2, అక్టోబర్ 2023, సోమవారం

అహింస

అక్టోబర్ నెల వచ్చిందంటే ముందుగా గాంధీ జయంతి వస్తుంది. మన ఆధునిక కాలంలో అహింసకు మారుపేరుగా ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకొని ఎన్నో దేశాలలో ఎందరికో ఆదర్శంగా నిలిచారు మన జాతిపిత మహాత్మాగాంధీ. అలాగే ఇదే నెలలో అనేకమంది లోకకంటకులైన రాక్షసులను జగన్మాత సంహరించినందుకు గుర్తుగా మనం దసరా వేడుకలను జరుపుకుంటాం.


ఇక్కడే కొందరికి సందేహం కలుగుతుంది. అసలు మనం అహింసను పాటించాలా, లేక అవసరమైనపుడు హింసామార్గాన్ని అవలంబించాలా అని. మనకు ఈ మానవజన్మ లభించడంలో ముఖ్య ఉద్దేశ్యం, ఈ మానవ జన్మకు సార్థకత మనం మోక్షాన్ని పొందటం. మోక్షాన్ని పొందాలంటే దైవీ సంపదను పెంచుకోవాలని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు. ఈ దైవీ సంపద అంటే ఏమిటో 16వ అధ్యాయం మొదటి మూడు శ్లోకాలలో వివరించాడు. ఇందులో మొదటి శ్లోకం అభయం(భయం లేకపోవటం)తో మొదలైతే రెండవ శ్లోకం అహింసతో మొదలవుతుంది. అంటే జీవితంలో ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కోవడం ఎంత అవసరమో ఆ సమస్యా పరిష్కారంలో ఎవరినీ హింసించకుండా అహింసను పాటించడం కూడా అంతే ముఖ్యం.


ఏ దేశంలో చూసినా యుద్ధంలో ధైర్యంగా పోరాడి శత్రు సైనికులను మట్టుబెట్టిన వీరునికి అనేక సత్కారాలు చేయడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ సత్కారానికి ప్రాతిపదిక ఆ సైనికుడు తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఎంత ధైర్యంగా పోరాడాడు అనేదే కానీ ఎంతమందిని చంపాడు అనే లెక్క కాదు. అలాగే యుద్ధంలో శత్రువులను చంపి సత్కారాన్ని పొందిన ఆ సైనికుడే తన వ్యక్తిగత కక్షతో దేశంలో ఎవరినైనా చంపితే అతను శిక్షింపబడతాడు. అంటే రెండు సందర్భాలలోనూ చేసిన పని చంపడమే అయినా దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం అది సత్కారార్హమైనదా లేక శిక్షార్హమైనదా అని నిర్ణయిస్తుంది.


పైన మనం చెప్పుకున్న జగన్మాత చేసిన రాక్షస సంహారాన్ని గమనిస్తే అందులో వ్యక్తిగత కక్షగానీ, స్వార్థం కానీ లేదు. అది కేవలం లోకంలోని ఇతర జీవులను రక్షించడానికి చేసిన సంహారమే. అందులో ముఖ్య ఉద్దేశ్యం రక్షణే కానీ హింస కాదు. "శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుని యుద్ధం చేయమని ప్రోత్సహించాడు కదా, మరి మనం మన శత్రువులను సంహరిస్తే తప్పేమిటి?" అని కొందరు వాదిస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే అర్జునుడు క్షత్రియుడు, పైగా సైనికుడు. అంతకుమించి అతడు యుద్ధరంగంలో నిలిచి ఉన్నవాడు. 


అందుకే పరమాత్మ యుద్ధానికి ప్రోత్సహించాడు కానీ అంతకుముందు ఆయన శాంతికి ఎంతగా ప్రయత్నించలేదు? అంతెందుకు స్వయంగా తన భార్యను అపహరించిన రావణునితో కూడా యుద్ధం చేసేముందు శ్రీరాముడు అనేకమార్లు శాంతియత్నాలు చేశాడు. పైగా గీతాచార్యుడు ఎవరి ధర్మాన్ని వారు ఆచరించాలి కానీ, ఎంత గొప్పదైనా పరుల ధర్మం జోలికి పోకూడదని హెచ్చరించాడు. అందువలను యుద్ధం చేయడం, శత్రుసంహారం చేయడం సైనికుల ధర్మమే కానీ మనబోటి వాళ్ళది కాదు. ధర్మరక్షణ కోసం తప్పనిసరి పరిస్థితిలో తమవారితోనే యుద్ధం చేసినా, ఆ తరువాత పాండవులు జీవించినంత కాలం మనశ్శాంతి లేకుండా ఆ బాధలోనే బ్రతికారు.


తమ మతానికో, జాతికో చెందిన ప్రతి వ్యక్తీ ఆయుధాలు సమకూర్చుకొని పరాయి జాతి, మతం వారితో పోరాడటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చే నాయకులు దాని వలన కలిగే దుష్ప్రభావాలను గమనించడం లేదు. ప్రతివ్యక్తికి సులభంగా ఆయుధాలు దొరికే వ్యవస్థ ఉన్న అమెరికా వంటి దేశాలలో ఆ ఆయుధాలను దుర్వినియోగ పరుస్తూ విచక్షణారహితంగా పసిపిల్లలనుండి వృద్ధులవరకు ఎందరినో కాల్చి చంపుతున్న ఘటనలు మనం తరచుగా వింటూనే ఉన్నాం కదా!


విచ్చలవిడితనానికి నెలవైన ఆటవిక వ్యవస్థను వదలి మనకంటూ ఒక సమాజాన్ని, దానికి కొన్ని కట్టుబాట్లను, వ్యవస్థను ఏర్పరచుకొన్న మానవుడు మళ్ళీ మళ్ళీ ఆ ఆటవిక న్యాయం వైపుకే మొగ్గు చూపడం ఎంతవరకూ సమంజసం? అవతలివారిని హింసించడం ఎంత తేలికో ఆ హింసకు తట్టుకొని ధైర్యంగా నిలబడి, తనకు శక్తి ఉండి కూడా ధర్మానికి కట్టుబడి అహింసతో జీవించడం అంత కష్టం. అలా జీవించారు కనుకనే పాండవులు, శ్రీరాముడు మొదలైన వారి చరిత్రలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. 


అదే అహింసా ధర్మాన్ని ఆధునిక కాలంలో కూడా ఆచరించి చూపి "అసలు ఇలాంటి ఒక వ్యక్తి రక్తమాంసాలతో ఈ భూమి మీద నడయాడాడంటే ముందు తరాలవారు నమ్మలేరు" అని ఐన్‌స్టీన్ మహాశయుడంతటి గొప్ప శాస్త్రవేత్తతో కొనియాడబడిన గాంధీ మహాత్ముని ఆదర్శంగా తీసుకొని మన జీవితాలను తీర్చిదిద్దుకుందాం.

7, ఆగస్టు 2023, సోమవారం

మోక్షం

    రామారావు ఊరిలో పెద్దమనిషి. గొప్ప ధర్మాత్ముడని పేరు గడించాడు. గుళ్ళూ గోపురాలూ కట్టించాడు, చెరువులు తవ్వించాడు. అయితే ఏ ధర్మకార్యం చేసినా ఆ పుణ్యం అంతా తనకే దక్కాలని, దానితో తాను మరణించిన తరువాత మోక్షాన్ని పొందాలని అభిలషించేవాడు. ఇలా ఉండగా కొంత కాలానికి రామరావుకి మరణకాలం సమీపించింది. బాధగా తనవైపు చూస్తున్న కొడుకుని పిలిచి, "ఎందుకురా బాధ పడతావు? నేను పుట్టి బుద్ధెరిగిన తరువాత ఎన్నో పుణ్యాలు చేశాను. ఒక్క పాపకార్యమూ చెయ్యలేదు. మరణించిన తరువాత నాకు ఖచ్చితంగా మోక్షం ప్రాప్తిస్తుంది. అందుకు తగిన అపరకర్మలు అన్నీ నువ్వు సవ్యంగా నిర్వర్తించు. నాకదే చాలు" అని చెప్పి కన్నుమూశాడు.

    కొడుకు సుభాష్ ఆ చుట్టుప్రక్కల ప్రసిద్ధిగాంచిన పురోహితులను రప్పించి వారు చెప్పిన విధంగా అన్ని కర్మలూ శాస్త్రోక్తంగా నిర్వహించాడు. తండ్రి అస్థికలను అనేక పుణ్యనదులలో నిమజ్జనం చేశాడు. ప్రయాగ, బ్రహ్మకపాలం వెళ్ళి మరీ పిండాలు పెట్టాడు. అయినా సుభాష్ మనసులో ఏదో వెలితి. తన తండ్రి నిజంగా మోక్షాన్ని పొందాడా? ఎలాగైనా తెలుసుకోవాలి అనుకున్నాడు. అతని ఆరాటం ఫలించి ఒక మహాత్ముని దర్శనభాగ్యం కలిగింది. ఆ మహాత్ముని శ్రద్ధగా సేవించి మెల్లగా తన సందేహాన్ని తెలియజేశాడు.

    ఆ మహాత్ములు చిరునవ్వు నవ్వి, "నాయనా! ఇప్పుడు మీ తండ్రి స్వర్గంలో ఉన్నాడు. కావాలంటే పిలిపిస్తాను నువ్వే మాట్లాడు" అని తన తపశ్శక్తితో రామారావును పిలిపించారు. అన్నాళ్ళ తరువాత తండ్రిని చూడగానే సుభాష్ ఆనందంగా "నాన్నగారూ! ఎలా ఉన్నారు? మీ చిరకాల కోరిక తీరిందా? మీకు మోక్షం ప్రాప్తించిందా" అని ఆతృతగా ప్రశ్నించాడు. అందుకు రామారావు విచారంగా, "లేదు నాయనా! నేను పొరబడ్డాను. ధర్మంగా నడుచుకోవటం, అనేక పుణ్యకార్యాలు చేయడమే మోక్షానికి మార్గమని నమ్మాను. పైగా మోక్షం అంటే అదెక్కడో వేరే లోకంలో ఉంటుందని, మరణించిన తరువాత మాత్రమే పొందగలమని నమ్మాను. నేను చేసిన పుణ్యాలరాశికి ఫలితంగా నాకు స్వర్గం ప్రాప్తించింది.

    తీరా ఇక్కడకు వచ్చాక చూస్తే ఇది కూడా శాశ్వతం కాదని, కేవలం నా పుణ్యం ఖర్చు అయిపోయేదాకా మాత్రమే నన్ను ఇక్కడ ఉండనిస్తారని, ఆ పుణ్యఫలం కాస్తా అనుభవించేస్తే ఇక్కడినుండి మళ్ళీ భూమిమీదకు తోసేస్తారని తెలిసింది. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఉండే ఇంద్రాది దేవతలకు సైతం అమృతం త్రాగడం వలన మరణం అయితే లేదుగాని, వారి పదవులు, స్వర్గంలో వారి స్థానం సైతం అశాశ్వతమేనట! వారిలో వారు మాట్లాడుకుంటుండగా నేను విన్నదేమంటే జన్మరాహిత్యం పొంది మోక్షాన్ని అందుకోవాలంటే వారుసైతం భూమిపై మానవ రూపంలో జన్మించి ఆధ్యాత్మిక సాధన చేయవలసిందేనట.

    పైగా మనం చేసే పుణ్యకార్యాలు అన్నీ మన పాపరాశిని తగ్గించుకోవడానికి, అలాగే లోకహితం కోసమేగానీ అవి మనకు మోక్షాన్ని ఇవ్వలేవుట. 'ఇది నేను చేస్తున్నాను, దీని ఫలితం నాకే దక్కాలి' అనే భావనలు ఉన్నంతకాలం అవి మనకు బంధాన్నే కానీ మోక్షాన్ని ఇయ్యలేవని ఇప్పుడే గ్రహించాను. అంతేకాదు నేను మరణించిన తరువాత నువ్వు చేసిన శ్రాద్ధ కర్మలన్నీ ఆయా క్షేత్రాలలోని పండాల బ్రతుకుదెరువు కోసం తప్పితే వాటివలన నాకు కలిగిన ప్రయోజనం ఏమీ లేదు" అన్నాడు.

    ఇంతలో ఆ మహాత్ములు కల్పించుకొని "మోక్షం పొందాలంటే సద్గురువులను ఆశ్రయించి, వారు చూపిన మార్గంలో ఆధ్యాత్మిక సాధన చేసి, భక్తి జ్ఞాన వైరాగ్యాలను పెంపొందించుకొని, ముఖ్యంగా నేను, నాది అనే అహంకార మమకారాలను వదుల్చుకొని, ఉన్నదంతా ఒకటే అనే సత్యాన్ని గ్రహించాలి. అంతేకాదు నాకు మోక్షం కావాలి అనే కోరిక కూడా బంధమే అవుతుంది. అలా జీవుని బంధించే ఈ గుణాలు, సంకల్పాలు, వాసనలనన్నింటినీ వదుల్చుకుంటే ఏ బంధన లేని ఆ స్థితే మోక్షం. అది ఎక్కడో వేరే లోకంలోనో, లేదా బయట ఎవరినుంచో పొందేది కాదు. అది నీ సహజ స్థితి. దానిని కప్పివేసిన అజ్ఞానపు పొరలు తొలగించుకుంటే మోక్షం నీ స్వరూపమే. అది బ్రతికి ఉండగానే నీ శరీరం మీద జ్వరాన్ని ఎలా అనుభవిస్తావో అలా నీ అనుభూతిలోకి వస్తుంది. అంతేగానీ చచ్చాక వచ్చేదేమీ లేదు, ఎత్తిపోతలు తప్ప" అని విశదీకరించి వారిద్దరికీ స్వాంతన కలిగించారు.

చచ్చాకేమొచ్చు ఎత్తిపోతలు గాక
బొంది జీవముండగనె మోక్షంబు
బొందవలయు జ్వరము మాడ్కి
కాళీ ప్రసాదు మాట కాంతిబాట||

9, జులై 2023, ఆదివారం

తొందరపాటు

    సుబ్బారావు రిటైరై ఇంటిపట్టునే ఉంటున్నాడు. పిల్లలు పెద్దవారై తల్లిదండ్రులతోనే ఉంటున్నా ఎవరి సంసారాన్ని వారు గడుపుకుంటున్నారు. అయితే ఈ మధ్యన ఒక విషయం సుబ్బారావుని తొలిచేస్తోంది. ఉద్యోగం చేసి తాను కూడబెట్టింది పెద్దగా ఏమీ లేకపోయినా, ఉద్యోగం చేస్తున్నన్నాళ్ళూ తనకు ఇంట్లో ఎంతో గౌరవం దక్కేది. ఎవరు ఎన్ని మాట్లాడినా చివరికి తన మాటే నెగ్గేది. అలాంటిది ఈ మధ్య పిల్లలు తనను లక్ష్యపెట్టడం లేదు. కాలానికి తగ్గట్లు తాను మారలేడు. అలాగని తన మాట నెగ్గాలనే పంతాన్ని వదులుకోలేడు. దీంతో రోజూ ఇంట్లో తగవులే.

    'ఈ సంసారాన్ని నేను భరించలేను. ఇప్పుడే అన్నీ వదిలేస్తున్నా' అని రోజుకు నాలుగైదుసార్లు అంటూ ఉంటాడు కానీ దేనినీ అంత తేలికగా వదలలేడు. ఇంకా తన తాతలనాటి ఆస్తి తన చేతిలో ఉండటంవల్లే ఈమాత్రం మర్యాద అయినా దక్కుతోందని, అది కాస్తా పిల్లల పేరుమీద పెడితే తన బ్రతుకు బస్టాండేనని సుబ్బారావుకు గట్టి నమ్మకం. దాంతో రోజూ అన్నిసార్లు మాటల్లో వదిలేస్తున్నా మనసులో మాత్రం సన్యసించలేకపోతున్నాడు. ఇలా ఉండగా ఒకరోజు ఏదో కారణంమీద ఇంట్లో పెద్ద గొడవ అయ్యింది. అలిగిన సుబ్బారావు తట్టాబుట్టా సర్దుకుని రైలెక్కాడు. ఆ రైలు కొన్ని స్టేషన్లు దాటాక అనుకోకుండా తన బాల్యమిత్రుడు వెంకట్రావు తారసిల్లాడు.

    కుశలప్రశ్నల అనంతరం విషయం తెలుసుకున్న వెంకట్రావు పెద్దగా నవ్వుతూ 'ఒరేయ్ సుబ్బారావూ! ఇంత వయసొచ్చినా నీకింకా చిన్నతనం పోలేదురా. ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ చేటే చేస్తాయి కానీ మంచి చెయ్యవు. కొడుకో కోడలో తిట్టారనో, తనను సరిగా గౌరవించలేదనో వృద్ధాశ్రమాలలో చేరి అక్కడ రెండుమూడు రోజులు కూడా ఇమడలేక మళ్ళీ ఇంటికి తిరిగి వస్తున్నవాళ్ళని ఎంతమందిని చూడటం లేదు? అయినా తమకు పెళ్ళి అవగానే తల్లిదండ్రుల్ని బలవంతంగా వృద్ధాశ్రమాలలో చేర్పించే పిల్లలున్న ఈ కాలంలో మీకు ఇంత వయసొచ్చినా, వారివారి సంసారాలు, పిల్లలు వాళ్ళకి వచ్చినా నీ పిల్లలు ఇంకా మీ దగ్గరే ఉంటూ మిమ్మల్ని చూసుకుంటుంటే అది అదృష్టంగా భావించక ఇదేం పనిరా?

    అయినా నీకు సంపాదన లేదనో, ఆస్తి పంచి ఇవ్వలేదనో నీ పిల్లలు నీకు గౌరవం ఇవ్వడం లేదని ఎందుకనుకుంటున్నావు? నీకు జరిగే అవమానాలు ఎప్పటికీ నామాటే నెగ్గాలనే నీ మొండితనం వల్లనో, ఇంట్లో ఎవరినీ నమ్మక ప్రతి విషయం గోప్యంగా ఉంచుకొనే నీ అభద్రతా భావం వల్లనో, లేక కాలం నిత్యం మారుతూ ఉంటుందనే నిజాన్ని గుర్తించక ఎప్పటికీ మా కాలంలో జరిగినట్లే జరగాలనే నీ చాదస్తం వల్లనో అని ఎందుకు ఆలోచించవు? చిన్నప్పుడు మన ఆలోచనలు ఎలా ఉన్నా పెద్దల మాట విని తీరాలి. అలాగే కొంచెం పెద్దవాళ్ళమయి మన సంసారాలు మనకు వచ్చాక ఇంట్లో వాళ్ళందరూ మన మాట వింటారు. కానీ మనకు వయసుడిగిన తరువాత మళ్ళీ మనం పిల్లల మాట వినక తప్పదు. 

    అలసు ఎంతసేపూ మన సంప్రదాయం, సంస్కారం, ధర్మం అంటూ కబుర్లు చెబుతావు కానీ మన సనాతన ధర్మంలో కొడుకుకి వివాహమై ఒక సంతానం కలిగిన వెంటనే ఆ తండ్రి తన బాధ్యతలన్నీ కొడుకుకు అప్పగించి వానప్రస్థం స్వీకరించాలని చెప్పారు కదా! అలాగే కోడలు ఇంట్లో అడుగు పెట్టగానే అత్తగారు తన బాధ్యతలు కోడలికి అప్పగించాల్సిందే. లేకపోతే వారు ఎదిగేదెప్పుడు? వీరికి సంసార బంధం తీరేదెప్పుడు? "నేను చిన్నప్పుడే బాధ్యతలని స్వీకరించి ఎన్నో కష్టాలు పడ్డాను. నా పిల్లలు అలా కష్టపడకూడదు" అని అతిగా ఆలోచించి బాధ్యతలు అప్పజెప్పకపోతే ఆ పిల్లల పతనానికి నీవే బాధ్యుడవు అవుతావు.

    అయినా ఎంతసేపూ "నేనేదో కుటుంబం కోసం త్యాగం చేశాను. అయినా నాకు దక్కాల్సిన గౌరవం దక్కట్లేదు అనుకుంటున్నావు" కానీ నీకోసం నీ పిల్లలు ఎంత త్యాగం చేస్తున్నారో ఎప్పుడైనా ఆలోచించావా? ఇంట్లో ఒక పనికిరాని పాత వస్తువునే వదులుకోలేని నువ్వు, వాళ్ళు ఎన్ని వదులుకుంటే ఇవాళ ఇలా నీతో కలిసి ఉంటున్నారో ఎప్పుడైనా ఆలోచించావా? ఏ ఆలోచనా లేకుండా తొందరపడి ఇలా సన్యాసం తీసుకోవాలనే నిర్ణయం ఎంతటి అవివేకం? సన్యాసమనేది ఈ ప్రపంచంయొక్క అశాశ్వతత్వాన్ని, నిస్సారతను క్షుణ్ణంగా గ్రహించి ఒక పరిపక్వతతో కూడిన నిశ్చయ మనస్సుతో తీసుకోవలసిన నిర్ణయం. అంతేకానీ ఇలా ఆవేశంతో, అనాలోచితంగా తీసుకోవటం సరికాదు. 

    నేనేదో మన సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తున్నానని ప్రగల్భాలు పలుకుతావు కానీ అసలు మన సనాతన ధర్మంలో బ్రహ్మచారి అయినవాడు తల్లి అనుమతి లేకుండా, గృహస్తు అయినవాడు భార్య అనుమతి లేకుండా సన్యాసం తీసుకోవడం నిషేధం, తెలుసా? అయినా ఈ వైరాగ్యం పెళ్ళి చేసుకోకముందు ఉండాలి కానీ పెళ్ళయి ఒక కుటుంబం ఏర్పడ్డాక, చెప్పాపెట్టకుండా వదిలేసి పోయేవాడిని పిరికివాడు అంటారు కానీ సన్యాసి అనరు. వైరాగ్యం అంటే రాగద్వేషాలకతీతంగా అన్నిటినీ సమానంగా చూడటం, అంతేకానీ కుటుంబం మీద ద్వేషం పెంచుకొని వదిలేసి పోవడం కాదు. ఆ మధ్య నేనిలాగే సన్యాసం పుచ్చుకుందామని హృషీకేశ్ వెళ్లిపోయాను. 

    అక్కడ కనిపించిన ఒక మహాత్ముడు భార్య అనుమతి లేనందున నేను సన్యాసానికి పనికిరానని వివరించి వారి ఆశ్రమంలో కొంతకాలం ఉండటానికి మాత్రం అనుమతించారు. అయితే అక్కడ రోజుకి ఒక్కసారి మాత్రమే రొట్టెలు, పాలు అందించేవారు. మూడుపూటలా కడుపునిండా తినడం అలవాటు పడిన నా ప్రాణానికి అది సరిపోయేది కాదు. ఆకలి బాధను తట్టుకోలేక చివరికి ప్రక్క గదిలో రోజంతా ధ్యానం చేసుకుంటున్న మహాత్ముని ఆహారాన్ని దొంగిలించడానికి కూడా పూనుకున్నాను. అప్పుడు నాకు కనువిప్పు కలిగి ఆ మహాత్ముని పాదాలపై పడి మార్గదర్శనం చేయమని ప్రార్ధించాను. 

    ఆయన "నాయనా! సాధనకు సంసారం అడ్డు కాదు. పైగా అది నీకొక పెట్టని కోటవంటిది. నీకు ఎటువంటి కోరిక కలిగినా అది ధర్మబద్ధంగా తీర్చుకొని, ఆ తరువాత ఆ కోరిక వలన కలిగిన సుఖం ఎంత అశాశ్వతమో విచారణ ద్వారా గ్రహించి దానిని అధిగమించడానికి అవకాశం కల్పిస్తుంది. అదే సన్యాసి జీవితం బహు ప్రమాదకరమైనది. అది కోట బయట నిలిచి శత్రువుతో యుద్ధం చేయడంలాంటిది. ఎటువంటి రక్షణ లేకపోవడంతో ఏ క్షణంలోనైనా అంతఃశ్శత్రువుల చేతిలో పరాజయం పాలు కావచ్చు. సంసారులై కూడా ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగిన నీలాంటి వారికోసం మీ ఆంధ్రదేశంలోనే శ్రీ కాళీగార్డెన్స్ ఆశ్రమాన్ని శ్రీ బాబూజీ మహరాజ్ వారు స్థాపించారు. అక్కడకు వెళ్ళి చక్కగా సాధన చేసుకొని తరించు" అని మార్గదర్శనం చేసి నన్ను పంపించారు' అని సుబ్బారావుని సమాధానపరచి తిరిగి ఇంటికి పంపించాడు.


గయ్యాళి పెండ్లాము యల్లరి పిల్లలు
భరియించలేక సన్యాసమందువు
కోటలోనుండి పోరు మేటిది గాదె
కాళీ ప్రసాదు మాట కాంతిబాట||