9, జులై 2024, మంగళవారం

నిరీక్షణా మాధుర్యం

    భగవంతుని దర్శించుకోవాలనే ఆర్తితో మనం ఎన్నో పుణ్య క్షేత్రాలకు, ప్రసిద్ధ దేవాలయాలకు వెళతాం. తీరా అక్కడికి వెళ్ళిన తరువాత దర్శనానికి పెద్ద లైను ఉంటుంది. తిరుమల లాంటి చోట్ల అయితే కొన్ని గంటలో, ఒక్కొక్కసారి రోజు పైనే పట్టవచ్చు. ఇంతా కష్టపడి ఆలయం లోనికి ప్రవేశించాక గట్టిగా కొన్ని క్షణాలు కూడా ఆ దివ్యమంగళ మూర్తిని దర్శించుకోనివ్వరు. పదండి, పదండి అని త్రోసివేస్తారు. ఇంకా కొందరు ఉంటారు. అందరూ ఒక వరుసలో వెళ్తుంటే వీరు వరుస తప్పి ప్రక్కకు జరిగి, ఆ దేవతామూర్తికి అడ్డంగా నిలబడి పరమ భక్తితో ఎంతోసేపు నమస్కరిస్తూ, స్తోత్రాలు చదువుతూ నిలబడిపోతారు. ఇక వెనుకవాళ్ళు వీళ్ళ వీపులనో, కొప్పులనో దర్శించుకొని పోవలసిందే కానీ, వీళ్ళు మాత్రం అక్కడినుండి కదలరు. కనీసం, మనతోపాటు వరుసలో ఉన్న వారందరూ భక్తులే కదా, మనకు ఆ పరమాత్మను దర్శించుకొనే హక్కు ఎంత ఉందో వారికి కూడా అంతే ఉంది కదా అనే ఆలోచనే వీరికి రాదు.

    ఇంకొంతమంది వరుసలో నిలుచున్నంత సేపూ వారు భగవంతుని తలచుకోకపోగా ప్రక్కవారిని అనేక ప్రశ్నలతో విసిగిస్తూ ఉంటారు. "మీ పిల్లలు ఏమి చేస్తున్నారు? ఆహా, కాలేజీకి బస్సు వస్తుందా, మీరే దింపాలా? మీ అబ్బాయికి ఇంకా ఎందుకు పెళ్ళి కాలేదు?" ఇలా ఎందుకూ పనికిరాని ప్రశ్నలతో వారి మనశ్శాంతిని చెడగొడుతూ ఉంటారు. పోనీ ఆ ప్రశ్నల వలన వీరికి కానీ, వారికి కానీ ఏమన్నా ఉపయోగం ఉందా? అంటే ఏమీ ఉండదు. నిజంగా అవతలి వారికి ఏమన్నా సహాయం అవసరమైన సందర్భంలో వీరు కనీసం ముఖం కూడా చూపించారు. మరి ఎందుకు ఈ వృథా కంఠక్షోభ? నిజానికి భగవద్దర్శనం అనేది చాలా కొద్ది క్షణాలే లభిస్తుంది. మన పురాణేతిహాసాలలో ఎందరో భక్తులు, రాజులు, రాక్షసులు అనేక వందల, వేల సంవత్సరాలు తపస్సు చేస్తే భగవంతుడు ఇలా ప్రత్యక్షమై, వరమిచ్చి, అలా మాయమైపోతాడు. కానీ అసలైన భగవద్దర్శన మాధుర్యం ఆయన దర్శనం కోసం నిరీక్షించడంలోనే ఉంది. 

    శబరి తల్లి రామునికోసం ఎన్నో సంవత్సరాలు నిరీక్షించింది. రాముడు వచ్చినప్పుడే ఆయనకు సేవలు చేద్దాంలే అనుకొని తన సమయాన్నంతా ఇతరులతో పోచికోలు కబుర్లు చెప్పడానికి ఉపయోగించలేదు. ప్రతిరోజూ ఈ రోజే రాముడు వస్తాడనే విశ్వాసంతో నిరంతర రామ స్మరణతోనే తన కుటీరాన్ని, అక్కడికి చేరే మార్గాన్ని అంతా చక్కగా అలికి, ముగ్గులు పెట్టి, పూరేకులతో అలంకరించి, రామునికోసం నీటిని, మధుర ఫలాలను సేకరించి సిద్ధంగా ఉండేది. ఇలా నిరంతర రామ నిరీక్షణా మాధుర్యాన్ని ఒక తపస్సుగా అనుభవించింది కనుకనే నిజంగా ఆ రాముడు వచ్చి తనవద్ద కొద్ది క్షణాలే గడిపినా వెంటనే తన ఆత్మ రామునిలో లీనమై, దేహం కూడా నదీరూపాన్ని ధరించి శాశ్వతత్వాన్ని పొందింది. అలా మాధుర్యాన్ని అనుభవించకుండా కేవలం దర్శనం కోసమే తపస్సు చేసి, తీరా భగవంతుడు ప్రత్యక్షం అయ్యాక తమకు ఎందుకూ పనికిరాని, లోకాలకు హానికారకమైన వరాలను అడిగి ఎందరు రాక్షసులు నాశనం అయిపోలేదు?

    కాబట్టి ఎంతసేపు దర్శనం అయ్యింది? మనం వెళ్ళిన రోజున ఆ దేవతామూర్తికి ఎన్ని అలంకారాలు చేశారు, ఇలాంటివి ముఖ్యం కాదు. మనం ఇంటిదగ్గర బయలుదేరిన దగ్గరినుంచి, లేదా అసలు మనకు పుణ్యక్షేత్రానికి వెళ్ళాలనే సంకల్పం కలిగిన క్షణంనుంచి మనం ఎంతసేపు ఆ పరమాత్మను తలుస్తూ, ఆ స్మరణలో గడిపాము? అనే దానిపైనే ఆ దర్శనంలో మనం అందుకొనే మాధుర్యం ఆధారపడి ఉంటుంది. నిజానికి అలా నిరంతర భగవన్నామ స్మరణ జరగాలనే దేవాలయాలలో ఎవరో భక్తులు సంకీర్తన చేస్తూ ఉండటమో, ఆ సౌలభ్యం లేని చోట్ల ఏ సిడిలోనో భజనలు వినిపించడమో చేస్తూ ఉంటారు. మనం దర్శనానికి వరుసలో నిలబడినప్పుడు ప్రక్కవారితో లోకాభిరామాయణం మాట్లాడటం మానుకొని ఆ సంకీర్తన మనం చేయలేకపోయినా, కనీసం వినే ప్రయత్నం చేస్తే, అందులో ఏదో ఒక కీర్తన తప్పక మన హృదయానికి తాకుతుంది. అలా తాకిన కీర్తన మనం దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోయినా, ఆ రోజంతా ఏ పని చేస్తున్నా మన మనస్సులో తిరుగుతూనే ఉంటుంది. ఇంతకన్నా ధ్యానం ఏముంటుంది?

    అలా నిరంతర భగవన్నామ స్మరణ కన్నా గొప్ప సాధన మరొకటి లేదు. మెల్లమెల్లగా మనస్సు ఆ రుచికి అలవాటు పడితే, బయటి విషయాలపై ఆసక్తి తగ్గి, ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా మనస్సు భగవంతుని వైపే లాగుతూ ఉంటుంది. అట్టి సాధనకు ఫలితంగా కేవలం గర్భాలయంలో మూలవిరాట్టులో మాత్రమే భగవంతుని దర్శించే స్థితినుండి, మన చుట్టూ ఉండే సర్వ ప్రకృతిలో, సమస్త మానవాళిలో ఆ పరమాత్మనే దర్శించే స్థితికి చేరుకుంటాం. మానవ జన్మ ఎత్తినందుకు అదే సార్థకత.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి