ఊర్ధ్వమూలమధః శాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ ।
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ।।
వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన |
బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయోஉ వ్యవసాయినామ్ ||
ఊర్ధ్వమూలమధః శాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ ।
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ।।
అశేష జీవరాశులలో భగవంతుడు మానవునికి మాత్రమే ఇచ్చిన వరం బుద్ధి. ఏది మంచి, ఏది చెడు అని విచారణ చేసి మంచిని ఎంచుకొనే శక్తి ఈ బుద్ధికి మాత్రమే ఉంది. ఈ విచారణనే విమర్శ అని కూడా అంటారు. శ్రీ బాబూజీ మహరాజ్ వారు 'మీరు ప్రతిరోజూ రాత్రి పడుకొనే ముందు ఆ రోజు మీరు చేసిన పనులను, ఆలోచనలను ఒకసారి పునరావలోకనం చేసుకొని ఆయా పనులు, లేక ఆలోచనలు ఎంతవరకు మీ సాధనకు ఉపయోగ పడుతున్నాయి? అందులో ఏవేవి మిమ్మల్ని అధోగతి పాలు చేస్తున్నాయి? అని ఆత్మవిమర్శ చేసుకోవటం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి' అని చెప్పేవారు. ఇటువంటి ఆత్మవిమర్శ వలన ఎప్పటికప్పుడు మనం ప్రయాణించే మార్గం సరియైనదో కాదో మనకు అంచనా వస్తుంది. చెడు మార్గంలో ఎక్కువ దూరం ప్రయాణం చేసేలోగానే మార్గాన్ని మరల్చుకొని తిరిగి మంచి మార్గానికి రావడానికి అవకాశం ఏర్పడుతుంది.
అయితే మనలో ఎంతమంది ఇలా ఆత్మవిమర్శ చేసుకుంటున్నాం? మన జీవితంలో ఎక్కువ భాగం ఇతరులు చేసే పనులలో మంచిచెడులను ఎంచి వారిని విమర్శించడానికే సరిపోతోంది. ఒకవేళ మన తప్పులను అంతరాత్మ ఎత్తి చూపినా, ఆ తప్పు చేయడానికి ఏదో బలవత్తర కారణం ఉందని మనకు మనం సర్ది చెప్పుకొని మన తప్పులని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంకా మనం చేసే చిన్న చిన్న మంచి పనులను కూడా భూతద్దంలో చూపిస్తూ అందరూ గుర్తించాలని తాపత్రయ పడతాం. ఆత్మస్తుతి, పరనింద ఈ రెండూ మహాపాపాలని మన ఆర్ష ధర్మం బోధిస్తోంది.
అయితే గురుదేవుల బోధలతో మనం మంచి మార్గంలోకి మారినా, మన చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోదు కదా! మనం ఏమి చేసినా అందులో ఏదో ఒక లోపాన్ని పసిగట్టి మనలను విమర్శించేవారు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. అలా మనకు విమర్శ ఎదురైనప్పుడు మన మనస్సు తోక త్రొక్కిన త్రాచు లాగా సర్రున లేస్తుంది. అయితే ఇక్కడే మన వివేకాన్ని ఉపయోగించుకొని కొద్దిగా నిదానించాలి. 'వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనె వేగపడక వివరింప దగున్, కని కల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ'
ఎవరైనా ఒక మాట అనగానే వెంటనే ఆవేశపడిపోకుండా ఒక్క క్షణం ఆగి వారి మాటలలో నిజానిజాలు తరచి చూసుకోవాలి. ఎందుకంటే ఎంతటి అనుభవజ్ఞుడయినా, తాను చేసే పనిలో ఎంతటి కౌశల్యం సంపాదించినా ఎక్కడో ఒకచోట ఏదో ఒక లోపం ఉండకపోదు. 'సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్ని రివావృతాః' - అగ్ని చుట్టూ ఎప్పుడూ పొగ ఆవరించుకొని ఉన్నట్లే మనం చేసే అన్ని పనులూ ఏదో ఒక దోషంతో ఆవరించుకొని ఉంటాయని సాక్షాత్తూ గీతాచార్యుడే సెలవిచ్చాడు కదా! కాబట్టి మనం ఒక్క క్షణం ఆగి ఎదుటివారి విమర్శలో ఎంతవరకు నిజం ఉన్నదని మనం చేసిన పనినో, మన వ్యక్తిత్వాన్నో ఆత్మవిమర్శ చేసుకొని నిజంగానే అందులో దోషం ఉంటే దానిని సరిచేసుకొనే ప్రయత్నం చేయాలి.
'అపరాధముల నెంచువారు మాకు ఉపకారులై ఉన్నారు' అన్నారు శ్రీరామదాసు వారు. ఎందుకంటే విమర్శ అనేది మనకు రెండు రకాలుగానూ ఉపకారమే చేస్తుంది. ఒకవేళ వారి విమర్శలో నిజం ఉంటే అది మన తప్పులను మనం తెలుసుకొని సరిదిద్దుకోవడానికి, తద్వారా ఉన్నత స్థితికి చేరడానికి ఉపయోగపడుతుంది. అదే ఆ విమర్శలో నిజం లేకుండా కేవలం మనను నొప్పించడానికో, కించపరచడానికో చేసినట్లయితే కూడా మనం దానిని సద్బుద్ధితో స్వీకరిస్తే అది మన దుష్కర్మలను కొంతవరకు రహితం చేస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా శారీరకంగా కానీ మానసికంగా కానీ కష్టాన్ని అనుభవిస్తున్నామంటే ఆ విధంగా మన పాపకర్మల భారాన్ని తగ్గించుకుంటున్నామని గుర్తు పెట్టుకోవాలి. అలాగే మనం అనుభవించే సుఖలన్నీ మన సత్కర్మల పుణ్యాన్ని హరించివేస్తుంటాయి.
ఇలా రెండు రకాలుగా మనకు మంచే చేస్తుంది కాబట్టే విమర్శ మనకు ఎంతో అవసరం. అందుకే జగన్మాత 'విమర్శరూపిణీ'. కాబట్టి విమర్శ చేసేవారిని వ్యక్తిగా చూడకుండా ఈ రూపంలో జగన్మాత మనను మంచిదారిలో పెడుతోందనో, లేక మన దుష్కర్మలను హరిస్తోందనో భావించి విమర్శను ఆనందంగా స్వీకరించడం నేర్చుకోవాలి. అలా స్వీకరించాలంటే ముందు మనం చేసే పనులు, మనమూ ఒకటి కాదని బాగా గుర్తు పెట్టుకోవాలి. ఎవరైనా మన పనిని విమర్శించారంటే అది మనను కాదని గ్రహించి ఆ పనిలో ఉన్న లోపాన్ని సరిదిద్దుకుంటే ఇంకా ఉన్నతంగా పని చేయగలుగుతాం. అసలు ముందు మనం ఆ పని ఎందుకు చేస్తున్నామో అన్న విషయాన్ని సదా గుర్తు పెట్టుకొని ఈ విమర్శ ఆ ప్రయోజనంలో ఒక మెట్టు అని గ్రహించాలి. మనమీద వేసే రాళ్ళతోనే మనం మెట్లు కట్టుకొని ఇంకా ఇంకా పైకెదగాలి.
అలా కాకుండా ఎప్పుడైతే మనం అవతలి వారిని మన మిత్రులుగానో, శత్రువులుగానో, మనకంటే పెద్దవారిగానో, చిన్నవారిగానో చూస్తున్నామో అప్పుడే మనం వారి విమర్శను గ్రహించే విధానంలో లోపం వస్తుంది. అసలు ముందు మనలో ఏదో తప్పు చేశామన్న అపరాధ భావం ఉంటే ఇక ఎవరు మనవైపు చూసినా, వారిలో వారు మాట్లాడుకుంటున్నా వారు మననే విమర్శిస్తున్నారని, మన గురించే చెడుగా మాట్లాడుకుంటున్నారని మనలో స్థిరమైన అభిప్రాయం ఏర్పడిపోతుంది. అందుకని ముందు ఆత్మవిమర్శ చేసుకొని, మన అపరాధాలను సరిదిద్దుకొని, ప్రతి విమర్శలోనూ వ్యక్తిని చూడటం మానేసి జగన్మాతను చూడటం నేర్చుకొంటే ఇక ఆ మనసుకు సదా శాంతే కదా!
పక్షులయితే ఈ ఇల్లు కట్టుకొనే విద్యలో బహు నేర్పరులు. ఎక్కడెక్కడి పుల్లలను, గడ్డి పరకలను సేకరించి తమ పిల్లలకు సౌకర్యవంతంగానూ సురక్షితంగానూ ఉండేలా తమ గూడును ఏర్పరచుకుంటాయి. గిజిగాని గూడు గురించి మనందరం చిన్నప్పుడు చదువుకున్నాం కదా! కొన్ని పక్షులయితే తాము లోపలికి వెళ్ళడానికి ఒక రహస్య ద్వారాన్ని నిర్మించి, పాములవంటి శత్రువులను మోసం చేయడానికి మాయా ద్వారాన్ని కూడా నిర్మిస్తాయి. మనిషికి కూడా తప్పనిసరిగా కావలసిన వాటిగా కూడు, గూడు, గుడ్డ ఈ మూడింటినీ చెబుతారు కదా! అవి లేనివారికి ప్రభుత్వాలు వాటిని అందిస్తూ దానికి తమ నాయకుల పేర్లో, తల్లిదండ్రుల పేర్లో పెడుతూ ఉంటాయి. ఒకప్పుడు మనుషులు అందరూ కూడా తమ నివాసానికి కావలసినట్లుగా పర్ణశాలలను తామే నిర్మించుకొనేవారు. వనవాస కాలంలో శ్రీరాముడు, అలాగే పాండవులు కూడా తమ నివాసాలను నిర్మించుకోవడం మనం చూస్తాం.
అయితే క్రమేపీ అవసరాలు వెనుకబడి, ఆశలకు పెద్దపీట వేయడం, అవసరానికి మించి సంపాదించి తరతరాలకు దాచుకోవడం మొదలుపెట్టడంతో పెద్దపెద్ద ఇళ్ళు కట్టుకోవడం మొదలుపెట్టి మనిషి ఆ ఇంటి నిర్మాణానికి వేరొకరిమీద ఆధారపడవలసి వస్తోంది. ఎంత సంపాదించినా, కూడబెట్టినా, ఎంత పెద్ద రాజభవనాన్ని నిర్మించుకొన్నా చివరికి వట్టి చేతులతో మట్టిపాలు కావలసిందే. 'ఈ భూమికి నేను యజమానిని' అని విర్రవీగే వానిని చూసి భూమి నవ్వుకుంటుందిట 'నీలాంటి వారిని ఎంతమందిని నాలో కలిపేసుకున్నానో! ఇదే భూమికి నేను యజమానినని ఇప్పటికి ఎంతమంది విర్రవీగి చివరికి నాలో కలిసిపోయారో' అని.
అయితే మనకు నిజమైన నివాసం ఏది? అని ఆలోచిస్తే 'ఈశావాస్యమిదగ్గ్ సర్వం' అని ఉపనిషత్తు చెబుతోంది. ఈ జగత్తు అంతా ఈశ్వరునికి ఆవాసమై ఉన్నది. మరి జగత్తుకి ఆవాసం ఏది? అంటే అది ఈశ్వరుడే. ఎందుకంటే జగత్తు ఈశ్వరునికి భిన్నంగా లేదు. సముద్రంలో అనేక కెరటాలు పుట్టి, కొంతదూరం ప్రయాణించి మళ్ళీ అందులోనే లీనమైపోతూ ఉంటాయి. కెరటంగా కనిపించినంత సేపూ అందులో ఉండే నీటికి ఆ కెరటం ఆధారమైనట్లుగా మనకు తోస్తుంది. కానీ ఆ కెరటానికి ఆధారం కూడా విశాలమైన సముద్రమే కదా! నిజానికి సముద్రం లేకుండా కెరటానికి ఉనికి లేదు. కెరటం తయారైంది కూడా ఆ సముద్రపు నీటితోనే. కొంతసేపు అది సముద్రానికి వేరుగా ఉన్నట్లుగా భ్రమింపజేస్తూ చివరికి తన స్వస్వరూపంలో లయం అయిపోతోంది.
అలాగే పరమాత్మ తనలోనుండే పంచభూతాలను సృష్టించి వాటితో ఈ సమస్త ప్రాణులను తయారు చేశాడు. కుమ్మరి తనకంటే వేరుగానున్న మట్టిని తీసుకొని దానితో కుండలు చేసినట్లుగా పరమాత్మ సృష్టి చేయాలంటే తనకన్నా వెరైనది ఏదీ లేనేలేదు కదా! కాబట్టి విశ్వానికంతటికీ నిజమైన ఆవాసం పరమాత్మ. అదే పరమాత్మ విశ్వంలోని ప్రాణులన్నింటి దేహాలను తన ఆవాసాలుగా చేసుకొని వాటిని ప్రకాశింపజేస్తున్నాడు. ఈ సత్యాన్ని గుర్తెరిగి మన పాంచభౌతిక దేహాలను ఆ పరమాత్మ నివాసానికి యోగ్యమైన దేవాలయాలుగా స్వచ్ఛంగా, నిర్మలంగా మలచుకొని నిజమైన శాంతిని, ఆనందాన్ని పొందేందుకు ప్రయత్నిద్దాం.