7, అక్టోబర్ 2016, శుక్రవారం

శృతి సీమంత సిందూరీకృత పాదాబ్జ ధూళికా

మనం చదువుకొన్న ఈ కొద్దిపాటి చదువులకే మనకు ఎంతో తెలుసని మిడిసిపడుతూ ఉంటాం. కానీ ఈ సృష్టిలోని చదువులన్నింటికీ మకుటాయమానమైన వేదాలకే అధినేత్రి అయిన ఆ వేదమాత ప్రతిరోజూ జగన్మాత పాదాలకు నమస్కరించి ఎర్రటి ఆ పాదధూళిని తన పాపిటలో సిందూరంలా అలంకరించుకుంటుందిట. మరి మన చదువులు ఆ జగన్మాత ముందు ఏ పాటివి? ఏ చదువులు చదవకపోయినా ఆ జగన్మాతను తన హృదయంలో నింపుకున్న వారికి సర్వ విద్యలూ కరతలామలకములే.

ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ మా గురుదేవులే. వారు ప్రాపంచికమైన ఏ చదువులూ చదువుకోలేదు. ఎవ్వరి దగ్గరా ఒక్క అక్షరం ముక్క కూడా నేర్చుకోలేదు. కానీ ఎంతటి పండితులనైనా ఒప్పించి మెప్పించగల సామర్థ్యం వారి సొంతం. ఒకసారి వారి వద్దకు ఒక పెద్ద శాస్త్రవేత్త వచ్చారు. శ్రీగురుదేవులు వారిని "అయ్యా తమరు ఏం చేస్తూ ఉంటారు?" అని ప్రశ్నించగా వారు, 'చదువుకోని ఈయనకు ఏం తెలుస్తుందిలే' అనే చులకన భావంతో, "న్యూక్లియర్ ఫిజిక్స్, అంటే పరమాణు భౌతిక శాస్త్రమని ఒకటి ఉందిలెండి. అందులో రీసెర్చ్, అంటే పరిశోధన చేస్తున్నాను" అన్నారు. అప్పుడు మా గురుదేవులు, "చాలా సంతోషం బాబూ!కానీ మీకు అందులో ఏదో ఒక ప్రశ్నకి సమాధానం లభించక తమరి పరిశోధన ఆగిపోయినట్లుంది? జెర్మనీకి చెందిన ఫలానా శాస్త్రవేత్త అదే విషయంపై ఒక పెద్ద గ్రంధమే వ్రాసారు. ఆ గ్రంధం ఢిల్లీలోని గ్రంధాలయంలో లభిస్తుంది. అది చదివారంటే తమ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది, పరిశోధనా ముందుకు సాగుతుంది." అనగానే ఆ శాస్త్రజ్ఞుడు తన అహంకారాన్ని వదలి శ్రీగురుదేవులకు పాదాక్రాంతుడైనాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి