6, సెప్టెంబర్ 2025, శనివారం

సంచలద్వాల సన్నద్ధ లంబమాన శిఖోజ్వల

 


    శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామాలలో ఒక నామం - ఓం సంచలద్వాల సన్నద్ధ లంబమాన శిఖోజ్వలాయై నమః. సంచలత్ - బాగా కదులుతూ ఉన్న, వాల - తోకతో, సన్నద్ధ - సిద్ధంగా ఉన్న, లంబమాన - (ఆ తోకను) ఆశ్రయించి ఉన్న, ఉజ్వల - ప్రకాశిస్తున్న, శిఖ - అగ్నిశిఖను కలిగినవాడు అని అర్థం. తోక చివరన మండుతూ ఉన్న అగ్నితో లంకను కాల్చడానికి సిద్ధంగా ఉన్న అంజనేయిని రూపాన్ని ఈ నామం గుర్తుకు తెస్తుంది.

    అయితే ఇది మనకు కూడా అన్వయిస్తుంది. ఆంజనేయుని తోకలాగే మన మనస్సు కూడా ఎప్పుడూ చలిస్తూ ఉంటుంది. వానరాలు ఈ కొమ్మ మీదనుంచి ఆ కొమ్మకు, ఆ కొమ్మ మీదనుంచి ఈ కొమ్మ మీదకు నిరంతరం దూకుతూ ఉన్నట్లు మన మనస్సు కూడా ఒక విషయం నుంచి ఇంకొక విషయం మీదకు అలాగే దూకుతూ ఉంటుంది. అలాగే మనం ఏ చిన్న విషయాన్ని నేర్చుకున్నా, లేదా క్రొత్తగా ఒక పని చేసినా ఆంజనేయిని తోక చివరన ఎగసిపడుతున్న మంటలాగే మన ప్రతిభను పదిమందికీ చూపించాలని, అది చూసి అందరూ మనను మెచ్చుకోవాలని మన మనస్సు ఎగసిపడుతూ ఉంటుంది.

    అయితే ఆంజనేయుని గమనిస్తే ఆయన ఎంతటి ప్రతిభావంతుడయినా, నవ వ్యాకరణ పండితుడైనా, అష్ట సిద్ధులు కలిగి ఉన్నా, ఎప్పుడూ శ్రీరామచంద్రుని పాదాల చెంత దాసుడై ఒదిగి ఉంటాడు. ఆ ప్రభువు ఆజ్ఞ లేనిదే ఏ పనీ చెయ్యడు. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడని ఆయన మీద లోకం అపవాదు వేస్తుంది కానీ కాల్చడం కూడా ఆయన స్వామి ఆజ్ఞగానే స్వీకరించాడు. ముందు సీతాదేవి ఎక్కడ ఉందో చూసి రమ్మనే పంపించినా ఒకసారి అమ్మను చూసిన వెంటనే తరువాతి కర్తవ్యం ఏమిటో ఆయనకు త్రిజట స్వప్నం ద్వారా బోధ పడింది. ఒక వానరుడు లంకకు వచ్చి, అశోకవనాన్ని ధ్వంసం చేసి, వేలాది రాక్షసులను సంహరించి, లంకను కాల్చి తిరిగి వెళ్ళడం అనేది ముందుగానే భగవంతుడైన తన ప్రభువు నిర్ణయించి ఉంచాడని ఆ స్వప్న వృత్తాంతాన్ని వినడం ద్వారా ఆయనకు అర్థం అయ్యింది.

    అందుకనే అప్పటి దాకా ఒక చిన్న పిల్లి పరిమాణంలో సూక్ష్మరూపంలో ఆకుల మధ్యలో ఒదిగి ఉన్న ఆయన వికటరూపాన్ని ధరించి లంకను కాల్చాడు. నిజానికి గమనిస్తే ఆయన ఆ స్వప్నంలో చెప్పినంతవరకు మాత్రమే చేశాడు. ముందుగా అశోకవనాన్ని ధ్వంసం చేసి, అక్కడి రాక్షసులని సంహరించాడు. ఆ తరువాత ఇంద్రజిత్తు తనను బంధించినా, రావణుని సభలో అందరూ తనను అవమానించినా ఆయన ఏ ప్రతిచర్య చేయలేదు. ఎందుకంటే అదేదీ ఆ స్వప్నంలో చెప్పబడలేదు. ఒకసారి తన తోకకు నిప్పు అంటగానే మళ్ళీ భగవదాజ్ఞను అమలు పరుస్తూ లంకను కాల్చివేశాడు.

    ఆంజనేయుని చూసి మనందరము నేర్చుకోవలసిన ముఖ్య విషయం ఇదే. ఎంతటి ప్రతిభావంతులమైనా, ఆ ప్రతిభను ప్రదర్శించాలని మనస్సు ఎంతగా ఉవ్విళ్ళూరుతున్నా, ఈ ప్రతిభకు కారణమైన మన ప్రభువు పాదాల వద్ద ఒదిగి ఉండి వారి ఆజ్ఞకు బద్ధులై ప్రవర్తించడం నేర్చుకోవాలి. శ్రీ మాతాజీ వారు ఎప్పుడూ శ్రీ బాబూజీ మహారాజ్ వారి మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటారు - అన్నీ తెలిసి, నేర్చుకొని ఉండాలి, కానీ ఏమీ తెలియని వాడిలా ఒక ప్రక్కన ఒదిగి ఉండాలి. అవసరమైనప్పుడు నీ ప్రతిభను సేవకు ఉపయోగించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే కారుకు స్టెఫనీ టైరులాగా ఉండాలి - అని.

    ఇక్కడ ఆంజనేయుని నుంచి నేర్చుకోవలసింది ఇంకొకటి ఉంది. మనలో చాలామంది ప్రతి చిన్న విషయానికి అవతలివారు తమను అవమానించారని బాధపడిపోతూ ఉంటారు. వారు ఒక మాట అన్నా, ఒక చూపు చూసినా అది తనకు అవమానంగానే భావిస్తూ ఉంటారు. అయితే ముందు నిన్ను నువ్వు గౌరవించుకోవటం నేర్చుకోవాలి. నీమీద నీకు గౌరవం ఉన్నప్పుడు నిన్ను ఎవరూ అవమానించలేరు. రావణుని సభలో ఆంజనేయుని అవమానించినా, ఆసనం ఇవ్వకున్నా ఆయనేమీ బాధపడలేదు. తన ఆసనం తానే తయారుచేసుకొని వారందరి కంటే ఎత్తుగా కూర్చున్నాడు. నిన్ను నీవు గౌరవించుకోవటం అంటే ఇదే. ఇది అలవరచుకున్న నాడు నిన్నెవరూ అవమానించలేరు.

    ఇక ప్రతిభను నియంత్రణలో పెట్టుకోవడం గురించి మరింత లోతుగా విచారిద్దాం. "ఒక కారు వేగంగా వెళ్ళాలంటే ఏం కావాలి?" అని అడిగామనుకోండి ఎవరైనా ఠక్కున "మంచి ఇంజను ఉండాలి, పెట్రోలు నిండుగా ఉండాలి, టైర్లు బాగుండాలి" ఇలాంటివి చెబుతారు. ఇవన్నీ బాగున్నా ఆ బండికి బ్రేకులు సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి ఆ డ్రైవరు వేగంగా వెళ్ళగలుగుతాడా? బిక్కుబిక్కుమంటూ అత్యంత నిదానంగా బండి తోలుతాడు. ఎందుకంటే బండి వేగంగా వెళ్తూ క్షేమంగా గమ్యాన్ని చేరాలంటే బ్రేకులు చాలా అవసరం. ఎంత నియంత్రణ ఉంటే అంత వేగంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మన జీవితం కూడా అంతే. ఎంత నియంత్రణ ఉంటే అంత ఉన్నతికి చేరగలుగుతాం. నేలమీద నడిచేవాడు చాలా తేలికగా నడిచేస్తాడు. కానీ కొండను ఎక్కేవాడు ప్రతి అడుగూ పట్టి పట్టి జాగ్రత్తగా వెయ్యాలి. అప్పుడే పైకి చేరగలుగుతాడు. ఏమాత్రం పట్టు తప్పినా అధోగతే.

    ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఆంజనేయ అష్టోత్తర శతనామ స్తోత్రం కాళికా రహస్యం అనే గ్రంథంలోనిది. ఆంజనేయుడు ఎలాగైతే అనంతశక్తి సంపన్నుడైనా ఎప్పుడూ శ్రీరామచంద్రుని ఆజ్ఞకు లోబడి ఉంటాడో అలాగే అనంతశక్తి స్వరూపిణి అయిన కాళీమాత కూడా తన ప్రభువైన పరమేశ్వరుని వద్ద ఒదిగి ఉంటుంది. రాక్షస సంహారం చేసి అంతులేని కోపంతో లోకాలనన్నింటినీ భీతావహులను చేస్తున్న ఆ తల్లి తన పతిదేవుని దేహం కాలికి తగలగానే ఒక్కసారిగా శాంతించి భవతారిణీ స్వరూపాన్ని పొంది లోకాలకు అనుగ్రహదాయిని అయ్యింది.

    అనంత శక్తి సంపన్నులయినా ఏమీ తెలియని పసిపాపలా ఒదిగి ఉండే తత్త్వం కలిగిన అటువంటి హనుమంతుడు, కాళీమాతల మేలు కలయిక అయిన స్వరూపం మన గురుదేవులు శ్రీ హనుమత్ కాళీ వర ప్రసాద బాబూజీ మహరాజ్ వారు. వారినుంచి మనం మొదటగా నేర్చుకోవలసినది ఈ వినయాన్నే. ప్రతిభ ఏ ఒక్కరి సొత్తు కాదు. ప్రతి రంగంలో మనం చూస్తూనే ఉన్నాం. ఎంతో ప్రతిభావంతులైన వారు వారి సమయం వచ్చినప్పుడు ఈ జగన్నాటక రంగం నుంచి నిష్క్రమిస్తే ఆయా రంగాలేమి అక్కడితో ఆగిపోవట్లేదు కదా! వారి స్థానంలో మరొకరు ఆ ప్రతిభను అందిపుచ్చుకుంటున్నారు. అందరిలో ప్రతిభారూపంలో భాసించే ఆ పరబ్రహ్మ తత్త్వాన్ని గుర్తించిననాడు మనం కూడా అహంకారంతో ఎగరకుండా వినయం మన సహజ భూషణమై ప్రకాశిస్తాము. 

యోగక్షేమం


అనన్యాశ్చిన్తయంతో మాం యే జనాః పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ || - భగవద్గీత 9-22

    "ఎవరైతే అన్య చింతన లేకుండా నన్నే లెస్సగా ఉపాసిస్తూ నాయందే నిత్యం మనస్సును లగ్నం చేసి ఉంచుతారో వారి యోగక్షేమాన్ని నేను నా బాధ్యతగా వహిస్తాను" అని గీతాచార్యుడు అభయం ఇస్తున్నాడు. అయితే మనం సాధారణంగా తెలుగులో యోగక్షేమాలు అంటాం. యోగం అంటే కలయిక. మన దగ్గర లేనిదేదో కొత్తగా మనకు లభిస్తే దానిని యోగం అంటాం. ఉదాహరణకి ఒకడికి ధనయోగం ఉందనో రాజయోగం ఉందనో అంటే వాడి దగ్గర అప్పటివరకు లేని సంపదో, అధికారమో వాడికి అందుతుందని అర్థం. అలాగే మనకి దక్కుతుందని ఎంతగానో ఆశించినది చివరి నిముషంలో దక్కకపోతే మనకా యోగం లేదులే అని సరిపెట్టుకుంటాం.

    అలాగే క్షేమం అంటే మన దగ్గర ఉన్నది మనకు దూరమైపోకుండా, ఎవరూ దోచుకోకుండా భద్రంగా మన దగ్గరే ఉండటం. ఎవరైనా దూర ప్రయాణానికి బయలుదేరుతుంటే "క్షేమంగా వెళ్ళి లాభంగా రండి" అంటాం. అంటే నీ దగ్గర ఉన్న ధనాన్ని కానీ, ఆభరణాలను కానీ, లేదా నీ కాళ్ళు చేతులు లాంటి అవయవాలను కానీ ఏమీ పోగొట్టుకోకుండా(క్షేమంగా) వెళ్ళి వీలైతే అనుకున్న పని పూర్తిచేసుకునో, లేదా ఉన్నదానికంటే మరింత సంపాదించో(లాభంగా) తిరిగి రమ్మని కోరుకుంటాం. ఇలా ఈ యోగక్షేమాలు రెండూ వేరువేరు అర్థాలు కల పదాలు.

      అయితే మొన్న శ్రీ కాళీ వనాశ్రమ భాగ్యనగర శాఖలో జరిగిన సత్సంగాలలో శ్రీ మాతాజీ వారు పై గీతా శ్లోకాన్ని ప్రస్తావిస్తూ యోగక్షేమాలు రెండు కదా! మరి భగవానుడు ద్వివచన పదమైన యోగక్షేమౌ అనకుండా ఏకవచన పదమైన యోగక్షేమం అని ఎందుకు అన్నాడు? అని ప్రశ్నిస్తూ దానికి సమాధానంగా ఆయన ప్రసాదించేది క్షేమంతో కూడిన యోగం. అది ఒకటే కానీ రెండు కాదు అన్నారు. దీనిమీద కొంచెం లోతుగా విచారిస్తే మనకు విషయం అర్థం అవుతుంది.

    అంతవరకు మనది కానిది కొత్తగా మనకు లభించడం యోగం అని చెప్పుకున్నాం కదా. అయితే లోకంలో కొత్తగా వచ్చేవన్నీ ఎప్పుడో ఒకప్పటికి పోతాయి అని మనం చూస్తూనే ఉంటాం. మన కళ్ళముందే ఎందరో ఉన్నట్టుండి ధనవంతులుగా మారడం, మరికొంత కాలానికి ఆ వచ్చిన ధనాన్ని నిలబెట్టుకోలేక మళ్ళీ బికారులుగా మారడం మనకు తెలుసు. అలాగే మనం చిన్నప్పుడు చదువుకున్న చదువులో ఎంతవరకు మనకు గుర్తుంది? ఎప్పటికప్పుడు పునశ్చరణ చేసుకోకపోతే అది మన స్మృతిపథంనుండి దూరమైపోతుంది.

    అంతెందుకు ఒకప్పుడు లేకుండా ఫలానా తేదీన పుట్టిన మనందరం మరో తేదీన లేకుండా పోతాం కదా! కాబట్టి కొత్తగా మనకు వచ్చేదేదీ శాశ్వతంగా మనతో ఉండదని అర్థం అవుతోంది. అందుకే ఈ ప్రాపంచిక విషయాలన్నింటిలో యోగక్షేమాలు రెండూ వేరు వేరే. యోగంతో వచ్చినది క్షేమంగా ఉంటుందని నమ్మకం లేదు. మరి క్షేమంతో కూడిన యోగం అంటే ఏమిటి? ఎప్పటికీ మననుంచి దూరమైపోకుండా ఉండేది ఏది? అంటే అది సనాతనంగా మనదై ఉన్న మన నిజస్థితి మాత్రమే. అది ఈ శరీరానికో మనస్సుకో పరిమితమైనది కాదు. అది సర్వవ్యాపకమైన ఆత్మతత్త్వం. అదే మన నిజతత్త్వం. 

న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః ।
యద్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ ॥ భ. గీ. 15-6

    "ఎక్కడైతే సూర్యచంద్రుల ప్రకాశం, అగ్నిదేవుని ప్రకాశం కూడా వెలవెలబోతుందో, ఏ పదాన్ని పొందిన తరువాత ఇక తిరిగి రావడం ఉండదో అదే నాయొక్క పరమపదం" అని పరమాత్మ చెబుతున్నాడు. అదే మన నిజస్థితి. మనం మన ఇల్లు దాటి బయట ఎక్కడికైనా వెళ్ళాము అంటే తిరిగి వచ్చేస్తామనే అర్థం కదా. అలాగే ఒక చోట ఏ సత్సంగానికో, పూజకో, లేక సినిమాకో ఒక వందమంది వచ్చారంటే అది అయిపోగానే అందరూ తిరిగి వాళ్ళ వాళ్ళ స్వస్థలానికి వెళ్ళిపోతారు కదా! అసలు మన సొంతం అనుకున్న ఇల్లే ఎన్నాళ్ళు మనతో ఉంటుందో తెలియదు. ఒకవేళ అది ఉన్నా అందులో మనం ఉండటానికి ఎన్నాళ్ళు ఈ దేహంలో ప్రాణం ఉంటుందో తెలియదు.

    ఒక్కసారి ప్రాణం పోగానే ముందు మన దేహాన్ని ఇంటి బయట పెట్టేస్తారు. కాబట్టి సృష్టిలో మనకు కనిపించే ప్రతీదీ వచ్చిపోయేదే. మరి ఒకసారి వస్తే మళ్ళీ పోని ఆ యోగక్షేమం ఏమిటి? అదే జ్ఞానం. మనం జ్ఞాన స్వరూపులమే అయి ఉన్నాం. అయితే నిప్పుని పొగ క్రమ్మినట్లు మన జ్ఞానాన్ని అజ్ఞానమనే పొర కప్పివేస్తోంది. వయసు పెరుగుతున్నకొద్దీ మన కళ్ళకు పొరలు క్రమ్మి క్రమంగా మన చూపు మందగిస్తుంది కదా. ఒకసారి నేత్రవైద్యుడు ఆ పొరను తొలగిస్తే ఇక అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే జన్మజన్మల నుండి మన జ్ఞాననేత్రాన్ని కప్పి ఉంచిన అజ్ఞాన పొరను గురుదేవులు తొలగిస్తే ఇక మళ్ళీ ఆ పొర క్రమ్ముకోదు. ఒకసారి జ్ఞానాన్ని పొందినవాడు మళ్ళీ అజ్ఞాని కాలేడు. ఇదే నిజమైన యోగక్షేమం.

    ఈ విషయాన్నే వివరిస్తూ శ్రీగురుదేవులు కొన్ని ఉదాహరణలు చెప్పేవారు. ఒకసారి తెల్లబడిన జుట్టు మళ్ళీ నల్లబడదు కదా! జుట్టులోని అసలు రంగు తెలుపే. దానిపైన నలుపు ఆవరించింది. ఒకసారి ఆ నలుపు పొర తొలగిపోతే మళ్ళీ రాదు. అలాగే ఒకసారి పండిన పండు మళ్ళీ పచ్చిగా మారలేదు. విత్తనం పచ్చిగా ఉన్నంతవరకూ దానిలో మొలకెత్తే లక్షణం ఉంటుంది. అది మళ్ళీ మళ్ళీ అనేక వృక్షాలుగా విస్తరిస్తుంది. అదే విత్తనం ఒకసారి కాలిపోతే ఇక మళ్ళీ మొలకెత్తే అవకాశమే లేదు. అలా జ్ఞానాగ్నిలో మన కర్మబీజాలు, వాసనాబీజాలు అన్నీ కాలిపోతే ఇక మళ్ళీ మనం అజ్ఞానంలో పడి తిరిగి జన్మనెత్తవలసిన అవసరం లేదు.

    అజ్ఞానంలో ఉన్నవాడి జన్మలు వాడి ఇష్టానుసారం రావు. వాడి కర్మలను అనుభవించడానికి వీలైన శరీరమే వాడికి లభిస్తుంది. వాడు ఆ జన్మకు బద్ధుడై ఉంటాడు. అదే జ్ఞాని అయినవానికి ఈ బంధనం లేదు. జన్మ ఎత్తవలసిన అవసరం లేకపోయినా భగవదాజ్ఞను అనుసరించి లోకోపకృతికి ఒకవేళ అతను జన్మించినా అది బంధనం కాదు. పైగా ఇతరులకు కూడా మోక్షదాయకం అవుతుంది. గోతిలో పడ్డ వాడికి, వాడిని పైకి లాగటం కోసం ఆ గోతిలోనే దిగిన వానికి ఎంత తేడా ఉందో వీరిద్దరి జన్మలకు అంత తేడా ఉంది. ఒకరిది జన్మ, మరొకరిది అవతారం. అవతారం అంటే క్రిందకు దిగడం. ఇది జారి పడిపోవడం కాదు. ఇతరులను పైకి లాగడానికి తనంత తానుగా క్రిందకు దిగడం. శరీరం క్రింద ఉన్నా తాను మాత్రం ఎప్పుడూ అత్యున్నతమైన తన నిజస్థితిలోనే ఉంటాడు.

    అటువంటి నిజమైన యోగక్షేమాన్ని పొందాలంటే భగవానుడు చెప్పినట్లుగా ఇతర చింతనలు మాని నిత్య భగవన్నామ స్మరణలో, ఉపాసనలో, ధ్యానంలో, విచారణలో మన మనస్సుని ఊరబెట్టాలి. ఒక్కసారి అటువంటి బ్రాహ్మీస్థితిని పొందామంటే ఇక మన మనస్సు ఎటువంటి ప్రాపంచిక వ్యామోహలకు లోనుకాదు. 

ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి |
స్థిత్వా స్యామంతకాలేஉపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి || భ. గీ. 2-72

12, మే 2025, సోమవారం

వైశాఖ పూర్ణిమ

        

    పూర్ణిమ నాడు చంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉంటే దానిని వైశాఖమాసం అంటారు. శాఖలు అంటే చెట్టు కొమ్మలు అని మనకు తెలుసు కదా. మరి విశాఖ అంటే కొమ్మలు లేని చెట్టు. అసలు ఏమిటీ చెట్టు అంటే భగవద్గీతలో స్వామి చెప్పాడు.

 
ఊర్ధ్వమూలమధః శాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ ।
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ।।



    సంసారమనే అశ్వత్థ వృక్షానికి మూలం పైన ఉంటుందిట కొమ్మలు క్రిందకి విస్తరించి ఉంటాయిట. దీని గురించి కొంచెం ఆలోచిస్తే అసలు సంసారానికి మూలం నువ్వే. 'నేను' అంటూ ఉన్నప్పుడే 'నాది' అనే ఈ సంసారం అంతా ఉంటోంది. నేనే లేకపోతే సంసారం ఎక్కడిది? అయితే అసలు 'నేను' అయిన ఆత్మను వదిలివేసి మనం ఈ శరీరమే నేను అనుకుంటున్నాం. ఇక ఈ శరీరానికి సంబంధించిన వస్తువులు, వ్యక్తుల మీదకి మన ఆలోచనలు శాఖోపశాఖలుగా విస్తరించి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే సంసారం మనని బంధిస్తోంది.


    మనం ఎప్పుడైతే క్రిందికి (ప్రపంచం వైపుకి) చూడడం మానేసి పైన ఉన్న మూలాన్ని పట్టుకుంటామో అప్పుడు ఈ శాఖలన్నీ వాటంతట అవే రాలిపోతాయి. అయితే దీనికి ఏకాగ్ర బుద్ధి అవసరం. అదే భగవద్గీతలో స్వామి చెబుతూ


వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన |
బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయోஉ వ్యవసాయినామ్ ||



    నీ కృషి ద్వారా ఆధ్యాత్మిక సాధన ద్వారా బుద్ధిని ఆత్మయందు ఏకాగ్రం చెయ్యి అర్జునా! సాధన లేని బుద్ధి అనేక శాఖలుగా విస్తరించి అనంతంగా ప్రపంచంలో వ్యాపిస్తుంది అని చెబుతున్నాడు. మనకు నిరంతరం మనస్సులో అనేక సంకల్పాలు వస్తూనే ఉంటాయి కదా! అయితే ఆ సంకల్పించిన పని మంచిదా, కాదా? ఇది చేయవచ్చా, చేయకూడదా? అని విచారించి నిర్ణయించేది బుద్ధి. ఎప్పుడైతే ఈ బుద్ధిని మూలపదార్థమైన ఆత్మయందు నిలుపుతామో అప్పుడది ఈ అనిత్యమైన ప్రాపంచిక విషయాలను దానంతటదే వదిలివేస్తుంది. జీవితంలో ప్రతి అడుగులోనూ సరైన నిర్ణయాలు తీసుకొని మనను ఆధ్యాత్మిక పథంలో నడిపిస్తుంది. నిజమైన వైరాగ్యం అంటే ఇదే కదా. అందుకే స్వామి ఈ సంసార వృక్షాన్ని 'అసంగ శస్త్రేణ దృఢేన ఛిత్వా' దృఢమైన వైరాగ్యమనే ఆయుధంతో నరకాలని సూచిస్తున్నారు.


    పరమేశ్వరుని నామాలలో 'ఓం స్థాణవే నమః' అనే నామం ఒకటి. స్థాణువు అంటే ఏ కొమ్మలూ లేని చెట్టు మొదలు. బుద్ధి ప్రపంచంలోకి శాఖోపశాఖలుగా విస్తరించకుండా నిరంతరం తనలో తాను రమిస్తూ సమాధి స్థితిలో ఉంటాడు కాబట్టి ఆయన స్థాణువు. ఈ వృక్షానికి కొమ్మలు లేకపోవడం అనే గుణమే 'విశాఖ'. అది కుమారస్వామి నామం. కొమ్మలే లేకపోతే ఇక ఆకులు ఎక్కడినుంచి వస్తాయి. అలా ఆకులు లేకపోవడం అనే గుణమే 'అపర్ణ'. ఇది పార్వతీదేవి నామం కదా! ఇలా బుద్ధి ప్రపంచంలోకి విస్తరించకుండా ఆత్మయందు లగ్నమయినప్పుడు ఆ ఆత్మ సర్వవ్యాపకమయినది కనుక 'నీవు చూచునదెల్ల నీవే' అనే విశ్వవ్యాపక అనుభూతి కలుగుతుంది. అదే 'విష్ణు'. ఇది గణేశుని నామం. ఇలా సంసారంలోనే ఉంటూ దేనికీ అంటకుండా నిరంతర ఆత్మానందాన్ని ఎలా అనుభవించవచ్చో ఆది కుటుంబమైన పరమేశ్వరుని కుటుంబం మనకు సూచిస్తోంది.


    అలాగే మనోసంసారాన్ని విడిచిపెట్టి ఏకాగ్రబుద్ధితో సాధన చేస్తే ఈ సంసార వృక్షమే బోధివృక్షమై నీలో జ్ఞాన ప్రబోధం కలుగుతుందని నిరూపించిన బుద్ధభగవానుని జయంతి కూడా ఈ వైశాఖ పూర్ణిమ రోజనే. శత్రువు జాడ పొడసూపగానే తాబేలు తన ఇంద్రియాలను లోపలికి లాక్కొని ఎలా రాయిలా మారిపోతుందో ప్రజ్ఞావంతుడయిన మానవుడు తన ఇంద్రియాలను అలా విషయాలనుండి లోపలికి లాక్కొని తనను తాను రక్షించుకోవాలని గీతలో స్వామి చెబుతాడు. అటువంటి కూర్మావతారం వచ్చినది కూడా ఈరోజే. అలాగే సంసారంలో ఉన్న మానవుడు ఎలా భక్తి జ్ఞాన వైరాగ్యములను పెంపొందించుకొని ఆత్మానంద ఫలాన్ని అందుకోవాలో మనందరికీ ప్రత్యక్షంగా నిరూపిస్తూ శృంగార, భక్తి, జ్ఞాన, వైరాగ్య పూరితమైన 32 వేల సంకీర్తనలు తెలుగువారి ఇలవేలుపైన ఆ వేంకటేశ్వరునిపై రచించిన అన్నమాచార్యుల వారి జయంతి కూడా ఈరోజే.


    కాబట్టి ఈ వైశాఖ పూర్ణిమ మనందరికీ అటువంటి వైరాగ్యాన్ని, ఏకాగ్ర బుద్ధిని ప్రసాదించి మన సాధనను పురోగమింపజేయాలని శ్రీ సద్గురుమూర్తిని ప్రార్థిద్దాం.