25, సెప్టెంబర్ 2025, గురువారం

అమ్మ మందహాసం


    అమ్మ "మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా" తన చిరు దరహాస చంద్రికలతో పతిదేవుడైన కామేశ్వరుని మనస్సును ముంచివేస్తుంది. అసలు అలా ముంచివేసే ముందు అమ్మ ఎందుకు చిరునవ్వులు చిందిస్తోందో, ఆ చిరునవ్వుకు కారణమైన ఆ కామేశ్వరుని మనస్సులోని ఆలోచనలు ఏమిటో ఊహించడానికి ప్రయత్నిద్దాం.

    బహుశా తన తండ్రి అయిన దక్ష ప్రజాపతి శాపానికి గురియైన చంద్రుని చేరదీసి శిరస్సున ధరించానని కోపగించదు కదా! అనుకున్నాడేమో ఆ చంద్రశేఖరుడు!  మీకంటే ముందే నేను అష్టమీ చంద్రుని నా నుదుటిన ధరించాను(అష్టమీ చంద్ర విభ్రాజదళికస్థల శోభితా) స్వామీ! అలాగే సూర్యచంద్రులు ఇద్దరినీ నా చెవి కమ్మలుగా కూడా ధరించాను(తాటంక యుగళీభూత తపనోడుప మండలా) అని అమ్మ చిరునవ్వు నవ్వితే అయ్యవారి మనస్సు హమ్మయ్య! అని సమాధాన పడిందేమో!

    గంగను సవతిగా తెచ్చి నెత్తిన పెట్టుకున్నానని అలగదు కదా! అని ఆ గంగాధరుడు బిడియ పడుతుంటే బ్రహ్మాండ వ్యాప్తమైన మీ దేహంలో సగం నేనే అయినప్పుడు ఎక్కడో మీ జటాజూటంలో ఒక చిన్న పాయలో ఇమిడిపోయిన గంగ నాకు పోటీయా? అని అమ్మ చిరునవ్వు నవ్వితే స్వామి మనసు కుదుట పడిందేమో!

    తనని, నన్ను కలపడానికి ప్రయత్నిస్తున్న మన్మధుని భస్మం చేశానని కినుక వహించదు కదా! పైగా ఆతడు తనకి మేనల్లుడు కూడానూ, అని భయపడుతున్న ముక్కంటిని స్వస్థపరుస్తూ "వాడేదో వెర్రివాడు. తపస్సు ద్వారా ఏకమవ్వవలసిన మనలని వాడికి తెలిసిన కామం ద్వారా ఏకం చేయాలని చూసి పాపం మీ చూపులో భస్మం అయిపోయాడు. ఎవరో మనను కలిపేది ఏమిటి? మీరెప్పుడో నా వారు, ఎందుకంటే నేను స్వాధీన వల్లభను. అయినా ఏం భయం లేదులే. వాడి పాలిట నేను సంజీవనినై మళ్ళీ బ్రతికించాను(హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషాధిః)" అని ఊరడింపుగా నవ్విందేమో!

    తాను ముచ్చటపడి ఎంతో అందంగా తయారుచేసుకున్న కుమారుని శిరస్సును నా కోపంతో కత్తిరించి ఏనుగు తల పెట్టానని బాధపడుతోందేమో! అని విచారిస్తున్న ఆ తండ్రికి స్వాంతనగా తల ఎలా ఉన్నా ప్రతి తల్లికీ తన కన్నకొడుకే లోకంలోకెల్లా అందగాడు లెండి(అగజానన పద్మార్కం) అని అనునయింపుగా నవ్విందేమో!

    ఇంట్లో ఇంత అందమైన భార్యను పెట్టుకొని ఒక మగవాడు ఆడవేషం ధరిస్తే చూసి మోహంలో పడిపోయానని తనను వెక్కిరిస్తుందేమో అని సిగ్గుపడుతున్న విష్ణుప్రియుని సమాధాన పరుస్తూ ఆ అనంగ జనకుని లావణ్యం అంతా నా అపాంగ విలోకనం నుండి వచ్చిందే లెండి, మీరు మాత్రం మోహంలో పడిపోక ఏం చేస్తారు అని నవ్విందేమో!

    తాను సర్వాభరణ భూషితయై సాయంకాలం వేళ నాకోసం ఎదురు చూస్తూ ఉంటే నేను రోజంతా  శ్మశానంలో తిరిగి ఒంటినిండా బూడిద పూసుకొని వస్తున్నానని చీదరించుకుంటుందేమో అని సందేహిస్తున్న శంకరుని చూసి ఈ ప్రసూతిశాలలు, శ్మశానలు నాకేమీ కొత్త కాదు. నేను ఒకసారి కనురెప్ప వేసే సమయంలో భువనాలన్నీ పుట్టి, పెరిగి, లయమైపోతూ ఉంటాయి(ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి) అని ఆ లోకజనని స్వాంతనగా నవ్విందేమో!

    చెప్పాపెట్టకుండా మాయమైపోయి, తీరా ఇంత విషం తాగి, గొంతంతా నల్లగా చేసుకుని వచ్చానని నిలదీస్తుందేమో అని కంగారు పడుతున్న ఆ నీలకంఠుని ఓదారుస్తూ మీరేం తాగినా నాకేం భయం లేదు. ఎందుకంటే నేను సర్వమంగళని. పైగా మీకేమయినా అయితే దానికి వైద్యం చేయగల శక్తి కూడా నాకు ఉంది (శివా రుద్రస్య భేషజీ) అని ధైర్యంగా నవ్విందేమో అమ్మ!

 భస్మాసురునికి ఇవ్వకూడని వరమిచ్చి లయకారకుడనైన నేనే లయమైపోయే స్థితిని తెచ్చుకున్నానని మందలిస్తుందేమో అని మధనపడుతున్న బోళాశంకరుని ఓదారుస్తూ బావ బ్రతుకు కోరే బావమరది మీకుండగా ఇక ఎందుకు చింత అని తన అన్నగారిని తలుచుకుంటూ చిరునవ్వు నవ్విందేమో ఆ పద్మనాభ సహోదరి!

 పాపం ఈ నంది ఎప్పటినుండో నా సేవ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈవిడ కొత్తగా సింహ వాహనాన్ని తెచ్చింది. దానిని చూసి నంది ఎక్కడ భయపడతాడో అని సందేహిస్తున్న భర్తకు ధైర్యం చెబుతూ సృష్టిలో ఎంత విభిన్న తత్త్వాలు కలిగివుండి, పరస్పరం శత్రువులైనా ఒక కుటుంబంలోకి వచ్చాక అందరూ పరస్పరానురాగంతో మెలగాలని మన కుటుంబమే లోకానికి చాటుతుంది లెండి, ఏం భయం లేదని ఆ విశ్వమాత నవ్విందేమో!

 నాకేమో పులి చర్మం ధరించడం అలవాటు. ఈ దుర్గేమో ఆ పులినే వాహనంగా చేసుకుంది. ఇప్పుడెలా అనుకుంటున్న మృగచర్మాంబర ధారిని చూసి అసలు ఈ సృష్టిలోని చర్మాలన్నీ ధరిస్తూ, ఈ బొమ్మలన్నింటినీ లోపలుండి నడిపేది నేనేనయ్యా అని నవ్విందేమో ఆ క్షేత్ర స్వరూప, క్షేత్రేశి, క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని!

    నాకసలే కోపం ఎక్కువ. ఎప్పుడు ప్రళయ తాండవం చేసి ఈ విశ్వాన్నంతటినీ లయం చేసేస్తానో అని ఆందోళన పడుతున్న లయకారకుడికి ఆశ్వాసన కలిగిస్తూ మీ ప్రళయ తాండవాన్ని నియంత్రించి ఆనంద తాండవంగా మార్చడానికి నేను లాస్యనృత్యంతో సిద్ధంగా ఉన్నాను కదా అని నవ్విందేమో, తాను కూడా లయకరినన్న మాట మరచిపోయి! 

    నేనేమో శుద్ధ స్ఫటిక సంకాశుడనై తెల్లగా మెరిసిపోతుంటే నాకీ నల్లటి భార్య దొరికిందేమిటి అని ఆశ్చర్యపోతున్న కర్పూర గౌరునికి ప్రత్యుత్తరమిస్తూ ఒక్క నలుపేమిటి అన్నీ రంగులు నేనే. కాళిని నేనే, శ్యామలను నేనే, గౌరిని నేనే. త్రిగుణాత్మిక ప్రకృతినైన నానుండి మీ ధవళకాంతి ప్రసరించడం వలననే ఇన్ని రంగులు ఏర్పడుతున్నాయి కదా అని నవ్విందేమో!   

    నేనేమో ఒంటినిండా పాములు ధరించి ఉంటాను. అవి బుసలు కొడుతూ ఉంటాయి. కొంపదీసి నా భార్య వీటిని చూసి భయపడదు కదా అని కళవళపడుతున్న నాగభూషణుని సముదాయిస్తూ ఈ పాములు నాకు కొత్తేం కాదు. మా అన్నగారు కూడా ఎప్పటినుంచో పాము మీదే పడుకుంటున్నాడు అని నవ్విందేమో!

    ఈ కాళీవనాశ్రమంలో భక్తులేమిటి, నీ పేరుతో దేవి నవరాత్రులు అని చెప్పి రోజులో సగం సమయం ఆ రామాలయంలోనే సత్సంగంలో ఉంటారు అని వేళాకోళమాడబోయిన రామలింగేశ్వరునితో ఏ స్త్రీకయినా తన జీవితంలోని ముఖ్య వేడుకలు పుట్టింటివారి సమక్షంలో జరిగితే ఆనందమే కదండీ! అయినా నన్ను అంటున్నారు కానీ ప్రతి శ్రావణ శుక్రవారానికి మీ చెల్లెలు వరలక్ష్మీ దేవి పూజలు శివాలయంలో జరగట్లేదా ఏమిటి? పైగా ఈ సంవత్సరం ఒక శుక్రవారం ఎక్కువే వచ్చింది కూడానూ అని గారంగా నవ్వింది జగన్మాత. ఓ అందుకేనా ఈ సంవత్సరం నవరాత్రులలో కూడా ఒకరోజు ఎక్కువ తెచ్చుకున్నావు అంటూ నవ్వేశాడు పరమేశ్వరుడు. 

    ఇలా జగన్మాతా పితరులైన పార్వతీ పరమేశ్వరుల సరస సల్లాపాలతో వారి చిరు దరహాస కిరణాల వెన్నెలలో మన జీవితాలు గడిచిపోతే అంతకంటే కావలసింది ఏముంటుంది?


యూట్యూబులో చూడండి

6, సెప్టెంబర్ 2025, శనివారం

సంచలద్వాల సన్నద్ధ లంబమాన శిఖోజ్వల

 


    శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామాలలో ఒక నామం - ఓం సంచలద్వాల సన్నద్ధ లంబమాన శిఖోజ్వలాయై నమః. సంచలత్ - బాగా కదులుతూ ఉన్న, వాల - తోకతో, సన్నద్ధ - సిద్ధంగా ఉన్న, లంబమాన - (ఆ తోకను) ఆశ్రయించి ఉన్న, ఉజ్వల - ప్రకాశిస్తున్న, శిఖ - అగ్నిశిఖను కలిగినవాడు అని అర్థం. తోక చివరన మండుతూ ఉన్న అగ్నితో లంకను కాల్చడానికి సిద్ధంగా ఉన్న అంజనేయిని రూపాన్ని ఈ నామం గుర్తుకు తెస్తుంది.

    అయితే ఇది మనకు కూడా అన్వయిస్తుంది. ఆంజనేయుని తోకలాగే మన మనస్సు కూడా ఎప్పుడూ చలిస్తూ ఉంటుంది. వానరాలు ఈ కొమ్మ మీదనుంచి ఆ కొమ్మకు, ఆ కొమ్మ మీదనుంచి ఈ కొమ్మ మీదకు నిరంతరం దూకుతూ ఉన్నట్లు మన మనస్సు కూడా ఒక విషయం నుంచి ఇంకొక విషయం మీదకు అలాగే దూకుతూ ఉంటుంది. అలాగే మనం ఏ చిన్న విషయాన్ని నేర్చుకున్నా, లేదా క్రొత్తగా ఒక పని చేసినా ఆంజనేయిని తోక చివరన ఎగసిపడుతున్న మంటలాగే మన ప్రతిభను పదిమందికీ చూపించాలని, అది చూసి అందరూ మనను మెచ్చుకోవాలని మన మనస్సు ఎగసిపడుతూ ఉంటుంది.

    అయితే ఆంజనేయుని గమనిస్తే ఆయన ఎంతటి ప్రతిభావంతుడయినా, నవ వ్యాకరణ పండితుడైనా, అష్ట సిద్ధులు కలిగి ఉన్నా, ఎప్పుడూ శ్రీరామచంద్రుని పాదాల చెంత దాసుడై ఒదిగి ఉంటాడు. ఆ ప్రభువు ఆజ్ఞ లేనిదే ఏ పనీ చెయ్యడు. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడని ఆయన మీద లోకం అపవాదు వేస్తుంది కానీ కాల్చడం కూడా ఆయన స్వామి ఆజ్ఞగానే స్వీకరించాడు. ముందు సీతాదేవి ఎక్కడ ఉందో చూసి రమ్మనే పంపించినా ఒకసారి అమ్మను చూసిన వెంటనే తరువాతి కర్తవ్యం ఏమిటో ఆయనకు త్రిజట స్వప్నం ద్వారా బోధ పడింది. ఒక వానరుడు లంకకు వచ్చి, అశోకవనాన్ని ధ్వంసం చేసి, వేలాది రాక్షసులను సంహరించి, లంకను కాల్చి తిరిగి వెళ్ళడం అనేది ముందుగానే భగవంతుడైన తన ప్రభువు నిర్ణయించి ఉంచాడని ఆ స్వప్న వృత్తాంతాన్ని వినడం ద్వారా ఆయనకు అర్థం అయ్యింది.

    అందుకనే అప్పటి దాకా ఒక చిన్న పిల్లి పరిమాణంలో సూక్ష్మరూపంలో ఆకుల మధ్యలో ఒదిగి ఉన్న ఆయన వికటరూపాన్ని ధరించి లంకను కాల్చాడు. నిజానికి గమనిస్తే ఆయన ఆ స్వప్నంలో చెప్పినంతవరకు మాత్రమే చేశాడు. ముందుగా అశోకవనాన్ని ధ్వంసం చేసి, అక్కడి రాక్షసులని సంహరించాడు. ఆ తరువాత ఇంద్రజిత్తు తనను బంధించినా, రావణుని సభలో అందరూ తనను అవమానించినా ఆయన ఏ ప్రతిచర్య చేయలేదు. ఎందుకంటే అదేదీ ఆ స్వప్నంలో చెప్పబడలేదు. ఒకసారి తన తోకకు నిప్పు అంటగానే మళ్ళీ భగవదాజ్ఞను అమలు పరుస్తూ లంకను కాల్చివేశాడు.

    ఆంజనేయుని చూసి మనందరము నేర్చుకోవలసిన ముఖ్య విషయం ఇదే. ఎంతటి ప్రతిభావంతులమైనా, ఆ ప్రతిభను ప్రదర్శించాలని మనస్సు ఎంతగా ఉవ్విళ్ళూరుతున్నా, ఈ ప్రతిభకు కారణమైన మన ప్రభువు పాదాల వద్ద ఒదిగి ఉండి వారి ఆజ్ఞకు బద్ధులై ప్రవర్తించడం నేర్చుకోవాలి. శ్రీ మాతాజీ వారు ఎప్పుడూ శ్రీ బాబూజీ మహారాజ్ వారి మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటారు - అన్నీ తెలిసి, నేర్చుకొని ఉండాలి, కానీ ఏమీ తెలియని వాడిలా ఒక ప్రక్కన ఒదిగి ఉండాలి. అవసరమైనప్పుడు నీ ప్రతిభను సేవకు ఉపయోగించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే కారుకు స్టెఫనీ టైరులాగా ఉండాలి - అని.

    ఇక్కడ ఆంజనేయుని నుంచి నేర్చుకోవలసింది ఇంకొకటి ఉంది. మనలో చాలామంది ప్రతి చిన్న విషయానికి అవతలివారు తమను అవమానించారని బాధపడిపోతూ ఉంటారు. వారు ఒక మాట అన్నా, ఒక చూపు చూసినా అది తనకు అవమానంగానే భావిస్తూ ఉంటారు. అయితే ముందు నిన్ను నువ్వు గౌరవించుకోవటం నేర్చుకోవాలి. నీమీద నీకు గౌరవం ఉన్నప్పుడు నిన్ను ఎవరూ అవమానించలేరు. రావణుని సభలో ఆంజనేయుని అవమానించినా, ఆసనం ఇవ్వకున్నా ఆయనేమీ బాధపడలేదు. తన ఆసనం తానే తయారుచేసుకొని వారందరి కంటే ఎత్తుగా కూర్చున్నాడు. నిన్ను నీవు గౌరవించుకోవటం అంటే ఇదే. ఇది అలవరచుకున్న నాడు నిన్నెవరూ అవమానించలేరు.

    ఇక ప్రతిభను నియంత్రణలో పెట్టుకోవడం గురించి మరింత లోతుగా విచారిద్దాం. "ఒక కారు వేగంగా వెళ్ళాలంటే ఏం కావాలి?" అని అడిగామనుకోండి ఎవరైనా ఠక్కున "మంచి ఇంజను ఉండాలి, పెట్రోలు నిండుగా ఉండాలి, టైర్లు బాగుండాలి" ఇలాంటివి చెబుతారు. ఇవన్నీ బాగున్నా ఆ బండికి బ్రేకులు సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి ఆ డ్రైవరు వేగంగా వెళ్ళగలుగుతాడా? బిక్కుబిక్కుమంటూ అత్యంత నిదానంగా బండి తోలుతాడు. ఎందుకంటే బండి వేగంగా వెళ్తూ క్షేమంగా గమ్యాన్ని చేరాలంటే బ్రేకులు చాలా అవసరం. ఎంత నియంత్రణ ఉంటే అంత వేగంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మన జీవితం కూడా అంతే. ఎంత నియంత్రణ ఉంటే అంత ఉన్నతికి చేరగలుగుతాం. నేలమీద నడిచేవాడు చాలా తేలికగా నడిచేస్తాడు. కానీ కొండను ఎక్కేవాడు ప్రతి అడుగూ పట్టి పట్టి జాగ్రత్తగా వెయ్యాలి. అప్పుడే పైకి చేరగలుగుతాడు. ఏమాత్రం పట్టు తప్పినా అధోగతే.

    ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఆంజనేయ అష్టోత్తర శతనామ స్తోత్రం కాళికా రహస్యం అనే గ్రంథంలోనిది. ఆంజనేయుడు ఎలాగైతే అనంతశక్తి సంపన్నుడైనా ఎప్పుడూ శ్రీరామచంద్రుని ఆజ్ఞకు లోబడి ఉంటాడో అలాగే అనంతశక్తి స్వరూపిణి అయిన కాళీమాత కూడా తన ప్రభువైన పరమేశ్వరుని వద్ద ఒదిగి ఉంటుంది. రాక్షస సంహారం చేసి అంతులేని కోపంతో లోకాలనన్నింటినీ భీతావహులను చేస్తున్న ఆ తల్లి తన పతిదేవుని దేహం కాలికి తగలగానే ఒక్కసారిగా శాంతించి భవతారిణీ స్వరూపాన్ని పొంది లోకాలకు అనుగ్రహదాయిని అయ్యింది.

    అనంత శక్తి సంపన్నులయినా ఏమీ తెలియని పసిపాపలా ఒదిగి ఉండే తత్త్వం కలిగిన అటువంటి హనుమంతుడు, కాళీమాతల మేలు కలయిక అయిన స్వరూపం మన గురుదేవులు శ్రీ హనుమత్ కాళీ వర ప్రసాద బాబూజీ మహరాజ్ వారు. వారినుంచి మనం మొదటగా నేర్చుకోవలసినది ఈ వినయాన్నే. ప్రతిభ ఏ ఒక్కరి సొత్తు కాదు. ప్రతి రంగంలో మనం చూస్తూనే ఉన్నాం. ఎంతో ప్రతిభావంతులైన వారు వారి సమయం వచ్చినప్పుడు ఈ జగన్నాటక రంగం నుంచి నిష్క్రమిస్తే ఆయా రంగాలేమి అక్కడితో ఆగిపోవట్లేదు కదా! వారి స్థానంలో మరొకరు ఆ ప్రతిభను అందిపుచ్చుకుంటున్నారు. అందరిలో ప్రతిభారూపంలో భాసించే ఆ పరబ్రహ్మ తత్త్వాన్ని గుర్తించిననాడు మనం కూడా అహంకారంతో ఎగరకుండా వినయం మన సహజ భూషణమై ప్రకాశిస్తాము. 

యోగక్షేమం


అనన్యాశ్చిన్తయంతో మాం యే జనాః పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ || - భగవద్గీత 9-22

    "ఎవరైతే అన్య చింతన లేకుండా నన్నే లెస్సగా ఉపాసిస్తూ నాయందే నిత్యం మనస్సును లగ్నం చేసి ఉంచుతారో వారి యోగక్షేమాన్ని నేను నా బాధ్యతగా వహిస్తాను" అని గీతాచార్యుడు అభయం ఇస్తున్నాడు. అయితే మనం సాధారణంగా తెలుగులో యోగక్షేమాలు అంటాం. యోగం అంటే కలయిక. మన దగ్గర లేనిదేదో కొత్తగా మనకు లభిస్తే దానిని యోగం అంటాం. ఉదాహరణకి ఒకడికి ధనయోగం ఉందనో రాజయోగం ఉందనో అంటే వాడి దగ్గర అప్పటివరకు లేని సంపదో, అధికారమో వాడికి అందుతుందని అర్థం. అలాగే మనకి దక్కుతుందని ఎంతగానో ఆశించినది చివరి నిముషంలో దక్కకపోతే మనకా యోగం లేదులే అని సరిపెట్టుకుంటాం.

    అలాగే క్షేమం అంటే మన దగ్గర ఉన్నది మనకు దూరమైపోకుండా, ఎవరూ దోచుకోకుండా భద్రంగా మన దగ్గరే ఉండటం. ఎవరైనా దూర ప్రయాణానికి బయలుదేరుతుంటే "క్షేమంగా వెళ్ళి లాభంగా రండి" అంటాం. అంటే నీ దగ్గర ఉన్న ధనాన్ని కానీ, ఆభరణాలను కానీ, లేదా నీ కాళ్ళు చేతులు లాంటి అవయవాలను కానీ ఏమీ పోగొట్టుకోకుండా(క్షేమంగా) వెళ్ళి వీలైతే అనుకున్న పని పూర్తిచేసుకునో, లేదా ఉన్నదానికంటే మరింత సంపాదించో(లాభంగా) తిరిగి రమ్మని కోరుకుంటాం. ఇలా ఈ యోగక్షేమాలు రెండూ వేరువేరు అర్థాలు కల పదాలు.

      అయితే మొన్న శ్రీ కాళీ వనాశ్రమ భాగ్యనగర శాఖలో జరిగిన సత్సంగాలలో శ్రీ మాతాజీ వారు పై గీతా శ్లోకాన్ని ప్రస్తావిస్తూ యోగక్షేమాలు రెండు కదా! మరి భగవానుడు ద్వివచన పదమైన యోగక్షేమౌ అనకుండా ఏకవచన పదమైన యోగక్షేమం అని ఎందుకు అన్నాడు? అని ప్రశ్నిస్తూ దానికి సమాధానంగా ఆయన ప్రసాదించేది క్షేమంతో కూడిన యోగం. అది ఒకటే కానీ రెండు కాదు అన్నారు. దీనిమీద కొంచెం లోతుగా విచారిస్తే మనకు విషయం అర్థం అవుతుంది.

    అంతవరకు మనది కానిది కొత్తగా మనకు లభించడం యోగం అని చెప్పుకున్నాం కదా. అయితే లోకంలో కొత్తగా వచ్చేవన్నీ ఎప్పుడో ఒకప్పటికి పోతాయి అని మనం చూస్తూనే ఉంటాం. మన కళ్ళముందే ఎందరో ఉన్నట్టుండి ధనవంతులుగా మారడం, మరికొంత కాలానికి ఆ వచ్చిన ధనాన్ని నిలబెట్టుకోలేక మళ్ళీ బికారులుగా మారడం మనకు తెలుసు. అలాగే మనం చిన్నప్పుడు చదువుకున్న చదువులో ఎంతవరకు మనకు గుర్తుంది? ఎప్పటికప్పుడు పునశ్చరణ చేసుకోకపోతే అది మన స్మృతిపథంనుండి దూరమైపోతుంది.

    అంతెందుకు ఒకప్పుడు లేకుండా ఫలానా తేదీన పుట్టిన మనందరం మరో తేదీన లేకుండా పోతాం కదా! కాబట్టి కొత్తగా మనకు వచ్చేదేదీ శాశ్వతంగా మనతో ఉండదని అర్థం అవుతోంది. అందుకే ఈ ప్రాపంచిక విషయాలన్నింటిలో యోగక్షేమాలు రెండూ వేరు వేరే. యోగంతో వచ్చినది క్షేమంగా ఉంటుందని నమ్మకం లేదు. మరి క్షేమంతో కూడిన యోగం అంటే ఏమిటి? ఎప్పటికీ మననుంచి దూరమైపోకుండా ఉండేది ఏది? అంటే అది సనాతనంగా మనదై ఉన్న మన నిజస్థితి మాత్రమే. అది ఈ శరీరానికో మనస్సుకో పరిమితమైనది కాదు. అది సర్వవ్యాపకమైన ఆత్మతత్త్వం. అదే మన నిజతత్త్వం. 

న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః ।
యద్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ ॥ భ. గీ. 15-6

    "ఎక్కడైతే సూర్యచంద్రుల ప్రకాశం, అగ్నిదేవుని ప్రకాశం కూడా వెలవెలబోతుందో, ఏ పదాన్ని పొందిన తరువాత ఇక తిరిగి రావడం ఉండదో అదే నాయొక్క పరమపదం" అని పరమాత్మ చెబుతున్నాడు. అదే మన నిజస్థితి. మనం మన ఇల్లు దాటి బయట ఎక్కడికైనా వెళ్ళాము అంటే తిరిగి వచ్చేస్తామనే అర్థం కదా. అలాగే ఒక చోట ఏ సత్సంగానికో, పూజకో, లేక సినిమాకో ఒక వందమంది వచ్చారంటే అది అయిపోగానే అందరూ తిరిగి వాళ్ళ వాళ్ళ స్వస్థలానికి వెళ్ళిపోతారు కదా! అసలు మన సొంతం అనుకున్న ఇల్లే ఎన్నాళ్ళు మనతో ఉంటుందో తెలియదు. ఒకవేళ అది ఉన్నా అందులో మనం ఉండటానికి ఎన్నాళ్ళు ఈ దేహంలో ప్రాణం ఉంటుందో తెలియదు.

    ఒక్కసారి ప్రాణం పోగానే ముందు మన దేహాన్ని ఇంటి బయట పెట్టేస్తారు. కాబట్టి సృష్టిలో మనకు కనిపించే ప్రతీదీ వచ్చిపోయేదే. మరి ఒకసారి వస్తే మళ్ళీ పోని ఆ యోగక్షేమం ఏమిటి? అదే జ్ఞానం. మనం జ్ఞాన స్వరూపులమే అయి ఉన్నాం. అయితే నిప్పుని పొగ క్రమ్మినట్లు మన జ్ఞానాన్ని అజ్ఞానమనే పొర కప్పివేస్తోంది. వయసు పెరుగుతున్నకొద్దీ మన కళ్ళకు పొరలు క్రమ్మి క్రమంగా మన చూపు మందగిస్తుంది కదా. ఒకసారి నేత్రవైద్యుడు ఆ పొరను తొలగిస్తే ఇక అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే జన్మజన్మల నుండి మన జ్ఞాననేత్రాన్ని కప్పి ఉంచిన అజ్ఞాన పొరను గురుదేవులు తొలగిస్తే ఇక మళ్ళీ ఆ పొర క్రమ్ముకోదు. ఒకసారి జ్ఞానాన్ని పొందినవాడు మళ్ళీ అజ్ఞాని కాలేడు. ఇదే నిజమైన యోగక్షేమం.

    ఈ విషయాన్నే వివరిస్తూ శ్రీగురుదేవులు కొన్ని ఉదాహరణలు చెప్పేవారు. ఒకసారి తెల్లబడిన జుట్టు మళ్ళీ నల్లబడదు కదా! జుట్టులోని అసలు రంగు తెలుపే. దానిపైన నలుపు ఆవరించింది. ఒకసారి ఆ నలుపు పొర తొలగిపోతే మళ్ళీ రాదు. అలాగే ఒకసారి పండిన పండు మళ్ళీ పచ్చిగా మారలేదు. విత్తనం పచ్చిగా ఉన్నంతవరకూ దానిలో మొలకెత్తే లక్షణం ఉంటుంది. అది మళ్ళీ మళ్ళీ అనేక వృక్షాలుగా విస్తరిస్తుంది. అదే విత్తనం ఒకసారి కాలిపోతే ఇక మళ్ళీ మొలకెత్తే అవకాశమే లేదు. అలా జ్ఞానాగ్నిలో మన కర్మబీజాలు, వాసనాబీజాలు అన్నీ కాలిపోతే ఇక మళ్ళీ మనం అజ్ఞానంలో పడి తిరిగి జన్మనెత్తవలసిన అవసరం లేదు.

    అజ్ఞానంలో ఉన్నవాడి జన్మలు వాడి ఇష్టానుసారం రావు. వాడి కర్మలను అనుభవించడానికి వీలైన శరీరమే వాడికి లభిస్తుంది. వాడు ఆ జన్మకు బద్ధుడై ఉంటాడు. అదే జ్ఞాని అయినవానికి ఈ బంధనం లేదు. జన్మ ఎత్తవలసిన అవసరం లేకపోయినా భగవదాజ్ఞను అనుసరించి లోకోపకృతికి ఒకవేళ అతను జన్మించినా అది బంధనం కాదు. పైగా ఇతరులకు కూడా మోక్షదాయకం అవుతుంది. గోతిలో పడ్డ వాడికి, వాడిని పైకి లాగటం కోసం ఆ గోతిలోనే దిగిన వానికి ఎంత తేడా ఉందో వీరిద్దరి జన్మలకు అంత తేడా ఉంది. ఒకరిది జన్మ, మరొకరిది అవతారం. అవతారం అంటే క్రిందకు దిగడం. ఇది జారి పడిపోవడం కాదు. ఇతరులను పైకి లాగడానికి తనంత తానుగా క్రిందకు దిగడం. శరీరం క్రింద ఉన్నా తాను మాత్రం ఎప్పుడూ అత్యున్నతమైన తన నిజస్థితిలోనే ఉంటాడు.

    అటువంటి నిజమైన యోగక్షేమాన్ని పొందాలంటే భగవానుడు చెప్పినట్లుగా ఇతర చింతనలు మాని నిత్య భగవన్నామ స్మరణలో, ఉపాసనలో, ధ్యానంలో, విచారణలో మన మనస్సుని ఊరబెట్టాలి. ఒక్కసారి అటువంటి బ్రాహ్మీస్థితిని పొందామంటే ఇక మన మనస్సు ఎటువంటి ప్రాపంచిక వ్యామోహలకు లోనుకాదు. 

ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి |
స్థిత్వా స్యామంతకాలేஉపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి || భ. గీ. 2-72

12, మే 2025, సోమవారం

వైశాఖ పూర్ణిమ

        

    పూర్ణిమ నాడు చంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉంటే దానిని వైశాఖమాసం అంటారు. శాఖలు అంటే చెట్టు కొమ్మలు అని మనకు తెలుసు కదా. మరి విశాఖ అంటే కొమ్మలు లేని చెట్టు. అసలు ఏమిటీ చెట్టు అంటే భగవద్గీతలో స్వామి చెప్పాడు.

 
ఊర్ధ్వమూలమధః శాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ ।
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ।।



    సంసారమనే అశ్వత్థ వృక్షానికి మూలం పైన ఉంటుందిట కొమ్మలు క్రిందకి విస్తరించి ఉంటాయిట. దీని గురించి కొంచెం ఆలోచిస్తే అసలు సంసారానికి మూలం నువ్వే. 'నేను' అంటూ ఉన్నప్పుడే 'నాది' అనే ఈ సంసారం అంతా ఉంటోంది. నేనే లేకపోతే సంసారం ఎక్కడిది? అయితే అసలు 'నేను' అయిన ఆత్మను వదిలివేసి మనం ఈ శరీరమే నేను అనుకుంటున్నాం. ఇక ఈ శరీరానికి సంబంధించిన వస్తువులు, వ్యక్తుల మీదకి మన ఆలోచనలు శాఖోపశాఖలుగా విస్తరించి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే సంసారం మనని బంధిస్తోంది.


    మనం ఎప్పుడైతే క్రిందికి (ప్రపంచం వైపుకి) చూడడం మానేసి పైన ఉన్న మూలాన్ని పట్టుకుంటామో అప్పుడు ఈ శాఖలన్నీ వాటంతట అవే రాలిపోతాయి. అయితే దీనికి ఏకాగ్ర బుద్ధి అవసరం. అదే భగవద్గీతలో స్వామి చెబుతూ


వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన |
బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయోஉ వ్యవసాయినామ్ ||



    నీ కృషి ద్వారా ఆధ్యాత్మిక సాధన ద్వారా బుద్ధిని ఆత్మయందు ఏకాగ్రం చెయ్యి అర్జునా! సాధన లేని బుద్ధి అనేక శాఖలుగా విస్తరించి అనంతంగా ప్రపంచంలో వ్యాపిస్తుంది అని చెబుతున్నాడు. మనకు నిరంతరం మనస్సులో అనేక సంకల్పాలు వస్తూనే ఉంటాయి కదా! అయితే ఆ సంకల్పించిన పని మంచిదా, కాదా? ఇది చేయవచ్చా, చేయకూడదా? అని విచారించి నిర్ణయించేది బుద్ధి. ఎప్పుడైతే ఈ బుద్ధిని మూలపదార్థమైన ఆత్మయందు నిలుపుతామో అప్పుడది ఈ అనిత్యమైన ప్రాపంచిక విషయాలను దానంతటదే వదిలివేస్తుంది. జీవితంలో ప్రతి అడుగులోనూ సరైన నిర్ణయాలు తీసుకొని మనను ఆధ్యాత్మిక పథంలో నడిపిస్తుంది. నిజమైన వైరాగ్యం అంటే ఇదే కదా. అందుకే స్వామి ఈ సంసార వృక్షాన్ని 'అసంగ శస్త్రేణ దృఢేన ఛిత్వా' దృఢమైన వైరాగ్యమనే ఆయుధంతో నరకాలని సూచిస్తున్నారు.


    పరమేశ్వరుని నామాలలో 'ఓం స్థాణవే నమః' అనే నామం ఒకటి. స్థాణువు అంటే ఏ కొమ్మలూ లేని చెట్టు మొదలు. బుద్ధి ప్రపంచంలోకి శాఖోపశాఖలుగా విస్తరించకుండా నిరంతరం తనలో తాను రమిస్తూ సమాధి స్థితిలో ఉంటాడు కాబట్టి ఆయన స్థాణువు. ఈ వృక్షానికి కొమ్మలు లేకపోవడం అనే గుణమే 'విశాఖ'. అది కుమారస్వామి నామం. కొమ్మలే లేకపోతే ఇక ఆకులు ఎక్కడినుంచి వస్తాయి. అలా ఆకులు లేకపోవడం అనే గుణమే 'అపర్ణ'. ఇది పార్వతీదేవి నామం కదా! ఇలా బుద్ధి ప్రపంచంలోకి విస్తరించకుండా ఆత్మయందు లగ్నమయినప్పుడు ఆ ఆత్మ సర్వవ్యాపకమయినది కనుక 'నీవు చూచునదెల్ల నీవే' అనే విశ్వవ్యాపక అనుభూతి కలుగుతుంది. అదే 'విష్ణు'. ఇది గణేశుని నామం. ఇలా సంసారంలోనే ఉంటూ దేనికీ అంటకుండా నిరంతర ఆత్మానందాన్ని ఎలా అనుభవించవచ్చో ఆది కుటుంబమైన పరమేశ్వరుని కుటుంబం మనకు సూచిస్తోంది.


    అలాగే మనోసంసారాన్ని విడిచిపెట్టి ఏకాగ్రబుద్ధితో సాధన చేస్తే ఈ సంసార వృక్షమే బోధివృక్షమై నీలో జ్ఞాన ప్రబోధం కలుగుతుందని నిరూపించిన బుద్ధభగవానుని జయంతి కూడా ఈ వైశాఖ పూర్ణిమ రోజనే. శత్రువు జాడ పొడసూపగానే తాబేలు తన ఇంద్రియాలను లోపలికి లాక్కొని ఎలా రాయిలా మారిపోతుందో ప్రజ్ఞావంతుడయిన మానవుడు తన ఇంద్రియాలను అలా విషయాలనుండి లోపలికి లాక్కొని తనను తాను రక్షించుకోవాలని గీతలో స్వామి చెబుతాడు. అటువంటి కూర్మావతారం వచ్చినది కూడా ఈరోజే. అలాగే సంసారంలో ఉన్న మానవుడు ఎలా భక్తి జ్ఞాన వైరాగ్యములను పెంపొందించుకొని ఆత్మానంద ఫలాన్ని అందుకోవాలో మనందరికీ ప్రత్యక్షంగా నిరూపిస్తూ శృంగార, భక్తి, జ్ఞాన, వైరాగ్య పూరితమైన 32 వేల సంకీర్తనలు తెలుగువారి ఇలవేలుపైన ఆ వేంకటేశ్వరునిపై రచించిన అన్నమాచార్యుల వారి జయంతి కూడా ఈరోజే.


    కాబట్టి ఈ వైశాఖ పూర్ణిమ మనందరికీ అటువంటి వైరాగ్యాన్ని, ఏకాగ్ర బుద్ధిని ప్రసాదించి మన సాధనను పురోగమింపజేయాలని శ్రీ సద్గురుమూర్తిని ప్రార్థిద్దాం.


4, మే 2025, ఆదివారం

విమర్శ



    అశేష జీవరాశులలో భగవంతుడు మానవునికి మాత్రమే ఇచ్చిన వరం బుద్ధి. ఏది మంచి, ఏది చెడు అని విచారణ చేసి మంచిని ఎంచుకొనే శక్తి ఈ బుద్ధికి మాత్రమే ఉంది. ఈ విచారణనే విమర్శ అని కూడా అంటారు. శ్రీ బాబూజీ మహరాజ్ వారు 'మీరు ప్రతిరోజూ రాత్రి పడుకొనే ముందు ఆ రోజు మీరు చేసిన పనులను, ఆలోచనలను ఒకసారి పునరావలోకనం చేసుకొని ఆయా పనులు, లేక ఆలోచనలు ఎంతవరకు మీ సాధనకు ఉపయోగ పడుతున్నాయి? అందులో ఏవేవి మిమ్మల్ని అధోగతి పాలు చేస్తున్నాయి? అని ఆత్మవిమర్శ చేసుకోవటం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి' అని చెప్పేవారు.  ఇటువంటి ఆత్మవిమర్శ వలన ఎప్పటికప్పుడు మనం ప్రయాణించే మార్గం సరియైనదో కాదో మనకు అంచనా వస్తుంది. చెడు మార్గంలో ఎక్కువ దూరం ప్రయాణం చేసేలోగానే మార్గాన్ని మరల్చుకొని తిరిగి మంచి మార్గానికి రావడానికి అవకాశం ఏర్పడుతుంది.

    అయితే మనలో ఎంతమంది ఇలా ఆత్మవిమర్శ చేసుకుంటున్నాం? మన జీవితంలో ఎక్కువ భాగం ఇతరులు చేసే పనులలో మంచిచెడులను ఎంచి వారిని విమర్శించడానికే సరిపోతోంది. ఒకవేళ మన తప్పులను అంతరాత్మ ఎత్తి చూపినా, ఆ తప్పు చేయడానికి ఏదో బలవత్తర కారణం ఉందని మనకు మనం సర్ది చెప్పుకొని మన తప్పులని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంకా మనం చేసే చిన్న చిన్న మంచి పనులను కూడా భూతద్దంలో చూపిస్తూ అందరూ గుర్తించాలని తాపత్రయ పడతాం. ఆత్మస్తుతి, పరనింద ఈ రెండూ మహాపాపాలని మన ఆర్ష ధర్మం బోధిస్తోంది.

    అయితే గురుదేవుల బోధలతో మనం మంచి మార్గంలోకి మారినా, మన చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోదు కదా! మనం ఏమి చేసినా అందులో ఏదో ఒక లోపాన్ని పసిగట్టి మనలను విమర్శించేవారు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. అలా మనకు విమర్శ ఎదురైనప్పుడు మన మనస్సు తోక త్రొక్కిన త్రాచు లాగా సర్రున లేస్తుంది. అయితే ఇక్కడే మన వివేకాన్ని ఉపయోగించుకొని కొద్దిగా నిదానించాలి. 'వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనె వేగపడక వివరింప దగున్, కని కల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ'

    ఎవరైనా ఒక మాట అనగానే వెంటనే ఆవేశపడిపోకుండా ఒక్క క్షణం ఆగి వారి మాటలలో నిజానిజాలు తరచి చూసుకోవాలి. ఎందుకంటే ఎంతటి అనుభవజ్ఞుడయినా, తాను చేసే పనిలో ఎంతటి కౌశల్యం సంపాదించినా ఎక్కడో ఒకచోట ఏదో ఒక లోపం ఉండకపోదు. 'సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్ని రివావృతాః' - అగ్ని చుట్టూ ఎప్పుడూ పొగ ఆవరించుకొని ఉన్నట్లే మనం చేసే అన్ని పనులూ ఏదో ఒక దోషంతో ఆవరించుకొని ఉంటాయని సాక్షాత్తూ గీతాచార్యుడే సెలవిచ్చాడు కదా! కాబట్టి మనం ఒక్క క్షణం ఆగి ఎదుటివారి విమర్శలో ఎంతవరకు నిజం ఉన్నదని మనం చేసిన పనినో, మన వ్యక్తిత్వాన్నో ఆత్మవిమర్శ చేసుకొని నిజంగానే అందులో దోషం ఉంటే దానిని సరిచేసుకొనే ప్రయత్నం చేయాలి.

    'అపరాధముల నెంచువారు మాకు ఉపకారులై ఉన్నారు' అన్నారు శ్రీరామదాసు వారు. ఎందుకంటే విమర్శ అనేది మనకు రెండు రకాలుగానూ ఉపకారమే చేస్తుంది. ఒకవేళ వారి విమర్శలో నిజం ఉంటే అది మన తప్పులను మనం తెలుసుకొని సరిదిద్దుకోవడానికి, తద్వారా  ఉన్నత స్థితికి చేరడానికి ఉపయోగపడుతుంది. అదే ఆ విమర్శలో నిజం లేకుండా కేవలం మనను నొప్పించడానికో, కించపరచడానికో చేసినట్లయితే కూడా మనం దానిని సద్బుద్ధితో స్వీకరిస్తే అది మన దుష్కర్మలను కొంతవరకు రహితం చేస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా శారీరకంగా కానీ మానసికంగా కానీ కష్టాన్ని అనుభవిస్తున్నామంటే ఆ విధంగా మన పాపకర్మల భారాన్ని తగ్గించుకుంటున్నామని గుర్తు పెట్టుకోవాలి. అలాగే మనం అనుభవించే సుఖలన్నీ మన సత్కర్మల పుణ్యాన్ని హరించివేస్తుంటాయి.

        ఇలా రెండు రకాలుగా మనకు మంచే చేస్తుంది కాబట్టే విమర్శ మనకు ఎంతో అవసరం. అందుకే జగన్మాత 'విమర్శరూపిణీ'. కాబట్టి విమర్శ చేసేవారిని వ్యక్తిగా చూడకుండా ఈ రూపంలో జగన్మాత మనను మంచిదారిలో పెడుతోందనో, లేక మన దుష్కర్మలను హరిస్తోందనో భావించి విమర్శను ఆనందంగా స్వీకరించడం నేర్చుకోవాలి. అలా స్వీకరించాలంటే ముందు మనం చేసే పనులు, మనమూ ఒకటి కాదని బాగా గుర్తు పెట్టుకోవాలి. ఎవరైనా మన పనిని విమర్శించారంటే అది మనను కాదని గ్రహించి ఆ పనిలో ఉన్న లోపాన్ని సరిదిద్దుకుంటే ఇంకా ఉన్నతంగా పని చేయగలుగుతాం. అసలు ముందు మనం ఆ పని ఎందుకు చేస్తున్నామో అన్న విషయాన్ని సదా గుర్తు పెట్టుకొని ఈ విమర్శ ఆ ప్రయోజనంలో ఒక మెట్టు అని గ్రహించాలి. మనమీద వేసే రాళ్ళతోనే మనం మెట్లు కట్టుకొని ఇంకా ఇంకా పైకెదగాలి. 

        అలా కాకుండా ఎప్పుడైతే మనం అవతలి వారిని మన మిత్రులుగానో, శత్రువులుగానో, మనకంటే పెద్దవారిగానో, చిన్నవారిగానో చూస్తున్నామో అప్పుడే మనం వారి విమర్శను గ్రహించే విధానంలో లోపం వస్తుంది. అసలు ముందు మనలో ఏదో తప్పు చేశామన్న అపరాధ భావం ఉంటే ఇక ఎవరు మనవైపు చూసినా, వారిలో వారు మాట్లాడుకుంటున్నా వారు మననే విమర్శిస్తున్నారని, మన గురించే చెడుగా మాట్లాడుకుంటున్నారని మనలో స్థిరమైన అభిప్రాయం ఏర్పడిపోతుంది. అందుకని ముందు ఆత్మవిమర్శ చేసుకొని, మన అపరాధాలను సరిదిద్దుకొని, ప్రతి విమర్శలోనూ వ్యక్తిని చూడటం మానేసి జగన్మాతను చూడటం నేర్చుకొంటే ఇక ఆ మనసుకు సదా శాంతే కదా!

30, మార్చి 2025, ఆదివారం

విశ్వావసు


    శ్రీ క్రోధి నామ సంవత్సరానికి వీడ్కోలు పలికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. సుందరకాండ మొదటి సర్గలో హనుమంతుడు సముద్రాన్ని దాటుతున్నప్పుడు ఆకాశం ఎలా ఉందో వర్ణిస్తూ వాల్మీకి మహర్షి 'ఈ ఆకాశం విశ్వావసుడనే గంధర్వునికి నివాస స్థాన'మని చెబుతాడు. విశ్వంలోని సమస్త జీవులకు వాటివాటికి తగ్గట్లుగా ఆవాసాలను(నివాసాలను) ఏర్పాటు చేసే బాధ్యత ఈ విశ్వావసునిది. సృష్టిలోని ప్రాణులన్నీ కూడా తమ తమ నివాసాలను స్వయంగా నిర్మించుకోవడమో, లేదా కొండగుహలు, చెట్టు తొర్రలు వంటి స్వతస్సిద్ధంగా ఏర్పడిన మరుగు ప్రదేశాలను తమ నివాసాలుగా మార్చుకోవడమో చూస్తూ ఉంటాం.

    పక్షులయితే ఈ ఇల్లు కట్టుకొనే విద్యలో బహు నేర్పరులు. ఎక్కడెక్కడి పుల్లలను, గడ్డి పరకలను సేకరించి తమ పిల్లలకు సౌకర్యవంతంగానూ సురక్షితంగానూ ఉండేలా తమ గూడును ఏర్పరచుకుంటాయి. గిజిగాని గూడు గురించి మనందరం చిన్నప్పుడు చదువుకున్నాం కదా! కొన్ని పక్షులయితే తాము లోపలికి వెళ్ళడానికి ఒక రహస్య ద్వారాన్ని నిర్మించి, పాములవంటి శత్రువులను మోసం చేయడానికి మాయా ద్వారాన్ని కూడా నిర్మిస్తాయి. మనిషికి కూడా తప్పనిసరిగా కావలసిన వాటిగా కూడు, గూడు, గుడ్డ ఈ మూడింటినీ చెబుతారు కదా! అవి లేనివారికి ప్రభుత్వాలు వాటిని అందిస్తూ దానికి తమ నాయకుల పేర్లో, తల్లిదండ్రుల పేర్లో పెడుతూ ఉంటాయి. ఒకప్పుడు మనుషులు అందరూ కూడా తమ నివాసానికి కావలసినట్లుగా పర్ణశాలలను తామే నిర్మించుకొనేవారు. వనవాస కాలంలో శ్రీరాముడు, అలాగే పాండవులు కూడా తమ నివాసాలను నిర్మించుకోవడం మనం చూస్తాం.

    అయితే క్రమేపీ అవసరాలు వెనుకబడి, ఆశలకు పెద్దపీట వేయడం, అవసరానికి మించి సంపాదించి తరతరాలకు దాచుకోవడం మొదలుపెట్టడంతో పెద్దపెద్ద ఇళ్ళు కట్టుకోవడం మొదలుపెట్టి మనిషి ఆ ఇంటి నిర్మాణానికి వేరొకరిమీద ఆధారపడవలసి వస్తోంది. ఎంత సంపాదించినా, కూడబెట్టినా, ఎంత పెద్ద రాజభవనాన్ని నిర్మించుకొన్నా చివరికి వట్టి చేతులతో మట్టిపాలు కావలసిందే. 'ఈ భూమికి నేను యజమానిని' అని విర్రవీగే వానిని చూసి భూమి నవ్వుకుంటుందిట 'నీలాంటి వారిని ఎంతమందిని నాలో కలిపేసుకున్నానో! ఇదే భూమికి నేను యజమానినని ఇప్పటికి ఎంతమంది విర్రవీగి చివరికి నాలో కలిసిపోయారో' అని.

    అయితే మనకు నిజమైన నివాసం ఏది? అని ఆలోచిస్తే 'ఈశావాస్యమిదగ్గ్ సర్వం' అని ఉపనిషత్తు చెబుతోంది. ఈ జగత్తు అంతా ఈశ్వరునికి ఆవాసమై ఉన్నది. మరి జగత్తుకి ఆవాసం ఏది? అంటే అది ఈశ్వరుడే. ఎందుకంటే జగత్తు ఈశ్వరునికి భిన్నంగా లేదు. సముద్రంలో అనేక కెరటాలు పుట్టి, కొంతదూరం ప్రయాణించి మళ్ళీ అందులోనే లీనమైపోతూ ఉంటాయి. కెరటంగా కనిపించినంత సేపూ అందులో ఉండే నీటికి ఆ కెరటం ఆధారమైనట్లుగా మనకు తోస్తుంది. కానీ ఆ కెరటానికి ఆధారం కూడా విశాలమైన సముద్రమే కదా! నిజానికి సముద్రం లేకుండా కెరటానికి ఉనికి లేదు. కెరటం తయారైంది కూడా ఆ సముద్రపు నీటితోనే. కొంతసేపు అది సముద్రానికి వేరుగా ఉన్నట్లుగా భ్రమింపజేస్తూ చివరికి తన స్వస్వరూపంలో లయం అయిపోతోంది. 

    అలాగే పరమాత్మ తనలోనుండే పంచభూతాలను సృష్టించి వాటితో ఈ సమస్త ప్రాణులను తయారు చేశాడు. కుమ్మరి తనకంటే వేరుగానున్న మట్టిని తీసుకొని దానితో కుండలు చేసినట్లుగా పరమాత్మ సృష్టి చేయాలంటే తనకన్నా వెరైనది ఏదీ లేనేలేదు కదా! కాబట్టి విశ్వానికంతటికీ నిజమైన ఆవాసం పరమాత్మ. అదే పరమాత్మ విశ్వంలోని ప్రాణులన్నింటి దేహాలను తన ఆవాసాలుగా చేసుకొని వాటిని ప్రకాశింపజేస్తున్నాడు. ఈ సత్యాన్ని గుర్తెరిగి మన పాంచభౌతిక దేహాలను ఆ పరమాత్మ నివాసానికి యోగ్యమైన దేవాలయాలుగా స్వచ్ఛంగా, నిర్మలంగా మలచుకొని నిజమైన శాంతిని, ఆనందాన్ని పొందేందుకు ప్రయత్నిద్దాం.

17, ఫిబ్రవరి 2025, సోమవారం

శ్రీ కాళీవనాశ్రమం


అప్రత్యక్షో మహాదేవః సర్వేషాం ఆత్మమాయయా
ప్రత్యక్షో గురు రూపేణ వర్తే భక్తి సిద్ధయే

    భౌతికంగా మన కంటికి కనిపించని మహాదేవుడు తన భక్తుల భక్తిని సిద్ధింపజేయడానికి గురు రూపంలో ప్రత్యక్షమవుతాడని మన సనాతన ధర్మం బోధిస్తోంది. మన పవిత్ర భారతావనిలో యుగయుగాలుగా శ్రీ దక్షిణామూర్తి, దత్తాత్రేయులు, వశిష్ఠులు, వేదవ్యాసులు, శుకమహర్షి వంటి ఎందరో గురువులు అవతరించి మానవాళికి భగవంతుని చేరుకునే సులభమైన మార్గాన్ని ఉపదేశించి, మానవ జీవిత చరమ లక్ష్యమైన ముక్తిని పొందింపజేశారు. ఇక ఈ ఆధునిక కాలంలో కూడా శ్రీ ఆది శంకరాచార్యులు, రామానుజులు, వీరబ్రహ్మేంద్రస్వామి, రాఘవేంద్రస్వామి, రామకృష్ణ పరమహంస, వివేకానందులు, భగవాన్ రమణమహర్షి, శిరిడీ సాయిబాబా, మలయాళస్వామి వంటి ఎందరో సద్గురువులు ఈ గడ్డపై అవతరించారు. అందుకే మన భారతదేశం ‘రత్నగర్భ’ అని కీర్తింపబడింది. వారి కోవకు చెందినవారే సమర్థ సద్గురు శ్రీ శ్రీ శ్రీ హనుమత్కాళీ వరప్రసాద బాబూజీ మహరాజ్.

    శ్రీ బాబూజీ ఎక్కడ, ఎవరికి, ఎప్పుడు అవతరించారో ఎవరికీ తెలియదు. పసిప్రాయంలోనే కఠోర ఆధ్యాత్మిక సాధన చేసి సిద్ధిని పొందారు. సుమారు 1930 ప్రాంతాలలో ఉభయ గోదావరి జిల్లాలలోని ఉప్పాడ, యనమదుర్రు, భీమవరం, గుండుగొలను, అలాగే గుంటూరు ప్రాంతంలో కూడా తమకు తాముగా భక్తులకు ప్రకటితమై, వారి వారి ఇండ్లకు తరచుగా వస్తూ, వారి సమస్యలను తీరుస్తూ, వారిలో ఆధ్యాత్మిక భావనలను నెలకొల్పారు. ఆ కాలంలో ఆచరణలో ఉన్న కులభేదాలు, అంటరానితనం వంటి దురాచారాలను, మతం పేరిట ప్రబలంగా ఉన్న అనేక మూఢనమ్మకాలను రూపుమాపటానికి విశేష కృషి చేశారు. సత్యం, శాంతి, దయ, ప్రేమలే తమ ఆధ్యాత్మిక బోధనలకు మూలస్తంభాలుగా చేసుకొని, మానవునికి మానవునికి మధ్య గల భేదబుద్ధిని తొలగించి పరస్పర ప్రేమను సమభావనను నెలకొల్పారు.

    అణిమాది అష్టసిద్ధులు తమ సొంతమైనా ఏనాడూ వాటిని తమ స్వార్థంకోసం కానీ, పేరుప్రతిష్టల కోసం ఉపయోగించక కేవలం ఆర్తులను, ఆపదలో ఉన్నవారిని ఉద్ధరించడానికి మాత్రమే ఉపయోగించేవారు. అలా వారివలన ఆపదలనుండి రక్షణ పొందినవారు, వైద్యులచే మరణించారని నిర్ధారణ జరిగిన తరువాత తిరిగి బ్రతికినవారు ఎందరో ఉన్నారు. వారికి ప్రచారం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ‘నేను ఆధ్యాత్మిక గురువును కాబట్టి మీ సాంసారిక సమస్యలతో నాకు సంబంధం లేదు’ అని వారు ఎన్నడూ అనలేదు. వారు బోధించే శుద్ధ అద్వైత తత్వం బోధపడాలంటే ముందు ఆ మానవుడి కడుపు నిండాలి, అతనిని అశాంతికి గురి చేస్తున్న సమస్యలు తీరాలి అని వారు బలంగా విశ్వసించారు. అందుకే ముందుగా వారి సమస్యలకు తగిన పరిష్కారం చూపి, ఆ తరువాత మెల్లగా వారిని ఆధ్యాత్మికత వైపుకు మరలించేవారు.

    ఒక్కసారి శ్రీ బాబూజీని ఆశ్రయించి వారి వాత్సల్యాన్ని చవిచూసినవారు కుటుంబ సమేతంగా, తరతరాలుగా వారిని విడువక ముక్తిమార్గంలో పయనం కొనసాగించారు. అలా శ్రీ బాబూజీ శిష్యులందరూ మనోపరివర్తన చెంది కులమతాలకతీతంగా అందరూ ఒకే కుటుంబంగా మెలగుతున్న సమయంలో వివిధ ప్రాంతాలలో ఉన్న తామందరము ఒకే చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని ఉంటే అది తమ ఆధ్యాత్మిక పురోగతికి ఎంతగానో తోడ్పడుతుందని గాఢంగా విశ్వసించి మరీమరీ ప్రార్థించిన మీదట 1972 మే 31న శ్రీ కాళీవనాశ్రమం(శ్రీ కాళీ గార్డెన్స్) గుంటూరు విజయవాడ జాతీయ రహదారి ప్రక్కన, నంబూరు రైల్వేస్టేషనుకు ఎదురుగా ఏర్పడింది.

    భక్తులందరూ గృహస్థాశ్రమాన్ని అవలంబిస్తూ కుటుంబ సమేతంగా ఇక్కడ జీవించడం ఈ ఆశ్రమం ప్రత్యేకత. సన్యాసాశ్రమం బహు కష్టతరమైనదని, గృహస్తుగా ఉంటూనే గురువులు చూపిన మార్గంలో సాధన చేస్తే తప్పక తరించవచ్చుననేది శ్రీ బాబూజీ సిద్ధాంతం. శ్రీ బాబూజీ హస్తాలలో స్వయంభువుగా వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి, దక్షిణేశ్వరంలో శ్రీ రామకృష్ణ పరమహంస వారిచే పూజలందిన మూర్తిని పోలియున్న శ్రీ కాళికాపరమేశ్వరి ఆలయాలు, శ్రీ కోదండరామ, రాధాకృష్ణ ఆలయాలు ఈ ఆశ్రమంలో దర్శించవచ్చు.

    విశ్వశాంతికై మూడు యాగాలను కూడా శ్రీ బాబూజీ ఇక్కడ నిర్వహించారు. ఆశ్రమ పరిసర గ్రామాలైన పెదకాకాని, నంబూరు, కొప్పురావూరు, కంతేరు, కాజ మొదలైన గ్రామలలోని ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయటానికై పాఠశాలను, వైద్యశాలను కూడా నిర్మించారు. ఇవి రెండూ అతి తక్కువ ఖర్చుతో, అర్హులైనవారికి ఉచితంగా విద్య వైద్య సదుపాయాలను అందిస్తున్నాయి. ఇలా మానవాళికి భౌతిక, ఆధ్యాత్మిక సేవలు అందించడానికి ఒక మహత్తర సంస్థను ఏర్పరచి శ్రీ బాబూజీ 1988 డిశెంబర్ 3వ తేదీన తమ అవతారాన్ని చాలించారు. వారి మహాసమాధి శ్రీ బృందావనంగా ప్రఖ్యాతిగాంచి ఆశ్రమంలో ప్రముఖ దర్శనీయ క్షేత్రం అయ్యింది.

    అనంతరం శ్రీ బాబూజీ ప్రియశిష్యులైన యోగినీ శ్రీ చంద్ర కాళీప్రసాద మాతాజీ ఆశ్రమ బాధ్యతలను చేబట్టి గురుదేవుల బోధలను దేశదేశాంతరాలలో ప్రచారం చేస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకు వెళుతున్నారు. ఆశ్రమానికి హైదరాబాదు, పెదనిండ్రకొలను, గుండుగొలను, బెంగళూరు, భీమవరం తదితర ప్రాంతాలలో శాఖలను ఏర్పరచి, అనేక యజ్ఞయాగాదులను, ఉచిత ఆన్నదాన పథకాన్ని, వయోవృద్ధులకు ఆశ్రిత ఆశ్రయాన్ని నిర్వహిస్తున్నారు. ఆశ్రమంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి, మహాశివరాత్రి, ధనుర్మాసం, భోగి, సంక్రాంతి, కార్తీకమాసంలో వచ్చే శ్రీ బాబూజీ వారి ఆరాధనోత్సవాలు విశేషంగా జరుగుతాయి. గురుదేవుని సర్వదేవతా స్వరూపులుగా భావించి, ప్రతి పండుగకు, తమ జీవితాలలో జరిగే ప్రతి శుభాశుభ సంఘటనల సందర్భంగాను భక్తులు శ్రీ గురుపూజను నిర్వహిస్తారు.

    దసరా ఉత్సవాలలో పంచిపెట్టే మంత్రపూతమైన అక్షతలు, జగన్మాత పూజాకుంకుమ, భోగినాడు శ్రీగురుదేవులకు అభిషేకించి పంచిపెట్టే భోగిపళ్ళు, నాణేల కోసం విశేషంగా భక్తులు తరలివస్తారు. అలాగే శ్రీ రామలింగేశ్వరాలయంలో కులమతాలకతీతంగా భక్తులు గర్భాలయంలో ప్రవేశించి, స్వామిని తాకి స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. ఇంకొక విశేషం ఏమిటంటే ఆశ్రమంలోని ఆలయాలన్నింటిలో అనేకమంది స్త్రీలు అర్చకులుగా, సహాయకులుగా, పురోహితులుగా సేవలు అందిస్తూ ఉంటారు. ఇలా కుల, లింగ, వర్ణాశ్రమ భేదాలకతీతంగా సర్వులూ భగవత్సేవకు, ఆధ్యాత్మిక సాధనకు, ముక్తిని పొందటానికి అర్హులేనని నిరూపిస్తోంది శ్రీ కాళీవనాశ్రమం.

3, ఫిబ్రవరి 2025, సోమవారం

బాలకృష్ణుడు - బాబు

 

    సమర్థ సద్గురుదేవులు శ్రీశ్రీశ్రీ హనుమత్కాళీ వర ప్రసాద బాబూజీ మహరాజ్ వారు కొన్ని దశాబ్దాల పాటు సంచరించి, ఎందరో భక్తులను ఉద్ధరించి, తమ చరణధూళితో పవిత్ర క్షేత్రంగా మలచిన భీమవరంలో శ్రీ కాళీవనాశ్రమ శాఖను ఏర్పరచుకొని బృందావనం, ఇతర ఉపాలయాలు, అన్నదాన, వసతి భవనాలను నిర్మించుకొని ప్రారంభించుకొంటున్న సందర్భంగా శ్రీబాబు దివ్య లీలలను కొన్నింటిని గుర్తు చేసుకొందాం. శ్రీబాబుతో భీమవరంలో సన్నిహితంగా గడిపిన వారందరూ అనే మాట అప్పటి రోజులు శ్రీకృష్ణుడు బృందావనంలో గడిపిన రోజులలాంటివని. అందుకే శ్రీబాబును బాలకృష్ణుడితో పోల్చి ఆ ఆనందాన్ని అందుకోవాలనే ఈ చిన్ని ప్రయత్నం.

    కంసుని బాధల నుండి విముక్తి కొరకు భూదేవి, ఇతర దేవతలు ప్రార్థించగా నారాయణమూర్తి శ్రీకృష్ణావతారం ధరించాడు కదా! కంసుడు అంటే ఆత్మ సుఖానికి అడ్డుపడే పూర్వ వాసన అని అర్థం చెబుతారు. గొప్ప ఆధ్యాత్మిక సాధకులై భక్తి, జ్ఞాన, వైరాగ్యములు కలిగిన వారు, లేదా అటువంటి వారి కుటుంబంలోని వారు కూడా మోక్షఫలాన్ని అందుకోలేకుండా అడ్డుపడుతున్న కులమతాల అంతరాలు, అంటరానితనం, మూఢాచారాలు మొదలైన వాసనలను తొలగించి మోక్షమార్గాన్ని నిష్కంటకం చేయడానికి అవతరించారు శ్రీబాబు. శ్రీకృష్ణుడు దేవకీదేవి గర్భాన పుట్టాడని చెప్పుకుంటాం కానీ ఆయన నిజంగా పుట్టాడా? అంటే లేదనే సమాధానం. చతుర్భుజాలతో, శంఖచక్రాది ఆయుధాలతో ఆయన కనిపించాడు. అంతేకానీ దేవకి ప్రసవ వేదన పడలేదు. అందుకే అన్నమయ్య 'నవ్వుచు దేవకి నందను కనియె' అంటాడు. ఎప్పుడెప్పుడు ధర్మరక్షణకు అవసరమైతే అప్పుడప్పుడు నా మాయను తోడు చేసుకొని నేను అవతరిస్తూ ఉంటానని స్వామి చెప్పారు కదా! అలాగే శ్రీబాబు కూడా ఏ తల్లిదండ్రులను నిమిత్తమాత్రంగా చేసుకొని ఈ పుణ్యభూమిలో అవతరించారో ఎవరికీ తెలియదు.

    శ్రీకృష్ణుడు అవతరించడానికి ఎంతో ముందుగానే ఆకాశవాణి ఆ వార్తను కంసునికి సూచించినట్లుగానే శ్రీబాబు వారికి దర్శనం ఇవ్వడానికి చాలా సంవత్సరాల ముందుగానే శ్రీ కందర్ప పరశురామయ్యగారికి, శ్రీ కలిదిండి నరసింహరాజుగారికి, శ్రీ చల్లా కృష్ణమూర్తిగారికి, కోటిపల్లి మామ్మగారని పిలువబడే శ్రీమతి శేషమాంబగారికి వారివారి ఆరాధ్య దైవాల రూపంలో స్వప్నదర్శనం ఇచ్చి తాము వారి మధ్యకు రాబోతున్నామని తెలియజేశారు.

    దేవకీ వసుదేవులకు అవతరించిన శ్రీకృష్ణుడు తనను పెంచి పెద్దచేసే మహద్భాగ్యం మాత్రం యశోదమ్మకు అనుగ్రహించాడు. అలాగే శ్రీబాబు ముందు కొంతకాలం ఒక కోయ దంపతుల వద్ద పెరిగి, ఆ తరువాత ఉప్పాడలోని సత్యవతమ్మగారికి యశోదమ్మకు అనుగ్రహించిన మహద్భాగ్యాన్నే అనుగ్రహించారు. శ్రీకృష్ణుడు ఒక్కసారి బృందావనాన్ని విడిచి మధురకు వెళ్ళిన తరువాత మళ్ళీ యశోదమ్మ దగ్గరకు తిరిగి రాలేదు. అలాగే ఒక్కసారి ముంజవరపుకొట్టు వెళ్ళిన శ్రీబాబు మళ్ళీ ఉప్పాడకు తిరిగి రాలేదు.

    ఒకనాడు తనకోసం తృణావర్తుడు వస్తున్నాడని తెలిసి యశోదమ్మ ఒడిలో పడుకుని ఉన్న కృష్ణయ్య ఒక్కసారిగా ఆవిడ మోయలేనంత బరువెక్కిపోయాడు. ఇదే లీల శ్రీబాబు శ్రీ చల్లా కృష్ణమూర్తిగారికి చూపించారు. శ్రీబాబు నవయవ్వనంలో చాలా సన్నగా ఉండేవారు.  కృష్ణమూర్తిగారు నడివయసులో భారీ కాయంతో ఉండేవారు. అయితే వారు శ్రీబాబుచే నాన్నగారని పిలిపించుకొన్న శ్రీ కందర్ప పరశురామయ్యగారి అల్లుడు కావడంతో శ్రీబాబుతో బావ బావమరదుల వంటి సాన్నిహిత్యం, చనువు ఉండేది. ఆ చనువుతో ఒకసారి భీమవరంలో ఆయన శ్రీబాబు కుర్చీలో కూర్చొని ఉండగా వచ్చి వారి ఒడిలో కూర్చొని తన బరువునంతా శ్రీబాబుపై వేసి ఉడికించాలని చూశారు. అయితే ఆయన ఎంత ప్రయత్నించినా శ్రీబాబు ముఖంలో చిరునవ్వే కానీ బరువు మోస్తున్న శ్రమ ఏమాత్రం కనపడలేదు. ఇక లాభంలేదని ఆయన లేచి వేరొక కుర్చీలో కూర్చోగానే శ్రీబాబు వెళ్ళి ఆయన ఒడిలో కూర్చున్నారు. 'ఆ! ఈ బక్కపలచని ఆయన ఏం బరువుంటారు లే!' అని భావించిన ఆయనకు పదునాలుగు భువనాలు ఒక్కసారి వచ్చి తన ఒడిలో కూర్చున్నంత తీవ్రమైన బాధ కలిగింది. ఆ బరువు మోయలేక విలవిలలాడారు.

    శ్రీబాబు భీమవరం తాతయ్య(శ్రీ పాలూరి శ్రీరామమూర్తి)గారి ఇంటిలో ఉన్న రోజుల్లో శ్రీ చల్లా కృష్ణమూర్తిగారి కుటుంబం వారి ఎదురింటిలోనే ఉండేవారు. శ్రీకృష్ణుడు ఎలాగైతే అత్తాకోడళ్ళ మూతులకి వెన్నలు పూయడం, నిద్రిస్తున్న తాతల పిలకలను దూడల తోకలకు కట్టి పరిగెత్తించడం వంటి చిలిపి లీలలు చేసేవాడో శ్రీబాబు కుడా వారి కుటుంబాలతో అలాంటి లీలలే చేసేవారు. తాము ఎంతటి మహాత్ములయినా ఆ కుటుంబంలోని సాధారణ వ్యక్తి వలెనే అందరితో కలిసిపోయేవారు. బాలకృష్ణుడు తన నోటిలో బ్రహ్మాండాన్ని అంతటినీ యశోదకు చూపించినట్లుగానే శ్రీబాబు 'అమ్మా' అని పిలిచే పాలూరి సీతమ్మగారికి, శ్రీ లలితానంద సరస్వతీ స్వామిని వారికి దివ్య దర్శనాన్ని అనుగ్రహించారు. ఒకరోజు శ్రీబాబు దేవతార్చన చేసుకుంటున్న సమయంలో గుమ్మం వద్ద కూర్చున్న సీతమ్మగారికి భూమి నుండి ఆకాశం వరకు వ్యాప్తమైన తెల్లని కాంతిపుంజం కనిపించి, అందులో వటపత్రశాయి అయిన బాలకృష్ణుడు, శ్రీబాబు మార్చి మార్చి కనిపించారు. అంతలోనే ఆ దృశ్యం మాయమై ప్రపంచము, పట్టణాలు, మేడలు, బజార్లు, రంగులరాట్నాలు, కొట్లు, ఇళ్ళు, తీర్థాలు, సముద్రాలు, పర్వతాలు కనిపించాయి. బాలకృష్ణుని సంకల్పంతోనే ప్రపంచమంతా పుట్టిందని, శ్రీబాబే బాలకృష్ణుడని ఆమెకు దివ్య స్ఫురణ కలిగింది. అలాగే ఒకసారి కోటప్పకొండలో శ్రీ లలితానంద సరస్వతీ స్వామిని వారికి శ్రీబాబు స్థానంలో తెల్లని వెలుగు గది అంతా వ్యాపించి అందులోనుండి మూడు రంగుల కాంతి పుంజాలు, వాటిలోనుండి త్రిమూర్తులు దర్శనమిచ్చి తిరిగి అంతా శ్రీబాబులోనే లీనమైపోయినట్లు దివ్య అనుభూతి కలిగింది.

    శ్రీకృష్ణుడు అఘాసురుని నోటిలో పడిన, మరొకసారి దావానలంలో చిక్కుకొన్న గోపబాలురను అందరినీ రక్షించినట్లుగానే శ్రీబాబు సుడిగుండంలో చిక్కుకున్న భక్తులను అనేకసార్లు రక్షించారు. తెల్లవారుజాము అనుకొని పొరబడి అర్థరాత్రి వేళ నదిలో స్నానానికి వెళ్ళి వరుణ భటుని చేతిలో చిక్కి వరుణలోకానికి వెళ్ళిపోయిన నందుని, సముద్రంలో తీర్థ స్నానానికి వెళ్ళి పంచజన్యుని నోట చిక్కి యమపురికి చేరిన గురుపుత్రుని శ్రీకృష్ణుడు రక్షించి తిరిగి తీసుకువచ్చినట్లుగానే మరణించి వైకుంఠానికి చేరిన కుమారి ఇందిరాదేవి గారిని, శ్రీ కొప్పెర్ల వెంకటరాజు (నిండ్రకొలను డాక్టరు) గారిని శ్రీబాబు మళ్ళీ పునర్జీవితులను చేశారు. అలాగే ఎందరో భక్తులకు దీర్ఘ రోగాలను నయంచేసి ఆయుష్షును పెంచారు. శ్రీకృష్ణుడు గోపాలురకు రాక్షస బాధను తొలగించినట్లుగానే ఎందరో భక్తులకు గ్రహబాధలు తొలగించారు.

    మన దగ్గర ఏమున్నా పదిమందికీ పంచిపెట్టి అందరమూ కలిసి అనుభవించాలి కానీ ఒక్కరే దాచుకొని తినడం ఆ పరమాత్మకు నచ్చదు. అందుకే బాలకృష్ణునితో పాటు దూడలను కాయడానికి వెళ్ళిన గోపబాలురు అందరూ  స్వామితో కలిసి కూర్చొని వారు వారు తెచ్చుకొన్న పదార్థాలు అందరితో సమానంగా పంచుకొని ఆరగించవలసిందే. గోపికలు పంచిపెట్టకుండా అమ్ముకోవడానికై ఉట్టి మీద దాచిన పెరుగు వెన్నలు బాలకృష్ణుడు దొంగిలించి పిల్లలందరికీ పంచిపెట్టేవాడు. అలాగే శ్రీబాబు కూడా ఆయా గ్రామాలలో వ్యాహ్యాళికి వెళ్ళినప్పుడు, లేదా ఎవరి ఇంటికైనా అతిథులుగా వెళ్ళినప్పుడు ఇంటివారు లోపల లోపల దాచిన తినుబండారాలన్నీ చెప్పి మరీ బయటకు తీయించి అందరికీ పంచిపెట్టేవారు. 

    మునులు యజ్ఞం కోసం ఎంతో ఆర్భాటంగా అన్ని సంబారాలను సమకూర్చుకొన్నా వచ్చినవాడు యజ్ఞ పురుషుడని గ్రహించలేకపోయారు. వారి పత్నులు మాత్రం సత్యాన్ని గ్రహించి పరుగుపరుగున వచ్చి గోప బాలకులతో కూడి ఉన్న బాలకృష్ణునికి తాము వండిన పదార్థాలన్నీ సమర్పించుకుంటే ఆ స్వామి వాటిని ఎంతో ఆప్యాయంగా ఆరగించాడు. అలాగే తన భార్యలు పంచభక్ష్య పరమాన్నాలు సిద్ధం చేసినా కుచేలుడు తెచ్చిన అటుకులను ప్రేమగా ఆరగించాడు. అలాగే శ్రీబాబు ఆర్భాటంగా సంపన్న భక్తులు సమర్పించిన ఫలహారాలను దృష్టిమాత్రంగానే స్వీకరించేవారు కానీ ఆర్తితో ఏ పేదరాలో తెచ్చిన ఇన్ని అటుకులో, బఠాణీలో, తేగలో ప్రేమతో స్వీకరించి, అందరికీ మహాప్రసాదంగా పంచిపెట్టేవారు.

    గోపికలు బాలకృష్ణుని కోసం వీధి గుమ్మంలో ఎదురుచూస్తూ ఉంటే ఆయన దొడ్డిగుమ్మం నుంచి దొంగచాటుగా వచ్చినట్లు ఒకసారి శ్రీబాబు పాందువ్వ గ్రామంలో ఏర్పాటు చేసిన సత్సంగానికి రాజమార్గంలో వెళ్ళకుండా దారిలో ఉన్న ఇళ్ళలో ఒక ఇంటి దొడ్డిలో నుండి మరొక ఇంటి దొడ్డి గుమ్మం లోనికి ఇలా నడుచుకుంటూ వెళ్ళారు.  

    నందుడు మొదలుగా గల గోపాలురు అందరూ ప్రతి సంవత్సరం మంచి వర్షాలు పడి పంటలు బాగా పండాలని ఇంద్రయాగం చేసేవారు. కానీ బాలకృష్ణుడు మనిషి సుఖదుఃఖాలకు అతడు చేసే కర్మమే కారణం కానీ ఇంద్రాది దేవతలు కాదని, ఇంద్రుని పూజించడం కంటే వారి గోవులకు గడ్డిని అందిస్తున్న గోవర్ధన గిరిని పూజించడం ఉత్తమమని బోధించి ఆచరింపజేశాడు. అలాగే శ్రీబాబు బ్రహ్మకపాలంలో పితృదేవతలకు పిండప్రదానం చేయ సంకల్పించిన భీమవరం తాతయ్యగారికి ఆ పిండాలు అక్కడి పండాల బ్రతుకుతెరువు కోసమేనని, అవి పితృదేవతలకు ఖచ్చితంగా చేరతాయని వారుకూడా చెప్పలేరని ఆ పండాలతోనే  నిరూపింపజేసి మాన్పించారు. సాటి మనిషిని మనిషిగా గుర్తించి భక్తితో చేసుకొన్న మానవసేవే మాధవునికి నిజంగా చేరుతుందని బోధించారు. అప్పటివరకు తమ పొలంలో పనిచేసే మహంకాళి అనే హరిజనుని తమ ఇంటి చాయలకు కూడా రానీయని తాతయ్యగారు ఒకనాడు అతనిని ఇంటి లోపలకు పిలిచి తమ ప్రక్కన కూర్చుండబెట్టుకొని భోజనం చేయిస్తే శ్రీబాబు ఎంతగానో సంతోషించారు. అలాగే ఆ కుటుంబం, ఇంకా శ్రీవారిని ఆశ్రయించిన ఎన్నో కుటుంబాలలో అప్పట్లో ఉన్న మడి, ఆచారాలను, అంటరాని తనాన్ని రూపుమాపి సృష్టి అంతా జగన్మాత సంతానమే అని, ఇందులో తారతమ్యాలు చూడరాదని నేర్పించి వారిలో గొప్ప మార్పును తీసుకొచ్చారు.

    అలాగే తమ ఆత్మరక్షణ కోసం శూలినీ దుర్గ ఉపాసన చేసి శక్తులను పొందాలని ప్రయత్నిస్తున్న శ్రీ పరిమి సుబ్రహ్మణ్య భాగవతార్ గారిని వారించి, ఆయన రక్షణ భారం అంతా తామే వహించి వారిని ఆధ్యాత్మిక పథంలో నడిపించారు. చిన్న వయసులోనే ఇంటిని విడిచి హిమాలయాలకు వెళ్ళిపోయిన శ్రీ విఠాల కామయ్య శాస్త్రిగారికి వృద్ధ తాపసి రూపంలో దర్శనమిచ్చి గృహస్థుగా ఉంటూనే తరించవచ్చని, అదే నిరపాయమైన మార్గమని ఉద్బోధించి వెనక్కి పంపించారు. వారు వివాహితులై, సంతానాన్ని పొందిన చాలా సంవత్సరాల తరువాత బాలబాబు రూపంలో మళ్ళీ దర్శనమిచ్చి ఆ రోజు తాము సూచించిన మార్గంలో ప్రయాణం ఎంత చక్కగా సాగుతున్నదో, ఆయన ఆధ్యాత్మిక సాధనలో పురోగతి ఎలా ఉన్నదో అడిగి తెలుసుకొని వారి కుటుంబాన్ని తమ శిష్యులుగా అనుగ్రహించారు.

    ఇంద్ర గర్వభంగం కోసం బాలకృష్ణుడు ఏడు రోజుల పాటు వర్షాన్ని కురవనిచ్చి అయినా తనను ఆశ్రయించిన వారికి ఎట్టి ఇబ్బంది లేకుండా గోవర్ధన గిరినెత్తి ఆ నీడలో వారిని కాపాడాడు కదా! అలాగే ఒకసారి శ్రీబాబు భీమవరం తాతయ్యగారు, ఇంకా మిగిలిన భక్తులతో కాకరపర్రు నుండి ర్యాలీ వెళుతుంటే ఒకప్రక్క తాతయ్యగారు ఆ ఎండకు తట్టుకోలేక వివిలలాడుతున్నారు. మరొకప్రక్క ఆ చుట్టుప్రక్కల పొలాలలోని రైతులు శ్రీబాబును చూసి 'బాబూ! ఈ సంవత్సరం ఇంతవరకూ వర్షాలు లేవు. పంటలు ఎండిపోతున్నాయ్. దయచేసి వర్షం కురిపించండి' అని ఆర్తితో ప్రార్థించారు. శ్రీబాబు 'అలాగే! అలాగే!' అని అభయమిచ్చి, 'తాతయ్యా! ఎండ తట్టుకోలేక పోతున్నావా?' అని ఆకాశం వంక చూశారు. వెంటనే ఆకాశంలో మబ్బులు పట్టి వాతావరణం చల్లబడింది. వీరందరూ తిరిగి కాకరపర్రులో తమ బసకు చేరుకోగానే కుంభవృష్టి మొదలై ఆ చుట్టుప్రక్కల గ్రామాలన్నింటిలో వారంరోజులు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. మరొకసారి శ్రీకాళీవనాశ్రమంలో కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేశారు. ఉన్నట్లుండి ఆకాశం మేఘావృతమై అంతా చీకటిగా మారిపోయింది. భక్తులు భయపడుతుంటే శ్రీబాబు 'ఏం పరవాలేదు. మీరు భోజనాలు కానివ్వండి' అన్నారు. భక్తులు భోజనాలు చేస్తున్నంత సేపూ ఆశ్రమం కంచెకు అవతల కుంభవృష్టి కురిసింది కానీ, భక్తులమీద ఒక్క చుక్కైనా వాన పడలేదు.

    బ్రహ్మదేవుడు గోప బాలురను, ఆవు దూడలను దాచివేస్తే బాలకృష్ణుడు సంవత్సరం పాటు వారందరి రూపాలు ధరించి వ్యవహారం నడిపినట్లు శ్రీబాబు బ్రహ్మరాక్షసి బాధతో మరణదశకు చేరుకున్న కుమారి పావులూరి ఇందిరాదేవి గారిలో ప్రవేశించి వారి రూపంలో ఎంతోకాలం పాటు లెక్చరరుగా ఉద్యోగం చేశారు. రాజమండ్రి పేపరు ఫాక్టరీలో ఉద్యోగానికి వెళ్ళకుండా తమ దర్శనానికి వచ్చిన రెడ్డి కాళీప్రసాదును కాపాడటానికి అతని రూపంలో ఫాక్టరీకి వెళ్ళి ఎన్నాళ్ళుగానో బాగవ్వని యంత్రాన్ని బాగుచేశారు. శ్రీ గుండు నారాయణగారిని, వారి సోదరులు దీక్షితులు గారిని సంవత్సరం పాటు ఆశ్రమంలోనే ఉంచివేసినా, వారి వారి ఉద్యోగ స్థానాలలో ఎవరికీ వీరు లేని లోటే తెలియకుండా చూశారు.

    శ్రీకృష్ణుడు ఒక్కొక్క గోపికకు తాను ఒక్కొక్కడై అందరికీ కనువిందు చేశాడు. అలాగే శ్రీబాబు నరసాపురంలో మోహన్ లెనిన్ గారికి, ఏలూరులో ఆయన భార్య వేణమ్మ గారికి ఒకేసారి దర్శనమిచ్చి వారితో ఇంకా ఆయా గ్రామాలలోని భక్తులతో ఒకేసారి దీపావళి జరుపుకున్నారు. ఇంకోకసారి గుండుగొలనులో శ్రీ దేవి శరన్నవరాత్రులు జరుపుతూనే మొదటి మూడు రోజులు భీమవరంలో తాతయ్యగారి ఇంటిలో కూడా వారితో కలిసి ఉన్నారు. కుమారి ఇందిరాదేవికి తాతయ్యగారి ఇంటిలోనూ, బయటి బాత్రూము దగ్గరా ఒకేసారి దర్శనమిచ్చారు. శ్రీ లలితానంద సరస్వతీ స్వామిని వారికి, ఇందిరాదేవికి, చంపకకు బాలకృష్ణునిగా తమ చుట్టూ వివిధ ఆకృతులలో ఒకేసారి దర్శనమిచ్చారు. 

    దిరుసుమర్రుకు చెందిన కొందరు ఆకతాయి యువకులు తమను అవమానించాలని ఎంతకాలంగానో ఎదురు చూస్తుంటే వారికి భీమవరంలో దర్శనమిచ్చి, వారితోపాటు మిలిటరీ హోటలుకు వెళ్ళి, వారు పెట్టిన పదార్ధాన్ని నిర్వికారంగా భుజించి, వారి ఎదుటే రైలు ఎక్కి వెళ్ళిపోయిన శ్రీబాబు ఆ యువకులు ఈ విషయం చెబుదామని దిరుసుమర్రు పరిగెత్తి కరణంగారు శ్రీ చాగంటి లింగమూర్తి గారి ఇంటి తలుపులు తడితే ఎదురుగా శ్రీబాబు! ఆరోజు ప్రొద్దున నుండీ శ్రీబాబు అక్కడే వారితో సంభాషిస్తూ భగవంతుని సర్వ వ్యాపకత్వం గురించి బోధిస్తున్నారని, కనీసం లఘుశంకకు కూడా లేవలేదని తెలుసుకొని ఆ యువకులకి కనువిప్పు కలిగింది. ఇలా శ్రీబాబు ఒకే సమయంలో వేరువేరు ప్రదేశాలలో భక్తులకు దర్శనమిచ్చిన సందర్భాలు కోకొల్లలు. 

    అర్ఘ్యం ఇవ్వడానికి యమునలో దిగిన అక్రూరునికి శ్రీకృష్ణుడు శేషశాయి అయిన నారాయణుడిగా దర్శనమిచ్చినట్లే నదీ, సముద్ర స్నానాలలో ఎందరో భక్తులకు శ్రీబాబు శేషశాయిగా దివ్య దర్శనాన్ని అనుగ్రహించారు.

    తన భక్తుడైన అర్జునుని కాపాడటానికి శ్రీకృష్ణుడు రథసారధ్యం తానే చేసినట్లు శ్రీబాబు తమ భక్తులను ప్రమాదంనుండి కాపాడటానికి అనేకమార్లు కారు డ్రైవింగ్ తామే చేసి ఆ ప్రమాదాన్ని తమపైకే తీసుకున్నారు. ఇలా శ్రీబాబు లీలలు అనంతం. ఒక్క శ్రీకృష్ణుడనే ఏమిటి, ఏ దేవునితో పోల్చి చూసుకున్నా ఆ దేవునిలో శ్రీబాబు, శ్రీబాబులో ఆ దైవము తప్పక దర్శనమిస్తారు. ఎందుకంటే రూపాలు వేరైనా ఉన్న వస్తువు ఒక్కటే. అది మనం గుర్తించాలనే పరమాత్మ మాటిమాటికీ ఇన్నిన్ని అవతారాలు ఎత్తి మనకోసం ఇంతగా శ్రమపడుతున్నాడు. ఆ విషయాన్ని గుర్తించి, సన్మార్గంలో నడిచి, మన సాధనను పురోగమింపజేసుకొని, ఆ పరమాత్మలో లయం కావటమే వారి శ్రమకు మన వంతుగా తీర్చుకోగలిగిన రుణం.