5, ఫిబ్రవరి 2015, గురువారం

కామ దహనం

నాకు చాలా కాలం ఒక విషయం అర్థం అయ్యేది కాదు. తారకాసురుడు లోకలన్నింటినీ పీడిస్తూ ఉంటే లోక రక్షణార్థం పార్వతీపరమేశ్వరులను కలపడానికి ప్రయత్నించిన మన్మధుడు శివుని కోపాగ్నికి ఎందుకు భస్మం కావలసి వచ్చింది అని. ఒకవేళ మన్మధుని గర్వభంగం కోసమని అనుకుంటే, శివుడు మన్మధుని బాణాలకు లొంగకుండా ఉంటే దానితోనే గర్వభంగం అయిపోయేది కదా.

ఇక్కడ మనం మన్మధుడు నెరవేర్చాలనుకున్నశివ పార్వతుల కళ్యాణం ఎలా జరిగిందో చూద్దాం. మన్మధుని బాణాలచే పీడింపబడి కూడా పరమేశ్వరుడు చక్కగా అలంకరించుకొని, రూప లావణ్యాలతో అలరారుతున్న పార్వతీదేవిని కన్నెత్తి చూడలేదు. అప్పుడు ఆ జగన్మాత కఠోర తపోదీక్షను పూని కొంతకాలం ఆకులు మాత్రమే తీసుకుంటూ, తరువాత వాటిని కూడా మానివేసి, మరికొంత కాలానికి శ్వాసను కూడా బంధించి తపమాచరించింది. ఇలా చిక్కి శల్యావశిష్టయై ఉన్న ఆ తల్లిని, అప్పుడు కూడా ఇంకా కఠినమైన తన పరీక్షకు గురిచేసి, ఆమె మనోనిగ్రహాన్ని, తనపై గల ప్రేమను నిర్ధారించుకున్నాకనే పరమేశ్వరుడు పార్వతీమాతను పరిణయమాడాడు.

మరి అంతటి కఠోర సాధనతో, పరీక్షలకు తట్టుకుని, సంపూర్ణ శరణాగతితో, సర్వ సమర్పణ భావనతో పొందవలసిన పరమేశ్వరుని ప్రేమను, ఆయనలో కామ వాంఛలను రెచ్చగొట్టడం ద్వారా పొందింపచేయాలనుకోవటమే మన్మధుడు చేసిన పెద్ద తప్పు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి