. అక్కడ అంతా శాంతి, ఆనందం, ప్రకాశం, శుభమే. 

    ఎందరో మహానుభావులు అటువంటి ఆత్మజ్ఞానాన్ని పొంది వారిలోని కామక్రోధాది దుర్గుణాల స్థానంలో అహింస, సత్యం, శాంతి, దయ, ప్రేమ, ఐకమత్యం, మానవత్వం, సమతా భావన, సమానత్వం మొదలైన ఉత్కృష్ట గుణాలను అలవరచుకొని, తమ అతి సాధారణమైన నిరాడంబర జీవితంలోనే ఆయా గుణాలను తమ ప్రబోధాల ద్వారా, అంతకంటే ముఖ్యంగా ఆచరణ ద్వారా సర్వ జనావళికి పంచిపెట్టారు. అయితే వారి ఆచరణ మార్గాన్ని అనుసరించి ఆత్మజ్ఞానాన్ని పొందకుండా కేవలం వారిని అనుకరించడం ద్వారానో, లేదా వేల కోట్లు ఖర్చు పెట్టి వారి భారీ ప్రతిమలు నెలకొల్పడం ద్వారానో ఆయా సద్గుణాలను సాధించాలనుకుంటే అది అసాధ్యం.

    అయితే మహాత్ములను అనుసరించడం కంటే వారిని అనుకరించడం, లేదా అర్చించటం చాలా తేలికైన పని. నిజానికి అహింసకు ప్రతిరూపమైన బుద్ధభగవానుడు విగ్రహారాధనను ఖండించాడు. కానీ ఈరోజు ప్రపంచంలో ఏమూలకు వెళ్ళినా ఆయన భారీ విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. అయితే ఆయన బోధనలను, నిర్దేశించిన మార్గాన్ని ఎంతమంది అనుసరిస్తున్నారు? ఆచరణలో పెడుతున్నారు? అలా పెడితే ఈనాడు ఇంతటి యుద్ధాలు, మారణహోమాలు, రక్తపాతం చూడవలసిన ఖర్మ ఎందుకు పడుతుంది.

    శ్రీగురుదేవులు చాలా కాలం ఎవరినీ తమ ఫోటో తీయనిచ్చేవారు కాదు. "నీకు నా ఫోటో కావాలా? నేను కావాలా? ఫోటోనే కావాలంటే అది ఏ గోడమీదో, గూట్లోనో, పర్సులోనో మాత్రమే ఉంటుంది. అదే నన్ను నీ హృదయంలో పెట్టుకుంటే ఇక నీకు నాకు భేదం కానీ, దూరం కానీ ఎక్కడ ఉంటుంది?" అనేవారు. అలా మహాత్ములను, గురువులను నిజంగా హృదయంలో ప్రతిష్టించుకుని వారు చూపిన మార్గంలో పయనిస్తే జీవితమంతా శుభాలమయమే. ప్రతి సంవత్సరమూ శుభకృత్ సంవత్సరమే. అటువంటి నిజమైన సాధకుడు తన జీవితాన్ని పండించుకోవటమే కాక సర్వ మానవాళికి శుభకరుడై వెలుగొందుతాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి