చదివి చదివి చావంగనేటికి
చావులేని చదువు చదువవలయు
చదివి చదివి జనులు చచ్చిరిగదా
విశ్వదాభిరామ వినుర వేమా।।
మనం చదువుకునే ఈ ప్రాపంచిక చదువులన్నీ పొట్టకూటి కోసమో, లేక పేరు ప్రతిష్టలు సంపాదించటానికో మాత్రమే ఉపయోగపడతాయి. చక్కగా చదువుకోవటం అవసరమే. కానీ చదువే జీవిత పరమార్థం కారాదు. ఏది ఎంతవరకో దాని పరిమితి తెలుసుకొని మసలుకోవాలి.
చిన్నప్పుడు చదువుకోవటం, వయసులో ఉండగా సంపాదించడం సహజమే. కానీ మానవులమై పుట్టినందుకు మన జీవిత పరమార్థం ఆత్మజ్ఞానాన్ని సంపాదించి జనన మరణ విషవలయం నుండి విముక్తులమవటం.
ప్రాపంచిక చదువులు ఆ విషయంలో ఏమీ ఉపయోగపడవు. దానికి ఆథ్యాత్మిక విద్య కావాలి. కానీ కొందరు ఎంత వయసు వచ్చినా, చివరికి కాటికి కాలుజాపుకున్నా ఇంకా బిరుదులకోసమో, పేరు చివర తోకలకోసమో అలా అంతు లేకుండా చదువుతూనే ఉంటారు.
ఎంత చదివినా ఏదో ఒకరోజు అందరూ పోవలసిందే. ఆ చావునుంచి ఈ చదువులేవీ కాపాడలేవు. అందుకే ఇక ఈ వేలంవెర్రి వదిలించుకొని చావులేకుండా చేసే ఆథ్యాత్మ విద్య నేర్వమని వేమన యోగి హెచ్చరిస్తున్నాడు.
సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఞ్కరణే