ఊర్ధ్వమూలమధః శాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ ।
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ।।
వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన |
బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయోஉ వ్యవసాయినామ్ ||
ఊర్ధ్వమూలమధః శాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ ।
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ।।
అశేష జీవరాశులలో భగవంతుడు మానవునికి మాత్రమే ఇచ్చిన వరం బుద్ధి. ఏది మంచి, ఏది చెడు అని విచారణ చేసి మంచిని ఎంచుకొనే శక్తి ఈ బుద్ధికి మాత్రమే ఉంది. ఈ విచారణనే విమర్శ అని కూడా అంటారు. శ్రీ బాబూజీ మహరాజ్ వారు 'మీరు ప్రతిరోజూ రాత్రి పడుకొనే ముందు ఆ రోజు మీరు చేసిన పనులను, ఆలోచనలను ఒకసారి పునరావలోకనం చేసుకొని ఆయా పనులు, లేక ఆలోచనలు ఎంతవరకు మీ సాధనకు ఉపయోగ పడుతున్నాయి? అందులో ఏవేవి మిమ్మల్ని అధోగతి పాలు చేస్తున్నాయి? అని ఆత్మవిమర్శ చేసుకోవటం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి' అని చెప్పేవారు. ఇటువంటి ఆత్మవిమర్శ వలన ఎప్పటికప్పుడు మనం ప్రయాణించే మార్గం సరియైనదో కాదో మనకు అంచనా వస్తుంది. చెడు మార్గంలో ఎక్కువ దూరం ప్రయాణం చేసేలోగానే మార్గాన్ని మరల్చుకొని తిరిగి మంచి మార్గానికి రావడానికి అవకాశం ఏర్పడుతుంది.
అయితే మనలో ఎంతమంది ఇలా ఆత్మవిమర్శ చేసుకుంటున్నాం? మన జీవితంలో ఎక్కువ భాగం ఇతరులు చేసే పనులలో మంచిచెడులను ఎంచి వారిని విమర్శించడానికే సరిపోతోంది. ఒకవేళ మన తప్పులను అంతరాత్మ ఎత్తి చూపినా, ఆ తప్పు చేయడానికి ఏదో బలవత్తర కారణం ఉందని మనకు మనం సర్ది చెప్పుకొని మన తప్పులని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంకా మనం చేసే చిన్న చిన్న మంచి పనులను కూడా భూతద్దంలో చూపిస్తూ అందరూ గుర్తించాలని తాపత్రయ పడతాం. ఆత్మస్తుతి, పరనింద ఈ రెండూ మహాపాపాలని మన ఆర్ష ధర్మం బోధిస్తోంది.
అయితే గురుదేవుల బోధలతో మనం మంచి మార్గంలోకి మారినా, మన చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోదు కదా! మనం ఏమి చేసినా అందులో ఏదో ఒక లోపాన్ని పసిగట్టి మనలను విమర్శించేవారు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. అలా మనకు విమర్శ ఎదురైనప్పుడు మన మనస్సు తోక త్రొక్కిన త్రాచు లాగా సర్రున లేస్తుంది. అయితే ఇక్కడే మన వివేకాన్ని ఉపయోగించుకొని కొద్దిగా నిదానించాలి. 'వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనె వేగపడక వివరింప దగున్, కని కల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ'
ఎవరైనా ఒక మాట అనగానే వెంటనే ఆవేశపడిపోకుండా ఒక్క క్షణం ఆగి వారి మాటలలో నిజానిజాలు తరచి చూసుకోవాలి. ఎందుకంటే ఎంతటి అనుభవజ్ఞుడయినా, తాను చేసే పనిలో ఎంతటి కౌశల్యం సంపాదించినా ఎక్కడో ఒకచోట ఏదో ఒక లోపం ఉండకపోదు. 'సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్ని రివావృతాః' - అగ్ని చుట్టూ ఎప్పుడూ పొగ ఆవరించుకొని ఉన్నట్లే మనం చేసే అన్ని పనులూ ఏదో ఒక దోషంతో ఆవరించుకొని ఉంటాయని సాక్షాత్తూ గీతాచార్యుడే సెలవిచ్చాడు కదా! కాబట్టి మనం ఒక్క క్షణం ఆగి ఎదుటివారి విమర్శలో ఎంతవరకు నిజం ఉన్నదని మనం చేసిన పనినో, మన వ్యక్తిత్వాన్నో ఆత్మవిమర్శ చేసుకొని నిజంగానే అందులో దోషం ఉంటే దానిని సరిచేసుకొనే ప్రయత్నం చేయాలి.
'అపరాధముల నెంచువారు మాకు ఉపకారులై ఉన్నారు' అన్నారు శ్రీరామదాసు వారు. ఎందుకంటే విమర్శ అనేది మనకు రెండు రకాలుగానూ ఉపకారమే చేస్తుంది. ఒకవేళ వారి విమర్శలో నిజం ఉంటే అది మన తప్పులను మనం తెలుసుకొని సరిదిద్దుకోవడానికి, తద్వారా ఉన్నత స్థితికి చేరడానికి ఉపయోగపడుతుంది. అదే ఆ విమర్శలో నిజం లేకుండా కేవలం మనను నొప్పించడానికో, కించపరచడానికో చేసినట్లయితే కూడా మనం దానిని సద్బుద్ధితో స్వీకరిస్తే అది మన దుష్కర్మలను కొంతవరకు రహితం చేస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా శారీరకంగా కానీ మానసికంగా కానీ కష్టాన్ని అనుభవిస్తున్నామంటే ఆ విధంగా మన పాపకర్మల భారాన్ని తగ్గించుకుంటున్నామని గుర్తు పెట్టుకోవాలి. అలాగే మనం అనుభవించే సుఖలన్నీ మన సత్కర్మల పుణ్యాన్ని హరించివేస్తుంటాయి.
ఇలా రెండు రకాలుగా మనకు మంచే చేస్తుంది కాబట్టే విమర్శ మనకు ఎంతో అవసరం. అందుకే జగన్మాత 'విమర్శరూపిణీ'. కాబట్టి విమర్శ చేసేవారిని వ్యక్తిగా చూడకుండా ఈ రూపంలో జగన్మాత మనను మంచిదారిలో పెడుతోందనో, లేక మన దుష్కర్మలను హరిస్తోందనో భావించి విమర్శను ఆనందంగా స్వీకరించడం నేర్చుకోవాలి. అలా స్వీకరించాలంటే ముందు మనం చేసే పనులు, మనమూ ఒకటి కాదని బాగా గుర్తు పెట్టుకోవాలి. ఎవరైనా మన పనిని విమర్శించారంటే అది మనను కాదని గ్రహించి ఆ పనిలో ఉన్న లోపాన్ని సరిదిద్దుకుంటే ఇంకా ఉన్నతంగా పని చేయగలుగుతాం. అసలు ముందు మనం ఆ పని ఎందుకు చేస్తున్నామో అన్న విషయాన్ని సదా గుర్తు పెట్టుకొని ఈ విమర్శ ఆ ప్రయోజనంలో ఒక మెట్టు అని గ్రహించాలి. మనమీద వేసే రాళ్ళతోనే మనం మెట్లు కట్టుకొని ఇంకా ఇంకా పైకెదగాలి.
అలా కాకుండా ఎప్పుడైతే మనం అవతలి వారిని మన మిత్రులుగానో, శత్రువులుగానో, మనకంటే పెద్దవారిగానో, చిన్నవారిగానో చూస్తున్నామో అప్పుడే మనం వారి విమర్శను గ్రహించే విధానంలో లోపం వస్తుంది. అసలు ముందు మనలో ఏదో తప్పు చేశామన్న అపరాధ భావం ఉంటే ఇక ఎవరు మనవైపు చూసినా, వారిలో వారు మాట్లాడుకుంటున్నా వారు మననే విమర్శిస్తున్నారని, మన గురించే చెడుగా మాట్లాడుకుంటున్నారని మనలో స్థిరమైన అభిప్రాయం ఏర్పడిపోతుంది. అందుకని ముందు ఆత్మవిమర్శ చేసుకొని, మన అపరాధాలను సరిదిద్దుకొని, ప్రతి విమర్శలోనూ వ్యక్తిని చూడటం మానేసి జగన్మాతను చూడటం నేర్చుకొంటే ఇక ఆ మనసుకు సదా శాంతే కదా!