5, ఆగస్టు 2024, సోమవారం

ముక్తి

    వైష్ణవ సంప్రదాయంలో ముక్తిని నాలుగు అంచెలుగా వర్ణించారు. ఈ భూలోకంలో జీవించినన్నాళ్ళు శ్రీమహావిష్ణువుపై అనన్య భక్తిని కలిగి ఉండి, మరణించిన తరువాత వైకుంఠాన్ని చేరడం ఇందులో మొదటి మెట్టయిన సాలోక్య ముక్తి. అంటే స్వామి ఉన్న లోకంలోనే మనమూ నివసించడం. ఇక దాని పైమెట్టు సామీప్యం - అంటే ఆ లోకంలో ఎక్కడో దూరంగా ఉండటం కాకుండా స్వామివారికి అతి దగ్గరలో ఆంతరంగిక సేవకునిగా మెలగడం. ఇక అలా సేవించుకున్న ఫలితంగా వచ్చేది సారూప్యం. మనకు జయవిజయులను చూపిస్తూ ఉంటారు కదా! వారు కూడా విష్ణుమూర్తిలాగానే నాలుగు చేతులు కలిగి, శంఖ చక్ర గదా పద్మాలను ధరించి ఉంటారు. అలా స్వామివారి రూపాన్ని పొందడం సారూప్య ముక్తి. ఇక చివరిమెట్టు సాయుజ్యం - అంటే ఆ పరమాత్మునిలో ఐక్యం అయిపోవడం. 

    ఈ నాలుగింటిపై కొంచెం లోతుగా విచారణ చేద్దాం. ఎందుకంటే అద్వైత సిద్ధాంతంలో ముక్తి అనేది చనిపోయాక పొందేది కాదు. బ్రతికి ఉండగానే నీ అసలు స్వరూపాన్ని గుర్తించి ఈ శరీరంతోనే జీవన్ముక్త స్థితిని అనుభవించాలి. ఇక పైన చెప్పుకున్న నాలుగు అంచెల ముక్తిని గూర్చి విచారిస్తే - ముందుగా సాలోక్యం అంటే పరమాత్మ ఉన్న లోకంలో మనం నివసించడం అని చెప్పుకున్నాం కదా. కానీ ఆయన ఉన్న లోకం ఏది? విష్ణువు అంటేనే సర్వవ్యాపకుడు అని అర్థం కదా! మరి ఆయన లేని స్థానం కానీ, లోకం కానీ ఈ సృష్టిలో ఎక్కడైనా ఉందా? అంతేకాక గీతలో స్వామే స్వయంగా చెప్పినట్లు ధర్మ సంస్థాపన కోసం ఆయన మాటిమాటికీ అనేక మహాత్ముల, గురువుల, అవతారపురుషుల రూపాలలో మన మధ్యన సంచరిస్తూనే ఉన్నాడు కదా! అయితే ఈ విషయాన్ని గుర్తించి సదా అనుభవంలోకి తెచ్చుకోవడమే సాలోక్యం. అంటే మన జీవితంలో ప్రతి క్షణం పరమాత్మ ఉన్న లోకంలోనే, పుణ్యక్షేత్రంలోనే, వైకుంఠంలోనే మనం జీవిస్తున్నామనే ఎఱుక కలిగి ఉంటే మనం ఇక పాపాలు చేయలేము కదా! మనలోని మానసిక బలహీనతల వలనే మనం పాపాలు చేస్తాం. కుంఠితం అంటే బలహీనమైనది. కుంఠితం కానిది వైకుంఠం. ఇలా నిరంతరం స్వామి ఉనికిని గుర్తిస్తూ మన మనస్సు ఎప్పుడైతే తన బలహీనతలను అధిగమిస్తుందో అప్పుడు ఆ మనస్సే వైకుంఠం అవుతుంది.

    ఇక దీని పైమెట్టు సామీప్యం. కేవలం ఆ స్వామి ఈ లోకంలో ఎక్కడో ఉన్నాడని మాత్రమే కాకుండా నిరంతరంగా ఆయన సన్నిధిని మనం అనుభవంలోనికి తెచ్చుకోవాలి. ఆయన ఎప్పుడూ మన ప్రక్కనే, మనతోనే, మనలోనే ఉంటాడు. ఈశ్వరస్సర్వ భూతానాం హృద్దేశే అర్జున తిష్టతి.  ఆయన లేనిదే మనం లేము. ఈ నిరంతర సామీప్యాన్ని మనం అనుభవంలోనికి తెచ్చుకుంటే ఇక ఈ లోకంలోని ఈ కష్టాలు, బాధలు, సుఖదుఃఖాలు మనలను బంధించలేవు. నిరంతరం తన తల్లిదండ్రుల దగ్గర నివసించే పిల్లవానికి దేనిమీద చింత ఉంటుంది? అంతా వారే చూసుకుంటారనే నిశ్చింతతోనే హాయిగా బ్రతికేస్తాడు కదా! అదే సామీప్య ముక్తి.

    మరి సారూప్యం అంటే పైన చెప్పుకున్నట్టు ఆ స్వామి యొక్క రూపాన్ని మనం కూడా ధరించాలని, కొందరు అచ్చంగా విష్ణుమూర్తి, శివుడు, లేదా తన గురుదేవులు ధరించే విధంగానే నుదుటిపై నామాన్ని ధరించడం, వారిలాగానే పీతాంబరాన్నో, జింక చర్మంనో ధరించడం, వారి హావభావాలను అనుకరించడం చేస్తూ ఉంటారు. ఎంత సాధన చేసి అచ్చుగుద్దినట్లు అనుకరించినా అది అనుకరణే అనిపించుకుంటుంది కానీ వీరు వారవ్వరు కదా! పరమాత్మతో సారూప్యాన్ని పొందడం అంటే ఆయనలో ఉన్న సద్గుణాలను మనం అలవరచుకోవడం. ఆయనలో లేని దుర్గుణాలను మనలోనుండి తొలగించుకోవడం. అంతేకాదు ఈ సర్వ సృష్టిని విష్ణుమయంగా దర్శించే దృష్టిని అలవరచుకోవడం. చూడక మానవు చూచెడి కన్నులు ఏడనేడైన ఇతరములు, ఈడ నన్నింట నీ రూపము గన ఈడు లేని తెలివీయగదే అని ప్రార్థించాడు అన్నమయ్య. అటువంటి పరమాత్మ దృష్టిని అలవరచుకోవడం సారూప్యం.

    ఇక తన చుట్టూ ఉన్న సృష్టి అంతటిలో పరమాత్మనే దర్శిస్తూ ఉంటే తాను మాత్రం ఆ పరమాత్మకు భిన్నంగా ఉంటాడా? ఈ కనిపించే దేహం తాను కానని, ఈ దేహాలన్నింటినీ నడిపించే పరమాత్మ తానే అనే సత్యాన్ని గ్రహిస్తాడు, అనుభవిస్తాడు. అదే సాయుజ్య ముక్తి. కేవలం తాను తప్ప మరియొకటి లేదనే ఎఱుకయే కైవల్యం. అటువంటి ముక్తిని పొందినవాడికి ఇక దేనిమీదా మొహం కానీ, రాగద్వేషాలు కానీ కలుగవు. ప్రారబ్ధం ఉన్నంతవరకు ఈ దేహం నిలిచి ఉంటుంది. అయితే ఈ దేహంతో చేసే కర్మలు ఏవీ తనకు అంటవు. ఎందుకంటే వాటి వెనుక తనకు ఏదో కావాలనే కోరిక కానీ, తాను చేస్తున్నాననే అహంకార భావన కానీ ఉండదు. అవన్నీ లోకకళ్యాణం కోసం చేసే లీలలే అవుతాయి కానీ, తనను బంధించే కర్మలు కావు. ఎప్పుడైతే ఆ ప్రారబ్ధం తీరి ఈ దేహం పడిపోతుందో, అప్పుడు తాను స్వస్వరూప లయం పొందుతాడు. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంత కాలేపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి