8, ఏప్రిల్ 2024, సోమవారం

క్రోధి


 క్రోధి అంటే క్రోధము కలవాడు. మనందరమూ క్రోధులమే కదా! అసలు క్రోధం ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తే, మనం కావాలని కోరుకున్నది ఏదో దక్కకపోతే వస్తుంది, ఎదుటివారు మనం కోరుకున్న విధంగా ప్రవర్తించకపోతే వస్తుంది. అంటే కోరికకి, కోపానికి చాలా దగ్గర సంబంధం ఉంది. నిజానికి గీతాచార్యుడు ఈ రెండూ ఒకటే అని చెబుతాడు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విధ్యేన మిహ వైరిణం - ఇదే కామం, ఇదే క్రోధం. ఇది రజోగుణం నుండి ఉద్భవిస్తుంది. దీని ఆకలి ఎప్పటికీ తీరదు. ఇది నీతో మహాపాపాలు చేయిస్తుంది. కాబట్టి దీనిని శత్రువుగా తెలుసుకో - అని శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తున్నాడు.


ఇంకొక విషయం మనం గమనిస్తే మనకు బయటివారు, ఎవరో అపరిచితుల కంటే మనకు బాగా దగ్గరైన వారు, మన కుటుంబ సభ్యులపైనే ఎక్కువగా కోపాన్ని చూపిస్తాం. పక్కింటి పిల్లవాడికి సున్నా మార్కులు వచ్చినా మనకేమీ పట్టదు. అదే మన పిల్లవాడికి కొద్దిగా మార్కులు తగ్గినా మనకి పట్టరాని కోపం వస్తుంది. అలాగే ఉద్యోగం విషయంలో, ప్రవర్తన విషయంలో, ఆరోగ్యం విషయంలో ఇలా ప్రతి దానిలోనూ మనవారు ఉన్నతస్థాయిలో ఉండాలని మనం కోరుకుంటాం. ఆ కోరిక తీరనప్పుడు అది కోపంగా పరిణమిస్తుంది.

ఎవరిపైనైనా క్రోధం తెచ్చుకోవడం అంటే వారు చేసిన తప్పుకి మనకి మనం శిక్ష వేసుకోవడమే. ఎందుకంటే క్రోధం, మనని లోలోపలనుండి తినేస్తుంది. దానివలన గుండెల్లో మంట, రక్తపోటు, గుండెజబ్బులు, మానసిక రోగాలు ఇలా అనేకం వస్తాయి తప్ప ఏమీ ఉపయోగం లేదు. అల్పుల కోపం రాతిమీద చెక్కిన గీతలాగా కలకాలం నిలిచి ఉండి పగలాగా మారుతుంది. అదే మహాత్ముల కోపం నీటిమీద గీతలాగా క్షణంలో మాయమవుతుంది. పైగా ఎవరిమీద కోపం తెచ్చుకున్నారో అది వారికి మంచినే చేస్తుంది. ఇలా మహాత్ముల కోపానికి, శాపానికి గురై ఆ కారణంగా శ్రీమన్నారాయణుని దర్శనం, స్పర్శనం పొంది తరించినవారు అనేకులు రామాయణ భాగవతాలలో మనకు కనిపిస్తారు.

అరిషడ్వర్గంలోని మిగిలిన నాలుగు దుర్గుణాలు, ఈ కామక్రోధాల వలన జనించేవే. అయితే గుణం అంటే త్రాడు అనే అర్థం కూడా ఉంది. మన చుట్టూ త్రాడును ఒక దిశలో త్రిప్పితే మనం దానిలో బంధించబడతాం. ఇప్పుడు అదే త్రాడును వ్యతిరేక దిశలో త్రిప్పితే ఆ బంధనం విడిపోతుంది కదా! అలాగే మన మనస్సు ప్రపంచం మీదికి పోయినప్పుడు ఇవే గుణాలు మనను బంధిస్తాయి. అదే మనస్సు భగవంతుని వైపు తిరిగినప్పుడు ఆ గుణాలే మన ముక్తికి కారణమవుతాయి. విషయ కామాన్ని మోక్షకామంగా మార్చుకోగలిగితే అప్పుడు క్రోధం మన ముక్తికి అడ్డు వచ్చే వాసనల మీదకి, వ్యసనాల మీదకి మళ్ళుతుంది. అప్పుడు అది మనకు సాధనకు ఉపయోగపడే మంగళప్రదమైన శ్రీక్రోధం అవుతుంది. అదే మనకు ఈ శ్రీ క్రోధి నామ సంవత్సరం తెలియజేస్తోంది.

అలా క్రోధాన్ని తన అదుపులో పెట్టుకొని ఎవరిపై ఎప్పుడు ఎంత కోపం చూపించాలో తెలిసిన, ఆచరణలో పెట్టిన నేర్పరి కాబట్టే శ్రీరాముడు పురుషోత్తముడు అయ్యాడు. ఇంద్రియాలను కానీ, గుణాలను కానీ బలవంతంగా అణచిపెడితే అవి ఒకానొక బలహీన క్షణంలో అంతకంటే మరిన్ని రెట్లు బలంగా ఎదురుతిరిగి మనను దెబ్బకొడతాయి. అందుకే వాటిని అణచిపెట్టడం కాకుండా ఎప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకు మితంగా వాడుకుంటూ ఉండాలి. భగవద్గీతలో కూడా స్వామి ఇంద్రియ నిగ్రహం కంటే ఇంద్రియ సంయమనాన్నే అలవరచుకోమని బోధిస్తాడు.

కామ క్రోధాది గుణాలు చిన్న చిన్న త్రాళ్ళు అయితే వాటికి మూలమైన సత్వరజస్తమో గుణాలు పెద్ద త్రాళ్ళు. అయితే పైన చెప్పుకున్నట్లు వీటిని అదుపులో ఉంచుకొని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుంటే అవి కూడా సాధనకు ఉపయోగపడతాయి. తమోగుణమే లేకపోతే నిద్ర రాక శరీరానికి అలసట తీరదు. మరి రజోగుణం లేకపోతే ఆ నిద్ర నుండి మెలకువ రాదు, మనం సాధన చేసుకోవాలి, మోక్షాన్ని పొందాలి అనే పట్టుదల రాదు. అలాగే సత్వగుణం సాధనకు ఎంతగానో అవసరమని మనందరికీ తెలిసినదే కదా! అయితే ఈ మూడు గుణాలను వేటి స్థాయిలో వాటిని ఉంచగలిగినప్పుడే అవి మనకు ఉపయోగపడతాయి.

మనస్సు ఈ మూడు గుణాల పెనవేతతో ఏర్పడినది. మూడు పేటల గొలుసు మన మెడలో వేసుకున్నామనుకోండి, అవి మూడు ఒకదానితో ఒకటి అల్లుకొనిపోయి ఏది పైనో ఏది క్రిందో తెలియకుండా పోతాయి. అదే భగవద్గీతలో కృష్ణపరమాత్మ - రజస్తమశ్చాభిభూయః సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తధా - ఒకసారి రజో తమో గుణాలను అణచివేసి సత్వగుణం పైచేయి సాధిస్తుంది. మరొకసారి సత్వ రజో గుణాలపై తమోగుణము, ఇంకొకసారి సత్వ తమో గుణాలపై రజోగుణము పైచేయి సాధిస్తాయి అని చెబుతున్నాడు. ఇలా ముప్పేట గొలుసులాగా ఈ మూడు గుణాలు ఒకదానికొకటి అల్లుకుపోయి మన జీవిత గమనాన్ని వక్రగతులు పట్టిస్తూ ఉంటాయి.
క్రోధి అంటే క్రోధము కలవాడు. మనందరమూ క్రోధులమే కదా! అసలు క్రోధం ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తే, మనం కావాలని కోరుకున్నది ఏదో దక్కకపోతే వస్తుంది, ఎదుటివారు మనం కోరుకున్న విధంగా ప్రవర్తించకపోతే వస్తుంది. అంటే కోరికకి, కోపానికి చాలా దగ్గర సంబంధం ఉంది. నిజానికి గీతాచార్యుడు ఈ రెండూ ఒకటే అని చెబుతాడు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విధ్యేన మిహ వైరిణం - ఇదే కామం, ఇదే క్రోధం. ఇది రజోగుణం నుండి ఉద్భవిస్తుంది. దీని ఆకలి ఎప్పటికీ తీరదు. ఇది నీతో మహాపాపాలు చేయిస్తుంది. కాబట్టి దీనిని శత్రువుగా తెలుసుకో - అని శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తున్నాడు.

ఇంకొక విషయం మనం గమనిస్తే మనకు బయటివారు, ఎవరో అపరిచితుల కంటే మనకు బాగా దగ్గరైన వారు, మన కుటుంబ సభ్యులపైనే ఎక్కువగా కోపాన్ని చూపిస్తాం. పక్కింటి పిల్లవాడికి సున్నా మార్కులు వచ్చినా మనకేమీ పట్టదు. అదే మన పిల్లవాడికి కొద్దిగా మార్కులు తగ్గినా మనకి పట్టరాని కోపం వస్తుంది. అలాగే ఉద్యోగం విషయంలో, ప్రవర్తన విషయంలో, ఆరోగ్యం విషయంలో ఇలా ప్రతి దానిలోనూ మనవారు ఉన్నతస్థాయిలో ఉండాలని మనం కోరుకుంటాం. ఆ కోరిక తీరనప్పుడు అది కోపంగా పరిణమిస్తుంది.

ఎవరిపైనైనా క్రోధం తెచ్చుకోవడం అంటే వారు చేసిన తప్పుకి మనకి మనం శిక్ష వేసుకోవడమే. ఎందుకంటే క్రోధం, మనని లోలోపలనుండి తినేస్తుంది. దానివలన గుండెల్లో మంట, రక్తపోటు, గుండెజబ్బులు, మానసిక రోగాలు ఇలా అనేకం వస్తాయి తప్ప ఏమీ ఉపయోగం లేదు. అల్పుల కోపం రాతిమీద చెక్కిన గీతలాగా కలకాలం నిలిచి ఉండి పగలాగా మారుతుంది. అదే మహాత్ముల కోపం నీటిమీద గీతలాగా క్షణంలో మాయమవుతుంది. పైగా ఎవరిమీద కోపం తెచ్చుకున్నారో అది వారికి మంచినే చేస్తుంది. ఇలా మహాత్ముల కోపానికి, శాపానికి గురై ఆ కారణంగా శ్రీమన్నారాయణుని దర్శనం, స్పర్శనం పొంది తరించినవారు అనేకులు రామాయణ భాగవతాలలో మనకు కనిపిస్తారు.

అరిషడ్వర్గంలోని మిగిలిన నాలుగు దుర్గుణాలు, ఈ కామక్రోధాల వలన జనించేవే. అయితే గుణం అంటే త్రాడు అనే అర్థం కూడా ఉంది. మన చుట్టూ త్రాడును ఒక దిశలో త్రిప్పితే మనం దానిలో బంధించబడతాం. ఇప్పుడు అదే త్రాడును వ్యతిరేక దిశలో త్రిప్పితే ఆ బంధనం విడిపోతుంది కదా! అలాగే మన మనస్సు ప్రపంచం మీదికి పోయినప్పుడు ఇవే గుణాలు మనను బంధిస్తాయి. అదే మనస్సు భగవంతుని వైపు తిరిగినప్పుడు ఆ గుణాలే మన ముక్తికి కారణమవుతాయి. విషయ కామాన్ని మోక్షకామంగా మార్చుకోగలిగితే అప్పుడు క్రోధం మన ముక్తికి అడ్డు వచ్చే వాసనల మీదకి, వ్యసనాల మీదకి మళ్ళుతుంది. అప్పుడు అది మనకు సాధనకు ఉపయోగపడే మంగళప్రదమైన శ్రీక్రోధం అవుతుంది. అదే మనకు ఈ శ్రీ క్రోధి నామ సంవత్సరం తెలియజేస్తోంది.

అలా క్రోధాన్ని తన అదుపులో పెట్టుకొని ఎవరిపై ఎప్పుడు ఎంత కోపం చూపించాలో తెలిసిన, ఆచరణలో పెట్టిన నేర్పరి కాబట్టే శ్రీరాముడు పురుషోత్తముడు అయ్యాడు. ఇంద్రియాలను కానీ, గుణాలను కానీ బలవంతంగా అణచిపెడితే అవి ఒకానొక బలహీన క్షణంలో అంతకంటే మరిన్ని రెట్లు బలంగా ఎదురుతిరిగి మనను దెబ్బకొడతాయి. అందుకే వాటిని అణచిపెట్టడం కాకుండా ఎప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకు మితంగా వాడుకుంటూ ఉండాలి. భగవద్గీతలో కూడా స్వామి ఇంద్రియ నిగ్రహం కంటే ఇంద్రియ సంయమనాన్నే అలవరచుకోమని బోధిస్తాడు.

కామ క్రోధాది గుణాలు చిన్న చిన్న త్రాళ్ళు అయితే వాటికి మూలమైన సత్వరజస్తమో గుణాలు పెద్ద త్రాళ్ళు. అయితే పైన చెప్పుకున్నట్లు వీటిని అదుపులో ఉంచుకొని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుంటే అవి కూడా సాధనకు ఉపయోగపడతాయి. తమోగుణమే లేకపోతే నిద్ర రాక శరీరానికి అలసట తీరదు. మరి రజోగుణం లేకపోతే ఆ నిద్ర నుండి మెలకువ రాదు, మనం సాధన చేసుకోవాలి, మోక్షాన్ని పొందాలి అనే పట్టుదల రాదు. అలాగే సత్వగుణం సాధనకు ఎంతగానో అవసరమని మనందరికీ తెలిసినదే కదా! అయితే ఈ మూడు గుణాలను వేటి స్థాయిలో వాటిని ఉంచగలిగినప్పుడే అవి మనకు ఉపయోగపడతాయి.

మనస్సు ఈ మూడు గుణాల పెనవేతతో ఏర్పడినది. మూడు పేటల గొలుసు మన మెడలో వేసుకున్నామనుకోండి, అవి మూడు ఒకదానితో ఒకటి అల్లుకొనిపోయి ఏది పైనో ఏది క్రిందో తెలియకుండా పోతాయి. అదే భగవద్గీతలో కృష్ణపరమాత్మ - రజస్తమశ్చాభిభూయః సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తధా - ఒకసారి రజో తమో గుణాలను అణచివేసి సత్వగుణం పైచేయి సాధిస్తుంది. మరొకసారి సత్వ రజో గుణాలపై తమోగుణము, ఇంకొకసారి సత్వ తమో గుణాలపై రజోగుణము పైచేయి సాధిస్తాయి అని చెబుతున్నాడు. ఇలా ముప్పేట గొలుసులాగా ఈ మూడు గుణాలు ఒకదానికొకటి అల్లుకుపోయి మన జీవిత గమనాన్ని వక్రగతులు పట్టిస్తూ ఉంటాయి.

అలా కాకుండా తమోగుణాన్ని క్రింది స్థాయిలో, రజోగుణాన్ని మధ్య స్థాయిలో, సత్వగుణాన్ని పై స్థాయిలో నిలిపి ఉంచితే మన సాధన ఒక సక్రమమైన మార్గంలో ముందుకు సాగి మోక్షాన్ని పొందుతాము. మనస్సనే త్రిగుణాల గొలుసులోని ఈ మూడు వరసలని అలా వాటి వాటి స్థానాలలో పట్టి ఉంచాలంటే ఇక్కడ పొందుపరచిన చిత్రంలోని శ్రీ బాబూజీ మహరాజ్ వారి కంఠసీమను అలంకరించిన గొలుసులో వలె నాలుగు అడ్డ పట్టీలు కావాలి. అవే సత్యం, శాంతి, దయ, ప్రేమ. ఎప్పుడైతే మనం ఈ నాలుగు సాధనా పరికరాలను సమకూర్చుకొని వాటితో మూడు గుణాలను సరైన స్థాయిలో నిలుపుకోగలుగుతామో అప్పుడు మన సాధన తప్పక ఫలించి ముక్తిని పొందుతాము.

ఈ శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మనందరికీ అటువంటి సాధన సంపత్తిని, సంయమనాన్ని ప్రసాదించాలని శ్రీగురుదేవులను ప్రార్థిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
అలా కాకుండా తమోగుణాన్ని క్రింది స్థాయిలో, రజోగుణాన్ని మధ్య స్థాయిలో, సత్వగుణాన్ని పై స్థాయిలో నిలిపి ఉంచితే మన సాధన ఒక సక్రమమైన మార్గంలో ముందుకు సాగి మోక్షాన్ని పొందుతాము. మనస్సనే త్రిగుణాల గొలుసులోని ఈ మూడు వరసలని అలా వాటి వాటి స్థానాలలో పట్టి ఉంచాలంటే ఇక్కడ పొందుపరచిన చిత్రంలోని శ్రీ బాబూజీ మహరాజ్ వారి కంఠసీమను అలంకరించిన గొలుసులో వలె నాలుగు అడ్డ పట్టీలు కావాలి. అవే సత్యం, శాంతి, దయ, ప్రేమ. ఎప్పుడైతే మనం ఈ నాలుగు సాధనా పరికరాలను సమకూర్చుకొని వాటితో మూడు గుణాలను సరైన స్థాయిలో నిలుపుకోగలుగుతామో అప్పుడు మన సాధన తప్పక ఫలించి ముక్తిని పొందుతాము.

ఈ శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మనందరికీ అటువంటి సాధన సంపత్తిని, సంయమనాన్ని ప్రసాదించాలని శ్రీగురుదేవులను ప్రార్థిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

3, ఏప్రిల్ 2024, బుధవారం

భవరోగ వైద్యం

    గురుదేవులు అంటే భవరోగ వైద్యులు అని మనందరికీ తెలిసిందే కదా! భవం అంటే పుట్టుక. అంటే ఈ సంసారచక్రంలో మళ్ళీ మళ్ళీ పుడుతూ చస్తూ ఉండటమే భవరోగం. ఈ రోగానికి మూలకారణం అజ్ఞానం. అలాగే కామక్రోధాది ఆరు దుర్గుణాలు, అహంకార మమకారాలు ఈ రోగ లక్షణాలు. శారీరక రోగం వచ్చినవాడు తాను మాత్రమే బాధపడితే, ఈ భవరోగం వలన దుర్గుణాలు ప్రేరేపించినవాడు తన చుట్టూ ఉన్నవారందరినీ బాధపెడతాడు.

 సాధారణంగా రోగం వచ్చినవాడు తనకు తెలిసిన మందులు వాడటమో, లేదా ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పినవో, ఎక్కడైనా చదివినవో మందులు వాడటమో చేస్తాడు. అప్పటికీ రోగం తగ్గకపోతే వైద్యుని దగ్గరకు వెళతాడు. ఆ రోగం తీవ్రత తక్కువగా ఉండి, రోగి తాను చెప్పిన పథ్యాన్ని పాటిస్తూ మందులు సరిగా వేసుకుంటాడని నమ్మకం కలిగితే వైద్యుడు అతనికి మందులిచ్చి, తగిన జాగ్రత్తలు చెప్పి ఇంటికి పంపేస్తాడు. అదే రోగం కొంచెం ఎక్కువగా ఉండో, లేక రోగి సరిగ్గా సూచనలు పాటించడనే అనుమానం కలిగితేనో అతనిని వైద్యశాలలోనే ఒక గదిలో ఉంచి తామే పర్యవేక్షిస్తూ రోగం తగ్గేంతవరకు వైద్యం చేస్తారు. ఇంకా రోగం బాగా ముదిరిపోయి నిరంతర పర్యవేక్షణ అవసరమైన రోగినయితే ఐసియూలో పెట్టి వైద్యం చెయ్యవలసి వస్తుంది. ఇలా రోగ తీవ్రతను బట్టి, రోగి మానసిక పరిపక్వతను బట్టి వైద్యం చేసే విధానం మారుతుంది కానీ ఆ వైద్యునికి ఏ ఒక్క రోగి పట్ల ప్రత్యేక అభిమానం కానీ, మరొక రోగి పట్ల ద్వేషం కానీ ఉండవు.

    అలాగే మరి భవరోగ వైద్యులయిన గురుదేవులను ఆశ్రయించిన శిష్యులలో కుడా రోగ తీవ్రత, మానసిక పరిపక్వత, రోగం తగ్గించుకోవాలనే పట్టుదల వివిధ స్థాయిలలో ఉంటుంది. అసలు చాలామందికి తమకు ఒక రోగం ఉన్నదనే తెలియకపోవచ్చు. కానీ గురువుకు శిష్యునికి ఉండే సంబంధం ఎన్నో జన్మలనుంచి పెనవేసుకొని ఉంటుంది. శిష్యునికి తెలిసినా, తెలియకపోయినా, సాధన సరిగా చేసినా, చేయకపోయినా గురువు మాత్రం శిష్యుని విడిచిపెట్టడు. అయితే తన భవరోగాన్ని గుర్తించి, గురు ముఖస్తుగా వచ్చిన ఏ చిన్న వాక్యాన్ని అయినా గురు ఆజ్ఞగా భావించి, శిరసావహించి చక్కగా సాధన చేసుకొనే ఉత్తమ శిష్యుడు గురువుకు భౌతికంగా ఎంతో దూరంలో ఉన్నా తరిస్తాడు. 

    కానీ కామక్రోధాది గుణాలు తరచుగా విజృంభిస్తూ, గురుసన్నిధి ఒక్క క్షణం దూరమైనా మళ్ళీ మాయలో పడిపోయి తాను దిగజారిపోతూ, ఇతరులకు కూడా కష్టాన్ని కలిగించే స్థితిలో ఉన్న శిష్యుని మరి గురువు నిరంతరం తన సన్నిధిలో ఉంచుకొని పర్యవేక్షించవలసిందే కదా. అయితే మానసిక పరిపక్వత లేని ఆ శిష్యుడు తనను గురువు నిరంతరం సన్నిధిలో ఉంచుకోవడాన్ని తన గొప్పగా భావించి, అహంకారాన్ని పెంచుకొని, ఇతర శిష్యుల మీద పెత్తనం చలాయించాలని చూసే సందర్భాలు కూడా ఉంటాయి. అయితే గురుదేవులు మాత్రం ఆ శిష్యుని ఎలాగైనా ఉద్ధరించి తరింపజేయాలనే చూస్తారు. 'తనకు అత్యంత సమీపంలో ఉంటేనే ఇంతగా మాయకు వశుడైపోతున్నాడే, ఇక తనకు దూరమైతే ఇంకెంత దిగజారుతాడో' అని బాధ పడతారు.

    అయితే ఈ విషయాన్ని గుర్తించని ఇతర శిష్యులు గురువును అపార్థం చేసుకుంటారు. ఆ శిష్యుడు ఎన్ని దుష్కార్యాలు చేస్తున్నా గురువు అతనిని దండించడం లేదని అలుకబూనుతారు. భవరోగ వైద్యులయిన గురుదేవుల వద్ద శిక్షణే కానీ శిక్ష ఉండదు. పద్మం వికసించినప్పుడు తుమ్మెద ఎంతో దూరంనుంచి వచ్చి ఆ మకరందాన్ని గ్రోలి ఆ మాధుర్యాన్ని చక్కగా ఆస్వాదించి ఎగిరిపోతుంది. అదే పద్మం మొదలులో నివశించే కప్పకి ఆ మకరందంలోని మాధుర్యం తెలియకపోగా, తాను బురదలో పొర్లుతూ ఆ బురదనే పద్మానికి పూయాలని చూస్తుంది. అయితే అది పద్మానికి అంటుకోదు కదా! కానీ ఈ తుమ్మెద ఆ కప్పమీద కోపం తెచ్చుకొని దానికి ఆశ్రయం ఇచ్చినందుకు పద్మం వద్దకు రాకుండా దూరమైపోతే ఎవరికి నష్టం?

    అలాగే గురుదేవులు ఎందుకు ఒక శిష్యుని తమకు దగ్గరగా ఉంచుకుంటున్నారో తెలుసుకోకుండా, ఆ శిష్యుని వలన తనకు ఏదో బాధ కలిగిందని, ఆ శిష్యుని గురువులు తప్పక దండించి తీరాలని బలంగా విశ్వసించి, అది జరగనందుకు తాను గురువుకు దూరమైపోతే నష్టం ఎవరికి? అలా కాక, తనకు కలిగిన కష్టాన్ని గురుదేవుల సమక్షంలో విన్నవించుకొని, ఆ శిష్యునిపై తీసుకోవలసిన చర్యను గురుదేవులకే వదిలిపెట్టి, నిర్వికారంగా తన వంతు సేవ తాను చేసుకుంటే తనకే మంచిది. ఏ శిష్యులకు ఎలా శిక్షణ ఇవ్వాలో గురుదేవులకు మించి ఎవరికి తెలుస్తుంది?

  ఒకసారి శ్రీ బాబూజీ మహరాజ్ వారు శిష్యులందరికీ ప్రసాదం పెట్టిన తరువాత వారందరూ అక్కడే ఉన్న వాష్‌బేసిన్‌లో చేతులు కడుక్కుంటున్నారు. శ్రీ లలితానంద సరస్వతీ స్వామిని వారి వంతు వచ్చేసరికి శ్రీ బాబూజీ మహరాజ్ వారు తీవ్ర స్వరంలో "ఈ వాష్‌బేసిన్‌ నాకోసం కానీ అందరూ ఉపయోగించడానికి కాదు. బయటకు వెళ్ళి అక్కడ ఉన్న వాష్‌బేసిన్‌లో చేతులు కడుక్కో" అని హెచ్చరించారు. అక్కడున్న శిష్యులు అందరూ విస్తుపోయారు. ఆమె బయటకు వెళ్ళగానే శ్రీ గురుదేవులు "చూశారా? ఆమె ముఖంలో కానీ, మనస్సులో కానీ ఇంతమంది ముందు నన్ను అవమానిస్తున్నారు అని గానీ, లేదా వారందరికీ లేని అభ్యంతరం నా విషయంలోనే ఎందుకు అనే భావం కానీ ఏ మాత్రం కలుగలేదు. ఆమె అంతటి స్థితప్రజ్ఞ స్థితిని సాధించారు. కనుకనే నేను అలా అనగలిగాను. అదే మీలో ఎవరినైనా నేను అలా అంటే మీరు మళ్ళీ రెండవరోజు నా దగ్గరికి వస్తారా? శిష్యుని మానసిక పరిపక్వతను బట్టే గురుదేవుల ప్రవర్తన ఉంటుంది" అని వివరించారు.

    కాబట్టి ఏ శిష్యునికి ఎలాంటి శిక్షణను ఇవ్వాలో, ఎవరి తప్పులను ఎలా సరిదిద్దాలో గురుదేవులకే వదిలిపెట్టి సర్వ సమర్పణ భావంతో వారిని సేవించుకొనడమే శిష్యుని కర్తవ్యం. ఏ రోగికి ఎలాంటి వైద్యం చేయాలో వైద్యునికి ఇంకొక రోగి చెప్పలేడు కదా!

11, ఫిబ్రవరి 2024, ఆదివారం

అనాయాస మరణం

 అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం

దేహాన్తే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే||

    ప్రతి మానవుడు తప్పకుండా కోరుకోవలసిన కోరిక ఇది. బ్రతికినన్నాళ్ళు ఎవరి మీదా ఆధారపడకుండా బ్రతకడం, మరణ సమయంలో ఎక్కువగా కష్టపడకుండా సునాయాసంగా మరణించడం, ఆ తరువాత పరమేశ్వరునిలో సాయుజ్యం చెందడం, ఇంతకన్నా కోరుకోదగినది ఏమి ఉంటుంది?

            జన్మకు వచ్చిన ప్రతి జీవికి ఆరు అవస్థలు ఉంటాయి. వీటినే షడ్భావ వికారాలు అంటారు. అవి - అస్తి, జాయతే, వర్ధతే, పరిణమతే, అపక్షీయతే, నశ్యతే. ముందుగా తల్లి గర్భంలో ఉండటం - అస్తి. ఆ తరువాత జన్మించడం - జాయతే. ఇక అలా జన్మించిన వ్యక్తి ముందు పెరుగుతాడు(వర్ధతే), ఆ తరువాత మధ్య వయస్సులో శరీరం అనేక మార్పులు చెందుతుంది(పరిణమతే). ఆ వయసు దాటిన తరువాత మెల్లగా శరీరంలోని పటుత్వం, అలాగే చూపు, వినికిడి, నడక ఇలా ఒక్కొక్క అవయవం క్షీణించడం మొదలుపెడుతుంది(అపక్షీయతే). చివరికి ఈ శరీరం పడిపోతుంది(నశ్యతే).

        పుట్టడం, పెరగడం, మార్పు చెందడం ఎంత సహజమో మరణించడం కూడా అంతే సహజమని మనందరికీ తెలిసినదే కదా! అయితే గర్భిణీ అయిన ప్రతి స్త్రీ తనకు సహజ ప్రసవం జరగాలని కోరుకుంటుంది కదా. కొంతకాలం క్రితం వరకు డబ్బులకోసం అవసరం లేకపోయినా ఆపరేషన్లు చేసిన డాక్టర్లు కూడా ఇప్పుడు సహజ ప్రసవమే తల్లికి, బిడ్డకు మంచిదని, తల్లిపాలే బిడ్డకు అత్యుత్తమమని, అలాగే మనందరం సహజంగా పండిన ఆహారాన్నే తీసుకోవాలని ఇలా చెబుతున్నారు కదా.

        ఇలా పుట్టుకనుంచి జీవితంలో ప్రతి విషయంలో సహజత్వాన్ని ఎలా కోరుకుంటున్నామో మరణం విషయంలో కూడా అలాగే సహజ మరణాన్ని కోరుకోవాలి. వెనకటి కంటే వైద్య సదుపాయాలు బాగా పెరిగిపోయిన ఈ రోజుల్లో మృత్యువు అంచులలో ఉన్నవారిని, ఇంకా మరణించిన వారిని కూడా ఏదో ఒక పద్ధతిలో బ్రతికించాలని, వారి ఆయుష్షును పొడిగించాలనే ఆరాటం ఎక్కువ అయిపోయింది. ఇంకా జీవితం సరిగ్గా అనుభవించని యువకులు, లేదా బాధ్యతలు తీరని మధ్య వయస్కుల విషయంలో అనుకోని ఆపద, లేదా వ్యాధి ఎదురై మరణించే పరిస్థితి వచ్చినపుడు ఇలా ఆరాట పడటాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.

        కానీ నిండు జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించిన పెద్దవారు తాము కట్టకొన్న ఇంటిలో తన వాళ్ళందరూ చుట్టూ ఉండగా, ఆనందంగా, సహజంగా దేహాన్ని వదిలిపెట్టాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా! ఇక దేహాన్ని వదలివేయడం తథ్యం అన్న పరిస్థితులలో కూడా వారిని ఐసియూలో పెట్టి వంటినిండా సూదులు, గొట్టాలు గుచ్చి చుట్టూ తనవాళ్ళు అంటూ ఎవరూ కనబడని నిస్సహాయ స్థితిలో మరణించేలా చేయడం ఎంతవరకు సమంజసం? మనం ప్రేమించేవాళ్ళు ఎల్లకాలం మనతోనే ఉండాలని ప్రతివారు కోరుకుంటారు. అయితే దానికి కూడా పరిమితులు ఉంటాయి కదా. వయసుకు వచ్చిన పిల్లలు మనను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవడం ఎంత సహజమో, వయసు అయిపోయిన పెద్దవారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం కూడా అంతే సహజం. 

        అయితే ఎవరైనా పెద్దవారు ఇంట్లో సహజంగా మరణించారంటే ఈ చుట్టూ ఉన్న సమాజం చూస్తూ ఊరుకోదు. ఒక్కొక్కరూ పలకరింపుగా వచ్చి ఆ పిల్లలను "అయ్యో పెద్ద డాక్టరుకి చూపించక పోయారా?" "ఎకో టెస్టు చేయించాల్సింది." "లేదు, ట్రెడ్మిల్ టెస్టు చేస్తే కానీ ఇలాంటివి బయటపడవు" అని ఇలా సలహాలు ఇస్తున్నట్లుగా సూటిపోటి మాటలతో తామేదో లోటు చేశామనే అపరాధ భావనను ఆ పిల్లలలో కలిగిస్తారు. ఈ పోరు తట్టుకోలేక, ఇటువంటి పరిస్థితిని చూసినవారు రేపు తమ ఇంటిలో పెద్దవారిని ఏ చిన్న రోగం వచ్చినా నానా రకాల వైద్యాలు చేయించి చివరికి ఏ ఐసీయూలోనో మరణించే పరిస్థితిని కల్పిస్తారు.

    మరణం ఏ విధంగా సంభవిస్తుంది అనేది మన చేతిలో లేదు. ఈ శరీరం ప్రారబ్ధం అనుభవించడానికి వచ్చినది. అది తీరగానే పడిపోతుంది. కొంతమందికి ముందుగానే ఆ ప్రారబ్ధం తీరిపోయి ఏ నిద్రలోనో అనాయాస మరణం సంభవించవచ్చు. మరికొంత మందికి చివరివరకూ తీరక విపరీతమైన మరణవేదన అనుభవించవలసి రావచ్చు. ఏదైనా ఈశ్వర సంకల్పమే. అయితే పైన చెప్పుకున్నట్లు ఆ మరణం సహజంగా తన ఇంటిలో తన వారి మధ్య జరగాలని ప్రతి వ్యక్తి కోరుకోవడంలో తప్పు లేదు కదా! 

         అయితే తాను మరణించిన తరువాత తన పిల్లలు ఇలా సూటిపోటి మాటలకు గురై ఏదో లోటు చేశామనే అపరాధ భావనకు లోను కాకుండా తాను తృప్తిగానే జీవితాన్ని ముగించానని వారు కూడా సంతోషపడేలా చేయడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. నిజంగా మరణ సమయం ఆసన్నమయినపుడు తాను తెలివిలో ఉంటాడో, అపస్మారక స్థితిలో ఉంటాడో తెలియదు కదా. అందువలన వారు ఎటువంటి మరణాన్ని కోరుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకొని, తన సంతానానికి, స్నేహితులకి ఒకటికి రెండు మూడుసార్లు తెలియజెబితే, తాను ఏ స్థితిలో ఉన్నా తృప్తిగా తన ఇంటిలోనే, తనవారి మధ్యలో సహజంగా శరీరాన్ని వదిలి శివ సాయుజ్యాన్ని పొందుతాడు.