21, ఫిబ్రవరి 2015, శనివారం

శివునాజ్ఞ లేనిదే

శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా, మరి లోకంలో ఇంతమంది ఇన్ని నేరాలు, ఘోరాలు ఎలా చేయగలుగుతున్నారు? వారందరికీ శివునాజ్ఞ ఉన్నదా? అని చాలామంది మా గురుదేవులైన శ్రీబాబూజీ మహారాజ్ వారిని అడిగేవారు.

ముందుగా మనం జంతువుల విషయం చూస్తే - ఆహారం, నిద్ర, భయం, మైధునం ఇవన్నీ అన్ని జీవులకు సహజసిద్ధమైనవి. ఏ జంతువైనా వేరే జంతువును కానీ, మనిషిని కానీ దాడి చేసి గాయపరచింది అంటే, దానికి కారణం ఈ నాలుగింటిలో ఏదో ఒకటి అయి ఉంటుంది. ఇవి నాలుగూ భగవంతుని వలన జీవులందరికీ ప్రసాదించబడినవి కనుక ఈ విషయంలో ఆయా జీవులు చేసే పనులన్నీ భగవంతుని ఆజ్ఞ ప్రకారమే జరుగుతున్నాయని మనం విశ్వసించవచ్చు. ఇక వరదలు, భూకంపాలు, తుఫానులు మొదలైన ప్రకృతి భీభత్సాలన్నీ భగవంతుడు కల్పించిన ప్రకృతి నియమాలకు లోబడే సంభవిస్తాయి కనుక అవి కూడా భగవంతుని ఆజ్ఞకు లోబడే ఇవన్నీ చేస్తున్నాయని మనం నమ్మవచ్చు.

అయితే భగవంతుడు ఈ ప్రకృతికి, జంతువులకి ఇవ్వని బుద్ధి అనే పరికరాన్ని, విచక్షణా జ్ఞానాన్ని మనుషులకు మాత్రమే ఇచ్చాడు. మిగిలిన ప్రాణులన్నీ ప్రకృతిగతంగా ప్రవర్తిస్తాయి తప్పితే, తాము చేసే పనుల మంచి చెడ్డలను విచారించి నిర్ణయించుకునే శక్తి వాటికి లేదు. అందుకే అవి శివునాజ్ఞ ప్రకారం ప్రవర్తిస్తున్నాయని మనం భావించగలం. అయితే మనిషికి విచారించి నిర్ణయించగలిగే బుద్ధిని ఇచ్చిన భగవంతుడు, తద్వారా మరే జీవికీ లేని స్వేచ్ఛను ప్రసాదించాడు. కానీ మనిషి ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ తన స్వార్థం కొరకు మతం పేరున, కులం పేరున, ప్రాంతం పేరున, ఇంకా అనేక కుంటిసాకులు చూపి ఇతరులకు హాని కలిగిస్తున్నాడు.

ఇతర జీవులకు లేని స్వేచ్ఛను మనిషికి ఇవ్వటం శివునాజ్ఞయే కానీ, ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ మనిషి సాగించే మారణహోమం శివునాజ్ఞ కాదు. మా గురుదేవులు ఇదే చెప్పేవారు. తప్పు చేసే మానవులు తమ తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి భగవంతుడ్ని అడ్డు పెట్టుకుంటారు కానీ, నిజంగా భగవంతుడే అన్నీ చేయిస్తున్నాడని మనస్పూర్తిగా నమ్మినవారు ఏ తప్పూ చేయలేరని.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి