2, డిసెంబర్ 2016, శుక్రవారం

అవ్యభిచార భక్తి

మనకి మనం గొప్ప భక్తులమని భ్రమపడుతూ ఉంటాం. పూజలూ, వ్రతాలూ, దీక్షలూ ఎంతో శ్రద్ధగా చేస్తాం. కాని అవి పూర్తవగానే "హమ్మయ్య ఓ పనైపోయింది" అనుకొని మళ్ళీ విషయాల వెంట పరుగులు పెడతాం. దీనినే వ్యభిచార భక్తి అంటారు. ఒక వ్యభిచారణియైన స్త్రీ తన భర్తకు ఎన్ని సేవలు చేసినా ఆమె మనసు ఎప్పుడూ "భర్త ఎప్పుడు బయటకు పోతాడా, ఎప్పుడెప్పుడు ప్రియుడ్ని కలుసుకుందామా" అని ఆరాటపడుతూ ఉంటుంది. మన భక్తి కూడా అలాంటిదే.

మరి మనం పనులన్నీ మానుకొని ఎప్పుడూ పూజలూ, భజనలూ చేస్తూ కూర్చోవాలా? అనే ప్రశ్న ఇక్కడ సహజంగా వస్తుంది. అవసరం లేదు. ఒక పతివ్రతయైన స్త్రీ తన భర్త ఊరిలో లేకపోయినా ఇంట్లో పనులన్నీ మామూలుగానే చేసుకుంటుంది. కానీ ఏ పని చేస్తున్నా తన భర్త ఎలా ఉన్నాడో, ఇప్పుడు ఏం చేస్తున్నాడో, సరిగ్గా తిన్నాడో లేదో అని ఆలోచిస్తూనే ఉంటుంది. అలా మనం ఏంచేస్తున్నా నిరంతరం భగవంతుని గూర్చి ఆలోచిస్తూ ఉండటమే అవ్యభిచార భక్తి.

తల్లికి ఎప్పుడూ తన పిల్లల సంక్షేమాన్ని గురించే చింత కదా. అందుకే హిరణ్యక్షుని వంటి ఘోర రాక్షసుని బారినుండి తనను రక్షించడానికి వరాహమూర్తిగా వచ్చిన జగన్నాధుని ఆ తల్లి భూమాత అడిగిన ప్రశ్న: "ప్రారబ్ధాన్ని అనుభవించడానికై జన్మించిన మానవులకు అవ్యభిచార భక్తి ఏ విధంగా అలవడుతుంది స్వామీ?" అని. అందుకు స్వామి ఒక చక్కని పరిష్కారాన్ని సూచించారు. "ఎవరైతే తమ జీవితంలో భగవద్గీతను అభ్యాసం చేస్తారో వారు అవ్యభిచార భక్తిని కలిగి, ముక్తులై, కర్మలు అంటక సుఖంగా జీవిస్తారు" అని. ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం కేవలం గీతాధ్యయనం సరిపోదు. గీతాభ్యాసం కావాలి. అంటే కేవలం థియరీని అర్ధం చేసుకొని, బట్టీకొడితే సరిపోదు. దానిని ప్రాక్టికల్‌గా నిత్యజీవితంలో ఆచరించాలి.