30, మే 2017, మంగళవారం

వైరాగ్యం

మనకు సాధారణంగా ఇష్టమైన వస్తువులు చూస్తే రాగం, అలాగే ఇష్టం లేని వాటిపై ద్వేషం కలుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా కష్టం కలిగినప్పుడో, చూసినప్పుడో, మంచి మాటలు విన్నప్పుడో క్షణికావేశంలో వైరాగ్యం కలుగుతూ ఉంటుంది. దీనినే మన పెద్దలు ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం అన్నారు. ఆయా సందర్భాలు దాటిపోగానే మళ్ళీ మన రాగద్వేషాలు మామూలే.

అయితే మనందరికీ సంతృప్తితో కూడిన వైరాగ్యం కలిగేది ఒక్క ఆహారం విషయంలో మాత్రమే. మనిషికి ఇతర పదార్థాలు ఎన్ని యిచ్చినా ఇంకా కావాలనే కోరుకుంటాడు కానీ కడుపు నిండిన తరువాత ఆహారాన్ని మాత్రం ఇక కోరుకోడు, అది ఎంత ఇష్టమైన పదార్థమైనా సరే.

ఎందుకంటే ఇతర పదార్థాలు ఎన్ని పొందినా అవన్నీ మనకు భిన్నంగానే ఉంటున్నాయి. అదే ఆహారమైతే మనలో ప్రవేశించి మన స్వరూపాన్ని పొందుతోంది. అందుకే ఆ తృప్తి, ఆ వైరాగ్యం. తిన్న ఆహారం తన పని పూర్తి చేసుకుని మళ్లీ మననుంచి భిన్నత్వాన్ని పొందితే కానీ మనకు మళ్లీ దానిమీద కోరిక కలుగదు.

అలాగే ఈ కనిపించే సృష్టి అంతా మన స్వరూపమే, మనకు భిన్నమైనది ఏదీ లేదు - "నీవు చూచునదెల్ల నీవయేయను తత్త్వమసి వాక్యం" మనకు ఆరూఢ జ్ఞానమైనప్పుడు మనకు శాశ్వతమైన సంతృప్తి, అన్నిటి పట్ల వైరాగ్యం కలుగుతాయి. ఆ జ్ఞానాన్ని పొందేవరకు కనీసం మనకంటే భిన్నంగా ఏదీ లేదనే విషయాన్ని మాటిమాటికీ గుర్తు చేసుకుంటూ ఉంటే వైరాగ్యం పొందటం సులభమవుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి